ఏపీకి కేంద్ర బృందాలు! విశాఖపైనే ఎక్కువ దృష్టి?

కరోనా కల్లోలాన్ని అంచనా వేసేందుకు.. ఇప్పటికే తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం, త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనుంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో వెల్లడించడం విశేషం. నిజానికి గత వారం రోజుల నుంచి దీనిపై వార్తలు వెలువడుతున్నప్పటికీ, అది నిర్ధారణ కాలేదు. కిషన్‌రెడ్డి తాజా వ్యాఖ్యలతో అది నిజం కానుంది. కేంద్ర హోం, ఆరోగ్యశాఖ అధికారులు ఈ బృందంలో ఉండనున్నారు.  ఏపీలో జరుగుతున్న కరోనా పరీక్షలు, క్వారంటైన్లలో వసతి సౌకర్యాలు, కిట్ల వాడకం, ఆసుపత్రులలో సౌకర్యాలు, కేంద్రం పంపిస్తున్న కిట్లు, మాస్కుల వినియోగం వంటి అంశాలను ఈ బృందం తనిఖీ చేస్తుంది. పశ్చిమ బెంగాల్‌లో ఈ బృందానికి.. అక్కడి సీఎం మమతబెనర్జీ తొలుత సహాయ నిరాకరణ చేయడంతో, కేంద్ర హోం శాఖ కన్నెర చేసింది. దానితో మమత సర్కారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దానితో కేంద్రబృందాల పని సుగమమం అయింది.  ప్రస్తుతం తెలంగాణలో కూడా కేంద్రబృందాలు పర్యటిస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో  జగన్మోహన్‌రెడ్డి  ప్రభుత్వం మొదటి నుంచీ.. కరోనా వైరస్‌ను తక్కువ చేసి చూపించడంతోపాటు, కేసులు-మరణాల సంఖ్యను కావాలనే దాచిపెడుతోందని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీనిపై అందరికంటే ముందుగానే అనుమానం వ్యక్తం చే శారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని ఆయన అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  ఆ తర్వాతనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అలాంటి సందేహాలనే వ్యక్తం చేశారు. పైగా… వైసీపీ ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా జిల్లా సరిహద్దులు దాటి.. లాక్‌డౌన్ నిబంధన ఉల్లంఘిస్తున్నారని  బీజేపీ-టీడీపీ,  ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మరో అడుగుముందుకేసి.. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వ్యవహారంపై కేంద్ర బృందాలతో విచారణ జరిపించాలని లేఖ రాసింది.  దాని ఫలితంగానే  కేంద్ర బృందాలు రాష్ట్రానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగా.. కేంద్ర బృందాలు ప్రధానంగా విశాఖ, కర్నూలు, గుంటూరు, విజయవాడ నగరాలపై ఎక్కువ దృష్టి సారించనున్నట్లు సమాచారం.  రాజధానిని తరలించాలని సర్కారు పట్టుదలతో ఉన్నందుకే..  విశాఖలో ఎక్కువ కేసులు వస్తున్నా, వాటిని తక్కువ చూపించే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ-టీడీపీ ఇప్పటికే ఆరోపణ చేస్తున్నాయి. విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ యధేచ్చగా విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం జిల్లాలకు తిరుగుతున్నారని, ఆయనతోపాటు వైసీపీ కార్యకర్తలు సామాజిక దూరం పాటించకుండా, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఫిర్యాదు చేశాయి.  విశాఖలో ఎయిర్‌పోర్టు, నౌకాయానకేంద్రం ఉన్నందున, విదేశాల నుంచి ఎక్కువమంది వస్తుంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు. పైగా విశాఖకు చెందిన కొందరు ముస్లింలు మర్కజ్‌కు వెళ్లి వచ్చినప్పటికీ, అక్కడ ఎక్కువ కేసులు నమోదు కాకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. అసలు కరోనా కేసులు లేని శ్రీకాకుళం జిల్లాలో కూడా కేసులు నమోదు కావడం బట్టి, ఉత్తరాంధ్ర విషయంలో ప్రభుత్వం నిజాలు దాచిపెడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.  కేంద్రబృందాలు వస్తే తప్ప నిజాలు బయటపడవని భావించిన బీజేపీ నాయకత్వం, ఆ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. అటు పార్టీపరంగా కూడా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, తమ జిల్లా నేతలతో రోజూ టెలీకాన్ఫరెన్సు నిర్వహిస్తూ, కరోనా కేసులపై ఆరా తీస్తున్నారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కేసులు పెరగడానికి వైసీపీ ప్రజాప్రతినిధులే కారణమని ఇప్పటికే ఆ రెండు పార్టీలు ధ్వజమెత్తాయి.  శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన తర్వాతనే, కరోనా కేసులు పెరిగాయని బీజేపీ ఇప్పటికే ట్వీట్ చేసింది. ఇదే విషయాన్ని అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా  ఆరోపించిన విషయం తెలిసిందే.  కర్నూలు ఎంపీ కుటుంబసభ్యులకూ వైరస్ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా కరోనా నేపథ్యంలో.. ర్యాపిడ్ టెస్టు కిట్లతో చేస్తున్న పరీక్షలు ప్రామాణికం కాదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. వాటి నిర్ధరణకు ప్రామాణికం లేనందున, ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు మాత్రమే చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  ఎందుకంటే.. వాటితో శరీరంలో రోగనిరోధక శక్తి ఎంతవరకూ ఉంటుందనేది మాత్రమే తెలుస్తుంది. అందుకే వైరస్‌ను నిర్ధారించేందుకు, ఆర్‌టీపీసీఆర్ పరీక్ష లు మాత్రమే చేయాలన్నది ఐసీఎంఆర్ వాదన. అయినా సరే.. దానిని లెక్కచేయకుండా, దేశంలోనే ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ప్రచారం చేసుకునేందుకు.. ర్యాపిడ్ టెస్టు కిట్లతో పరీక్షలు చేస్తున్న విషయాన్ని బీజేపీ కేంద్ర దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.  త్వరలో రానున్న కేంద్రబృందం దానిపై కూడా దృష్టి సారించనుంది. కేంద్రానికి రానున్న బృందం విశాఖపైనే ఎక్కువ దృష్టి సారించే అవకాశాలున్నట్లు బీజేపీ నేతల మాటల బట్టి స్పష్టమవుతోంది.

వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమ‌తి!

వలస కార్మికులకు రాష్ట్ర పరిధిలోని సొంత ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకునేందుకు వెసులుబాటు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేవలం కరోనా లక్షణాలు లేనివారు మాత్రమే పనులు చేయాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్ సడలింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం‌ అదనపు గైడ్‌లైన్స్‌‌ను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన సూచనల మేరకు బుధవారం ఈ కొత్త మార్గదర్శకాలను వెల్లడించింది.  కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం :  ►వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినహాయింపు  ►ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌కు మినహాయింపు  ►ఆర్థిక రంగానికి మినహాయింపు ►గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు అనుమతి  ►కావాల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు అనుమతి  ►వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి ►కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే మినహాయింపు ►వలస కార్మికులు లాక్‌డౌన్‌ సమయంలో ఏ రాష్ట్రంలో ఉంటే అదే రాష్ట్రంలో మాత్రమే పనులకు అనుమతి  ►బుక్స్ షాపు, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ షాపులకు మినహాయింపు ►ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు ►మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉండే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఆర్థిక రంగానికి మినహాయింపు లభించింది.  నిర్మాణ పనులకు,  పవర్‌ లైన్స్‌, టెలికాం కేబుల్స్ పనులకు మినహాయింపు లభించింది. వ్యవసాయ రంగం, ఉద్యాన పనులు, ప్లాంటేషన్‌ పనులు, కోత, ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, మార్కెటింగ్‌ రంగాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసుకునేందుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.

కరోనా వైకాపాకు ఏటీఎంలా మారింది: చంద్రబాబు

కరోనా విపత్తు వేళ ప్రజలకు అండగా నిలవాలని పార్టీ నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులతో బుధవారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక విపత్తుల సమయాల్లో తెదేపా వెన్నంటి నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు.  క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడమే అందరి లక్ష్యం కావాలన్నారు. పేదలను, కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, రైతులకు సాయమందేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రైతు భరోసా అని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది పేర్లను తొలగించిందని చంద్రబాబు మండిపడ్డారు. కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోకుండా స్థానిక ఎన్నికలపైనే ఆ పార్టీ నేతలు దృష్టి సారించారని, ఓట్ల కక్కుర్తితో గుంపులుగా తిరిగారని ఆరోపించారు. అడ్డగోలు చర్యలతో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను ప్రమాదంలోకి నెట్టారని దుయ్యబట్టారు.  దేశంలో వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న 15 జిల్లాల్లో కర్నూలు ఒకటి కావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. కరోనా రావడం వైకాపా నాయకులకు ఏటీఎంలా మారిందన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు విపరీతంగా వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి వాటిపై మండలస్థాయిలో దీక్షలు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. తెదేపా నేతలు తరచూగా రాస్తున్న లేఖలతో విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనం చేకూరిన విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు.

రోడ్లపై తిరిగితే క్వారంటైన్‌కు తరలిస్తాం: సీపీ

మీ భద్రత మా బాధ్యత దయచేసి మీరు ఇళ్లకు పరిమితం అవ్వండి అంటూ విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌ ద్వారక తిరుమలరావు జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. విజయవాడలోని  రెడ్‌జోన్లలో సీపీ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనవసరంగా రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేసి క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చారించారు. కార్మిక నగర్‌లోనే అత్యధికంగా 35 కేసులు నమోదయ్యాయని చెప్పారు. రెడ్‌జోన్‌ ప్రాంతంలో లోపలి వారు బయటకు రాకుండా బయట వారు లోపలికి వెళ్లడం నిషేధమన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లఘింగిస్తే కఠిన శిక్షలు తప్పవని, కేసులను ఆషామాషిగా తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని హెచ్చిరించారు. కాగా ప్రతిరోజు నగరంలో రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో కవాతు నిర్వహించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌లో అందరూ ఇంట్లొనే ఉండి కరోనా కట్టడికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రంగంలోకి గౌహతి ఐఐటీ

IIT గౌహతి కూడా covid 19 వాక్సిన్ ను కనిపెట్టే యజ్ఞంలో నిమగ్నమై ఉంది. ఇందుకోసం ఆ సంస్థ Hester biosciences LTD తో చేయి కలిపింది. అయితే తమ పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, డిసెంబర్ నాటికి జంతువులపై ప్రయోగం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని గౌహతి ఐఐటీ బయోసైన్స్స్ , బయో ఇంజనీరింగ్ శాఖలకు చెందిన ప్రొఫెసర్ సచిన్ కుమార్ చెప్పారు. తమ బృందానికి గతంలో క్లాసికల్ స్వైన్ ప్లూ,జపనీస్ ఎన్సఫిలిటిస్ లకు వాక్సిన్ కనుగొన్న చరిత్ర ఉందని ఆయన తెలిపారు. IIT డైరెక్టర్ టీ. జీ.సీతారామన్ మాటాడుతూ తాము ఖచ్చితంగా విజయం సాధించగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే గాక ఇలాంటి పరిశోధనలు ఇక్కడితో ఆగవని,భవిష్యత్తులో దాడికి పొంచి ఉండే వైరస్ లను మొగ్గలోనే తుంచేసేందుకు ఇవి పునాదిగా ఉపయోగ పడతాయని అన్నారు.

నిజంగా లాక్ డౌన్ వలన నష్ట పోయిందెవరు?

ప్రభుత్వం నష్టపోయింది నెల రోజూల లాక్ డౌన్ వలన అనుకుంటున్నారు.. నిజానికి ఈ రోజే అమ్మకపోతే నష్టపోతాం అనడానికి ప్రభుత్వమేమీ కూరగాయల వ్యాపారం చేయడం లేదు. ప్రభుత్వం తనకొచ్చే ఒక్క పన్నును ఒక్క శాతం కూడా తగ్గించలేదు. అవన్నీ ఈ నెల కాకపోతే వచ్చేనెల అయినా వసూలు చేసేదే అందులో సందేహం లేదు..! నిజంగా నష్టపోయేది ఎవరంటే.. పక్క ఊర్లు నుండి రాష్ట్రాల నుండి వచ్చిన వలసకూలీలు జూస్ షాపు వారు. సుతారి మేస్ర్తీలు, కూలీలు. పునాది గుంతలు తీయువారు. సినిమా జూనియర్ ఆర్టిస్ట్స్. కళాకారులు. బాగోతు వారు. గంగిరెడ్ల వారు. సినీమా థియేటర్ లో పనిచేయువారు. ఇళ్ళకు పెయింట్ వేయువారు. సెంట్రింగ్ మేస్త్రీలు. స్లాబ్ పనివారు. కార్పెంటర్లు. ప్లంబర్స్. టైల్స్ పనివారు. చిత్తుకాగితారు ఏరుకునే వారు. బీడీ కార్మికులు. కల్లుగీత కార్మికులు. వంటవారు. సర్వర్లు. టెంట్ హౌజ్ లు. పూల దుకాణాల వారు. ఇళ్ళల్లో పనిమనుషులు. ఎలక్ట్రిక్ పనివారు. ప్రైవేటు సంస్థల ఉద్యోగులు. పిజ్జా డెలివరీ బాయ్స్. క్యాబ్ డ్రైవర్లు. ఇసుక రవాణా వారు. ఇంటర్నెట్ సెంటర్స్ వారు. ప్రింటింగ్ ప్రెస్ లు.  జీరాక్స్ షాపులు. పూజారులు. అన్ని రకాల మెకానిక్ లు. బట్టల షాపుల్లో పనిచేయువారు. పంచర్ షాపువారు. పాన్ షాపు వారు. టీ స్టాల్ ,టీఫీన్ సెంటర్స్ వారు. రెస్టారెంట్స్ లో పనిచేసే ఉద్యోగులు. లేబర్స్ క్లీనర్స్. సెక్యూరిటీ గార్డ్స్. సేల్స్ బాయ్స్. హెయిర్ కటింగ్ సెలూన్స్. బ్యూటీపార్లర్ షాపు వారు. ఆసుపత్రులు. డయాగ్నస్టిక్ సెంటర్ లో పనిచేయువారు. బట్టల షాపు వారు అందులో పనిచేసే కూలీలు. టీవీ DTH లాంటి మెకానిక్ షాపు వారు. ఫ్రిడ్స్ వాషింగ్ మెషిన్స్ లాంటివాటిలో పనిచేసే వర్కర్స్. ఆటో రిక్షా నడిపేవారు. రీక్షా పుల్లర్స్. లారీ క్లీనర్స్. డ్రైవర్స్. బజ్జీల  బడ్లు. తోపుడు పండ్లు. గప్ చుప్ కట్లెట్ షాపుల వారు. మొబైల్స్ అమ్మేవారు. మెకానిక్ వారు. ఇళ్ళ వెంట తిరుగుతూ అమ్మే పెడ్లర్స్. దర్జీలు. చెప్పుల షాపు వారు. ఐస్ క్రీం షాప్స్. బట్టలు బ్యాగులు చెప్పులు కుట్టేవారు. X ray Scanning centers. కాంపౌండర్లు నర్సులు. సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్. ఇంక ప్రైవేటు ఉద్యోగులు. అడుక్కునే వారు. పాత ఇనుము చిత్తు కాగితాలు కొనేవారు. కూల్ డ్రింక్ మరియు సోడా బండీవారు. ఇలా దాదాపు వెయ్యి రకాల చిన్న చిన్న వ్యాపారులు మరియు వాటి మీద ఆధారపడిన లక్షల మంది బతుకులు ఈ లాక్ డౌన్ వలన భుగ్గిపాలయ్యాయన్నది నిజం.. కొందరి అత్యుత్సాహం వలన ఈనాడు కాయాకష్టం చేసుకుని బతికే శ్రమజీవులకు ఒకరి ముందు అన్నమో రామచంద్ర అంటూ చేయి చాపవలసిన దుస్థితి ఏర్పడిందంటే దీనికి ఎవరు భాధ్యులు..! ఈ లాక్ డౌన్ వలన ప్రభుత్వ ఉద్యోగులు సగమే హాపీగా ఉన్నారు.వారి ఇబ్బందులు వారికున్నాయి... ప్రభుత్వం తనకొచ్చే పన్నులు తగ్గాయంటున్నది కాని తగ్గించామనో లేదా రద్దు చేసామనో అనడం లేదు. భూమి కొన్న వారు ఈరోజు కాకపోతే రేపు రిజిస్ట్రేషన్ లు చేయిస్తారు. అప్పుడైనా రుసుం కట్టాల్సిందే..ఇక మీసేవ ద్వారా వెహికల్ ఇన్యూరెన్స్ ల ద్వారా వెహికల్ రిజిస్ట్రేషన్ ల ద్వారా వచ్చే ఆదాయం తర్వాతి నెల అయినా వస్తుంది..ఇక ఇంటిపన్ను, నల్లా పన్ను, భూమి పన్ను ,అప్పులకు వడ్డీలు ఇవన్నీ తర్వాత అయినా వసూలు చేసేదే..! ఇప్ఫుడు బాగా తగ్గిపోయింది ఏంటయా అంటే మద్యం అమ్మకాలు, పెట్రోల్ ,డీజిల్ అమ్మకాలు మాత్రమే..ఇవి కవర్ చేయడం కష్టం .ఈరోజు వినియోగాన్ని రేపు వినియోగించడం కుదరదు..అలానే సాదారణ పరిస్థితులలో ప్రతిరోజూ కేవలం 50%వెహికిల్స్ మాత్రమే వినియోగంలో ఉంటాయి. అయితే లాక్ డౌన్ ఎత్తివేసాక పరిశ్రమలు తమ దగ్గరున్న స్టాక్ ను తొందరగా తరలించడం కోసం ఇప్పుడున్న 100% లారీలను వినియోగించడం జరుగుతుంది.అలా డీజిల్ వినియోగం ద్వారా వచ్చే పన్ను పెరుగుతుంది. అలానే గృహ  కరెంట్ వినియోగం బాగా పెరిగింది.. పరిశ్రమల వినియోగం తగ్గింది అంటే బయట సంస్థల నుండీ ప్రైవేటు వ్యక్తుల నుండి కొనవలసిన అవసరం ఇప్పుడు లేదు .అంటే ప్రభుత్వం చేసే కరెంట్ ఉత్పత్తి గృహాలకు సరిపోవడమే కాక లాభాలు కూడా బాగానే ఉన్నాయి. అలానే ఆహార ఉత్పత్తుల వినియోగం సాధారణం కంటే మూడు రెట్లకు పెరిగింది.అంటే మూడు నెలలకు సరిపోను పన్నులు ప్రభుత్వానికి జమకూడుతున్నాయి.  ఇక ఫ్రభుత్వానికి అత్యధికంగా వచ్చే ఆదాయపు పన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఆల్రెడీ ఫిబ్రవరిలోనే వసూలు చేసారు. ప్రభుత్వం ఒక్క పన్నును చూడా తగ్గించదు.. పెంచదు..పెంచితే జనం రోడ్లమీదకొస్తారు.  అందుకే కంపెనీలకు లాక్ డౌన్ ఉద్దీపనగా వస్తువుల ధరలను పెంచే అవకాశం ఇస్తారు.  ధరలు పెంచడం ద్వారా HMGST కూడా అధికంగానే వస్తుంది.సో.. ప్రభుత్వాలకు వచ్చే నష్టం లేదు. నష్టం మొత్తం సాధారణ పౌరులకే... ధరలు పెంచుతున్నారు అంటే అందులో పనిచేసే ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి అనుకుంటున్నారేమో.. రెండేండ్ల దాకా జీతాలు మాత్రం పెరగవు. అలానే కంపెనీలకు రకరకాల లోన్లు, రకరకాల వడ్డీ మాఫీ కార్యక్రమాలు , కరెంట్ యూనిట్ రేట్ తగ్గించడం లాంటివి ఉండనే ఉన్నాయి. అయితే రెండేండ్ల పాటు ఏ వస్తువు రేటు కూడా  పెంచవద్దు. ఏ కొత్త ప్రొడక్ట్ ను లాంచ్ చేయవద్దని ప్రభుత్వానికి ప్రజలు అర్టీ పెట్టుకుంటే తప్ప ఈ జన జీవనం గాడిలో పడదు. కొత్త ప్రొడక్ట్ అంటే ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్ కి పేరు మార్చి రేట్ పెంచి అమ్మడం.  ఉదాహ‌ర‌ణ‌కు రిన్ సబ్బు క్వాలిటీ తగ్గిస్తారు..దాని పాత క్వాలిటీతోనే పేరు మార్చి ధర పెంచి  సర్ఫ్ ఎక్సల్ గా నామకరణం చేసినట్లు ఇలాంటివి ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి.

నిమ్మగడ్డ కేసులో అనూహ్య పరిణామం.. పాస్‍వర్డ్ లీక్ పై సీజే ఫైర్ 

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ఈ రోజు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు పిటిషన్‍పై, ఈ రోజు హైకోర్టులో వాదనలు తిరిగి ప్రారంభం అయ్యాయి. నిన్న ఆరుగురు పిటిషనర్ల తరపు వాదనలు విన్న ధర్మాసనం, ఇవాళ మరికొందరు పిటిషనర్ల తరపు వాదనలు వినటానికి రెడీ అయ్యింది. ప్రముఖ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు ప్రారంభం చేసారు. అయితే, ఈ సమయంలో, హైకోర్ట్ సీజేకు ఒక సంఘటన తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వీడియో కాన్ఫరెన్స్ విచారణలో అనుమతించినవారు కాకుండా ఇతర న్యాయవాదులు ప్రవేశించడంపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. కేవలం 10 మందికి పాస్ వర్డ్ ఇస్తే, ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్ లోకి ఎలా వచ్చారన్న సీజే ప్రశ్నించారు. పాస్‍వర్డ్ లీక్ చేయడం వల్లే ఇలా జరుగుతుందని సీజే ఆగ్రహం వ్యక్తం చేసారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు జరుగుతుండగానే క్రాస్‍టాక్ రావడం పట్ల సీజే అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. దీంతో, నిమ్మగడ్డ రమేశ్‍కుమార్ పిటిషన్‍పై విచారణ సోమవారానికి వాయిదా వేసారు. ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని, నేరుగా కోర్టులోనే విచారణ చేస్తామని, సీజే చెప్పారు. కోర్టుతో సంబంధమున్న న్యాయవాదులకు పాసులు జారీ చేసేలా డీజీపీకి ఆదేశాలు ఇస్తాం అని అన్నారు. కొంత మంది న్యాయవాదులు హైదరాబాద్ నుంచి రావాల్సి ఉండటంతో, సీజే దీనికి సంబంధించి డీజీపీకి లేఖ రాస్తాం అని చెప్పారు. సోమవారం అందరూ సమాజీక దూరం పాటిస్తూ, నిబంధనులు పాటిస్తూ, కోర్ట్ కు హాజరు కావాలని చెప్పారు. అయతే, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పాస్‍వర్డ్ లీక్ ఎలా అయ్యింది, ఎవరు ఆ వీడియో కాన్ఫరెన్స్ లోకి వచ్చారు అనేది తెలియాల్సి ఉంది. బయట వ్యక్తులు ఎలా వస్తారు అంటూ, చర్చ మొదలైంది. నిన్న, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమి షనర్ తొలిగింపు అంశం పై కేసు విచారణను ఈ రోజుకి హైకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ప్రభుత్వం నూతన సంస్కరణల సాకుతో ఆర్డినెన్స్ ద్వారా తొలిగించింది అంటూ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై నిమ్మగడ్డ వ్యక్తిగతంగాను, మాజీ మంత్రి కామినేని శ్రీనివాతో పాటు ఆరు గురు ప్రజావ్యాజ్య పిటిషన్లును హైకోర్టులో దాఖలు చేసారు. ఈ పిటీషన్లకు సంబంధించి ఫిర్యాదుదారులు, ప్రభుత్వం, రాష్ట్ర ఎన్ని కల సంఘం కౌంటర్లు దాఖలు చేశాయి. ఈ కేసుకు సంబంధించి మంగళవారం వాద, ప్రతివాదనలు కొనసాగాయి. ధర్మాసనానికి ఆరుగురు వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

వ్యవసాయ ఋణాలు ఎందుకు రద్దు చేయరు?

రిజర్వు బ్యాంకు ఇటీవల ఉద్దేశపూర్వకంగా ఋణాలు ఎగవేత దారులకు ఊరట కలిగిస్తూ రూ 68 వేల 607 కోట్ల ఋణాలు రద్దుచేసింది. ఈ చర్యతో లాభపడినవారంతా ప్రముఖ పారిశ్రామిక వేత్తలే. తమ ఋణాలపై నెలవారి కిస్తీ చెల్లించని వేతన జీవులు, రైతులు, రైతు కూలీల ఆస్తులు జప్తు చేసే బ్యాంకులు ఈ బడా పారిశ్రామిక వేత్తలకు, అందునా ఉద్దేశపూర్వకంగా ఋణాల ఎగవేత దారులను ఎందుకు కరుణించాయో చెప్పాలి. ఋణాలు ఎగ్గొట్టి దేశం వదిలి వెళ్ళిపోయిన వారిని పక్కన పెడితే దేశంలో ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పట్ల బ్యాంకులకు ఇంత ప్రేమ ఎందుకో తెలియదు. అయినా ఈ వెసులుబాటు వ్యవసాయ ఋణాలకు ఎందుకు ఉండదు? ఉన్నా ఈ స్థాయిలో ఎందుకు ఉండదు? కంటితుడుపు ఋణమాఫీలు మాత్రమే ఎందుకుంటున్నాయి? అది కూడా ప్రభుత్వాలు మాత్రమే అమలు చేస్తున్నాయి కానీ బ్యాంకులు ఎందుకు అమలు చేయడం లేదు? దాదాపు 70 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగంలో ఋణాలు కేవలం రూ 11 లక్షల కోట్లు (2019-20 బడ్జెట్) మాత్రమే. ఇందులో పంట ఋణాలు రూ 9 లక్షల కోట్లు. వీటిలో కూడా సాధారణ రైతుకు దక్కేది ఏమీ ఉండదు. కౌలు రైతును బ్యాంకులు తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వవు. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో పధకం పెట్టి ఋణాలు అందజేస్తే మినహా కౌలు రైతుల మొహం చూసే బ్యాంకు ఒక్కటి కూడా లేదు. దేశంలోని ఏ బ్యాంకు ఆదాయం చూసినా అది ప్రజల నుండి డిపాజిట్ల రూపంలో వచ్చినదే. ప్రజలనుండి సేకరించిన సొమ్ము ప్రజలకు చెందకుండా ఇలా "ఉద్దేశపూర్వక ఋణ ఎగవేతదారులకు" లబ్ది చేకూర్చడం ఏ ఆర్థికశాస్త్రమో పాలకులే చెప్పాలి.

ఆర్థరైటిస్ మందు కూడా కరోనా పేషంట్స్ కు వాడవచ్చునట!

ఆర్ధరైటిస్ చికిత్సకు వాడే TOCILIZUMAB ను క్లిష్ట పరిస్ధితులలో ఆస్పత్రిలో  ఇబ్బంది పడుతున్న covid రోగులకు వాడవచ్చునట. ఫ్రాన్స్ లో నిర్వహించిన ట్రయల్స్ లో ఈ విషయం ఇంచుమించుగా నిర్ధారణ అయినట్టే.ఇది పక్కా చికిత్స కాకపోయినా ప్రాణనష్టాన్ని నివారించేందుకు,,ఆపై ఆస్పత్రులపై భారం తగ్గించేందుకు ఇది ప్రత్యామ్నాయంగా పనికి వస్తుంది.ఫ్రాన్స్ లో 129 మంది తీవ్ర రోగులలో సగం మందికి ఇంజక్షన్ చేయగా మంచి గుణమే కనిపించింది ..ఈ మందు ACTEMERA,రో ACEMETRA పేర్లతో  ప్రాచుర్యం పొందింది... భారతీయులకు BCG, సూర్యరశ్మి వరాలే భారత దేశంలో పౌరులందరికీ BCG వాక్సిన్ ఉంటుంది గనుక కరోనా నియంత్రణలో భారతీయులు దృఢంగా ఉన్నారని అమెరికాలో స్థిరపడిన భారతీయనిపుణుడు రవి గాడ్సే అభిప్రాయపడ్డారు.అలాగే ఇండియాలో ఇప్పటికే మొదలైన ప్లాస్మా థెరపీ కూడా సత్ఫలితాలు ఇస్తుందని ఆయన చెప్పారు.కాకపోతే covid వచ్చి తగ్గిన వారి నుంచి కాక అసలు ఆ జబ్బు రాని ఆరోగ్యవంతుల రక్తం నుంచి రెండు మూడు వారాల ముందే సేకరించే కణాలను చికిత్సకు వాడే అంశాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు. ఇక భారత్ లో వాతావరణ పరిస్థితుల గురించి మాట్లాడుతూ సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలలో వైరస్ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందని రవి అభిప్రాయపడ్డారు.తేమ ఎక్కువగా ఉండేటప్పుడు మనిషి నుంచి వెలువడే తుప్పర్లలో అధిక శాతం తొందరగా భూమిపై పడి ప్రభావం కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు.వాతావరణ పరిస్థితులతో పాటు భారత ప్రభుత్వం ముందుగా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం,అది అమలు జరుగుతున్న విధానం మేలు చేసి ఇండియా మూడో దశకు వెళ్లే ప్రమాదం నుంచి బయటపడినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు..ఇప్పుడు అమెరికా తెరిపిన పడుతోంది గనక రానున్న రోజుల్లో భారత్ లో కొన్ని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా HCQ విషయంలో ఇండియా చేసిన సాయానికి కృతజ్ఞతగా USA ఖచ్చితంగా రుణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. ఒకసారి వచ్చి తగ్గిన వారికి అంత త్వరగా రోగం తిరగబెట్టే అవకాశాలు తక్కువేనని రవి అన్నారు.అలాగే కరోనా స్వభావం మార్చుకునే అవకాశాలు ఉన్నప్పటికీ అది మంచికే దారి తీస్తుందని ఆశించవచ్చన్నారు.ఈలోగా వాక్సిన్ కూడా సిద్ధం అవుతుందనే సానుకూల అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చునని పేర్కొన్నారు.కాగా లక్షణాలు కనిపించే వారిని క్వారెంటైన్ కు పంపుతూ ఇమ్యూనిటీ పరీక్షలు జరిపి ఫిట్ అయిన వారిని రంగంలోకి దింపి ఆర్థిక పునర్నిర్మాణం దిశగా భారత్ వడివడిగా అడుగులు వేయవచ్చని ఆయన చెప్పారు.ఏదిఏమైనా కరోనా బారిన ఎందరు పడినా 90 శాతం మందిపై అది పెద్దగా ప్రభావం చూపదని,అయిదు శాతం మంది ఖచ్చితంగా కోలుకుంటారని ఆయన స్పష్టం చేశారు.

ఒక మేయ‌ర్! ముగ్గుర‌క్క‌లు!

కొవిడ్‌-19 రోగుల‌కు చికిత్స అందించ‌డం కోసం ముంబాయి మేయ‌ర్‌ కిశోరీ పెడ్నేకర్ న‌ర్సుగా మారారు. నాయ‌ర్ ఆసుప‌త్రిలో రాత్రిపూట సేవ‌లందిస్తున్నారని శివ‌సేన నాయ‌కురాలు ప్రియాంక చ‌తుర్వేది ట్వీట్ చేశారు. ముంబాయి కోసం ఏమైనా చేస్తాం. మేం ఇంటి ద‌గ్గ‌ర నుంచి ప‌ని చేయ‌లేం. ప్ర‌జ‌ల కోసం క్షేత్ర స్థాయికి వెళుతున్నాం. మీరు మీ ఇంట్లో భ‌ద్రంగా ఉండండి అని ముంబాయి పౌరుల‌ను ఉద్దేశించి మేయ‌ర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చి ప‌నిచేస్తున్నారు. లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజల కష్టాలను తీరుస్తున్నారు. లాక్‌డాన్‌ అమల్లోకి వచ్చినప్పట్టి నుంచి తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. రాత్రి 10 గంటల వరకు కూడా ఆమె నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు సీతక్క. ఉపాధి కోల్పయిన పేదవారికి నిత్యావసర సరుకులు అందించాలని సోషల్ మీడియా మిత్రులను ఆమె కోరారు. ఏపి చిల‌క‌లూరి పేట వైసీపీ ఎమ్మెల్యే ర‌జ‌నీ అయితే ప్ర‌చారమే ల‌క్ష్యంగా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గావున్నారు. వీడియో సందేశాలు ఇవ్వ‌డం, ఫొటో స్టిల్స్ విష‌యంలో సినిమా వారికి ఏమాత్రం త‌గ్గ‌కుండా యాక్ట‌ర్‌ల‌తో పోటీ ప‌డుతున్నారు. రంజాన్ శుభాకాంక్ష‌లు తెల‌ప‌డానికి ఆమె ప్ర‌త్యేక వీడియో, ఫొటో షూట్ చేశారు. సినిమా న‌టుల్ని త‌ల‌పించేలా షూటింగ్‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టి వీడియోలో క‌నిపించారు. క‌రోనా సందేశం ఇచ్చేట‌ప్పుడు టీవీ యాంక‌ర్‌లా న‌టించారు. టీవీలో వార్త‌లు చ‌దివిన‌ట్లు క‌రోనా సందేశం, రంజాన్ సందేశాన్ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు వినిపించారు ర‌జ‌న‌క్కా. ఇక రోజ‌క్కా చేసే సంద‌డీ అంత ఇంత కాదు. ఎమ్మెల్యే రోజా కీర్తి ప్రతిష్టలు కూడా కరోనా వైరస్ తో పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్న ప్రస్తుత తరుణంలో తన నియోజక వర్గంలో మాత్రం ఓ గ్రామంలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపించదనే కారణంలో ఎమ్మెల్యే రోజాకు పుష్పాభిషేకం చేసారు గ్రామ ప్రజలు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్న ఆంక్షలు ఉన్నప్పటికి, సమూహాలుగా ప్రజలు వీధుల్లోకి రావొద్దన్ని నిబంధనలు అమలులో ఉన్నప్ప‌టికి రోజా అంశంలో అవన్నీ బలాదూర్ గా మారిపోయాయన్న టాక్ వినిపిస్తోంది. ఓ బోరుబావి ప్రారంభ కార్యక్రమంలో.. స్థానికులు రోజాపై పూలు జల్లి ఘనస్వాగతం పలికిన ఘటనపై రాజకీయ దుమారం రేగింది. బోరుబావి ప్రారంభానికి ఆహ్వానించడంతో నేను వెళ్లా. అయితే వారు పూలు చల్లుతారని ఊహించలేదు. దీనిపై విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు నేను భయపడబోను. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తానంటూ రోజాక్క హెచ్చ‌రించింది. క‌రోనా విప‌త్క‌ర‌కాలంలో నేత‌లు ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెబుతూ అండ‌గా నిల‌బ‌డుతున్నారు. మ‌హిళ నేత‌లు సైతం ఇంటి నాలుగు గోడ‌ల నుంచి బ‌య‌టికి వ‌స్తున్నారు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్ మాత్రం తన రాజప్రాసాదం దాటి బయటకు రావడం లేదని జ‌నం చెప్పుకుంటున్నారట‌!

పెళ్లిళ్లు కూడా ఇక ప్రభుత్వ అనుమతితో చేసుకోవాలేమో...

* కరోనా పాఠాలు మన లైఫ్ స్టైల్ నే మార్చేస్తున్నాయి  * మాస్కులు, శానిటైజర్లు విందుల్లో, పండుగల్లో, మార్కెట్లలో, మాల్స్ లో ఇహ తప్పనిసరి ఎయిడ్స్ వచ్చిన తొలినాళ్ళలో జనం భయంతో వణికి పోయారు. సెక్స్ ద్వారా సంక్రమించే ఈ వ్యాధి ఇంజక్షన్ ద్వారా, రక్తం ఎక్కించుకోవడం ద్వారా, గడ్డం గీసుకుని బ్లేడు ద్వారా కూడా సంక్రమిస్తుందని తెలిసి భయబ్రాంతులకు గురయ్యారు.ఇప్పుడు ఈ భయంకర ఎయిడ్స్ వ్యాధిపట్ల అప్రమత్తంగా ఉండడానికి అలవాటుపడిపోయాం. ఆ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్చుకున్నాం. డిస్పోజబుల్ సూదులు (ఇంజక్షన్ల కోసం) వచ్చాయి. బార్బర్ షాపుల్లో బ్లేడు వాడకంలో జాగ్రత్త పడ్డాం. ఇలా జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు కరోనా కూడా అలాగే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో మాస్కు, శానిటైజర్లు జేబుల్లో పెట్టుకుని తిరగాల్సి రావచ్చు.ఇక వివాహాలు, విందులు ప్రభుత్వ అనుమతితో జరుపుకోవాల్సి వస్తుందేమో! స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు ఇచ్చి ఆ తర్వాత పెళ్ళో, గృహ ప్రవేశమో, చావో, వర్దంతో, మరింకోటో ఏర్పాటు చేసుకోవాల్సి రావచ్చు.పదిమంది కూడాల్సిన చోట అనుమతి తప్పనిసరి కావచ్చు. అలాగే ఈ మాస్కులు, శానిటైజర్లు విందుల్లో, పండుగల్లో, మార్కెట్లలో, మాల్స్ లో తప్పనిసరి అవుతాయేమో!

నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం వావిలాల గోపాలకృష్ణయ్య

* ఈ రోజు వావిలాల వారి వర్ధంతి * విశుద్ధ రాజకీయాలకు చిరునామా 'వావిలాల'   నీరు కావి రంగు ఖద్దరు దుస్తులు, భుజం మీదుగా వేలాడుతూ ఒక గుడ్డ సంచి. దూరం నుంచే చూసి చెప్పొచ్చు ఆ వచ్చేది వావిలాల వారని. ముతక ధోవతి, ముడతలు పడ్డ అంగీ, ఇక ఆ చేతి సంచిలో వుండేవి నాలుగయిదు వేపపుల్లలు, మరో జత ఉతికిన దుస్తులు, నాలుగయిదు పుస్తకాలు, నోటుబుక్కు. 1955 నుంచి 1967 వరకు ఆయన ఇండిపెండెంటుగా గెలుస్తూ వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఆయన కాలినడకనే తిరిగేవారు. యెంత దూరమైనా కాలి నడకే. వూరు దాటి వెళ్ళాల్సివస్తే ఆర్టీసీ బస్సు లేదా సెకండు క్లాసు రైలు. ఒకసారి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వున్నప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళారు. గెస్టు హౌస్ లో దిగిన వావిలాల వారిని మర్యాద పూర్వకంగా కలుసుకునే నిమిత్తం జిల్లా కలెక్టర్ వెళ్లి గదిలో చూస్తె ఆయన లేరు. బయటకు వచ్చి వాకబు చేస్తే ఆ సమయానికి వావిలాల గెస్టు హౌస్ దగ్గర కృష్ణా నదిలో స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటూ కానవచ్చారు. ‘అదేమిట’ని కలెక్టర్ ఆశ్చర్యంతో అడిగితే, ‘వున్నవి రెండే జతలు, ఏరోజుకారోజే ఉతుక్కోవడం తనకు అలవాట’ ని చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా లోగడ వ్యవహరించిన మండలి బుద్ధప్రసాద్, వావిలాల గురించిన ఒక ఆసక్తికర కధనాన్ని కొన్నేళ్ళ క్రితం రాసారు. ఒకసారి వావిలాల గుంటూరు నుండి రైల్లో సత్తెనపల్లి వెడుతుంటే ఒక ముసలవ్వ ఆయన్ని తేరిపార చూసి, ‘బాబూ! గోపాల కిష్టయ్యవా’ అందట. ‘అవునవ్వా! నేను నీకు తెలుసా!’అన్నారాయన. ‘తెలియకపోవడమేంబాబూ, నువ్వేగా మాకు బువ్వ పెట్టింది, నందికొండ నువ్వు తీసుకురాకపోతే మాకు బువ్వేడది?’ అందట ఆ అవ్వ. రాజకీయ పార్టీలను కాదని ఇండిపెండెంటుగా పోటీ చేసిన ఆయన్ని, నందికొండ (నాగార్జునసాగర్) ప్రాజెక్టు సాకారం కావడంలో ఆయన కృషిని గుర్తించి, అక్కడి ప్రజలు వరసగా అనేక పర్యాయాలు తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. తిరిగి అదే వావిలాల వారిని 1972, 1978 లో జరిగిన ఎన్నికల్లో ఓడించారు. అంటే ఎన్నికల్లో డబ్బు ప్రభావం మొదలయిందన్న మాట. ఆ తరువాత వావిలాల ఎన్నికల రాజకీయాలనుంచి శాస్వతంగా తప్పుకున్నారు.

తోట త్రిముర్తుల‌పై దాడి చేస్తావా? అంటూ వేట‌కొడ‌వ‌ళ్ళ‌తో న‌రికారు!

రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైఎస్సార్సీపీ నేత తోట త్రిమూర్తులు పై గతంలో చెప్పుతో దాడి చేసిన వ్యక్తి మేడి శెట్టి ఇజ్రాయిల్ పై మంగళవారం హత్యాయత్నం జరిగింది. రామచంద్రపురం మండలం మసకపల్లి గ్రామంలో ఇజ్రాయిల్ పై దుండగులు కత్తులతో దాడి చేసి హత్యా యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న ఇజ్రాయిల్ ను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. త‌న‌పై దాడి జ‌రిగిన తీరును మేడిశెట్టి ఇశ్రాయేల్ వివ‌రించాడు. రాడ్‌తో నెత్తి మీద కొట్టారు. వాళ్ళ‌ను తోసి ప‌రుగెడుతుంటే వెన‌క త‌రిమి త‌రిమి వేడ‌కొడ‌వ‌ళ్ళ‌తో న‌రికారు. ప్రాణాలు కాపాడుకోవ‌డానికి ప‌రుగెత్తుతూ కాలువ‌లో ప‌డిపోయాను. వాళ్ళు కూడా కాలువ‌లోకి దూకి న‌న్ను అంతం చేయాల‌ని చూశారు. తోట త్రిముర్తుల‌పై దాడి చేస్తావా? ఈ రోజుతో నీవు స‌చ్చావు. అంటూ బూతులు తిట్టార‌ని బాధితుడు రోదిస్తూ చెప్పాడు. పామ‌ర్రు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఇశ్రాయేల్ స్నేహితుడు రాజు ఫోన్ చేసి పిలిస్తే తాను వ‌చ్చిన‌ట్లు చెబుతున్నాడు. అప్ప‌ట్టికే దాడి చేయ‌డానికి కాచుకుని కూర్చున్న ర‌వ్వా నాగ‌భూష‌ణ, అత‌ని అనుచ‌రులు వేట కొడ‌వ‌ళ్ళ‌తో విచ‌క్ష‌ణార‌హితంగా నరికిన‌ట్లు బాధితుడు చెబుతున్నారు. మేడిశెట్టి ఇశ్రాయేల్ గతంలో తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడిచేసిన ఘటనలో ముఖ్యుడు. కాకినాడ ఆసుప‌త్రికి త‌ర‌లించాం. భుజాంపై, త‌ల‌పై పెద్ద గాయాలున్నాయ‌ని పోలీసులు చెబుతున్నారు. తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరేందుకు వెళ్తుండగా కె.గంగవరం మండలం మసకపల్లికి చెందిన మేడిశెట్టి ఇజ్రాయెల్‌ అనే వ్యక్తి త్రిమూర్తులపై చెప్పుతో దాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. గతంలో తోట త్రిమూర్తులను వైసీపీలోకి చేరే సమయంలో దళితులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే తోట త్రిమూర్తులుపై ఇజ్రాయేలు దాడికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో అప్ప‌ట్లో వైరల్ అయింది. ప్రశాంతమైన తూ.గో.జిల్లా K.గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో మేడిశెట్టి ఇశ్రాయేల్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. ఏది ఏమైనా ఇలాంటి భౌతికదాడులు సమాజానికి చాలా ప్రమాదం.. సత్వర విచారణ జరిపి నిందితులని అరెస్ట్ చేయాలి.

అటవీ ఉత్పత్తుల భారీ డంప్, నాటు సారా స్వాధీనం!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కారేపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో పోలీసు, ఫారెస్ట్, ఎక్సైజ్ శాఖల జాయింట్ ఆపరేషన్ చేశారు. అధికారులు పెద్ద ఎత్తున నిల్వచేసిన టేకు కలపతో పాటు అక్రమంగా నిల్వ చేసిన నాటు సారా ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో తనిఖీలకు వెళ్లిన అటవీ సిబ్బందిని అడ్డుకుని స్థానికులు కొందరు దాడి చేశారు. వారిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని అటవీ ఉత్పత్తులను నిల్వ చేశారన్న సమాచారం అందుకున్న అధికారులు పక్కా ప్లాన్ తో మెరుపుదాడి చేశారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయన్, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్ హెరామత్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర పర్యవేక్షణలో ఉమ్మడి ఆపరేషన్ జరిగింది. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో మూడు శాఖలకు చెందిన 100 మంది సిబ్బందితో జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కారేపల్లి పరిధిలోని భూక్య తండా, హనుమాన్ తండా పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ద్వారా సోదాలు నిర్వహించిన సిబ్బంది నాలుగు ట్రాక్టర్లు టేకు దుంగలతోపాటు, ట్రాక్టర్లు, కార్పెంటర్ మెషిన్, ఐదు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై కేసు నమోదు చేసిన అధికారులు. అడవుల్లో చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణా పై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు.

వెయ్యి రూపాయ‌ల‌కే కరోనా వ్యాక్సిన్ !

మ‌న దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌ను కేవ‌లం 1000 రూపాయ‌ల‌కే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రముఖ వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా చెప్పారు. కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్‌ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో చాలా తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తామని ఆ సంస్థ తెలిపింది. అందుకు గాను ఇతర మందుల తయారీని కూడా తాత్కాలికంగా నిలిపివేశామని ఆ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. మే నెలలోనే మనుషులపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ట్రయల్స్ కోసం తాము వేచి చూడబోమన్నారు. మొదటి దశలో నెలకు 10 మిలియన్ల డోసులను సిద్ధం చేస్తామన్నారు. తరువాత నెలకు 20 నుంచి 40 మిలియన్ల డోసులను తయారు చేస్తామన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి 2-4 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని ధీమా వ్య‌క్తం చేశారు. మందులేని ఈ డెడ్లీ వైర‌స్ మహమ్మారిని అంతంచేసేందుకు ప్రపంచ దేశాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్‌ను ఎవ‌రు ముందుగా తీసుకువ‌స్తార‌ని ప్ర‌పంచం ఎదురుచూస్తోంది.  

టాప్ డిఫాల్టర్ల 68,600 కోట్ల రూపాయ‌ల రుణాలు రద్దు!

బ్యాంకులకు వేల కోట్లు రూపాయ‌లు కుచ్చు టోపీ పెట్టి, ఉద్దేశ్యపూర్వకంగా ఎగ‌వేసిన 68,000 కోట్ల రుణాలను రద్దు చేసిన‌ట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద సాకేత్ గోఖలే అడిగిన ప్ర‌శ్న ద్వారా ఈ స‌మాచారం వెల్ల‌డైంది. సాకేత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. తనకు 50 మంది టాప్ విల్‌ఫుల్ డిఫాల్టర్లు, వారి కరెంట్ లోన్ స్టేటస్ కావాలని ఫిబ్రవరి 16న దరఖాస్తు చేసుకోగా, ఏప్రిల్ 24న ఆర్‌బిఐ సమాధానం ఇచ్చింద‌ని సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు. ఆర్బీఐ 30 సెప్టెంబర్ 2019 నాటికి విల్ ఫుల్ డిఫాల్టర్లు, రుణాల రద్దు వివరాలను అందించింది. విల్ ఫుల్ డిఫాల్టర్స్ జాబితాలో మొద‌టి స్థానంలో విదేశాలకు పారిపోయిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ ఓనర్ మెహుల్ చోక్సీ ఉన్నారు. చోక్సీ కంపెనీలకు చెందిన రూ.5,492 కోట్ల రుణాలను ఆర్బీఐ రద్దు చేసింది. రెండు మూడో స్థానాల్లో FMCG కంపెనీ REI ఆగ్రో లిమిటెడ్, జతిన్ మెహతా విన్‌సమ్ డైమండ్స్ అండ్ జ్యువెల్లరీ లిమిటెడ్ ఉన్నాయి. REI ఆగ్రోకు చెందిన రూ.4,314 కోట్లు, విన్‌సమ్ డైమండ్స్‌కు చెందిన రూ.4,076 కోట్లు. రోటోమా గ్లోబల్ ప్రయివేటు లిమిటెడ్‌కు చెందిన రూ.2,850 కోట్లు. ఖుదోస్ కెమి లిమిటెడ్‌కు చెందిన రూ.2,326 కోట్లు. బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలకు చెందిన రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన రూ.2,212 కోట్ల రుణాలు రద్దు చేశారు. జూమ్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.2,012 కోట్ల రుణాలు రద్దయ్యాయి. లండన్‌లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా కంపెనీలకు సంబంధించి రూ.1,943 కోట్ల రుణాలు రద్దు చేశారు. ఫరెవర్ ప్రీసియస్ జ్యువెల్లర్స్ అండ్ డైమండ్స్ ప్రయివేటు లిమిటెడ్ రూ.1,962 కోట్లు. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ రూ.1,915 కోట్లు. చోక్సీకి చెందిన ఇతర కంపెనీలు గిలి ఇంండియా లిమిటెడ్ రూ.1,447 కోట్లు. నక్షత్ర బ్రాండ్స్ లిమిటెడ్ రూ.1,109 కోట్లు రద్దు చేశారు. 50 మంది వివిధ బ్యాంకులకు ఎగవేసిన రుణాల విలువ రూ.68,607 కోట్లు అని ఆర్బీఐ తెలిపింది. జయంతిలాల్ ఎన్ మిస్త్రీ కేసులో 2015 డిసెంబర్ 16 సుప్రీంకోర్టు తీర్పులోని 77 వ పేరా ప్ర‌కారం ఆర్టీఐ చట్టం 2005 లోని సెక్షన్ 8 (1) (ఎ) ప్రకారం, విదేశీ రుణగ్రహీతల సమాచారం బహిరంగ బహిర్గతం నుండి మినహాయించబడిందని ఆర్బిఐ తెలిపింది.

జగన్ కున్న నేర్పు పేదలకు లేదు : అచ్చెన్నాయుడు

‘కరోనా’ వేగంగా వ్యాప్తి చెందడంలోనూ ఏపీ నెంబర్ వ‌న్ గా నిలిచిందని, విశాఖ‌లో ‘కరోనా’ కేసులు పెర‌గ‌లేద‌ని మ‌భ్య‌పెడుతున్నారని, ‘పాజిటివ్’ వస్తే డిశ్చార్జి.. ‘నెగెటివ్’ అయితే వైద్యం చేస్తారా అని, సీనియర్ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ‘కరోనా‘కు భయపడాల్సిన పని లేదని, జ్వరం లాంటిదే కనుక త‌గ్గిపోతుందంటున్న జగన్, తాడేప‌ల్లిలోని తన నివాసం దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదెందుకు? అని కూడా ఆయన నిలదీశారు.  వైరస్‌తో కూడా స‌హ‌జీవ‌నం చేయ‌గ‌ల నేర్పు వైఎస్ వార‌సుడిగా జగన్ కు ఉందేమో కానీ, లాక్‌డౌన్‌తో తిన‌డానికి తిండిలేక‌, చేయ‌డానికి ప‌నిలేక అల్లాడిపోతున్న పేద‌ల‌కు లేదని అన్నారు. దేశంలోనే కోవిడ్ ప‌రీక్ష‌లు చేయ‌డంలో ఏపీ నెంబ‌ర్‌వ‌న్ అని జగన్ ప్రకటించడంపైనా ఆయన విమర్శలు చేశారు. ‘కరోనా’ వేగంగా వ్యాప్తి చెందడంలోనూ, ఎక్కువ మ‌ర‌ణాల్లోనూ, త‌క్కువ రిక‌వ‌రీలోనూ ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఏపీయే నెంబ‌ర్‌వ‌న్ అని అన్నారు. విశాఖ‌ప‌ట్నంలో ‘కరోనా’ కేసులు పెర‌గ‌లేద‌ని మ‌భ్య‌పెడుతున్నారని, 1,600కి పైగా పెండింగ్ లో ఉన్న టెస్టుల ఫలితాలు వెల్లడిస్తే లెక్క తేలిపోతుందని అన్నారు. ‘పాజిటివ్’ వస్తే డిశ్చార్జి చేసి, ‘నెగెటివ్’ అయితే వైద్యం చేస్తున్నప్పుడే జగన్ పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థమైందని ఘాటు విమర్శలు చేశారు. రోజూ చంద్రబాబుపై పడి ఏడవడం ఆపి ‘కరోనా’ కట్టడి కోసం పనిచేయండంటూ జగన్ కు సూచించారు.

13 జిల్లాలలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు

గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు స్పెషల్ సీఎస్  జవహర్ రెడ్డి చెప్పారు. మొత్తం రాష్ట్రంలో  1259 నమోదు  కాగా వారిలో 970 మంది క్రియాశీలకంగా ఉన్నారని,  258 మందిని విడుదల చేశామని, రాష్ట్రంలోమొత్తం ఇప్పటి వరకు 31 మంది మరణించారని తెలిపారు. గత 24 గంటల్లో మొత్తం 5783 కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 82 మందికి కరోనా పోసిటివ్ గా నిర్ధారించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80,344  మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది జనాభాకు 1504 సగటు పరీక్షలు నిర్వహించడం ద్వారా దేశంలోనే పరీక్షల నిర్వహణ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి స్థానం లో నిలిచిందన్నారు.పరీక్షలు చేసిన వాటిలో 1.57 శాతం  పోసిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదు అవుతున్నాయి. దేశంలో 7,16,733 మందికి పరీక్షలు చెయ్యగా 29,572 మందికి నిర్ధారణ అయినది, ఇది 4.13 శాతమని కూడా జవహర్ రెడ్డి చెప్పారు.