తెరాస నాయకులకు డబుల్ ఇంజిన్ థ్రెట్!?

 అసలే వాళ్లు డబుల్ ఇంజిన్..! ఎలాంటి ఇష్యూనైనా డబుల్ ఇంజిన్ పవర్ తో బుల్ డోజ్ చేసేస్తుంటారు. వారు ఏదైనా ఓ స్కెచ్ వేశారంటే.. రాజకీయ ప్రత్యర్థులు మట్టి కరవాల్సిందే. తాము చెప్పేది వింటే సరేసరి.. లేదంటే ప్రత్యర్థుల్ని తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఉహకు అందని వ్యూహాలు పన్నుతుంటారు. అలాంటి డబుల్ ఇంజిన్ ను ఢీకొనాలనే ఎత్తుగడతో తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక తొలి ప్రభుత్వంగా టీఆర్ఎస్ అధికార పీఠం ఎక్కిన తర్వాత కొంతకాలం పాటు ప్రధాని మోడీతో కేసీఆర్ సఖ్యతగానే మెలిగారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్ను 2016 ఆగస్టు 7న గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో మోడీ- కేసీఆర్ ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసిస్తూ.. తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కు 2017లో ప్రధాని మోడీ లేఖ రాశారు. అంతకు ముందు 2015లో చండీయాగం నిర్వహించిన కేసీఆర్ ను ప్రశంసిస్తూ ప్రధాని మోడీ లేఖ రాశారు. అలాగే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ కార్యక్రమం తలపెట్టిన కేసీఆర్ బేషరతుగా మద్దతు ఇచ్చేవారు. అంతలా పాలు- నీళ్లలా మెలిగిన మోడీ- కేసీఆర్ మద్య ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కేంద్రంతో కేసీఆర్ ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నారు.. పంతంలో ఫస్ట్ న నిలిచే డబుల్ ఇంజిన్.. ఇంతలా తిరుగుబాటు చేస్తున్న కేసీఆర్ ను చూస్తూ.. ఉపేక్షిస్తుందా? ఎన్డీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తమ దారికి తెచ్చుకునేలా చేసిన, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ముగింపు పలికి తమ పార్టీ అందలం ఎక్కేలా చేయగలిగింది ఈ డబుల్ ఇంజిన్. దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్ప మరే రాష్ట్రంలోనూ తన ఉనికి అంతగా లేదనే వ్యధలో ఉన్న డబుల్ ఇంజిన్ ముఖ్యంగా తెలంగాణపై దృష్టిపెట్టింది. అందుకు తెలంగాణలో కొన్ని ఎంపీ స్థానాల్లోను, కొన్ని ఉప ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లలోనూ, జీహెచ్ఎంసీలో అనేక చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయాలు సాధించడమే కారణం. కాస్త కష్టపడితే తెలంగాణలో పాగా వేయొచ్చని బీజేపీ అగ్రనేతలు పథకాల మీద పథకాలు రచిస్తున్నారు. ఆ పార్టీలోని టాప్ లీడర్లు తరచూ తెలంగాణలో పర్యటించి, కేసీఆర్ పాలన మీద, ఆయన కుటుంబం మీద విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇంతటితో ఆగని డబుల్ ఇంజిన్ ఇప్పుడు టీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్, ఆదాయపు పన్ను శాఖల్ని ఉసిగొల్పుతోందంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో కేసీఆర్ కుమార్తె కవితకు లింక్ ఉందంటూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆమె బంధువు బోయిన్ పల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేసింది. గ్రానైట్ ఎగుమతి వ్యాపారం చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ ఇంటిని ఆయన లేకపోయినా తాళాలు పగలగొట్టి మరీ సోదాలు చేసింది. ఇటీవలే టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన గాయత్రి రవి సంస్థల మీద దాడులు చేపట్టింది. గాయత్రి రవి ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో అనుచరులను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. గాయత్రి రవి చేస్తున్న ఖర్చుల్సి చూసి, అంత డబ్బు ఎలా? ఎక్కడి నుంచి వస్తోందని, ఎక్కడికి వెళ్లోందని ఆరా తీసే పనిలో దర్యాప్తు సంస్థలు బిజీగా ఉన్నాయంటున్నారు. దర్యాప్తు సంస్థల దాడులు వీరితోనే ఆగవని, ఇంకా పలువురి పేర్లతో పెద్ద హిట్ లిస్టు ఉండి ఉండొచ్చనే భయం ఆ పార్టీ నేతల్లో ఉందంటున్నారు. ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులు కేసీఆర్ కు చెక్ పెట్టే క్రమంలోనే జరుగుతున్నాయని భావిస్తున్నారు. భౌగోళికంగా అయినా.. ఎంపీల లెక్క ప్రకారం చూసుకున్నా పదో స్థానంలో ఉండే చిన్న రాష్ట్రం తెలంగాణ. ఈ చిన్న రాష్ట్రమే బలమైన బీజేపీని, డబుల్ ఇంజిన్ ని ఛాలెంజ్ చేస్తే.. అగ్రస్థానంలో ఉండే పెద్ద రాష్ట్రాలు కూడా చెలరేగితే.. అనే ఆలోచనే టీఆర్ఎస్ లెక్కల్ని తేల్చేయాలనే వ్యూహంతో డబుల్ ఇంజిన్ వ్యూహాలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రజా క్షేత్రంలో లోకేష్ నడక.. పాదయాత్రకు ముహూర్తం ఖరారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న పాదయాత్రకు ముహూర్తం ఖరారు అయింది. 2023, జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఈ పాదయాత్రను ఆయన చేపట్టనున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఈ పాదయాత్ర పూర్తి కానుంది. ఈ పాదయాత్ర ద్వారా దాదాపు 450 రోజుల పాటు లోకేశ్.... ప్రజల మధ్య ఉండే విధంగా రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ పాదయాత్రలో లోకేశ్.. ఓ వైపు ప్రజల సమస్యలు తెలుసుకొంటూ.. మరోవైపు.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ముందుకు సాగనున్నారని సమాచారం. ఆ క్రమంలో యువత, మహిళలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోకేశ్ తనదైన శైలిలో గళం విప్పనున్నారని తెలుస్తోంది. అయితే లోకేశ్ పాదయాత్రకు సంబంధించిన విధివిధానాలన్నింటిని నవంబర్ నెలాఖరులోగా ఫైనల్ అయ్యే అవకాశం ఉందని సైకిల్ పార్టీలో ఓ చర్చ అయితే జరుగుతోంది. అయితే ఈ పాదయాత్రలో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు సాగేందుకు లోకేశ్.. తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే లోకేశ్ పాదయాత్ర విజయవంతం అయ్యేందుకు.. చంద్రబాబు ఇప్పటికే రంగంలోకి దిగి.. తనదైన చాణక్యానికి పదును పెడుతున్నట్లు సమాచారం. మరోవైపు లోకేశ్.. తాను చేపట్టే ఈ పాదయాత్రలో ఎక్కడా విరామం అనేది లేకుండా... వారంలో ఏడు రోజులు కొనసాగిస్తారని తెలుస్తోంది. అలాగే 175కి 175 నియోజకవర్గాలను టచ్ చేసుకొంటూ ఆయన.. తన పాదయాత్రను సాగించేందుకు లోకేశ్.. తన కార్యాచరణ సిద్ధం చేసుకొంటారని తెలుస్తోంది. 2024 ఫిబ్రవరి చివర వారం లేదా మార్చి మొదటి రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ప్రజల మధ్య ఉండేందుకు నారా లోకేశ్.. కృత నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ పాదయత్ర వల్ల లోకేశ్ ఓ వైపు పార్టీపై పట్టు పెంచుకొవడమే కాకుండా.. మరోవైపు ప్రజలతో మమేకమయ్యేందుకు దోహదం చేస్తుందనే ఓ భావన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబులో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీలోని క్షేత్రస్థాయి పరిస్థితులనే కాదు.... ప్రజల సమస్యలను సైతం నేరుగా తెలుసుకొనే అవకాశం నారా లోకేశ్‌కు దక్కుతోందని సమాచారం. అదేవిధంగా జగన్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకొని నారా లోకేశ్.. ఈ పాదయాత్రలో ప్రసంగించనున్నారని తెలుస్తోంది.  అలాగే రోడ్ షోలు, బహిరంగ సభలకు సైతం లోకేశ్.. ప్రణాళికలు సిద్ధం చేస్తుకొంటున్నారు. టీడీపీకి కంచుకోటు లాంటి నియోజకవర్గాల్లో మరింత బలంగా చొచ్చుకెళ్లేందుకు లోకేశ్ సమయత్తమైనట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీకి బలమైన నియోజకవర్గాల్లో సైతం రోడ్డు షోలు, బాదుడే బాదడు తదితర కార్యక్రమాలతోపాటు బహిరంగ సభలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

విజయసాయికి అండగా సకల శాఖల మంత్రి సజ్జల

వైసీపీలో ఎవరి ప్రభ ఎప్పుడు వెలుగుతుందో.. ఎవరికి ఎప్పుడు అవమానాలు ఎదురౌతాయో ఎవరికీ అర్ధం కాదు. నిన్న అందలం ఎక్కించిన నాయకుడినే.. నేడు పార్టీలో పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసిన నాయకుడినే మళ్లీ పిలిచి పల్లకీ ఎక్కిస్తారు. అందుకు సరైన ఉదాహరణ చెప్పాలంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.  ఆయనకు పార్టీలో ఎప్పుడు బ్రహ్మరథం పడతారో.. ఎప్పుడు విసిరి అవతల పడేస్తోరో ఎవరికీ తెలియదు. పార్టీ ఆవిర్బావం నుంచి జగన్ సీఎం అయ్యే వరకూ పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన ఆయనను ఇప్పటి వరకూ కనీసం రెండు సార్లు పక్కన పెట్టారు. తాజాగా ఆయన వద్ద ఉన్న సామాజిక మాధ్యమ బాధ్యతలను కూడా తీసివేసిన తరువాత ఆయన ఇక పార్టీలో నిలదొక్కుకోవడం సాధ్యం కాదని పార్టీ శ్రేణులే ఒక నిర్ణయానికి వచ్చేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఎండీ శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో అనివార్యంగా మళ్లీ పార్టీ ఆయనను భుజాన మోయాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. శరత్ చంద్రారెడ్డి సోదరుడు రోహిత్ రెడ్డి విజయసాయి రెడ్డ అల్లుడు కావడంతో.. ఈ లిక్కర్ స్కాంతో వైసీపీకి సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు శరత్ చంద్రారెడ్డి అరెస్టుకు చాలా ముందే విజయసాయిరెడ్డికి, జగన్ సతీమణి భారతి కూడా కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఆ ఆరోపణల కారణంగానే జగన్ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టేశారన్న వార్తలూ వినవచ్చాయి. కానీ శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో ఒక్కసారిగా వైసీపీ అగ్రనాయకత్వంలో కలవరం మొదలైంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డిని వెనకేసుకురాకపోతే పార్టీ నిండా మునగడం ఖాయమన్న భయం మొదలైంది. అందుకే లిక్కర్ స్కాం తో విజయసాయికి, వైసీపీకి ఏం సంబంధం అంటూ పార్టీ నాయకులు ఒక్కరొక్కరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా సకల శాఖల మంత్రి, పార్టీలో విజయసాయి నంబర్ టూ స్థానంలో ప్రస్తతుం ఉన్నట్లు చెబుతున్న సజ్జల మీడియా ముందుకు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విజయసాయి, సజ్జలల మధ్య సఖ్యత లేదనీ, సజ్జల కారణంగానే విజయసాయిరెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనీ పార్టీ శ్రేణుల్లో ఓ టాక్ ఉంది. ఇప్పుడు విజయసాయికి అండగా సజ్జన మీడియా ముందుకు రావడంతో పార్టీలో ఏదో జరుగుతోంది.. లిక్కర్ స్కాం ప్రకంపనలు తాడేపల్లి ప్యాలస్ ను తాకుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ గురువారం మీడియా ముందుకు వచ్చి సజ్జల ఏం చెప్పారంటే.. లిక్కర్ స్కాంలో వైసీపీకి ఏం సంబంధం లేదన్నారు. అక్కడితో ఆగితే విజయసాయికి అండగా సజ్జల నిలబడ్డారన్న చర్చే రాకపోను. కానీ  ఢిల్లీలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు కాదన్నారు. విజయసాయిరెడ్డికి ఒక్కతే కూమార్తె అనీ, ఆ కుమార్తె భర్త పేరు రోహిత్ రెడ్డి అనీ వరసలు చెప్పారు. అంటే విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డే తప్ప, శరత్ చంద్రారెడ్డి ఎలా అవుతారని ప్రశ్నించారు.    అరబిందో అనేది అతి పెద్ద అంతర్జాతీయ వ్యాపార సంస్థ అని.. విజయసాయి విజయసాయిరెడ్డి వాళ్ళకి బంధువే కానీ.. వాళ్ళ వ్యాపార సంస్థ ఈయన కు సంబంధం ఏంటని ప్రశ్నించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఢిల్లీ, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చాలా కాలంగా పొలిటికల్ వార్ జరుగుతుంోదని.. దానికి ఏపీ ప్రభుత్వానికీ , వైసీపీ కి, విజయసాయిరెడ్డి, జగన్ లకు  ఎటువంటి సంబంధం లేదని, తమ పార్టీ ఎంపీ విజయసాయి పులి కడిగిన ముత్యమని వెనకేసుకొచ్చారు. అయితే శరత్ చంద్రారెడ్డి అరెస్టు వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోందన్నది నిర్వివాదాంశమని పరిశీలకలుు అంటున్నారు. ఎందుకంటే ఏపీలో మద్యం వ్యాపారం మొత్తం ప్రభుత్వమే చేస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన బ్రాండ్ల అమ్మకాలే జరుగుతున్నాయి. పైగా మొత్తం లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరుగుతున్నాయి. ఈ కారణాలతో రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం మాఫియా పాత్ర పోషిస్తోందన్నది విమర్శగా మాత్రమే మిగిలిపోకుండా.. ఏదో భారీ స్కాం ఉందన్న భావన జనబాహుల్యంలో కూడా నెలకొని ఉంది.  ఇక అరబిందో ఎండీ శరద్ చంద్రారెడ్డికి లిక్కర్ బిజినెస్ ఉందన్నది ఆయన అరెస్టుతోనే లోకానికి తెలిసింది. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డితో ఆయనకు ఉన్న బంధం, రోహిత్ రెడ్డి విజయసాయికి స్వయానా అల్లుడు కావడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొదటిగా ఏపీ నుంచి రోహిత్ రెడ్డిపైనే ఆరోపణలు రావడంతో.. ఢిల్లీ మద్యం కుంభకోణం తీగలకు ఏపీలో డొంకలను కదిపే శక్తి ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయికి పార్టీ మద్దతుగా నిలవకపోతే మొదటికే మోసం వస్తుందన్న భయంతోనే సజ్జల విజయసాయికి అండగా మీడియా ముందుకు వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మోడీ మెప్పు కోసం జగన్ వెంపర్లాట

ప్రధాని మోడీ పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల తీరులో ఎంత తేడా.. ఎంత తేడా..!? ఒకరేమో మోడీ ముఖాన్ని చూసేందుకు కూడా  ఇష్టపడకుండా  కేసీఆర్ ప్రోటోకాల్ ను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సీఎం స్వాగతం పలకాలి. అయితే.. అలా స్వాగతం పలకకుండా కేసీఆర్ గైర్హాజరవుతున్నారు. కానీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్  మాత్రం మోడీ మెప్పు కోసం తాను సాగిలపడడమే కాకుండా మొత్తం ప్రభుత్వాన్నే మోడీ కాళ్ల ముందు మోహరిస్తున్నారు. లక్షలాది మందితో ఘనంగా స్వాగతాలు పలుకుతున్నారు. ఇద్దరు సీఎం వ్యవహరిస్తున్న తీరు అరచేతిలో  అద్దం మాదిరిగా అంతా స్పష్టంగా తెలిసిపోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్ర, శనివారాల్లో ఇరు తెలుగు రాష్ట్రాల సందర్శన సందర్భం ఇది. తొలి రోజు విశాఖపట్నంలో.. తరువాతి రోజు రామగుండంలో మోడి పర్యటన ఉంది. అయితే.. రెండు రాష్ట్రాల్లో జరిగే మోడీ పర్యటనల్లో పూర్తి విరుద్ధ వాతావరణం ఉండడం విచిత్రం. ప్రధాని మోడీ మీద, కేంద్రంలో అధికార బీజేపీ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు తెలంగాణా సీఎం కేసీఆర్. కొంత కాలంగా మోడీ- కేసీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నదనే చెప్పాలి. కొద్ది నెలల క్రితం ప్రధాని మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వస్తున్న సందర్భంగా.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేసీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు, కరెంట్ మీటర్లు, ధాన్యం కొనుగోలు వంటి పలు అంశాల మీద కేసీఆర్ ప్రశ్నలు సంధించారు. అయితే.. మోడీ హైదరాబాద్ వచ్చారు కానీ, కేసీఆర్ ప్రశ్నలేవీ తనకు వినబడనట్లే వ్యవహరించి తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. అప్పటికీ ఇప్పటికీ వేడి మరింత పెరిగింది. ‘మా మీదకు ఈడీ, సీబీఐ వేటకుక్కల్ని ఉసికొల్పుతారా..? మీ సంగతేంటో చూస్తా’ అంటూ ఫైరయిపోతున్నారు కేసీఆర్. కేసులు పెట్టినప్పుడు చూసుకుందాం అని గంభీరంగా ఉంటున్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో బీజేపీని తన వ్యూహాలతో ఢీకొని విజయం సాధించారు. ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్- బీజేపీల మధ్య మాటలు చాలాదూరం వెళ్లాయి. మొత్తానికి మోడీ విషయంలో తనది పోరుబాటే అని కేసీఆర్ శపథం చేస్తున్నారు. మోడీ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడడం లేదు. అందుకే ప్రోటోకాల్ నిబంధనను ఉల్లంఘించి, మోడీకి స్వాగతించకుండా గైర్హాజర్ అవుతున్నారు. కానీ.. మోడీ పట్ల ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరు భిన్నంగా ఉంటోంది. మోడీ కోసం సాగిలపడడానికి, మోకరిల్లి మొక్కడానికి కూడా ఏ మాత్రం ఆలోచించడం లేదని పరిశీలకులు అంటున్నారు. మోడీ విశాఖపట్నం రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం కోసం మొత్తం ప్రభుత్వాన్ని మోహరించడం గమనార్హం. ఏ అధికారికీ వారం రోజులుగా వేరే పని లేదు. విజయసాయిరెడ్డి కూడా విశాఖలోనే తిష్టవేయడం విశేషం. మోడీ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు చేయని ప్రయత్నంలేదు. విశాఖలో మోడీ పర్యటన మొత్తం జగన్ ఆయన పక్కనే ఉండేలా కార్యక్రమం రూపొందించుకోవడం గమనార్హం. ఇక్కడే ఒక విషయం ప్రస్తావించుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మోడీని ఒక్క క్షణం కూడా విడిచి పెట్టేందుకు సిద్ధంగా జగన్ లేకపోవడానికి కారణం కేసీఆర్ కు లేని కేసుల సమస్య  అంటున్నారు. సుప్రీంకోర్టు ఒత్తిడి మేరకు జగన్ మీద ఉన్న కేసుల విచారణ త్వరగా ముగిసిపోయే సూచనలు కన్పిస్తున్నాయంటున్నారు. ఈ సమయంలో ప్రధాని మోడీ ఆశీర్వాదం ఉంటే తప్ప ఆ చిక్కుల నుంచి బయటపడడం కష్టమనే భావనలో జగన్ ఉన్నారంటున్నారు. సీబీఐ, ఈడీ తరఫున జగన్ కేసులు వాదిస్తున్న న్యాయవాదులు తమ వాదనలో కొంత మెతక వైఖరి అవలంబిస్తే తప్ప తనపై కేసుల ఉచ్చు విడిపోవడం కష్టమే ఆందోళన వల్లే మోడీకి జగన్ ఇంతలా అడుగులకు మడుగులు వత్తుతున్నారనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి. ఈడీ, సీబీఐ అధికారులను ప్రభావితం చేయగలిగినవారు కేవలం మోడీ ఒక్కరే. అందుకే మోడీకి జీ హుజూర్ అనేందుకు జగన్ ఏమాత్రం ముహమాటం పడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు ఆయా రాష్ట్రాల సీఎంలు పార్టీలకు అతీతంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలుకుతారు. ప్రధాని, సీఎం ఒకే పార్టీకి చెందిన వారైనప్పుడు మాత్రమే సభలు కూడా నిర్వహిస్తారు. ఇద్దరు వేర్వేరు పార్టీల వారైతే.. ప్రధాని పార్టీకి చెందిన స్థానిక నేతలు సభల సంగతి చూసుకుంటారు. ముఖ్యమంత్రి మాత్రం ప్రధాని అధికారిక కార్యక్రమాలకే పరిమితం అవుతారు. మోడీ బీజేపీ అగ్రనేత. బీజేపీతో జగన్ వైసీపీకి ఎలాంటి పొత్తు కూడా లేదు. కానీ మోడీ విషయంలో మాత్రం తాను, బీజేపీ వేరు కాదనేట్లు జగన్ వ్యవహరిస్తుండడం గమనించదగ్గ అంశం. బీజేపీ నేతలు నిర్వహించాల్సిన సభ నిర్వహణ బాధ్యతను జగన్ తన భుజాల మీద వేసుకోవడం వెనుక వేరే లాజిక్కు ఉందంటున్నారు. ప్రధాని సభను బ్రహ్మాండంగా నిర్వహిస్తే, మోడీ తనను మెచ్చుకుని, కేసుల నుంచి బయటికి లాగుతారనే ఆశ జగన్ లో ఉండి ఉండొచ్చంటున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయిన క్రమంలో ప్రధాని విషయంలో భిన్న వైఖరులు ప్రదర్శిస్తుండడం ఆలోచించదగ్గ విషమే అంటున్నారు రాజకీయ పండితులు.

గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్.. బీజేపీకి దెబ్బేనా?

మునుగోడు ఉప ఎన్నికలో విజయం తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ బీఆర్ఎస్ విస్తరణపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ ను పాన్ ఇండియా పార్టీగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదీ ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో సత్తా చాటడం ద్వారా దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే వచ్చె నెల రెండు విడతలుగా జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. గుజరాత్ లో తెలుగువారు అధికంగా ఉండే సూరత్ ప్రాంతంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. గుజరాత్ లో ఇప్పటికే పట్టు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగాలని కేసీఆర్ భావించినా ఆ దిశగా ఎటువంటి ముందడుగూ పడలేదు. ఆప్ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ తో పొత్తుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. అయితే గుజరాత్ లో ఒక బలమైన నేతను బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్ ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింఘ్ వఘేలాతో కేసీఆర్ చర్చలు ఫలప్రదమయ్యాయనీ, ఆయన నేడో రేపో బీఆర్ఎస్ గూటికి చేరనున్నారనీ చెబుతున్నారు.  గత సెప్టెంబర్ లో శంకర్ సింఘ వఘేలా హైదరాబాద్ ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ తో బేటీ అయిన సంగతి విదితమే. ఆ భేటీలోనే బీఆర్ఎస్ గుజరాత్ రాష్ట్రంలో పోటీకి దిగితే సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా, తాను జాతీయ పార్టీ ఏర్పాటును విరమించుకుని బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా శంకర్ సింగ్ వఘేలా కేసీఆర్ తో చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు అదే జరగబోతున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఆ దిశగా తన తొలి అడుగుతోనే ఏను కుంభ స్థలాన్ని ఢీ కొనాలని కృత నిశ్చయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందులో భాగంగానే వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి నిలపాలని నిర్ణయించారు. ఇందు కోసం ఆయన గుజరాత్ లో బీఆర్ఎస్ నాయకుడిగా శంకర్ సింగ్ వఘేలాను ప్రొజెక్టు చేయనున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న శంకర్ సింగ్ వఘేలా బీఆర్ఎస్ లో చేరడం వల్ల ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ లాంఛింగ్ కు పెద్ద ప్లస్ అవుతుందని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ఇక గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు వారి మద్దతుతో కొన్ని స్థానాలలో విజయం సాధించడం పెద్ద కష్టం కాదని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ కారణంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కనీసంలో కనీసం పది స్థానాలలోనైనా బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపాలని కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారంటున్నారు.  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కనీసం పది స్థానాలలో పోటీ చేసి, వాటిలో ఎంత లేదన్నా నాలుగు స్థానాలలో విజయం సాధించగలమన్న ధీమాతో కేసీఆర్ ఉన్నారంటున్నారు. గుజరాత్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ను కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగి.. కొన్ని స్థానాలలో విజయం సాధించడం ద్వారా ప్రధాని మోడీకి గట్టి గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికిప్పుడు తనతో చేతులు కలపడానికి ఒకింత సంకోచిస్తున్న బీజేపీయేతర పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల లో  బీఆర్ఎస్ కొన్ని స్థానాలలో విజయంతో సత్తా చాటితే.. వాటంతట అవే ముందుకు వచ్చి తనతో జట్టు కడతారన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఏది ఏమైనా బీఆర్ఎస్ ఆవిర్బావం సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన ప్రణాళికలో గుజరాత్ లో పోటీ అంశం లేదు. ఆ తరువాత సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో తన తొలి అడుగు మోడీని ఢీకొట్టడంతోనే వేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుజరాత్ లో బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ రాష్ట్రలో ఆప్ బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో మనీష్ సిసోడియాపై కేసు అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా తెరమీదకు తీసుకురావడంతో బీజేపీ డిఫెన్స్ లో పడిందంటున్నారు. అందుకే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో దర్యాప్తు సంస్థలు పెద్దగా దూకుడు ప్రదర్శించే అవకాశం లేదన్న కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదని తెరాస శ్రేణులు కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోనికి దింపి కొన్ని స్థానాలను గెలుచుకోవడం ద్వారా మోడీకి గట్టి సవాల్ విసిరినట్లౌతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. గుజరాత్ ఫలితాల తరువాత బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ తన దూకుడును మరింత పెంచే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మోడల్ గా దేశ ప్రగతి అంటూ దేశ వ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వ పటిమను ప్రచారం చేస్తూ జారీ చేసిన ప్రకటనల ప్రభావం గుజరాత్ మీద కూడా గణనీయంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. సో.. గుజరాత్ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ సభ్యులు రంగంలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. 

ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం.. గుజరాత్, హిమాచల్ ఎన్నికల ముందు సంచలనం

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్, గెలుపు అంచనాల ప్రచురణ, ప్రసారాలను నిషేధించింది. ఈ మేరకు గురువారం (నవంబర్ 10) ఉత్తర్వులు జారీ చేసింది.  హిమాచల్ ప్రదేశ్ లో ఒకే విడతలో జరగనున్న పోలింగ్ కు ఇప్పటికే ప్రచార గడువు ముగిసింది. ఇక ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో వచ్చే నెల మొదటి వారంలో రెండు విడతలలో ఆ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం(నవంబర్ 12) నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకూ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రచురణ, ప్రసారాలను  నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం ఈ నిషేధాన్ని విధిస్తున్నట్లు ఈసీ ఆ ఉత్తర్వ్యులలో పేర్కొంది. ఆ ఉత్తర్వుల మేరకు శనివారం (నవంబర్ 12)  ఉదయం ఎనిమిది గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం ఐదున్నర గంటల వరకూ ఏ విధమైన ఎగ్జిట్ పోల్స్, గెలుపు అంచనాలను ప్రసారం చేయడం కానీ, ప్రచురించడంపై కానీ పూర్తి నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. 

దివ్యాంగురాలికి అంగరంగ వైభవంగా వివాహం ఎరితోనో తెలుసా?

దివ్యాంగురాలైన తన కుమార్తెకు తండ్రి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేశాడు. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగూ అని వివాహ వైభవం గురించి చెప్పుకుంటూ ఉంటాము. కానీ గ్వాలియర్ కు చెందిన శివపాల్ అనే వ్యాపార వేత్త మాత్రం తన కుమార్తె వివాహానికి అంతకు మించి అన్నట్లుగా ఏర్పాట్లు చేశారు. ఒక వివాహం గురించి ఇంత ఉపోద్ఘాతమెందు కంటారా? ఇలాంటి వివాహం ఇలలో ఎవరికీ జరిగి ఉండదు. జరిగి ఉండదు కాదు. జరగలేదు. ఇంతకీ ఈ దివ్యాంగురాలికి ఎవరితో వివాహం జరిగిందో తెలుసుకుంటే... ఈ ఉపోద్ఘాతం చాలదని అందరూ అంగీకరించి తీరుతారు. గ్వాలియర్ కు చెందిన శివపాల్ ఒక వ్యాపార వేత్త. ఆయన కుమార్తె వయస్సు 26 ఏళ్లు. ఆమె దివ్యాంగురాలు. వినలేదు, మాట్లాడలేదు. అంతే కాదు గత 21ఏళ్లుగా ఆమె చక్రాల కుర్చీకే పరిమితమై ఉంది. కుమార్తెను అత్యంత ఆప్యాయంగా, ప్రేమగా పెంచుకునే శివలాల్ తన కుమార్తె వివాహం చేయలేనేమోనని బెంగపడ్డారు. అయితే ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉన్న ఆయనకు కుబ్జ కథ గుర్తుకు వచ్చింద. అంతే తన కుమార్తెకు శ్రీకృష్ణుడే తగిన వరుడని నిర్ణయించుకున్నాడు. అంతే ఆఘ మేఘాల మీద శ్రీ కృష్ణ భగవానుడితో తన కుమార్తె వివాహానికి ఏర్పాట్లు చేసేశాడు. ఓ అమ్మాయికి శ్రీకృష్ణుడి వేష ధారణతో అలంకరణ చేశాడు. మొత్తం మీద అనుకున్న విధంగా తన కుమార్తెను కృష్ణ భగవానుడికి ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశాడు. ఈ వివాహానికి సంబంధించిన వార్తలు, ఫొటోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. వికలాంగురాలైన తన కుమార్తెపై శివపాల్ కు ఉన్న ప్రేమానురాగల పట్ల నెటిజన్లు ముగ్ధులౌతున్నారు. 

బార్ లో కాల్పుల కలకలం.. మెక్సికోలో 9మంది దుర్మరణం

మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక బార్ లో సాయుధులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో కనీసం 9 మంది మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. ఈ ఘటన గ్వానాజువాటోలోని ఓక బారులో జరిగింది. మారో గ్యాంగ్ సభ్యులు ఈ కాల్పులకు తెగబడ్డారని చెబుతున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో బార్ లోకి చొరబడ్డ సాయుధులు అక్కడి సిబ్బందిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మహిళా వెయిటర్లు సహా తొమ్మిది మంది బార్ సిబ్బంది మరణించారు. ఈ కాల్పులకు గ్యాంగ్ ల మధ్యా విభేదాలే కారణమని పోలీసులు తెలుపుతున్నారు. మారో గ్యాంగ్ కు ప్రత్యర్థి గ్యాంగ్ కు బార్ యాజమాన్యం మద్దతు ఇస్తుండటమే ఈ దాడికి వెనుక ఉన్న కారణంగా భావిస్తున్నారు. అయితే దాడికి పాల్పడిన సాయుధులను ఇంకా గుర్తించలేదని చెప్పారు. మెక్సికోలో గ్యాంగ్ వార్ ల కారణంగా అమాయకులు చనిపోవడం ఇదే మొదటి సారి కాదు. గత నెలలో కూడా ఇలాగే బార్ పై సాయుధులు జరిపిన దాడిలో 12 మంది మరణించారు. అంతకు ముందు నెలలో కూడా ఇలాంటి కాల్పుల ఘటనలో 10 మంది చనిపోయారు. 

టీ కప్పులో తుపానేనా?

విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ కోసం ఏర్పాటు చేసిన ఉమ్మడి నియామకాల బోర్డు విషయంలో తెలంగాణ సర్కార్, రాజ్ భవన్ ల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం టీ కప్పులో తుపానులా తేలిపోయిందా? ఉమ్మిడి నియామక బోర్డు విషయంలో గవర్నర్ సందేహాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివృత్తి చేసినట్లు చేస్తే.. తన సందేహాలన్నీ దూది పింజెల్లా తేలిపోయాయని గవర్నర్ తమిళి సై వివాదానికి ముగింపు పలికేశారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వర్సిటీల్లో ఖాళీల భర్తీ సజావుగా పూర్తి చేసేందుకు మాత్రమే బోర్డు ఏర్పాటు చేశామని గవర్నర్ తమిళిసైకు మంత్రి సబితా వివరించారు. ఈ విషయంలో గవర్నర్ సందేహాలను నివృత్తి చేసేందుకు మంత్రి సబిత గురువారం సాయంత్రం రాజ్ భవన్ కు వెళ్లారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రొటోకాల్ ఇవ్వడం లేదనీ, వర్సిటీల నియామకం బిల్లుపై తన సందేహాలను నివృత్తి చేయాలని, రాజ్ భవన్ కు వచ్చి చర్చించాల్సిందిగా సందేశం పంపినా స్పందన లేదనీ తమిళిసై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజ్ భవన్ ప్రగతి భవన్ కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ ను ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో ఇరికించాలని చూశారనీ, తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న అనుమానాలు ఉన్నాయనీ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో గవర్నర్ లతో  ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విభేదాలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ప్రభుత్వం, గవర్నర్ ల మధ్య గత కొంత కాలం నుంచీ కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం ముదిరి పాకాన పడిందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే గత కొద్ది కాలంగా గవర్నర్, కేసీఆర్ మధ్య అగాధం రోజురోజుకూ పెరుగుతోందన్న అనుమానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను వెనక్కు పంపకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా గవర్నర్ తన వద్దే పెండింగ్ లో ఉంచుకోవడంతో ప్రభుత్వంలో అసహనం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తమిళిసై మీడియా సమావేశంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలతో ఇక ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య విభేదాలు తెగేదాకా వెళ్లిపోయాయా? ఇక అమీ తుమీకే రాజ్ భవన్, ప్రగతి భవన్ లు సిద్ధమైపోయాయా అన్న అనుమానాలు వ్యక్త మయ్యాయి. అయితే ఈ హడావుడీ, ఉద్రిక్త వాతావరణం అంతా ఒక సారి సబిత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ సందేహాలు నివృత్తి చేస్తామని చేసిన ప్రకటనతో చప్పున చల్లారిపోయింది. సుదీర్ఘ అధ్యయనం అనంతరమే, అన్ని అంశాలనూ పరిగణనలోనికి తీసుకుని యూజీసీ నిబంధనలకు అధిగమించకుండా, న్యాయపరమైన చిక్కుల తలెత్తకుండా అన్ని విధాలుగా పరిశీలించిన అనంతరమే ఉమ్మడి రిక్రూట్ మెంట్ బోర్డును ఏర్పాటు చేశామని సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ కు రాజ్ భవన్ కు వెళ్లి మరీ వివరించారు. ఆమె వివరణలో సంతృప్తి చెందిన గవర్నర్ తమిళిసై సంతృప్తి చెందారు. వర్సిటీల్లో ఖాళీల ప్రక్రియను వీలైనంత సత్వరంగా నష్పాక్షికంగా, పాదర్శకంగా భర్తీ చేయాలని సూచించారు. గవర్నర్ భేటీలో సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి కూడా పాల్గొన్నారు.  తెలంగాణలో ఇప్పటికే  వైద్యఆరోగ్య శాఖ, పోలీసు తదితర శాఖలు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి నియామకాలు చేపట్టాయన్నారు. ఆ నియమకాలన్నీ పాదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగాయని వారు గవర్నర్ వివరించారు.  ఈ వివరణతో సంతృప్తి చెందినట్లు గవర్నర్ తెలిపారు. దీంతో పెండింగ్ లో ఉన్న బిల్లులకు ఆమెదం తెలపాల్సిందిగా మంత్రి సబిత గవర్నర్ ను కోరారు. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపడతామన్నారు.  

లాలూకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్.. దాత కుమార్తే!

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) వ్యవస్థాపకుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి జరగనుంది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు రెండు కిడ్నీలూ ఫెయిలయ్యాయి. దీంతో ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్థితిలో ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య తన తండ్రికి కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె సింగపూర్ లో నివసిస్తున్నారు. చాలా కాలం నుంచీ మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు చెప్పినప్పటికీ సెకండ్ ఒపీనియన్ కోసం అన్నట్లుగా ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తన తండ్రిని సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చూపించి పరీక్షలు చేయించారు. అక్కడి వైద్యులు  కిడ్నీ మార్పిడి చేయించుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించేందుకే ఆయన కుటుంబ సభ్యలు నిర్ణయించారు. కిడ్నీ దానం చేయడానికి ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య ముందుకు వచ్చారు. తన తండ్రికి తన  ఇవ్వగలుగుతున్నందుకు తనకెంతో గర్వంగా ఉందని ఆమె అన్నారు. బహుశా ఈ నెలాఖరులోగా లాలూప్రసాద్ యాదవ్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరుగుతుంది.  పశుగ్రాస కుంభకోణం కేసులో జైలు పాలైన లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవలే బెయిలుపై బయటకు వచ్చిన సంగతి విదితమే. 

సామూహిక అత్యాచారం కేసులో ప్రభుత్వ మాజీ సీఎస్ అరెస్టు

మృగళ్ల మగ దాష్టీకం సమాజంలో అంతకంతకూ పెరిగిపోతున్నది. మహిళలపై అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో ఉన్నత విద్యావంతులూ, ప్రభుత్వంలో అత్యంత కీలక పదవుల్లో ఉన్నవారూ కూడా ఉండటం విద్య వారికి నేర్పిన సంస్కారం ఏమిటన్న అనుమానాలకు తావిస్తోంది. అండమాన్ నికోబార్ మాజీ సీఎస్ జితేంద్ర నారాయణ్ సామూహిక అత్యాచారం కేసులో అరెస్టు కావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేసి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభ పెట్టి తనను ఇంటికి పిలిపించుకున్న నారాయణ్, మరి కొందరు ఉన్నతాధికారులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారన్న బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)కు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ మూడు సార్లు మాజీ సీఎష్ నారాయణ్ ను ప్రశ్నించింది. అరెస్టు అనివార్యమని తెలుసుకున్న నారాయణ్ ముందస్తు బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయతే సర్వోన్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టులోనే బెయిలు పిటిషన్ వేయాలని సూచించింది. దీంతో ట్రయల్ కోర్టును బెయిల్ కోసం ఆశ్రయించిన నారాయణ్ కు అక్కడ చుక్కెదురైంది. 

గుజరాత్ బరిలో జడేజా భార్య.. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ పాట్లు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. యాంటీ ఇన్ కంబెన్సీ ఆ రాష్ట్రంలో బీజేపీకి పెను సవాల్ గా మారింది. దీంతో ఎన్నికలలో విజయంతో గట్టేక్కేదుకు బీజేపీ అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై భారీ కసరత్తు చేసింది. పాత ముఖాలకు చాలా వరకూ టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చింది. కొత్త ముఖాలను బరిలోకి దింపడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను ఏదో మేరకు తగ్గించుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందు కోసం వివిధ రంగాలలో పేరున్న, గుర్తింపు పొందిన వ్యక్తులకుటికెట్లు కేటాయించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో పలువురు కొత్తవారే ఉన్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 38కి శూన్యహస్తం చూపింది. అంటే బీజేపీ వంద మంది అభ్యర్థులతో విడుదల చేసిన జాబితాలో 38 మంది ఇప్పటి వరకూ ఎన్నికల బరిలో నిలబడని వారే. బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఎంతగా కసరత్తు చేసిదో తెలుసుకోవాలంటే ఆ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో ఉన్నకొత్తు ముఖాలను చూస్తే అర్ధమౌతుంది. క్రికెట్ లో తన ఆల్ రౌండ్ ప్రతిభతో ఎంతో మందికి అభిమాన క్రీడాకారుడిగా మారిన జడేజా భార్యను ఈ సారి బీజేపీ తన  అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దింపేందుకు నిర్ణయించింది. జడేజా భార్య రావాబా జడేజాను నార్త్ జామ్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగారంగంలోకి దింపుతోంది. అలాగే కాంగ్రెస్ గూటి నుంచి వచ్చి చేరిన పలువురికి బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఇక రివాబా విషయానికి వస్తే 2016లో ఆమెకు  జడేజాతో వివాహంజరిగింది. ఆమె మూడేళ్ల కిందటే బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు.   అలాగే ఇటీవలే బీజేపీలో చేరిన హార్థిక్ పటేల్ కు కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది.ఇప్పటికే ఐదు సార్లు వరుసగా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ  ఆరో సారి గెలిచి.. అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. అయతే ఆప్ రంగంలో ఉండటం, పంజాబ్ లాగే ఇక్కడ కూడా అధికార పగ్గాలను అందుకోగలమన్న ధీమాతో ఆ పార్టీ ఇప్పటికే జోరుగా ప్రచార రంగంలో ఉండటం బీజేపీని  ఒకింత కలవర పరుస్తోంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవలే ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి కూడా పలు స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించడమే కాకుండా.. గుజరాత్ లో తెలుగువారు అధికంగా ఉండే సూరత్ ప్రాంతంపై ప్రత్యేక గురి పెట్టింది.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేంత బలంగా లేకపోయినా.. ఆ పార్టీ ప్రభావాన్ని కూడా తక్కువ అంచనా వేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రకు వస్తున్న అశేష జనస్పందన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఏదో ఒక మేరకు ప్రభావం చూపుతుందంటున్నారు. ఆ మేరకు బీజేపీకి భారీ నష్టం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. 

డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి గవర్నర్ తొలగింపు.. కేరళ సీఎం సంచలనం

 వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చును. కానీ ఆ విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం మాత్రం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. మూడు దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు గవర్నర్, ఆ రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య విభేదాలు ఘర్షణ స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం, గవర్నర్ ల మధ్య విమర్శలు రాజకీయ ప్రత్యర్థుల మధ్య విమర్శల స్థాయికి దిగజారాయి.   గవర్నర్ వ్యవస్థను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నదన్న విమర్శలు రోజు రోజుకూ తీవ్రమౌతున్న సంగతి విదతమే. పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి బీజేపీ యేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షాణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, తెలంగాణలలో గవర్నర్ల తీరు పట్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో అయితే గవర్నర్ తమిళిసై, ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొని ఉంది. గవర్నర్ తమిళి సై విలేకరుల సమావేశాలు నిర్వహించి మరీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక తమిళనాడులో స్టాలిన్ సర్కార్ అయితే ఆ రాష్ట్ర గవర్నర్ ను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. కేరళ ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం వర్సటీ నియమనిబంధనలను కూడా మార్చింది. కేరళ గవర్నర్ మహ్మద్ ఆరిఫ్ ఖాన్ కొద్ది రోజుల కిందట రాష్ట్రంలోని వైస్ చాన్సలర్ లందరూ రాజీనామా చేయాలంటూ వర్సిటీల చాన్సలర్ హోదాలో ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని వర్సిటీలపై గవర్నర్ పెత్తనం అవసరం లేదని చెబుతూ వస్తోంది.  అలాగే  తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ కు పంపిన యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్‌ బిల్లుపై సంతకం చేయకుండా తన వద్దే పెండింగ్ ఉంచుకుని ఈ బిల్లుపై క్లారిఫికేషన్ ఇవ్వాలనీ, రాజ్ భవన్ కు వచ్చి తనతో చర్చించాలని ఆ రాష్ట్ర గవర్నర్ తమిళసై ప్రభుత్వానికి హుకుం జారీ చేశారు.    బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గవర్నర్ లు బీజేపీ ప్రతినిథులుగా పని చేస్తున్నారనీ, రాజ్ భవన్ లను కాషాయ కార్యాలయాలుగా మార్చేస్తున్నారనీ విమరలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే  కేరళ సీఎం పినరయ్ విజయన్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ నిబంధనలను ప్రభుత్వం మార్చింది.  వర్సటీ చాన్సలర్ గా గవర్నర్ ను తొలగిస్తున్నట్లు గురువారం ప్రభుత్వ ప్రకటన వెలువడింది. చాలా కాలంగా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్,  పినయర్ సర్కార్ మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రభుత్వం, గవర్నర్ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. బుధవారం ఈ విమర్శలు ఒకింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అంతే కేరళ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ను డీమ్డ్ వర్సిటీ పదవి నుంచి తొలగిస్తు గురువారం కేరళ సర్కార్ ప్రకటించింది.  తాజాగా డీమ్డ్ వర్సిటీ చాన్సలర్ పదవి నుంచి గవర్నర్ ను తొలగిస్తూ కేరళ సీఎం పినరయ్ విజయన్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇదే ఒరవడిని అనుసరించే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  

మోడీ వల్లే టి20లో టీమ్ ఇండియా ఓటమా..ఇవేం విమర్శలు.. ఆపండ్రా!

మోడీ వల్లే టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా కప్ గెలుచుకోలేదట. అసలు మోడీ అధికారంలోకి వచ్చాకా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిందే లేదట. అదే కాంగ్రెస్ హయాంలో అయితే 1983,2007, 2011 లలో వరల్డ్ కప్, 2103లో చాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇండియా గెలిచిందంటూ సామాజిక మాధ్యమంలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.  మోకాలికీ, బోడి గుండుకీ ముడిపెట్టి విమర్శలు చేయడం రాజకీయాలలో కొత్తేం కాదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చంద్రబాబు అధికారంలో ఉండగా వర్షాలు పడలేదనీ, వరుస కరువుతో రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయనీ విమర్శించడమే కాకుండా తమ ప్రభుత్వం రావడంతోనే పుష్కలంగా వర్షాలు పడుతున్నాయనీ వరుణ దేముడికి తమపై ప్రేమ ఉందనీ వ్యాఖ్యలు చేస్తూ కరువుకూ, చంద్రబాబు సర్కార్ కూ ముడి పెట్టి విమర్శలు చేయడం తెలిసిందే. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా అయిన దానికీ కాని దానికీ తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఆడ లేక మద్దలు ఓడు అన్నట్లు.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఈ ఆర్థిక సంక్షోభానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాకాల వల్లే ఇప్పుడు అప్పులు చేయాల్సి వస్తోందంటూ ఎదురుదాడికి దిగుతున్న సంగతీ విదితమే. అయితే క్రీడల్లో జయాపజయాలకూ రాజకీయాలకూ ముడిపెట్టి విమర్శలకు దిగడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో అన్ని ఐసీసీ టోర్నీలలో విజేతగా నిలిచిన టీమ్ ఇండియా మోడీ హయాంలో మాత్రం ఒక్క ట్రోఫీని గెలవలేదంటూ మోకాలికీ బోడి గుండుకీ ముడిపెట్టి విమర్శలు చేస్తున్నారు.  

మోడీతో పవన్ భేటీ.. కలిసి ర్యాలీ.. దేనికి సంకేతం?

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక కొలిక్కి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీల మధ్య గత కొంత కాలంగా అగాధం ఏర్పడిందన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా మోడీ, పవన్ ల భేటీ విశాఖలో జరగనుంది. అదే సమయంలో ఈ రెండు పార్టీల పొత్తుకు తోడు జనసేన తెలుగుదేశం పార్టీకి చేరువ అవుతున్న సంకేతాలు విస్పష్టంగా కనిపిస్తుండటంతో వచ్చే ఎన్నికలలో ఈ మూడు పార్టీలూ కలిసి పోటీ చేసే అవకాశాలు మెరుగయ్యాయని పరిశీలకులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ మోడీ విశాఖ పర్యటనకు సంబంధించి అధికార పార్టీకి తప్ప బీజేపీ రాష్ట్ర నాయకులకు కూడా స్పష్టమైన సమాచారం  లేదంటూ వచ్చిన వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. బీజేపీ ఆధ్వర్యంలో రోడ్ షో జరుగుతుందన్న స్పష్టత వచ్చింది. అన్నిటికీ మించి మోడీ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన వైసీపీ ఎంపీ విజయసాయి అత్యుత్సాహం బీజేపీనే కాదు.. ఏకంగా కేంద్రాన్ని ఇరుకున పడేసింది. మోడీ విశాఖ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తారంటే తన ట్విట్టర్ హ్యాండిల్ లో విజయసాయి చేసిన పోస్టు వైరల్ అవ్వడంతో బీజేపీ ఇరుకున పడింది. దీంతో ఆఘమేఘాల మీద నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఆ పార్టీ నాయకుడు జీవీఎల్ రంగంలోకి దిగారు. మోడీ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమం లేదని విస్పష్టంగా చెప్పారు. ఆయన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొంటారనీ, అవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలనీ వివరించిన ఆయన మోడీ బీజేపీ శ్రేణులలో ఉత్సాహం నింపే విధంగా రోడ్ షోలో పాల్గొంటారని చెప్పారు. కాగా మోడీ విశాఖ పర్యటన సందర్భంగా మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అవుతారనీ, ఇరువురూ కలిసే రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉందనీ జీవీఎల్ పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకూ మోడీ పర్యటనను పూర్తిగా వైసీపీ హైజాక్ చేసేసిందనీ, రాజకీయాలకు సంబంధం లేకుండా  వైసీపీ పార్టీ రంగులతో వేసిన ఫ్లెక్సీలలో మోడీ ఫొటోను ప్రముఖంగా ఉంచడం ద్వారా ఏదో మోడీ వైసీపీ గూటికి చేరారా అన్నంతగా ప్రచారం చేసుకుంది. ఇది సహజంగానే బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికీ రుచించలేదు. దీంతో బీజేపీ చురుగ్గా స్పందించి అప్పటి కప్పుడు మోడీ రోడ్ షోను ప్లాన్ చేసింది. ఏపీలో బీజేపీకి భారీ జనసమీకరణ చేసే బలం లేని కారణంగా మిత్ర పక్షం జనసేన అధినేతను ర్యాలీలో పాల్గొనేలా వ్యూహం పన్నింది. ఇటీవలి కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో అంటకాగుతున్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ తీరును కూడా ఒకటి రెండు సందర్భాలలో ఎండగట్టారు. మోడీ అంటే అపారమైన గౌరవం ఉందని చెబుతూనే బీజేపీ ఏపీ నాయకత్వం తీరుపై తీవ్రు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే బీజేపీ మాత్రం పవన్ విమర్శలపై ఇసుమంతైనా స్పందించకుండా జనసేన తమ మిత్రపక్షమే అని చెప్పుకుంటూ వస్తోంది. అన్నిటికీ మించి ఇప్పటి వరకూ రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ ఆగ్రనేతలెవరూ పవన్ తో భేటీ అవ్వలేదు. కానీ ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పవన్ కు ప్రత్యేకంగా ఆహ్వానం వెళ్లింది. మోడీతో భేటీకి అప్పాయింట్ మెంట్ కూడా లభించింది. అంతే కాకుండా మోడీతో కలిసి రోడ్ షోలో పవన్ కూడా పాల్గొనేలా ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు తెలుగుదేశం అధినేతతో కూడా ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ సఖ్యతగా ఉండటం.. తొలి నుంచీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనంటూ గతంలో పవన్ చేసిన ప్రకటన బేరీజు వేసుకుని చూస్తే ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీలో జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచే అవకాశాలను కొట్టిపారేయలేమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రధాని పర్యటనను పూర్తిగా హైజాక్ చేసి.. తాము బీజేపీకి పూర్తి అనుకూలం అని చాటేందుకు శతథా ప్రయత్నించిన వైసీపీకి మోడీ పర్యటకు జనసేనానికి ఆహ్వానం పలకడం, మోడీతో పవన్ ప్రత్యేకంగా భేటీ అవుతుండటం, అలాగే మోడీతో కలిసి రోడ్ షోలో పాల్గొనే అవకాశాలుండటం కచ్చితంగా మింగుడు పడదని పరిశీలకులు అంటున్నారు. మోడీ పర్యటన సందర్భంగా పవన్ కు ఆహ్వానం ద్వారా వైసీపీతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చాటడమే బీజేపీ వ్యూహంగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా మోడీ, పవన్ భేటీ రాష్ట్ర రాజకీయాలలో మార్పునకు తొలి అడుగుగా భావించవచ్చని అంటున్నారు.  

బాణసంచా గోడౌన్ లో పేలుడు.. నలుగురు సజీవదహనం

బాణ సంచా గోడౌన్ లో గురువారం (నవంబర్ 10)సాయంత్రం సంభవించిన భారీ పేలుడులో కనీసం నలుగురు మరణించారు. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.   తాడేపల్లి గూడెం సమీపంలోని కడియుద్ద వద్ద ఈ దారుణ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు అనంతరం గోడౌన్ మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని తాడేపల్లి గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పేలుడు శబ్దాలు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ వినిపించాయని చెబుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. బాణసంచా గోడౌన్ ఊరికి దూరంగా ఉండటంతో ఫైరింజన్ సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఆలస్యమైందని చెబుతున్నారు.  తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో జరిగిన పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.పది లక్లు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏలూరు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, డీఐజీ పాల్ రాజ్ సందర్శించారు. 

బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఐదుగురు మృతి

తమిళనాడులోని ఓ బాణ సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మధురైూ సమీపంలోని తిరుమంగళంలో జరిగిన ఈ సంఘటనలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నారు.   మదురైలోని తిరుమంగళంలో ఓ క్రాకర్స్‌ తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.  తిరుమంగళా పురంలోని అగు జైలు గ్రామంలోని ఓ ప్రైవేట్‌ బాణసంచా తయారీ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది. దుర్ఘటన జరిగిన సమయంలో కర్మాగారంలో . 15 మందికి పైగా కార్మికులు ఉన్నారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన సంభవించిన ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, మాంసంముద్దలుగా మారిన శరీర భాగాలతో భీతావహంగా మారింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.  

తెరాసకు తుమ్మల గుడ్ బై? తెలుగుదేశం గూటికేనా?

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెరాసకు గుడ్ బై చెప్పనున్నారా? అంటే పరిశీలకులు ఔనంటూ విశ్లేషిస్తున్నారు. ములుగు జిల్లాలో తన అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన ఆయన ఆ సమావేశానికి హాజరయ్యేందుకు గురువారం (నవంబర్ 10) దాదాపు 350 కార్లలో వాజేడుకు బయలుదేరారు. అంతకు ముందు ఉదయం ఆయన భద్రాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా భారీ ర్యాలీతో వాజేడు కు బయలు దేరారు. కాగా ఆయన ఆత్మీయ సమ్మేళనం ఉద్దేశం, లక్ష్యం పార్టీ మార్పుపై చర్చించేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తుమ్మల ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, మద్దతు దారులు, అనుచరులు పాల్గొన్నారు. ఈ సమ్మేళనంలో ఆయన తెరాసను వీడటంపై చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమ్మేళనంపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా ఉండటం కూడా తుమ్మల పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. అయితే తుమ్మల తెరాసను వీడుతారన్న ఊహాగానాలు గత కొంత కాలంగా రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతున్నాయి. తెరాసలో ఇటీవలి కాలంలో తుమ్మల ప్రాధాన్యత తగ్గింది. తగ్గిందనే దాని కంటే ఆయనే పార్టీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనడం లేదనీ, తనంత తానుగానే పార్టీకి దూరంగా ఉంటున్నారనీ ఆయన మద్దతు దారులు అంటున్నారు.  ఇటీవలి కాలంలో తుమ్మల కాంగ్రెస్, బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారని కూడా ప్రచారం జరిగింది. అలాగే ఆయన తెలుగుదేశంకు చేరువ అవుతున్నారన్న చర్చా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే వాజేడులో తుమ్మల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  తెలంగాణలో పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా తెలుగు దేశం కూడా తన వ్యూహాలకు పదును పెడుతుండటం, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా బలమైన బీసీ నేత కాసాని జ్ణానేశ్వర్ కు పార్టీ అధినేత చంద్రబాబు పగ్గాలు అప్పగించడంతో ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పుంజుకుంటుందన్న అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెరాసను వీడి తుమ్మల హోం కమింగ్ అంటూ తెలుగుదేశం పంచన చేరు అవకాశాలు లేకపోలేదన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. 2014లో తెరాస గూటికి చేరిన తుమ్మల అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ తరువాత కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించి తన కేబినెట్ లో పదవి కూడా ఇచ్చారు. అయితే గత ఎన్నికలలో ఓటమి తరువాత తుమ్మలకు తెరాసలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. మరో సారి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇస్తారని తుమ్మల ఆశించారు. అయితే కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన తుమ్మల పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారని ఆయన మద్దతు దారులు చెబుతున్నారు. ఆయన బీజేపీ గూటికి చేరుతారని గతంలో బలంగా వినిపించినా తుమ్మల ఖండించారు. అలాగే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారనీ వదంతులు వినిపించాయి. అయితే తుమ్మల వాటిపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఆత్మీయ సమ్మేళనం అంటూ పెద్ద సంఖ్యలో మద్దతు దారులను సమీకరించి సమావేశం పెట్టడంతో ఆయన తెరాసను వీడటం ఖాయమేనని అంటున్నారు. అయతే అయన ఏ పార్టీలోకి వెళతారన్నది మాత్రం ఇతమిథ్ధంతా తెలియరాలేదు. ఇంకో వైపు ఇదేరోజు (నవంబర్10) తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా కాసాని జ్ణానేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయడం, అదే రోజు తుమ్మల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం కాకతాళీయమేనా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. 

ఇండియా ఇంటికి ... టి20 ఫైనల్లో పాక్ ప్రత్యర్థి ఇంగ్లాండ్

క్రికెట్ ప్రపంచం కలల మ్యాచ్ కల్ల అయిపోయింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థులు పాక్, భారత్ మధ్య మ్యాచ్ జరిగితే చూడాలని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులంతా కోరుకున్నారు. అదే జరుగుతుందని ఆ  క్రికెట్ ఫీస్ట్ కు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ వేదిక ఔతుందని విశ్లేషణలు కూడా సో కాల్డ్ క్రీడా పండితులు చేసేశారు. కానీ గురువారం జరిగిన సెమీ ఫైనల్ లో కనీస పోటీ కూడా ఇవ్వకుండా భారత్ చేతులెత్తేసింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్కవికెట్ కూడా నష్టపోకుండానే ఉఫ్ మని ఊదేసింది.  తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ ఎంచుకున్న ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయకుండా భారత్ ను నిర్దేశించింది. హార్ధిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించినా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి  168 పరుగులకే పరిమితమైంది.  స్కిప్పర్ రోహిత్ శర్మ మరో సారి విఫలమయ్యాడు. ఫామ్ లోకి వచ్చాడనుకున్న రాహుల్ సైతం  నిరాశ పరిచాడు. 360 డిగ్రీల బ్యాటర్ అంటూ ఆశలు పెట్టుకున్న  సూర్య కుమార్ యదవ్ కూడా విఫలమవ్వడంతో భారత్ ఓ మోస్తరు  లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. అయితే ఆ లక్ష్యాన్నికాపాడుకోవడంలో భారత్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఇంగ్లాండ్ పది వికెట్ల ఆధిక్యతతో సెమీస్ లో భారత్ ను చిత్తు చేసి ఘనంగా ఫైనల్ కు చేరుకుంది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా కేవలం 16 ఓవర్లలోనే అంటే ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో ఫైనల్ లో ఇంగ్లాండ్.. పాకిస్థాన్ లు తలపడనున్నాయి. భారత బౌలర్లు సమష్టిగా విఫలమైన వేళ ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బట్లర్ 49 బంతుల్లో  9 ఫోర్లు, 3సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఓపెనర్ హేల్స్ 47 బంతుల్లో 7 సిక్స్ లు 4 ఫోర్లతో 86 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్16 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా 160 పరుగులు చేసింది.