ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఊరట.. క్వాష్ పై సుప్రీం తీర్పు ఎప్పుడంటే?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు దిపావళి సెలవుల తరువాతేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్  తీర్పును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల  ధర్మాసనం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.  కోర్టకు దసరా సెలవుల అనంతరం ఈ తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే తీర్పును  దీపావళి సెలవుల అనంతరం వెలువరించనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టులో గురువారం (నవంబర్ 9) ఫెబర్ నెట్ కేసులో  చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం కోర్టు.. అప్పటి వరకూ ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించింది.  కాగా స్కిల్ కేసులో ఏపీ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 52 రోజుల నిర్బంధం అనంతరం ఆయన మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. అయితే స్కిల్ కేసులో ఆయన దాఖలు చేసిన  క్వాష్ పిటిషన్  ను ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన తరువాత ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ పిటిషన్ ను విచారించిన  జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల  ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సుప్రీం అనుమతిస్తే ఒక్క స్కిల్ కేసే కాదు.. ఆయనపై జగన్ సర్కార్ నమోదు చేసిన  ఇన్నర్ రింగ్ రోడ్డ్, ఫైబర్ నెట్, ఇసుక, మద్యం పాలసీ సహా అన్ని కేసులూ రద్దౌతాయి. ఒక వేళ సుప్రీం ఆయన క్వాష్ పిటిషన్ ను తిరస్కరిస్తే.. చంద్రబాబు సీజేఐ బెంచ్ ను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.  స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఏపీ సీఐడీ.. ఈ కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది.  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం లో వాదనలు ప్రధానంగా 17ఎ సెక్షన్ పైనే జరిగాయి. స్కిల్ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఎ వర్తిస్తుందని న్యాయనిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.   

  గజ్వేల్, కామారెడ్డి లో కెసీఆర్ నామినేషన్ 

ఓటమి భయంతో రెండు చోట్ల పోటి చేస్తున్న ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం మధ్యాహ్నం(నవంబర్ 9 )  స్వంత నియోజకవర్గం గజ్వేల్ లో  నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటం ఇదో మూడోసారి. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి గజ్వేల్ కు కేసీఆర్ హెలికాప్టర్ లో వెళ్లారు.  కెసీఆర్ ను ఎలాగైనా ఓడించి తీరుతానని శపథం చేసిన బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో  వెళ్లిన ఈటెల ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గజ్వేల్ నుంచి కామారెడ్డికి  కేసీఆర్ బయల్దేరారు. మధ్యాహ్నం 2 గంటల లోపు అక్కడ నామినేషన్ వేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

కిషన్ రెడ్డి ఇరుక్కున్నట్లేనా.. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ విమర్శలకే పరిమితమా?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలకు ఊహించని విధంగా గట్టి రాటార్డ్ వచ్చింది.  కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు సీఎం కేసీఆర్‌ ముందుకు వచ్చి లేఖ రాస్తే.. తాను రెండుగంటల్లో సీబీఐ విచారణ చేయిస్తానని కిషన్ రెడ్డి  చెప్పారు. అలా చెప్పడం ద్వారా  కేంద్రం నేరుగా కాళేశ్వరం అవినీతిపై చేయగలిగిందేమీ లేదని అంగీకరించేసినట్లైంది. అయితే  సీబీఐ మాజీ డెరెక్టర్ నాగేశ్వరరావు కిషన్ రెడ్డి తప్పించుకోవడానికే ఇలా చెప్పారని కుండబద్దలు కొట్టేశారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య బంధాలు ఉన్నాయనీ, అవి పరస్పరం సహకారం అందించుకుంటున్నాయనీ ఇంత కాలం ఉన్న అనుమానాలను బలపరిచే విధంగా నాగేశ్వరరావు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తునకు కేసీఆర్ లేఖ అవసరం లేదంటూ ఆయన విస్పష్టంగా తేల్చేశారు.  కాళేశ్వరంపై సీబీఐ విచారణకు  తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనుమతి అవసరం లేదనీ, ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది కేంద్రానికి చెందిన సంస్థలేననీ, అది కూడా ఒకటీ రెండూ కాదు ఏకంగా పది ఏజెన్సీలు అనుమతులు మంజూరు చేశాయనీ నాగేశ్వరరావు తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్ర జలవనరుల శాఖ సీబీఐకి ఫిర్యాదు చేస్తే చాలనీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించేయొచ్చనీ స్పష్టం చేశారు.   దీంతో కేంద్రం కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ పై, ఆయన ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమౌతుంది తప్ప సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి..నిగ్గు తేల్చే ఉద్దేశంలో లేదని స్పష్టమైపోయింది.  దీంతో  కేసీఆర్ లేఖ రాస్తే తప్ప సీబీఐ దర్యాప్తు కోరలేమంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఆయనను చిక్కుల్లో పడేసినట్లైంది. కేంద్ర మంత్రిగా కేసీఆర్ లేఖ కోసం ఎదురు చూడకుండా ఆయన కేంద్ర జలశక్తి శాఖ  ద్వారా సీబీఐకి లేఖ రాయించడమో, ఫిర్యాదు  చేయడమో ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమైంది.  ఈ ప్రశ్నే బీజేపీ, బీఆర్ఎస్ రహస్య బంధాన్ని బట్టబయలు చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎన్నికల వేళ ఈ పరిస్థితి కచ్చితంగా కిషన్ రెడ్డికే కాదు, బీజేపీకి కూడా ఇబ్బందికరమే. దీంతో కిషన్ రెడ్డి ఏం చేస్తారన్న ఆశక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కాళేశ్వరం అవినీతిపై ఏయే సెక్షన్ల కింద రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందో వివరంగా వెల్లడించిన తరువాత కూడా మీనమేషాలు లెక్కిస్తే.. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీల బండారం బయటపడిపోవడమే కాకుండా ఆ రెండు పార్టీల ప్రతిష్ట మసకబారడం ఖాయం అన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. మద్యం లిక్కర్ కేసులో ఆప్ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను జైలుకు పంపడానికి ఇసుమంతైన సంకోచించని కేంద్ర దర్యాప్తు సంస్థలు కవిత విషయంలో ఎందుకు వెనక్కు తగ్గాయో కూడా కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు విషయంలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైనట్లేనన్న విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి.   కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన బృందానికి కిషన్‌రెడ్డి నాయకత్వం వహించారు. మేడిగడ్డ కుంగుబాటును పరిశీలించారు.   అవినీతిపై ఆరోపణలు గుప్పించారు.  అయినా  సీబీఐ విచారణకు మాత్రం అవినీతికి పాల్పడ్డారని తాము ఆరోపిస్తున్న కేసీఆర్ అనుమతి కావాలనడమేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీము కాబట్టే లిక్కరు కేసులో కవితను ఇప్పటిదాకా అరెస్టు చేయలేదని , ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని   ఆరోపిస్తూ కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం లేదనీ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.  ఈ పరిస్థితుల్లో సీబీఐ మాజీ డైరెక్టర్ కాళేశ్వరంపై దర్యాప్తునకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదని సెక్షన్లతో సహా చెప్పిన తరువాత కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమౌతోంది.  

తిరుమలలో చారిత్రక కట్టడాల కూల్చివేత.. దేనికి సంకేతం?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ మత ధర్మాన్ని నమ్మినా, ఆచరించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ  అన్ని మత విశ్వాసాలకూ సమ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో  భక్తుల విశ్వాసాలకు భంగం కలిగేలా జరుగుతున్న చర్యల పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  అవును జగన్ పాలనలో  హైంధవ ధర్మానికి అపచారాలు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో  హిందూ ధార్మిక సంస్థలు, స్వాములు, స్వామీజీలు ఆరోపిస్తున్నారు. ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్న వారిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రియ స్వామీజీ  శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీజీ  కూడా ఉన్నారు.  సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకల పై స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాజీవితంలో ఇలాంటి చందనోత్సవాన్ని చూడలేదన్నారు. సంప్రదాయాన్ని మంట గలిపేసారని స్వామిజీ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిజానికి స్వామీజీ సింహాచలం చందనోత్సవంలో చోటు చేసుకున్న అపచారాలపై మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేసినా..  జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన సంఘటన అనేకం ఉన్నాయని పరిశీలకులు సైతం చెబుతున్నారు. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, మరెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో ఆధ్మాత్మిక వాదులు లెక్కలతో సహా చెబుతున్నారు. వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వారిని  ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఏడుకొందలపై  ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం మొదలు, ఇటీవల టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ    తీసుకుంటున్న  నిర్ణయాల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం  అపచారాలకు లెక్కలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందని భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు  ఆరోపించాయి. ఆరోపిస్తున్నాయి. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  అంతే కాదు, తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులలో బలంగా వ్యక్తమౌతోంది ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో  పద్దతిలో  దోపిడీకి పాల్పడుతోందని  భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్జిత సేవల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అదే సమయంలో భక్తులకు సమకూరుస్తున్న సదుపాయాలు నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.  స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు  గతంలో సమయానుకూలంగా ప్రసాద వితరణ జరిగేది. ఇప్పడు అది లేదు. కనీసం జల ప్రసాదం కూడా  అందుబాటులో ఉండడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అలాగే క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం  లేకుండా పోయింది,  దుర్వాసనలు భరిస్తూ స్వామి స్వామి దర్శనానికి నిరీక్షించ వలసి వస్తోందని భక్తులు అంటున్నారు.    ఇదంతా ఒకెత్తు అయితే తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలు, చర్యలు విస్మయపరుస్తున్నాయి. కొండపై ఏడుకొండల దేవుడి చారిత్రక ఆధారాలను నాశనం చేయడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పని చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీవారు వేటకు వెళ్లినప్పుడు ఉపయోగించినట్లుగా భక్తులు విశ్వసించే పార్వేట మంటపాన్ని కూల్చేసి దాని స్థానంలో కొత్త నిర్మాణం పూర్తి చేశారు. వందల ఏళ్ల పురాతన భవనాన్ని ఇష్టారీతిగా కూల్చేసి.. పురాతన భవనం కనుక కూల్చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతోంది. అలాగే ఇప్పుడు అలిపిర వద్ద ఉన్న మరో మండపం విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. టీటీడీ తీరుపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తిరుమలలో చారిత్రక కట్టడాల కూల్చివేత వెనుక తిరుమల ప్రాభవం, ప్రాశస్థ్యం తగ్గించేసే కుట్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కూల్చివేతలపై ఇప్పటికే  ప్రధాని కార్యాలయం ఆరాతీసినట్లు చెబుతున్నారు.  మొత్తం మీద జగన్ పాలనలో తిరుమలలో ఆరాచకాలు హద్దు లేకుండా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

అవును.. వై ఏపీ నీడ్స్ జగన్!

కదిలితే కేసు.. మెదిలితే అరెస్టు.. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితి ఇది. నిత్యంనరకం అనుభవిస్తున్నా.. నోరెత్తితే కటకటాల పాలు చేస్తారన్న భయంలో జనంబతుకుతున్నారు. అలా భయపెట్టి.. జనాలను భయంలోనే ఉంచి.. వచ్చేఎన్నికలలో గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చేయవచ్చని కలలు కంటోందిజగన్ పార్టీ. అయితే.. సర్వేలైతేనేం, ఎక్కడికక్కడ జనంతిరగబడుతుండటంతో.. కేవలం బెదరింపులతో పని కాదని అర్దమైన అధికారపార్టీ అగ్రనాయకత్వానికి.. అధికారంపై ఆశలు అడుగంటాయి. ఇక గోబెల్స్ నేనమ్ముకున్నారు. అందుకే..   అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నానికి ఒడిగట్టారు. ఏపీలో కనీవినీ ఎరుగని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు.ఇందు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను ఇంటింటికీ, గడపగడపకీ,వీధి వీధికీ పంపుతున్నారు. ఏపీ ప్రజలు జగన్ హయాంలో జరిగినఅభివృద్ధిని చూడలేకపోతున్నారనీ, కానీ ప్రపంచం మొత్తం ఏపీవైపుచూస్తోందనీ చెప్పుకుంటున్నారు.  వాస్తవానికి  పేద, మధ్య తరగతి, మేధావులే కాదు గత ఎన్నికల్లో ఏదో ఆశించి, వైసీపీకి ఓటేసి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన వైసీపీ ఓటర్లు కూడా.. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికలలో చేసిన తప్పును దిద్దుకోవాలని పట్టుదలగా ఉన్నారు.  ఎంత త్వరగా ఎన్నికలొస్తే రాష్ట్రానికి అంత మంచిదని భావిస్తున్నారు.  అంతే కాదు  చివరకు క్షేత్ర స్థాయి వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా బహిరంగంగా కాకపోయినా, అంతర్గత సంభాషణల్లో ఈ సారి మన పని అయిపోయినట్లేనని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు. సామాజిక సాధికార బస్సుయాత్రకు కార్యకర్తలు ముఖం చాటేయడమే ఇందుకు  నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో చంద్రబాబు అంతటి  సీనియర్ నాయకుని, అక్రమంగా, అరెస్ట్ చేసి, జైలుకు పంపి వేధింపులకు గురిచేయడాన్ని, ఆయనతో పాటుగా,ఆయన్ని అయన కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్న తీరును,పార్టీలకు అతీతంగా సామాన్య ఓటర్లు చాలా తీవ్రంగా   వ్యతిరేకిస్తున్నారు. చట్టాని చుట్టేసి, ఇష్టారాజ్యంగా రాజ్యంగ విరుద్ధ పరిపాలన సాగిస్తున్న జగన్ రెడ్డి పాలనపై విసుగెత్తిన ప్రజలు, ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా వైసీపీ ప్రభుత్వాన్ని వదిలించుకోవచ్చనే ఆలోచన సర్వట్రా వ్యక్తమవుతోంది.ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వైసీపీ మంత్రులు, నాయకులు చేస్తున్న ప్రకటనలతో జనంలో ఇప్పటికే జగన్ సర్కార్ పట్ల ఉన్న వ్యతిరేకత మరింత పెరిగింది. గతంలోలా వ్యతిరేకతను మనసులో ఉంచుకుని మౌనంగా ఉండటం కాకుండా ఆ వ్యతిరేకతను బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. కేసులు, అరెస్టులపై భయాన్ని వదిలేశారు.  నిజాన్ని సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత రాష్ట్రంలో  పరిస్థితులపై సి ఓటర్ నిర్వహించిన సర్వేలో   చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి విపరీతమైన సానుభూతి వచ్చిందని తేలింది. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమేనని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని, ఈ అరెస్ట్‌తో జగన్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందని సి ఓటర్ సర్వే తేల్చింది. చంద్రబాబు అరెస్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం తథ్యమని వెల్లడించింది. జనసేన పొత్తుతో చంద్రబాబు మరోమారు, ముఖ్యమంత్రిగా సభలో కలుపెట్టడం ఖాయమని సర్వే తేల్చింది. ఆయన అరెస్ట్ తో తెలుగు దేశం పార్టీకి, పెద్దగా నష్టం జరగదని వైసీపీ నేతలే అభిప్రయా పడుతున్నారని పేర్కొంది. అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెపుతే వినే రకం కాదు కాబట్టి, వాస్తవ పరిస్థితిని వారు ఆయన ముందు ఉంచలేకపోతున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు.  ఇప్పటికే వైసీపే నాయకులు ఓటమికి మానసికంగా సిద్దం అయిపోయారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.    ఈ నేపథ్యంలో జనం అంటున్న వై ఏపీ నీడ్స్ జగన్ అంటున్న మాటనే కార్యక్రమంగా మార్చి ఏపీకి జగనే ఎందుకు అవసరమో వివరించేందుకు వైసీపీ నేతలను జగన్ మరోసారి జనం ముందుకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. ఏపీలో జరిగిన, జరుగుతున్న బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రపంచం అంతా గుర్తించినా రాష్ట్ర ప్రజలు మాత్రం చూడలేకపోతున్నారని తెగ బాధపడిపోయారు. అసలు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మించిన అభివృద్ధి ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో గురువారం(నవంబర్9) నుంచి జగన్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. జగన్ చేసిన అభివృద్ధిని చూడలేకపోవడం జనం తప్పే అని తేల్చేశారు. తప్పు అన్నట్లు సజ్జల మాట్లాడారు. ఇంత అభివృద్ధి చేసినా ఎక్కడుంది అభివృద్ధి అన్నట్లు విమర్శలు చేస్తుంటే కేసులు పెట్టమా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.   అసలు వైసీపీ కార్యక్రమాలన్నీ పోలీసులను అడ్డం పెట్టుకుని జనాలను బెదరించడానికే అన్నట్లు ఉంటున్నాయని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో నిరసన తెలిపిన వారిపై కేసులు, పథకాలు ఆపేస్తామన్న బెదరింపులను పరిశీలకులు ఉదాహరణగా చూపిస్తున్నారు.  ఇంటింటికీ తిరిగి  మా నమకం, మా భవిష్యత్‌ నువ్వే జగన్  స్టిక్కర్స్ అంటించారు. సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సులు వేసుకొని తిరిగారు. ఇంత చేసిన తరువాత  కూడా ఇప్పుడు ఏపీకి జగన్ ఎందుకు (వై ఏపీ నీడ్స్ జగన్) అని జనం ప్రశ్నిస్తున్నారు. అదే వైసీపీకి మింగుడు పడటం లేదు. దీంతో వారు వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ ఓ కార్యక్రమాన్ని మొదలెట్టేశారు. ఇక జనానికి కనిపించని అభివృద్ధి గురించి ఉదరగొట్టేస్తారు. బటన్ నొక్కడం కంటే అభివృద్ధి ఏముంటుందని జనానికి చెప్పేందుకు రెడీ అయిపోయారు. రోడ్లు ఎందుకు బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేస్తుంటే ఇక రోడ్లు ఎందుకు అని చెప్తారు. ధరలు ఎంత విపరీతంగా పెరిగినా బాధెందుకు మీకు సొమ్ములు ఇస్తున్నాం కదా అంటారు. విద్యుత్ చార్జీలు పెరిగితే ఏమైంది.. మీఖాతాలలో సొమ్ములు పడుతున్నాయిగా అని చెప్పుకుంటారు.  రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లించలేకపోతోంది కదా అంటే వారు మా ఓటర్లు కాదని అంటారేమో. ఎందుకంటే.. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తరువాత ఇదే సజ్జల గారు మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్ర ఆర్ధిక, పారిశ్రామిక, ఐ‌టి. వ్యవసాయ, సాగునీటి రంగాలలో అభివృద్ధి అడుగంటిపోయిన సంగతి, కనీసం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దయనీయ పరిస్థితి గురించి జనం అడిగితే వాటి సంగతి మీ కెందుకు మీకు జగన్ బటన్ నొక్కి సొమ్ములను ఖాతాలలో వేస్తున్నారుగా.. అందుకే ఏపీ నీడ్స్ జగన్ అని చెబుతారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పదే పదే మందీ మార్బలంతో అధికార పార్టీ నేతలు జనం ఇళ్ల మీద పడి బెదరించి, భయభ్రాంతులకు గురి చేసి దట్స్ వై ఏపీ నీడ్స్ జగన్ అంటారేమో అన్న సందేహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

దిశ యాప్.. దిశ ఏంటి?.. బలవంతపు డౌన్లోడ్ల మర్మమేంటి?

ఏపీలో దిశ యాప్ పేరిట మరో దుమారం రేగుతుంది. మహిళల రక్షణ కోసం అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ దిశ చట్టానికి చట్టబద్దత లేదని ఎప్పుడో తేలిపోగా.. దిశా పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ అంటూ ప్రభుత్వం హడావుడి మాత్రం ఆగలేదు. అసలు ఈ దిశ పోలీస్ స్టేషన్లు ఎక్కడో ఉన్నాయో.. దిశ పోలీసులు ఎలా పనిచేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు కానీ.. దిశ యాప్ ను ప్రజల మొబైల్ ఫోన్లలో బలవంతంగా ఇన్ స్టాల్ చేయిస్తున్నారు. మగాళ్ల ఫోన్లలో కూడా దిశా యాప్ ఇన్ స్టాల్ చేయాలంటూ పోలీసులతో బలవంతంగా హింస పెడుతున్నారు. దిశ యాప్ మాకెందుకు అంటే పోలీసులు ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనే అనకాపల్లిలో చోటు చేసుకుంది. ఓ సైనికోద్యోగి దేశసరిహద్దు నుండి సొంత గ్రామానికి వెళ్తుండగా అనకాపల్లి పోలీసులు అతని మొబైల్ లో దిశ యాప్ ఇన్ స్టాల్ చేయమని బలవంతం చేశారు. అతను ససేమీరా అనడంతో నలుగురు పోలీసులు కలిసి అతన్ని చితకబాదారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. దిశ యాప్ ఇంత బలవంతంగా ఇన్ స్టాల్ చేయించడం వెనక మరేదైనా కారణాలున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సయ్యద్ అలీముల్లా అనే వ్యక్తి దువ్వాడలో సెక్టార్ 10లో నివసిస్తూ జమ్మూ కాశ్మీర్ లో 52 రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్ సోల్జర్ గా పనిచేస్తున్నాడు. సెలవుపై వచ్చిన ఆయన సొంతూరు ఎలమంచిలి మండలం రేగుపాలెం వెళ్లేందుకు పరవాడ సంతబయల బస్టాప్ లో వేచి ఉన్నాడు. ఆయన వద్దకెళ్లిన ఓ మహిళా కానిస్టేబుల్‌ అతని ఫోన్‌ లో దిశ యాప్ ఇన్ స్టాల్ చేయాలని కోరింది. అతను తనకు అవసరం లేదని చెప్పడంతో మహిళ కానిస్టేబుల్ బలవంతంగా అతని నుండి ఫోన్ తీసుకొని దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసింది. అంతలో అతను అనుమానించి అసలు మీరు పోలీసులేనా ఐడీ కార్డు చూపించండి.. నేమ్ ప్లేట్ లేదు మీ పేరేంటని అడుగగా ఆమె ఫోన్ వెనక్కి ఇచ్చేసింది. అంతలో ఫోన్‌కొచ్చిన వన్‌టైం పాస్‌వర్డ్ చెప్పాలని కానిస్టేబుల్‌ కోరడంతో అతను ససేమిరా అన్నాడు. పాస్‌వర్డ్‌ను తానే ఎంటర్‌ చేస్తానని కానిస్టేబుల్ చేతిలోని ట్యాబ్ ఇవ్వాలని కోరాడు. దీంతో ఆగ్రహించిన మహిళా కానిస్టేబుల్‌ అతడిపై చేయి చేసుకుంది. దీంతో నిర్ఘాంతపోయిన సైనికుడు దేశ సరిహద్దు కాశ్మీర్లో పనిచేసే తనకు దిశ యాప్ ఎందుకని ఎదురు తిరిగి ప్రశ్నించాడు. స్థానికులు కూడా ఆయనకు సపోర్ట్‌ చేయడంతో మహిళా కానిస్టేబుల్ తో పాటు వచ్చిన మరో కానిస్టేబుల్‌ స్టేషన్ కి ఫోన్ చేశాడు. నలుగురు సిబ్బంది హుటాహుటిన అక్కడకు అటోలో చేరుకుని సైనికుడిపై దాడికి దిగారు. చుట్టుపక్కల ప్రజలు వారించినా వినకుండా అతని చేతులు కాళ్ళు విరిచి ఆటో ఎక్కించే ప్రయత్నం చేశారు. దేశ సరిహద్దులో యుద్ధం చేసే సైనికుడు కదా పోలీసుల ఆటలు సాగలేదు. మరోవైపు చుట్టూ ప్రజలు కూడా అతనికి మద్దతుగా నిలిచారు. మగాళ్ల ఫోన్ లో దిశాయాప్ ఎందుకని, పోలీసులైనా ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదంటూ స్థానికులు వాదించినా మహిళా కానిస్టేబుల్ మా ఇష్టం అనే రీతిలో స్పందించింది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతుండగా.. సీపీ ఇప్పటికే ఆ నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్ కు పంపినట్లు ప్రకటించారు. అయితే, అసలు ఇంత బలవంతంగా దిశ యాప్ ఇన్ స్టాల్ చేయించడం, మగాళ్ల ఫోన్లలో కూడా ఇన్ స్టాల్ చేయాలని బలవంతం చేయడం, ఓటీపీలు స్టోర్ చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని సందేహం వ్యక్తం చేశారు. పురుషుల మొబైల్స్ లో ఆ యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. జగనాసుర పాలనలో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని.. ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టానికే దిక్కూ మొక్కూ లేదు.. మహిళల భద్రత కోసమని తెచ్చిన దిశ యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడమేంటని ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు రాష్ట్రానికి వస్తే ఆయన ప్రాణానికే రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. పోలీసులే గుండాల్లాగా దాడులు చేయడం ఏంటని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఆరోపణల తర్వాత రాజకీయ వర్గాలలో ఇది చర్చగా మారింది. ఇప్పటికే పలు మార్గాల ద్వారా వైసీపీ సర్కార్ ప్రజల డేటాను స్టోర్ చేసుకుంటుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దిశ యాప్ కూడా అందులో మరొకటిగా మారిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో మళ్లీ సాంకేతిక లోపం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలకు హెలికాప్టర్ ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రయాణించే హెలికాప్టర్ లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తున్నది.   ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ సోమవారం (నవంబర్ 6) దేవరకద్రకు బయలుదేరారు. హెలికాఫ్టర్ బయలుదేరిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్ ను వెనక్కు ఎర్రవల్లిలోని సీఎం ఫామ్ హౌస్ కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.   ఆ తరువాత ఏవియేషన్ అధికారులు సీఎం పర్యటన కోసం మరో హెలికాప్టర్ పంపించారు అది వేరే విషయం. కానీ ఈ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి అదే పరిస్థితి రిపీట్ అయ్యింది.  బుధవారం (నవంబర్ )కూడా ఆయన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది.   సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య తలెత్తడంతో చాపర్ ను పైలట్ వెంటనే నిలిపివేశాడు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తిరిగి బయలు దేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గంలో  ఆసిఫాబాద్‌కు వెళ్లారు.  సీఎం ప్రయాణించే హెలికాప్టర్ లో స్వల్ప వ్యవధిలోనే రెండు సార్లు సాంకేతిక లోపం తలెత్తడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నాయి. 

జగన్‌కు మరో బిగ్ షాక్.. అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు నోటీసులు!

సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. 16 నెలల జైలు తర్వాత బెయిల్ మీద విడుదలైన జగన్.. పదేళ్లుగా  లాగోలా కేసు విచారణ నుండి తప్పించుకుంటూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ కేసులో కదలిక వచ్చి ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.  జగన్ అక్రమాస్తుల కేసులపై ఇప్పటికే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ (తెలంగాణ)నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పైన సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయని, ఈ కేసులో విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలని రఘురామ కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని, కేసుల విచారణ బదిలీ పిటిషన్‌ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని  సీబీఐని ఆదేశించింది. అలాగే సీఎం జగన్ కు కూడా  సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. విచారణను వచ్చే ఏడాది జనవరికి  వాయిదా వేసింది.   ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన   పిటిషన్ ఆధారంగా వచ్చే ఏడాది ఎన్నికల సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులు విచారణకు వస్తాయా అన్న చర్చ జరుగుతుండగానే.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా జగన్ కు షాక్ ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్ పై  విచారణకు ఆదేశించింది. తెలంగాణ ఛీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణకు స్వీకరించింది. హరిరామ జోగయ్య పిల్ లో సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించి ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు  అంగీకారం తెలిపింది. అంతేకాదు, హరి రామ జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశించిన హైకోర్టు.. ప్రతివాదులు జగన్ మోహన్ రెడ్డి, సీబీఐకి నోటీసులు ఇచ్చింది.  సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోరుతూ హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక ఆయనపై అక్రమాస్తుల కేసులు పెండింగ్ లో ఉండకూడదని, జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య పిల్ లో కోరారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద జోగయ్య లాయర్ ఈ పిల్ దాఖలు చేశారు. అయితే ఈ పిల్‌లో ప్రజాప్రయోజనం లేదని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం ఛేయగా ధర్మాసనం విచారణ జరిపింది. అఫిడవిట్‌ను సవరించాలని జోగయ్యను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు.. దీని కోసం రెండు వారాల గడువు కూడా ఇచ్చింది. ఈ గడువులోగా డాక్యుమెంట్లపై వివరణతో అఫిడవిట్‌ను సవరించి కేసుల స్థాయి వివరాలను స్పష్టంగా ప్రస్తావించాలని కోర్టు ఆదేశించింది. విచారణలో భాగంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు ధర్మాసనం.. జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇదే అక్రమాస్తుల కేసులో  జగన్ కు నోటీసులు అందగా.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని నోటీసులు జారీ చేసింది. దీనిపై వైసీపీ స్పందన ఏమిటన్నది వెంటనే తెలియరాలేదు. అయితే తెలుగురాష్ట్రాలలో  ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులో కదలికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. కోర్టులు కూడా  జగన్ కేసుల విచారణపై దృష్టి సారించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.   ఎన్నికల సమయంలో ప్రతి వారం కోర్టు విచారణకు హాజరవ్వాల్సి రావడం జగన్ కు కచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమే అవుతుందనడంలో సందేహం లేదు.   ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం ఖాయం. అసలే చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత ప్రజలలో సహజంగానే జగన్ కేసులపై చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఆ కేసుల విచారణ కూడా ప్రారంభమైతే జగన్ ఇమేజ్ పాతాళానికి పడిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

లబ్ధిదారులకు తెలియకుండానే టిడ్కో ఇళ్లు తాకట్టు.. జగన్మాయ!

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ చేసిన మరో భారీ మోసం బయటపడింది. పేదలను నమ్మించి ముంచిన ప్రభుత్వం చివరికి ఇప్పుడు ప్రజల ఇళ్లను కూడా వేలానికి తెచ్చింది. ఒక్క రూపాయికే ఇల్లు అంటూ గొప్పలు చెప్పుకున్న జగన్ సర్కార్.. వక్ర మార్గంలో వాళ్ళకు ఇప్పుడు లక్షలకు లక్షలు కట్టాలని నోటీసులు ఇచ్చింది. డబ్బులు కట్టకపోతే మీ ఇల్లు వేలం వేస్తామంటూ బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో గగ్గోలు పెడుతున్న పేద బాధితులు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో పేదల ఇళ్ల పేరిట జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మరో భారీ మోసం బయటపడింది. బాధితుల తరపున ప్రతిపక్ష పార్టీల నేతలు బ్యాంకు అధికారులు, ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇప్పటికిప్పుడు లక్షలు తెచ్చి కట్టమంటే ఎక్కడి నుండి తెచ్చి కట్టాలని బాధితులు వాపోతున్నారు. ఇల్లు ఇచ్చినట్లే ఇచ్చి సీఎం జగన్ ఇంతటి మోసానికి ఒడిగడతాడని ఊహించలేదని బాధితులు సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఈ టిడ్కో ఇళ్ల పేరిట జగన్ ప్రభుత్వం చేసిన మోసం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో పలు జిల్లాలలో టిడ్కో ఇళ్ల సముదాయాల నిర్మాణం చేపట్టారు. ఈ ఇళ్ళు ప్రభుత్వం నిర్మించినా అందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుంది. కొంత మొత్తం లబ్ధిదారులు కడితే మిగతా మొత్తాన్ని ప్రభుత్వం భరించేలా ఈ గృహాల నిర్మాణం మొదలు పెట్టారు. పలు జిల్లాలలో 80 నుండి 90 శాతం గత ప్రభుత్వంలోనే నిర్మాణాలు పూర్తవగా.. మరికొన్ని వంద శాతం పూర్తయి లబ్దిదారులకు అందించడమే మిగిలింది. ఈ లోగా ఎన్నికలు ముంచుకొచ్చాయి. కాగా, ఎన్నికల సమయంలో లబ్ది దారుల భాగస్వామ్యం కూడా ప్రభుత్వమే చెల్లించేలా అన్ని పార్టీలు హామీలు ఇచ్చాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అయితే.. కేవలం ఒకే ఒక్క రూపాయితో టిడ్కో ఇళ్లను లబ్ది దారులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్ అయింది. 10 నుండి 20 శాతం పెండింగ్ ఉన్న గృహా సముదాయాల నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్ ప్రభుత్వం నిర్మాణం పూర్తయిన గృహాలను రంగులు మార్చి మూడేళ్ళ తర్వాత లబ్ది దారులకు అందించారు.  ముందుగా చెప్పినట్లే ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అధికారులు ఇళ్లను అప్పగించారు. అంతకు ముందు ఈ ఇళ్ళు కేటాయించిన వారికే అధిక భాగం ఇళ్లను కేటాయించారు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఈ లబ్ది దారులకు బ్యాంకుల నుండి నోటీసులు అందాయి. మీ ఇంటి బాకీకి గాను ఏడాది నుండి ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయని.. ఏడాది కాలంగా ఉన్న ఈఎంఐలను ఇప్పటికిప్పుడు చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులలో పేర్కొన్నారు. ఇదేంటి ప్రభుత్వం ఒక్క రూపాయికే ఇళ్ళు అప్పగిస్తే ఈ బ్యాంకు అధికారులేంటి ఇలా నోటీసులు ఇచ్చారని బ్యాంకుకు వెళ్తే అసలు విషయం బయటపడింది. ఒక్క రూపాయికే ఇళ్ళు ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఆ ఇళ్లను బ్యాంకులలో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంది. ఆ లోన్ బకాయిలను లబ్దిదారులు కట్టేలా ఒప్పందం చేసుకుంది. ఈ బండారం బయటపడకుండా రెండేళ్ల పాటు లబ్ధిదారులను ఈఎంఐ అడగకుండా ఉండాలని బ్యాంకులను కోరింది. అప్పటికి ఎన్నికలు పూర్తవుతాయని ప్రభుత్వం భావించింది. కానీ, బ్యాంకు అధికారులు ఏడాదికే ఈఎంఐ చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఇలాంటి వ్యవహారాన్ని టీడీపీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెలుగులోకి తీసుకొచ్చారు. పాలకొల్లులో జగన్ ప్రభుత్వం 59 మందికి గృహాలను మంజూరు చేసింది. అయితే ఇటీవల వారికి నోటీసులు అందాయి. దీంతో బాధితులు పరుగు పరుగున బ్యాంకుకు చేరుకున్నారు. రూపాయి కడితే చాలు ఇల్లు ఇస్తామని ఈ రోజు లక్షల రూపాయలు కట్టాలంటూ నోటీసులు ఇవ్వడం ఏంటని నిలదీశారు. అయితే, ప్రభుత్వం పేదల పేరుపై బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుందని.. అది కూడా నేరుగా లబ్ధిదారుడికి చేరకుండా ప్రభుత్వ ఖాతాకు వెళ్లిందని అధికారులు వివరణ ఇచ్చారు. లబ్ధిదారులు రెండేళ్ల తర్వాత ఈఎంఐ కడతారని ప్రభుత్వం చెప్పినా.. బ్యాంకులు ససేమీరా అంటూ గడువు సంవత్సరానికి కుదించి ఏడాది ఈఎంఐలను ఒకేసారి కట్టాలని నోటీసులు పంపించారు. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో గృహ లబ్ధిదారుడు రూ. లక్షల్లో డబ్బులు చెల్లించాలని లేదంటే ఇల్లు  వేలం వేస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. ఫస్ట్ ఈఎంఐ నుంచి నోటీసులు ఇస్తే కట్టే వారమని, ఇప్పుడు నోటీసులు ఇస్తే లక్షలు ఒక్కసారే ఎలా కట్టాలని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమకు చెప్పకుండానే తమ సంతకాలు తీసుకొని తమ పేరుమీద  లోన్లు తీసుకోవడం ఏంటని బాధితులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాబు క్వాష్ పిటిషన్.. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు బుధవారం(నవంబర్8) తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. స్కిల్ కేసులో  జగన్ సర్కార్ చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ లో ఉన్న  చంద్రబాబు.. తాను ఎటువంటి తప్పూ చేయలేదనీ, తనపై కేసు రాజకీయ ప్రేరేపితమనీ, రాజకీయ కక్ష సాధింపులో భాగమని పేర్కొంటూ క్వాష్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టివేశాయి. దీంతో ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. సుప్రీంలో సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు రిజర్వ చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు బుధవారం (నవంబర్8)న వెలువడనుంది. ఈ తీర్పు పై ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు క్వాష్ ను సుప్రీం అనుమతిస్తే.. స్కిల్ కేసే కాదు.. ఆయనపై జగన్ సర్కార్ నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, ఇసుక, మద్యం పాలసీ ఇలా అన్ని కేసులూ రద్దౌతాయి. ఒక వేళ సుప్రీం కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆయన సీజేఐ ధర్మాసనాన్ని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం సీజేఐ ధర్మాసనాన్ని ఆశ్రయింస్తుందని అంటున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఏపీ సీఐడీ.. ఈ కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది.   స్కిల్ సెంటర్ల ఏర్పాటు, వాటిలో మౌలిక సదుపాయాలు, సాఫ్ట్ వేర్ వంటి అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకోలేదు. అసలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపని సీఐడీ.. స్కాం జరిగింది. ఎలా జరిగింది? చంద్రబాబు పాత్ర ఉందా లేదా? అన్నది ఆయనను అరెస్టు చేశాం కనుక ఆయనను ప్రశ్నించి రాబడతామని చెబుతోంది.  ఇలా ఉండగా న్యాయనిపుణులు మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టంగా చెబుతున్నారు.   ఇక పోతే సుప్రీంలో ఈ కేసు విచారణ సందర్భంగా.. ఆధారాలు లేకుండా కేసు పెట్టి అక్రమంగా ఆయనను అరెస్టు చేశారని ఇన్ని రోజులుగా   ప్రభుత్వ న్యాయవాదుల పసలేని వాదనతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. తొలుత అర్ధరాత్రి ఆయనను చుట్టుముట్టి అరెస్టు చేసినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కిపడ్డాయి. ఆ తరువాత తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాలలో తెలుగువారున్న ప్రతి చోటా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెయిలు తీసుకుని బయటకు రావడం కాకుండా అసలు తన అరెస్టు, తనపై కేసే తప్పని చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టు, హైకోర్టులలో క్వాష్ పిటిషన్ ను కొట్టివేసినా ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాదులు, చంద్రబాబు న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న వారంతా  ఇంత అడ్డగోలుగా  ఒక ప్రజా ప్రతినిథిని అరెస్టు చేసేయొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఆధారాలు చూపమని న్యాయస్థానం ఆదేశిస్తే.. ఆ ఒక్కటీ  అడక్కండి అన్నట్లుగా ఏపీ  సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ  వాదనలు ఉన్నాయంటున్నారు. అవినీతి జరిగింది. దానిలో  చంద్రబాబు  పాత్ర ఉందా లేదా అన్నది ఆయనను విచారించి  తెలుసుకుంటాం అన్నట్లుగా ముకుల్ రోహత్గీ చెబుతున్నారు. ఇక చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పని  సరి  అనీ  చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే  కోర్టుకు తెలిపారు. 17ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని చెబుతూ అందుకు ఉదాహరణగా పలు కేసులలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను ఉటంకించారు. పలు సందర్భాలలో హరీష్ సాల్వే వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించారు. ఒక సందర్భంలో అయితే ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని అనిపిస్తోందని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. 

తెలుగు దేశం, జనసేన కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజు! 

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. టిడిపి, జన సేన ఎన్నికల పొత్తు ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటులో నరసాపురం ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారు అనే విషయం తేలకుండానే రఘురామ కృష్ణరాజు ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.  రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున, ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు. ఈ సారి కూడా తాను ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై రఘురామరాజు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి జగన్ స్వంత డబ్బా కొట్టుకుంటున్నాడని, తన తండ్రి వైఎస్ఆర్ పేరును వాడుకుంటున్నారని విమర్శించారు. పీఎం కిసాన్ పథకానికి కూడా వైఎస్సార్ రైతు భరోసా అని పేరు పెట్టారని మండిపడ్డారు. వైఎస్సార్ రైతు భరోసా పేరును తాటికాయంత అక్షరాలతో రాసి... పీఎం కిసాన్ పేరును కనిపించీ కనిపించనట్టు ముద్రిస్తున్నారని విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్నట్టు తెలుసుకున్న కేంద్రం... రూ. 5,300 కోట్లను నిలిపివేసిందని రఘురామరాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఓవైపు ప్రధాని ఫొటో, మరోవైపు సీఎం ఫొటో వేసుకుంటే అభ్యంతరం లేదని... అలా కాకుండా ఏదో తన స్వంత జేబు నుంచి డబ్బు తీసి ఇస్తున్నట్టు ఆయన ఫొటో, ఆయన తండ్రి ఫొటో వేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

అక్కడా.. ఇక్కడా.. రెండు చోట్లానా?.. గజ్వేల్, కామారెడ్డిపై సర్వత్రా ఉత్కంఠ!

తెలంగాణ ముఖ్యమంత్రి గజ్వేల్ తో పాటు మరో నియోజకవర్గం కామారెడ్డి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుచుంటున్నట్లు ప్రకటించిన క్షణం నుంచే ఆయన గజ్వేల్ లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారా? అన్న అనుమానాలు పరిశీలకులలోనూ, రాజకీయ వర్గాలలోనూ బలంగా వ్యక్తమయ్యాయి. కామారెడ్డి ప్రజలు కోరినందునే అక్కడ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించినా ఆ అనుమానాలు నివృత్తి కాలేదు. అది వేరే సంగతి ఇక ప్రస్తుతానికి వస్తే.. కేసీఆర్ కు గజ్వేల్ లోనూ, కామారెడ్డిలోనూ కూడా గట్టి పోటీయే ఎదురైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గజ్వేల్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆయనకు గట్టి ప్రత్యర్థి అని అంటున్నారు. అలాగే కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వనున్నారని అంటున్నారు.   దీంతో కేసీఆర్ పరిస్థితి నిన్నటి దాకా ఒక లెక్క..ఇక నుంచీ మరో లెక్క అన్నట్లుగా తయారైంది. ఎన్నికల వ్యూహాలలోనూ ఎత్తుగడలలోనూ తిరుగులేదని ఇంత కాలం కేసీఆర్ విషయంలో ఆయన ప్రత్యర్థులు కూడా చెబుతూ ఉండేవారు. అయితే ఈ సారి ఎన్నికలలో మాత్రం ఆయనకే అందనంత వేగంగా కాంగ్రెస్ వ్యూహాలు ఉంటున్నాయి. ఆయన ఒక అడుగు వేసే లోగా రేవంత్ సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మూడడుగులు వేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ కూడా వ్యూహాత్మకంగా గజ్వేల్ నుంచి ఈటలను రంగంలోకి దింపడంతో రెండు చోట్లూ కూడా కేసీఆర్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అనివార్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సారి ఎన్నికలలో ఆయన రెండు నియోజకవర్గాలలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటుండటంతో.. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలపై పూర్తిగా కాన్సన్ ట్రేట్ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అంటున్నారు.   ముందుగా గజ్వేల్ నియోజవకర్గం తీసుకుంటే.. ఇక్కడ ఈటల సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు గణనీయ సంఖ్యలో ఉన్నాయి. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తో అడుగు కలిపి నడిచిన ఈటల ఈ తరువాత కేసీఆర్ సర్కార్ లో రెండు సార్లూ కూడా కీలక పదవులను నిర్వహించారు. ఈటలను మంత్రిపదవి నుంచి తప్పించిన తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నికలో  ఈటలను ఓడించేందుకు కేసీఆర్ పన్నని వ్యూహం లేదు. ఆ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకు ముందు నెలల నుంచే మొత్తం పార్టీని అక్కడ మోహరించిన కేసీఆర్ ఈటల ఓటమికి పావులు కదిపారు. వ్యూహాలు రచించారు. అయితే  ఈటల వాటన్నిటినీ తిప్పి కొట్టారు.  మంత్రులూ, ఎమ్మెల్యేలూ సీనియర్ నాయకులూ అంతా హుజూరాబాద్ లోనే తిష్ట వేసి ఈటల ఓటమి కోసం పని చేసినా ఫలితం లేకపోయింది. ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. దీంతో అప్పట్లో   ఆ గెలుపు ఈటల విజయం కంటే.. కేసీఆర్ ఓటమిగానే పరిశీలకులు అభివర్ణించారు. ఇప్పుడు అదే ఈటల గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రత్యర్థిగా నిలబడ్డారు. దీంతో హుజూరాబాద్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఇక్కడ రేవంత్ పోటీ కేసీఆర్ ను ఎందుకు గాభరాపెడుతోందో తెలుసుకోవాలంటే.. ముందుగా ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉందే. నాడు ఓటుకు నోటు కేసులో రేవంత్ ను జైలుకు పంపిన సందర్భంలోనే రేవంత్ కేసీఆర్ ను  గద్దె దింపడమే లక్ష్యమని ప్రతిన పూనారు. ఒక నాయకుడు ప్రతిన పూనినంత మాత్రాన కేసీఆర్ లాంటి బలమైన నేత కంగారుపడతారా అన్న అనుమానం రావచ్చు. కానీ తెలంగాణలో రేవంత్ బలమైన నాయకుడిగా ఎదిగారు. వరుసగా రెండు ఎన్నికలతో డీలాపడిన, అంతర్గత కుమ్ములాటలూ, వలసలతో రాష్ట్రంలో పూర్తిగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కూడగట్టడమే కాకుండా, పూర్వవైభవం సంతరించుకోవడం తథ్యమని పార్టీ శ్రేణులలో విశ్వాసం కలిగేలా చేసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రం కాంగ్రెస్ రేవంత్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి ముందు ఉనికి కోసం పాకులాడుతున్న పార్టీగా  ఉండేది. కానీ ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత మాత్రం అధికారానికి ఉరకలేసే స్థాయికి పెంచారు. పార్టీలో అంతర్గత కలహాలను నివారించారు. అసంతృప్తి జ్వాలలను చల్లార్చారు. ఈ నేపథ్యంలోనే  కామారెడ్డిలో రేవంత్ పోటీతో కేసీఆర్ విజయం నల్లేరుమీద బండి నడక అయితే కాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  దీంతో ఈ రెండు నియోజకవర్గాలలో ఫలితం ఎలా ఉండబోతోందన్న దానిపై భారీ స్థాయిలో బెట్టింగులు కూడా మొదలైనట్లు చెబుతున్నారు. కేసీఆర్ రెండు చోట్లా గెలుస్తారా.. లేక ఒక చోటా.. లేక రెండు స్థానాలలోనూ ప్రతికూల ఫలితం వస్తుందా? అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది.

తెలంగాణ ఎన్నికల్లో జనసేన 8  స్థానాలు ఖరారు

తెలంగాణ ఎన్నికల్లో బిజెపి, జనసేన కల్సి పోటీ చేస్తున్నాయి. పొత్తు, సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చి జన సేనకు 8 సీట్లు కేటాయించాలని బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి అడుగులు వేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు పొత్తులో భాగంగా ప్రస్తుతానికి ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది. మరికొన్ని స్థానాలపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులు ఇవే కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్,  తాండూరు - నేమూరి శంకర్ గౌడ్,  కోదాడ - మేకల సతీష్ రెడ్డి,  నాగర్ కర్నూలు - వంగ లక్ష్మణ్ గౌడ్,  ఖమ్మం - మిర్యాల రామకృష్ణ,  కొత్తగూడెం - లక్కినేని సురేందర్ రావు,  వైరా (ఎస్టీ) - డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్,  అశ్వారావుపేట (ఎస్టీ) - ముయబోయిన ఉమాదేవి పోటీ చేయనున్నారు.

మోడీ సభకు వస్తే నన్ను అరెస్ట్ చేస్తారు... రాజాసింగ్ ఆసక్తికర ట్వీట్ 

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రధాని సభకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. బిజెపి టికెట్ ఇచ్చినప్పటికీ అధికారికంగా సస్పెన్షన్ ఎత్తి వేయకపోవడంతో రాజాసింగ్ అలకపాన్పు ఎక్కారని ప్రచారంలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ‘బీసీ ఆత్మగౌరవ సభ’లో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొనకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవలే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేసినా ఆయన ఎందుకు హాజరుకాలేదంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. మోదీ సభ  గోషామహాల్ అసెంబ్లీ పరిధిలో వస్తుంది. గోషామహల్ ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కూడా రాజాసింగ్.అయినప్పటికీ ప్రధాని సభకు రాజాసింగ్ హాజరు కాలేదు. అంతే కాదు పలు బీజేపీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ చర్చకు ఎమ్మెల్యే రాజా సింగ్ ముగింపు పలుకుతూ ఒక వీడియోను విడుదల చేశారు.పాత కేసులు తిరగదోడి తనను ఏ క్షణాన అయినా అరెస్ట్ చేయవచ్చన్నారు. తనకు ప్రాణహాని ఉందని గన్ పెట్టి కాల్చేసినా బాధపడనని హిందూ మతం కోసం ప్రాణాలర్పిస్తానంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ఇగోకు పోయి తనను అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నినట్లు రాజాసింగ్ ఆరోపించారు. తన నియోజక వర్గంలో ఎల్బీ స్టేడియం ఉంది కాబట్టి ఆ ఖర్చంతా తనపై వేస్తారని రాజాసింగ్ అంటున్నారని వార్తలు వస్తున్నాయి. మోడీ సభకు వస్తే కెసీఆర్ అరెస్ట్ చేయిస్తాడని ఆయన ఆరోపించారు. 

ఓటర్ల జాబితాలో అక్రమాలపై నిమ్మగడ్డ పిటిషన్

ఆంధ్రప్రదేశ్ లో పాలన ఎంత అడ్డగోలుగా ఉందో అంతకు మించి ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. జగన్ మానస పుత్రిక వాలంటీర్ వ్యవస్థను ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్న జగన్ సర్కార్ వారి ద్వారా ప్రజల పర్సనల్ డేటాను సేకరించడంతో పాటు.. తమకు వ్యతిరేకులు ఎవరన్నది గుర్తించి వారి ఓట్ల తొలగింపు.. పెద్ద ఎత్తున దొంగ ఓట్ల చేర్పే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.  పయ్యావుల వంటి వారు కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల పుణ్యమా అని ఓటర్ల జాబితాలో అక్రమాలు వాస్తవమేనని తెలింది. కొందరు అధికారులపై వేటు కూడా పడింది. అయితే నిండా మునిగిన వాడికి చలేమిటన్న చందంగా ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా, ఫిర్యాదులు చేసిన కేంద్రఎన్నికల సంఘం కొరడా ఝుళిపించినా.. లెక్కేమిటన్న చందంగా జగన్ సర్కార్ అదికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. దొంగ ఓట్ల నమోదు.. ఉన్న ఓట్ల తొలగింపు ప్రక్రియా కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీలో దొంగ ఓట్లపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అన్న సంస్థను స్థాపించి ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే. గతంలో తనకు ఓటు హక్కు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లి మరీ ఓటు హక్కు పొందారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఓటు నమోదు చేయకతప్పని పరిస్థితిని ఎన్నికల సంఘం ఎదుర్కొంది.  ఇప్పుడు అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్  ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై న్యాయపోరాటానికి దిగారు.  ఏపీలో ఓట్ల అక్రమాలపై నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ గవాయి ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చినా,  జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నాట్ బిఫోర్  అనడంతో విచారణ వాయిదా పడింది.  ఏపీలో ఓటర్ల జాబితాలన్నీ పూర్తిగా వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చేతుల మీదుగా  జరుగుతున్నాయనీ, వీరంతా  వైసీపీ కార్యకర్తలేనని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఏపీలో దొంగ ఓట్లు భారీగా నమోదు చేయించారని.. దీనిపై ఏపీ ప్రభుత్వ జోక్యం విపరీతంగా ఉందనీ నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు.  ఐప్యాక్ మాజీ ఉద్యోగులతో దొంగ ఓట్లు భారీగా చేరుస్తున్నారంటూ నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఏపీలో ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలు వలంటీర్ల ద్వారా సేకించిన డేటాను ప్రొఫైలింగ్ చేస్తున్నాయని నిమ్మగడ్డ ఆరోపించారు. ఓటర్ల జాబితాల అక్రమాల కోసం   రూ.68 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని కూడా నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఓటర్ల నమోదులోగ్రామ, వార్డు వలంటీర్లను, కార్యదర్శులను భాగస్వామ్యం చేయడంపై సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.  సీజేఐ ఆదేశాలతో పిటిషన్‌ను వేరే ధర్మాసనానికి కేటాయించాలని రిజిస్ట్రీకి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. మొత్తం మీద ఓటర్ల జాబితాలో అక్రమాలపై జాతీయ స్థాయిలో అందరి దృష్టీ పడేలా చేయడంలో నిమ్మగడ్డ ప్రసాద్ సక్సెస్ అయ్యారు. 

జగనన్న వదిలిన బాణం రివర్స్!?

మనం వదిలిన బాణం.. మళ్లీ మనకే వచ్చి తగిలితే ఏమౌతుంది. ఇప్పుడు ఆదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీలో. సోమవారం (నవంబర్ 6) వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షు రాలు వైయస్ షర్మిల.. హైదరాబాద్‌లోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో..  అన్ని పార్టీల్లో దొంగలు ఉన్నారని.. కానీ వారు ముఖ్యమంత్రులు కాకూడనీ వ్యాఖ్యానించారు. అలాగే వైయస్ ఫ్యామిలీని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వైయస్ షర్మిల మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదంటూ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్‌పై ఆమె తనదైన శైలిలో స్పందించారు. నేను తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదటి రోజే.. సంబంధం లేదు అన్న  సజ్జల రామకృష్ణారెడ్డి  ఈ రోజు ఏ సంబంధముందని నా గురించి మాట్లాడుతున్నారు..మేము అయితే సంబంధం లేదనే అనుకుంటున్నాం. కానీ వాళ్లు మాట్లాడుతున్నారంటే... మళ్లీ సంబంధం కలుపుకోవాలనుకొంటున్నారా?.. సంబంధముందనా? ఏమనుకోవాలి?   సజ్జల గారే సమాధానం చెప్పాలి.. అసలు కేసీఆర్  బహిరంగంగానే సింగిల్ రోడ్డు అయితే ఆంధ్ర, డబుల్ రోడ్డు అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్రా.. వెలుగు అయితే తెలంగాణ అని చెబుతున్నారు.. దానికి ఏం సమాధానం చెబుతారు సజ్జలగారు.. ముందు మీ కథ మీరు చూసుకోండి సార్ అంటూ సాక్షాత్తూ సజ్జలకే వైయస్ షర్మిల తనదైన శైలిలో చురకలంటించారు. సజ్జల మాట్లాడితే.. జగన్ మాట్లాడినట్లే కదా అన్న విలేకరుల ప్రశ్నకు   ఎవరికైనా ఇదే సమాధానం అంటూ వైయస్ షర్మిల చాలా ఘాటుగా స్పందించారు. దీంతో వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లో   వైరల్ అవుతున్నాయి. గాభరా పెడుతున్నాయి.   నాడు వైయస్ షర్మిల.. జగనన్న వదిలిన బాణాన్నంటూ  సోదరుడు   జగన్ కోసం పాదయాత్ర చేశారు.. ఆ తర్వాత  జగన్ అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు ఆమె  అలుపెరగని పోరాటమే చేశారు.  జగన్ ముఖ్యమంత్రి కాగానే ..  సోదరిని   పక్కన పెట్టేశారని.. దీంతో ఆమె తన తల్లితో కలిసి పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్లిపోయి... వైయస్ఆర్ తెలంగాణ పేరుతో పార్టీని స్థాపించి.. తన రాజకీయం తాను చేసుకొంటున్న సంగతి తెలిసిందే.  అయితే 2024, మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్నాయని.. ఈ ఎన్నికల వేళ  జగన్ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లి ప్రచారం చేసే వారు ఎవరనే ఓ సందేహం అయితే వైసీపీలో బలంగా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ పార్టీకి 151 సీట్లు వచ్చాయంటే.. అందులో తల్లి విజయమ్మ,  సోదరి షర్మిల కష్టంతోపాటు ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ మంత్రాంగం ఉందనీ.. అయితే ఇప్పుడు జగన్ కు  తల్లి  విజయమ్మ కానీ..  సోదరి  షర్మిల కానీ ఆయన వెంట లేరని పార్టీ వర్గాలే అంటున్నాయి. అదే సమయంలో  ఎన్నికల్లో  వైసీపీ  తరపున ప్రచారానికి జగన్ తొలి, మలి కేబినెట్‌లోని మంత్రులు వెళ్లితే.. పార్టీకి పడేవి ఓట్లు కావు.. రాళ్లు అనే  చర్చ కూడా వైసీపీలోనే మొదలైందని అంటున్నారు. అలాగే ప్రశాంత్ కిషోర్ ఎలాంటి స్కెచ్ గీసినా.. ఇప్పటికే కోడి కత్తి గాటు, బాబాయి గోడ్డలి పోటు వ్యవహారం పార్టీ అధినేత  జగన్ ఫ్యామిలీకి చుట్టుకోవడంతో.. లేని నొప్పులన్నీ లేచి వచ్చినట్లు అయిందంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో నమ్మకం కలిగించడానికి  విజయమ్మ,   షర్మిలల ఆవశ్యకత ఉందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ తాజాగా సీఎం   జగన్‌పైన, ప్రభుత్వ సలహాదారు సజ్జలపైన వైయస్ షర్మిల చేసిన కామెంట్స్‌తో.. పార్టీ విజయం తర్వాత సంగతి.. అసలు పార్టీ కోసం ప్రచారం చేసేవారెవరన్న ఆందోళన వైసీపీలో వ్యక్తం అవుతోందంటున్నారు. పైపెచ్చు షర్మిల ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ తరఫున రంగంలోకి దిగినా, ప్రచారం చేసినా మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన కూడా వైసీపీలో కనిపిస్తోంది. 

జగన్ అవే మాటలు.. జనం అదే పరుగులు?!

‘నాకు మీడియా సంస్థలు లేవు.. ఎల్లో మీడియా సపోర్ట్ లేదు. నాకెవరితో పొత్తు లేదు. మీ అందరి దీవెనలు.. ఆ దేవుని దయ చాలు.. నేనెవరినీ సపోర్ట్ చేయమని అడగను. మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్ని మాత్రమే.. మీ బిడ్డకు మీరు ఉన్నారు.. మీ సపోర్టు ఉంది.’ ఈ ప్రసంగం ఎవరిదో మళ్ళీ విడమర్చి చెప్పాల్సిన పనిలేదు. కార్యక్రమం ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా మైకు దొరికితే సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి నుండి వచ్చేమాటలివే. తాజాగా పుట్ట‌ప‌ర్తిలో వైఎస్సార్ రైతు భ‌రోసా నిధులు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. అదే ఊకదంపుడు స్పీచ్ ఇచ్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకమేమీ కొత్తది కాదు. అది కూడా ఎన్నికలకు ముందు చెప్పేది ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట. కేంద్రం కిసాన్ యోజన పథకాన్ని కూడా ఇందులో కలుపుకొని పథకాన్ని అమలు చేస్తున్నారు. సరిగ్గా ప్రతిసారి కేంద్రం నిధులు విడుదల చేసే సమయంలో ఇక్కడ జగన్ ఏదో ఒక జిల్లాలో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి భారీ బహిరంగ కార్యక్రమం ఏర్పాటు చేసి బటన్ నొక్కుతారు. పీఎం కిసాన్ నిధులైతే జమవుతాయి కానీ.. వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు.  ఒక్క రైతు భరోసా కార్యక్రమం మాత్రమే కాదు..  ప్రతి కార్యక్రమాన్నీ అలాగే అమలు చేస్తారు. ప్రతి పథకాన్ని విడతల వారీగా ఇవ్వడం, ప్రతి విడతకి కోటాను కోట్లు ఖర్చు చేసి పబ్లిసిటీ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. మంగళవారం పుట్టపర్తిలో నిర్వహించిన కార్యక్రమం కూడా అంతే. రైతు భరోసా ఈ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్ బటన్ నొక్కి చెప్పారు. రైతుల ఖాతాలలో నగదు జమ చేసినట్లు చెప్పారు. కానీ, పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలలోకి వచ్చాయి తప్ప భరోసా డబ్బు ఇంకా రాలేదు. రోజు వారీ పన్నుల వసూళ్లలో కొంత భాగాన్ని ఈ రైతు భరోసాకు విడతల వారీగా ఖాతాలలో చెల్లించనున్నారు. అంత దానికి ఓ బహిరంగ కార్యక్రమం.. అందులో మళ్ళీ అదే విమక్షంపై విమర్శలు. దీనిని చూస్తే పార్టీ ప్రచారం కోసం వైసీపీ సర్కార్ ఎంతగా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వాడేస్తోందో అర్ధమవుతుంది.  ఇక ఇక్కడ జగన్ ప్రసంగం విషయానికి వస్తే  చంద్రబాబు హయంలో స్కాంలే తప్ప స్కీమ్‌లు లేవు. బాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం, ఫైబర్‌ గ్రిడ్‌ స్కాం, మద్యం, ఇసుక దందా ఇలా అన్నీ స్కామ్‌లే. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాంలే. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. ఏపీని దోచుకునేందుకు చంద్రబాబుకు పదవి కావాలి అంటూ ఆరోపించారు. ఇక, త‌న‌కు అసలు అబద్ధాలు చెప్పడం రాదని.. అందరికీ మంచి చేయడం మాత్రమే తెలుస‌ని తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. గెలవడానికి దత్తపుత్రుడి సాయం, ఎల్లో మీడియా సపోర్టు అవసరం లేదు.. పైన దేవుడు, మీ అందరి ఆశీస్సులు మీ బిడ్డ నమ్ముకుంది. మీ బిడ్డకు మీరు ఉన్నారు. మీ సపోర్టు ఉందంటూ ఎమోషనల్ బాండింగ్ కలర్ ఇచ్చారు. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మోసాలు, అబద్దాలు ఎక్కువగా ఉంటాయని.. వాటిని నమ్మకండి. బంగారం, కార్లు ఇస్తామన్నా అబద్దాలేన‌ని చెప్పుకొచ్చారు.   అయితే, కొత్తగా జగన్ స్పీచ్ వస్తే సోషల్ మీడియాలో పండగే అవుతుంది. జగన్ మాట్లాడిన ప్రతి మాటను అటు ప్రతిపక్షాలు, మీమర్లు ఏకిపారేస్తుంటారు. ఈ పుట్టపర్తిలో స్పీచ్ కూడా అంతే. మీడియా సపోర్ట్ లేదంటూ జగన్ మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్న నెటిజన్లు మీ ఆవిడ భారతీ ఎండీగా ఉన్న మీడియా సంస్థ ఎవరిది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక, చంద్రబాబుపై అన్నీ స్కాంలే అని మాట్లాడిన జగన్ ఒక్కదానికి సంబంధించైనా ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదని, అసలు 3041 సార్లు అక్రమ కేసులలో కోర్టు వాయిదాలకు హాజరు కాని జగన్.. చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల గురించి మాట్లాడడం విడ్డురంగా ఉందంటూ నెటిజన్లు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. మీ బిడ్డకు అందరి దీవెనలు అంటూ.. మా బిడ్డలను పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లేలా చేసిన సీఎం జగన్ అంటూ కొందరు, ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మోసాలు, అబద్దాలు ఎక్కువగా ఉంటాయని.. బంగారం, కార్లు ఇస్తామన్నా నమ్మొద్దని కోరడం చూస్తుంటే తన గురించి తానే ప్రజలకు హింట్ ఇచ్చినట్లుగా ఉందని మండిపడుతున్నారు. ఇక జనం కూడా జగన్ ప్రసంగం ప్రారంభించగానే.. ఇదెక్కడి గొడవరా బాబూ అన్నట్లుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం కనిపించింది. పోలీసులు అడ్డుకున్నా వారు ఖాతరు చేయలేదు. జగన్ ప్రసంగం కొనసాగుతుండగానే సభ సగానికి పైగా ఖాళీ అయిపోయింది. జగన్ స్పీచ్ అంటేనే జనం పరార్ అన్న సెటైర్లు సామాజిక మాధ్యమంలో జోరుగా వైరల్ అవుతున్నాయి.