కుంగిపోతున్న జోషిమఠ్.. ఛార్ ధాం యాత్ర అనుమానమే!
posted on Jan 26, 2023 @ 9:51AM
చార్ ధాం యాత్రపై నీలి నీడలు ముసురుకున్నాయి. జోషిమఠ్ కుంగిపోతుండటంతో ఈ యాత్ర సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే చార్ ధాం యాత్రకు వెళ్లాలంటే జోషిమఠ్ దాటుకునే వెళ్లాలి. కానీ ఇక్కడి రోడ్లు, భవనాలు, హోటళ్లు ఇసుమంతైనా సురక్షితం కాదని నిపుణులు అంటున్నారు. అయినా అవి సురక్షితమా కావా అన్న విషయాన్ని అధికారికంగా నిపుణుల కమిటీ తేల్చాల్సి ఉంది.
జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ కు వెళ్లే రహదారికి చీలికలు వచ్చాయి. బద్రీనాథ్ నేషనల్ హైవే కుంచించుకు పోతోంది. ఇక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆ కారణంగా రోడ్ల భద్రత కరవైంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హేమకుండ్ సాహెబ్, బద్రీనాథ్ ధాం, గోవింద్ ఘాట్, మనా పాస్ కు వెళ్లాలంటే జోషిమఠ్ గుండానే వెళ్లాలి. ఏటా ఏప్రిల్ నుంచి మే మధ్యకాలంలో జరిగే చార్ ధాం యాత్ర కోసం పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు ఈ రహదారి వెంట ప్రయాణిస్తుండటంతో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జాం అవుతుంది. ఇంత ట్రాఫిక్ ను జోషిమఠ్ రహదారులు ఇప్పుడు తట్టుకోగలవా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రోడ్ల పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ, నివేదిక సిద్ధం చేస్తున్నారు. హేలంగ్-మర్వారీ బైపాస్ ద్వారా చార్ ధాం యాత్రకు వెళ్లే ప్రత్యామ్నాయ అవకాశం ఉన్నా ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ఈ ఏడాది చార్ ధాం యాత్ర కు అనుమతి అన్నది అనుమానమేనని అంటున్నారు.