AICC Working Committee Meet At Delhi

బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కష్టపడుతున్న కాంగ్రెస్

  మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన ఎజెండాగా ఏఐసీసీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యనేతల సూచనలు తీసుకున్న ఏఐసీసీ వాటి ఆధారంగా కార్యక్రమాలు రూపొందించబోతుంది. ఇప్పటికే బీజేపీ ఆర్ధిక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. అయితే రాఫేల్ డీల్ పై కేంద్రానికి సుప్రీం క్లీన్ చిట్ ఇవ్వడంతో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ఏఐసీసీ నిర్ణయం తీసుకోబోతుంది. డిసెంబర్ లో ఢిల్లీ రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.  గత 20 రోజులుగా అనారోగ్యంతో బెంగుళూరులోని జిందాల్ ప్రకృతి నిలయంలో చికిత్స పొందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఏఐసీసీ సెక్రటరీలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్ చార్జిలు.. భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరయ్యారు. డిల్లీలోని వార్ రూమ్ లో కాంగ్రెస్ పార్టీ కీలక నేతల సమావేశం కొనసాగుతుంది. కాసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి తాత్కాలిక కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనీయా గాందీ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. అన్నీ రాష్ట్రాల నుంచి కీలక నేతలంరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలనే ప్రధాన ఎజెండాతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఎన్ని చేసినా ప్రజల్లో ఒక్కసారి పోయిన నమ్మకం అంత సులువుగా తిరిగి రాదని.. బీజేపీ చేస్తున్న మంచి పనులను ప్రజలు చూస్తూనే ఉన్నారని.. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాటలు.

Reason Behind D Srinivas Letter To CM KCR Over TSRTC Strike

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ కు బహిరంగలేఖ.. రాజకీయ చదరంగం మొదలుపెట్టిన డీఎస్!!

  రాజకీయాల్లో అన్ని దానాల కంటే నిదానం మంచిది అన్నారు పెద్దలు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో డి శ్రీనివాస్ ఈ నినాదాన్నే పాటిస్తున్నారు. పేరుకే ఆ పార్టీలొ ఉన్నారు గాని ఆయన నోరు మెదపడం లేదు. టీఆర్ఎస్ పెద్దలతో గ్యాప్ ఏర్పడిన తరువాత ఆయన సరైన సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. అదును చూసి ఇప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఓ లేఖాస్త్రం సంధించారు.  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతుంది. మొదట్లో ఒకరిద్దరు మంత్రులు సమ్మెపై స్పందించి విమర్శల పాలయ్యారు. ఆ తర్వాత మిగతా నేతలెవరూ పెదవి కదపటంలేదు. సమ్మెపై స్పందిస్తే ఎక్కడ బాస్ ఆగ్రహానికి గురికావలసి వస్తుందోనన్న భయంతో అందరూ సైలెంట్ అయిపోయారు. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అంశమే ఇప్పుడు గులాబీ పార్టీ వర్గాల్లో చర్చలకు దారి తీస్తుంది. ఆర్టీసీ సమ్మెపై డీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఓ వైపు సూచన చేస్తూనే మరోవైపు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. విభజన జరగని ఏపీఎస్ఆర్టీసీని ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ తన స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించడం వెనుక ఏదో కుట్ర కోణం దాగుందని డీఎస్ తన బహిరంగ లేఖలో పేర్కొనడం గమనార్హం.  అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీతో డి శ్రీనివాస్ అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ బిజెపిలో చేరడంతో పాటు అప్పటి సిట్టింగ్ ఎంపీ కవితపై విమర్శలు గుప్పించడం టీఆర్ఎస్ పెద్దలకు రుచించలేదు. దీంతో డీఎస్ కూడా పార్టీ మారుతారంటూ అప్పట్లో చర్చ జరిగింది. డీఎస్ మాత్రం తన కుమారుడుది తనది రాజకీయంగా వేరు వేరు దారులని బహిరంగంగానే చెప్పారు. ఇదే సమయంలో నిజామాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారంటూ మాజీ ఎంపీ కవిత నేతృత్వంలో ఆ జిల్లా నేతలు గులాబీ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. డీఎస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కోరారు. అయితే ఆ అంశంపై ఏ నిర్ణయం తీసుకోకుండా టీఆర్ఎస్ అధినేత పెండింగ్ లో పెట్టారు. ఈ నేపథ్యంలో పరోక్షంగా డీఎస్ ను పార్టీ నుంచి పక్కన పెట్టారన్న  వాదన కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ కు డి.శ్రీనివాస్ లేఖ రాయడం తాజా కోణం. అయితే డీఎస్ మాత్రం తాను రాసిన లేఖపై ముఖ్యమంత్రి స్పందన కోసం చూస్తున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు సూచనలని పరిగణలోకి తీసుకోని కేసీఆర్ డీఎస్ లేఖని ఖాతరు చేయరని అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే డీఎస్ ను పొమ్మనలేక పొగబెట్టారాని అందువల్ల ఆయన లేఖకి పెద్దగా విలువ ఇవ్వకపోవచ్చు అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.  సమయం చూసి డీఎస్ పై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ పెద్దల భావిస్తున్న తరుణంలోనే ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాయడం ద్వారా రాజకీయ చదరంగం మొదలు పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. తనింకా ఆ పార్టీలోనే ఉన్నానని వారికి గుర్తు చేశారని అంటున్నారు. అంతేకాదు సీనియర్ రాజకీయ నేతగా ఆర్టీసీపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే డీఎస్ లేఖ రాశారని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఒక వైపు తనపై వేటు వేయాలని పార్టీ కాచుకొని ఉండడం మరోవైపు కొంతకాలం నుంచి రాజకీయంగా తెరమరుగు కావడం డీఎస్ కు మింగుడు పడటం లేదట. ఈ తరుణంలోనే టీఆర్ఎస్ అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నారన్న చర్చ డీఎస్ వర్గీయుల్లో కొనసాగుతుంది. మరి ఈ లేఖ వ్యవహారంపై గులాబి అధినేత స్పందిస్తారో లేదో చూడాలి.

Maharashtra Government Formation Live Updates

ఇది ఫైనల్.. మహారాష్ట్ర లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న శివసేన

  మరాఠా రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు ఒకటై రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై 3 పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. అయితే కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ పూర్తి స్థాయిలో సెట్ కాలేదు. మరో రెండు మూడు రోజుల్లో మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 5 ఏళ్ల పాటు శివసేనకే సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ , ఎన్సీపీలు అంగీకరించాయి. ఈరోజు గవర్నర్ భగతసింగ్ కోషియారిని కలిసి మెజారిటీ క్లెయిమ్ చేసుకుంటున్నాయి మూడు పార్టీలు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ ను కోరనున్నాయి.సీఎం సీటు గురించి బీజేపీ, శివసేనల మధ్య గొడవ వచ్చినందున ఆ పదవిని శివసేనకే వదిలేస్తామన్నారు ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్. శివసేన తన గౌరవాన్ని తిరిగి పొందేలా సహకరిస్తామన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల మధ్య కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కూడా కుదిరింది. సీఎం సీట్ ను 5 ఏళ్ల పాటు శివసేనకే అప్పగించటం.. ఎన్సీపీ, కాంగ్రెస్ లకు ఒక్కో డిప్యూటీ సీఎం పదవి మూడు పార్టీలకు తలో 14 మంత్రి పదవులు కాంగ్రెస్, ఎన్సీపీలకు కీలకమైన హోం రెవెన్యూ అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మూడు పార్టీలతో ఏర్పడబోయే ప్రభుత్వం 5 ఏళ్ల పాటు సక్సెస్ ఫుల్ గా పాలన చేస్తుందన్నారు శరత్ పవార్. శివసేన హిందూత్వ పార్టీనే అయిన కాంగ్రెస్, ఎన్సీపీలు మాత్రం సెక్యులరిస్టు ఐడియాలజీ పై కాంప్రమైజ్ కాబోవన్నారు.  రాష్ట్ర నేతలు ఓకే చేసిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ పై రేపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించనున్నారు శరత్ పవార్. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో ఇంకా కొన్ని అంశాలు తేలాల్సి ఉంది. దానిని మహారాష్ట్ర వరకే పరిమితం చేయడమా లేదంటే నేషనల్ లెవల్ లో అమలుచెయ్యటమా అనేది తేలలేదు. యూనిఫాం, సివిల్ కోడ్, ముస్లిం రిజర్వేషన్ ల బిల్లు, వీర్ సావర్కర్ కు భారత రత్న విషయాల్లో ఇంకా అభిప్రాయాలూ కుదరలేదు. పవార్, సోనియా మీటింగ్ లోనే విధానాల రూపకల్పన జరుగుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు.మహారాష్ట్రలో 25 ఏళ్లు ఇక శివసేనదే అధికారమన్నారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్. రెండు మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేప్పుడు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ఆధారంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాల్సి ఉంటుందన్నారు.  బీజేపీ లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోదన్నారు పార్టీ స్టేట్ చీఫ్ చంద్ర కాంత్ పాటిల్. తాము మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని చెప్పారు. తమ దగ్గర అత్యధికంగా 119 మంది ఎమ్మెల్యేలున్నారని చెప్పారు. రాష్ట్ర పార్టీ నేతలతో భేటీ తర్వాత ఆయన మాట్లాడారు. హిందుత్వ ఐడియాలజీని శివసేన వదులుకుంటోందని తాను అనుకోవడం లేదన్నారు వీరసావర్కర్ ముని మనవడు రంజిత్. అలాగే వీర్ సావర్కర్ కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ విషయంలో వెనక్కి తగ్గబోదన్నారు. హిందుత్వ విషయంలో కాంగ్రెస్ మైండ్ సెట్ ను శివసేన మారుస్తుందన్నారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తాయని ప్రశ్నిస్తూ హిందూ మహాసభ ప్రతి నిధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కూటమికీ.. ప్రజాతీర్పుకు అది విరుద్ధమన్నారు. అయితే ఈ కేసు విచారణ అంత అత్యవసరం కాదని సుప్రీం ప్రస్తుతానికి విచారించలేదు. వచ్చే వారం విచారణకు వచ్చే చాన్సుంది.

Illegal liquor flows to AP from telangana

ధర తక్కువ, టైం ఎక్కువ.. తెలంగాణ బాట పట్టిన ఏపీ మందుబాబులు

  ఏపీలో మందు బాబులు తెలంగాణ బాట పడుతున్నారు. సరిహద్దు గ్రామాల బార్లకు క్యూ కడుతున్నారు. ధర తక్కువ, సమయం ఎక్కువ ఉండటమే కారణం. పొరుగు రాష్ట్ర మద్యంతో ఏపీలో బెల్టు జోరందుకుంటోంది. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ఇద్దరిని కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రర్ల పాడుకు చెందిన ఎంపతి మల్లేశ్వరి, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట కు చెందిన కోపల్లి ప్రకాశరావును అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.తెలంగాణ నుంచి మద్యం రాకుండా కట్టడి చేస్తున్నామని తెలిపారు.  ఆంధ్రలో ధర ఎక్కువ.. రాత్రి 8 గంటలకే దుకాణాలూ మూసేస్తున్నారు. దీంతో సరిహద్దు గ్రామాల్లోని తెలంగాణ దుకాణాల్లో అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. పశ్చిమ కృష్ణా లో జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, వీరులపాడు మండలాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉండటంతో.. ఇక్కడి ప్రజలు సరిహద్దు ఆవల సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని దుకాణాలకు క్యూ కడుతున్నారు. మధ్య తరగతి ప్రజలు.. పేదలు.. ఎక్కువగా తాగే బ్రాండ్ లు సీసాకు 40 రూపాయలకు పైగా ధరలో వ్యత్యాసం ఉంది.  వీరులపాడు మండలం పెద్దాపురం, జయంతి, అల్లూరు గూడెం, మాధవరం గ్రామాల మందు బాబులు ఎర్రుపాలెం దుకాణాలకు.. వీరులపాడు, దొడ్డదేవరపాడు, బి అన్నవరం పల్లెంపల్లి, కొనతాలపల్లి, వెల్లంకి గ్రామాల నుంచి దెందుకూరు దుకాణానికి వెళుతున్నారు. వత్సవాయి మండలం కాకిరాయి, కంభంపాడు, మాచినేనిపాలెం, తాళ్లూరు, పెనుగంచిప్రోలు మండలం శివాపురం ముచింతల, అనిగండ్లపాడు.. నందిగామ మండలం, జొన్నల గడ్డ రామిరెడ్డిపల్లి, మధిర శివారులో ఉన్న మడుపల్లి దుకాణానికి బారులు తీరుతున్నారు. మండల కేంద్రం వత్సవాయిలో రెండు దుకాణాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఐదు కిలోమీటర్ల దూరంలోని బోనకల్లుకు పోతున్నారు. కొంత మంది పొరుగు రాష్ట్రం దుకాణాల నుంచి మద్యం బాటిళ్లు తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఈ విధంగా తీసుకు వచ్చిన 203 బాటిళ్లను శుక్రవారం నందిగామ ఎక్సైజ్ అధికారులు పట్టు కున్నారు. చందర్లపాడుకు చెందిన ఎంపతి మల్లీశ్వరి,పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన కోపల్లి ప్రకాష్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 13వ తేదీన నందిగామ ఆర్టీసీ బస్టాండ్ లో తనిఖీల్లో భాగంగా 150 సీసాలను పోలీసులు పట్టుకున్నారు. రెండు రోజుల కాలంలో తెలంగాణ నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా చేయడం ఇది రెండో సారి.

all telecom companies to charge 6 paise per minute

'నో ఫ్రీ కాలింగ్' అంటున్న కేంద్రం.. ప్రతి నెట్ వర్క్ నిమిషానికి 6పైసలు వసూలు చేయాల్సిందే!

  మొబైల్ ఫోన్ల రంగంలో వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఇక పై ఉచిత కాల్స్, చౌక డేటాలు ఉండకపోవచ్చు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో టెలికాం కంపెనీలు రూ.92,500 కోట్లకు పైగా చెల్లించాల్సింది ఉంది. దానితో ఇప్పుడు కంపెనీలు మూతపడే ప్రమాదం లేకుండా వాటిని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తుంది. టెలికాం శాఖలో కమిటీ ఆఫ్ సెక్రటరీస్ ను ఏర్పాటు చేసి తగిన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది. ఫోన్ కాల్స్ తో పాటు డేటా వినియోగానికి కనీస చార్జీలు వసూలు చేయాలని కమిటీ సూచించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. కస్టమర్ లను ఆకట్టుకునేందుకు కంపెనీలు ఇస్తున్న ఉచిత ఆఫర్లను వెనక్కి తీసుకోవాలన్న అంశాన్ని కమిటీ ప్రతిపాదించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. టెలికాం కంపెనీల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్న ఉచిత కాల్స్ చౌక డేటా ఆఫర్లను ఆపేయాలని కేంద్రానికి కమిటీ నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. బెయిలౌట్ ప్యాకేజ్ కింద టెలికాం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సూచనలు చేయవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  వాయిస్ ఫోన్ కాల్స్, డేటా సర్వీసులకు కనీస చార్జీలను కూడా ట్రాయ్ ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. వినియోగదారులు ఉచిత కాల్స్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ సదరు నెట్ వర్క్ లు చార్జీలు.. చెల్లిస్తూనే ఉన్నాయి. ఎయిర్టెల్ నుంచి జియోకు అక్కడి నుంచి మళ్లీ ఎయిర్టెల్ కు కాల్స్ వెళ్లినప్పుడు నిమిషానికి 6 పైసల చొప్పున ప్రత్యర్థి ఆపరేటర్ లకు చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల జియో తన వినియోగదారులపై నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని చెప్పి తర్వాత కొత్త స్కీమ్ ల ద్వారా వారికి ఊరట కల్పించింది. ఇప్పుడు మాత్రం ప్రభుత్వమే వినియోగదారులపై చార్జీల విధింపు ప్రస్తావనను తెరపైకి తెచ్చింది. తాజా ప్రతిపాదనలు ఎయిర్టెల్, వొడాఫోన్ కు ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే జియో వేగాన్ని తట్టుకోలేక నష్టాలతో ఉన్న ఇతర  కంపెనీలకు టారిఫ్ విధానం ఊరట కలిగించే అవకాశముంది. టెలికాం ప్రతిపాదనలపై వార్తలు వచ్చిందే తడవుగా స్టాక్ మార్కెట్ లో ఆ కంపెనీల షేర్లు 10 శాతం పెరిగాయి.

Students Protest For High Court at MLA Hafeez Khan House

కర్నూలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి.. సీమలో రాజధాని ఏర్పాటు చేయాలి!!

  శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ విద్యార్థి సంఘాలు శనివారం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటిని ముట్టడించారు. చాలా మంది విద్యార్థులు..విద్యార్థి సంఘం నేతలు.. కర్నూలులో హైకోర్టును, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో గత 3 నెలలుగా కర్నూలులో ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో వాళ్ళందరూ ఏకంగా ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇళ్లను ముట్టడించే కార్యక్రమాన్ని చేపట్టారు. రాయలసీమ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా రాయలసీమలో రాజధాని, కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి అనేక ఆందోళన కార్యక్రమాలు చేశారు. గత ప్రభుత్వంలానే ఈ ప్రభుత్వం కూడా కళ్లకు గంతలు కట్టినట్టే వ్యవహరిస్తుంది. అనేక ప్రజాప్రతిధులకు వినతిపత్రాలిచ్చారు. ధర్నాలు చేసినప్పటికీ ఎటువంటి స్పందన ఇవ్వకుండా మౌనంగా ఉండే వైఖరిని జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. రాయలసీమ అనేక సంవత్సరాలుగా దగా పడుతూనే వుంది. గత 82 సంవత్సరాల మునుపు ఎక్కడ పెద్దల ఒప్పందం జరిగిందో ఇదే రోజున కర్నూలులో ఉన్నటువంటి 14 మంది ప్రజాప్రతినిధుల యెక్క ఇళ్లను ముట్టడించి వాళ్లకి రాయలసీమలో జరుగుతున్నటువంటి అన్యాయాలను గుర్తుచేశారు. ఇప్పటికైనా మీరు.. ప్రభుత్వం పై, సీఎం పై ఒత్తిడి తీసుకువచ్చి రాయలసీమలో హైకోర్టు అనే ప్రకటన వెంటనే చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.

ap ias officers using public money

పిసినారి ఐఏఎస్ లు.. రోజువారీ ఖర్చులు కూడా ప్రజాధనం నుండే కావాలి

  ఐఏఎస్ అంటే అనేక మందికి బాస్. ఆ హోదాకు తగ్గట్లే వారికి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఉండటానికి బంగ్లా.. తిరగటానికి కారు..బయటకు వెళ్తే సకల హంగులతో క్యాంప్ ఆఫీస్.. అన్ని సిద్ధంగా ఉంటాయి. ఇన్ని సదుపాయాలు ఉన్నా.. ఐఏఎస్ లలో చాలా మంది కరెంటు బిల్లులు కూడా కట్టలేకపోతున్నారు. తమ నివాస భవనాన్ని క్యాంపు కార్యాలయంగా చూపించి ఆ బిల్లును జేబులో వేసుకుంటున్నారు. కరెంటు బిల్లులను తమ సొంత ఆదాయం నుంచి కట్టుకుంటున్న ఐఏఎస్ లను వేళ్ల మీద లెక్కించొచ్చునని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారులు కొందరు అర్హతకు మించి వాహనాలను వాడుకుంటున్నారు.రెండు లేదా మూడు ప్రాంతాల్లో వారికి సొంత ఇల్లులు ఉంటున్నాయి. ఆ ఇళ్ళ అద్దె.. నిర్వహణ వ్యయాలు మొత్తం సర్కారు భరించాల్సిన పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన ఆర్ధిక శాఖ లేక పీఏవో శాఖాధికారులే బిల్లు పెట్టడమే ఆలస్యం అన్నట్టుగా చెల్లింపులు చేస్తున్నారు.  అన్ని శాఖలకు పెద్దన్నలాంటి ఒక శాఖ ఉన్నతాధికారికి నెలకు రూ.25 వేల కరెంటు బిల్లు వస్తుంది. ఆ అధికారి పగలంతా సచివాలయంలో ఉంటారు కానీ ఆయన ఇల్లు కమర్షియల్ జోన్ లో ఉంది. అందుకే ఇంత బిల్లు.. ఈ బిల్లును ప్రజాధనం నుంచే చెల్లిస్తున్నారు. ఇంటి నిర్వహణ, వంట సరుకులు, కూరగాయలకు అవసరమయ్యే డబ్బులు కూడా రోజు వారీగా లేదా అవసరాన్ని బట్టి రెండు మూడు రోజులకొకసారి నగదు రూపంలో తీసుకుంటున్నారు. ఇంట్లో పని వాళ్లకు ఇచ్చే వేతనాలు కూడా ప్రజాధనం నుంచే ఆయన శాఖకు అనుబంధంగా ఉన్న ఒక కార్పొరేషన్ నుంచి చెల్లింపులు చేస్తున్నారు. విజయవాడలో ఇళ్లు.. హైదరాబాద్లో మరో క్వార్టర్ ను ఈ అధికారి వినియోగించుకుంటున్నారు. వైసిపి అధికారంలోకి రాక ముందు ఈ అధికారి వేరే శాఖకు ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పుడు కూడా ఇదే రీతిలో ఇంటి ఖర్చులు పుచ్చుకునేవారు.  ప్రతి నెలా తమ సొంత ఆదాయం నుంచి కరెంటు బిల్లులు కడుతున్న ఐఎఎస్ లు లేకపోలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం ఒక్క వాహనం, ఒక్క ఇళ్లు మాత్రమే ఉన్న ఐఎఎస్ లు ఉన్నారు. కానీ కొందరికి ఒక వాహనం సరిపోవటం లేదు.. రెండోది కావాల్సిందే. అంతే కాదు మొదటి వాహనం ఎంత ఖరీదైందో ,రెండోది కూడా అంతే ఖరీదైనదిగా విలాసవంతంగా ఉండాలి. ప్రభుత్వం వద్ద సిద్ధంగా లేకపోతే అద్దెకైనా తెచ్చివ్వాలి. కొందరు యువ ఐఎఎస్ ల నుంచి సీనియర్ ఐఏఎస్ ల దాకా ఇలాంటి విషయాల్లో పట్టుదలతో ఉంటున్నారు. నిజానికి ఒక ఐఎఏఏస్ ప్రభుత్వం తరఫు నుంచి ఒక్క వాహనం కేటాయిస్తారు. రానురాను అది రెండుకు మారింది కానీ దానికి సంబంధించిన ఆదేశాలు మాత్రం లేవు. కానీ, మెజారిటీ అధికారులు వారి అర్హతలకు మించి ఇళ్లు, వాహనాలు, ఫోన్ లు వాడుతూ ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది అనేది ఐఎఎస్ లకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు.కనీసం ఐఎఎస్ ల వాహనాలకు పెట్రోల్,డీజిల్ బిల్లులు చెల్లించ లేని స్థితిలో రాష్ట్రం ఉంది. బిల్లు కడితేనే డీజిల్ అని పెట్రోల్ బంకులు ఐఎఎస్ ల కార్లు వెనక్కి పంపిన సంఘటనలున్నాయి. ఇవన్నీ తెలిసినా కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని ఇష్టానుసారంగా వాడుకోవటం మాత్రం తగ్గడం లేదు.

82 years for sribagh agreement

శ్రీబాగ్ ఒప్పందం మరిచిపోయారా ?.. రాయలసీమకు అన్యాయం!! 

  శ్రీబాగ్ ఒప్పందం కుదిరి నేటికి సరిగ్గా 82 ఏళ్ళు అయ్యింది. ఈ ఒప్పందమే 1953 లో ఆంధ్రరాష్ట్రం, 1956 లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మూలం. సీమ అభివృద్ధి కోసం నాడు చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని రాయలసీమ వాసులు ఇప్పటికే కోరుతున్నారు. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా హైకోర్ట్ ఏర్పాటు కోసం సీమవాసులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసారు. నేడు ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు.  గతంలో శ్రీబాగ్ ఒప్పందం ఏ మేరకు అమలైంది. అనుకున్నట్టుగా సీమ అభివృద్ధి జరిగిందా.? 1937, నవంబర్ 16 న మద్రాసు లోని కాశీనాధుని నాగేశ్వరరావు గృహంలో శ్రీబాగ్ లో సమావేశమయ్యారు కోస్తా, సీమ ప్రాంత పెద్దలు. ఈ సమావేశంలోనే మద్రాసు నుంచి తెలుగువారిగా విడిపోదామన్న అవగాహనకు వచ్చారు, ఆ అవగాహనే శ్రీబాగ్ ఒప్పందం. శ్రీబాగ్ ఒప్పందం సరిగ్గా అమలు కాకపోవడం వల్లే రాయలసీమ వెనుకపడిందనే వాదనలు ఉన్నాయి. ఆ ఒప్పందం లోని కీలక అంశాలు పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయనే భావనలో సీమవాసులు ఉన్నారు.  కృష్ణా నదిలో లభ్యమయ్యే నీటిలో సీమకు సింహభాగం ఇవ్వాలని.. అందుకు అనుగుణంగా ప్రాజెక్ట్ లు నిర్మించాలి అని ఒప్పందంలో ఉంది. అయితే రాయలసీమలో నిర్మించిన శ్రీశైలం డ్యాం సైతం సీమకు ఉపయోగపడని రీతిలో నిర్మించారని సీమవాసులు పేర్కొంటున్నారు. రాజధానిగా కర్నూలును ఎంపిక చేసి 4 సంవత్సరాల తిరగకుండానే ఆంధ్రప్రదేశ్ పేరుతో దాన్ని హైదరాబాదుకు తరలించారని గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం సందర్భంలో కనీసం శ్రీబాగ్ ఒప్పందం గురించి ప్రస్తావన లేకుండా నాటి పెద్దలు సీమకు తీరని అన్యాయం చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం ఏర్పాటైన ఒప్పందాలు సైతం సర్కారు నేతల స్వార్థం కారణంగా అమలు కాలేదని.. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి.

YS Jagan Instructions To MPs

ప్రత్యేక హోదాపై మీ గళాన్ని వినిపించండి... ఎంపీలకు జగన్ ఆదేశాలు

  తమ వ్యక్తిగత అభిప్రాయాలను టీవీ చర్చల్లో బయట పెడుతున్నారు కొందరు ఎంపీలు. ఒకరిద్దరు ఎంపీలు పార్టీని సంప్రదించకుండానే నేరుగా కేంద్ర మంత్రులను..ప్రధానిని కలుస్తున్నారు. ఇది సరికాదని పార్టీ ఎంపీలకు వైసిపి అధినేత సీఎం జగన్ సూచించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించేందుకు వీలుగా తాడిపల్లిలోని నివాసంలో శుక్రవారం వైసీపీ ఎంపీలతో జగన్ భేటీ అయ్యారు. వైసీపీ పార్టీ జాతీయ కార్య దర్శి విజయసాయిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలను సంప్రదించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాకే కేంద్ర మంత్రులను.. ప్రధానిని.. కలవాలని జగన్ సూచించారని సమాచారం. స్వతంత్రంగా వ్యవహరిస్తూ విజయసాయిరెడ్డి లేకుండా కలవడం సరికాదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఇలా జరిగితే షోకాజ్ నోటీసు జారీ చేసేందుకు వెనుకాడడని పార్టీ ఎంపీలతో ఘాటుగా హెచ్చరించారు జగన్.  పోలవరం రెవిన్యూ లోటు విభజన చట్టం ప్రకారం నెరవేర్చాల్సిన అంశాలు.. ప్రస్తుత స్థితి గతులను.. ఎంపీలకు ఉదాహరణగా వివరించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ వాణిని వినిపించి.. ప్రతి పక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. రెవిన్యూ లోటు కింద కేంద్రం ఇవ్వాల్సిన మొత్తాన్ని గురించి పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వెనుక బడిన ఏడు జిల్లాలకు రావలసిన నిధులను అడగాలన్నారు. కొత్త జాబితా ప్రకారం రాష్ట్రానికి 12 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఇళ్ల కోసం ఉన్న అర్హతలను సడలించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. కేంద్ర అర్హతలతో చాలా మంది పేదలకు ఇళ్లు రావటంలేదు. ఎంపీల సంఖ్యాపరంగా వైసిపి లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీ, ఈ బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలి అని ఎంపీలకు జగన్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు పై ఎంపీలకు జగన్ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసిన మొత్తంలో కేంద్రం ఇంకా రూ.3222 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. నిర్వాసితులకు సహాయ పునరావాసం కోసం 10,000 కోట్లు, కాంక్రీట్ నిర్మాణాల కోసం 6000 కోట్లు కేంద్రాన్ని కోరాలని సూచించారు. సరైన ప్రణాళికలు లేకుండా పోలవరం పనులు చేశారు. దీనివల్ల నాలుగు నెలలుగా పనులు చేయలేకపోయాం. వచ్చే జూన్ నాటికి కాపర్ డ్యాం పూర్తవుతుంది. స్పిల్ వే పనులు వెనువెంటనే పూర్తి చేయటం ద్వారా ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తాం. ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది అని జగన్ వివరించారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులు మంజూరు చేసేలా కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. రాష్ట్ర విభజన నాటికి కాగ్ లెక్కల ప్రకారం 22,448.76 కోట్ల లోటు ఉందని తేల్చారని ఇప్పటి వరకు 3,979 కోట్లు మాత్రమే కేంద్రం చెల్లించిందని జగన్ తెలిపారు. ఇంకా 18,969 కోట్లు రావాల్సి ఉందని వివరించారు.ఈ నిధుల విడుదల అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని సూచించారు. వెనుకబడ్డ ఏడు జిల్లాలకు ఇప్పటి వరకు 7,500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా,1050 కోట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. మిగిలిన నిధుల కోసం గట్టిగా కోరాలని సూచించారు. ఉపాధి హామీ కింద పెండింగ్ లో ఉన్న బకాయిలు 2,246 కోట్లు రావాల్సి ఉందన్నారు. పీఎంజీఎస్ వై కింద చేపట్టే రోడ్ల నిర్మాణ దూరాన్ని 3,285 నుంచి 6,135 కిలోమీటర్ లకు పెంచాలని కోరామని, దీన్ని కూడా సమావేశాల్లో ప్రస్తావించాలని తెలిపారు. కొత్తగా ప్రభుత్వం ఇవ్వనున్న బియ్యం కార్డ్, ఆరోగ్య శ్రీ కార్డ్, ఫీజు రీఎంబర్స్ మెంట్, పెన్షన్ కార్డులకు అర్హతలు సడలించామన్నారు. గతంలో రేషన్ కార్డు పొందాలంటే ఆదాయ పరిమితి నెలకు గ్రామీణ ప్రాంతాల్లో 5000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 6,250 రుపాయలు ఉండేదని దానిని గ్రామీణ ప్రాంతాల్లో 10,000 ,పట్టణ ప్రాంతాల్లో 12,000 లకు పెంచామని తెలిపారు. రాష్ట్రానికి కొత్తగా ఏడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరాలన్నారు. ట్రైబల్ వర్సిటీని విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో ఏర్పాటు చేసేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు.  రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందని జగన్ తెలిపారు. వివక్షతకు తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నా టిడిపి బురద జల్లుతోందని, దీనిని బలంగా తిప్పికొట్టాలనీ సూచించారు. స్థానిక సంస్ధల ఎన్నికల తరువాత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని సీఎం వెల్లడించారు. ప్రతి ఎమ్మెల్యేతో సహా నియోజకవర్గానికి చెందిన నలుగురైదుగురు ముఖ్య నాయకులను త్వరలోనే కలుస్తానని సీఎం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని ఎంపీలు స్వాగతించారు. ఈ సమావేశానికి 21 మంది ఎంపీలు , రాజ్య సభ సభ్యులు హాజరయ్యారు.

people protesting against tree cutting

చెట్లని తొలగిస్తే ఊరుకోము... పర్యావరణం పట్ల ప్రజలకు ప్రేమ మొదలైంది

  పొగ కమ్మేసి ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆక్సిజన్ కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ చూస్తుంటే మనం సేఫ్ జోన్ లో ఉన్నామనే మాట ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. ఇదే సమయంలో తెల్లాపూర్ మార్గాల్లో చెట్ల తొలగింపు పై దుమారం రేగుతోంది. నల్లగండ్ల సమీపం తెల్లాపూర్ మార్గంలో చెట్ల తొలగింపు పై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్ల నరికివేతను నిలిపి వేయాలని స్థానికులు ఆందోళనకు దిగారు. అటవీ శాఖ అనుమతులు లేకుండా పచ్చని చెట్లను నరికేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  గతంలో తెల్లపూర్ జంక్షన్ నుంచి నాగులపల్లి వరకు రేడియల్ రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు ఆర్ అండ్ బీ అధికారులు. అందుకోసం అడ్డుగా ఉన్న చెట్లు తొలగించటానికి అటవీ శాఖ అనుమతి కోరారు. ఫారెస్టు డిపార్ట్ మెంట్ అభ్యర్థన మేరకు సెంట్రల్ హైదరాబాద్ ఫారెస్ట్ ఆఫీసర్ సర్వే చేపట్టారు. రోడ్డుకి ఇరువైపులా 134 చెట్లు ఉన్నట్లు గుర్తించారు. అందుకు సంబంధించిన రిపోర్ట్ ను 2016 అక్టోబర్ లో సమర్పించారు. 2017 మేలో జిల్లా ట్రీ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇతర అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించారు. అక్కడున్న చెట్లు రీలొకేషన్ కు అనుకూలమైనవి కావని కమిటీ సభ్యులు చెప్పారని.. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చెట్లు తొలగించేందుకు అంగీకరించినట్లుగా అటవీ అధికారులు చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలో చెట్ల ను తొలగించేందుకు ఆర్ అండ్ బీ అధికారులకు అనుమతి ఇచ్చారు. ఈ చెట్ల తొలగింపు ప్రక్రియను 2018 , డిసెంబర్ లోపు పూర్తి చేయాలని సూచించగా.. గడువులోపు చెట్లను తొలగించలేకపోయారు.  అయితే మూడు రోజుల కిందట చెట్ల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.తాము అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ పనులు ప్రారంభించామన్నారు అధికారుల. వెనువెంటనే స్థానికులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం బయటపడింది. తాము చెట్ల తొలగింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని గతంలో ఇచ్చిన అనుమతులకు సమయం ముగిసిందని తేల్చి చెప్పేశారు. దీంతో చెట్ల తొలగింపును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వమని స్థానికులు భీష్మించుకుని కూర్చున్నారు.  

goa dgp pranab nanda dies of cardiac arrest

గోవా డీజీపీ ప్రణబ్ నందా కన్నుమూత

  గోవా డీజీపీ ప్రణబ్ నందా ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. అధికారిక పని మీద ఢిల్లీలో ఉన్న నందా నిద్రలోనే  మరణించారని ఐజీ జస్పాల్ సింగ్ కన్ఫర్మ్ చేశారు. డీజీపీ నందా ఆకశ్మిక మరణం తమకు షాక్ కలిగించిందని ఐజీ జస్పాల్ సింగ్ అన్నారు.  2019 ఫిబ్రవరిలో గోవా డీజీపీగా నందా బాధ్యతలు చేపట్టారు. డైనమిక్ ఆఫీసర్ గా పేరున్న నందా.. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివి అనంతరం సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1988 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ గా ప్రణబ్ నందా అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ స్టేట్ క్యాడర్ ల్లో పనిచేశారు. 2001లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధీనంలో ఉండే ఇంటలిజెన్స్ బ్యూరోలో డెప్యుటేషన్ పై చేరి దేశ, విదేశాల్లో వీవీఐపీ సెక్యూరిటీ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. కాబుల్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో భారతీయుల భద్రతాధికారిగా సేవలందించారు ప్రణబ్ నందా. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ పోలీసు మెడల్, ప్రెసిడెంట్ పోలీసు మెడల్, స్పెషల్ డ్యూటీ మెడల్ కూడా లభించాయి.

cm kcr warns trs leaders over land settlements

భూ వివాదాలకు దూరంగా ఉండండి.. పార్టీ నేతలను హెచ్చరించిన కేసీఆర్

  భూవివాదాల్లో తలదూర్చి.. సమస్యలను కొనితెచ్చుకోవద్దంటూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆదేశించారు కేసీఆర్.  మీ కుటుంబ సభ్యులుంటే పరిష్కరించుకోవాలి కానీ ఒకవేళ వేరే వాళ్ల విషయాల్లో జోక్యం చేసుకుంటే మీకే నష్టం అంటూ హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ వివాదాల్లో అస్సలు జోక్యం వద్దన్నారు. ఒక్క భూమిని నలుగురైదుగురు క్లైమ్ చేస్తున్నారని.. ఏదో ఒక పక్షం వైపు నుండి వివాదాలను కొని తెచ్చుకోవద్దన్నారు. కుటుంబ సభ్యులు ఎవరైనా వివాదాస్పద భూలావాదేవీలు చేసి ఉంటే వెంటనే పరిష్కరించుకొని పక్కకు జరగాలని లేక పోతే భవిష్యత్తులో ఆ వివాదం మీ మెడకే చుట్టుకుంటుందని హెచ్చరించారు. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయా రెడ్డి హత్య కేసు నిందితుడుతో మాజీ ఎమ్మెల్యేకు సంబంధాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో విపక్ష పార్టీలు కూడా ఓ ప్రజాప్రతినిధిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి. ఆ తర్వాత ఇద్దరూ కూడా తమకు సంబంధం లేదని ప్రకటనలు చేశారు. ఈ ఘటనతో సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. తహశీల్దారు హత్య తరువాత గత పది రోజులుగా దాదాపు 20 మందికి పైగా ప్రజాప్రతినిధులు సీఎంను కలిశారు. వారిలో కీలకమైన వారందరిని సీఎం అప్రమత్తం చేశారు. రెవిన్యూశాఖకు సంబంధించిన అంశాలకు దూరంగా ఉండాలని నిర్దేశించారు. రియల్ ఎస్టేట్ వివాదాల్లో తలదూర్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని హెచ్చరించారు.  ప్రధానంగా హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాల భూముల విలువలు అమాంతంగా పెరగడంతో భూములతో ముడిపడి ఉన్న నేరాలు శిఖర స్థాయికి చేరుకుంటున్నాయి.తహసీల్దార్ విజయారెడ్డి హత్య ఘటన తరువాత రెవెన్యూ యంత్రాంగానికి డజనుకు పైగా హెచ్చరికలు వచ్చినట్లు కేసులు నమోదయ్యాయి. కొందరు కిరోసిన్, పెట్రోల్ బాటిళ్లతో కార్యాలయానికి వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక వైపు రక్షణ చర్యలు తీసుకుంటూనే సొంత పార్టీ ప్రజా ప్రతినిధులకు నచ్చ చెప్పే పనిలో సీఎం పడ్డారు. భూవివాదాలతో ముడిపడిన విజ్ఞప్తులు వస్తే ఎండార్స్ చేసి సంబంధిత రెవెన్యూ యంత్రాంగానికి సిఫారసు చేయరాదని..భవిష్యత్తులో ఏం జరిగినా అది రికార్డుగా మారుతుందని హెచ్చరించారు.  తెలంగాణలో రాజకీయమంతా భూ వివాదాలతోనే ముడిపడి ఉంది. హైదరాబాద్ శివారు జిల్లా లోని అపూర్వ సోదరుల్లో ఒకరు భూములు కనిపిస్తే వదలడని.. వెయ్యి ఎకరాల దాకా ఆయన ఆధీనంలో ఉందని.. ఊర్లకు ఊర్లే మాయం చేయటంలో నేర్పరి అని పేరుంది. సైకిల్ వదిలి కారెక్కిన ఐదుగురు ప్రజాప్రతినిధులు భూవివాదాల్లో సిద్ధహస్తులన్న ఆరోపణలున్నాయి. ఒకరికి దాదాపు వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని చెబుతున్నారు. మరో ప్రజాప్రతినిధి అయితే శిఖం భూములనూ వదిలిపెట్టరని.. అందుకే చెరువుల్లో ఆయన సంస్థల నిర్మాణాలు ఉంటాయని ప్రచారంలో ఉంది. ఇంకో ఎమ్మెల్యే అయితే వంద గజాల స్థలం కూడా వదిలిపెట్టరని ప్రతి భూ వివాదంలో ఆయన పేరు పెడతారని విమర్శ లున్నాయి.

AP CM Jagan Announces Salary Hike For Arogya Mitra Employees

ఆరోగ్య మిత్ర ఉద్యోగుల జీతాలు రెట్టింపు చేసిన జగన్ సర్కార్

  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలుపుకుంటున్నారు సీఎం జగన్. సంక్షేమ పథకాలతో మొదలుకుని జీతాల పెంపు వరకు అన్ని నెరవేరుస్తూ.. నిరోద్యోగులకు ఉపాధి కల్పన కూడా కల్పిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టులో పనిచేస్తున్న ఆరోగ్యమిత్రలు, టీమ్‌ లీడర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వేతనాలను రెట్టింపు చేస్తున్నట్లుగా ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌ రెడ్డి.  నవంబర్ 15న ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆరోగ్య మిత్రల వేతనం రూ.6వేలు, టీమ్‌లీడర్ల వేతనం రూ.10వేల 600గా ఉంది. ఆ ఉద్యోగుల వేతనాలు పెంచిన తర్వాత ఆరోగ్య మిత్రలు(పీహెచ్‌సీ ఆరోగ్యమిత్ర/నెట్‌వర్క్‌ ఆరోగ్య మిత్ర) రూ.12వేలు, టీమ్‌ లీడర్లు రూ.15వేలు జీతంగా అందుకోనున్నారు. వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నామని.. ఈ తరుణంలో జీతాలు పెంచడం కొంత ఊరట కలిగించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

JC Diwakar Reddy wants to be close travel business

ప్రతీకార వాంఛనే పరమావధిగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది

జేసే దివాకర్ రెడ్డి..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.. అనంతలోనే కాదు రాష్ట్ర రాజకీయం గురుంచి మాట్లాడే ప్రతి ఒక్కరికి సుపరిచితుడు. ఆయన రాజకీయంతో పాటు అనేక వ్యాపారాలు చేస్తారు.. అందులో ట్రావెల్స్ ఒకటి. ట్రావెల్స్ వ్యాపారం కొంత కాలం ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. ఎందుకంటే తాజాగా ఆర్టీఏ అధికారులు దివాకర్ ట్రావెల్స్ బస్సులపై దాడులు చేసి బస్సులను సీజ్ చేశారు. బస్సులు, ఇతర ఆస్తుల విషయంలో తనపై అనేక ఒత్తిళ్లు తెస్తున్నారని  ఆయన తెలిపారు. తన బస్సులను సీజ్ చేసిన  అధికారులపై ఎదురు కేసులు పెట్టగా.. వాళ్లు  చివరికి కాళ్లబేరానికి వస్తున్నారని.. ఎందుకు చేసారంటూ నిలదీస్తే పై అధికారుల నుండి ఒత్తిడి ఉందని చెబుతున్నారని అన్నారు. రోజు ఈ కేసుల గొడవ ఎందుకు కొన్నాళ్లు ట్రావెల్స్ నిలిపివేస్తే ప్రశాంతంగా ఉంటుందనుకుంటున్నానని దివాకరరెడ్డి చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రతీకారవాంఛ తీర్చుకొనేందుకే ఉన్నట్లు అయ్యిందని జేసీ విమర్శించారు. ప్రత్యర్ధులను హింసించేటప్పుడు అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలని జేసీ హితవు పలికారు.  కృష్ణ జిల్లా నేత వల్లభనేని వంశీ పార్టీ మారటం పై మాట్లాడుతూ.. వంశీ ఎమ్మెల్యేగా తెలుసు కానీ ప్రత్యేకంగా అతనితో అనుబంధమేమి లేదన్నారు. వంశీ ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ‘పార్టీ నుంచి బయటకు వెళ్లే సమయంలో నాదేం తప్పు లేదు.. మొత్తం అవతల వారిదే తప్పని ఓ రాయి వేసి పోతారని అన్నారు.తనపై పార్టీ మరాలని ఒత్తిడి ఏమీలేదని.. ఇటీవల ఒక పెద్దాయన కనపడి ఒకసారి వెళ్ళి జగన్ తో మాట్లాడి రమ్మని సలహా చెప్పాడన్నారు. తాను ఆయన ఇంటికెళ్లి ఏమీ మాట్లాడనని.. జగన్ ఎక్కడైనా కనిపిస్తే మంచి చెడూ మాట్లాడతాను అని దివాకర రెడ్డి చెప్పారు. ఇప్పటికే తన ట్రావెల్స్ కు చెందిన బస్సులను సీజ్ చేశారని జేసీ గుర్తు చేశారు.

 Debate On TSRTC JAC Withdraw Merger Demand CM KCR  RTC Updates

ఆర్టీసీ జేఏసీ నేతల గృహ నిర్బంధం.. యాక్షన్ ప్లాన్ ను భగ్నం చేస్తున్న పోలీసులు

ఆర్టీసీ సమ్మె 43వ రోజుకు చేరింది. ఈరోజు యాక్షన్ ప్లాన్ లో భాగంగా బస్ రోకోలతో పాటు, ఆర్టీసీ జేఏసీ నేతల నిరాహార దీక్ష ఉంది. ఈ ప్లాన్ భగ్నం చేయడానికి పోలీసులు రాత్రి నుంచే ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతల ఇళ్లు.. ఆఫీసు దగ్గర పెద్ద ఎత్తున మోహరించారు పోలిసులు. ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇప్పటికే జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. ఏ క్షణమైనా నేతలను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అది జరగకుండా చూసేందుకు ఆర్టీసీ కార్మికులు సైతం పెద్ద ఎత్తున వాళ్ల ఇళ్లకు చేరుకుంటున్నారు. తలుపులు పగలగొట్టి అశ్వద్ధామ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ కొద్దిగ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక బస్ రోకోను భగ్నం చేసేందుకు డిపోలు, బస్టాండ్ దగ్గర కూడా పోలీసులు మోహరించారు. బస్ భవన్ తో పాటు ప్రతి డిపో దగ్గర 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రూపులుగా ఏర్పడడం.. ఆందోళనలకు దిగడం.. లాంటివి చేస్తే అరెస్ట్ తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా సిరిసిల్ల డిపో ముందు బైఠాయించిన కార్మికులు అఖిల పక్ష నేతలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.రేపు ఎల్లండీ కూడా అన్ని బస్ డిపోల వద్ద సాముహిక దీక్షను, ఎల్లుండి ( నవంబర్ 18న ) సడక్ బంద్ కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు పరిష్కారం రావట్లేదని టీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వెనక్కి తగ్గేది లేదంటే కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు ముందుకు వెళ్తున్నారు. అందరూ  సామూహిక దీక్షకు కాసేపట్లో  కూర్చుంటారా.. లేదంటే ముందుగా అందరిని అరస్టు చేస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఆర్టీసీ జేఏసీ నేతల గృహ నిర్బంధం.. యాక్షన్ ప్లాన్ ను భగ్నం చేస్తున్న పోలీసులు

ఆర్టీసీ సమ్మె 43వ రోజుకు చేరింది. ఈరోజు యాక్షన్ ప్లాన్ లో భాగంగా బస్ రోకోలతో పాటు, ఆర్టీసీ జేఏసీ నేతల నిరాహార దీక్ష ఉంది. ఈ ప్లాన్ భగ్నం చేయడానికి పోలీసులు రాత్రి నుంచే ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతల ఇళ్లు.. ఆఫీసు దగ్గర పెద్ద ఎత్తున మోహరించారు పోలిసులు. ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇప్పటికే జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. ఏ క్షణమైనా నేతలను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అది జరగకుండా చూసేందుకు ఆర్టీసీ కార్మికులు సైతం పెద్ద ఎత్తున వాళ్ల ఇళ్లకు చేరుకుంటున్నారు. తలుపులు పగలగొట్టి అశ్వద్ధామ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ కొద్దిగ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక బస్ రోకోను భగ్నం చేసేందుకు డిపోలు, బస్టాండ్ దగ్గర కూడా పోలీసులు మోహరించారు. బస్ భవన్ తో పాటు ప్రతి డిపో దగ్గర 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రూపులుగా ఏర్పడడం.. ఆందోళనలకు దిగడం.. లాంటివి చేస్తే అరెస్ట్ తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా సిరిసిల్ల డిపో ముందు బైఠాయించిన కార్మికులు అఖిల పక్ష నేతలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.రేపు ఎల్లండీ కూడా అన్ని బస్ డిపోల వద్ద సాముహిక దీక్షను, ఎల్లుండి ( నవంబర్ 18న ) సడక్ బంద్ కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు పరిష్కారం రావట్లేదని టీ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వెనక్కి తగ్గేది లేదంటే కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు ముందుకు వెళ్తున్నారు. అందరూ  సామూహిక దీక్షకు కాసేపట్లో  కూర్చుంటారా.. లేదంటే ముందుగా అందరిని అరస్టు చేస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

బాబు మీటింగ్ కి 10మంది ఎమ్మెల్యేల డుమ్మా... నలుగురిపై అనుమానాలు

వల్లభనేని వంశీ అండ్ దేవినేని అవినాష్ రాజీనామా... ఇసుక దీక్ష తర్వాత చంద్రబాబు నిర్వహించిన అత్యంత కీలక సమావేశానికి 10మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టడం... తెలుగుదేశంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలే, చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నవేళ అంతమంది ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి డుమ్మాకొట్టడంతో పార్టీ లీడర్లతో పాటు బాబు సైతం కంగుతిన్నారట. అంతేకాదు సమావేశం గురించి ఒకరోజు ముందే సమాచారమిచ్చినా ఎందుకు రాలేదని చంద్రబాబు ఆయా ఎమ్మెల్యేలను ఫోన్లో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పది మందిలో కొందరు ముందే సమాచారమిచ్చినా, ఎక్కువమంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే డుమ్మాకొట్టారట. చంద్రబాబు సమావేశానికి డుమ్మాకొట్టిన ఎమ్మెల్యేల్లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బాలకృష్ణ, గద్దె రామ్మోహన్ రావు, చినరాజప్ప, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ లు.... వివిధ కారణాలను చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, గంటా శ్రీనివాసరావు, బెండాలం అశోక్, పీజీవీఆర్ నాయుడు, వాసుపల్లి గణేష్ లు... ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే సమావేశానికి గైర్హాజరయ్యారని అంటున్నారు. అయితే, ఈ నలుగురిలో గంటా ఎప్పట్నుంచో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండగా, మిగతా ముగ్గురుపైనా ఇఫ్పుడు అనుమానాలు మొదలైయ్యాయి. గంటాతోపాటు వీళ్లు కూడా జంపింగ్ బ్యాచ్ లో ఉన్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని పావులు కదుపుతోన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి.... పార్టీ ఫిరాయింపులపై తాను చేసిన వ్యాఖ్యలే తనకు అడ్డంకి మారాయి. చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా.... రాజీనామాచేశాకే పార్టీలోకి రావాలన్న జగన్ కండీషన్ ... వాళ్లను వెనుకంజ వేయిస్తుందట. కానీ, చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ఆలోచిస్తున్న జగన్.... 8నుంచి 10మంది ఎమ్మెల్యేలను మాత్రం టీడీపీ నుంచి బయటికి రప్పించడానికి పావులు కదిపారని అంటున్నారు. మరి, బాబు కీలక మీటింగ్ కి డుమ్మాకొట్టిన ఈ 10మందిలో కనీసం నలుగురైదుగురు ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది.

రెండు నెలల జైలు జీవితం తరువాత చింతమనేనికి బెయిలు మంజూరు

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బెయిలు మంజూరు చేసింది కోర్టు. ఆయన మీద ఉన్న నాలుగు కేసుల్లో బెయిలు ఇస్తున్నట్లుగా తెలిపింది. ఈరోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. త్వరలోనే అన్ని కేసుల్లో బెయిల్ లభిస్తుందని ఆయన అనుచరులు ఆశాజనకంగా ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ పై దాదాపు 60కి పైగా కేసులు నమోదయ్యాయి. 70 రోజుల నుంచి చింతమనేని ప్రభాకర్ ఏలూరు జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఆయనకు ఒక కేసులో బెయిల్ వచ్చినా.. ఏదో ఒక కారణంతో మరొక కేసులో అరెస్ట్ చేస్తుండంతో రెండు నెలలకు పైగానే చింతమనేని ప్రభాకర్ జైలు జీవితం గడిపారు. ఆయన జైలు నుంచి విడుదల ఈరోజు కానున్నారు. విడుదల అవుతున్నారన్న సంతోషం వ్యక్తం చేసే గ్యాప్ లో విచారం వ్యక్తం చేసే వార్తను వినిపిస్తున్నారు. మరొక కేసులో చింతమనేనిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది.

లోకేషే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? లోకేష్ అందర్నీ అవమానించాడా?

వల్లభనేని వంశీ... జూపూడి ప్రభాకర్... ఇలా టీడీపీని వీడుతోన్న నేతల టార్గెట్ అంతా నారా లోకేషే. తెలుగుదేశాన్ని వీడుతోన్న లీడర్లంతా లోకేష్ టార్గెట్ గానే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తమలో దాచుకున్న ఆక్రోశాన్ని, కసిని వెళ్లగగ్గుతున్నారు. అధినేత చంద్రబాబును వదిలేసి చినబాబుపైనే రగిలిపోతున్నారు. వైసీపీ నేతలు కూడా విమర్శించనంతగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, లోకేష్ పై ఇంత పచ్చిగా విమర్శలు చేయడానికి... అధికారంలో ఉండగా చినబాబు చూపించిన వ్యవహార శైలే కారణమంటున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ నారా లోకేష్ అవమానించాడనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. తోటి మంత్రులనే కాదు... నాలుగైదు గెలిచిన ఎమ్మెల్యేలను, సీనియర్ లీడర్లను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఇలా ఎవరినీ లెక్కచేసేవారు కాదంట. చంద్రబాబు తనయుడుగా... దాదాపు సెకండ్ పవర్ సెంటర్ గా వ్యవహరించిన లోకేష్... తనను కలవడానికి వచ్చిన ఎవరికీ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించేవారట. వయసులో చిన్నవాడైనా లోకేష్ ను కలిసేందుకు జేసీ లాంటి సీనియర్లు సైతం గంటల తరబడి గది బయట వేచి చూడాల్సి వచ్చేదట. అలా, లోకేష్ చేతిలో అవమానాలు ఎదుర్కొన్న నేతలే... ఇప్పుడు పార్టీని వీడుతూ తమ కసి అంతా తీర్చుకుంటున్నారని అంటున్నారు. చంద్రబాబు కంటే చినబాబుపైనే ఎక్కువగా విరుచుకుపడటానికి... అధికారంలో ఉండగా లోకేష్ వ్యవహరించిన తీరే కారణమంటున్నారు. అందుకే పోతూపోతూ లోకేష్ ను చెడుగుడు ఆడుకుంటున్నారని టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. అధికారంలో ఉండగా లోకేష్ తన పవర్ అండ్ ఆటిడ్యూడ్ చూపించాడని... ఇప్పుడు వాళ్ల వంతు వచ్చింది... అందుకే ఇంతలా పచ్చిగా తిడుతూ తమ కసి తీర్చుకుంటున్నారని అంటున్నారు. వల్లభనేని వంశీ.... నారా లోకేష్ ను టార్గెట్ చేయడం వెనుక... చినబాబు నుంచి ఎదురైన అవమానాలే కారణమనే టాక్ వినిపిస్తోంది. అందుకే, చంద్రబాబును పక్కనబెట్టి... లోకేష్ పై విరుచుకుపడుతున్నాడని అంటున్నారు. ఇప్పటికీ చంద్రబాబునాయుడు గారు అంటూ సంభోదిస్తున్న వల్లభనేని వంశీ.... లోకేష్ ను మాత్రం పప్పు... తుప్పు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, ఇది వల్లభనేని వంశీ ఒక్కడి ఆక్రోశమే కాదు... టీడీపీలో చాలా మంది వాయిస్ కూడా ఇలాగే ఉందంటున్నారు. మీరు రాజులం... మీరు బానిసులనే విధంగా లోకేష్ వ్యవహరశైలి ఉండేదని... ఎంతటి సీనియర్లతోనైనా ఇలాగే ప్రవర్తించేవారని, అందుకే... చాలా మంది నేతలు బాబు కంటే లోకేష్ పైనే గుర్రుగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ పగ్గాలు త్వరలో నారా లోకేష్ కి అప్పగించేందుకు చంద్రబాబు రంగంసిద్ధంచేస్తున్నారని, అందులో భాగంగా ముందుగా టీటీడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయబోతున్నారని పార్టీ లీడర్లు అంటున్నారు. తన తదనంతరం పార్టీపై లోకేష్ కి పట్టు ఉండాలంటే....ఇప్పట్నుంచే పూర్తి బాధ్యతలు అప్పగించాలని బాబు భావిస్తున్నారట. అయితే, లోకేష్ కింద పనిచేయడం ఇష్టంలేని నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారని, వెళ్తూవెళ్తూ చినబాబు చేతగానితనాన్ని రోడ్డు మీదకు లాగిమరీ వెళ్తున్నారని అంటున్నారు. అసలు జయంతికి వర్ధంతికి తేడా తెలియని లోకేష్ పార్టీని ఎలా నడిపించగలడన్న వల్లభనేని మాటలనే మరికొందరు టీడీపీ నేతలు త్వరలో వినిపించబోతున్నారట. మరి, ఈ గడ్డు పరిస్థితిని లోకేష్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.