CM Jagan to Hold Review Meeting

ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సిఎం జగన్...

  మరో నాలుగు రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కావలసి ఉంటుంది. రివర్స్ టెండరింగ్ కారణంగా ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి అదే సమయంలో భారీ వర్షాలు వరదల వల్ల కూడా పనులు జరిగే అవకాశం కనిపించలేదు. ఈ కాలంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, హైడల్ ప్రాజెక్టుకు టెండర్ లను ఖరారు చేసింది. నవంబరు ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని కూడా ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలుమార్లు ప్రకటించారు. ఈ పూర్వ రంగంలో ముఖ్యమంత్రి జగన్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరాలు ఇతర ప్రాజెక్టులపై సమీక్షలో చర్చ జరిగింది. పోలవరం డిపిఆర్-2 ఆమోదం కేంద్రం నుంచి రావలసిన మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలపై కూడా జగన్ చర్చించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, గోదావరి నదులను అనుసంధానం చేయడం, గోదావరి జలాలను రాయలసీమకు తరలించే ప్రణాళికల పైన చర్చ జరిగింది. అయితే జూన్ నెల  22 న గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇంజనీరింగ్ పనులపై నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కమిటీ ఏర్పాటైన తర్వాత తొలి సారి భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి సాగు నీటి ప్రాజెక్టుల అంచనాలపై అధ్యయనం చేయాలని ఆ కమిటీలో ఆదేశించారు. జలవనరులతో పాటు రహదారులు, భవనాల శాఖ, మున్సిపల్ సీఆర్డీయే శాఖలోనే కాంట్రాక్టు పైనా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టుల వారీగా పూర్తి వివరాలతో వచ్చే సమావేశానికి రావాలని నిపుణుల కమిటీకి అప్పుడు జగన్ స్పష్టం చేశారు.

High Court hrearing on tsrtc strike today

హైకోర్ట్ ఆదేశాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆర్టీసి కార్మికులు...

ప్రభుత్వం పట్టు వీడటం లేదు, జేఏసీ నేతలు మెట్టు దిగడం లేదు, పంతం పట్టుదల మధ్య కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 24 వ రోజు కొనసాగుతోంది. సమ్మెపై హైకోర్ట్ విచారణ చేపట్టనుంది,కార్మిక సంఘాలతో జరిపిన చర్చల సారాంశంపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో హై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతోంది, కార్మికులు పట్టు వీడాలని ఆదేశించబోతుందా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. హై కోర్టు తీర్పు ఏంటి, చర్చలు ముందుకు సాగుతాయా బస్సులు రోడ్డెక్కుతాయా అనేది కాసేపట్లో తెలిసే అవకాశముంది. చర్చలకు పిలిచినా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల విషయంలో మెట్టు దిగకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలపై సర్కారు దృష్టి పెట్టింది.  ఈ నెల 26 న జరిగిన చర్చల సారాంశాన్ని కోర్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం తెలపనుంది. సమ్మె ఇదే తరహాలో కొనసాగితే ప్రభుత్వం ఏం చెయ్యాలి, ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచే క్రమంలో ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ సంక్షోభంపై ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కీలక సమీక్ష నిర్వహించారు. నేడు కోర్టుకు ఇవ్వాల్సిన నివేదికను పరిశీలించారు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీలో అద్దె బస్సును పెంచేందుకు మరిన్ని నోటిఫికేషన్ లు ఇవ్వడంతో పాటు ప్రైవేటు రూట్లలో సర్వే చేయాలని నిర్ణయించారు. దీనిపై సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు, ప్రైవేట్ రూట్లలో త్వరలో సర్వే చేయాలని, ప్రైవేట్ రూట్లు, బస్సుల విధివిధానాలపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇరవై నాలుగు రోజులుగా ఆందోళన బాట పట్టిన కార్మికులు రోజుకో తరహాలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కలెక్టరేట్ల ముట్టడికి ఆర్టీసి జెఎసి పిలుపు నిచ్చింది,  కోర్టు విచారణ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె దారి ఎటు అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. తమ డిమాండ్ లు నెరవేరే వరకు సమ్మె కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది, ఈరోజు కలెక్టరేట్ల ముట్టడికి కాంగ్రెస్ సైతం మద్దతు ప్రకటించింది. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కేడర్ కు పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్.

Nalgonda ATM chori

నల్లగొండ జిల్లాలోని స్థానిక ఎస్.బీ.ఐ లో చోరీ యత్నం...

నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది, స్థానిక ఎస్.బీ.ఐ లోకి చొరబడ్డ దుండగులు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు వెనక భాగానికి కన్నం వేసిన దొంగలు గ్రిల్స్ ని తొలగించి లోపలికి వెళ్లారు. నగదు ఉంచిన స్ట్రాంగ్ రూమ్ లోకి చొరబడి నగదును అపహరించారు. ఉదయం బ్యాంక్ ని తెరిచిన ఉద్యోగులు గ్రిల్స్ కట్ చేసి ఉండటం, లోపలి నగదు ఎత్తుకెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసు అధికారులు మరియు బ్యాంకు అధికారులు కలిసి ఇది ప్రొఫెషనల్ దొంగ కాదు కేవలం స్థానికంగా ఉండే దొంగ మాత్రమే ఇలా దొంగతనం చేసే ప్రయత్నం చేశాడు అనేటువంటి ఒక క్లారిటీకి వచ్చారు. అయితే బ్యాంక్ లో ఏటువంటి నగదు పోలేదని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ఈ దొంగతనానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ బ్యాంకుకు రాత్రి వాచ్ మేన్ కూడా లేడు. సాధారణంగా బ్యాంకుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆలారం సిస్టం ఉంటుంది, ఈ బ్యాంకుకు అది కూడా లేదు. గ్రిల్ ని తొలగించి లోపలికి వెళ్ళిన దొంగ అద్దాలను పగులగొట్టి గ్రిల్ కి ఉన్నటువంటి తాళాన్ని కూడా బయటకు విసిరేశాడు.సిసి టివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎటువంటి మాస్క్ లేకుండా ఒక్క దొంగ మాత్రమే లోపలికి ప్రవేశించాడని చెప్తున్నారు. నల్గొండలో మెయిన్ బ్రాంచ్ గా ఉన్నటువంటి ఈ ఎస్.బి.ఐ లో దొంగతనం జరిగింది అనటంతో బ్యాంకు కష్టమర్లలో గుబులు పుట్టుకుంది. అయితే ఎటువంటి నగదు పోలేదని అధికారులు వెల్లడించిన తరువాత కష్టమర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆధారాలను సేకరించిన పోలీసులు దొంగను పట్టుకోవాటానికి దర్యాప్తు ముమ్మరం చేశారు.  

sadar festival celebrations in nursing

నార్సింగిలో ఘనంగా జరిగిన యాదవుల సదర్ ఉత్సవాలు...

జంట నగరాల్లో నివసించే యాదవులు సంస్కృతి వేడుకగా నిర్వహించే సదర్ ఉత్సవాలు హైదరాబాద్ నార్సింగ్ లో ఘనంగా జరిగాయి. నార్సింగ్ మాజీ సర్పంచ్ వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ వేడుకల్లో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. యాదవులతో స్థానికులు భారీ దున్నపోతులను సుందరంగా అలంకరించి ఈ సదర్ ఉత్సవాలకు తీసుకొచ్చారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ ఈ సదర్ వేడుకల్లో పాల్గొని ఆనందించారు. దున్నపోతుల్ని గ్రామంలో తిప్పుతూ వాటితో విన్యాసాలు చేయించారు. వెంకటేశ్ యాదవ్ తండ్రి హయాం నుంచి నార్సింగి లో సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అతిపెద్ద పశువుల సంత కూడా ఇక్కడే ఉండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని భారీ దున్నపోతులని ఇక్కడికి తీసుకొస్తారు. దీంతో ఏటా దీపావళి తర్వాత సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్న యాదవ సోదరులు ఈసారి ఉత్సవాలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దున్నపోతుల తిండి దగ్గర నుంచి వాటికిచ్చే శిక్షణ వరకు అవి చేసే సాహసాలు ఉత్సవాల్లో ప్రదర్శనకు తీసుకొస్తారు. ఈసారి నార్సింగి లో పంజాబ్ కు చెందిన దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ దున్నపోతుతో యాదవ సోదరులు విన్యాసాలు చేస్తుంటే మరోవైపు వాటిపై ఎక్కిన చిన్నారులు డీజే మ్యూజిక్ కు స్టెప్పులేశారు. దీపావళి సందర్భంగా యాదవులు నగరం లోని పలుచోట్ల సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రం లోని ట్రైనింగ్ ఇచ్చిన దున్నపోతులతో పాటు పక్క రాష్ట్రాల నుంచి తెస్తున్న భారీ దున్నలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాచిగూడ చెప్పల్ బజార్ లో బీజేవైఎం నాయకుడు సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనం ఆకట్టుకుంది. తమ వృత్తిలో భాగమైన దున్నపోతులతో సాహస కార్యక్రమాలు చేపట్టారు. ఈ సదర్ వేడుకలకు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. సదర్ ఉత్సవాల్లో దున్నపోతులని అందంగా అలంకరించిన యజమానులకు బహుమతులను అందజేశారు. రాష్ట్రంలో పాడి పంటలు బాగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఎల్బీనగర్ నియోజకవర్గమైన కొత్తపేటలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి, యాదవుల ఐక్యతకు నిదర్శనంగా చెప్పుకునే ఈ వేడుకల్ని యాదవ సంఘం నాయకులు పండగలా జరుపుకున్నారు. ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనున్న సదరులో సర్తాజ్ అనే దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది, హర్యానాకు చెందిన ప్రముఖ రైతు వీరేంద్ర సింగ్ కు చెందిన సర్తాజ్ ప్రపంచంలోనే ఎంతో డిమాండ్ ఉన్న ముర్రా జాతికి చెందిన దున్న. ఇరవై ఏడు కోట్ల ఖరీదైన ఈ దున్నను నగరంలో సదర్ వేడుకల్లో ప్రదర్శించేందుకు అఖిల భారత యాదవ మహాసభ ఏర్పాట్లు చేస్తోంది.

reason behind vallabhaneni vamsi quitting politics

వల్లభనేని వంశీపై కుట్ర చేసిన అజ్ఞాత శత్రువు దేవినేని ఉమానేనా?

  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీకి గుడ్ బై చెప్తారు అనుకుంటే.. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇటీవల వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ని కలిసిన వంశీ.. మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మార్పు అంశంపై దీపావళి తరువాత స్పష్టత ఇస్తానన్నారు. దీంతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరతారని భావించారంతా. కానీ అనూహ్యంగా రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నట్టుగా వంశీ ప్రకటించారు.  టీడీపీ అధినేత చంద్రబాబుకి వంశీ తన రాజీనామా లేఖను పంపారు. రాజకీయ కుట్రలు, దాడుల నుంచి తన అనుచరులని కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని వంశీ తెలిపారు. అయితే వంశీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కేవలం అధికార పార్టీ నేత రాజకీయ వేధింపులే కాదు.. సొంత పార్టీ నేత కుట్రలు కూడా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామా ప్రకటన అనంతరం వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యక్ష శత్రువుతోనైనా పోరాడొచ్చు కానీ అజ్ఞాత శత్రువుతో పోరాడలేమన్నారు. దీంతో ఇప్పుడు ఆ అజ్ఞాత శత్రువు ఎవరా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ కార్యకర్తలైతే ఆ అజ్ఞాత శత్రువు మాజీ మంత్రి దేవినేని ఉమా అని భావిస్తున్నారు. కృష్ణ జిల్లాలో పార్టీ పరంగా చంద్రబాబు.. దేవినేని ఉమాకి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇదే చంద్రబాబు చేస్తున్న పెద్ద తప్పని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అసలు దేవినేని తీరు వల్లే జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందని కార్యకర్తలు మండిపడుతున్నారు. కొడాలి నాని వంటి వారు పార్టీని వీడటానికి కూడా ఉమానే కారణమని అంటున్నారు. అంతెందుకు ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని అసంతృప్తి వ్యక్తం చేయడానికి కూడా ఉమా తీరే కారణమని వార్తలొచ్చాయి. కృష్ణా టీడీపీ అంటే ఉమా, ఉమా అంటే కృష్ణా టీడీపీ.. అన్నట్టుగా ఉమా ఫీలవుతారని.. జిల్లాలో తాను చెప్పిందే జరగాలని చూస్తారని అంటున్నారు. జిల్లా టీడీపీ నేతలంతా ఆయన చెప్పినట్టే వినాలని, వినకపోతే వారిని ఎదగనివ్వకుండా కుట్రలు చేస్తారని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. వంశీ విషయంలో కూడా ఆ అజ్ఞాత శత్రువు ఉమానే అయ్యుంటారని అంటున్నారు. ఉమా తీరు వల్ల జిల్లా టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అధిష్టానం కూడా ఉమా మాటకే ప్రాధాన్యత ఇస్తూ మిగతా వారిని పట్టించుకోకపోవడంతో.. ఏం చేయాలో తెలియక వారు పార్టీని వీడుతున్నారని అంటున్నారు. ఉమా ఇప్పటికైనా తన తీరు మార్చుకొని, అందర్నీ కలుపుకొని పోతూ జిల్లాలో పార్టీకి భవిష్యత్తు ఉండేలా చూడాలని హితవు పలుకుతున్నారు. ఒకవేళ ఉమా తన తీరు మార్చుకోకపోతే.. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా కళ్లుతెరిచి.. ఉమా చెప్పినదానికల్లా తల ఊపకుండా, అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకొని.. ఉమాని, పార్టీని గాడిలో పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.

Yarlagadda Venkata Rao Reveals About Vallabhaneni Vamsi

వంశీని వైసిపి లోకి తీసుకోవద్దు : యార్లగడ్డ వెంకట్రావ్

కృష్ణాజిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీ వైసీపీ లో చేరుతారు అంటూ వస్తున్న వార్తలు స్థానిక వైసీపీ నాయకుల్లో తీవ్ర అలజడికి దారితీశాయి. బిజెపి నేత సుజనా చౌదరిని గుంటూరులో కలిసిన వల్లభనేని వంశీ ఆ వెంటనే తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యారు. నాటి పరిణామాలకు కొనసాగింపుగా వంశీ తెలుగు దేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబు లేఖ రాయడం, ఆ లేఖకి వంశీ సమాధానం ఇవ్వడం వంటి అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాను రాజకీయాల నుంచి వైదొలగనున్నట్టు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే గన్నవరం వైసీపీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అప్రమత్తమయ్యారు, వంశీ కారణంగా టిడిపి హయాంలో వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని ఇప్పుడు అతనే పార్టీ లోకి వస్తే తమ పరిస్థితి ఏంటని యార్లగడ్డ ఆందోళన చెందుతున్నారు. వంశీని వైసిపి లోకి తీసుకోవద్దని ఆయన జగన్ ను కోరుతున్నారు, జగన్ తమకు న్యాయం చేస్తారని యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్నారు, ఈ కోణంలోనే ఈ రోజు మధ్యాహ్నం ముఖ్య మంత్రి జగన్ తో యార్లగడ్డ వెంకట్రావు సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం అయితే తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సి.ఎం జగన్ మోహన్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకూ ఈ సమీక్ష సమావేశం జరగనుంది, మధ్యాహ్నం తరువాత గన్నవరం వైసీపీ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు రెండు రెండున్నర ఆ ప్రాంతంలో సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

The condition of a two year old boy in a well

ముప్పై ఐదు అడుగుల నుంచి వంద అడుగులకు జారిపోయిన బావిలో పడ్డ బాలుడు...

తమిళనాడులో చిన్న బాలుడు బోరు బావిలో పడి మూడు రోజులైంది. ఆ బాలుడు క్షేమంగా ఉన్నాడా లేదా ఇదే ఇప్పుడు తమిళనాడుతో పాటు దక్షిణాది మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం. ముప్పై ఐదు అడుగుల లోతు నుంచి బాబు వంద అడుగుల లోతు లోకి జారిపోవడంతో చిన్నారి క్షేమంగా వస్తాడా రాడా అని తల్లితండ్రులు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. శుక్రవారం సాయంత్రం తమిళనాడు లోని తిరుచ్చి జిల్లా మనప్పారై గ్రామంలో ఇంటి దగ్గర ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు రెండున్నరేళ్ల సుజిత్. ఈ వార్త తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు సుజిత్ ను సురక్షితంగా బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సుజిత్ బోరు బావిలో ముప్పై ఆరు అడుగుల లోతులో ఉన్నట్టు మొదట గుర్తించారు అయితే, సహాయక బృందాలు బోరు బావికి సమాంతరంగా గొయ్యి తీయడం ప్రారంభించాక ముప్పై ఐదు అడుగుల దగ్గర నుంచి ఏకంగా వంద అడుగులకు జారిపోయాడు. మొత్తం ఆరు వందల అడుగుల లోతులో వేసిన బోరులో బాలుడు ప్రస్తుతం వంద అడుగుల దగ్గర చిక్కుకున్నట్లు గుర్తించి తీస్తున్న గొయ్యిని మరింత లోతుగా తవ్వటం ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్ కు చెందిన నిపుణులు ఎన్.డీ.ఆర్.ఎఫ్, ఎస్.డీ.ఆర్.ఎఫ్ కు చెందిన ఆరు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వైద్యుల బృందం ఒకటి అక్కడే ఉంటూ బోరుబావి లోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతోంది. బోరు బావిలో ముప్పై ఐదు అడుగుల లోతులో సుజిత్ ఉన్నప్పుడు కాస్త ధైర్యంగా ఉన్న అతని తల్లిదండ్రులు వంద అడుగులకు జారిపోయాక కన్నీరుమున్నీరవుతున్నారు. క్షణమొక యుగంగా గడుపుతూ అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రి విజయ భాస్కర్ ఘటనా స్థలం లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి వస్తున్న ప్రజలు సుజిత్ క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. అతను క్షేమంగా బయటకు వచ్చే సందర్భం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ ఘటనపై స్పందించారు. సుజిత్ క్షేమంగా బయటకు రావాలని దేవుడిని కోరుకుంటున్నట్టు చెప్పారు.

Bhogapuram airport project

జీఎంఆర్ పై జగన్ సర్కారుకు ఎందుకంత ప్రేమ? భోగాపురం, కాకినాడ ప్రాజెక్టులపై నోరు విప్పరెందుకు?

కులం చూడం... మతం చూడం... పార్టీలు అసలే చూడమంటోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... ప్రాజెక్టుల కాంట్రాక్టులు, కంపెనీల విషయంలో పక్షపాతం చూపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో కంపెనీ విషయంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వ నిర్ణయాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన కంపెనీలపై జగన్ సర్కారు తీవ్ర పక్షపాత వైఖరి అవలంభిస్తోందని అంటున్నారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నవయుగ కంపెనీకి కాంగ్రెస్ అండ్ టీడీపీ హయాంలో కేటాయించిన ప్రాజెక్టులను భూములను వివిధ కారణాలు చూపెడుతూ రద్దుచేసిన జగన్ ప్రభుత్వం... అలాంటి కారణాలే మిగతా కంపెనీలకు కేటాయించిన ప్రాజెక్టుల్లో స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని మాత్రం కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. నవయుగ కంపెనీకి కాంగ్రెస్ హయాంలో సెజ్ కోసం వేలాది ఎకరాల భూములు కేటాయించారు. అయితే అందులో ఎలాంటి పురోగి లేకపోవడంతో... జగన్ సర్కారు ఆ భూ కేటాయింపులను రద్దు చేసింది. అయితే, ఇదే తరహాలో కాకినాడలో ప్రత్యేక ఆర్ధిక మండలి కోసం జీఎంఆర్ కంపెనీకి కూడా వేలాది ఎకరాల భూములు కేటాయించారు. అంతేకాదు రాయితీలు, పలు మినహాయింపులు ఇచ్చారు. అయితే, ఏ కారణాలతో నవయుగ కంపెనీ భూ కేటాయింపులు రద్దు చేశారో... సేమ్ టు సేమ్ అలాంటి రీజన్సే కాకినాడ సెజ్ లోనూ కనిపిస్తున్నా... జీఎంఆర్ భూకేటాయింపులపై మాత్రం జగన్ సర్కారు నోరు విప్పడం లేదు. పైగా టీడీపీ హయాంలో మొదలుపెట్టిన భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టును జీఎంఆర్ తోనే కొనసాగిస్తామంటూ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది. ఎందుకంటే, వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చేయని ఆరోపణ లేదు. జగన్మోహన్ రెడ్డే స్వయంగా ఎన్నోసార్లు తీవ్ర విమర్శలు చేశారు. జీఎంఆర్ కు అనుకూలంగా చంద్రబాబు రీటెండర్లు పిలిచారంటూ ఆరోపించారు. అలాగే, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం కారుచౌకగా 2వేల 703 ఎకరాలను అప్పగించారు. భూములతోపాటు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించారు. అయితే, అవినీతి అక్రమాలను అస్సలు సహించేది లేదని, ప్రజాధనం ఆదా చేయడమే తన లక్ష్యమంటూ చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి... భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలోనూ, అలాగే కాకినాడ సెజ్ విషయంలోనూ ఎందుకు జీఎంఆర్ కు అనుకూలంగా యూటర్న్ తీసుకున్నారంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రతి దానికీ రివర్స్ టెండరింగ్ అంటోన్న జగన్ కు భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టు కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ISIS Founder Abu Bakr Al Baghdadi Killed

ప్రపంచాన్ని గడగడలాడించాడు... కానీ కుక్కచావు చచ్చాడు...

వేలాది మందిని ఊచకోత కోసి నరమేధం సృష్టించిన ఇస్లామిక్ స్టేట్స్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ హతమయ్యాడు. ఉగ్రవాదంతో ప్రపంచాన్ని భయపెట్టాలనుకున్న ఐసిస్ అధినేత బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా సైన్యం నుంచి తప్పించుకోలేక ఆత్మాహుతికి పాల్పడ్డాడని తెలిపారు. చివరి క్షణాల్లో బాగ్దాదీ భయంతో వణకిపోయాడని, పిరికివాడిలా పారిపోయి, తనను తాను అంతం చేసుకున్నాడని ట్రంప్ ప్రకటించారు. బాగ్దాదీ టార్గెట్ గా ఈశాన్య సిరియాలో అమెరికన్ ఆర్మీ ఆపరేషన్ చేపట్టింది. అయితే, అమెరికా సైన్యం రాకతో బాగ్దాదీ భయంతో పారిపోయి, సొరంగం చివరన దాక్కున్నాడు. కానీ, అమెరికా ఆర్మీ నుంచి తప్పించుకోవడం అసాధ్యమని నిర్ధారించుకున్నాక తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. బాంబులతో తనను పేల్చేసుకోవడంతో బాగ్దాదీ శరీరం తునాతునకైందని ట్రంప్ వెల్లడించారు. అయితే, డీఎన్ఏ టెస్టుల ద్వారా బాగ్దాదీ మృతిని ధృవీకరించాయని ట్రంప్ స్పష్టంచేశారు. రెండు గంటలపాటు జరిగిన ఈ ఆపరేషన్ మొత్తాన్ని తాను తిలకించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బాగ్దాదీ మృతి తర్వాత వైట్ హౌస్ నుంచి అమెరికన్లనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్.... ఉగ్రవాదంతో ప్రపంచాన్ని భయపెట్టాలనుకున్న ఐసిస్ అధినేత కుక్క చావు చచ్చాడని ప్రకటించారు. అమెరికా సైన్యానికి భయపడి బాగ్దాదీ ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. అయితే, బాగ్దాదీని అంతమొందించాలన్న తమ లక్ష్యం పూర్తికావడంతో ఈశాన్య సిరియా నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

TDP MLA Vallabhaneni Vamsi quits party

జగన్‌ను కలిసొచ్చాక ఈ ట్విస్ట్ ఏంటి? వేధిస్తున్నారన్న ఆరోపణల్లో మతలబేంటి?

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీపావళికి రెండ్రోజుల ముందు బీజేపీ ఎంపీ సుజనాచౌదరిని కలవడంతో... కాషాయ గూటికి చేరడతాడంటూ ప్రచారం జరిగింది. అంతలోనే మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడంతో వైసీపీలో చేరడం ఖాయమని వార్తలొచ్చాయి. అయితే, పార్టీ మారతానంటూ తనపై వస్తున్న వార్తలపై పండగ తర్వాత క్లారిటీ ఇస్తానన్న వల్లభనేని వంశీ... సరిగ్గా దీపావళి రోజే... టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి లేఖ రాసిన వల్లభనేని వంశీ... ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండుసార్లు అవకాశమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, మొన్నటి ఎన్నికల్లో అతికష్టంమీద గెలిచానన్న వంశీ.... తనకు వ్యతిరేకంగా కొందరు ఉద్యోగులు, వైసీపీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అనేక సమస్యలు చుట్టుముట్టాయని, రాజకీయంగా వేధిస్తూ, తన అనుచరులపై కేసులు పెడుతున్నారంటూ బాబుకి రాసిన లేఖలో చెప్పుకొచ్చారు. తన అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని, అందుకే ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ వెల్లడించారు. అయితే, వంశీ లేఖపై స్పందించిన చంద్రబాబు... రాజకీయాల నుంచి తప్పుకోవడం సమస్యకు పరిష్కారం కాదని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా, తాను... పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా అక్రమ కేసులు, వేధింపులు ఆగవన్న చంద్రబాబు.... ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ఐక్యంగా పోరాడదామంటూ వంశీకి పిలుపునిచ్చారు. అయితే, బాబు రియాక్షన్ పైనా వంశీ స్పందించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని తనపై తీవ్ర ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గలేదని... అయితే, కనబడే శత్రువుతో యుద్ధం చేయొచ్చు... కానీ కనబడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టమంటూ... తన నిర్ణయంలో మార్పు లేదని తేల్చిచెప్పారు. అయితే, జగన్ ను కలిసొచ్చాక... ప్రభుత్వంపైనా, వైసీపీ నేతలపైనా వల్లభనేని వంశీ ఆరోపణలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. తనను రాజకీయంగా వేధిస్తున్నారని, తన అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారని, అందుకే ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది. పైగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు చెప్పడం వెనుక ఏదో మతలబు ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇదంతా వైసీపీ ప్లాన్ లో భాగమని అంటున్నారు. రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన వంశీ ఆరేడు నెలలపాటు సైలెంట్ గా ఉంటారని, ఈలోపు గన్నవరానికి ఉపఎన్నికలొస్తే, అక్కడ స్వల్ప తేడాతో ఓడిపోయిన వైసీపీ అభ్యర్ధిని యార్లగడ్డ వెంకట్రావును తిరిగి బరిలోకి దింపుతారనే మాట వినిపిస్తోంది. ఆ తర్వాత కొద్దిరోజులకు వంశీని వైసీపీలోకి రప్పించి ఏదోఒక పదవి కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తేలాలంటూ కొన్ని నెలలు ఆగాల్సిందే.

congress leaders comparing huzurnagar result with nandyal

అప్పుడు నంద్యాలలో... ఇప్పుడు హుజూర్ నగర్ లో... కానీ ఆ తర్వాత ఎన్నికల్లోనే తారుమారు...

  ప్రజాతీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు... ఎందుకంటే ప్రజాస్యామ్యంలో ప్రజలే అత్యంత శక్తిమంతులు... అప్పటివరకు ఎదురులేని పార్టీని కనుమరుగు చేయగలరు... కనీసం డిపాజిట్ కూడా రాని పార్టీని అందలమెక్కించగలరు... ఇది ఎన్నోసార్లు రుజువైంది... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ... విభజన తర్వాత తెలంగాణ అండ్ ఏపీలోనూ అలాంటి తీర్పులెన్నో ప్రజలిచ్చారు. 2014వరకు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కి... తెలంగాణ ఏర్పాటయ్యే సమయానికి కేవలం రెండే రెండు ఎంపీ సీట్లుండగా, పట్టుమని పది అసెంబ్లీ స్థానాలు కూడా లేవు. ఇక, తెలంగాణ ఇచ్చిన పార్టీగా అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు మంచి ఓటు బ్యాంకుతోపాటు మెరుగైన స్థితిలో ఉంది. కానీ 2014 ఎన్నికల్లో పార్టీల లెక్కలు తారుమారు అయ్యాయి. అప్పటివరకు పట్టుమని పది సీట్లు కూడా లేని టీఆర్ఎస్ అధికారంలో రాగా, అప్పటివరకు పవర్ లో ఉన్న కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతింది. ఆ తర్వాత 2018లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు అదే పరిస్థితి ఎదురైంది. అయితే, ఎవరూ ఊహించనివిధంగా మూడ్నెళ్ల తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకోవడమే కాకుండా, మరో రెండు మూడు స్థానాల్లో విజయానికి దగ్గర వరకు వచ్చింది.  ఇక, ఏపీలోనూ అదే జరిగింది. కాంగ్రెస్ ను, సోనియాను ఎదిరించిన నాయకుడిగా, వైఎస్ వారసుడిగా ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. దాంతో ఆనాడు జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిచంగా, టీడీపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. దాంతో నవ్యాంధ్రప్రదేశ్ లో వైసీపీదే అధికారమని అందరూ భావించారు. కానీ 2014లో లెక్కలు మారిపోయాయి. ప్రజలు చంద్రబాబుకి జైకొట్టారు. ఎవరూ ఊహించనివిధంగా టీడీపీకి ఘనవిజయం కట్టబెట్టారు. అయితే, బాబు అధికారంలో ఉండగా, 2017లో జరిగిన నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ, టీడీపీ నువ్వానేనా అన్నాయి. తమ పాలనపై ప్రజావ్యతిరేకత లేదని నిరూపించుకునేందుకు చంద్రబాబు.... 2019లో అధికారంలోకి వచ్చేది తానేనంటూ... సంకేతాలు ఇవ్వడానికి హోరాహోరీగా తలపడ్డారు. అయితే, మొత్తం టీడీపీ యంత్రాంగాన్నే రంగంలోకి దించిన చంద్రబాబు... ఇంటింటి ప్రచారంతో నంద్యాలలో ఘనవిజయం సాధించారు. అయితే, వందల కోట్ల రూపాయలు వెదజల్లి అక్రమంగా గెలిచారనే వైసీపీ ఆరోపించింది. అది నిజమో కాదో తెలియదు కానీ, సరిగ్గా ఏడాదిన్నర తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాజయం పాలైంది. ఎన్నడూలేనివిధంగా దారుణ ఫలితాలను టీడీపీకి ప్రజలిచ్చారు. అయితే, నంద్యాలలో ఏం జరిగిందో... ఇప్పుడు హుజూర్ నగర్లోనూ అదే జరిగిందని టీకాంగ్రెస్ నేతలంటున్నారు. కేసీఆర్ వందలకోట్ల రూపాయలను పంచి అక్రమంగా గెలిచిందని ఆరోపిస్తున్నారు. మరి అది నిజమోకాదో తేలాలంటే నవంబర్ లో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంతోకొంత బయటపడుతుంది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు రాకపోతే మాత్రం టీఆర్ఎస్ కు డేంజర్ బెల్స్ స్టార్ట్ అయ్యినట్లే భావించాల్సి ఉంటుంది.   

BJP Falls Short by Six Seats as Haryana Throws Up Hung Assembly

హర్యానాలో బీజేపీలో లెక్కలు తప్పాయి.. అసలు కారణమిదే!!

  హర్యానాలో సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన బీజేపీ... జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అయితే, గత పాలకులతో పోల్చితే అద్భుత పాలన అందించామని, ఈసారి 70 ప్లస్ సీట్లు రావడం ఖాయమని కమలదళం వేసుకున్న లెక్కలు అంచనాలు తారుమారు కావడంపై బీజేపీ పోస్టుమార్టం మొదలుపెట్టింది. సీట్లు తగ్గడానికి అసలెక్కడ తప్పు జరిగిందంటూ అంతర్మథనం మొదలైంది. నాలుగు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ క్వీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని పదికి పది స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అంతేకాదు లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 58శాతం ఓట్లను బీజేపీ సాధించింది. అయితే, 150 రోజుల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఊహించనివిధంగా షాకిచ్చారు. లోక్ సభ రిజల్ట్స్ ను చూసి, ఈసారి 70 ప్లస్ సీట్లతో బీజేపీ ఘనవిజయం ఖాయమని అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి. మరి అందుకు భిన్నంగా ఫలితాలు ఎలా వచ్చాయంటూ బీజేపీ అగ్రనాయకత్వం పోస్టుమార్టం మొదలుపెట్టింది.  హర్యానా ఫలితాలను గమనిస్తే, ఖట్టర్ పరిపాలనపై ప్రజలు అంత సంతృప్తికరంగా లేరనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగం, మహిళలపై దాడులు, పెరుగుతున్న ధరలు బీజేపీపై ప్రతికూల ప్రభావం కనబర్చాయని అంటున్నారు. ఇక, హర్యానాలో జాట్ లదే ఆధిపత్యం. కానీ బీజేపీ... నాన్ జాట్ అయిన ఖట్టర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అసలు జాట్ల ఆధిపత్యానికి గండికొట్టాలన్నదే బీజేపీ వ్యూహం. కానీ అదే బీజేపీకి వ్యతిరేకంగా జాట్లంతా సంఘటితం కావడానికి దారితీసింది. చివరికి, జాట్ల కారణంగానే బీజేపీ అనుకున్న సీట్లు సాధించలేకపోయిందని అంచనాకి వస్తున్నారు. అయితే, మళ్లీ ఖట్టర్ నే ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ అధిష్టానం కూర్చోబెడుతోంది. మరి ఈసారి ఏమాత్రం తేడా కొట్టినా, ముందుముందు అది ఢిల్లీ పీఠానికే ముప్పు తెచ్చిపెట్టడం ఖాయం.  

dushyanth become king maker in haryana

పార్టీ పెట్టిన 10 నెలల్లోనే కింగ్ మేకర్ గా... హర్యానాలో మారుమోగుతోన్న దుష్యంత్ పేరు

  హర్యానాలో హంగ్ ఫలితాలు రావడంతో బీజేపీ, జేజేపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన అనూహ్యంగా 10 సీట్లు కైవసం చేసుకున్న జేజేపీకి డిప్యూటీ సీఎంతోపాటు రెండు మంత్రి పదవులు దక్కించుకోబోతోంది. అయితే, నిన్నమొన్నటి వరకు జేజేపీ అంటే ఎవరికీ తెలియదు... ఎందుకంటే, ఈ పార్టీని ఏర్పాటుచేసి కనీసం ఏడాది కూడా పూర్తికాలేదు. 2018 డిసెంబర్ లో జన్ నాయక్ జనతా పార్టీని నెలకొల్పిన దుష్యంత్ చౌతాలా... హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పది సీట్లు సాధించి కింగ్ మేకర్ గా నిలిచారు. అయితే, దుష్యంత్ చౌతాలా ఫ్యామిలీకి హర్యానాలో భారీ పొలిటికల్ హిస్టరీయే ఉంది. దుష్యంత్ చౌతాలా ముత్తాత... దేవీలాల్ చౌతాలా హర్యానాకు రెండుసార్లు సీఎంగా పని చేశారు. ఇక, దుష్యంత్ తాత ఓం ప్రకాష్ చౌతాలా నాలుగుసార్లు హర్యానా ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే, చౌతాలా కుటుంబ పార్టీగా ఉన్న ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ ఎల్డీ)లో జరిగిన అంతర్గత పోరే.. జేజేపీ ఏర్పాటు కావడానికి కారణమైంది.  2018లో ఓం ప్రకాష్ చౌతాలా కుమారులైన అభయ్, అజయ్ మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవకు అజయ్, అతని కుమారులైన దుష్యంత్, దిగ్విజయ్ లే కారణమంటూ ఐఎన్ ఎల్డీ నుంచి బహిష్కరించారు. దాంతో అజయ్ కుమారుడైన దుష్యంత్... తన ముత్తాత పేరు మీద జన్ నాయక్ జనతా పార్టీని అసెంబ్లీ బరిలోకి దిగారు. అయితే, హర్యానా రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఐఎన్ ఎల్డీకి ఒకే ఒక్క స్థానం రాగా, చీలిక వర్గమైన జేజేపీ అనూహ్యంగా పది సీట్లు గెలుచుకుని హర్యానా ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా మారింది. అంతేకాదు హర్యానాలో జాట్లను సంఘటితం చేయడంలో దుష్యంత్ కీలకపాత్ర పోషించారు. దాంతో జాట్లంతా ఐఎన్ ఎల్డీని వదిలిపెట్టి జేజేపీకి మద్దతు పలికారు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన దుష్యంత్ పోల్ మేనేజ్మెంట్ లో విజయం సాధించారు. జేజేపీకి కనీసం డిపాజిట్లు కూడా రావన్న ఐఎన్ ఎల్డీ అధినేత అభయ్ చౌతాలాకు షాకిస్తూ... ఇఫ్పుడు ఏకంగా కింగ్ మేకర్ గా నిలిచారు. అయితే, చౌతాలా ఫ్యామిలీపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా, చివరికి ఫ్యామిలీ మొత్తం జైలుకెళ్లిచ్చినా... రైతులు, జాట్ కులస్తుల్లో మాత్రం ఆ కుటుంబానికి ఉన్న పట్టు, ఆదరణ తగ్గలేదని ఏమాత్రం తగ్గలేదని మరోసారి ఈ ఎన్నికలు నిరూపించాయి.

nara lokesh slams ys jagan over dengue deaths

మీకు సిగ్గుగా లేదా వైఎస్ జగన్ గారు.. ఇప్పటికైనా మేల్కోండి

  తూర్పుగోదావరి జిల్లా మండపేటలో శ్రీనవ్య (28) అనే వివాహిత గతనెల 11న డెంగ్యూ కారణంగా మృతిచెందింది. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనకు గురైన ఆమె భర్త చందనకుమార్‌ (35) కుమార్తె యోషిత(4)తో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ మరణాలు ఎక్కువయ్యాయి. నివారణకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వ్యక్తమవనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్.. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదా వైఎస్ జగన్ గారు? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దోమల నివారణకు అంత ఖర్చా అని ఏడ్చారు. ఇప్పుడు మీ తుగ్లక్ నిర్ణయాలకు ప్రజలు బలైపోతున్నారు. రాష్ట్రంలో విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు చనిపోతున్నా మీలో చలనం లేదు. మండపేటలో శ్రీ నవ్య డెంగ్యూ తో చనిపోయారు. ఆ బాధతో ఆమె భర్త చందు,కూతురు యోషిత ఆత్మహత్యకి పాల్పడిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దున్నపోతు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి." అని లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  

Govt Appointed Committee to Discuss on RTC Strike With JAC Leaders

చర్చలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. సమ్మెకు ఫుల్ స్టాప్ పడనుందా?

  కేసీఆర్ సర్కార్ వర్సెస్ ఆర్టీసీ సమ్మె అంశం ఓ కొలిక్కొచ్చేలా ఉందని అనిపిస్తోంది. మొన్నటివరకు ‘చర్చల్లేవ్‌.. సమ్మె చేస్తున్న కార్మికులు సెల్ఫ్‌ డిస్మిస్‌’ అన్న సీఎం కేసీఆర్‌ కార్మిక సంఘాలతో చర్చలకు అనుమతించారు. విలీనం మినహా హైకోర్టు సూచించిన 21 డిమాండ్లపై చర్చించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపాల్సిందిగా ఆర్టీసీ ఇన్‌చార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ శర్మ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లను సీఎం ఆదేశించారు. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎర్రమంజిల్ లో చర్చలు జరగబోతున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త వేతనాల అమలు, ఉద్యోగ భద్రత తదితర 26 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు ఈనెల 5వ తేదీ నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. వీటిలో 21 డిమాండ్లు పరిష్కరించదగినవేనని, వీటిపై ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు చేపట్టి, పరిష్కరించాలంటూ హైకోర్టు సూచించింది. ఈనెల 28న జరిగే తదుపరి విచారణ కల్లా చర్చల సారాంశాన్ని వివరించాలని ఆదేశించింది. దాంతో, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ప్రభుత్వం ఆరుగురు అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ డిమాండ్లపై అధ్యయనం చేసి పూర్తి నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నేపథ్యంలోనే, వీటిపై ప్రభుత్వం, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సునీల్‌ శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. కొన్ని డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సమీక్షలో తేల్చారు. హైకోర్టు సూచించిన 21 డిమాండ్లలో 12 వరకు డిమాండ్లకు పెద్దగా ఆర్థికపరమైన చిక్కులు లేవన్న నిర్ధారణకు వచ్చారు. వీటిపై కార్మిక జేఏసీతో చర్చలు జరపాలని నిర్ణయించారు. అయితే.. చర్చల సందర్భంగా, కార్మిక సంఘాలు సూచించే ఇతర డిమాండ్లనూ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం.  ఈరోజుతోనైనా సమ్మెకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

తూచ్ బీజేపీలోకి కాదు.. వైసీపీలోకి వల్లభనేని వంశీ.. రాజ్యసభ ఫిక్స్!!

  ప్రస్తుతం ఏపీలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. నిన్న ఉదయం వంశీ బీజేపీ ఎంపీ సుజనాచౌదరి కలిశారు. ప్రకాశంలో జరుగుతున్న గాంధీ సంకల్ప యాత్రకు సుజనా కారులోనే వంశీ వెళ్లటంతో.. వంశీ బీజేపీ లో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడటానికి ఎంతో సమయం పట్టలేదు. ఉదయం సుజనా తో కలిసి యాత్రలో కనిపించిన వంశీ.. సాయంత్రానికి సీఎం జగన్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. దీంతో అసలేం జరుగుతుందో అర్థంగాక టీడీపీ అధిష్టానం తలపట్టుకుంటోంది. వల్లభనేని వంశీ తన చిరకాల మిత్రుడు మంత్రి కొడాలి నాని, మరో మంత్రి పేర్ని నానితో కలిసి మధ్యాహ్నం 3గంటలకు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. సుమారు అరగంటకుపైగా జగన్‌తో చర్చలు జరిపారు. ఇటీవల వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు నమోదైంది. ఆ కేసులో ఆయన్ను 10వ నిందితుడిగా చేర్చారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని, దీనిపై ఆధారాలతో గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ విషయమై వంశీ జగన్ ని కలిసారని అంటున్నారు. మరోవైపు ఈ భేటీలో పార్టీ మారడంపైనా చర్చ జరిగినట్లు చెబుతున్నారు.  కాగా, శుక్రవారం టీడీపీ ఇసుక కొరతపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వంశీ పాల్గొనకుండా సీఎం తోనే భేటీ అయ్యారు. దీంతో వంశీ పార్టీ మారడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వంశీ కూడా ఈ ప్రచారాన్ని ఖండించలేదు. తాను 2006 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎప్పుడూ ఇంత స్థాయిలో తన మద్దతుదారులపైన, అనుచరులపైన దాడులు గానీ, ఆస్తులకు నష్టం గానీ జరగలేదని పేర్కొన్నారు. ఈ అంశాలను సీఎంకు వివరించానని చెప్పారు. ఇక పార్టీ మారే అంశంపై దీపావళి తర్వాత స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు.   వంశీ మాటలను బట్టి చూస్తుంటే పార్టీ మారటం ఖాయమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆయనకు పార్టీ మారే ఉద్దేశం లేకపోతే.. నేను టీడీపీలోనే ఉంటానని తేల్చి చెప్పేవారు, అంతేకాని ఇలా దీపావళి తర్వాత స్పష్టత ఇస్తా అనేవారు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు వైసీపీ వర్గాల నుంచి కూడా ఇటువంటి అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ప్రభుత్వంతో కలసి పనిచేస్తానని సీఎంను కలిసిన సందర్భంగా వంశీ చెప్పారని, సీఎం కూడా సానుకూలంగా స్పం దించారని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే టీడీపీ ఎమ్మెల్యేలెవరైనా వైసీపీలో చేరాలంటే ముందుగా పదవులకు రాజీనామా చేసి రావాలన్న జగన్‌ నిర్ణయంలో మార్పు లేదని స్పష్టం చేశాయి. మరి వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరతారా?. ఒకవేళ చేరితే ఆయనను రాజ్యసభకు పంపిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. వంశీని రాజ్యసభకు పంపి.. వైసీపీ నేత యార్లగడ్డ వెంకటేశ్వర రావుని గన్నవరం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. మరి దీనిలో నిజమెంత? వంశీ నిజంగానే వైసీపీ కండువా కప్పుకోనున్నారా అనేది దీపావళి తర్వాత తేలిపోనుంది.

వల్లభనేని వంశీ సిఎం జగన్ తో కలిసి పని చేయనున్నారా..?

  సీఎం జగన్ తో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. కొడాలి నాని, పేర్ని నానితో కలిసి సీఎం వద్దకు వెళ్లిన వంశీ అరగంట పాటు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. తనపై పెట్టిన అక్రమ కేసులను సీఎంకు వివరించినట్లు సమాచారం. కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్ తో వంశీ చెప్పారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.  కృష్ణా జిల్లాకు చెందిన తన చిరకాల మిత్రుడు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, అదే విధంగా మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి పేర్ని నాని ఇరువురూ కలిసి వల్లభనేని వంశీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళ్ళారు. సుమారు అరగంట సేపు భేటి అయ్యారు, ఈ భేటీలో ప్రధానంగా తనపై పెట్టిన కేసు గురించి వివరించినట్లు తెలుస్తోంది. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు అని చెప్తూ ఒక కేసు నమోదు చేశారు. ఈ కేసులో పదవ నిందితుడిగా వంశీని చేర్చారు. ఈ నేపథ్యంలో తనపై పెట్టిన అక్రమ కేసుల వివరాలను వల్లభనేని వంశీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు వివరించారు.

కమలనాథుల్లో గుబులు పుట్టిస్తున్న శివసేన...

  మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. 50-50 ఫార్ములా అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్న శివసేన ఇప్పుడు తన గళాన్ని మరింత పెంచింది. అధికారాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇక శివసేన అధికారిక పత్రిక సామ్నాలో బీజేపీని విమర్శిస్తూ ప్రచురితమైన ఎడిటోరియల్ వ్యాసం మరింత కలకలం రేపుతోంది. 2014 ఎన్నికలతో పోలిస్తే బిజెపికి ఓట్లు తగ్గడాన్ని ప్రస్తావిస్తూ కమలం పార్టీని ఎండగట్టింది. ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలి అంటూ కమలనాథులకు శివసేన సూచించింది. మీ అంతట మీకు మహారాష్ట్ర ప్రజలు మెజారిటీ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటూ బిజెపికి చురకలు వేసింది. తమవల్లే బిజెపి గెలిచింది అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేసింది. శివాజీ పేరుతో అవకాశవాద రాజకీయాలను సతారా ప్రజలు అనుమతించరు అంటూ వ్యాఖ్యానించింది. సతారాలో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఉదయన్ రాజె భోంస్లే పరాజయాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఎన్సీపీ పై ప్రశంసలు గుప్పించింది. మహారాష్ట్ర లోని  288 అసెంబ్లీ స్థానాలకు గానూ తాజా ఫలితాలతో బీజేపీ  103 సీట్లు శివసేన  56 సీట్లలో విజయం సాధించాయి. అయితే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు శివసేన కొత్త పల్లవి అందుకుంది, ఏకంగా సీఎం పీఠంపైనే కన్నేసింది. అధికారం చెరిసగం పంచుకోవాలి అన్న మెలికపెట్టింది. బీజేపీ కాదంటే కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశం కూడా శివసేనకుంది. ఇదే ఇప్పుడు కమలనాథుల్లో గుబులు పుట్టిస్తోంది. మరో పక్క ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండు శివసేన శ్రేణుల్లో మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. ఆదిత్య ఠాక్రే భవిష్యత్ సీఎం అంటూ మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన కార్యకర్తలు భారీ పోస్టర్ లు ఏర్పాటు చేయడం బీజేపీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాంతో శివసేనను దారికి తెచ్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అటు సామ్నాలో ఎడిటోరియల్ వ్యవహారంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. అధికార గర్వం తలకెక్కినప్పుడే ప్రజలు దాన్ని దించుతారు అంటూ తమ పార్టీ అధినేత ఉత్తవ్ వ్యాఖ్యలు చేశారని అదే ఎడిటోరియల్లో వచ్చింది అన్నారు, దీనిపై ఎలాంటి వివాదమూ లేదన్నారు.

హర్యానాలో వేడెక్కిన సీఎం కుర్చీ ఆట!!

  హర్యానాలో స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కనీస మెజారిటీకి కావలసిన సంఖ్యను సమకూర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్ధులు మద్దతు పలకడంతో ఇంకొందర్ని ఆకట్టుకొనేందుకు ముమ్మరంగా కృషి చేస్తోంది. మోదీ నేతృత్వం లోని బిజెపికి తాను బేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు హర్యానా లోకీత్ పార్టీ నేత స్వతంత్ర అభ్యర్థి గోపాల్ ఖండ ప్రకటించారు. ఆయన బాటలోనే ఇండిపెండెంట్ లుగా గెలిచిన రంజిత్ చౌతాలా, సోంబీర్ సంగ్వాన్, నయన్ పాల్ రావత్, ధరంపాల్ గోండర్ సైతం కమలదళానికి మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్నారు. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్  46, ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బిజెపి నిలిచిన కనీస మెజారిటీకి అడుగు దూరంలో నిలిచిపోయింది. నలభై స్థానాలను గెలిచిన బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలంటే మరో ఆరుగురి మద్దతు కావాలి. దాంతో స్వతంత్రులతో పాటు జెజెపిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. అటు కాంగ్రెస్ ముప్పై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది. ఎనిమిది చోట్ల స్వతంత్రులు గెలవగా ఒకచోట ఐఎన్ఎల్డీ అభ్యర్థి విజయం సాధించారు. మరో పక్క హర్యానాలో తాజా పరిస్థితిని చర్చించేందుకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఢిల్లీ వెళ్లారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో ఆయన సమావేశం అయ్యారు. తమకు మద్దతు ఇస్తున్న స్వతంత్రులను సైతం బీజేపీ నేతలు ఢిల్లీ చేరినట్టు తెలుస్తోంది. ఒక పక్క బిజెపి మరో పక్క కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు పావులు కదుపుతూ ఉండటంతో హర్యానాలో రాజకీయం హీట్ పెంచుతోంది. జెజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా తమవైపే జెజెపిని లాక్కోవాలి అన్నది బిజెపి నేతల వ్యూహంగా తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో జెజెపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అన్నది నిర్ణయించేందుకు జెజెపి అధినేత దుష్యంత్ చౌతాలా పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తొంభై స్థానాలున్న హర్యానాలో జెజెపి పది స్థానాలను దక్కించుకుంది, మరో వైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసం వద్ద కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. హర్యానాలో తాజా పరిణామాలు ఎన్నికల ఫలితాలపై చర్చించారు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. మొత్తం మీద స్వతంత్రుల మద్దతుతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక కాంగ్రెస్,జెజెపిలు కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేస్తాయా అన్నది ఉత్కంఠ రేపుతోంది.