సూర్య అదరహో..న్యూజిలాండ్ తో రెండో టి20 భారత్ ఘన విజయం
posted on Nov 20, 2022 @ 9:58PM
న్యూజిలాండ్ లో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. భారత జట్టు 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. రెండో టి20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో హుడా నాలుగు వికెట్లు పడగొట్టగా, చాహల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. సుందర్, భువనేశ్వర్ ఒక్కొ వికెట్ పడగొట్టారు. శతకంతో చెలరేగిన సూర్యకుమార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే మంగళవారం జరగనుంది.కాగా భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఓపెనర్ ఫిన్ అలెన్(0) డకౌట్ అయ్యాడు. దీంతో సున్నా పరుగుల వద్దే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్(61; 52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో ఓపెనర్ కాన్వే(25; 22బంతుల్లో 3 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. రెండో వికెట్కు 56 పరుగులు జత చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. సుందర్ బౌలింగ్ లో అర్ష్దీప్కు క్యాచ్ ఇచ్చి కాన్వే ఔట్ అయ్యాడు. ఒక ఇక్కడి నుంచి భారత బౌలర్ల జోరు మొదలైంది.
ఓ వైపు కేన్ మామ క్రీజులో పాతుకుపోయి తనదైన శైలిలో ఆడుతుండగా.. అతడికి సహకరించే బ్యాటర్లే కరువు అయ్యారు. ఫిలిప్స్(12), మిచెల్(10), నీషమ్(0) సాంట్నర్(2) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఓ వైపు సాధించాల్సిన రన్రేట్ పెరిగిపోతుండడంతో కేన్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 18వ ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అప్పటి కివీస్ స్కోర్ 125/ 7. మిగిలిన మూడు వికెట్లు పడగొట్టడానికి భారత్ కు ఎంతో సమయం పట్టలేదు. దీపక్ హుడా వరుసగా సోథీ(0), సౌథీ(0), మిల్నె(6)ను ఔట్ చేశాడు. తృటిలో హ్యాట్రిక్ వికెట్లు తీసే ఛాన్స్ మిస్ అయ్యాడు. తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలను హుడా(4/10) నమోదు చేశాడు.
ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ఆటే హైలైట్ . సెంచరీతో చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుపడ్డాడు. సీనియర్ల గైర్హాజరీలో ఇషాన్ కిషన్, పంత్లు ఓపెనర్లు గా వచ్చారు. తన పేలవ ఫామ్ను కొనసాగిస్తూ పంత్ 13 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. దీంతో 36 పరుగలకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. వన్డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్(111 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు) తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ కివీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు.
ఇషాన్ కిషన్(36; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), శ్రేయాస్ అయ్యర్(13), హర్థిక్ పాండ్య(13) ల అండతో తనకే సాధ్యమైన షాట్లతో మైదానం నలువైపులా బౌండరీలు బాదిన సూర్యకుమార్ యాదవ్ 32 బంతుల్లో అర్థశతకం పూర్తి చేశాడు. ఆ తరువాత వేగం పెంచాడు. కేవలం 49 బంతుల్లోనే శతకం సాధించాడు. టీ20ల్లో ఇది సూర్యకు రెండో శతకం. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ మూడు వికెట్లు తీయగా, ఫెర్గూసన్ రెండు, ఇష్ సోథీ ఓ వికెట్ పడగొట్టాడు. కివీస్ సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. వరుసగా హార్థిక్ పాండ్య, హుడా, సుందర్ వికెట్లు తీసి టీ20ల్లో రెండో సారి ఈ ఘనతను అందుకున్నాడు.