సజ్జలను కడిగి పారేసిన షర్మిల

వైఎస్ కుటుంబంలో వివాదాలున్నాయన్నది బహిరంగ రహస్యమే.  వైసీపీ నేతలు కూడా పలుమార్లు నిజమేనని ఒప్పుకోవాల్సి వచ్చింది.  ప్రస్తుతానికి వైఎస్ రాజశేఖరెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల హైదరాబాద్ లోనే నివాసం ఉంటుండగా.. తాడేపల్లిలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్దకు కనీసం రాకపోకలు కూడా లేవు. ఈ మధ్యనే జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు కూడా ఓ కొలిక్కి వచ్చాయని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. వ్యక్తిగతంగా సోదరుడు జగన్ తో షర్మిల విభేదాల నేపథ్యంలో ఆమె తెలంగాణలో సొంత  రాజకీయ పార్టీ పెట్టుకున్నారు.  అయితే, షర్మిల తన రాజకీయ వ్యవహారాల జోలికి వైసీపీ నేతలు వస్తే ఏ మాత్రం వెనకా ముందు లేకుండా మాటలతో చీల్చి చెండాడేస్తున్నారు. గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలే జరగగా మరోసారి షర్మిల వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సలహాదారు అయిన సజ్జల సకల శాఖల మంత్రిగా, షాడో సీఎంగా కీ రోల్ పోషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ కు తెలియకుండా పార్టీలో, ప్రభుత్వంలో ఏదైనా జరుగుతుందేమో కానీ సజ్జలకు తెలియకుండా ఏదీ జరగదు. అందుకే  షర్మిలతో జగన్ విబేధాలు, షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీపై కూడా సజ్జల స్పందిస్తుంటారు. కానీ షర్మిల మాత్రం ఏ మాత్రం మొహమాటం లేకుండా మాటలతోనే కొట్టినంత పని చేస్తారు. తాజాగా షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ ఎన్నికలలో పోటీ చేయకుండా.. కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించడం తెలిసిందే. ఈ అంశంపై సజ్జల ప్రెస్ మీట్ పెట్టి మరీ మీద తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. షర్మిల కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడం తప్పు అన్నట్లుగా మాట్లాడిన సజ్జల ఆమె పార్టీ ఆమె ఇష్టం అంటూనే..  జగన్మోహన్‌రెడ్డిని ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టిందో  ఆ పార్టీ కోసం షర్మిల పనిచేయడం తనకు నచ్చలేదని సజ్జలలో మాట్లాడారు. కానీ, షర్మిల మాత్రం సజ్జలపై ఓ రేంజిలో  విరుచుకుపడ్డారు.  ముందు మీ సంగతి మీరు చూసుకోండి సజ్జల గారూ అంటూ వైసీపీ నేతలు షాక్ అయ్యే స్థాయిలో షర్మిల మాట్లాడారు. సోమవారం ఆమె హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మీడియా సమావేశం నిర్వహించిన షర్మిల.. తాము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చామో వివరించామని.. ప్రజల కోసమే తెలంగాణా ఎన్నికల్లో పాల్గొనకుండా ఉన్నామని.. అంతే తప్ప ఎవరో తమను పొగడాలని కిరీటాలు పెట్టాలని ఎక్కడా కోరుకోవడం లేదని అన్నారు. అలాగే సజ్జల రామక్రిష్ణారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల.. ముందు మీ కధ ఏంటో చూసుకోండి సజ్జల గారూ అంటూ..  వైఎస్సార్టీపీతో సంబంధం లేదని గతంలో ఇదే సజ్జల అన్నారని ఇపుడు తమ పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని   నిలదీశారు. తాను తెలంగాణ రాష్ట్రంలో వైస్సార్టీపీని ఏర్పాటు చేసిన తొలి రోజునే ఆమెకు మాకు సంబంధం లేదు అంటూ చెప్పిన సజ్జల ఇప్పుడు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నించారు. మా వరకు అయితే మీరు చెప్పినట్టే సంబంధం లేదనే అనుకుంటున్నాం.. ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే మళ్ళీ సంబంధం కలుపుకోవాలని ఆశపడుతున్నారా? అంటూ కడిగి పారేశారు. అంతేకాదు, తన గురించి మాట్లాడడం కాదు.. ఏపీ పరిస్థితులపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల సజ్జల స్పందించాలని హితవు పలికారు. ఓవైపు సీఎం కేసీఆర్ బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్రా, డబుల్ రోడ్ అయితే తెలంగాణ.. చీకటి అయితే ఆంధ్రా, వెలుగు అయితే తెలంగాణ అంటున్నారే.. దీనికి సజ్జల ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ముందు కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని షర్మిల ఊహించని స్థాయిలో రియాక్ట్ అయ్యారు. అంతే కాదు, ఈ సమాధానం సజ్జలకేనా లేక ఏపీ ముఖ్యమంత్రికి కూడానా అన్న ప్రశ్నకు షర్మిల.. సజ్జలైనా, జగన్  అయినా.. ఎవ్వరికైనా ఇదే రిప్లై అనడం కొసమెరుపు. మరి దీనికి ఏపీ వైసీపీ నేతలు, మంత్రులు, సకల శాఖల మంత్రి సజ్జల, సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం ఇస్తారా? లేక ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా మాకేం తెలియదు.. మమ్మల్ని కాదన్నట్లే ఉంటారా అన్నది చూడాల్సి ఉంది.

ఫైబర్‌ నెట్‌ కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్‌ కోరుతూ సీఐడీ పిటిషన్‌

 ఫైబర్‌నెట్‌ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ వేసింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌ కోసం ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. టెరాసాఫ్ట్‌కు చెందిన 7 ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రతిపాదన చేసిన సీఐడీ అనుమతివ్వాలని కోర్టును కోరింది.   ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నమోదైన ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసులో సోమవారం (నవంబర్ 6) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఆస్తులను అటాచ్‌ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ ఏపీ సీఐడీ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. సీఐడీ ఇప్పటికే ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది.  తాజాగా సీఐడీ  ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్‌లోనూ ఫైబర్ నెట్ కుంభకోణం నిందితులకు సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేసేందుకు అనుమతించాలని కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్‌ కంపెనీతో పాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్‌ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. చంద్రబాబు  ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యాయని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ,  ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌ పేర్లు ఉండగా చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది.

విన్నూత్న రీతిలో నిరసన... గాడిదపై వచ్చి నామినేషన్ దాఖలు 

పురాణాలలో “వసుదేవుడు అంతవాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అంటారు కదా ” అందులో ఉన్న అర్ధం, పరమార్థం  ఏమిటి అనే విషయాలు పక్కన పెడితే కలియుగంలో  మాత్రం ఓ నిరుద్యోగి మాత్రం అదే గాడిదను ఆశ్రయించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పాలనను ఎండగడుతూ విన్నూత్న నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వంత నియోజకవర్గంలోనే ఈ తంతు జరిగింది.  ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. దాదాపు 30 లక్షలు నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారు. పోటీ పరీక్షలను కెసీఆర్ ప్రభుత్వం నిర్వహించకపోవడం, పలుమార్లు రద్దు చేయడం నిరుద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఈ నేపథ్యంలో  ఒక నిరుద్యోగి వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గాడిదతో వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించాడు. నామినేషన్ కేంద్రం వద్ద గాడిదను అడ్డుకున్న పోలీసులు నిరుద్యోగిని మాత్రం నామినేషన్ కేంద్రంలోకి అనుమతించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి భాస్కర్ అనే నిరుద్యోగి స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం (నవంబర్ 6)నామినేషన్ దాఖలు చేశారు. బీర్కూరు మండలానికి చెందిన భాస్కర్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తనకు ఉద్యోగం రాకపోవడంతో నామినేషన్ కేంద్రానికి గాడిదను ఆటోలో తీసుకువచ్చి నామినేషన్ కేంద్రానికి దానిపైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడంతోనే తాను ఈ విధంగా నిరసన తెలపాలని గాడిదపై నామినేషన్ వేయడానికి వచ్చానని భాస్కర్ అన్నారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సు వాడ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గాడిదతో వచ్చి నామినేషన్ దాఖలకు ప్రయత్నించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కెసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ సోమవారం (నవంబర్ 6) దేవరకద్రకు బయలుదేరారు. హెలికాఫ్టర్ బయలుదేరిన కాసేపటికి సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. వెంటనే హెలికాఫ్టర్ ను ఎర్రవల్లికి మళ్లించారు.  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ కూడా వరుసగా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ప్రజా ఆశీర్వాద సభలు రోజు రెండు, మూడు నిర్వహిస్తున్నారు. దాంతో.. హెలికాప్టర్‌ ద్వారా సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనల్లో బిజీ అవుతున్నారు. అయితే.. తాజాగా సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాల నియోజకవర్గాల్లోని ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ఇవాళ పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్‌లో బయల్దేరారు సీఎం కేసీఆర్. చాపర్‌ టేకాఫ్‌ అయిన కాసేపటికే పైలట్‌ సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. వెంటనే అప్రమత్తం అయ్యి.. హెలికాపప్టర్ ను  సురక్షితంగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లోని హెలిప్యాడ్ పై క్షేమంగా దించారు. సీఎం కేసీఆర్ ప్రయాణానికి మరో హెలికాఫ్టర్ ను సిద్ధం చేస్తున్నట్లు ఏవియేషన్ అధికారులు ప్రకటించారు.

అసమ్మతికి సంకేతం బండి వ్యాఖ్యలు

కరీంనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నేడు(నవంబర్ 6) కరీంనగర్ మహాశక్తి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తన నివాసానికి వచ్చి అక్కడ తన మాతృమూర్తికి పాదాభివందనం చేశారు.  కరీంనగర్ నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ పై బిజెపి బండి సంజయ్ ని మరోసారి బరిలోకి దింపింది. దీంతో సంజయ్ నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే గంగుల కమలాకర్ పై ఓటమిపాలైన సంజయ్ వెనక్కి తగ్గలేదు. అదిష్టానాన్ని ఒప్పించి లోక్ సభ టికెట్ దక్కించుకున్నాడు. ఎంతో కష్టపడి ఏ మాత్రం ఆశలులేని చోట బిజెపిని గెలిపించి సత్తాచాటాడు. ఇలా ఎంపీగా గెలిచి బిజెపి కేంద్ర నాయకత్వం దృష్టిలో పడ్డారు సంజయ్. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారిపోయి బిజెపిలో సంజయ్ కీలక నాయకుడిగా మారిపోయాడు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సంజయ్ తెలంగాణ బిజెపిలో మంచి ఊపు తీసుకువచ్చారు. ఇటీవలే సంజయ్ ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినా కేంద్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది బిజెపి.   ఇదే సమయంలో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన  అనంతరం ఆయన మాట్లాడుతూ... తనకు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత తెలంగాణలో బీజేపీను పరుగులు పెట్టించానన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. పార్టీ బలోపేతం కోసం తెలంగాణవ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించినట్లు చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని, వీటికి వ్యతిరేకంగా పోరాడితే తనపై 30 అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తనపై మతతత్వ ముద్ర వేసే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. ధర్మం కోసం పోరాడేది కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, తాను ధర్మం కోసమే పోరాడుతున్నామన్నారు. తామిద్దరు ఎప్పుడూ కాషాయజెండాను వదిలి పెట్టలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు పది ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు.

జగనైనా.. సజ్జలైనా ఒకటే.. కుండబద్దలు కొట్టేసిన షర్మిల.. ఏపీ ఎంట్రీ ఖాయమేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోంచి తప్పుకుని షర్మిల కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటించడంతో వైసీపీలో గాభరా మొదలైంది. మరీ ముఖ్యంగా షర్మిల తెలంగాణ ఎన్నికల బరినుంచి తప్పుకుని కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ఇవ్వడమంటే.. రానున్న ఏపీ  అసెంబ్లీ ఎన్నికలలో ఆమె కాంగ్రెస్ తరఫున క్రియా శీలంగా వ్యవహరించడం ఖాయమన్న భావన  సర్వత్రా వ్యక్తం అవుతున్నది. అదే భావన  వైసీపీ అగ్రనేతలు, మరీ ముఖ్యంగా జగన్ లో గాభరాకు కారణమైందన్నది పరిశీలకుల విశ్లేషణ. అదే జరిగితే.. ఇప్పటికే ఉన్న ప్రజా వ్యతిరేకతకు తోడు.. ఇంత కాలం తమ పార్టీకి  తోడుగా ఉన్నారని జగన్ భావిస్తున్న వైసీపీ అభిమానులు కూడా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిపోతారన్నదే జగన భయంగా చెబుతున్నారు. అదే  జరిగితే ఏపీలో వైసీపీ ఖాయమైపోయినట్లేనని కూడా అంటున్నారు. పార్టీలో కీలక  స్థానాలలో ఉండి.. జనగ్ తీరుతో తీవ్ర  అసంతృప్తికి గురౌతున్న సీనియర్లు సైతం కాంగ్రెస్ బాట పడతారన్నదే జగన్ భయంగా  వారు చెబుతున్నారు.  ఈ కారణంగానే.. ఇంత కాలం  షర్మిలను పట్టించుకోని, అమెను కేసీఆర్ సర్కార్ అరెస్టు చేసి.. ఆమె కారులో ఉండగానే  పోలీసు స్టేషన్ కు తరలించినా పన్నెత్తు మాట మాట్లాడని జగన్.. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ కు మద్దతు  అనగానే తన ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జలను మీడియా ముందుకు పంపించేశారు.  కాంగ్రెస్ పార్టీ జగన్ ను కేసులతో, అరెస్టుతో వేధించిందనీ, అటువంటి పార్టీకి  షర్మిల ఎలా మద్దతు ఇస్తారని  ప్రశ్నిస్తూ షర్మిలపై విమర్శలు గుప్పించారు. వైసీపీతో  కానీ, ఏపీతో కానీ  సంబంధం  లేకుండా  సొంత పార్టీ పెట్టుకుని తెలంగాణలో ఉంటే.. ఆమె కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం సరికాదంటూ  వ్యాఖ్యానించడం ఎంత  వరకూ సబబని వైసీపీ శ్రేణులే అంటున్నారు.   గత ఎన్నికల సమయంలో  జగనన్న వదిలిన బాణాన్ని అంటూ అన సోదరుడి విజయం కోసం తన శక్తికి మించి కృషి చేసిన షర్మిలను జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కూరలో కరివేపాకులా తీసి పారేసినా... మారుమాట్లాడకుండా ఏపీ వదిలి తెలంగాణ వెళ్లిన షర్మిల ఇప్పుడు రాజకీయంగా తన సొంత నిర్ణయం తీసుకుంటే కాదనడానికి జగన్ ఎవరు? ఆయన తరఫున పెదరాయుడిలా తీర్పులు చెప్పడానికి సజ్జల ఎవరని షర్మిల సూటిగానే ప్రశ్నించారు.  మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను ఒక  రాజకీయ సంకల్పంతోనే తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని తేల్చి చెప్పారు. అయినా తన నిర్ణయాన్ని  ప్రశ్నించడానికి సజ్జల ఎవరని నిలదీశారు.  ఏపీపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు  స్పందించే  ధైర్యం లేని సజ్జల తన రాజకీయాల గురించి ఎలా మాట్లాడతారని విమర్శించారు. తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతుంటే ఏపీలో అంధకారం  తాండవిస్తోందనీ, తెలంగాణలో రోడ్లు అద్దంలా మెరుస్తుంటే.. ఏపీలో రోడ్లు గుంతలతో అధ్వానంగా ఉన్నాయనీ తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ బహిరంగ సభలో చెబితే.. మీరేం చేస్తున్నారని నిలదీసి.. ముందు మీ రాష్ట్రం విషయం చూసుకోండని హితవు పలికారు. ఆ సందర్భంగానే ఒక విలేకరి ప్రశ్నకు బదులుగా జగన్ అయినా సజ్జల అయినా తనది ఇదే మాట అని కుండబద్దలు కొట్టేశారు.షర్మిల ఘాటుగా ఇచ్చిన ఈ రిటార్డుతోనే ఆమె తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీలో వైసీపీకి పక్కలో బల్లెంగా మారబోతున్నారని స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సరే అదలా ఉంచితే.. గతంలో ఏపీలో జగన్ ను అధికారంలోకి తీసుకురావడానికి కాలికి  బలపం కట్టుకుని తిరిగిన షర్మిల.. ఆ తరువాత ఏపీ  రాజకీయాలకు దూరం అయ్యారు. దూరం అయ్యారనే కంటే తాను ఎంతో కష్టపడి అన్న జగన్ ఏపీలో అధికారంలోకి రావడానికి దోహదపడితే..అధికార అందలం అందుకున్న తరువాత జగన్ షర్మిలను కూరలో కరివేపాకులా తీసి పారేసి ఏపీకి దూరం చేశారని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. స్వయంగా  షర్మిల కూడా పలు సందర్భాలలో అదే భావన వ్యక్తం చేశారు. సరే 2019 ఎన్నికలకు ముందు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీ వ్యాప్తంగా తిరిగిన షర్మిల.. ఆ ఎన్నికల ఫలితాల తరువాత.. జగనన్న వదిలేసిన బాణంలా మిగిలిపోయారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటిస్తూ పోటీ నుంచి తప్పుకోవడమంటే.. కొద్ది కాలం ముందు  ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ ఆమెకు ఇచ్చిన ఆఫర్ ను  ఆమె ఇప్పుడు దాదాపు  అంగీకరించేసిందనే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదే జరిగితే దాని వల్ల షర్మిలకు ఒనగూరే ప్రయోజనంపక్జకన పెడితే  గన్ కు మాత్రం తేరుకోలేని, పూడ్చుకోలేని నష్టం వాటిల్లడం ఖాయమనీ పరిశీలకులు అంటున్నారు.  

సైడైపోయిన కార్యకర్తలు.. నీరుగారిన వైసీపీ సామజిక సాధికారిక యాత్ర!

గత ఎన్నికలలో వైసీపీ ఎంతటి ఘన విజయం దక్కించుకుందో.. ఈసారి ఎన్నికలలో అంతటి ఘోర పరాజయం తప్పదని సర్వేల ఫలితాలు లెక్కలేసి చెప్తున్నాయి. అదే సమయంలో వైసీపీ నేతలకు ఓటమి భయం కునుకు లేకుండా చేస్తున్నది. తెలుగుదేశం అధినేత చంద్రబాబును జగన్ సర్కార్  అక్రమంగా అరెస్ట్ చేయడంతో ఇక జనం ఎలాంటి మొహమాటాలూ లేకుండా తమ నిర్ణయం ఏమిటో వెల్లడించేస్తున్నారు. తాము ఎవరి వైపు  ఉన్నామన్నది చెప్పడానికి వెనుకాడటం లేదు. దీంతో వైసీపీ స్థాయిలోపూర్తిగా  డిఫెన్స్ లో పడిపోయింది. వైసీపీ అధిష్టానికి కూడా   విషయం ఇప్పటికే బోధ పడగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంను నమ్ముకొని ప్రజలలో నమ్మకం కలిగించేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నది. లోలోపల ఓటమి ఖరారైన భయం వెంటాడుతున్నా.. పైకి మాత్రం మన బటన్ నొక్కుడే మనల్ని కాపాడుతుందని నేతలను, క్యాడర్ ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి మనం ఏం చేశామో అర్ధమయ్యేలా చెప్పండని ఆదేశిస్తున్నారు. ప్రభుత్వంతో పనిలేకుండా స్థానికంగా పనితీరు కలిగిన నేతలేమో ప్రజల వద్దకు వెళ్తుంటే.. సీఎంను నమ్ముకున్న నేతలకు ప్రజలలోకి వెళ్లేందుకు ధైర్యం సరిపోవడం లేదు. వైసీపీ ఇప్పటికే గడపగడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ ఇంటింటికి వెళ్లారు.  మా నమ్మకం నువ్వే అంటూ స్టిక్కర్లు అంటించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమం కాస్తా ప్రజల ఆగ్రహాం తిరుగుబాటుతో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని  మమ అనిపించేశారు. అయినా వైసీపీ పెద్దలు సామజిక సాధికార యాత్ర పేరిట ఇప్పుడు మరోసారి వారందరినీ బస్సెక్కించి ప్రజల మధ్యకు పంపారు.  ఈ యాత్రలో మంత్రి నుంచి వార్డు మెంబర్ దాకా.. పార్టీల అధ్యక్షుల నుండి వార్డు వాలంటీర్ దాకా అందరూ పాల్గొనాలని జగన్ ఆదేశించినా.. చాలా చోట్ల ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఈ యాత్రకు మొహం చాటేస్తున్నారట. అక్టోబర్ 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైసీపీ సామాజిక బస్సు యాత్ర ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాలలో  ఒకేసారి యాత్రను ప్రారంభించారు. మూడు చోట్ల కూడా ఈ యాత్రకు ప్రజల నుంచి ఆదరణ లభించడం లేదు.  వైసీపీ బస్సు యాత్ర పట్ల ప్రజలలో కనీస స్థాయిలో కూడా స్పందన లేకపోవడంతో పార్టీ నేతలు కూడా ఈ యాత్రకు  దూరం జరుగుతున్నారు.  పైగా ఈ యాత్ర సాక్షిగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో పాటు, వైసీపీ సర్కార్ లోపాలు వెలుగులోకి వస్తున్నాయి.  దీంతో ఈ యాత్ర ద్వారా లాభం కంటే నష్టమే అధికమని వైసీపీ నేతలే అంటున్నారు.  వైసీపీ పాలనను, ప్రభుత్వ వైఖరిని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాల వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. స్పష్టంగా చెప్పాలంటే అధికార పక్షానికి సానుకూలతకు మించి   వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఈ యాత్ర ద్వారా ఆ వ్యతిరేకత మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  గత ఎన్నికల సమయంలో పనిగట్టుకొని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై వైసీపీ చేసిన దుష్ప్రచారం, కేంద్ర నుంచి సహాయ నిరాకరణ, జనసేన వేరుగా పోటీకి దిగడం, జగన్ పాదయాత్రలో ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇస్తూ ఒక్క ఛాన్స్ కోరడం.. కోడి కత్తి దాడి, వివేకా హత్య వంటి ఎన్నో కారణాలు కలిసి భారీ విజయం తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అవే కారణాలు ఏపీ ప్రజలలో  జగన్ పట్ల, ఆయన పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ఆగ్రహానికి కారణమౌతున్నాయి. విపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీలు పది శాతం కూడా నెరవేరకపోవడం, రాజధానికి మరణ శాసనం రాయడం, పడకేసిన అభివృద్ధి, హద్దులు దాటిన నిరుద్యోగం వంటి ఎన్నో కారణాలు వైసీపీపై తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. అలాగే కోడి కత్తి కేసులో బాధితుడు బయటకు రాకుండా ఉండేందుకు బాధితుడిగా జగన్ కనీసం కోర్టుకు వెళ్లి వాంగ్మూలం ఇవ్వకపోవడం, అసలా దాడిపైనే అనుమానాలు వ్యక్తం కావడం, అలాగే నాటి ఎన్నికలలో జగన్ పట్ల సానుభూతికి కారణమైన వివేకా హత్య కేసులో జగన్ సన్నిహితులే నిందితులని దర్యాప్తులో తేలుతుండటంతో  నాడు జగన్ విజయానికి దోహదపడిన ఈ కారణాలే  రానున్న ఎన్నికలలో జగన్ కు ప్రతికూలంగా మారనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పాలనా వైఫల్యాలు సరే సరి. దీంతో  ప్రజలకు వద్దకు వెడుతున్న  వైసీపీ నేతలకు నిరసనలు ఎదురౌతున్నాయి.  అందుకే ఇప్పుడు ఈ సామజిక బస్సు యాత్రకు నేతలే మొహం చాటేస్తున్నారు. కార్యకర్తలూ సైడైపోతున్నారు. ఎవరికీ పట్టని యాత్రలా వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సాగుతోంది. 

విజయవాడలో  ప్లాట్‌ఫామ్‌పైకి  దూసుకెళ్లిన ఎపిఎస్ ఆర్టీసీ బస్సు... ముగ్గురి దుర్మరణం

ఎపి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఇంట్లో నుంచి బస్టాండ్ కి  వచ్చి ప్లాట్ ఫాం మీద నిల్చుని తమ గమ్య స్థానం కోసం ఎదురు చూసిన పాపానికి ముగ్గురిని పొట్టన బెట్టుకుంది. ప్రయాణికుల గత గమ్యస్థానం తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లే కార్యక్రమం నిర్విగ్నంగా కొనసాగిస్తుంది జగన్ ప్రభుత్వం. సామాన్య ప్రజానికానికి భధ్రత కొరవడటంతో కనీసం రోడ్లపై రావడానికే జంకే పరిస్థితి తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం.  విజయవాడ బస్టాండ్‌లో సోమవారం ఉదయం (నవంబర్ 6) దారుణం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఓ సూపర్ లగ్జరీ బస్సు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. విజయవాడ బస్టాండ్‌లోని ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ 12 దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు.. ఉన్నట్టుండి ఫ్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో బస్సు చక్రాల కింద పలువురు ప్రయాణికులు పడ్డారు. ప్రయాణికులను రక్షించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో చిన్నారి, కండక్టర్ తోపాటు మరోకరు మరణించారు. మృతులు కండక్టర్ వీరయ్య, కుమారి, చిన్నారి అయాన్స్ గా గుర్తించారు.    ఎపి ప్రభుత్వానికి ఇది కొత్తేం కాదు . బాపట్ల జిల్లా కూచిపూడి-పెదపూడి మధ్య ఈ సంవత్సరం ఆగస్టు 15న దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు జరుపుకుంటున్న వేళ బస్సు ప్రమాదం జరిగింది. పంద్రాగస్టు వేడుకలు జరుపుకోవడానికి స్కూలుకు  వెళ్లిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు.  పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. . అమృతలూరు మండలం కూచిపూడిలోని స్కూల్ లో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో విద్యార్థులు పాల్గొన్నారు. వేడుకలు ముగిసిన తర్వాత ఇంటికి బస్సులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది విద్యార్థులున్నారు. 2021 డిసెంబర్ 16 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో  బస్సు ప్రమాదానికి గురైంది. జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరు వాగులో బస్సు బోల్తా పడి 10మంది మరణించిన సంగతి తెలిసిందే.  ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్దకు రాగానే.. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు అంటుకున్నాయి. గాలి వేగంతో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. తెల్లవారుజామున కావడంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు అందరు నిద్ర మత్తులో ఉన్నారు.  మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ప్రయాణీకుల లగేజీ పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఎనిమిది మంది ప్రయాణికులు, ముగ్గురు బస్సు సిబ్బంది ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకపోవడంతో ఎపిలో యాంటీ ఇన్ క్యుంబెన్సీ పెరిగిపోతుంది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. 

ఇక తెలుగుదేశం, జనసేన ఉమ్మడి కార్యాచరణ.. వైసీపీకి దబిడిదిబిడే!

తెలుగుదేశం, జనసేన కూటమి ఇక ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని నిర్ణయించింది.  జనసేనాని పవన్ కల్యాణ్.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్ తో చంద్రబాబు ఇరు పార్టీల నేతల మధ్య సమన్వయంపై చర్చించినట్లు తెలుస్తోంది.  ఆంధ్రప్రదేశ్ లో  తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నేతలపై పోలీసు కేసులను ఎదుర్కొనే వ్యూహంపై ఇరువురి మధ్యా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అరెస్టుల ముసుగులో వైసీపీ నేతలు తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తల ఓట్లు తొలగించే వ్యూహం రచించారని, దానిని గుర్తించి ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు చేస్తున్న ఫిర్యాదులపై ఇరువురూ చర్చించారు. దీనికి సంబంధించి లీగల్ సెల్‌తో సమావేశం నిర్వహించాలన్న నిర్ణయానికి ఇరువురు నేతలూ వచ్చినట్లు తెలిసింది. తమ  పార్టీల  కార్యకర్తలు, నాయకులపై అక్రమంగా కేసుల నమోదులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసు అధికారులు, పోలీసులపై న్యాయనిపుణులతో  చర్చించి ప్రైవేటు కేసులు వేయాలని ఇరువురు నేతలూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు  విశ్వసనీయంగా  తెలిసింది. అలా చేయడం ద్వారా  తమ  పార్టీల క్యాడర్ లో మనోస్థైర్యం నింపాలని ఇరువురు నేతలూ  ఒక నిర్ణయానికి వచ్చినట్లు  తెలుగుదేశం, జనసేన వర్గాలు  చెబుతున్నాయి.  ఇప్పటికే  క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం ఉందనీ, దానిని మరింత పటిష్టం  చేసేందుకు అవసరమైన విధంగా  ముందుకు సాగాలన్న దిశగా చర్చ జరిగిందని చెబుతున్నారు. ఉమ్మడి  ఉభయ గోదావరి  జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలలో పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలలో, ఇతర చోట్ల తెలుగుదేశం, జనసేన శ్రేణుల మధ్య మరింత  సమన్వయం  పెరగాల్సిన  అవసరం ఉందని గుర్తించినట్లు చెబుతున్నారు.  అలాగే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా  జిల్లాలపై మరింత  దృష్టి సారించాల్సిన  అవసరాన్ని ఇరువురు నేతలూ గుర్తించి , ఆ దిశగా ఇరు పార్టీల నేతలనూ సమాయత్తం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆ రెండు జిల్లాలలోనూ నియోజకవర్గాల  వారీగా  ఉమా ఉమ్మడి సమావేశాలు, నియోజకవర్గాల వారీగా నిర్వహించాలన్న అంశంపై చర్చించారు. అలాగే ఉమ్మ డి మేనిఫెస్టోతో పాటు.. ఇరు పార్టీల  నేతల ఉమ్మడి ప్రెస్ మీట్లు, ఉమ్మడి  సభలు నిర్వహించే దిశగా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా  ఈ నెలలోనూ తెలుగుదేశం జాతీయ  ప్రధాన  కార్యదర్శి లోకేష్, జనసేనాని  పవన్ కల్యాణ్ లు ఇరువురూ కలిసి  పాల్గొనేలా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే అధికార పార్టీ నేతల విమర్శలకు దీటుగా బదులిచ్చే విషయంలో ఇరు పార్టీల నేతలూ ఏ మాత్రం వెనుకాడకుండా, కలిసి ఎదురుదాడి చేసే విధంగా ఉమ్మడి వ్యూహం రచించేందుకు నిర్ణయం తీసుకున్నారు.  ఇక ఇప్పుడు తెలుగుదేశం, జనసేనల ఉమ్మడి కార్యాచరణతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి  కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తెలుగుదేశంపై మారిన కేటీఆర్ స్వరం.. పూర్తిగా యూటర్న్!

తెలంగాణ ఎన్నికలలో  తెలుగుదేశం పోటీ చేసినా.. పోటీ చేయకపోయినా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తావన లేకుండా ఎన్నికలు మాత్రం పూర్తి కావు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు తెలుగుదేశంకు వ్యతిరేకంగానో, చంద్రబాబుకు అనుకూలంగానో  వ్యాఖ్యలో, ప్రస్తావనో లేకుండా ఎన్నికలు  పూర్తి  కావు. రాష్ట్ర విభజన తరువాత నుంచీ జరిగిన  ప్రతి ఎన్నికలోనూ రావడం మాత్రం ఖాయం. సీఎం కేసీఆర్ ఆంధ్రా పార్టీలన్నిటినీ కలిపి విమర్శిస్తే ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ మాత్రం పదేపదే చంద్రబాబు పాలనను గుర్తు చేయడం, హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబుకు క్రెడిట్ ఇవ్వడం చేస్తూ ఆంధ్రా సెటిలర్ల ఓటర్లను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తుంటారు. కేసీఆర్ అండ్ కో రాజకీయంగా  తెలుగుదేశం పార్టీని ప్రత్యర్థి పార్టీగానే..ఎప్పటికైనా రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయం కాగల పార్టీగానే చూస్తారనీ, చూస్తున్నారనీ  పరిశీలకుల విశ్లేషణ.   అందుకే  2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పరోక్షంగా వైసీపీ విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ పనిచేసిందన్నది బహిరంగ రహస్యమే. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి నేతలైతే ఏపీలో వైసీపీ సభలకు కూడా హాజరయ్యారు. చంద్రబాబును ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ గత ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) ముఖ్యనేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేయగా.. అదే సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చెట్టాపట్టాలేసుకుని రాజకీయాలు నడిపించారు. అయితే అదంతా గతం. కేసీఆర్  టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మార్చిన అనంతరం ఏపీలో వైసీపీతో సంబంధాలను పక్కన పెట్టేశారు. అలాగని తెలుగుదేశం పార్టీకి దగ్గరైంది కూడా లేదు.  పైగా ఏపీలో కూడా బీఆర్ఎస్ బ్రాంచి పెట్టి ఎన్నికలలో కూడా పోటీ చేస్తామని చెప్పారు. అయితే ఈలోగా తెలంగాణలో ఎన్నికల సమయం ముంచుకొచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతానికి ఏపీ రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం లేదు. అయితే  అనూహ్యంగా చంద్రబాబు అరెస్ట్ రూపంలో బీఆర్ఎస్ కు కొత్త  చిక్కులు వచ్చి పడ్డాయి. చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లోని ఆంధ్రా సెటిలర్లు, ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహించారు. అది కాస్తా ఆంధ్రా సెటిలర్లకు కోపం తెప్పించింది. అప్పటికప్పుడు కేటీఆర్  తన వ్యాఖ్యల వల్ల జరిగిన నష్టాన్నిపూడ్చుకునేందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టినా   ఫలితం లేకుండా పోయింది. అసలే గత పదేళ్లుగా తెలుగుదేశంపై బీఆర్ఎస్ వైఖరి, గత ఎన్నికలలో జగన్ తో కలిసి తెలుగుదేశం ఓటమికి కారణమయ్యిందన్న  భావనకు తోడు ఇప్పుడు చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యలు కలిసి ఆంధ్రా సెటిలర్లలో బీఆర్ఎస్ పై నమ్మకం కోల్పోయేలా చేశాయి. కానీ కేటీఆర్ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబుపైనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోయినా..  ఆ మధ్య చంద్రబాబు ఆరోగ్యంపై లోకేష్ ట్వీట్ కు బదిలిస్తూ సానుభూతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్యంపై నారా లోకేష్‌ ట్వీట్ నాకు చాలా బాధ కలిగించింది. ఓ కుమారుడిగా తండ్రి ఆరోగ్యంపై నారా లోకేష్‌ ఆందోళన ఎలా ఉంటుందో నాకు తెలుసు అంటూ తాను అన్న మాటలను కవర్ చేసుకొనే ప్రయత్నం చేశారు. అయితే, తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ టీడీపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు. అప్పుడు ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్ ఇప్పుడు మరోసారి ప్రత్యక్షంగానే స్పందించారు. చంద్రబాబు అరెస్టు మానవీయ కోణంలో సరికాదంటూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా చూసినా 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని, ఈ విషయం తెలిసిన ఎవరైనా అయ్యో పాపం అని అంటారని కేటీఆర్ చెప్పారు. ఇక, చంద్రబాబు భద్రతపై లోకేష్ ఆందోళన వ్యక్తం చేయడం సబబేనని కేటీఆర్ అన్నారు.  అంతటితో ఆగని కేటీఆర్ గతంలో తాము టీడీపీని విమర్శించడం వాస్తవమేనని, 2018లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుందని, ఆ కోణంలోనే తాము అప్పుడు విమర్శలు చేశామని.. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు.. టీడీపీ ఈసారి ఇక్కడ పోటీ చేయడం లేదు కాబట్టి ఆ పార్టీపై విమర్శలకు తావేలేదని చెప్పారు. ఒకవైపు చంద్రబాబు అరెస్టు, ఆరోగ్యంపై సానుభూతి వ్యక్తం చేస్తూనే టీడీపీ తమకు ప్రత్యర్థి కాదని కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీ వైఖరిపై ఒక్కో మెట్టుగా ఇప్పటికి కేటీఆర్ స్వరం పూర్తిగా మారింది. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సెటిలర్లపై దృష్టిపెట్టి వాళ్ళను దగ్గర చేసుకొనే ప్రయత్నం చేసింది. సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వాళ్ళు కోరిన వారికే టికెట్లను కేటాయిస్తుండడమే కాకుండా నియోజకవర్గాల వారీగా వాళ్ళ కోసం ప్రత్యేకంగా సమ్మేళనాలను ఏర్పాటు చేసి అక్కున చేర్చుకుంది. ఇక ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు ఎంతవరకు వాళ్ళను ప్రభావితం చేస్తాయన్నది చూడాలి.

కాంగ్రెస్ గూటికి వైఎస్ ఫ్యామిలీ!

అధికారం అనేది మనిషిని ఎంతగా మార్చేస్తుందో కొంత మంది నేతలు పెర్ఫెక్ట్ ఉదాహరణగా కనిపిస్తారు. రాజకీయ నేతలందరూ అలానే ఉంటారని చెప్పలేం కానీ.. కొందరిలో మాత్రం అధికారానికి ముందు అధికారానికి తర్వాత అనే మార్పు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఆ కోవకి చెందిన నేతగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్వతహాగానే మొండి వైఖరి గల జగన్ మోహన్ రెడ్డి కాలేజీ రోజుల నుండే  ఆ వైఖరితో  చాలా చిక్కులు తెచ్చుకున్నారు. తెచ్చిపెట్టారు. అయితే తండ్రి రాజశేఖర రెడ్డి రాజకీయాలలో ఉండడంతో  వాటన్నిటినీ సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అదే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ అక్రమార్జనకు ఒడిగట్టారు. ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. మొండి వైఖరి, అక్రమార్జన ఇవన్నీ వ్యాపారాలలో ఎలా ఉన్నా రాజకీయాలలో జగన్ వైఖరి ఎలా ఉంటుందన్నది అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలియదు.  వైఎస్ హయంలోనే కడప ఎంపీ సీటు విషయంలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి మీద చేయి చేసుకున్నారనే ప్రచారం ఉంది. కాగా తండ్రి మరణానంతరం పూర్తిగా తన సొంత రాజకీయ సామ్రాజ్యాన్ని నెలకొల్పే క్రమంలో అసలు సిసలైన జగన్ మోహన్ రెడ్డి అంటే ఏంటో మెల్ల మెల్లగా ప్రపంచానికి తెలిసింది. బాబాయ్ వివేకా హత్యకేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని  సీబీఐ తేల్చగా.. హత్యచేసిన వారిని జగన్ కాపాడటం కోసం జగన్ ప్రయత్నించడంతో జగన్ నిజస్వరూపం ఏంటో బాహ్య ప్రపంచానికి స్పష్టంగా తెలిసింది. ఈ క్రమంలోనే సొంత కుటుంబం ఆయనకు దూరమయ్యింది. ఎన్నికలకు ముందు జగన్ జైలు పాలైతే  జగన్ కు అండగా నిలవడం బాధ్యతగా భావించిన ఆయన సోదరి షర్మిల ఊరూరా ప్రచారం చేశారు. అప్పటి వరకూ రాజకీయాలు పరిచయం లేని షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్ని అంటూ తన స్థాయికి మించి కష్టపడ్డారు. తల్లి విజయమ్మ కూడా అంతే. భర్త మరణానంతరం అన్నీ కుమారుడే అనుకున్న ఆ తల్లి.. జగన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడ్డారు. అందుకోసం ప్రత్యక్ష రాజకీయాలలోకి కూడా వచ్చి తండ్రి అనుచరులని కుమారుడికి దగ్గర చేశారు. ఆమె కూడా ఎన్నికలలో పోటీ చేశారు. కానీ, అధికారం దక్కిన అనంతరం జగన్ మోహన్ రెడ్డికి ఒక్కొక్కరు దూరమయ్యారు. తన  విజయం కోసం  కోసం కష్టపడిన సోదరి, తన భర్త స్థానంలో వారసుడిగా కుమారుడిని చూసి మురిసిపోవాలనుకున్న తల్లిని జగన్ దూరం చేసుకున్నారు. ఆస్తి తగాదాలు, రాజకీయ వివాదాలు.. కారణం ఏమైనా కావచ్చు జగన్ ఇప్పుడు ఒంటరి.  సొంత కుంటుంబంతో పాటు బాబాయ్ వివేకా కుటుంబం ఎందుకు దూరమయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఒక్కరే. మిగతా వైఎస్ కుటుంబం అంతా ఆయనకు దూరంగానే ఉంటున్నారు. రాజశేఖర రెడ్డి సొంత సోదరుల కుటుంబం, రాజశేఖరరెడ్డి భార్య, కుమార్తె, అల్లుడు ఇలా అందరూ కలిసే ఉంటే జగన్ ఒక్కరే ఏకాకిగా మారారు. సొంత కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకొని రాకపోకలు లేకుండా తానో మోనార్క్ అని తనకు తానే భావించుకుంటూ ఏకాకి అయిపోయారు.   అయితే, ఇప్పుడు వైఎస్ కుటుంబం కాంగ్రెస్ గూటికి చేరువవుతున్నది. షర్మిల ఇప్పటికే తెలంగాణలో పోటీ నుండి తప్పుకొని కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటించారు. ఇక  ఏపీ ఎన్నికల నాటికి ఏపీపీసీసీలో షర్మిల కీలకం కానున్నట్లు రాజకీయ వర్గాలు బలంగా భావిస్తున్నాయి. పరిశీలకులు కూడా అదే అంటున్నారు. జగన్, కాంగ్రెస్ మధ్య వైరం తెలిసిందే.  వైఎస్ మరణం తర్వాత సోనియా గాంధీపై వైసీపీ నేతలు దారుణ వ్యాఖ్యలు చేశారు.   ఇంకా మాట్లాడితే  రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక సోనియా హస్తం ఉందని కూడా ఒకానొక సందర్భంలో ఆరోపణలు చేశారు. అలాంటి కాంగ్రెస్ గూటికే ఇప్పుడు వైఎస్ కుటుంబం మళ్ళీ చేరువవుతున్నది.  వైఎస్ఆర్ మరణించే వరకూ అసలు సిసలైన కాంగ్రెస్ నాయకుడు కనుక ఆయన కుటుంబానికి  ఆ పార్టీకి దగ్గరయ్యే నైతిక హక్కు  ఉంటుంది.  కానీ, జగన్ మోహన్ రెడ్డికే ఇప్పుడు అసలైన పరీక్ష  ఎదురుకానుంది. వైఎస్ కుటుంబం కాంగ్రెస్ లో చేరి కీలకమైతే జగన్ కూడా సొంత కుటుంబానికే ప్రత్యర్థి కానున్నారు.  దీంతో జగన్ కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగలక తప్పదని అంటున్నారు. 

లోకేష్ , పవన్ ఉమ్మడి యాక్షన్.. ఈ దూకుడు ఆపేదెవరు?!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు ముందు ఆ పార్టీ దూకుడు అంతా ఇంతా కాదు. అధికార వైసీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తగ్గించేలా దూకుడు ప్రదర్శించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహీతో విడతల విడతలుగా వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ప్రతిపక్షాల దాడితో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అయ్యింది. అలాంటి సమయంలో చంద్రబాబు అరెస్టు ప్రతిపక్షాలను షాక్ కి గురిచేసింది. అయితే, జస్ట్ రోజుల వ్యవధిలో తేరుకున్న తెలుగుదేశం అంతకు మించిన కార్యాచరణతో నిరసనలతో హోరెత్తించి తమ అధినేత అరెస్టు కుట్ర పూరితం అనేది బలంగా ప్రజలలోకి తీసుకెళ్లగలిగింది. ఫలితంగా  వైసీపీకి కుదేలైంది. చంద్రబాబు అరెస్టు సాక్షిగా తెలుగుదేశం, జనసేన ఒక్కటయ్యాయి. అధికారికంగా పొత్తు ప్రకటనతో రెండు పార్టీల క్యాడర్ లో జోష్ పెరిగింది. రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసుకొనేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని ఎలా ముందుకెళ్లాలో కూడా నిర్ణయించుకున్నారు. ఈలోగా చంద్రబాబు కూడా బెయిల్ మీద బయటకొచ్చారు. స్కిల్ కేసులో నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది పక్కన పెడితే ఇప్పుడైతే  తెలుగుదేశం,జనసేన  ఉమ్మడిగా జగన్ ప్రభుత్వంపై అటాక్ చేసేందుకు సిద్ధమయ్యాయి. చంద్రబాబు జైల్లో ఉండడంతో అన్నీ తానైన లోకేష్ కేపబిలిటీ ఏంటో కూడా రాజకీయ వర్గాలకు అర్ధమయింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రాపో కూడా పెరిగింది. ఈ తరుణంలోనే ఇప్పుడు పవన్, లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పొత్తు ప్రకటన తర్వాత ఇప్పటి వరకూ రాజ‌కీయ అంశాల‌పై ప‌వ‌న్‌తో చంద్రబాబు నేరుగా సంప్రదించలేకపోయారు. చంద్రబాబు విడుదల సమయంలో పవన్.. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహానికి ఇటలీ వెళ్లారు. అక్కడ నుండి వచ్చిన తర్వాత తాజాగా ఆయన నివాసానికి వెళ్లిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆ పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించారు. అలాగే నారా లోకేష్‌తో గంట‌ల‌కు పైగా ప‌వ‌న్‌, మ‌నోహ‌ర్‌లు సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ క్రమంలోనే తదుపరి కార్యాచరణను అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ముందుగా ఇరు పార్టీల్లో ఉన్న అసంతృప్తుల‌ను త‌గ్గించి, పార్టీల‌ను క‌లిసి పోరాడేలా, ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న అంశాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టి ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించినట్లు తెలుస్తుంది. రానున్న మూడు వారాలలో ఇరు పార్టీలలో సమస్యలను పరిష్కరించుకొని అసలు సిసలైన యుద్ధం మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు ఇరు పార్టీల వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఉమ్మ‌డి మేనిఫెస్టో రూప‌క‌ల్ప‌న‌, బ‌హిరంగ స‌భ‌లు, ప్ర‌జ‌ల‌తో నేతల ముఖాముఖీ వంటి అంశాల‌పై ఇరు పార్టీలు సంయుక్తంగా ముందుకు సాగేలా కార్యాచ‌ర‌ణ‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. అలాగే నవంబర్ నెలాఖరున లేదా డిసెంబర్ మొదటి వారంలో ప‌వ‌న్‌, నారా లోకేష్‌లు సంయుక్తంగా స‌భ‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ సభ అనంతరం సాధ్యమైనంత త్వరగా ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారని చెబుతున్నారు. పవన్, లోకేష్ ల ఉమ్మడి సభ ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అవుతున్నది. పసుపు దళానికి జనసైనికులు తోడవడం.. ప్రతిష్టాత్మక నిర్మాణం ఉన్న టీడీపీకి ఛరిష్మా గల పవన్ కళ్యాణ్ జత కలవడం అంటే రెండు పార్టీలలో జోష్ పెంచే అంశమే  అలాంటిది రెండు పార్టీలు కలిసి బహిరంగ సభ అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఆ సభ ప్రత్యర్థులకు ఏ స్థాయి హెచ్చరికలను జారీ చేయనుందో  మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ సభ ద్వారానే ఎన్నికల శంఖారావం  మోగించాలని తెలుగుదేశం, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఈ సభ ద్వారానే ఇరు పార్టీల నేతలకు, క్యాడర్ కు అధికారం మనదే అనే సంకేతాలు  బలంగా ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కలయికను జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ శ్రేణులు ఈ సభ తర్వాత ఎలా స్పందించనున్నాయన్నది ఆసక్తిగా మారింది. ఈ సభ తర్వాత ఏపీ రాజకీయాలలో బిగ్ టర్న్ ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కమ్మ, రెడ్డిను ఏకం చేసిన క్రెడిట్ కేసీఆర్ దే!

రాజకీయాలలో కులాల మధ్య పెత్తనం కోసం పోరాటం సహజంగానే కనిపిస్తుంది. మన దేశ చరిత్ర చూస్తే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఈ తరహా రాజకీయాలు కనిపిస్తుంటాయి. అయితే, గతంలో ఇది రాజకీయాలకు పరిమితం కాగా.. ఇప్పుడు   తెలుగు రాష్ట్రాలలో కొంతమేర రాజకీయాలను దాటి మనుషులను కూడా వేరు చేసేదిగా మారిపోయింది. ప్రస్తుతానికి ఆ సంగతి పక్కనపెడితే తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు విచిత్ర రాజకీయం కనిపిస్తున్నది. మనం మొదట చెప్పుకున్నట్లుగా రాజకీయాలలో కులాల మధ్య పోరాటం తెలుగు నాట కాస్త గట్టిగానే కనిపిస్తున్నది. ఓ రెండు బలమైన సామజిక వర్గాల మధ్య ఇక్కడ రాజకీయ వైరం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి.. తెలుగు నాట రాజకీయం మొదలైన నాటి నుండే కమ్మ, రెడ్డి సామజిక వర్గాల మధ్య వైరం నడుస్తూ వచ్చేది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామజిక వర్గం దన్నుగా ఉండగా.. మరో బలమైన కమ్మ సామజిక వర్గం నేతలు కమ్యూనిస్టు పార్టీలలో ఉండేవారు.   ఆ తర్వాత నందమూరి తారక రామారావు రాజకీయ అరంగేట్రంతో కమ్మ వర్గం టీడీపీకి తరలి వెళ్ళింది.  అప్పటి నుండి   కాంగ్రెస్ కు రెడ్డి వర్గం, టీడీపీకి కమ్మ వర్గం అండగా ఉండగా ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ రాజకీయాలు నడిచేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే పరిస్థితి ఉండేది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత..  రాజకీయాలలో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీలో కాంగ్రెస్ స్థానాన్ని వైసీపీ ఆక్రమించగా.. రెడ్డి సామజిక వర్గం గంపగుత్తగా  వైసీపీ పంచన చేరింది. కమ్మ సామజిక వర్గం టీడీపీ వైపు అలాగే కొనసాగింది. తెలంగాణలో   టీడీపీ స్థానాన్ని టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) ఆక్రమించగా కాంగ్రెస్ అలాగే కొనసాగుతుంది. అయితే  ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే ఏపీలో రాజకీయ శత్రువులుగా ఉన్న కమ్మ, రెడ్డి సామజిక వర్గాలు తెలంగాణలో ఇప్పుడు ఒక్కటయ్యాయి.  తెలుగు నాట రాజకీయాలలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు ఒకే తాటి పైకి వచ్చిన దాఖలాలు పెద్దగా లేవు. గత ఎన్నికలలో టీడీపీ ఇక్కడ కాంగ్రెస్ తో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నా కమ్మ సామజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ వైపు వెళ్ళలేదు. కానీ, ఇప్పుడు తెలంగాణలో ఈ రెండు సామజిక వర్గాలు ఏక తాటిపైకి రావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. వేర్వేరు రాజకీయ కారణాలతో ఇప్పుడు తెలంగాణలో కమ్మ సామజిక వర్గం, రెడ్డి సామజిక వర్గం కలిసి నడుస్తున్నది. ఆ క్రెడిట్ మొత్తం   కేసీఆర్ దేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇంకా చెప్పాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఈ పరిస్థితికి ఒక కారణంగా చెప్పుకోవాలి. గత ఏపీ ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డికి కేసీఆర్ అండగా నిలవడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ అగ్ర నేతలు స్పందించిన తీరు తదితర అంశాలు కేసీఆర్ పట్ల కమ్మ సామజిక వర్గంలో వ్యతిరేకతకు కారణమైంది. దీంతో ఇప్పటి వరకూ బీఆర్ఎస్ వైపున ఉన్న టీడీపీ సానుభూతి పరులైన కమ్మ సామజిక వర్గం ఇప్పుడు బీఆర్ఎస్ కు దూరమయ్యారు.  అదే సమయంలో చంద్రబాబు అరెస్టు అంశంలో కేంద్రం హస్తం ఉందనే బలమైన ప్రచారంతో కమ్మ సామజిక వర్గం బీజేపీ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది.  అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రధసారధిగా రేవంత్ రెడ్డి కమ్మ సామజిక వర్గాన్ని ఆకట్టుకోగలిగారు. తొలి నుండి రేవంత్ రెడ్డి చంద్రబాబును గురుతుల్యునిగా  భావించడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. గతంలో మల్కాజ్ గిరిలో రేవంత్ ఎంపీగా   విజయం దక్కించుకోవడంలో  కీలక పాత్ర పోషించిన  కమ్మ సామజిక వర్గం ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల రీత్యా రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. అయితే, ఏది ఏమైనా ఈసారి బీఆర్ఎస్ ను గద్దె దింపాలనే ఒకే ఒక లక్ష్యం ఇప్పుడు తెలంగాణలో ఈ రెండు సామజిక వర్గాలను ఏకం చేసింది. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ కాగా.. చంద్రబాబు అరెస్ట్, రేవంత్ రెడ్డి ఈ వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లే శక్తులుగా పనిచేశాయి.  అదే ఈసారి తెలంగాణ ఎన్నికలు   వెరీ స్పెషల్ గా మారడానికి కారణమయ్యాయి.

వైసీపీకి ఫైనల్ డేంజర్ బెల్!

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తాను అవినీతి చేసి జైలు పాలైతే.. తన లాగానే అందరూ అవినీతి మరకతో ఉంటే తనను వేలెత్తి చూపకుండా ఉంటారని భావిస్తున్నారో ఏమో సీఎం జగన్ అసలు లేని అవినీతి కేసులను సృష్టించి మరీ విచ్చలవిడిగా కక్షసాధింపు చర్యలకుకు దిగడం ఎంతటి నష్టం చేకూరుస్తుందో మాత్రం అర్ధం కావడం లేదు.  జగన్ తమకేదో మేలు చేస్తారని బంపర్ మెజార్టీ ఇచ్చి అధికారం కట్టబెట్టిన ప్రజలకు ఆయన ఇలా  ప్రతిపక్షాలను మట్టుబెట్టాలని చూస్తున్నతీరు ఇసుమంతైనా నచ్చడం లేదు? అంతే కాదు.. ఆయన అరాచక పాలన కారణంగా ఈ నాలుగున్నరేళ్లలో తమ జీవన స్థాయి ఎలా దిగజారిపోయిందో కూడా ప్రజలకు స్పష్టంగా అర్ధమైంది, నాలుగున్నరేళ్ల పాలన అట్టర్ ప్లాప్ కావడంతో ఫ్రస్టేషన్ లో విపక్షాలపై కక్ష సాధింపు చర్యలతో భయపెట్టి, బెదరించి, నిర్బంధించి అధికారాన్ని మళ్లీ దక్కించుకోగలనని భావిస్తున్నారా? లేక అధికారం, మందీ మార్బలం శాశ్వతం అన్న భ్రమలో తానేం చేసినా చెల్లిపోతుందని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా? అసలు సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని.. సుదీర్ఘ కాలం  ప్రజా సేవలో ఉన్న వ్యక్తిని.. క్యాబినెట్ ఆమోదంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తవ్వి తీసి   దోషిగా చూపించాలని పడే తపన న్యాయస్థానాలలో ఎంత మాత్రం నిలుస్తుందో ఆయనకి, ఆయన సలహాదారులకు తెలియకుండానే చేస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది.  ఇలా తప్పు మీద తప్పు.. తప్పుని ఒప్పు చేయాలని మరో తప్పు. నాలుగున్నరేళ్ల పాలనలో చెప్పిన అబద్ధాలు, చేసిన అక్రమాలు ఒకెత్తు అయితే.. ఈ రెండు నెలలలో చేసిన జగన్ సర్కార్ అరాచకాలు మరో ఎత్తు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై జగన్ సర్కార్ అక్రమంగా స్కిల్  కేసు బనాయించి అంతకంటే  అక్రమంగా  అరెస్ట్ చేసింది. ఆ కేసు అలా విచారణలో ఉండగానే మరో ఐదు కేసులు   నమోదు చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు బయటకి వస్తారనే ఉద్దేశంతోనే తరువాత అప్పటికప్పుడు ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, అంగళ్ల అల్లర్ల కేసు, తాజాగా మద్యం, ఆ తరువాత ఉచిత ఇసుక కేసు.. ఇలా ఆరు   కేసులు నమోదు చేసింది. మరో మూడు కేసులు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా వరుస కేసులతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయాలని, ఎన్నికల సమయానికి ఆయన్ని ప్రజలలో మమేకం కాకుండా నిరోధించాలని జగన్ చూస్తున్నారంటున్నారు. చంద్రబాబును బయటకి రాకుండా చేస్తామని వైసీపీ కీలక నేతలు మీడియా ముంగిటే శపధాలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సీఎం జగన్ మోహన్ రెడ్డికో.. పార్టీలో అన్నీ తానై నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికో తెలియనిది కాదు. పార్టీ నిర్ణయమే అది కనుక నేతలు ధైర్యంగా ఆ మాట చెప్తున్నారు.  మరి జగన్ ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? చంద్రబాబు అరెస్ట్ ఒక్కటే తన గెలుపుకు సోపానంగా ఆయన ఎందుకు భావిస్తున్నారన్నది   పరిశీలకులకు కూడా అంతు చిక్కడం లేదు. ఎందుకంటే స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సమయంలో ప్రజలలో చంద్రబాబు పట్ల ఉన్న అభిమానం ఎంతటిదో అందరికీ అర్ధమైంది. అక్రమంగా జగన్ సర్కార్ బాబును అరెస్టు చేయడంపై జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. అదే సమయంలో చంద్రబాబు పట్ల సానుభూతి వ్యక్తమైంది. ఆయనకు సంఘీభావం తెలపడానికి జనం వెల్లువలా రోడ్ల పైకి వచ్చారు.  అసలే నాలుగేళ్ళ పాలనపై అసంతృప్తికి తోడు చంద్రబాబు అరెస్ట్ ప్రజలలో వైసీపీ ప్రభుత్వంపై విముఖత వ్యక్తమైంది.  వేల కోట్ల అవినీతి కేసులలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి.. కేవలం 27 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్ల విరాళాన్ని అవినీతిగా పేర్కొంటూ అర్ధరాత్రి సమయంలో 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును బస చేసిన శిబిరం నుండే ఎత్తుకురమ్మని పోలీసులను పురమాయించారంటే ఇది ఏ స్థాయి అరాచకమో ప్రజలకు అర్ధమైంది. అసలు తాను దేశంలో లేనని జగన్ ప్రకటనలు చేయొచ్చు కానీ.. వాస్తవం గ్రహించలేని స్థితిలో ప్రజలు లేరన్నది సుస్పష్టం. స్కిల్ కేసు విచారణలో ఉండగానే వరస కేసులు నమోదు చేయడంత జగన్ పై వ్యతిరేకత ప్రజలోకి బలంగా  వ్యక్తం అయ్యింది.అదే    మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఫైనల్ డేంజర్ బెల్ మోగించింది. అయినా చంద్రబాబు టార్గెట్ గా వరుస కేసులను తెరమీదకు తీసుకువస్తుండటంతో జనం దృష్టిలో జగన్ ప్రతినాయకుడిగా మారిపోయారు.  అధికారం ఉంది కాదా అని ప్రతిపక్షాలపై దాడికి దిగితే ప్రజాగ్రహం ఎంతగా వెల్లువెత్తుతుందన్నది చంద్రబాబు జైలు నుండి విడుదలైన సందర్భంగా ఆయనకు లభించిన అపూర్వ స్వాగతమే కళ్లకు కట్టింది. చంద్రబాబుపై కేసులు, వేధింపులు జగన్ కు అప్పటికప్పుడు ఆనందాన్ని ఇవొచ్చు కానీ.. ముందు ముందు ఇదే ఆయన రాజకీయ పతనానికి కారణమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్... మూడ్రోజుల వైన్ షాపులు బంద్ 

పోలింగ్ కు కొన్ని గంటల ముందు వోటర్లపై మద్యం  ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 30వ తేదీన  మన రాష్ట్రంలో పోలింగ్ఉంది.  పోలింగ్ కు ముందు మద్యం అమ్మకాలను కట్టడి చేయాలని కేంద్ర  ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కెసీఆర్ ప్రభుత్వం ఆపద్దర్మ ప్రభుత్వంగా మారిపోయింది. మద్యం అమ్మకాల మీద ఆదాయం పెంచుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ నెల 28,29,30 తేదీల్లో మద్యం అమ్మకాలను నిలిపి వేయనుంది.వోటర్లు మద్యంతో ప్రలోభపడే అవకాశం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారి చేయడంతో మద్య.మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్ .  తిరిగి వచ్చేనెల ఒకటో తేదీ నుంచి వైన్ షాపులు తెరచుకుంటాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ రావటంతో… నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే శాంతి భద్రతల విషయంలో పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకునే పనిలో పడ్డారు.   

జగన్ ధీమా మాయం.. వేడుకోళ్లూ పని చేయని వైనం

మంత్రులతో పని లేదు.. ఎమ్మెల్యేలు అక్కర్లేదు.. నాయకుల అవసరం లేదు.. బటన్ నొక్కి పందేరం చేస్తున్న  సొమ్ములు.. నా  నుంచి నా చేత నా కోసం నియమించుకున్న వలంటీర్లు చాలు.. వచ్చే ఎన్నికలలో 175కు 175 స్థానాలలో విజయం సాధించేస్తాను  అన్న ధీమా నుంచి..  పార్టీ నేతలను నన్ను ముఖ్యమంత్రిని  చేయడానికి పని చేయండి బాబ్బాబు అని బతిమలాడుకునే స్థాయికి ముఖ్యమంత్రి జగన్ వచ్చేశారు.  నాలుగున్నరేళ్లుగా ఆయన వ్యక్తం చేస్తున్న ధీమా అంతా డొల్లేననీ, ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఓటమి  భయం వణికించేస్తోందనీ.. ఇటీవలి ఆయన  ప్రతి కదలికా.. ప్రతి మాటా  ప్రస్ఫుటం చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం రివ్వూ మీటింగ్ లు ఏర్పాటు చేసి.. సీనియర్ నాయకులు, మంత్రులు అన్న కనీస మర్యాద కూడా చూపకుండా.. వచ్చే  ఎన్నికలలో పార్టీ టికెట్ కావాలంటే జనం ఛీ కొట్టినా, చీత్కారం చేసినా జనంలోకి వెళ్లాల్సిందే... ప్రభుత్వం అందించిన  సంక్షేమ పథకాలను వివరించాల్సిందే అని హుకుం  జారీ చేసిన ధీమా ఇప్పుడు జగన్ లో కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదంటున్నారు.   చంద్రబాబు అరెస్టు తరువాత ప్రభుత్వ వేధింపుల భయాన్ని కూడా వదిలేసి జనం.. అన్ని వర్గాలకూ చెందిన వారు ధైర్యంగా బయటకు వచ్చి కేసులకు వెరవకుండా నిరసనలకు దిగడం.. పదేళ్లుగా తాను విజయవంతంగా మరుగున పడేశానని  భావిస్తున్న తన  అక్రమాస్తుల కేసులపై.. వ్యవస్థలను మేనేజ్ చేశో..మరోటి చేశో పదేళ్లుగా బెయిలు మీద బయట ఉన్న సంగతినీ జనం బాహాటంగా చర్చించుకున్నారు. చంద్రబాబుకు కృతజ్ణత ఈవెంట్ నిర్వహించి మరీ జగన్ నిష్క్రియాపరత్వాన్ని ఎండగట్టారు. ఏపీలోనే కాదు.. దేశ విదేశాలలో అసంఖ్యాకంగా జనం రోడ్ల మీదకు వచ్చి ఐ యామ్ విత్ బాబు (# I am with Babu) అంటూ నినదించారు.  మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు  మొహమాటం లేకుండా బాబు అవినీతికి  పాల్పడ్డారంటే తాము నమ్మలేమని కుండబద్దలు కొట్టారు. బాబుపై నమోదైన స్కిల్ కేసు నిలవదని కరాఖండీగా చెప్పేశారు. అన్నిటికీ మించి కేసు మీద కేసును తెరమీదకు తీసుకువస్తూ చంద్రబాబును జైలుకు పరిమితం చేయాలన్న జగన్ ఉద్దేశం వెనుక ఉన్న రాజకీయ సంకుచితత్వాన్ని జనం పసిగట్టేశారు.  సీఐడీ చీఫ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కలిసి ఊరూరు తిరిగి  చంద్రబాబుపై అవినీతి ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నాలను జనం తిప్పి కొట్టారు. సాంకేతిక కారణాలు, న్యాయవాదుల వాయిదాల అభ్యర్థన వల్ల చంద్రబాబు 52 రోజుల పాటు నిర్బంధంలో ఉండాల్సి వచ్చిందే తప్ప ఆయనపై పెట్టిన ఏ కేసులోనూ పస, విషయం లేదని జనం త్రికరణ శుద్ధిగా నమ్మారు. అందుకే మధ్యంత బెయిలుపై బయటకు వచ్చిన తరువాత నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ కోసం జనం ఎలా బయటకు వచ్చారో  అలా చంద్రబాబుకోసం జనం పోటెత్తారు. ఆయన  ప్రసంగించరని తెలుసు.. కారులోంచి బయటకు అడుగుపెట్టరని కూడా తెలుసు.. కానీ చంద్రబాబుకు సంఘీభావం తెలపడం కోసం బయటకు రావడం తమ కర్తవ్యంగా భావించారు ప్రజలు.  గంటల తరబడి ఆయన వాహన శ్రేణి రాకకోసం రోడ్ల కిరువైపులా వేచి చూశారు. విజయవాడ రహదారిలో ఆయన కోసం వేచి చూస్తున్న జనం రోడ్ల పక్కనే మేను వాల్చి నిదురిస్తున్న దృశ్యాలు మీడియాలోనూ, సామాజిక మాధ్యమంలోనూ వైరల్ అయ్యాయి. ఇవి చాలు జనం మూడేమిటో తెలిసిపోవడానికి. సహజంగానే జగన్ కు కూడా చంద్రబాబు కోసం జనం పడుతన్న తపనే తన ఓటమి ఏ స్థాయిలో ఉండబోతున్నదో కళ్లకు కట్టినట్లు అయ్యింది. దీంతో ఆయనలో అసహనం అవధులు దాటుతోంది. ఆ అసహనం క్రోధంగా పార్టీ నేతలపై ప్రసరిస్తోంది. అయితే ఈ సారి మీరు పని చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు.. నన్ను ముఖ్యమంత్రిని చేయడం మీకు ఇష్టం లేదా రుసరుసలాడుతున్నారు.   నన్ను సీఎంను చేయాలని లేదా అంటూ విశాఖ నేతలపై జగన్ రెడ్డి  రుసరుసలాడుతున్న సంఘటనకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమంలో తెగ ట్రోల్ అవుతోంది.  ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు వచ్చి బొకేలు ఇవ్వబోయిన పార్టీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు.  నన్ను సీఎం చేయడానికి మీరు కష్టపడటం లేదంటూ నిష్టూరాలాడారు.  ఇదేంటి ఒక ముఖ్యమంత్రి నాయకులను నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి పని చేయరా అని బతిమలాడుకోవడమేమిటి? తన నాయకత్వ పటిమతో నేతలను, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవలసిన సీఎం మీ సంగతి నాకు అనవసరం నేను ముఖ్యమంత్రికి కావాలంతే అన్నట్లు మాట్లాడటమేమిటని నెటిజనులు విస్తుపోతున్నారు. జగన్ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందో అవగతం అవ్వడానికి ఈ సంఘటన ఒక్కటి చాలంటూ ముక్తాయిస్తున్నారు.  జగన్ రెడ్డికి రాష్ట్రం ఏమైపోయినా, తనను నమ్ముకున్న ప్రజలు, నాయకులు, కార్యకర్తలూ ఏమైపోయినా పట్టదు.. తాను ముఖ్యమంత్రి కావడమే ముఖ్యం. కేవలం తనను సీఎం చేయడానికి అంగీకరించలేదన్న ఏకైక కారణంతోనే జగన్ రెడ్డి తన తండ్రి జీవితాంతం కొనసాగిన, ఆయనకు ఉన్నత పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. సరే పరిస్థితులు కలిసి వచ్చి 2019 ఎన్నికలలో ఆయన పార్టీ విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే  ఆ ఎన్నికలలో వైసీపీ విజయం అంతా తన ఘనతేనని భావించిన జగన్  పార్టీ విజయంలో నేతలు, కార్యకర్తల ప్రమేయం ఏదీ లేదన్నట్లుగా ఈ నాలుగేళ్లూ వ్యవహరించారు. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకూ, కేబినెట్ లో మంత్రులకూ ఇసుమంతైనా విలువలేని విధంగా వ్యవహరించారు. నియోజకవర్గాల పెత్తనం అంతా వలంటీర్లకు, మంత్రుల అధికారాలన్నీ సకల శాఖల మంత్రి సజ్జలకు కట్టబెట్టేశారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలూ నిమిత్త మాత్రలుగా మిగిలిపోయారు.  ఇక సంక్షేమం పేరిట పందేరం చేస్తున్న సొమ్ములే  2024లో తన విజయానికి పెట్టుబడులుగా మారుతాయని భ్రమించారు. అయితే జనం మాత్రం సంక్షేమంతో పాటు అభివృద్ధీ సమాంతరంగా ఉండాలని కోరుకుంటారని విస్మరించారు. నాలుగేళ్ల పాటు తనాడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా సాగిన అధికారం.. ఆ తరువాత ఇప్పుడు కదలనంటూ భీష్మిస్తోంది.  జనం ఎక్కడికక్కడ నిర్బయంగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ సీఎం సభల నుంచే వాకౌట్ చేస్తున్నారు. పార్టీ నేతల బస్సు యాత్రలకు మొహం చాటేస్తున్నారు. దీంతో విషయం బోధపడిన జగన్ ఇప్పుడు నేతలపై నెపం వేస్తున్నారు. నన్న మరోసారి సీఎం ను చేయడానికి మీరెందుకు కష్టపడటం లేదు. పని చేయడంలేదని నిలదీస్తున్నారు.  నాలుగున్నరేళ్ల కిందట151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నాలుగేళ్లలోనే ఇంతగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటారని కానీ, మూటగట్టుకోగలరని కానీ ఎవరూ ఊహించలేదు. అందుకే జగన్ విధానాలు ఆయన పాలన చేపట్టిన తొలినాళ్లలోనే.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రజావేదిక కూల్చివేతతోనే అర్ధమైనా.. అమరావతిని నిర్వీర్యం చేసినా.. మూడు రాజధానులు అంటూ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రం చేసినా నేతలు, కార్యకర్తలు ఆయనను అంటిపెట్టుకునే ఉన్నారు. కానీ చంద్రబాబు అరెస్టు.. తదననంతర పరిణామాలతో వారంతా కాడె వదిలేసినట్లే కనిపిస్తున్నారు. జగన్ ను సమర్ధిస్తూ మాట్లాడేందుకు సకల శాఖల మంత్రి.. కొడాలినాని, రోజా, అమర్నాథ్ వంటి వారు తప్ప ఇంకెవరూ మిగల్లేదు. చివరాఖరికి సామాజిక బస్సుయాత్రలో కార్యకర్తలు కూడా కనిపించనంతటి దారుణమైన పరిస్థితిలో జగన్ పార్టీ ఉంది. ఇందుకు జగన్ తీరే కారణమని పరిశీలకులు విశ్లేషించడమే కాదు.. స్వయంగా ఆయన పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.    

  చంద్ర బాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్

జైలు నుంచి విడుదలై హైదరాబాద్ చేరుకున్నమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును  ఇవ్వాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆయనతో బాటు ఈ భేటీలో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెళ్ల మనోహర్  కూడా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేన కల్సి పోటీ చేస్తున్నాయి.ఈ  నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇటీవలే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం ఉదయం చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి వెళ్లి వైద్యులను కలిసి వచ్చారు. ఈ భేటీలో ఏపీలో ఉమ్మడిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించినట్లు సమాచారం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై దాదాపు 50 రోజులకు పైగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. గత నెల 30న బెయిల్ 4 వారాల పాటు ఇంటర్మ్ బెయిల్ ను ఏపీ హై కోర్టు మంజూరు చేసింది. కంటి ఆపరేషన్ నిమిత్తం ఆయనకు బెయిల్ లభించింది. బెయిల్ తర్వాత ప్రత్యేక విమానంలో హైదారాబాద్‌ చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తో  పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత భేటీ అవ్వడం తో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలనే కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ. అదే సమయంలో బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతోంది. బిజెపితో పొత్తు ఖరారు కావడంతో  తెలంగాణలో 9 స్థానాలకు జన సేన పోటీ చేస్తుంది. జనసేనాని బిజెపితో కల్సి ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు భేటి కావడం రెండు ఉభయ రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.  చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీసిన పవన్, కంటికి జరుగుతున్న చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.  రాజమహేంద్రవరం జైల్లో ములాఖత్ అనంతరం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీపై ఇరు పార్టీల శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో - జనసేన పార్టీ అధినేత పవన్ భేటీలో తెలంగాణ ఎన్నికలు సహా ఏపీలోని తాజా రాజకీయాలు ఈ భేటీలో చర్చించారు. త్వరలో తెలుగుదేశం-జనసేన పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయీ సమావేశాల నిర్వహాణపై ప్రస్తావనకు వచ్చింది. సీఐడీ పెడుతున్న వరుస కేసులపైనా వీరిరువురు చర్చించినట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల లీడర్లు, కేడర్ ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాల పైనా చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన మీద చంద్రబాబు-పవన్ చర్చించినట్లు తెలుస్తుంది. పది అంశాలతో మినీ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని తెలుగుదేశం - జనసేన భావిస్తోంది. కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపకల్పన మీద చర్చించారు. కరవు, ధరల పెరుగుదల, కరెంట్ ఛార్జీల పెంపు, మద్యం, ఇసుక కుంభకోణాల వంటి అంశాల్లో క్షేత్ర స్థాయి పోరాటాలు చేపట్టాలని తెలుగుదేశం - జనసేన భావిస్తోంది. పవన్ కల్యాణ్, లోకేశ్ రాజమహేంద్రవరంలోనే ఇటీవలి తెలుగుదేశం జనసేన రాజకీయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. త్వరలో అమరావతిలో టీడీపీ-జనసేన మరొక విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది.  

కాంగ్రెస్‌కు షర్మిల మద్దతు. వైసీపీ ఉలికిపాటు!

జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో గత ఎన్నికలకు ముందు వైసీపీ తరపున ప్రచారం చేసిన షర్మిల.. జగన్ జైల్లో ఉండగా వైసీపీ పార్టీకి అన్నీ తానై నడిపించిన షర్మిల.. ఇప్పుడు ఇలా మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి పొరుగు రాష్ట్రంలో రాజకీయంగా దీన స్థితికి చేరుకున్నారు. దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి గారాల పట్టీ షర్మిలకు ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అన్నదే ఇక్కడ ప్రధానాంశంగా మారింది. తన అన్నను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న షర్మిల ఇప్పుడు అదే అన్న ముఖ్యమంత్రిగా ఉండగానే పరాయి రాష్ట్రంలో  రాజకీయ ఉనికి కోసం ఎందుకు పోరాడాల్సి వచ్చిందన్నది రాజకీయ విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ తన భర్త రాష్ట్రమైన తెలంగాణలో రాజకీయ ప్రవేశం చేసినా, అక్కడ ఆమెకు ఆశించిన రీతిలో ఆదరణ దక్కలేదు. దీంతో తన తండ్రికి గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ గూటికే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, కాంగ్రెస్ పెద్దలను పలుమార్లు కలవడం అన్నీ జరిగిపోయాయి. కానీ, చివరి నిమిషంలో  అది వీలుపడలేదు. కాంగ్రెస్ తో పొత్తు, విలీనం జరగకపోవడంతో ఈ ఎన్నికలలో తెలంగాణలో అన్ని అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయనున్నట్లు ఈమధ్య వరకూ షర్మిల ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో కూడా షర్మిల అదే మాట చెప్పారు. కానీ, అనూహ్యంగా ఇప్పుడు పోటీ నుండి తప్పుకున్నారు. ఈ ఎన్నికలలో తాను పోటీ చేస్తే చరిత్ర తనను క్షమించదంటూ కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. గెలవడం కంటే త్యాగం చేయడం గొప్ప విషయం అని చెప్పిన షర్మిల.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతమొందించే లక్ష్యంతో పోటీ నుంచి వైదొలగి కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. షర్మిల రాజకీయ అడుగులు కాంగ్రెస్ వైపేనని ఎప్పటి నుండో జరుగుతున్న ప్రచారమే కాగా.. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ కు మేలు జరిగేలా ఎన్నికల నుండి తప్పుకోవడంతో అది రూఢీ అయ్యింది. ఏపీలో   వైసీపీ పార్టీకి షర్మిల నిర్ణయం ఏ మాత్రం నచ్చడం లేదు. తెలంగాణలో షర్మిల తీసుకున్న నిర్ణయానికి ఏపీలో వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు. తెలంగాణలో ష‌ర్మిల పోటీకి దూరంగా ఉంటూ.. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప్రకటించడం వైసీపీ నేతలకు అస్సలు మింగుడు ప‌డ‌డం లేదు. కాంగ్రెస్ త‌నను తొక్కేసే ప్ర‌య‌త్నం చేసింద‌ని.. త‌న‌ను సీఎం కాకుండా చేసింద‌నే భావన వైఎస్ జ‌గ‌న్ మ‌న‌సులో బలంగా నాటుకుపోయింది. అందుకే కాంగ్రెస్ కు మేలు జరిగేలా షర్మిల తీసుకున్న నిర్ణయం వైసీపీ నేతలకు ఏ మాత్రం నచ్చడం లేదు. షర్మిలకు మాకు సంబంధం లేదు.. ఆమె పార్టీ ఏపీకి చెందింది కాదు అంటూనే ష‌ర్మిల‌పై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, సకల శాఖామంత్రి,  స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. జగన్మోహన్‌రెడ్డిని ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టారో ఇప్పుడు షర్మిల ఆ పార్టీతో కలిశారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలు.. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టం. మాకు ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించింది.. ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసు. జగన్‌పై అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందనీ తెలుసు.. కానీ, ఇప్పుడు షర్మిల ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం ఆమె ఇష్టం అంటూ సజ్జల గోడు వెళ్లబోసుకున్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన సమయం నుండే వైసీపీ నేతలు షర్మిలపై విషం కక్కుతున్నారు. అన్న జగన్ తో విభేదించిన షర్మిల ఆమె భవిష్యత్ ఆమె చూసుకున్నారు. అన్న సీఎం అయ్యేందుకు కాలికి బలం కట్టుకు తిరిగిన షర్మిల అదే అన్నకు అధికారం వచ్చాక తనను దూరం పెట్టడంపై   విభేదించారని అందరికీ తెలిసిందే. తల్లి విజయమ్మ కూడా వైఖరికి విసిగిపోయి కూతురు వద్దకే చేరారనీ తెలిసిందే. అయితే  ఇప్పుడు ఆమె రాజకీయ నిర్ణయాలపై వైసీపీ నేతల అభ్యంతరం చూస్తుంటే ఆ పార్టీ నేతలు ఎంతటి అభద్రతా భావనలో ఉన్నారో తెలిసిపోతున్నది. కాగా  ఏపీలో ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఏపీ రాజకీయాలలోకి దించనున్నారని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో  ఇప్పుడు షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటించడంతో జరగబోయేది అదే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే తమ  రాజకీయ భవిష్యత్ ఏంటన్నభయం వైసీపీ నేతలలో కనిపిస్తోందని అంటున్నారు.