క్యాసినో కేసులో తలసాని కుమారుడికి ఈడీ నోటీసులు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు తలసాని కుమారుడు సాయికిరణ్ యాదవ్ కు ఈడీ సోమవారం (నవంబర్ 21) నోటీసులు జారీ చేసింది. చీకోటి ప్రవీణ్ కేసినో కేసు దర్యాప్తులో భాగంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే తలసాని సోదరులు తలసాని మహేష్, తలసాని ధర్మేంద్ర యాదవ్ లను ఇప్పటికే ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. బిగ్ డాడీ పేరుతో చీకోటి ప్రవీణ్ నేపాల్ లో నిర్వహించిన కేసీనోకు వెళ్లినట్లుగా భావిస్తున్న వారందరికీ ఈడీ నోటీసులు పంపి విచారణకు పిలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి తలసాని కుమారుడికీ నోటీసులు పంపింది. మొత్తంగా ఈ కేసులో తలసాని సన్నిహితులకు ఈడీ వరుసగా నోటీసులు పంపిస్తుండటం... విచారిస్తుండటం సంచలనం   సృష్టిస్తోంది. కాగా ఇదే కేసులో తలసాని వ్యక్తిగత కార్యదర్శి హరీష్ ను ఈడీ సోమవారం (నవంబర్ 21) విచారించింది. ఈ విచారణకు హరీష్ బ్యాంక్ స్టేట్ మెంట్లతో సహా హాజరైనట్లు చెబుతున్నారు.   ఇదే కేసులో ఈడీ ఇప్పటికే   టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిలను ప్రశ్నించింది. చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో ఇంకా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులకు కూడా ఈడీ ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. విచారణలో భాగంగా చీకోటి ప్రవీణ్ వెల్లడించిన వివరాల ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతోందని భావిస్తున్నారు. ఇలా ఉండగా విచారణ సమయంలో ఎల్.రమణ అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

జనసేన బంధిత పార్టీయా.. బీజేపీ చెప్పినట్లే నడుచుకుంటుందా?

జనసేన ఇప్పుడు ఒక బంధిత పార్టీగా మారిపోయిందా? బీజేపీ బంధనాలలో చిక్కుకు పోయిందా? ప్రధాని మోడీతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అనంతరం రాష్ట్ర బీజేపీ నాయకులు మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు, మాటలు చూస్తుంటే ఔననక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు మరో ఏడాదిన్నరకు పైగా గడువు ఉంది. అయినా ఇప్పుడో, అప్పుడో ఎన్నికలు వచ్చేస్తున్నాయన్నంతగా రాష్ట్రంలో రాజకీయ హీట్ పీక్స్ కు చేరిపోయింది. ఇటువంటి వాతావరణంలో  సహజంగానే  అధికార, విపక్షాల మధ్య విమర్శలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. అయితే ఏపీలో మాత్రం అధికారపక్షంపై తెలుగుదేశం మాత్రమే కాకుండా, జనసేన, బీజేపీలు కూడా ఘాటు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తు పొడుపులపై విశ్లేషణలు, వ్యాఖ్యలు, ఊగాహనాలు జోరుగా సాగుతున్నాయి. విశాఖలో జనవాణి కార్యక్రమం సందర్భంగా జరిగిన సంఘటనల అనంతర పరిణామాలు ఏపీలో జనసేన, టీడీపీల మధ్య పొత్తు కుదిరిపోయినట్లేనన్నంతగా వార్తలు వచ్చాయి. విశ్లేషణలు సైతం అదే దారిలో సాగాయి. అంత కంటే చాలా ముందే జనసేనాని ఏపీలో వైసీసీని గద్దె దంచడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేలాగే తమ నిర్ణయాలు, విధానాలు ఉంటాయని జనసేనాని ప్రకటించి రాష్ట్రంలో పొత్తుపొడుపులపై చర్చకు తెరతీశారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు అవసరమైతే తానో మెట్టు దిగేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఆయన ప్రకటన తరువాత రాష్ట్రంలో జనసేన, టీడీపీ మధ్య పొత్తు పొడిచేసినట్లేనని అంతా భావించారు. అందుకు అనుగుణంగానే క్షేత్ర స్థాయిలో జనసేన,టీడీపీ శ్రేణులు కలిసి కార్యక్రమాలు నిర్వహించారు. అయితే అప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. మరి దాని సంగతేమిటన్న ప్రశ్రకు విశ్లేషకులు 2014 ఎన్నికలలోలా మూడు పార్టీల మధ్యా పొత్తు ఉండే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తా అలాంటిదేమీ లేదని చెప్పుకుంటూ వస్తోంది. టీడీపీ, వైసీపీలకు సమదూరం పాటిస్తామని పదే పదే ఉద్ఘాటిస్తోంది. ఆ పార్టీ నేతలు ఆ దిశగా పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నా తెలుగుదేశం స్పందించడం లేదు. అలాగని జనసేనానితో అవగాహన విషయంలో మాత్రం సానుకూల సంకేతాలే ఇస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే  విశాఖ ఘటనల తరువాత తెలుగుదేశం అధినేత స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్ ను కలిశారు. పరామర్శించారు. అండగా ఉంటామని ధీమా సైతం ఇచ్చారు. ఆ సదర్బంగా ఇరువురూ కలిసి విలేకరులతో మాట్లాడారు.  ఆ సందర్భంగా పొత్తుల గురించి ఇరువురూ ప్రస్తావించలేదు. కానీ అదే సమయంలో  బీజేపీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీతో ఆయన దూరం జరుగుతున్నారన్న సంకేతాలు ఇచ్చాయి. అందుకే బీజేపీ ముందుకు రాకపోతే ఆ పార్టీతో తెగతెంపులు చేసుకునైనా సరే తెలుగుదేశం, జనసేనలు కలిసే ఎన్నికలకు వెళతాయన్న విశ్లేషణలు వెల్లువెత్తాయి. కానీ ఆ తరువాత ఎప్పుడైతే మోడీ, పవన్ కల్యాణ్ ల భేటీ జరిగిందో అప్పటి నుంచీ పరిస్థితి మారిపోయింది. పవన్ కల్యాణ్, మోడీల భేటీ తరువాత జనసేన, బీజేపీల మధ్య పొత్తు కొనసాగుతుందన్న సంకేతాలు బీజేపీ నేతల నుంచి స్పష్టంగా కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం (నవంబర్ 20)న చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. బీజేపీ తెలుగుదేశంతో కలిసి నడిచే ప్రశక్తే లేదని చెప్పడమే కాకుండా, జనసేన, తెలుగుదేశం పొత్తు కూడా ఉండదని విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు.. బీజేపీ అధిష్ఠానం ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ కు కూడా చెప్పిందని ఆయన అంటున్నారు. అంటే మోడీ, పవన్ భేటీ సారాంశమిదేనా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. పవన్ కల్యాణ్ ఢిల్లీ పెద్దలు చెప్పినట్లే నడుచుకోవాలనీ, ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే ప్రశ్నే లేదని సోము వీర్రాజు అన్నారు. అందుకే తాను తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తానని పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని వివరించారు. దీంతొ ఏపీ రాజకీయాలలో మళ్లీ పొత్తలు చర్చ మొదలైంది. అయితే ఈ సారి ఏ పార్టీ ఏపార్టీ కలుస్తాయి.. అనే చర్చ కాకుండా.. అసలు జనసేన పార్టీకి స్వతంత్రం లేదా? హస్తినలో బీజేపీ పెద్దలు ఏం చేబితే అది ఫాలో కావాల్సిందేనా? అన్న దారిలో చర్చలు జోరందుకున్నాయి. నెటిజన్లైతే జనసేన పార్టీని బీజేపీ బంధిత పార్టీగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అందరి కంటే ముందు పొత్తు చర్చలకు తెరతీసి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నివ్వనని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే ధ్యేయమన్నుట్లుగా వ్యవహరిస్తున్నారని జనసేన శ్రేణులే అంటున్నాయి. ఇటీవల తరచుగా ఆయన ఒంటరి పోరు అంటుండటంతో ఈ అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   బీజేపీ చేతుల్లో బందీగా మారి పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  పవన్ ఏ పార్టీతో వెళ్ళాలో.. ఎవరిని కలవాలో కూడా బీజేపీ ఢిల్లీ పెద్దలే చెప్తారా? అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలవరనీ, ఎందుకుంటే బీజేపీ పెద్దలు ఆయనకు ఆమెరకు దిశానిర్దేశం చేయడమేనని అంటున్నారు. పవన్ బీజేపీని పదే పదే కోరిన రోడ్ మ్యాప్ ఇదేనా? అని రాజకీయ వర్గాలలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ చెప్తుంటే.. ప్రతిపక్ష పార్టీ టీడీపీకి జనసేనను దూరం చేసి వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేలా బీజేపీ ప్రయత్నిస్తుందా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. సోము వీర్రాజు మాటల వెనుక అర్ధం, అంతరార్ధం ఇదేనా అని సందేహాలూ వ్యక్తమౌతున్నాయి.   పొత్తుల కోసం తాము ఒక మెట్టు తగ్గేందుకు కూడా సిద్ధమని పవన్.. టీడీపీకి ఆఫర్లు ఇస్తుంటే.. పవన్ మాతోనే ఉండాలని.. మేము ఏం చెబితే అదే పవన్ చేయాలన్న అర్ధం వచ్చేలా సోము మాట్లాడటం వెనుక ఉన్న వ్యూహమేమిటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా సోము వీర్రాజు వ్యాఖ్యలపై తెలుగుదేశం, జనసేనలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

యూపీలో మరో శ్రద్ధా వాకర్

సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా హత్య చేసి ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసిన ఉదంతం మరువక ముందే అటువంటిదే మరో సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఢిల్లీలో శ్రద్ధా వాకర్  అఫ్తాబ్ అనే లివ్ ఇన్ పార్టనర్ అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే ఉత్తర ప్రదేశ్ లో ఓవ్యక్తి తన ప్రేయసిని దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికేసి బావిలో పడేశారు. తలను మాత్రంవిడిగా మరో చెరువులో ఈ ఘటన యూపీలోని అజంగఢ్ జిల్లా పశ్చిమిగ్రామంలో జరిగింది. అదే గ్రామానికి చెందిన ప్రిన్స్ యాదవ్ తనను ప్రేమించి దగ్గరైన యువతి మరో పెళ్లి చేసుకోవడంతో పగ పెంచుకున్నాడు. సమయం కోసం ఎదురు చూసి తన తమ్ముడితో కలిసి ఈ దారుణానికి ఒడి గట్టాడు. ప్రిన్స్ ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రశ్నించే క్రమంలో పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఫైరింగ్ చేశారు. ఈ క్రమంలో అతడి కాలికి గాయమైంది.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్య తరహాలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. ఢిల్లీలో శ్రద్ధ వాకర్ ను ఆమె పార్టనర్ అఫ్తాబ్ దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని 35 భాగాలు చేసిన విషయం తెలిసిందే!

టీమ్ ఇండియా అండర్ 19 మహిళల జట్టులో తెలంగాణ బిడ్డ

టీమ్ ఇండియా అండర్ 19 మహిళల జట్టులో తెలంగాణ అమ్మాయికి చోటు లభించింది. స్వదేశంలో న్యూజిలాండ్ తో జరగనున్న మహిళల టి20 సిరీస్ కు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ సిరిస్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ జట్లులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గొంగడి త్రిషకు స్థానం దక్కింది. ఈ నెల 27న జరగనున్న తొలి మ్యాచ్ లో టి20 సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం 5 మ్యాచ్ లూ ముంబై వేదికగానే జరగనున్నాయి. కాగా అండర్ 19 మహిళల జట్టులో స్థానం సంపాదించిన త్రిష ఎనిమిదేళ్లకే జిల్లా స్థాయిలో రాణించింది. అలాగే  బీసీసీఐ నిర్వహించిన అండర్-19, సీనియర్ ఇండియా బ్లూ తరఫున త్రిష ప్రాతినిథ్యం వహించింది.   జైపుర్ వేదికగా జరిగిన అండర్-19 మహిళల వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీ-2021లోను త్రిష ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకుంది. టీమ్ ఇండియా అండర్ 19 మహిళల జట్టుకు త్రిష ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు..బీహార్ లో12 మంది దుర్మరణం

బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా ఓ ఆలయం బయట  పూజలు చేస్తున్న భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లిన సంఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వైశాలీ జిల్లాలోని హాజీపూర్ ప్రధాన రహదారి పక్కనున్న ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయంలో స్థలం సరిపోకపోవడంతో కొందరు ఆలయం బయట ఉన్న రావి చెట్టు వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఒక ట్రక్కు అదుపు తప్పి వారిపైకి దూసుకొచ్చింది. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ దుర్ఘటన పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతేల కుటుంబాలకు ప్రగాఘ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 

చంపేస్తున్న చలి పులి... వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. చలి పులి పంజా విసరడంతో తెలుగు రాష్ట్రాలు విలవిల లాడుతున్నాయి. గత ఏడెనిమిది రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. వీటికి తోడు చిరు జల్లులు. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రత సగటున 20 డిగ్రీల కంటే దిగువన నమోదౌతోంది. దీనికి తోడు ఈశాన్య రుతుపవనాల రాక,  తూర్పు దిశగా   బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత తీవ్రంగా ఉందని  వాతావరణ నిపుణులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటగున్నారు.  కొమరంభీం జిల్లాలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవగా.. మంచిర్యాల 12, ఆదిలాబాద్ 13, నిర్మల్ లో 13.5 డిగ్రీలు నమోదయ్యాయి.  ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు.  మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో అత్యల్ప   ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తూ.. మధ్యాహ్నం వరకు సూర్యుడు కనిపించడం లేదు. ఏపీలోని అల్లూరి జిల్లాలో 10, పాడేరులో 12, అరకులోయలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గుజరాత్ లో రెండో స్థానం కోసమేనా కేజ్రీవాల్ పోరాటం?

గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల 1,5 తేదీలలో రెండు విడతలలో ఎన్నికలు జరగనున్నాయి. గత ఆరు దఫాలుగా గుజరాత్ లో బీజేపీ తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. వరుసగా ఏడో సారి కూడా విజయం ఖాయమన్న ధీమానూ వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సారి గుజరాత్ లో బీజేపీకి విజయం నల్లేరు మీద బండి నడక ఎంతమాత్రం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సారి గుజరాత్ లో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఏదైనా ఉందంటే.. అది రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీలో ఉండటమేనంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలలో ఆప్, గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ చాలా చాలా బలంగా పుంజుకున్నాయి. గుజరాత్ ఎన్నికలపై సర్వేలన్నీ.. ఇదే విషయాన్ని ప్రస్ఫుటంగా తేల్చేశాయి.  లోక్ నీతి -సి.ఎస్.డి.ఎస్. సర్వే మాత్రం  ఆప్ గట్టి పోటీ ఇస్తుండటంతో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లన్నీ ఆ పార్టీ వైపు మళ్లిపోతాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ కు ఎంత గట్టి పట్టు ఉన్నా.. దానిని ఓట్ల రూపంలో మరచుకునే వ్యూహాలూ, ప్రచారంలో కాంగ్రెస్ బాగా వెనుకబడిందంటున్నారు.  రాహుల్ జోడో యాత్రలో ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ కు స్థానం లేకపోవడంపై పార్టీలో పెల్లుబికిన అసంతృప్తి కారణంగా చివరి నిముషంలో ఆయన పాదయాత్ర రూట్ మ్యాప్ లో గుజరాత్ ను చేర్చినప్పటికీ, అప్పటికే ఆలస్యమైపోయిందంటున్నారు.   2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 41.4 శాతం ఓట్లు దక్కాయి.  77 స్థానాలలో విజయం సాధించి, ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. కానీ ఈ సారి ఆ సీన్ లేదంటోంది లోక్ నీతి సర్వే. ఆ సర్వే ప్రకారం గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ   ప్రభావం కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారిందంటోంది. ఆ పార్టీకి రానున్న ఎన్నికలలో వచ్చే ఓట్లలో ఎక్కువ భాగం కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లేనని చెబుతోంది. గతంలో పరిశీలకులు సైతం ఇదే రీతిలో విశ్లేషణలు చేసిన సంగతి విదితమే. అంటే కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లలో కనీపం 20 శాతం ఆప్ కు మరలి పోయినా ఆశ్చర్యంలేదని సర్వే అంటోంది. అంటే ఈ సారి కాంగ్రెస్ కు గతంలో  వచ్చిన ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోతుందని లోక్ నీతి సర్వే పేర్కొంటోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలో కాకుండా ఆప్ ఖాతాలో పడే అవకాశాలే ఎక్కవ ఉన్నాయంటోంది. అంటే ఆప్ ప్రభావం వల్ల బారీగా నష్టపోయేది కాంగ్రెస్సేనన్నది సర్వే సారాంశం. దీంతో ఈ సారి ఎన్నికలలో గుజరాత్ లో కాంగ్రెస్ కు కనీసం రెండో స్థానం కూడా దక్కే అవకాశం లేదన్నది లోక్ నీతి సర్వే సారాంశం. గుజరాత్ లో ఆప్ అంతగా పుంజుకున్నా.. అధికారాన్ని చేపట్టే పరిస్థితి అయితే లేదని.. కానీ కాంగ్రెస్ అవకాశాలను మాత్రం భారీగా గండి కొడుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  వాస్తవానికి కేజ్రీవాల్   వ్యూహం కూడా అదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ మరో సారి అధికారంలోకి వచ్చినా సరే కానీ రాష్ట్రంలో రెండో స్థానంలో ఆప్ ఉండాలన్న వ్యూహంతో కేజ్రీవాల్ ఉన్నారని అంటున్నారు.  

హేయ్.. మళ్లీ సలహాదారును అప్పాయింట్ చేసేశారు!

ఏపీలో జగన్ సర్కార్ సలహాదారుల నియామకం విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా ముందుకు పోతున్నది. సలహాదారుల నియామకంపై హైకోర్టు గతంలోనే తప్పుపట్టింది. అయినా కోర్టులను జగన్ సర్కార్ ఎప్పుడు పట్టించుకుంది కనుక. సర్వత్రా విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. అయినా ఖాతరే లేనట్టుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. తాజాగా ఒక కొత్త సలహాదారును నియమించింది. అదీ అలాంటిలాంటి సలహాదారును కాదు. ఏకంగా జాబ్ మేళాల  సలహాదారట. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గతంలో ఒక సారి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ మూడు జాబ్  మేళాలు ఏర్పాటు చేశారు. అయితే అవి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినవి కావు. తన సొంతంగా అంటే విజయసాయి ట్రస్ట్ అంటూ ఆ జాబ్ ఫెయిర్స్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత అవి కూడా పీకల్లోతు వివాదాల్లో ఇరుక్కున్నాయనుకోండి అది వేరే సంగతి.. కానీ ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆధ్వరంలో ఎక్కడా జాబ్ మేళాలు జరిగిన దాఖలాలు లేవు. అలాంటిది జగన్ ఏకంగా వీటి కోసం అంటూ  ఓ సలహాదారుడిని నియమించి పారేశారు.   గాడి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని ప్రభుత్వ జాబ్ మేలా సలహాదారుగా నియమిస్తూ జీవో విడుదలయ్యింది.  ఈ గాడి శ్రీధర్ రెడ్డికి సలహాదారు పదవి… విజయసాయిరెడ్డి కోటా. గాడి శ్రీధర్ రెడ్డి విశాఖపట్నంలో వైసీపీ ఐటీ వింగ్‌  ఇన్ చార్జి అంటున్నారు. తనను ప్రభుత్వ  సలహాదారుగా నియమించారనీ,  ఈ పదవిలో తాను శక్తివంచన లేకుండా.. యువతలో స్కిల్ డెవలప్ మెంట్ , ఉద్యోగ కల్పనకు పాటుపడతానంటూ సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో ప్రకటనలు గుప్పించేసుకుంటున్నారు.   తన పనితీరుతో ప్రజా మన్నననలు పొందుతానని చెప్పుకుంటున్నారు.  సలహాదారు పదవుల నియామకాలలో ఇటీవలి కాలంలో వైసీపీ సర్కార్ స్పీడ్ పెంచేసింది.    వారానికో సలహాదారుడ్ని నియమించేస్తోంది.  ప్రజాధనాన్ని సలహాదారులంటూ నియమిస్తున్న పార్టీ నేతలకు నెలవారీగా వేతనాలుగా పందేరం చేసేస్తోంది.  

వనభోజనాల్లో రికార్డింగ్ డ్యాన్స్.. అదీ ప్రభుత్వ పాఠశాలలో!

వన భోజనాల్లో రికార్డింగ్ డ్యాన్స్.. అదీ ఒక ప్రభుత్వ పాఠశాలలో.. చిన్నారుల చదువుల గుడిలో.. వారి ఆటపాటలు మాత్రమే కనిపించాలి. అలాంటిది ఓ  సామాజిక వర్గానికి చెందిన వారు వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు.   వనభోజనాలంటే అయిన వారంతా సరదాగా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటారు. కలిసి భోజనం చేస్తారు అనుకుంటాం. కానీ వీరు అలా కాదు.. ఏకంగా అసభ్య నృత్యాలతో ఒక రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమమే పెట్టేశారు. రికార్డింగ్ డ్యాన్స్ లో భామలు డ్యాన్సులు చేస్తుంటే.. వనభోజనాలకు వచ్చిన వారు వారితో కలిసి కాలు కదిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులోని ఒక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన తతంగమిది. అసలు ప్రభుత్వ పాఠశాలలో వనభోజనాలు నిర్వహించడానికి అధికారులు పర్మిషన్ ఇచ్చారా? ఒక వేళ ఇస్తే ఎలా ఇచ్చారు. సరస్వతి నిలయమైన పాఠశాలలో రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహిస్తుంటే జాల్లా యంత్రాంగం ఏం చేస్తోంది? అధికార గణం ఈ అశ్లీల నృత్యాలు.. అదీ ఒక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరుగుతుంటే.. అలా జరుగుతున్నాయని సమాచారం అందినా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఊరుకున్నారు? అధికార పార్టీ వారి ఆధ్వర్యంలో జరిగింది కనుక తమకెందుగొచ్చిన గొడవలే అని ఊరుకున్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.   అధికార పార్టీకి చెందిన వారైతే ఏం చేసినా చేసేయొచ్చా? అని నిలదీస్తున్నారు. ఇటీవల ఏపీలోనే అయ్యప్ప పడి పూజను అడ్డుకున్న పోలీసులకు రికార్డింగ్ డ్యాన్సులను అడ్డుకోవాలని అనిపించలేదా అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా.. ఏకంగా  అశ్లీల నృత్యాలతో రికార్డింగ్ డ్యాన్సునే ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని  పాఠశాల విద్యార్థల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.  

ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ.. వద్దు బాబోయ్ అన్న అమెరికా మాజీ అధ్యక్షుడు

ఎలాన్ మస్క్  పగ్గాలు చేపట్టడంతోనే ట్విట్టర్ ప్రతిష్ట మంటగలవడం మొదలైంది. అయన తీసుకునే నిర్ణయాలు అటు ట్విట్టర్ ఉద్యోగులనూ, ఇటు ట్వీట్టర్ యూజర్లనూ కూడా ఆందోళనకు, గందరగోళానికీ గురి చేస్తున్నాయి. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ట్విట్టర్ ట్రంప్ ఖాతాను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడైనా ట్విట్టర్ ను తన వివాదాస్పద వ్యాఖ్యలకు వేదికగా చేసుకుంటానంటే అంగీకరించేది లేదంటూ అప్పట్లో ఆయన ఖాతాను బ్లాక్ చేసిన సంగతి తెలిసిదే. అయితే ఇప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ట్విట్టర్ ప్రస్తుత అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్రంప్ ఖాతా పునరుద్ధరణపై నిర్వహించిన పోల్ లో ట్రంప్ అక్కౌంట్ పునరుద్ధరణకు 51.8శాతం మంది మద్దతు ఇచ్చారని మస్క్ పేర్కొన్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. తన ఖాతాను పునరుద్ధరించవద్దు బాబోయ్ అని ట్రంప్ పేర్కోనడమే. తనకు ట్విట్టర్ లోకి వచ్చే ఆసక్తి ఏమాత్రం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తనను బహిష్కరించిన ట్విట్టర్ లోకి మళ్లీ రావడానికి తనకు ఇసుమంతైనా ఇష్టం లేదని పేర్కొంటూరావడానికి  తన సొంత మీడియా అయిన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) స్టార్టప్ అభివృద్ధి చేసిన కొత్త ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌తో తాను కట్టుబడి ఉంటానని చెప్పారు. ట్విట్టర్ కంటే టీఎంటీజీ మెరుగ్గా పనిచేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.   2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గతేడాది జనవరిలో అమెరికాలో తీవ్రమైన హింసాకాండ చెలరేగింది. ఆందోళనకారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లి.. విధ్వంసం సృష్టించారు. ఈ ఆందోళనలకు కారణం ట్రంప్ చేసిన ట్వీట్లు, పోస్టులేనని వార్తలు రావడంతో.. అప్పట్లో ఆయన ఖాతాలను తొలగిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్విట్టర్ పగ్గాలు చేజిక్కించుకున్న వెంటనే మస్క్.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించినా ట్రంప్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

 అమెరికాలో మరో సారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడోలోని ఓ నైట్ క్లబ్ లో దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటన క్లబ్ క్యూ అనే నైట్ క్లబ్ తో జరగింది.ఘటనకు పాల్పడిన వ్యక్తిని దుండగులు అదుపులోనికి తీసుకున్నారు. క్లబ్ క్యూలో ట్రాన్స్ జెండర్ డే ఆఫ్ రిమంబరెన్స్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఇందుకు కారణమేమిటన్నది వెంటనే తెలియరాలేదు.

సూర్యకుమార్ యాదవ్ కొడితే రికార్డులు బద్దలైపోవాలంతే!

టి20 స్పెషలిస్ట్ ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ దుమ్ము దులుపుతున్నాడు. ఇప్పటి వరకూ కేవలం 41 టి20 మ్యాచ్ లు మాత్రమే ఆడిన సూర్యకుమార్ పలు అరుదైన రికార్డులు సృష్టించాడు. తాజాగా న్యూజిలాండ్ పై ఆదివారం జరిగిన టి20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్లో శతకబాదాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అతడి ఖాతాలో జమయ్యాయి.  ఆదివారం (నవంబ‌ర్ 20) న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స‌ర్లుతో  111 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో అతడి ఖాతాలో రికార్డులు సృష్టించాడు. త‌న కెరీర్‌లో రెండో శ‌త‌కం బాదిన సూర్య‌కుమార్ యాద‌వ్ ఈ క్ర‌మంలో ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు.  న్యూజిలాండ్ గ‌డ్డ‌పై టీ20ల్లో సెంచ‌రీ చేసిన తొలి భార‌త ఆట‌గాడిగా నిలిచాడు. అలాగే ఒకే క్యాలెండర్ ఇయర్ లో టి20లలో రెండు శతకాలు కొట్టిన రెండో భార‌త ఆట‌గాడిగా రోహిత్ శ‌ర్మ రికార్డును స‌మం చేశాడు.  2018లో రోహిత్ ఈ ఘ‌న‌త సాధించాడు. ఇక అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన కేఎల్ రాహుల్ రికార్డును స‌మ‌యం చేశాడు. రాహుల్ 72 మ్యాచుల్లో రెండు శ‌త‌కాలు చేయ‌గా సూర్య 41 మ్యాచుల్లోనే ఈ ఘ‌న‌త సాధించాడు. నాలుగు సెంచ‌రీల‌తో రోహిత్ శ‌ర్మ ఈ జాబితాలో అంద‌రి కంటే ముందు ఉన్నాడు. ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక అర్థ‌శ‌త‌కాలు(11) చేసిన రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కెక్కాడు. ఈ క్ర‌మంలో పాక్ కెప్టెన్ బాబ‌ర్ అజామ్‌(10) ను అధిగ‌మించాడు. పాక్ కే చెందిన మ‌హ్మ‌ద్ రిజ్వాన్(13) ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఇలా ఉండగా  సూర్య‌కుమార్ టి20 మ్యాచ్ లలో సాధించిన రెండు శ‌త‌కాలు కూడా విదేశాల్లో చేసిన‌వే. ఇలా రెండు సెంచ‌రీలు విదేశాల్లో చేయ‌డం కూడా ఓ రికార్డే. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో సూర్య‌కుమార్ నేటి మ్యాచ్‌తో క‌లిపి 41 మ్యాచులు ఆడాడు. 39 ఇన్నింగ్స్‌లో 181.64 స్ట్ర‌యిక్ రేట్‌తో 45 స‌గ‌టున‌ 1395 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు శ‌త‌కాలు, 12 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

గుజరాత్ లో బీజేపీకి రెబల్స్ బెడద

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి రెబల్స్ బెడద పెద్ద తలనొప్పిగా  మారనుంది. గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల మొదటి వారంలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీకి గుజరాత్ లో ఆప్, కాంగ్రెస్ లు గట్టి పోటీని ఇస్తున్నాయి. గుజరాత్ లో ఎలాగైనా సరు వరుసగా ఏడో సారి అధికారంలోకి రావాలన్నపట్టుదలతో ఉన్న బీజేపీ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. దీంతో ఆ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైంది. బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించడం లేదు. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 1న జరగనుండగా..ఆ ఎన్నికలకు 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ రెబల్ అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. వారిని బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా స్వతంత్ర అబ్యర్థులుగా నిలబడిన ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించింది. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు, క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు పాల్ప‌డినందుకు, క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం కింద ఈ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు సీఆర్ పాటిల్ చెప్పారు. పార్టీ నుంచి బహిష్కృతులైన వారిలో  హర్షద్ వాసవ, అరవింద్ లదాని, ఛత్రాసింగ్ గుంజారియా, కేతన్ భాయ్ పటేల్, భరత్ భాయ్ చావ్‌డా, ఉదయ్‌ భాయ్ షా, కరన్ భాయ్ బరైయా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌రుపున పోటీ చేసే 160 మంది అభ్య‌ర్థుల జాబితాను ఇటీవ‌లే బీజేపీ ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో 38 కొత్త ముఖాలు ఉన్నాయి. 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వ‌గా.. 42 మందికి మాత్రం నిరాక‌రించింది. మాజీ సీఎం విజ‌య్ రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్‌ల‌కు కూడా టికెట్ ఇవ్వ‌లేదు. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. గుజరాత్ జామ్‌నగర్ నార్త్ విధానసభ స్థానం ఆమె పోటీ చేయ‌నుంది.  గుజ‌రాత్ రాష్ట్రంలో రెండు విడ‌త‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. డిసెంబర్ 1న తొలి దశ ఎన్నికలు జ‌ర‌గ‌నుండ‌గా, డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 8న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.

కవలలకు తాత అయిన ముఖేష్ అంబానీ

వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ కవల పిల్లలకు తాతయ్యారు. ఆయన కుమార్తె ఈశా అంబానీ శనివారం (నవంబర్ 19)   కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అంబానీ కుటుంబం ఒక ప్రకటనలో తెలిపింది.   ఈశా అంబానీ – ఆనంద్ పిరమాల్ దంపతులకు కవలలు జన్మనిచ్చినట్టు పేర్కొంది. కవలలలో   పాపకు అదియా, బాబుకి కృష్ణ అని పేర్లు పెట్టినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఆ దంపతులకు, పిల్లలకు మీ ఆశీస్సులు అందించాలని కోరుతున్నామని అంబానీ కుటుంబం ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా.. ఈశా-ఆనంద్ లు చిన్ననాటి స్నేహితులు. వారి స్నేహం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పంచి 2018 డిసెంబరులో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈశా రిలయన్స్ రిటైల్ వ్యాపారాలను చూసుకుంటున్న సంగతి విదితమే.

బర్త్ డే పార్టీలో గెస్ట్ ల విషయంలో గొడవ.. ఐదుగురు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

హాస్టల్ లో ఓ విద్యార్థిని బర్త్ డే పార్టీకి వచ్చిన అతిథుల విషయంలో జరిగిన గొడవ ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి దారి తీసింది. వరంగల్ జిల్లా ఆరేపల్లి రెసిడెన్షియల్ స్కూల్ లో  చదువుకుంటున్నటెన్త్ విద్యార్థిని బర్త్ డే పార్టీ జరిగింది. ఆ బర్త్ డే పార్టీకి హాస్టల్ విద్యార్థినుల కన్నా బయటి వారే ఎక్కువ మంది రావడంపై హాస్టల్ అధికారులు విద్యార్థినులను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హాస్టల్ లో ఉన్న ఫినాయిల్ తాగేశారు. తొటి విద్యార్థులు అధికారులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారు కోలుకుంటున్నారు. విద్యార్థినులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.  

సంజుశాంసన్ పట్ల వివక్ష ఎందుకు?

టీమ్ ఇండియాలో కొందరు వరుసగా విఫలమౌతున్నా అవకాశాలు వస్తూనే ఉంటాయి. మరి కొందరు అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణించినా అవకాశాలు దక్కవు. ముఖ్యంగా సంజు సాంశన్ విషయం తీసుకుంటే.. అతడి పట్ల టీమ్ ఇండియా మేనేజ్ మెంట్ కు ఏదైనా ప్రత్యేకమైన కోపం ఉందా అనిపిస్తుంది. భార‌త క్రికెట్  ఒక్క సంజు కే అవ‌కాశాలు రావ‌డం లేదు. సీనియ‌ర్లు లేన‌ప్పుడు ఎంపిక చేయ‌డమే తప్ప టీమ్ లో ఆడే అవకాశం ఇవ్వడం లేదు. ఎప్పుడో ఓ సారి అవ‌కాశం ఇచ్చినట్టు ఇఛ్చి మళ్లీ పక్కన పెట్టేస్తారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణించినా పట్టించుకోరు. మరో అవకాశం ఇవ్వరు. అదే ప‌దే ప‌దే విఫ‌లం అవుతున్న ఆట‌గాళ్ల‌కు మాత్రం..   లెక్క‌కు మిక్కిలి అవ‌కాశాలు ఇస్తున్నారు.  ప్ర‌స్తుతం కివీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయిన తొలి టీ20లో చోటు ద‌క్కించుకోలేక పోయిన‌ సంజుకు  ఆదివారం(నవంబర్ 20) జ‌రిగిన రెండో టీ20లోనూ నిరాశే ఎదురైంది. సీనియర్లు లేని ఈ సిరీస్‌లో శాంసన్ తుది జట్టులో ఆడటం ఖాయమని అంతా భావించారు. అయితే సంజుకు అవకాశం ఇవ్వలేదు. పోనీ సంజు ప్లేస్‌లో జ‌ట్టులోకి వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌ , దీప‌క్ హుడాలు బ్యాట్‌తో రాణించారా..? అంటే అదీ లేదు. ఇక మిగిలిన ఆఖ‌రి టీ20 మ్యాచ్‌లోనైనా సంజును ఆడిస్తారా..? అంటే అది చెప్ప‌లేని ప‌రిస్థితి. రిష‌బ్ పంత్ ప‌దే ప‌దే విఫ‌లం అవుతున్నా అత‌డికి అండ‌గా నిలుస్తున్నారు అలాంటి మద్దతు సంజు శాంసన్‌కు ఎందుకు ఇవ్వడం లేదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  సంజూ విషయంలో టీమ్ ఇండియా మాజీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.   శాంస‌న్ అవకాశాలు ఇచ్చి ఆ తరువాత ఒక అంచనాకు రావాలే తప్ప.. ఒకటి రెండు మ్యాచ్ లు ఆడించి పక్కన పెట్టేయడం సరికాదంటున్నారు. 

సూర్య అదరహో..న్యూజిలాండ్ తో రెండో టి20 భారత్ ఘన విజయం

న్యూజిలాండ్ లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగ‌నుయ్ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. భార‌త జ‌ట్టు 65 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. రెండో టి20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్.. సూర్య‌కుమార్ యాద‌వ్ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 191 ప‌రుగులు చేసింది. అనంత‌రం 192 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కివీస్ 18.5 ఓవ‌ర్ల‌లో 126 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బౌల‌ర్ల‌లో హుడా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, చాహ‌ల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. సుంద‌ర్, భువ‌నేశ్వ‌ర్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. శ‌త‌కంతో చెల‌రేగిన సూర్య‌కుమార్ ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నుంది.కాగా భారీ లక్ష్య ఛేదనలో  న్యూజిలాండ్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. తొలి ఓవ‌ర్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో ఓపెన‌ర్ ఫిన్ అలెన్‌(0) డ‌కౌట్ అయ్యాడు. దీంతో సున్నా ప‌రుగుల వ‌ద్దే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్‌ కేన్ విలియమ్సన్(61; 52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) మ‌రో ఓపెన‌ర్ కాన్వే(25; 22బంతుల్లో 3 ఫోర్లు) క‌లిసి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశాడు. వీరిద్ద‌రు ఆచితూచి ఆడుతూ చెత్త బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించారు. రెండో వికెట్‌కు 56 ప‌రుగులు జ‌త చేశారు. ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడిని వాషింగ్ట‌న్ సుంద‌ర్ విడ‌దీశాడు. సుంద‌ర్ బౌలింగ్ లో అర్ష్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి కాన్వే ఔట్ అయ్యాడు. ఒక ఇక్క‌డి నుంచి భార‌త బౌల‌ర్ల జోరు మొద‌లైంది. ఓ వైపు కేన్ మామ క్రీజులో పాతుకుపోయి త‌న‌దైన శైలిలో ఆడుతుండ‌గా.. అత‌డికి స‌హ‌క‌రించే బ్యాట‌ర్లే క‌రువు అయ్యారు. ఫిలిప్స్‌(12), మిచెల్‌(10), నీష‌మ్‌(0) సాంట్న‌ర్‌(2) ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయారు. ఓ వైపు సాధించాల్సిన ర‌న్‌రేట్ పెరిగిపోతుండ‌డంతో కేన్ ధాటిగా ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. ఈ క్ర‌మంలో 18వ‌ ఓవ‌ర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అప్ప‌టి కివీస్ స్కోర్ 125/ 7. మిగిలిన మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌డానికి భార‌త్ కు ఎంతో సమ‌యం ప‌ట్ట‌లేదు. దీపక్ హుడా వ‌రుస‌గా సోథీ(0), సౌథీ(0), మిల్నె(6)ను ఔట్ చేశాడు. తృటిలో హ్యాట్రిక్ వికెట్లు తీసే ఛాన్స్ మిస్ అయ్యాడు. త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ గ‌ణాంకాల‌ను హుడా(4/10) న‌మోదు చేశాడు. ఈ మ్యాచ్ లో సూర్య‌కుమార్ యాదవ్ ఆటే హైలైట్ . సెంచ‌రీతో చెల‌రేగాడు. సిక్స‌ర్లు, ఫోర్లతో విరుచుప‌డ్డాడు.  సీనియ‌ర్ల గైర్హాజ‌రీలో ఇషాన్ కిష‌న్, పంత్‌లు ఓపెన‌ర్లు గా వ‌చ్చారు. త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తూ పంత్ 13 బంతుల్లో 6 ప‌రుగులు చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. దీంతో 36 ప‌రుగ‌ల‌కే భార‌త్ తొలి వికెట్ కోల్పోయింది. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్(111 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) త‌న అద్భుత ఫామ్‌ను కొన‌సాగిస్తూ కివీస్ బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడుకున్నాడు. త‌న‌దైన ట్రేడ్ మార్క్ షాట్ల‌తో అల‌రించాడు. ఇషాన్ కిష‌న్‌(36; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌), శ్రేయాస్ అయ్య‌ర్‌(13), హ‌ర్థిక్ పాండ్య‌(13) ల అండతో త‌న‌కే సాధ్య‌మైన షాట్ల‌తో మైదానం న‌లువైపులా బౌండ‌రీలు బాదిన సూర్యకుమార్ యాదవ్ 32 బంతుల్లో అర్థ‌శ‌త‌కం పూర్తి చేశాడు. ఆ త‌రువాత వేగం పెంచాడు. కేవ‌లం 49 బంతుల్లోనే శ‌త‌కం సాధించాడు. టీ20ల్లో ఇది సూర్య‌కు రెండో శ‌త‌కం. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో సౌథీ మూడు వికెట్లు తీయ‌గా, ఫెర్గూస‌న్ రెండు, ఇష్ సోథీ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. కివీస్ సీనియ‌ర్ బౌల‌ర్ టిమ్ సౌథీ ఆఖ‌రి ఓవ‌ర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. వ‌రుస‌గా హార్థిక్ పాండ్య‌, హుడా, సుంద‌ర్ వికెట్లు తీసి టీ20ల్లో రెండో సారి ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

పేరుకు ఖర్గే.. పెత్తనం అంతా గాంధీ కుటుంబానిదే!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల క్రతువు పూర్తయ్యింది. కొత్త అధ్యక్షుడు పగ్గాలు చేపట్టి నెల రోజులు దాటిపోయింది. దాదాపు పాతికేళ్ళ తర్వాత  కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరిగింది. ఎన్నిక అన్నారు కనుక ఎన్నిక అంతే.. మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ లు ఇరువురు పోటీ చేశారు అని చెప్పుకోవడానికే. కానీ మల్లికార్జన్ కర్గే పేరు సోనియా ప్రతిపాదించిన క్షణంలోనే కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఆయనేనని ఎన్నిక అయ్యి, ఫలితం వచ్చే వరకూ ఆగకుండానే పార్టీ శ్రేణులూ, రాజకీయ వర్గాలూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశాయి. ఫలితాల్లోనూ అదే తేలింది. గాంధీ నెహ్రూ కుటుంబం నుంచి బయటి వ్యక్త పార్టీ పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ లో ఏమైనా మార్పు కనిపించిందా అంటే ఏం లేదనే చెప్పాలి.   వాస్తవానికి సోనియా గాంధీ తొలుత పార్టీ అధ్యక్ష పదవికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను ఎంపిక చేశారు.   అధిష్టానం అభ్యర్ధిగా ఆయన్ని బరిలో దించాలని ఆశించారు. ఆయన్ని ఒప్పించారు. కానీ ఆయన అంగీకరించినట్లే అంగీకరించి చివరిక్షణంలో చెయ్యిచ్చారు. ఆ తరువాత పలు ఆప్షన్లను పరిశీలించి చివరకు సోనియా మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు.  ఎనిమిది పదుల ఖర్గేను  ఎంపిక చేశారు. ఇక అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసిన శశి థరూర్ గాంధీల నాయకత్వాన్ని సవాలు చేసిన జీ 23 సభ్యుడు. దీంతో సోనియా గాంధీ ఆశీస్సులు ఎవరికున్నాయో వేరే చెప్పనవసరం లేకుండానే తేలిపోయింది. ఆ విషయం అద్యక్ష ఎన్నికకు ముందే..  శశి థరూర్ కు విషయం అర్థమైపోయింది. అందుకే ఆయన తీరిగ్గా,అభ్యర్థులకు సమాన అవకాశాలు లేవని, అభ్యర్థుల మధ్య తారతమ్యాలు చూపుతున్నారని, అయిన వారికి ఆకుల్లో కానీ వారికీ కంచాల్లో అన్నట్లుగా పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని ఆరోపించేసి చేతులు దులుపుకున్నారు. అవును మరి నాడా దొరికిందని, గుర్రాన్ని కొంటే ఇలాగే ఉంటుందని అప్పట్లో భాష్యాలు కూడా చెప్పారు.   జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది  అన్నట్లుగానే అధిష్టానం అండదండలున్న మల్లిఖార్జున ఖర్గే సునాయసంగా అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఆయన పగ్గాలు చేపట్టి కూడా నెల రోజులు దాటిపోయింది.    శశి థరూర్ తాను అధ్యక్షుడినైతే పార్టీలో సమూల మార్పులు తెస్తానని ప్రచార సమయంలో చెప్పుకున్నారు.అయితే ఖర్గే మాత్రం  సోనియా గాంధీ, రాజమాతగా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ రారాజుగా నే కొనసాగుతారని చెప్పకనే చెప్పారు. అంటే తాను అధ్యక్షుడినైనా గాంధీ కుటుంబం పెత్తనం ఇసుమంతైనా మారదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది.   కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా నిర్ణయాలు తీసుకునే అధికారం సోనియా కుటుంబానిదే అని అప్పట్లోనే పరిశీలకులు చెప్పారు. అందులో ఇసుమంతైనా మార్పు ఉండదని కొత్త అధ్యక్షుడి నెల రోజుల హయాంలో ప్రస్ఫుటంగా తేలిపోయింది. ఇక పోతే   శశి థరూర్ ను  స్టార్ క్యాంపెయినర్స్ జాబితా నుంచి తాజాగా తొలగించడం ద్వారా గాంధీ కుటుంబాన్ని ధిక్కరించిన వారికి కాంగ్రెస్ లో స్థానం ఏమిటో మరోసారి స్పష్టంగా చూపినట్లైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో శశి పేరు లేకపోవటం అందుకే పెద్దగా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. థరూర్ ను తాము పక్కన పెట్టలేదని, శశి థరూర్ పేరు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్  జాబితాలో గతంలో ఎప్పుడూ చేర్చలేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడమే ఆశ్చర్యంగా ఉంది. తిరువనంతపురం ఎంపీ అయిన థరూర్ 2011,2016 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా  బాధ్యతలు నిర్వహించారు. 2014, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముంబై, కోల్ కతా, చెన్నై నగరాల్లో శశి థరూర్ విస్తృతంగా ప్రచారం చేశారు.  ఇటీవలే నోయిడా లో జరిగిన బై పోల్స్ లోనూ ఆయన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో   పాల్గొన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆయన్ను స్టార్ క్యాంపెయినర్ గా గుర్తించకపోవటమంటే పొమ్మనలేక పొగబెట్టడమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇదొక్కటే కాదు ధిక్కారాన్ని గాంధీ కుటుంబం సహించదనడానికి హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే జీ-23లో ఒకరైన ఆనంద్ శర్మ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ హోదాను కోల్పోయారు. అలాగే మనీష్ తివారి, రణదీప్ సింగ్ సూర్జేవాలాకు కూడా అదే మర్యాద దక్కింది. తొలుత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బదులుగా రూపొందిన కొత్తగా వచ్చిన కమిటీలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఆయన్ను దూరం పెట్టడంతో శశి థరూర్ రాజకీయ భవితవ్యంపై మబ్బులు కమ్ముకున్నాయి. తాజా విషయాలపై స్పందించిన ఆయన తాను కేవలం మేధావినేనని భారత వ్యతిరేకిని, మోడీ వ్యతిరేకిని కానేకాననటం విశేషం. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీఎన్నికల్లో ప్రచారం చేయాలని తాను వ్యక్తిగతంగా భావించినప్పటికీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో తనకు చోటు లేకుండా చేశారని, బహుశా పార్టీకి తన సేవలు అక్కర్లేదేమోనని ఆయన వ్యాఖ్యానించటం విశేషం. 

మద్యం షాపుల్లో ఇక డిజిటల్ చెల్లింపులకూ ఓకే.. మర్మమేమి తిరుమలేశా?!

 ఇంత కాలం ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోని వైసీపీ సర్కార్ ఎట్టకేలకు మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులకు ఓకే చెప్పింది. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాకా.. మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వ వ్యాపారంగా మార్చేశారు. ప్రజలలో మద్యం అలవాటు మాన్నించడానికే అంటూ మద్యం ధరలను విపరీతంగా పెంచేశారు. ఇక ప్రభుత్వ మద్యం దుకాణాల సంఖ్యను కూడా క్రమంగా తగ్గించుకుంటూ వస్తానంటూ కొత్త విధానాన్ని ప్రకటించారు. కొత్త కొత్త బ్రాండ్లను తీసుకువచ్చారు. దీంతో ధర ఎక్కువ, నాణ్యత తక్కువ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మద్యం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ధరలు పెంచేశారన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. అన్నిటికీ మించి అన్ని చోట్ల చెల్లింపులు డిజిటల్ రూపంలో జరగడానికి లేని అభ్యంతరం ఒక్క మద్యం దుకాణాల్లోనే ఎందుకన్న ప్రశ్నలూ తలెత్తాయి. మద్యం దుకాణాల్లో డిజిటల్, ఆన్ లైన్ పేమెంట్లకు వీల్లేదన్న ఆంక్షలపై విమర్శలే కాదు అనుమానాలూ వ్యక్తమయ్యాయి.  నిత్యం కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగే మద్యం వ్యాపారంలో డిజిటల్ చెల్లింపుకు ఎందుకు అనుమతించడం లేదన్న ప్రశ్నలూ వెల్లువెత్తాయి. ఎందుకంటే    మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వానివే అయినా..సరఫరా.. తయారీ..   మొత్తం వైసీపీ నేతల గుప్పిట్లో ఉంది. దీంతో మద్యం దుకాణాల్లో నగదు లావాదేవాలకు మాత్రమే అనుమతి అంటూ ప్రభుత్వం చెబుతుండటంతో.. ఆ సొమ్మంతా ఎక్కడకు పోతోందన్న అనుమానాలు పొడసూపాయి. ఈ సొమ్మ బ్లాక్ మనీగా  తరలిపోతోందని విమర్శలూ ఉన్నాయి. ఇక బేగం పేట విమానాశ్రయం నుంచి  ప్రైవేట్ చార్టర్డ్ విమానాల్లో పెద్ద మొత్తంలో సొమ్ము తరలించారని ఢిల్లీ మద్యం స్కాం దర్యాప్తు చేస్తున్న ఈడీ దర్యాప్తులో తేలడంతో ఏపీలో మద్యం సొమ్మును కూడా అలాగే తరలిస్తున్నారంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్, విశాఖ పాత విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించిన చార్టర్ట్ ఫ్లైట్ల గుట్టు కూడా బయట పెట్టాలంటూ తెలుగుదేశం అధికార ప్రతినిథి పట్టాభి డిమాండ్ చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సొమ్ము తరలింపునకు ఉపయోగించిన చార్టర్డ్ విమానాలు ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్టయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి భార్య అనికా టేక్రీవాల్ రెడ్డికి చెందిన జెట్ సెట్ గో సంస్థకు చెందినవని ఈడీ అనుమానిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ పై విమర్శల దాడి జరిగింది. శరత్ చంద్రారెడ్డి వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు.. వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి అల్లుడి అన్న కావడం.. అంతకంటే ముందే.. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు కావడంతో జగన్ సర్కార్ డిఫెన్స్ లో పడింది. దీంతో గత్యంతరం లేకనే మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ కు కూడా అనుమతి ఇస్తామని ప్రకటించింది. సోమవారం (నవంబర్ 21) నుంచే ఏపీలోని మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లను అనుమతిస్తామని ప్రకటించింది. ఇప్పటి దాకా అనుమతించని డిజిటల్ పేమెంట్లకు ఇప్పుడెందుకు అనుమతిస్తున్నారన్న ప్రశ్నకు షాపుల్లో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తేలిందనీ, దానిని అరికట్టేందుకేననీ బదులిస్తోంది. ఇంత కాలం ఆ విషయాన్ని గుర్తించలేదా అన్న ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. పోనీ సిబ్బంది చేతివాటానికి అవకాశం లేకుండా మద్యం దుకాణాల్లో పూర్తిగా డిజిటల్ పేమెంట్పే అంటున్నారా అంటే అదీ లేదు. నగదు చెల్లింపులకూ చాన్స్ ఉంటుందంటున్నారు. అంటే సిబ్బంది చేతి వాటానికి భయపడే డిజిటల్ పేమెంట్స్ కు అనుమతి ఇస్తున్నామన్న మాట పూర్తిగా వాస్తవం కాదన్న మాట. విమర్శలకు తలొగ్గే ఆ నిర్ణయం తీసుకున్నారని అర్ధమౌతోంది. కానీ డిజిటల్ పేమెంట్స్ అని బయటకు చెప్పినా అది నామ్ కే వాస్తే అమలు చేస్తారనీ, సాంకేతిక సమస్య సహా పలు రకాల సాకులతో మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపులకే పట్టుబట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు అంటున్నారు.