ఏపీలో వలసకూలీల అనుమతికి మార్గదర్శకాలు
posted on May 2, 2020 @ 4:04PM
లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులు 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గ్రీన్జోన్ నుంచి గ్రీన్ జోన్లకు మాత్రమే రాకపోకలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. రిలీఫ్ క్యాంప్లో నుంచి స్వగ్రామాలకు వెళ్లాలని అనుకునే వారికి ర్యాండమ్గా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. కొవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారిని బస్సులో 50 శాతం మించకుండా తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. స్వగ్రామాల్లో సైతం మరోసారి 14 రోజుల క్వారంటైన్, అనంతరం మరో 14 రోజులు హోం ఐసోలేషన్లో ఉండాలని పేర్కొంది. ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తిస్తే ఆ గ్రూప్ మొత్తాన్ని అక్కడే ఉంచాల్సిందిగా సూచించారు.
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్, రైల్వే స్టేషన్ గుర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిన రైల్వే స్టేషన్, బస్టాండ్కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వచ్చిన వారికి స్క్రీనింగ్ సహా పూల్ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో రెడ్జోన్, కంటైన్మెట్ జోన్ నుంచి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించారు. ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటైన్కు పంపి పరీక్షల అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.