హోమ్ ఐసొలేషన్ పై కేంద్రం కొత్త గైడ్ లైన్స్ 

కరోనా పేషంట్స్ తో క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రొఫైలాక్సిస్ వాడాలని, అన్ని వేళలా ఒక సహాయకుడు అందుబాటులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం కొత్త నియమావళి జారీ చేసింది. వైద్య పరీక్షల్లో తక్కువ కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలిన వారిని లేదా ప్రీ-సింప్టమ్స్ కనిపిస్తున్న వారిని తొలుత హోమ్ ఐసొలేషన్ లో ఉండాలని సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారికి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మరిన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. హోమ్ ఐసొలేషన్ ఎవరికి అవసరం? వైద్య పరీక్షల్లో తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయిన వ్యక్తులు. లేదా ఏదైనా డాక్టర్ పరిశీలనలో కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానించబడ్డ వ్యక్తులు. వీరంతా హోమ్ ఐసొలేషన్ లో ఉండాలి. వీరి కుటుంబ సభ్యులు కూడా ఐసొలేషన్ లో ఉండాలి. వీరి మంచిచెడ్డలు చూసేందుకు అన్ని వేళలా ఒక సహాయకుడు అందుబాటులో ఉండాలి. హోమ్ ఐసొలేషన్ సమయంలో హాస్పిటల్ కు, సహాయకుడికి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. హోమ్ క్వారంటైన్ లో ఉన్నప్పుడు పాటించాల్సినవి: ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్యుడి సలహా మేరకు సహాయకుడితో పాటు క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ప్రొఫైలాక్సిస్ వాడాలి. మొబైల్ లో ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అన్ని సమయాల్లో ఈ యాప్ యాక్టివ్ గా ఉండాలి. ప్రతి పేషెంట్ తన ఆరోగ్యాన్ని చెక్ చేసేందుకు, తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా సర్వైలెన్స్ అధికారికి అందించేందుకు అంగీకరించాలి.సెల్ఫ్ ఐసొలేషన్ కు సంబంధించిన ఫామ్ ను పూర్తి చేయాలి. హోమ్ క్వారంటైన్ గైడ్ లైన్స్ ను పాటించాలి.

లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తాం: ఏపీ మంత్రి సురేశ్

లాక్ డౌన్ అనంతరం టెన్త్ పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశం ఇందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తాం సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తాం లాక్ డౌన్ అనంతరం పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారని ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామని తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని, నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ తయారు చేస్తామని చెప్పారు. కాగా, రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సురేశ్ పాల్గొన్నారు. డిజిటల్, ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ను విస్తృతంగా వాడుకోవాలని కేంద్ర మంత్రి సూచించినట్టు సమాచారం.

మన రైతుల్ని కాపాడుకోలేమా?

చెరుకు రసం, బత్తాయి రసం,  కొబ్బరి నీళ్లు త్రాగండి  అని టీవీ, పేపర్  లలో ఒక్క హీరో / హీరోయిన్ అయినా చెప్పరు. ఎందుకంటే వాళ్లకు కోట్లలో ఇచ్చే అంత డబ్బు ఆ రైతుల దగ్గర ఉండదు. అదే దిక్కుమాలిన మన శరీరాలను సర్వ నాశనం చేసే కూల్ డ్రింక్స్ ను మాత్రము త్రాగండి అని పదే పదే చెప్తారు.  ఎందుకంటే ఆ కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళు హీరోలకు  కోట్లల్లో డబ్బులు ఇస్తారు. కనుక  వాళ్ళు ఏదైనా చెప్తారు. ఎందుకంటే ఆ హీరోలకు డబ్బు ముఖ్యం.  మనుష్యుల ప్రాణాలతో వాళ్లకు అవసరం ఉండదు. కానీ మనం... హీరోలకు వాళ్ళ సినిమాలు వస్తే ఎగబడి చూస్తాము. వాళ్ళకోసం ఏమైనా చేస్తాము. మన రైతుల కోసం మనం ఏంచేస్తున్నామో ఆలోచిస్తున్నారా? రైతులకు మనం ప్రత్యేక సహాయం చేయకపోయినా పరోక్షంగా అయినా వాళ్ళు పండించిన ఆ పంట రైతుకు మనం సహాయం చేయచ్చు.  ఎలానో చెప్పాలా?  మనం ఆ దిక్కుమాలిన కూల్ డ్రింక్స్ మానేసి ఈ బత్తాయి, కొబ్బరి, చెరుకు రసాలు తాగండి, మనం రైతులకు సహాయం చేసినట్లే.  పాపం రైతు మన మధ్య ఉన్నా మనం పట్టించుకోము, కానీ ఎక్కడి నుండో వచ్చిన కూల్ డ్రింక్స్ కంపెనీలను మాత్రం బ్రతికిస్తాం. ఇదెక్కడి న్యాయం చెప్పండి?  రసాల వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది మన రైతూ బాగుంటాడు.   కానీ కూల్ డ్రింక్స్ వల్ల చాలా అనారోగ్యాలు వస్తాయి. అయినా మనం చెడు వైపే ఆలోచిస్తాము కానీ.. మంచివైపు ఆలోచిస్తామా..?  కరోనా లాక్ డౌన్ వల్ల ఆ హీరో ఊడ్చాడు, ఈ హీరో ఇంట్లో ఆ పని చేసాడు, ఆ హీరోయిన్ వంట చేస్తుంది అని పనికి రాని మెస్సేజ్ లు వాట్సాప్ ఫేస్బుక్ లలో పెడుతున్నారు.  మొన్న వర్షానికి రైతులకు చాలా పంటలు దెబ్బతిన్నాయి,  మామిడి కాయలు రాలిపోయాయి, అక్కడక్కడ కోతకు వచ్చిన వరి తడిసి ముద్ద అయింది. మరి ఇలాంటి పోస్టులు పెట్టడం రాదా జనాలకు..? చెప్పండి? కరోనా వల్ల అన్ని కంపెనీలు మూతపడినా, వ్యాపారాలు ఆగిపోయినా,  ఒక్క రైతు పనులు మాత్రం ఎక్కడా ఆగిపోలేదు..!! రైతులు అలా ఆగిపోతే కరోనా మృతుల కంటే చాలా రెట్లు ఆకలి  మరణాలు చూడాల్సి వస్తుంది.

వాక్సిన్ ఇచ్చిన కోతులు ఉల్లాసంగా..ఉత్సాహంగా

covid వాక్సిన్ దిశగా వడివడి అడుగులు వేస్తున్న Oxford మరో చల్లని కబురు అందించింది..గత మార్చి నెలలో కోతులపై చేసిన ప్రయోగం అద్భుతమైన ఫలితం ఇచ్చిందని Oxford శాస్త్రవేత్తల బృందం తెలిపింది.మొత్తం ఆరు కోతులకు ఈ వాక్సిన్ ఇవ్వగా 28 రోజుల తర్వాత కూడా అవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. విశేషమేమిటంటే ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఈ కోతులు మానవ కణజాలాలకు బాగా సారూప్యత కలిగినవే..వీటితో పాటు ఉండి వాక్సిన్ ఇవ్వని కోతులు అస్వస్థతకు గురయ్యాయి..వాటి మధ్య ఉన్నా కూడా ఈ ఆరింటికి లక్షణాలు కనిపించకపోవడం మంచి పరిణామం. ఇప్పటికే elisaa grenato పై వాక్సిన్ ప్రయోగించిన ఆక్స్ఫర్డ్ మే నెలాఖరు నాటికి 6000 మంది మనుషులపై ప్రయోగించడానికి  సన్నాహాలు చేస్తోంది.అన్నీ సత్ఫలితాలు ఇస్తే సెప్టెంబర్ నాటికి వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఆసరికే ఇండియాలో మూడు కోట్ల వాక్సిన్లు సిద్ధంగా ఉంటాయి. ఈ వాక్సిన్ ప్రక్రియలో oxford గణనీయమైన పురోగతి సాధించినట్టే.వాస్తవానికి కొన్ని వాక్సిన్ల తయారీకి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది.covid హడావిడి మొదలైన తర్వాత కూడా తక్కువలో తక్కువగా 12-18 నెలలు పడుతుందని ఇప్పటికీ అంటున్నారు.అలాంటి వాదనల నేపథ్యంలో అప్పుడే మానవుల మీద ప్రయోగించే దశ రావడం మెరుపు  వేగమేనని చెప్పాలి. ఇదిలా ఉండగా Oxford మాత్రమే గాక అమెరికాకు చెందిన MODERNA,INOVIA సంస్థలు కూడా చకచకా పనిచేస్తున్నాయని అంటున్నారు.ఎక్కువ వాక్సిన్లు వస్తే త్వరితగతిన అధిక శాతం మందికి వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.Oxford ఉపయోగిస్తున్న పద్ధతిలోనే చైనాలో కూడా జరుగుతున్న పరిశోధనలు మంచి పురోగతినే సాధిస్తున్నాయి.

చేతులెత్తేసిన జగన్‌ సర్కార్‌!

'జ్వరం వస్తుంది. అంతే. మందులేసుకుంటే పోతుంది!... అంటూ కరోనా వైరస్‌ గురించి ముఖ్యమంత్రి జ‌గ‌న్ చాలా లైట్‌గా చెబుతున్నారు. కరోనా వైరస్‌ని అరికట్టలేం.. ఓ ఏడాదిపాటు ఆ కరోనా వైరస్‌ మనతోనే వుంటుంది తప్పదు.. అని ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే తెలంగాణను దాటేసింది. తమిళనాడుని దాటేయడానికి శరవేగంగా పరుగులు పెడ్తోంది. దేశంలో ప్రస్తుతానికి కరోనా పాజిటివ్‌ కేసుల పరంగా నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో మహారాష్ట్ర వుంది. రికార్డుల కోసం ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రతో పోటీ పడాలనుకుంటోందా.? అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.  ఈ డెడ్లీ వైరస్‌ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలు చూస్తోంటే, పూర్తిగా ప్రభుత్వం చేతులెత్తేసినట్లే కన్పిస్తోంది. ఓ పక్క మేం సాధించేశాం.. మేం సమర్థవంతంగా పనిచేస్తున్నాం.. మేం వైర‌స్‌‌ని ఎదుర్కొంటున్నాం అని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడికి కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలింది. కానీ, కొద్ది రోజుల తర్వాత ఆ యువకుడి కుటుంబ సభ్యులకి కరోనా వైరస్‌ సోకింది.. అదీ ఆ యువకుడి ద్వారానే. మరి, కరోనా వైరస్‌ పరీక్షలతో నూటికి నూరు శాతం 'వాస్తవాలు' బయటకు వస్తున్నాయని ఎలా అనుకోగలం.?  సాధారణ జ్వరం పెద్ద సమస్య కానే కాదు.. మరి అలాంటప్పుడు, రోజూ వేల కొద్దీ కరోనా వైరస్‌ పరీక్షలు ఎందుకు చేయిస్తున్నట్లు.? కరోనా వైరస్‌ పరీక్షల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామంటూ 'సెల్ఫ్ డబ్బా' కొట్టుకోవడమెందుకు.? పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నందుకు సంతోషించాల్సిందే. కానీ, 'ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం.. ఆ పరీక్షలతో పోల్చితే నమోదువుతన్న కేసుల సంఖ్య తక్కువే..' అని ప్రజలకు తప్పుడు సమాచారం ఎలా చెబుతారు.? కరోనా వైరస్‌ సాధారణ జ్వరం కాదు. ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ అన్న విష‌యం ముఖ్య‌మంత్రికి మాత్రం అర్థం కావ‌టం లేదు. ముఖ్య‌మంత్రి ఇలా మాట్లాడ‌డం ఇది మొదటి సారి కాదు. మొదటి నుంచీ వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, కరోనా వైరస్‌ విషయంలో ఒకే మాట మీద వున్నారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడు ఇచ్చే సూచనల్ని స్వీకరిస్తే క‌నీసం త‌న‌ 'అనుభవ రాహిత్యం' కొంత మేర మరుగున పడ్తుందన్న విజ్ఞత కూడా జ‌గ‌న్‌కు లేకపోవడం ఆశ్చర్యకరం. విపక్షాల్ని విమర్శించేందుకే అధిక ప్రాధాన్యత ఇవ్వ‌కుండా కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు వెచ్చిస్తే కొంతైనా రాష్ట్ర ప్రజలకూ మేలు జరుగుతుంది.

ఏపీని దేవుడే రక్షించాలి.. చంద్రబాబు ట్వీట్! 

క‌రోనా వైరస్ ను కేవలం జ్వరమంటూ నిర్ల‌క్ష్యంగా మాట్లాడ‌తారా అంటూ సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.  ముఖ్య‌మంత్రి వ్యాఖ్యలు అయన నిర్లక్ష్యానికి నిదర్శనం అని బాబు అన్నారు. ఈ మేరకు జగన్ మాట్లాడిన వీడియోను చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. కరోనా వైరస్ కేవలం జ్వరమేనని ప్రతిసారి చెప్పే వ్యక్తుల గురించి ఏం మాట్లాడాలని చంద్రబాబు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.   ఈ డెడ్లీ వైరస్ బాధితుల్లో సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ టాప్‌లో ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని తెలుస్తోందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రాన్ని దేవుడు రక్షించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. సీఎం జగన్ మీడియాతో మాట్లాడిన తీరు ఆయ‌న నిర్లక్ష్యానికి నిదర్శమని బాబు అన్నారు.  కరోనా బాధితులను అంటరానివారిగా చూడొద్దని సీఎం జగన్ అన్నారు. కరోనా నాతో సహా ఎవరికైనా రావచ్చుని, రాబోయే కాలంలో ప్రజలు కరోనా కలిసి జీవించాల్సి ఉంటుంది. ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, కరోనాపై అనవసర భయాలు పెట్టుకోవద్దు అన్నారు. కరోనా ఒక జ్వరం లాంటిది అన్నారు. ఎవరికి వస్తుందో తెలియడం కష్టమన్నారు. సామాజిక దూరం పాటించడం అవసరం. రాష్ట్రంలోని గ్రీన్ జోన్స్ ప్రాంతాలలో కరోనా రాకుండా జాగ్రత్త పడాల్సి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అయితే సీఎం అన్న ఈ వ్యాఖ్యలను జోడిస్తూ ముఖ్య‌మంత్రి తీరును చంద్రబాబు తప్పుబట్టారు.

ప్రవాసీలను తీసుకురావడానికి ప్రత్యేక విమానాలు!

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మే 3 అనంతరం లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్రం ఆలోచిస్తోంది. విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కుటుంబసభ్యలు తమ వారిని వారిని స్వదేశానికి తీసుకురావాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవాసీలను తీసుకురావడానికి ప్రత్యేకంగా విమానాలు పంపాలని కేంద్రం నిర్ణ‌యించింది. ఇందుకు గాను చ‌ర్య‌లు చేప‌ట్టింది.  ఎంత మంది విదేశాల్లో చిక్కుకున్నారు, ఎంత మందిని తిరిగి దేశానికి రానున్నారు అన్నవివరాలను సేకరించాలని భారత రాయబార కార్యాలయాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల్లో చిక్కుకుని ఉన్నవారి పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది.  ఆయా దేశాల భారత రాయభార కార్యాలయ సిబ్బంధి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం, అలాగే ఖతర్‌లోని రాయబార కార్యాలయం కూడా ఆన్‌లైన్‌లో వివరాలను సేకరిస్తున్నారు.  కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తచెందుతుండడంతో కేంద్రం ప్రభుత్వం గత నెల 22వ తేదీన అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. విద్య, ఉద్యోగ, ఉపాధి, పర్యాటకానికి వివిధ దేశాలకు వెళ్లిన ఎంతో మంది భారతీయులు విదేశాల్లో  చిక్కుకుపోయారు. వారంతా తిరిగి భారత దేశానికి చేరుకోలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారందరినీ స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది.

పీఎం మోడీ నుండి సీఎం జగన్ వరకు.. అందరూ అదే బాపతు

​సినీ సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు.. కాస్ట్ లీ కారులు కొనడం, ఖరీదైన బట్టలు, వాచ్ లు ధరించడం కామన్. ఆ సెలబ్రిటీ కొన్న కారు ఇంత!! ఆ సెలబ్రిటీ పెట్టుకున్న వాచ్ ఇంత!! అని కామన్ పీపుల్ కూడా వాటి గురించి ఆశ్చర్యంగా చర్చింకుంటారు. కానీ రాజకీయ నాయకులు ఇలాంటి ఆడంబరాలకు పోతే విమర్శలు ఎదుర్కోక తప్పదు. రాజకీయ నాయకులు చాలా నిరాడంబరంగా జీవించాలి. వారు చేసే ప్రతి ఖర్చు ప్రజాసేవకే ఉపయోగించాలి. అయితే ఈ జనరేషన్ లో అలాంటి నాయకులు చాలా అరుదనే చెప్పాలి. నాయకులు కూడా దాదాపు సెలబ్రిటీల లాగానే జీవిస్తున్నారు. చూసి చూసి ప్రజలకు కూడా అలవాటు అయిపోతోంది. అయితే కొందరు నాయకులు మాత్రం.. సినీ సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు కంటే విలువైనవి ధరించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో పీఎం మోడీ నుండి ఏపీ సీఎం జగన్ వరకు చాలా మంది ఉన్నారు. మోడీ పేరు వింటే మనకి ముందుగా గుర్తొచ్చేది చాయ్ వాలా. ఓ చాయ్ అమ్మిన కుర్రాడు ప్రధాని స్థాయికి ఎదగడం గర్వకారణం. అయితే మోడీ సాధారణ స్థాయి నుండి వచ్చినా ఆయన జీవశైలి మాత్రం విలాసవంతంగా ఉంటుందని పలువురు విమర్శిస్తుంటారు. దానికి కారణం ఆయన ధరించే ఖరీదైన బట్టలు. మోడీ చాలా ఖరీదైన బట్టలు ధరిస్తాడని, అది కూడా ఒకసారి వేసిన డ్రెస్ మరోసారి వేయడని విపక్ష నేతలు ఆరోపిస్తుంటారు. ఓ సారి ఆయన సూట్ పై కాంట్రవర్సీ కూడా అయింది. మోడీ ధరించిన సూట్ పది లక్షలు అని, ఆయనకు సూట్ల మీదున్న శ్రద్ద సొసైటీ మీద లేదని, ఆ డబ్బుని పేదవారి కోసం ఖర్చు చేస్తే బాగుండేదని విపక్షాలు విరుచుకుపడ్డాయి. అయినా మోడీ డ్రెస్సింగ్ స్టైల్ లో మాత్రం మార్పు రాలేదనే చెప్పాలి. ఇక 2016 సమయంలో కర్ణాటకలో అయితే ఖరీదైన వాచ్ ల చుట్టూ రాజకీయం తిరిగింది. అప్పటి సీఎం సిద్దరామయ్య చేతి వాచ్ రూ.70 లక్షలు అని విపక్షాలు ఆరోపించాయి. అప్పట్లో ఇది బాగా కాంట్రవర్సీ అయింది. ఇక మాజీ సీఎం కుమారస్వామి వద్దనైతే చాలా ఖరీదైన వాచ్ లు ఉన్నాయని ప్రచారం జరిగింది. వజ్రాలు పొదిగిన 50 లక్షల నుంచి కోటి విలువైన వాచ్ లు ఉన్నాయని వార్తలొచ్చాయి. అదేవిధంగా, సిద్దరామయ్య ఖరీదైన పెన్ను గురించి కూడా అప్పట్లో బాగా కాంట్రవర్సీ అయింది.  ఇలా లక్షల విలువైన వస్తువులు వాడుతూ చాలా మంది నాయకులు విమర్శలు ఎదుర్కొన్నారు. వారిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఉన్నారు. ఆయన కాస్ట్ లీ వాచ్ కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. జగన్ చేతికున్న వాచ్ ఖరీదు రూ.13 లక్షల 31 వేలు. కాస్ట్ లీ సీఎం అంటూ ఇప్పటికీ ఆయనపై పలువురు ట్రోల్ల్స్ చేస్తుంటారు. అంతేకాదు, జగన్ ధరించే చొక్కాలపై కూడా కాంట్రవర్సీ జరిగింది. ఆయన ధరించే చొక్కా ధర చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ క్లాత్ ని ప్రత్యేకంగా తెప్పిస్తారని అంటుంటారు. మొత్తానికి పీఎం మోడీ నుండి సీఎం జగన్ వరకు పలువురు నాయకులు ఆడంబరాలకు పోయి విమర్శలు ఎదుర్కొన్నారు.

నిమ్మగడ్డ తొలగింపుపై కొనసాగుతున్న తుది వాదనలు

ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపుపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నిమ్మగడ్డ తరఫున న్యాయవాది ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం వివరణ, నిమ్మగడ్డ పిటిషన్లపై విచారణ సాగుతోంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ దాఖలు చేసిన రిట్‌పై రాతపూర్వక వాదనలను న్యాయవాది కోర్టుకు సమర్పించారు.  స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత రహస్యమైనదని, న్యాయ సలహా మేరకే తాను నడచుకున్నానని రమేశ్‌కుమార్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో కమిషనర్‌కు విచక్షణాధికారం ఉంటుందని, దాని మేరకే తాను వ్యవహరించానని పేర్కొన్నారు. వాయిదా నిర్ణయంపై ప్రభుత్వాధికారులనో, ఎన్నికల సంఘ కార్యదర్శినో సంప్రదించాల్సిన అవసరం లేదని, ఆ మేరకు నిబంధనలేవీ లేవన్నారు.

తెలంగాణాలో తప్పుదోవ పట్టిస్తున్న కరోనా లెక్కలు!

* దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో-5221, * తెలంగాణలో 1003.   ఈ లెక్కలు చూసి తెలంగాణలో మొత్తం పరిస్తితి పూర్తిగా కంట్రోల్ లో ఉందని పప్పులో కాలేసేరు. కరోనా కేసులు చేసే పరీక్షల మీద ఆధారపడి ఉంటాయి. పరీక్షలు ఎక్కువ చేస్తే ఎక్కువ, తక్కువ చేస్తే తక్కువ, అసలు చేయకుంటే అసలు ఒక్క కేసూ ఉండదు. ఒక్కొక్క ఇంట్లో పదుల సంఖ్యలో కేసులు బయటబడుతుంటే ఇంకా తెలంగాణలో త‌క్కువ కేసులెందుకు వున్నాయి. ఈ  అనుమానం చాలామందికి రావచ్చు.  ఒకసారి లెక్కలను మరింత లోతుగా విశ్లేషిద్దాం...?  తెలంగాణలో ఇప్పటివరకూ చేసిన పరీక్షలు : 13200.  అయితే బ‌యటపడిన కేసులు: 943 మాత్ర‌మే. ప్రతీ 100 పరీక్షలకు తెలంగాణలో బయటపడుతున్న కేసులు: (100/13200)x1003 = 7.59 మహారాష్ట్రలో ఇప్పటివరకూ చేసిన పరీక్షలు: 75838. అయితే బయటపడిన కేసులు: 5221 ప్రతీ 100 పరీక్షలకు మహారాష్ట్రలో బయటపడుతున్న కేసులు: (100/75838)x5221 =6.88 అంటే, తెలంగాణలో ప్రతీ 100 కేసులకూ 7.59 పాజిటివ్ వస్తే, మహారాష్ట్రలో ఈ సంఖ్య మనకన్నా తక్కువగా (6.88) ఉంది. అంటే కేసుల శాతం తెలంగాణలో మహారాష్ట్ర కన్నా ఎక్కువగా ఉంది.   తెలంగాణలో కూడా మహారాష్ట్ర మాదిరిగా పరీక్షలు నిర్వహిస్తే తెలంగాణలో బయటపడదానికి అవకాశం ఉన్న కేసుల సంఖ్య: (75838/13200) x 1003 = 5762. ఇది మహారాష్ట్ర కన్నా 541 ఎక్కువ. అసలు రోగులే లేకుంటే, పరీక్షలు చేసినా  పాజిటివ్ కేసులేలా బయటపడతాయ్? అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది, తెలంగాణలో పరీక్షల సంఖ్య పెరిగినప్పుడల్లా కేసుల సంఖ్య పెరగడం. ఉదాహరణకు మొన్న 450 పరీక్షలు చేస్తే, అందులో 49 పాజిటివ్ కేసులు వచ్చాయి. అంటే పది శాతం కన్నా ఎక్కువ. పరీక్షలు చేసిన చోటల్లా పుట్టల్లా కేసులు బయటపడుతుంటే అసలు రోగులే లేరనడం అమాయకత్వం.  మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రుల్లో మరణించిన వారికి కరోనా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. మరణించిన వారికి అంత్యక్రియలు కరోనా రోగులకు నిర్వహించినట్లుగానే నిర్వహించాలి కానీ, వారికి కరోనా పరీక్షలు చేయవద్దని చెప్పడానికి కారణం ప్రభుత్వం వివరించలేదు. దీంతో కరోనా మరణాల లెక్కలు తెలంగాణలో చాలా తక్కువగా నమోదైతాయి.  అలాగే, కరోనా రోగుల సెకండరీ కాంటాక్ట్ లకు కరోనా పరీక్షలు చేయవద్దని నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో చూపించే కరోనా కేసుల సంఖ్య వాస్తవ సంఖ్య కన్నా గణనీయంగా తక్కువ ఉంటుంది.  అసలు వేల సంఖ్యలో కరోనా పరీక్షలతో సాధించేదెముంది?  ‘వేల సంఖ్యలో కరోనా పరీక్షలతో సాధించేదెముంది? ఖర్చు తప్ప...” అనే అనుమానం చాలా మందికి రావచ్చు. తెలంగాణలో కోటి మందికి పరీక్షలు చేసినా 600 కోట్ల రూపాయల ఖర్చుకాదు. తెలంగాణలో రెండు రోజులు లాక్ డౌన్ తో ప్రభుత్వం కోల్పోయే ఆదాయం (సుమారు రూ800కోట్లు) కన్నాఈ ఖర్చు తక్కువ. కాబట్టి పరీక్షలకు ఖర్చుకు సంబంధం లేదు.  మరి పరీక్షలతో లాభం ఏంటి? దీనికన్నా ముందు, అసలు లాక్ డౌన్ తో లాభమెంటోతెలుసుకోవాలి. లాక్ డౌన్ తో వైరస్ సమాజం నుండి తొలగిపోదు. లాక్ డౌన్ కరోనా వ్యాప్తికి తాత్కాలికంగా కట్టడి వేస్తుంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ మీద ఒకే సారి తీవ్రభారం పడకుండా ఆపుతుంది.  ఈ లోగా ప్రభుత్వం కరోనాను నిర్మూలించాలంటే లాక్ డౌన్ తో పాటు పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడం, గుర్తించిన రోగులను ఇతరుల నుండి వేరు పరచడం, చికిత్సనందించడం ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణ పరీక్షల సంఖ్యను అనేక రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. మన కన్నా తక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాలు మనకు ఆదర్శం కాకూడదు. ఇలా కాకుండా కేవలం లాక్ డౌన్ ఒక్కటే మార్గమనుకుంటే, కరోనా వ్యాప్తిని అరికట్టలేం సరికదా దీర్ఘకాలిక లాక్ డౌన్ లతో ప్రజల జీవితాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి ఛిన్నాభిన్నమవుతుంది.  మరోవైపు కేసులు తక్కువగా ఉన్నాయని లాక్ డౌన్ ఎత్తివేస్తే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్తితి భిన్నంగా ఉండి, కరోనా మరింతగా విజృంభించే చేతులు దాటిపోయే  ప్రమాదం ఉంది.  ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచి కరోనా కట్టడికి యుద్ద ప్రాతిపదిక పై చర్యలు చేపట్టాలి. పరిస్తితి నియంత్రణలోకి రాగానే లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేయాలి.

యండమూరి చెప్పిన ఉగాండా కథ!

ఇది ప్రముఖ రచయితా యండమూరి వీరేంద్రనాథ్ చెప్పిన ఉగాండా కథ. “భవిష్యత్తులో అసెంబ్లీలు, ఆఫీసులూ, సినిమా హల్సూ ఉండవు. పెట్రోల్ రేషన్ అవటంతో సూపర్ మర్కెట్‌లూ, మాల్సూ పోయి ఆన్‌-లైన్ అమ్మకాలే ఉంటాయి” అని పాతిక సంవత్సరాల క్రితం వ్రాసినప్పుడు అవన్నీ అభూత కల్పనలని కొంతమంది కొట్టివేశారు. నా నవల పేరేదో నాకు గుర్తులేదు గానీ రెండు రోజుల క్రితం... ఉగాండా దేశపు ప్రెసిడెంట్ ఇచ్చిన ఉపన్యాసం ఇది. పండగ పేరు చెప్పి వీధుల్లో రికామీగా తిరుగుతున్న తన మనుషులని ఉద్దేశించి దేశాధ్యక్షుడు  ‘ముసెవెనీ’ ఇచ్చిన ఉపన్యాసపు సారాంశానికి స్వేచ్ఛానువాదాన్ని యండమూరి వీరేంద్రనాథ్ ఇలా అందించారు.  "భగవంతుడికి చాలా పనులున్నాయి. ప్రపంచాన్నంతా ఆయనే చూసుకోవాలి. మీలాంటి రెక్-లెస్ ఉగాండా ఇడియట్స్ కోసం స్పెండ్ చేసేటంత టైమ్ ఆయనకి లేదు. మెడకి తాడు వేసి ‘నాతో ఉందూ గానీ రా’ అని తీసుకుపోతాడు. మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతారా?  బతుకుంటే చాలు అనుకుంటారా?... మీ ఇష్టం. యుద్ధకాలంలో ఎవరూ ఎవరినీ ఇళ్ళల్లో ఉండమని అడగరు. మీరే రోజుల తరబడి ఫ్లాట్స్‌ క్రింద బేస్‌మెంట్లో బిక్కుబిక్కుమంటూ దాక్కుంటారు. పిజ్జాల కోసం, సుగంధ ద్రవ్యాల కోసం రోడ్ల మీద పడరు. రొట్టె దొరికితే చాలనుకుంటారు. అర్ధరాత్రి దూరంగా వినిపించే బాంబుల శబ్దాన్ని వింటూ నిద్రకి దూరమైన మీరు, మరుసటి రోజు సూర్యోదయాన్ని చూసి, ఆ రాత్రి బ్రతికున్నందుకు భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకుంటారు తప్ప, నిద్ర లేదని కంప్లయింట్ చెయ్యరు. పిల్లలకి కాలేజీ పోతోందని బాధపడరు. సైన్యంలో చేర్పించటానికి ప్రభుత్వం మీ పిల్బల్ని  బలవంతంగా తీసుకెళ్ళలేదని సంతోషిస్తారు.  కాళ్ళు చేతులు తెగిన జనం అర్ధరాత్రి ఆర్తనాదాల మధ్య... భూకంపానికి కూలిపోయిన మీ భవంతి ముందు... ఎముకలు కొరికే చలిలో పిల్లల్ని వేసుకుని రాత్రంతా కూర్చునే స్థితి రానందుకు సంతోషించండి. చెట్టు కొమ్మని పట్టుకుని వేలాడుతూ ఉదృతంగా వస్తూన్న నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చే పాములు కాళ్ళకి చుట్టుకుంటాయేమోనని భయపడేటంత భయంకరమైన స్థితి కాదిది. రెండు రోజులుగా ఆహారం లేక ఏడ్చే పసిపిల్లలతో ఇంటి పైకప్పు మీద నిలబడిె, హేలికాప్టర్ విసిరే అన్నం పొట్లం మీ ఇంటి మీద పడాలని, ఆకాశం వైపు ఆశగా చూసేటంత దురవస్థ లేదు. అందుకు సంతోషించండి.  ‘మేము దీనికి అతీతులం’ అని తిరుగుతున్న కొందరు నా దేశపు ప్రజలారా..మీరు తప్ప, ప్రపంచం మొత్తం శత్రువుతో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో బాంబులు లేవు. సైనికులు లేరు. సరిహద్దులు లేవు. శాంతి ఒప్పందాలు లేవు. దయాదాక్షిణ్యాలు లేవు. మతం, దేశం, ఆడ. మగ, పసిపిల్లలు, వృద్ధులు తేడా లేదు. శత్రువు గమ్యం ఒకటే. మానవాళిని నాశనంచేసి ప్రపంచాన్ని స్మశానం చేయటం..! దాని పేరే కోవిడ్ - 19.  అయితే మన శత్రువు మనం అనుకునేటంత బలమైనది కాదు. ఒక బలహీనత ఉంది. ఎదుర్కొంటే విజృంభిస్తుంది. దూరంగా ఉంటే కరిగిపోతుంది. చాలా సులభంగా ఓడించవచ్చు. కావలసింది క్రమశిక్షణ.  వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మరో సంవత్సరం వరకూ వ్యాక్సిన్ కనుక్కోబడదు. వ్యాక్సిన్ కనుక్కునేవరకూ ఏ దేశం కూడా పరాయి దేశస్థుడిని తన దేశం రావటానికి ఒప్పుకోదు. ఒకసారి విదేశాలలో ఉన్నవారు మన దేశం వస్తే తిరిగి వెళ్ళటం కూడా కష్టమే. 2021 జూన్ వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఓడలూ, విమాన యానాలూ సాధ్యం కావు. పక్క సీటు ఖాళీ పెడితే తప్ప విమానయానం కుదరదు. అలా చేస్తే కమర్షియల్‌గా సక్సెస్ అవదు. కాబట్టి దాని గురించి మర్చిపోండి. విదేశాలలో ఉన్న మీ పిల్లలూ, బంధువులూ చాలా కాలంపాటూ మీకు కనపడక పోవచ్చు. లాక్‌-డవున్ తీసేయగానే ఆల్ఫ్స్ మంచు కొండల మీద స్కేటింగ్ గురించి మొన్న నా స్నేహితుడు మాట్లాడాడు. నవ్వొచ్చింది. హొటల్స్, మాల్స్, సినిమాలు వీటన్నిటి గురించి మర్చిపోండి. పుష్కర స్నానాలు, పుణ్య క్షేత్ర దర్శనాలు ఉండవు. భగవంతుడిని ఎక్కడి నుంచి ప్రార్ధించినా ఒకటే అని తెలుసుకోండి. ఒక గొప్ప పరిణామానికి ఈ సమస్యని ఆధారభూతంగా చేసుకుందాం. ఆల్ ది బెస్ట్...”

శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు

- అద్భుతమైన జ్ఞానమూర్తి ఆదిశంకరులన్న స్వరూపానంద - ట్విట్టర్ ద్వారా స్వాత్మానంద సందేశం విశాఖ శారదాపీఠంలో శంకర జయంతి వేడుకలు భక్తి ప్రవత్తులతో సాగాయి. జగద్గురు ఆదిశంకరాచార్యుని జయంతిని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర తమ స్వహస్తాలతో నిర్వహించారు. వేకువ జామున గణపతి పూజతో శంకర జయంత్యుత్సవానికి శ్రీకారం చుట్టారు. తొలుత కలశారాధన, మండపారాధన చేశారు. ఆ తర్వాత శంకరాచార్యుని దివ్య ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు రకాల పూలతో విశేష అర్చన చేశారు. లోక కల్యాణార్ధం శాంతి హోమాన్ని నిర్వహించారు. శంకర జయంతి వేడుకలను రోజంతా నిర్వహించేందుకు వీలుగా పీఠం ప్రతినిధులు ఏర్పాట్లు చేసారు. పీఠంలో పనిచేసే అతి కొద్ది మంది సిబ్బంది మాత్రమే ఈ జయంత్యుత్సవాలకు హాజరయ్యారు.  విజ్ఞాన రాశుల్ని అందించిన జ్ఞాన మూర్తి ఆదిశంకరులు సర్వ మానవాళికి విజ్ఞాన రాశులను అందించిన అద్భుతమైన జ్ఞాన మూర్తిగా ఆదిశంకరాచార్యుడిని అభివర్ణించారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర. ఆది శంకరులు బోధించిన అద్వైత జ్ఞానాన్ని అవగతం చేసుకోవడానికి మానవాళి ప్రయత్నిస్తుండటం శుభ పరిణామం అన్నారు. భగవదారాధన గురించి ఆదిశంకరులు కన్నా గొప్పగా బోధించిన వారు మరొకరు లేరన్నారు. మానవులంతా శంకరాచార్యుడిని నిత్యం స్మరించుకునే రోజు రావాలన్నదే తన ఆశయంగా చెప్పుకొచ్చారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర.  ట్విట్టర్ ద్వారా సంస్కృతంలో సందేశం పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర శంకర జయంతి సందేశాన్ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందేశం పూర్తిగా సంస్కృతంలోనే సాగింది. మన ఆత్మనే పరబ్రహ్మ స్వరూపంగా భావించాలని శంకరాచార్యులు ప్రబోధించిన సందేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు. కరోనా గండం నుంచి గట్టెక్కడానికి పూర్వీకుల విధానాలను పాటించాలని, ప్రభుత్వ నియమాలను అనుసరించాలని సూచించారు స్వామి స్వాత్మానందేంద్ర మూడు రోజులుగా భాష్య పారాయణ శంకర జయంతిని పురస్కరించుకుని మూడు రోజులుగా పీఠం ప్రాంగణంలో భాష్య పారాయణ నిర్వహించారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతకు శంకరాచార్యులు ప్రత్యేకంగా భాష్యం చెప్పారు. దీనినే ప్రస్థాన త్రయం, శంకర భాష్యం అని కూడా అంటారు. జగద్గురువు జయంతి సందర్భంగా పీఠంలో శంకర భాష్య పారాయణ చేసారు. ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర స్వయంగా ఈ పారాయణలో పాల్గొన్నారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ, అద్వైత సిద్ధాంతాన్ని  ప్రచారం చేయడంలో భాగంగా పారాయణ చేపట్టినట్లు స్వామి స్వాత్మానందేంద్ర తెలిపారు.

ఏపీలో తగ్గని కరోనా ఉద్ధృతి

ఆంధ్ర ప్రదేశ్ లో పాజిటివ్ కేసులు 1,177 కి చేరాయి. నిన్న ఒక్కరోజులో 80 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. కర్నూల్, గుంటూరు, కృష్ణా జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. 7జిల్లాల్లో కొత్త కేసులు లేవు. రాష్ట్రం లో ఇప్పటికి 31 మంది మృతి చెందారు. కృష్ణా లో కోవిడ్ ఆసుపత్రి డాక్టర్ కరోన పాజిటివ్ సోకింది.  ఇప్పటివరకూ రాష్ట్రం లో 74,551 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఏ.పి.లో ఇన్ఫెక్షన్ రేటు తగ్గగా, రికవరీ శాతం పెరుగుతోంది.  రెడ్ జోన్ ప్రాంతాల్లో అకారణంగా రోడ్డుపైకినవస్తే, పోలీసులు క్వారంటైన్ కి పంపుతున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కర్నూల్ లో 292, గుంటూరు 237, కృష్ణా210, నెల్లూరు79, చిత్తూరు73, కడప58, ప్రకాశం56, ప. గో.54, అనంతపురం53, తూ. గో.39, విశాఖ22, శ్రీకాకుళం లో 4 కేసులు నమోదయ్యాయి.

అన్న‌దాత‌ల్ని ఆదుకోండి

ఏపీ సి.ఎంకు టిడిపి నేత లోకేష్ లేఖ‌ కరోనా లాక్డౌన్ కారణంగా పంట దిగుబడులను విక్రయించుకోలేక అవస్థలు పడుతున్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి టిడిపి నేత లోకేష్ ఒక లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతలు తాము పండించిన పంటలను అమ్ముకోలేక అవస్థలు పడుతుంటే ప‌ట్టించుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోందని ఆరోపించారు. పంటలను కొనుగోలు చేస్తున్నామనే వ్యవసాయ మంత్రి హామీ అరకొరగానే అమలవుతోందన్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఉద్యానవన పంటల రైతుల గోడు వినేవారు కరువయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను రోడ్లపైనే పారబోస్తున్న విషయం మీ దృష్టికి రాలేదా? వచ్చినా మొద్దు నిద్ర నటిస్తున్నారా? అని నిలదీశారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో.. అప్పుల భారం పెరిగి ఆత్యహత్యలకు పాల్పడుతున్నారని లోకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు.  రైతులకు భరోసా ఇవ్వడంలో ప్ర‌భుత్వం విఫల‌మైందని విమర్శించారు. రబీ సీజన్లో వరి 55 లక్షల మెట్రిక్ టన్నులు, మొక్కజొన్న 14.5, శనగ 5.50, జొన్న 3.50, పసుపు 2.00, మిర్చి 8.50, కంది 1.90, మినుము 2.50, పెసర 0.50 లక్షల మెట్రిక్ టన్నుల మేర దిగుబడులొచ్చాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల మేర పండ్ల ఉత్పత్తులు జరగగా అందులో అరటిని నామ్ కే వాస్తేగా కేవలం 7వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. అరటి గెల రూ.40 నుంచి రూ.50కే అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ ప్రకటనలకు, కొనుగోలుకు ఎంత అగాధం ఉందో అర‌టిధ‌ర చూస్తే అర్థమ‌వుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం రూ.30వేల కోట్ల రూపాయలు పెట్టి రైతుల పంటలను కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదు? అని లోకేష్ ప్రశ్నించారు. అరటి టన్ను లాక్ డౌన్ కు ముందు రూ.15,000 వరకు ఉండగా ప్రస్తుతం రూ.1000 నుంచి రూ.1500 కు కొనుగోలు చేస్తున్నారని, కర్భూజ టన్ను రూ.3 వేలకు, టమోట కేజీ రూ.2కు, కొబ్బరికాయ రూ.7కు కొంటున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లోకేష్ సిఎం దృష్టికి తీసుకు వచ్చారు. ఆక్వా రైతుల విషయంలో ప్రభుత్వం ప్రకటించిన ధరలకు, క్షేత్రస్థాయిలో చెల్లిస్తున్న ధరలకు పొంతన లేదని ఆయన విమర్శించారు. లాక్ డౌన్ నిబంధనల నుంచి వ్యవసాయ ఉత్పత్తులకు సడలింపులు ఇచ్చినప్పటికీ తగిన ప్రయోజనం దక్కడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో రబీ సీజన్లో 22.44 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని తెలిపారు. పంటకోత, రవాణ, ఎగుమతులు, మార్కెటింగ్ సౌకర్యాలు లేక ధరలు సగానికి పైగా పడిపోయాయని, ప్రధానంగా వరి, మొక్కజొన్న, పొగాకు, పసుపు, శనగ, మిర్చి, కంది ఇలా అనేక పంటలు ఉన్నాయని తెలిపారు. రాయలసీమతో పాటు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి, కర్బూజ, పుచ్చకాయలను ఎక్కువగా సాగు చేశారని, ఆయా పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.  ఇప్పటికీ ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లే పూర్తి కాలేదని, రూ.300 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు ఉన్నమాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు రబీ సీజన్లో పంట కోతకు వచ్చిందని, మిర్చి ఇప్పటికీ కల్లాల్లోనే ఉందని, వీటిని కొనే నాథుడే లేడని వాపోయారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామి మాటలకే పరిమితమయిందని విమర్శించారు. ఈ-క్రాప్ బుకింగ్ తో సంబంధం లేకుండా ప్రభుత్వమే మార్కెఫెడ్ ద్వారా అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని లోకేష్ డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, అనంతపురం, కర్నూలు, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయని, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని లోకేష్ సిఎం దృష్టికి తీసుకు వచ్చారు. తక్షణమే నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. వరితో పాటు వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న, నువ్వు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయని, సుమారు 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తోందన్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులకు అకాల వర్షాల ద్వారా మరింత నష్టం చేకూరిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్సారం చేయకుండా రైతులను ఆదుకోవాల్సిన బాధ్య‌త ముఖ్య‌మంత్రిగా మీపై ఉందని జగన్మోహనరెడ్డికి లోకేష్ స్పష్టం చేశారు.

టీకా వచ్చే వరకు జాగ్రత్తలు పాఠించాల్సిందే!

దేశాన్ని కాపాడటంలో ప్రతీ వ్యక్తి భాగస్వామ్యులు కావాలని మంత్రి హ‌రీష్‌రావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తండ్రిలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయ‌న అన్నారు. మెదక్ టౌన్ లోని  ఓ ఫంక్షన్ హాలులో నాయినీ బ్రాహ్మణులకు, పాస్టర్లకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సరుకుల్ని పంపిణీ చేశారు.  కరోనా విపత్తులో పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం బ్యాంకుల్లో డబ్బులు వేస్తోంది. బ్యాంకులో ప్రభుత్వం వేసిన డబ్బులు ఎక్కడికీ పోవు.  డబ్బులు తీసుకోకపోతే వెనక్కి వెళ్లిపోతాయని దుష్ప్రచారం జరుగుతోంది. ఇది తప్పు.  డబ్బులు అవసరం ఉన్న వారు మాత్రమే బ్యాంకుల వద్దకు వెళ్లండి. అందరూ వెళ్లి గందరగోళం సృష్టించవద్దని హ‌రీష్‌రావు విజ్ఞ‌ప్తి చేశారు. నాయినీ బ్రాహ్మణులకు షాపులు తెరవకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతోంది. కరోనా లాక్ డౌన్ నుండి రిలాక్సేషన్ కొంత ఇవ్వడానికి సీఎం గారు ఆలోచిస్తున్నారు.  ఇప్పటికిప్పుడే కరోనా పోదని...నిపుణులు చెబుతున్నారు. సీఎం గారు అంతా ఆలోచన చేస్తున్నారు.   నాయినీ బ్రాహ్మణులు లాక్ డౌన్ ముగిసాక తమ షాపులు తెరిచినా... తప్పకుండా మాస్క్ లు ధరించాలి. ప్ర‌తి ఒక్క‌రూ భౌతిక దూరం తప్పనిసరిగా పాఠించాలని హ‌రీష్‌రావు సూచించారు. వేడి ఆహరం, వేడి నీళ్లు తాగండి, ఫ్రిజ్ లో పెట్టి తినకండి. చల్లటి వస్తువులు తినవద్దు. పసుపును వేడి నీళ్లలో వేసి ఆవిరిపట్టండి.  శానిటైజర్స్ ను వాడండి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోండి. ప్రొటీన్ ఆహార పదార్థాలు, తాజా పండు తినండి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనాకు టీకా వచ్చే వరకు మనం జాగ్రత్తలు పాఠించాలని మంత్రి సూచించారు.

దివిసీమకు  అక్రమ మార్గంలో చేరుకున్న ఉత్తరకోస్తా మత్స్యకారులు

కృష్ణ జిల్లా దివిసీమవాసులకు కొత్త ఆందోళన మొదలైంది. తమిళనాడు నుంచి నాలుగు బోట్లలో 90మందికి పైగా అక్రమ మార్గంలో నాగాయలంక మండలం ఎదురుమొండి దీవులకు చెఱుకున్నారని, వీరంతా శ్రీకాకుళం జిల్లా వెళ్ళాలని చెపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఎదురుమొండి దీవి వాసులు ఆందోళనలో పడ్డారు. వారిని నిలిపేవేసి అధికారులకు సమాచారం అందించిన ఆపదమిత్రలు, గ్రామస్తులు.  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన  మత్స్య కారులు వేటకోసం సముద్రంలోకి వెళ్ళగా లాక్ డౌన్ ప్రభావంతో చెన్నెలో ఉండిపోయారని, త్రాగునీరు సౌకర్యం లేదని అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవని, తినడానికి తిండి దొరకని పరిస్థితి లో  తమ జిల్లాలకు తిరిగి వెళ్లేందుకు సముద్ర మార్గం ద్వారా బయలుదేరారని తెలుపుతున్నారు. సముద్రంలో తుపాను, వర్షం ప్రభావంతో అల్లకల్లోలంగా ఉండటం, వాతావరణం అనుకూలించకపోవటంతో  కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, ఎదురుమొండి దగ్గర కృష్ణానదిలోకి బయటకు వచ్చామని తెలిపారు.  5 బోట్లలో సుమారు 92 మంది మత్య్సకారులు  ఎదురుమొండి చేరారు. ఈ విషయమై, మచిలీపట్నం ఆర్డీఓ ఖాజావలి మాట్లాడుతూ, కొంతమంది మత్స్యకారులు  సముద్ర మార్గంలో ఎదురుమొండి గ్రామానికి చేరుకున్నారన్న సమాచారంతో అధికారులు విచారించగా వారందరూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మత్స్యకారులుగా  తెలిసింది. వీరందరూ చెన్నై నుండి వారి జిల్లాలకు సముద్ర మార్గంలో తిరుగు ప్రయాణంలో ఉండగా సముద్రంలో వాతావరణం సరిగాలేక నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామానికి చేరుకున్నారు. 92 మందికి ఉండేందుకు అన్ని సదుపాయాలూ సమకూర్చామని, వాతావరణం అనుకూలించాక పై అధికారుల ఆదేశాలనుసారం వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేస్తామని ఆర్ డి ఓ చెప్పారు.

హైద‌రాబాద్‌లో ప్లాస్మా దానానికి 32 మంది రెడీ! ఓవైసీ 

కరోనా వైరస్‌కి ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. దీంతో సోషల్ డిస్టెన్స్, మాస్క్ ధరించడం, లాక్‌డౌన్, ఇమ్యునిటీ శక్తిని పెంచుకోవడమే ఆ కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టడానికి మన దగ్గరున్న మార్గం. అయితే ప్లాస్మా థెరపీతో కరోనాను కట్టడి చేయవచ్చని పలువురు వైద్యులు నిరూపిస్తున్నారు. ఈ తరుణంలో కరోనాను జయించిన వాళ్ల ప్లాస్మా.. కరోనా పేషంట్లకు ఇస్తే.. కోవిడ్ నయమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే వీరిలో కొంతమంది ప్లాస్మా ఇచ్చేందుకు విముఖత చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ వ్యవహారంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కలుగజేసుకున్నారు. తానే దగ్గరుండి కరోనా నుంచి కోలుకున్న వారితో మాట్లాడి ప్లాస్మా దానానికి ఒప్పించారు. దాదాపు 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు రెడీ అయ్యారని.. తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్‌, మంత్రి కేటీఆర్‌కు లేఖలు రాశారు. వారి పేర్లను కూడా జత చేస్తూ లేఖను పంపించారు ఎంపీ అసదుద్దీన్. అంతే కాదు కరోనా నుంచి కోలుకున్న ఢిల్లీకి చెందిన 200 మంది తబ్లీగీలు ప్లాస్మా దానానికి ముందుకు వచ్చారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తీవ్ర అస్వస్థులుగా ఉన్న రోగులకు ఆ ప్లాస్మాతో చికిత్స జరుపుతారు. ఇఫ్తార్‌ ముగిశాక తబ్లీగీలు తమ ప్లాస్మాను దానం చేశారని, ఈ సేకరణకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ మహమ్మద్‌ షోయిబ్‌ వెల్లడించారు.