లక్ష బెడ్లు సిద్ధం చేయండి: సీఎం జగన్
ఏపీలో మొత్తం కోవిడ్–19 పరీక్షలు 1,08,403
నిన్న 5,943 పరీక్షలు
ప్రతి పదిలక్షలకు 2030 మందికి పరీక్షలు
పాజిటివిటీ కేసుల రేటు 1.41శాతం.. దేశవ్యాప్తంగా 3.82శాతం
రాష్ట్రంలో మరణాల శాతం 2.16శాతం, దేశవ్యాప్తంగా 3.28శాతం
కోవిడ్ –19 నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్షించారు. వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో కోవిడ్–19 పరిస్థితుల కారణంగా చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చించారు.
ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించి వారిక్కావాల్సిన భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
కనీసం ఒక లక్ష బెడ్లు సిద్ధంచేసుకోవాలని సీఎం ఆదేశించారు.
అంగన్వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్ ఈ మూడూ కలిసి గ్రామాల్లో కోవిడ్ –19 క్వారంటైన్ చర్యలు చేపట్టాలని సూచించారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని సీఎం చెప్పారు.
ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు,పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేస్తున్నారు. కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేసి నిత్యావసరాలకోసం ఒక వ్యక్తికే పాసు ఇస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు డాక్టరు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్త, మందులు కూడా మొబైల్ యూనిట్కు అందుబాటులో ఉంటారు.
కేంద్రహోంశాఖ ఇచ్చిన సూచనల మేరకు ఎక్కడెక్కడ కంటైన్మెంట్ జోన్లు ఉండాలి అన్నదాన్ని గుర్తించి, అక్కడ అనుసరించాల్సిన విధానాలపై విధివిధానాలను సీఎం ఆదేశం మేరకు అధికారులు తయారుచేస్తున్నారు.