బాయ్ ఫ్రెండ్ వీర్యాన్ని జ్యూస్ తో క‌లిపి తాగేస్తుందట‌!

ఫిట్ నెస్ ట్రైనర్‌గా వ్యవహరించే కిస్ అలా ఎందుకు చేస్తుంది? వీర్యాన్ని జ్యూస్‌తో క‌లిపి ఎందుకు తాగుతోంది? క‌రోనాకు ఈమె అల‌వాటుకు ఏమైనా లింక్ వుందా? సైంటిఫిక్ రీజన్ ఏమిటి? ఇంగ్లండ్ లోని ఏల్స్ బ్యూరీకి చెందిన 32 ఏళ్ల ట్రాసీ కిస్ అనే మహిళ గడిచిన కొద్ది రోజులుగా తన బాయ్ ఫ్రెండ్ వీర్యాన్ని అదే పనిగా జ్యూస్ లో  కలుపుకొని తాగేస్తుందట.  రోగ నిరోధక శక్తి పెంచుకోవటానికి ఇలా చేస్తుంద‌ట‌. ప్రపంచమంతా కరోనా భయాందోళన్లో మునిగి తేలుతున్న వేళ.. దానికి చెక్ చెప్పేందుకు వీలుగా వీర్యాన్ని తాగితే మంచిదన్నది ఆమె భావన. దానికి సైంటిఫిక్ రీజన్ ఏమిటన్న విషయాన్ని క్లియర్ గా చెప్పట్లేదు. వీర్యాన్ని తల్లిపాలతో పోలుస్తోంది ఈ ఫిట్ నెస్ ట్రైనర్‌.  ఆమె.. విటమిన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్లే వీర్యాన్ని తాగుతున్న‌ట్లు చెబుతోంది. తాను 2017 నుంచి వీర్యాన్ని తీసుకుంటున్నట్లు చెబుతోంది. అందులో బోలెడన్ని విటమిన్స్ ఉంటాయని.. ఆ అలవాటు తోనే తనకు ఇప్పటివరకూ జలుబు.. జ్వరం రాకపోవటానికి కారణమని చెబుతోంది.  ఫిట్ నెస్ ట్రైనర్ కిస్ చెబుతున్న విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించ లేదు. కరోనాకు ఇప్పటి వరకూ ఎలాంటి వ్యాక్సిన్ లేదు.

వ్యక్తిగతంగా వచ్చేవారు ఏపీకి రావ‌ద్దు! సీఎం జ‌గ‌న్‌!

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలు మాత్ర‌మే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏపీలో రావ‌డానికి అనుమ‌తిస్తున్నాం. లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిలో వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థులనే అనుమతిస్తామని సిఎం. ప్రకటన చేశారు. అయితే చిక్కుకుపోయిన వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు వారి వివరాలను పరిశీలించి రాష్ట్రంలోకి రావ‌డానికి అవకాశం కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం వ‌ల్ల ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోందని సి.ఎం. జ‌గ‌న్ చెప్పారు. వ్యక్తిగతంగా వచ్చేవారికి అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి మెరుగైన వసతులు కల్పించి, ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి క్వారెంటైన్ త‌రువాతే వారి వారి ఇళ్ల‌కు పంపించ‌నున్నారు.   మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు హైద‌రాబాద్‌లోనే వున్నారు. అయితే ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంపై బాబు ఎలా స్పందిస్తార‌ని ఏపీ ప్ర‌జ‌లు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

టెన్త్ పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు కొత్త రూల్స్!

పదవ తరగతి పరీక్షల నిర్వహణా షెడ్యూల్ని ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.  లాక్ డౌన్ క్రమక్రమంగా ఎత్తి వేస్తున్న తరుణంలో పదవతరగతి పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది.  సామాజిక దూరం పాటిస్తూనే పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఒక పరీక్ష హాలులో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే కూర్చొని పరీక్షలు రాసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.  ప్రతి విద్యార్థికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండడంతో పాటు ప్రతి బెంచ్ కి ఒక్క విద్యార్థి మాత్రమే కూర్చునేలా విద్యాశాఖ కొత్త రూల్స్ తో మార్గ‌ద‌ర్శ‌కాలు త‌యారు చేసింది.  కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కార‌ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎప్పుడో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు ఇప్పటికీ  జరగకుండానే ఉన్నాయి. వైరస్ ప్రభావం తీవ్రంగా పెరిగిపోవడంతో పరీక్షలను వాయిదా వేయక తప్పలేదు.

మూడు మాస్క్‌లు ఏవీ...?: చంద్రబాబు

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మూడు మాస్క్‌లు పంపిణీ చేస్తామన్న మాట గాలికి వదిలేశారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రతి ఒక్కరికి  3మాస్క్ లు పంపిణీ చేయ‌లేద‌ని,  అరకొర చోట్ల ఇచ్చిన మాస్క్ లు కూడా కిరోసిన్ కంపుకొట్టేవి, విద్యార్ధుల యూనిఫామ్ క్లాత్ తో కుట్టినవి కావడంతో అక్కడే పారేసి పోతున్నారు. అదే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున టిడిపి అందజేసిన మాస్క్ ల నాణ్యత ఎంతో బాగుంది. నాణ్యమైన మాస్క్ లు ప్రతి పేద కుటుంబానికి వెంటనే పంపిణీ చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. మద్య నిషేధం పట్ల వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని చంద్రబాబు విమర్శించారు. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సడలిస్తే అక్కడ మద్యం దుకాణాలు తెరిచి ప్రజల రక్తం పిండుకోవడం దారుణమని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులు పండించిన పంటలో పదోవంతు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, పంటలకు ధరలు లేక రైతులు నైరాశ్యంతో ఉన్నారని విమర్శించారు. క్వారంటైన్‌ కేంద్రాల నుంచి 14 రోజుల తర్వాత ఇంటికెళ్లేవారికి రూ.2 వేలు అందిస్తామన్న హామీ కూడా అమలు కాలేదన్నారు. హైదరాబాద్‌ నుంచి  టిడిపి నేతలతో ఆన్‌లైన్‌ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు. మద్దతు ధరల కోసం రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించడం వైసిపి ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమన్నారు. లాక్ డౌన్ తో కోట్లాది పేదలు ఉపాధి కోల్పోయి తినడానికి తిండిలేక అల్లాడుతున్నారని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  పదోవంతు పంటలు కొనలేదనడానికి కోర్టులో ప్రభుత్వ అఫిడవిట్ సాక్ష్యం.  పండించిన పంటలకు ధరలు లేక రైతులంతా నైరాశ్యంలో ఉన్నారు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.   తెలంగాణలో ధాన్యం ఇప్పటికే 21లక్షల మెట్రిక్  టన్నులు కొనగా ఏపిలో కేవలం 4.92లక్షల టన్నులకే పరిమితం కావడం గప్పాలు కాక మరేమిటని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రుల కంటితుడుపు ప్రకటనలే తప్ప రైతులను ఆదుకుంది శూన్యమ‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. కరెంటు బిల్లులు తడిసి మోపెడై అల్లాడుతున్నారు. గతనెల బిల్లు రీడింగ్ కు అదనంగా ఈ నెల రీడింగ్ కలిపి ఆ మొత్తంపై పెరిగిన శ్లాబు ప్రకారం కరెంటు బిల్లులు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం దారుణమ‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రేపటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్లకు అనుమతి...

ఏపీలో కరోనా వైరస్ రాక తర్వాత విధించిన లాక్ డౌన్ కారణంగా మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రేపటి నుంచి తెరవాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతించిన సర్కారు.. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కంటైన్ మెంట్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచేందుకు ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం... తిరిగి రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వడం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.  ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేపటి నుంచి కంటైన్ మెంట్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరుచుకోన్నాయి. అయితే కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ప్ఱభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రకారం ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు కూడా మాస్క్ లు ధరించాలని సూచించింది. ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలు సాగాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా వచ్చే వారికి ముందుగా అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రార్లకు సూచించింది. అలాగే ఉద్యోగుల హాజరు కోసం వాడే బయోమెట్రిక్ యంత్రాలను రోజూ శానిటైజ్ చేయాలని కోరింది. పది మంది కంటే ఎక్కువగా గుమికూడకుండా ఉంచాలని, ఆఫీసులను రోజూ డిస్ ఇన్ ఫెక్షన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. ఇతరులు ఎవరినీ కార్యాలయాలకు అనుమతించరాదని ఆదేశించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట తప్పారు: డీకే అరుణ

రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట తప్పారని అరుణ ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్ర‌భుత్వం ఘోరంగా వైఫ‌ల్యం చెకందింద‌ని ఆమె అన్నారు. రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఆమె హితవు పలికారు.  కేంద్రం ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రానికి  పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నా కూడా టిఆర్ఎస్ నేతలు బిజెపిపై రాజకీయ విమర్శలకు దిగడం సరికాదని అరుణ వ్యాఖ్యానించారు. బిజెపి నేత‌లు కూడా ఈ స‌మ‌యంలో రాజకీయం చేస్తే టీఆర్ఎస్ మంత్రులు ఒక్కరు కూడా బయట తిరగలేని పరిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని డీకే అరుణ ధ‌మ్‌కీ ఇచ్చారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వ పని తీరు, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులో ప్రభుత్వ అలసత్వం వంటి అంశాలపై  తెలంగాణ జేజెమ్మ ప్రభుత్వం పై విరుచుకు పడింది. తెలంగాణ వ్యాప్తంగా రైతులంతా బిజెపి నేతలను సంప్రదిస్తూ కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారని అరుణ వివరించారు.   క‌రోనా వైరస్ వ్యాప్తి, అకాల వర్షాలు, ధాన్యం సేకరణ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నందుకు బిజెపి నేతలపై ఎదురు దాడికి దిగితే సహించేది లేదని టీఆర్ఎస్ మంత్రులను ఆమె హెచ్చరించారు.

నిమ్మగడ్డ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా!

ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్‌పై విచారణ ఈరోజు పున:ప్రారంభం అయింది. ఉదయం 11 గంటలకు హైకోర్టులో నేరుగా విచారణ చేప‌ట్టారు. ఈ క్రమంలో హైకోర్టు సూచన మేరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న న్యాయవాదులకు పోలీసులు పాసులు అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్లో వేరే వారు వస్తుండటంతో నేరుగా విచారించాలని న్యాయవాదులు సూచించడంతో అందుకు ధర్మాసనం అంగీకారం తెలిపింది. నిమ్మగడ్డ  పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇప్పటికే పలు దఫాలు వాదనలు విన్నది. తాజాగా జరిగిన విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై దాదాపు 5 గంటల పాటు వాదోపవాదాలు సాగాయి. పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఆదినారాయణ, నారాయణ వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ మేరకు కోర్టు ముందు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి మరికొన్ని పిటిషన్లు ఉన్నందున, రేపటి విచారణలో మరికొందరు పిటిషనర్ల వాదనలు కూడా వినాలని హైకోర్టు భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలంపై ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీనిపై రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

వైన్స్ షాపుల ఎదుట భారీ క్యూ! పండ‌గ‌చేసుకున్న మందుబాబులు!

మందుబాబుల ఆనందానికి అవధులు లేవు. వైన్స్ షాపుల ఎదుట క్యూ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చాంతాండత క్యూలో నిలబడడం కనిపించింది. కిలోమీటర్ల మేర జనాలు నిలబడ్డారు. ఆంధ్ర‌ ప్రదేశ్‌లో మద్యం కోసం జనాలు బారులు తీరడంతో లిక్కర్ దుకాణాల వద్ద పెద్ద ఎత్తున క్యూలైన్లు కనిపిస్తున్నాయి.  చాలా రోజుల తర్వాత మద్యం షాపులు తెరవడంతో మందుబాబులు అందరూ మద్యం షాపులకు క్యూ కట్టారు. దేవుడా..ఒకే ఒక్క క్వార్టర్ వచ్చే విధంగా చూడు.. తన వంతు వచ్చే వరకు స్టాక్ ఉండాలి దేవుడా.. అంటూ మందుబాబులు..క్యూ లైన్ లో వేచి చూస్తూ దేవుడిని ప్రార్థించుకున్నారు. పెద్ద సంఖ్యలో బాటిళ్లు కొనుగోలు చేశారు. చాలా ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 7 గంటల నుంచే జనాలు బారులు తీరి కనిపించడం విశేషం. కొన్ని ప్రాంతాల్లో సామాజిక దూరం నిబంధనను సైతం మందుబాబులు గాలికి వదిలేశారు. దీంతో మద్యం దుకాణాల యజమానులు షాపుల బయట సర్కిల్స్ గీసి నిలబెట్టారు. కాగా మద్యం షాపుల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించ‌డం లేద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. బెంగుళూరులో మ‌హిళ‌లు కూడా లైన్‌లో నిల‌బ‌డ్డారు. విశాఖ‌, సిరిపురం, చిత్తూర్‌, నెల్లూరు, దుగ్గిరాల‌, పెద్ద‌పాలెం దృశ్యాలు  సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి.  తమకు పండుగ రోజు అంటూ కొంతమంది మందుబాబులు వెల్లడిస్తున్నారు. పండుగ రోజు ఎంత సంతోషంగా ఉంటారో..అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉండడం కనిపించింది. కొంతమంది గుర్తు పట్టకుండా ఉండేందుకు హెల్మెట్, పెద్ద పెద్ద టవల్స్, మాస్క్ లు ధరించి క్యూలో నిలబడ్డారు. ఎంతో నిరీక్షణతో ఎదురుచూస్తున్న మందుబాబులకు ప్రాణం లేచి వచ్చినంత పనయ్యింది. ఇక మద్యం షాపులు తెరిచి ఉండడంతో ఎప్పుడెప్పుడు మద్యం కొనుగోలు చేసి తాగుదామా అన్నట్లుగా నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు మందు షాపుల వద్ద. కానీ కొన్ని చోట్ల మాత్రం మందుబాబుల ఆశలపై నీళ్లు చల్లారు మహిళలు. మద్యం షాపులను తెరవద్దు అంటూ ఆందోళనకు దిగారు. నగరంలోని రేణిగుంట మండలం పాపానాయుడుపేట వద్ద సోమవారం మహిళలు ఆందోళనకు దిగారు. ఇళ్ల మధ్యలో ఉన్న బ్రాందీ షాప్‌లను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. పోలీసుల జోక్యంతో మూడు మద్యం షాపులను తాత్కాలికంగా మూసివేశారు.  విజ‌య‌వాడ నగరంలో మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేటి నుంచి మద్యం దుకాణాలు తెరువనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఉదయం నుంచి మద్యం ప్రియులు వైన్ షాపుల వద్ద బారులు తీరారు. అయితే విజయవాడ రెడ్‌జోన్ కావడంతో మద్యం షాపులు తెరవవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో సూపర్ వైజర్లు మద్యం షాపులను మూసివేసి సీల్ వేసి వెళ్లిపోయారు.

పోలీసులపై వలస కూలీల దాడి

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో వలస కూలీల ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. తమ స్వస్థలాలకు పంపించాలని ఉదయం నుంచి వలస కార్మికులు ఆందోళనకు దిగారు. కొవ్వూరు ప్రధాన రహదారిపైకి ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌ ,ఒడిశాకు చెందిన 300 మందికిపైగా వలస కూలీలు చేరి ధర్నా చేపట్టారు. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులపై రాళ్లు, సీసాలతో వలస కూలీలు దాడి చేశారు. లాఠీఛార్జి చేసి వలసకూలీలను పోలీసులు చెదరగొట్టారు.  సొంత రాష్ట్రాలకు పంపాలని జాతీయరహదారిపై వలసకూలీలు ఆందోళన చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి అనుమతి వచ్చే వరకు పంపలేమని పోలీసులు చెబుతున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న డీఎస్పీ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కూలీలను తరలించేందుకు ఆయా రాష్ట్రాల నుంచి అనుమతులు వచ్చేంత వరకూ పంపించలేమని చెప్పారు. అయితే శాంతించని వలస కూలీలు పోలీసులపై రాళ్లు, సీసాలు విసిరి దాడికి దిగారు. దీంలో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. కూలీలు నడిచి వెళతామని పట్టుపడటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వీరంతా గోదావరి నదిలో ఇసుక కార్మికులుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. అయితే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

కరోనాతో కలసి జీవించాల్సిందే! కేటీఆర్

అద్భుత అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత్ కు ఇదొక అవకాశం. వ్యాక్సిన్ కనుక్కునేంత వరకు కరోనాతో బతకాల్సిందే, పూర్వ పరిస్థితికి చేరడానికి చాలా కష్టపడాలి. రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలి. కరోనాతో కలిసి జీవించడాన్ని ప్రజలంతా నేర్చుకోవాలని... ఈ మహమ్మారికి ఔషధం లేదా వ్యాక్సిన్ కనుక్కునేంత వరకు ఇది తప్పదని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.  వైరస్ కు వ్యాక్సిన్ లేదనేది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న రేటు... వైరస్ సోకుతున్న రేటు కంటే ఎక్కువగా ఉందని తెలిపారు. వ్యాధిని నివారించిన తర్వాత... పూర్వ పరిస్థితులకు చేరుకునేందుకు పెద్ద ఎత్తున కృషి చేయాల్సి ఉంటుందని చెప్పారు. కరోనా కట్టడి కోసం భారత్ చేస్తున్న కృషి అద్భుతమని... మహమ్మారిపై పోరాటంలో కేంద్రంతో పాటు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. కరోనా అనంతం ఇతర దేశాల్లోని కంపెనీలు తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో, అవసరమైన మౌలికవసతుల కల్పన కోసం రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు.  చైనా నుంచి తయారీ రంగాన్ని అందిపుచ్చుకోవడానికి భారత్ కు ఇదొక అద్భుత అవకాశమని తెలిపారు.  ప్రపంచ స్థాయి  ప్రమాణాలతో హైదరాబాద్ లో నిర్మిస్తున్న ఔషధ నగరికి మౌలికవసతుల కల్పనకు రూ. 4 వేల కోట్లను కేంద్రం సమకూర్చాలని విన్నవించారు. కరోనా తర్వాత వ్యాపారం కొత్త పంథాలో సాగుతుందని చెప్పారు. ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపాలని... వారిలో స్ఫూర్తిని కలిగించడం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు పెను సవాలని కేటీఆర్ అన్నారు. ప్రతి ఉద్యోగికి వ్యక్తిగత పరిశుభ్రత లక్ష్యంగా మారాలని చెప్పారు. కంపెనీలు మానవ వనరులకు తగ్గించడం సరికాదని తెలిపారు.

వలస కూలీల రైలు ఛార్జీలు కాంగ్రెస్సే భరిస్తుంది! సోనియా గాంధీ

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకొని తమ స్వస్థలాలకు వెళ్లాలనుకుంటున్న వలస కూలీల రైలు ఛార్జీలు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్‌ శాఖలే భరిస్తాయని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో ఇబ్బందిపడుతున్న కార్మికులకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీరందరినీ వారి ప్రాంతాలకు సురక్షితంగా, ప్రభుత్వ ఖర్చులతో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్న కాంగ్రెస్‌ పార్టీ విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ పెడచెవిన పెడుతోందని ఆరోపించారు.  అనేక మంది కూలీలు ఆహారం, నీరు, మందులు, డబ్బు లేకుండానే కాలినడన బయలుదేరారని గుర్తుచేశారు. కూలీల సమస్యల్ని పరిష్కరించడంలో భాజపా సర్కార్‌ ఘోరంగా విఫలమైందని సోనియా విమర్శించారు.  విదేశాల్లో నిలిచిపోయిన ప్రవాసుల్ని విమానాల ద్వారా భారత్‌కు తీసుకొచ్చినప్పుడు.. దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కూలీల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కేంద్రాన్ని సోనియా ప్రశ్నించారు. గుజరాత్‌లో ఓ కార్యక్రమానికి జనాన్ని సమీకరించేందుకు, వారికి భోజన వసతి కల్పించేందుకు దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం పేద కూలీల కోసం ఈ మాత్రం చేయలేదా అని నిలదీశారు.  పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.151 కోట్ల నిధుల్ని విరాళంగా ఇచ్చిన రైల్వే శాఖ వలస కార్మికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించలేదా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి వలస కార్మికులకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ తలెత్తలేదని సోనియా అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ స్పందించి పేద కూలీలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిందన్నారు.

మద్యం ధరల పెంపు పేదల రక్తం పిండుకోడమే: యనమల

టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కరోనా నేపథ్యంలో ప్రజలపై పన్నులు వేసిన ప్రభుత్వం ప్రపంచంలో లేదు. ఇది పన్నులు వేసే సందర్భం కాదు, ధరలు పెంచే సందర్భం అంతకన్నా కాదు. ఆపన్నులను ఆదుకునే సందర్భం, బాధితులకు సహాయపడే సందర్భం. ఒకవైపు కరోనాతో అనేకమంది అనారోగ్యం పాలు, మరోవైపు ప్రజారోగ్యంతో వైసిపి చెలగాటం.  మద్యం ధరలు 25% పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ప్రజలపై రూ5వేల కోట్ల భారం మోపడాన్ని గర్హిస్తున్నాం. మద్యం కంపెనీల ఒత్తిళ్ల మేరకే ఇప్పుడీ ధరల పెంపు నిర్ణయం. ఇప్పటికే భారీగా ఉత్పత్తులకు మద్యం కంపెనీలకు అనుమతిచ్చారు. మద్యం కంపెనీల మేళ్ల కోసం, కమిషన్ల కోసమే ప్రజారోగ్యంతో చెలగాటం.  ఇప్పటికే రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోంది. నాసిరకం మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి. వైసిపి నాయకులే నాటుసారా తయారీ వెనుక ఉన్నారని, వాలంటీర్లతో అమ్మిస్తున్నారని మీడియాలో చూశాం. ఇప్పుడీ నిర్ణయంతో నాటుసారా తయారీ, నాసిరకం మద్యం అమ్మకాలు మరింత పేట్రేగుతాయి.  ఒకవైపు దేశం అంతా లాక్ డౌన్ కొనసాగుతున్నా మన రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకాలు పేట్రేగాయి. దుకాణాల్లో మద్యం దొడ్డిదారిన తరలించి అక్రమ అమ్మకాలు జరిపారు. ఎలుకలు మద్యం తాగాయని చెప్పడం దారుణం. ఎలుకలు ఇనుము తిన్నాయని గతంలో కథల్లో విన్నాం. ఎలుకలు మద్యం తాగాయని వైసిపి పాలనలో చూస్తున్నాం. పేదల సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం ఇచ్చింది సగం అయితే గుంజుకుంటోంది రెట్టింపు. గత ఏడాదిగా ఇప్పటికే ప్రజలపై భారీగా భారాలు. ఆర్టీసి ఛార్జీల పెంపు, కరెంట్ బిల్లుల పెంపు, ఇసుక ధర పెంపు.. ఇప్పుడీ మద్యం ధరల పెంపు పేదల రక్తం పిండుకోడమే.. అసలే కష్టాల్లో ప్రజలు ఉంటే, వారిని ఆదుకునే చర్యలు చేపట్టకుండా మరిన్ని కష్టాల్లోకి నెట్టడం గర్హనీయం. పోషకాహారం అందించి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా బైట రాష్ట్రాలు, విదేశాలు చేస్తుంటే, మన రాష్ట్రంలో పోషకాహారం ఇవ్వకపోగా మద్యం అందుబాటు పెంచడం, మద్యం ధరలు 25% అదనంగా పెంచడం హేయనీయం. దశలవారీ మద్య నిషేధం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, ప్రభుత్వ మద్యం దుకాణాలు పెద్దఎత్తున తెరిచారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను దారుణంగా మోసం చేశారు. వైసిపి మోసాలకు బలైన ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. మద్యం ధరల నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

మద్యం షాపుల ముందు దృశ్యాలు చూసి షాక్ అయ్యాను!

వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు ఏపీలో కరోనా విజృంభిస్తోంది. అయినా ముఖ్య‌మంత్రి జగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ఇదెక్క‌డి దారుణం. కిలోమీటర్ల మేర క్యూలు కట్టారు. భౌతిక దూరం పాటించట్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల ముందు మందుబాబులు కిలోమీటర్ల మేర క్యూలు కట్టడం, భౌతిక దూరం పాటించకపోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను ఆయన పోస్ట్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల ముందు ఈ దృశ్యాలను చూసి షాకయ్యాను. మద్యం షాపుల ముందు మద్యం ప్రియులు భారీగా చేరుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ జగన్‌ ముందస్తు ప్రణాళికలు వేసుకోలేదు. సామాజిక దూరం నిబంధనలు పాటించాలన్న జాగ్రత్తలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలోనూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి' అంటూ ఆయన మండిపడ్డారు.

ఏపీలో 1650కి చేరిన పాజిటివ్ కేసులు!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,292 శాంపిళ్లను పరీక్షించగా 67 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,650గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 524 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,093గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 1, గుంటూరులో 19, కపడలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, విశాఖపట్నంలో 6 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో మొత్తం కేసులు 491కి చేరాయి.

అక్ర‌మ‌సంబంధాల గుట్టు విప్పుతున్న క‌రోనా!

క‌రోనా ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. గుట్టుగా సాగుతున్న అక్ర‌మ‌సంబంధాల్ని సైతం ర‌ట్టు చేస్తోంది. క‌థ‌లు క‌థ‌లుగా బుద్ధిమంతుల బంఢారం బ‌య‌ట‌ప‌డుతోంది. క‌రోనా పాజిటివ్‌గా వ‌స్తే పేషంట్‌తో పాటు అత‌ని ప్రైమ‌రీ, సెంకండ‌రీ కాంట్రాక్ట్‌లపై పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. సెల్‌ఫోన్ లిస్ట్ ఆధారంగా విచార‌ణ చేస్తున్నారు. పోలీసు ఎంక్వైరీల్లో షాకింగ్ విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. బుద్ధిమంతుల ముసుగు వారు చేసిన త‌ప్పుడు ప‌నుల‌న్నీ బ‌య‌ట ప‌డుతున్నాయి.  బోపాల్‌లో ఓ అమ్మాయికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రండ్ వున్నాడ‌నే విష‌యం ఎవ‌రికీ, ఇంట్లోవాళ్ళ‌కు కూడా  తెలియ‌దు. అయితే పోలీసులు ఆ అమ్మాయి ఫోన్‌పై నిఘా పెట్టారు. ఎవ‌రెవ‌రితో కాంట్రాక్ట్‌లో వుంటుందో లిస్ట్ తీశారు. అలా బాయ్ ఫ్రెండ్ బ‌య‌ట‌ప‌డ్డాడు. వెంట‌నే అత‌న్ని టెస్ట్ చేస్తే అత‌నికి పాజిటివ్ తేలింది.  దీంతో షాక్‌కు గురైన పోలీసులు అత‌డు ఇంకెవ‌రితోనైనా కాంట్రెక్ట్‌లో వున్నాడా?  ఫోన్‌లో ఈ మ‌ధ్య కాలంలో ఎవ‌రితో మాట్లాడాడు లిస్ట్ తీశారు. అంతే ఇక్క‌డా కూడా పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఈ అబ్బాయికి మ‌రో గ‌ర్ల ఫ్రెండ్ వుంది. త‌ర‌చూ ఆమెను క‌లుస్తూ వుండే వాడని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ అమ్మాయికి టెస్ట్ చేశారు. ఆమెకు కూడా పాజిటివ్ వ‌చ్చింది.  ఈ చైనా ఇంత‌టితో ఆగ‌లేదు. ఊహించ‌ని రీతిలో మొద‌టి అమ్మాయి ద్వారా ఇంకో అబ్బాయికి క‌రోనా సోకింది. దీంతో ఆమె ఇద్ద‌రు అబ్బాయిల‌తో ల‌వ్ ఎఫైర్ న‌డిపింద‌ని బ‌య‌ట ప‌డింది. ఇదే ప్రాంతంలో ఇలాంటిదే మ‌రో విచిత్ర‌మైన కేసును పోలీసులు ఛేదించారు. లాక్‌డౌన్ వున్నా ప్ర‌తి రోజూ ఆఫీసుకు వెళ్ళే వ్య‌క్తికి క‌రోనా సోకింది. అయితే ఇంటి చుట్టుప‌క్క‌లా కానీ, అత‌ని ఫ్రెండ్స్‌కు కానీ, ఆఫీసులో కానీ ఎవ‌రికైనా క‌రోనా వుందా అని ఆరా తీస్తే అలాంటిదేమీ లేదు. అయితే ఈ వ్య‌క్తి ఆఫీసు ముగిసిన త‌రువాత త‌న సెకెండ్ సెట‌ప్ ద‌గ్గ‌ర‌కు వెళ్తున్న‌ట్లు పోలీసులు ఫోన్ లిస్ట్ ద్వారా గుర్తించారు.  ఆమెకు టెస్ట్ చేస్తే క‌రోనా పాజిటివ్ వుంది. ఇద్ద‌రికీ పాజిటివ్ తేల‌డంతో ఇద్ద‌ర్నీ ఐసొలేష‌న్ వార్డుకు త‌ర‌లించారు. అయితే ఈమె ద్వారా ఇంకెవ‌రికైనా వ‌చ్చిందా అని పోలీసులు ఆమె పోన్ లిస్ట్‌పై దృష్టి పెట్టి విచార‌ణ చేప‌ట్టారు.   గుట్టు చ‌ప్పుడు కాకుండా జ‌రిగిన వ్య‌వ‌హారాల‌న్నీ క‌రోనా పుణ్య‌మా అని వెలుగులోకి వ‌స్తున్నాయి. కరోనా క‌ట్ట‌డికి అధికారులు తీస్తున్న కాంట్రెక్ట్ లిస్ట్‌ల‌తో కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. బుద్ధిమంతులా న‌టించే వారి బండారాన్ని బ‌ద్ధ‌లై కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి.

ఆగిన మగ్గం! నేతన్నల ఆక‌లి కేక‌లు! స్థంభించిన కోట్లది రూపాయ‌ల లావాదేవీలు!

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత ప్రతీక. ఆ వస్త్రాలు ధరిస్తే రాజసం ఉట్టిపడుతుంది. అయితే లాక్‌డౌన్ నేప‌థ్యంలో వేలాది మంది జీవనోపాధికి భరోసానిచ్చిన చేనేత రంగం ఇప్పుడు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కక కష్టాలతో కునారిల్లుతోంది. మ‌రోప‌క్క‌ పెరిగిన ముడి సామగ్రి ధరలు, ఇంటిల్లిపాది శ్రమించినా గిట్టుబాటు దక్కక నేతన్నలు కన్నీళ్లుపెడుతున్నారు. ఆకలికేకలు, తెగిపోతున్న పోగుబంధంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల‌ని వారు కోరుతున్నారు.   దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితుల్లో చేనేత మగ్గాలు ఆగిపోయి నేతన్నలు ఆకలితో బాధపడుతున్నారు. కరోనా నేతన్నను  పూర్తిగా ముంచేసింది. నేచిన చీరలు అమ్ముడుపోక అవస్థలు ప‌డుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దుకాణాలు మూతపడటం, రవాణా రంగం స్తంభించడంతో  చేనేత రంగం నష్టాల బాటపట్టింది. వెంకటగిరి కేంద్రంగా చేనేత వస్త్రాల వ్యాపారం జోరుగా సాగుతుంది. రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మేర వ్యాపార లావాదేవీలు నడుస్తాయి. అయితే, ఒక్కసారిగా దుకాణాలు మూతపడటంతో  కోట్లది రూపాయ‌ల లావాదేవీలు ఆగిపోయాయి.   రాష్ట్రంలో మాస్టర్స్ బేవర్స్ మరియు చేనేత సంఘాల వ‌ద్ద  పేరుకుపోయిన నిల్వ‌ల‌ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి చేనేత రంగాన్ని కాపాడాలి.  రంగులను డిపోల ద్వారా అందించి చేనేత కార్మికులకు పని కల్పించాలి. లేనిచో కార్మికుల్లో ఆకలి చావులు ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది.

5 ప్రధాన నగరాల్లో పెరిగిన అద్దెలు! గిరాకీ తగ్గినా అద్దె పెరిగింది!

దేశంలో హైదరాబాద్‌ సహా 5 ప్రధాన నగరాల్లో ఆఫీసు కార్యాలయాల అద్దెలు ఏడాది వ్యవధిలో 8 శాతం వరకు పెరిగాయని అమెరికాకు చెందిన స్థిరాస్తి కన్సల్టెంట్‌ వెస్టియన్‌ నివేదిక వెల్లడించింది. 2020 జనవరి-మార్చిలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్‌కతా నగరాల్లో కార్యాలయాల స్థలాలకు గిరాకీ 3 శాతం తగ్గినా, ఏడాది క్రితంతో పోలిస్తే అద్దెలు మాత్రం 8 శాతం వరకు పెరిగింది.  చదరపు అడుగు సగటు అద్దె బెంగళూరులో రూ.75.5 ఉండగా, హైదరాబాద్‌లో రూ.62గా ఉంది. చెన్నైలో  చ.అడుగుకు రూ.60 ఉండగా, ముంబయిలో  చ.అడుగుకు రూ.125గా ఉంది. కోల్‌కతాలో మాత్రం కార్యాలయాల అద్దె  చ.అడుగుకు రూ.48గా ఉంది. 2020 జనవరి-మార్చి మధ్య కాలంలో ఈ ఐదు న‌గ‌రాల్లో సుమారు 91.8 లక్షల చదరపు అడుగుల కార్యాలయాల స్థలాల్ని అద్దెకు తీసుకున్నారు. 2019 ఇదే కాలంతో పోలిస్తే ఇది 3 శాతం తక్కువ. తొలి రెండు నెలల్లోనే అధిక భాగం కార్యాలయాల స్థలాల్ని అద్దెకు తీసుకున్నారు. కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ ప్రకటించగానే చాలా వరకు పెద్ద స్థాయి లీజింగ్‌ నిర్ణయాలు వాయిదా పడ్డాయి. బెంగళూరులో 11 శాతం తగ్గి, 35.3 లక్షల చదరపు అడుగులకు, కోల్‌కతాలో 57 శాతం తగ్గి, 1.5 లక్షల చ.అడుగులకు, హైదరాబాద్‌లో 25 శాతం తగ్గి, 16.4 లక్షల చ.అడుగులకు గిరాకీ పరిమితమైంది. ముంబయిలో మాత్రం గిరాకీ 31 శాతం పెరిగి 23.9 లక్షల చ.అడుగులకు, చెన్నైలో 23 శాతం వృద్ధి చెంది, 14.7 లక్షల చ.అడుగులకు చేరింద‌ని స్థిరాస్తి కన్సల్టెంట్‌ వెస్టియన్‌ నివేదిక తెలిపింది. 2020 తొలి త్రైమాసికంలో 75 లక్షల చదరపు అడుగుల కొత్త కార్యాలయాల స్థలాలు ఈ 5 నగరాల్లో కలిపి  సిద్ధమయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే ఇది 22 శాతం తక్కువ అని నివేదిక విశ్లేషించింది.

ఐదు వేల కోట్లు బాదుడు! ఖజానా నింపుకోవడానికే ధ‌ర‌ల పెంపు!

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మద్యం ధరలు పెంచాల్సి వస్తోందని ప్రభు త్వం చెబుతున్నా ఆదాయం పెంచుకోవడమే అస లు ఉద్దేశంగా కనిపిస్తోంది.  అయితే ప్రజారోగ్యం, నిషేధం వంటివి సాకు మాత్రమేనని కరోనా కష్టకాలంలో ఖజానాను నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆదాయం లేక విలవిల్లాడుతున్న ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా మద్యం ఒక్కటే కనిపిస్తోంది.  గతేడాది అధికారంలోకి రాగానే సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 20% దుకాణాలను అంటే 4,380 షాపులను 3,500కు తగ్గించారు. బెల్టుషాపులను పూర్తిగా తొలగించారు. అంతేకాదు మద్యం అక్రమ రవాణాను, తయారీని నిరోధిస్తూ శిక్షలను గణనీయంగా పెంచుతూ చట్టాలు తీసుకొచ్చారు. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా మద్యం అమ్మకాలకు అనుమతించడంతో షాపుల వద్ద భౌతిక దూరాన్ని అమలుచేయనున్నారు. మద్యం అమ్మకాల వేళలను నియంత్రించనున్నారు.  మూడో దశ లాక్‌డౌన్ లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే సమయంలో మద్యం షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరి చేసింది. ఒకేసారి ఐదుగురికి మాత్రమే మద్యం షాపుల వద్ద అనుమతి ఇవ్వనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే కాసేపు షాపుల మూసివేయనున్నారు. మద్యం అమ్మకాలు తగ్గించేందుకే ధరలు పెంచినట్టు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పెరిగిన మద్యం ధరలు.. బీరు 330ml - పెరిగిన ధర 20రూ. 500/650ml -30 రూ. 30000ml -  2000రూ. 50000ml- 3000రూ. రెడీ టూ డ్రింక్ 250/275ml. - 30రూ.పెరుగుదల 180ml ధర 120రూ.కంటే తక్కువ ఉన్న వాటిపై పెంపు 60/90ml.- 10రూ.పెరుగుదల 180 ml - 20రూ.పెరుగుదల 375ml - 40రూ.పెరుగుదల 750ml - 80రూ.పెరుగుదల 1000ml -120రూ.పెరుగుదల 2000ml - 240రూ.పెరుగుదల 180ml ధర 120 నుంచి 180 రూ.మధ్యలో ఉన్న వాటిపై పెంపు 60/90ml.- 20రూ.పెరుగుదల 180 ml - 40రూ.పెరుగుదల 375ml - 80రూ.పెరుగుదల 750ml - 160రూ.పెరుగుదల 1000ml -240రూ.పెరుగుదల 2000ml - 480రూ.పెరుగుదల 150రూ.కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై పెంపు 60/90ml.- 30రూ.పెరుగుదల 180 ml - 60రూ.పెరుగుదల 375ml - 120రూ.పెరుగుదల 750ml - 240రూ.పెరుగుదల 1000ml -360రూ.పెరుగుదల 2000ml - 720రూ.పెరుగుదల ₹120 లోపు క్వార్టర్ బాటిల్ పై రూ.20పెంపు ఆఫ్, బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ పై రూ.80పెంపుధర పెరిగినా షాపుల వద్ద రద్దీ తగ్గదు. క్షణాల్లో సరుకు ఖాళీ అవడం ఖాయం.  ‘ప్రొహిబిషన్‌ ట్యాక్స్‌’ ద్వారా మద్యం ధరలను పెంచారు. మద్యం బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే 25 శాతం అదనం. ఉదాహరణకు ఒక మద్యం బాటిల్‌ ధర రూ.300 ఉందనుకుంటే 25 శాతం ధర పెంచి రూ.375కి విక్రయిస్తారు.  రాష్ట్రంలో గతేడాది జరిగిన మద్యం అమ్మకాల విలువకు 25 శాతం ఆదాయం కూడా కలిపితే కొత్తగా రూ.4,406 కోట్లు వస్తుంది. దానికి ఏటా వచ్చే సాధారణ వృద్ధిని కలిపితే దాదాపు రూ.5వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది.  నిజంగా దుకాణాల వద్ద రద్దీని నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యం అయితే పోలీసులను పెట్టి అమ్మకాలు జరపొచ్చు. మద్య నిషేధమే లక్ష్యమైతే లాక్‌డౌన్‌తో వచ్చిన అవకాశంతో షాపులను పూర్తిగా బంద్‌ చేయవచ్చు.  హడావిడిగా ధరలు పెంచి షాపులు తెరవాల్సిన అవసరం ఏమిటి?

గుడుంబా తయారీని ఉక్కుపాదంతో అణిచివేస్తాం!

తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా తయారీని ఉక్కుపాదంతో అణిచి వేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో  సి ఐ, మరో ముగ్గురు కానిస్టేబుళ్లపై కిష్టరం తాండ లో  గుడుంబా తయారీదారులు దాడి చేయగా దాడిలో గాయపడిన ఎక్సైజ్  సి ఐ ని, సిబ్బందిని మంత్రి  జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయం వద్ద పరామర్శించి మీడియాతో మాట్లాడారు. గుడుంబా తయారు చేస్తున్న వారిని ఉక్కుపాదంతో అణిచి వేస్తామని అన్నారు. అంతేకాక  పిడి యాక్ట్ తో పాటు ఇతర చట్టాలను కూడా ఉపయోగిస్తామన్నారు.  ప్రణాళికాబద్ధంగా ఎక్సైజ్, పోలీస్ శాఖల సంయుక్త సహకారంతో గుడుంబాను అణిచివేస్తామన్నారు. గుడుంబా నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత  అని అన్నారు. ప్రజలు  ప్రాణాలు తమకు ముఖ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు గారు   గుడుంబా రహిత  తెలంగాణగా తీర్చిదిదామన్నారు. అయితే కొందరు  లాక్ డౌన్ ను   అదనుగా తీసుకొని ఇతర రాష్ట్రాల నుండి  బెల్లం ఇతర పదార్థాలు తీసుకువచ్చి ఆక్రమంగా గుడుంబా తయారు చేయడం బాధాకరమన్నారు. అయినప్పటికీ ఇలాంటి తయారీదారులను  అరికడతామని  మంత్రి పునరుద్ఘాటించారు. సిబ్బంది దాడులను ధైర్యంగా ఎదుర్కోవడమే కాక గుడుంబా స్థావరాలను ధ్వంసం చేసి రావడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు ముఖ్యమని  కరోనా  లాక్ డౌన్ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా ఉద్యోగులకు లక్ష 70 వేల శాని టైజర్లను  రాష్ట్రంలో పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. లాక్ డౌన్ కారణంగా మందు దొరకనందున కొంతమంది తాగుడుకు బానిసైన వారు దొంగతనంగా గుడుంబా తయారు చేయడం, షాప్ ల లో దొంగతనం గా అమ్మటం వంటివి చేస్తున్నారని అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గుడుంబా రహిత తెలంగాణ గా తీర్చిదిద్దేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి  పునరావాసం కల్పించడం జరిగిందని, దీనివల్ల తండాలలో గుడుంబా తయారు చేసే వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటమే కాకుండా, వారు వివిధ జీవనోపాధి పొందారని, ముఖ్యంగా చాలా మంది గుడుంబా తయారీదారులు ఆటోలు, మేకలు ఇతర వ్యాపారాలను చూసుకున్నారని తెలిపారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడం , వ్యవసాయ పనులు పెరిగిపోవటం వల్ల గిరిజన ప్రాంతాలలో గుడుంబా తయారుచేసే సంస్కృతి తగ్గిపోయిందని ఆయన తెలిపారు. అయితే  లాక్ డౌన్ కారణంగా   గుడుంబా  అక్రమంగా తయారు చేయడం  బాధాకరమని మంత్రి తెలిపారు. అయినప్పటికీ తాము ఎలాంటి వారిని వదిలిపెట్టమని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని అసలు సహించమని హెచ్చరించారు. కొంతమంది కెమికల్స్ ను ఉపయోగించి కూడా గుడుంబాను తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ,అలాంటి వారిని కూడా వదలబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాలలో అభివృద్ధిలో  ముందుందని, రాష్ట్రంలో పేద ప్రజలకు అవసరమైన ఆసరా పెన్షన్లు, పాఠశాలలు  ఇతర అన్ని రకాల సేవలు అందిస్తున్నామని ,ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎక్కడైనా  గిడుంబా తయారు చేస్తున్నట్లు అనుమానం వస్తే యువకులు తక్షణమే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని ,అంతకాక మీడియా కూడా గుడుంబా నిర్మూలనలో ముఖ్యమైన పాత్ర పోషించాలని మంత్రి  కోరారు.