భట్టి విక్రమార్కకే తెలుగుదేశం జై!

మధిర నియోజకవర్గ తెలుగుదేశం శ్రేణులు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి  మల్లు భట్టివిక్రమార్కకే జై కొట్టారు. ఈ మేరకు దెందుకూరు శ్రీరస్తు కళ్యాణ మండపంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మధిర లో పోటీచేస్తున్న మల్లు భట్టి విక్రమార్కకు  మద్ధతు యిచ్చి ఆయన గెలుపుకు సంపూర్ణ సహకారం అందించాలని మధిర నియోజకవర్గ తెలుగుదేశం మండలపార్టీ నాయకులు, గ్రామ శాఖ నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. తెలుగుదేశం తెలంగాణ ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం అధ్యక్షతన నియోజకవర్గ మండలాధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ కమిటీ, వార్డు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తల  ఆత్మీయ సమ్మేళనం బుధవారం (నవంబర్ 15) జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో   ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణాలో తెలుగుదేశం  ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనీ, ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే మల్లు భట్టి విక్రమార్కకు  సంపూర్ణ మద్ధతు యిచ్చి అధిక మెజారిటీ తో  గెలిపించాలని తీర్మానించినట్లు డాక్టర్ రామనాథం  చెప్పారు.  నాయకులు, కార్యకర్తల అభీష్టానికి అనుగుణంగా భట్టి విక్రమార్క గెలుపుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందన్నారు.   మధిర, బోనకల్, చింతకాని, ముదిగొండ, ఎర్రుపాలెం మండలాధ్యక్షులు  ఐటిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రచార కార్యదర్శి యలమంచిలి శివ, మధిర టౌన్ టిడిపి కార్యదర్శి చెరుకూరి కృష్ణారావు, వంగాల రామకోటి మేడేపల్లి రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఈ సందర్భంగా తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలుగుదేశం నేతలకు, శ్రేణులకు భట్టి విక్రమార్క కృతజ్ణతలు తెలిపారు. తాను విలువలతో కూడిన  రాజకీయాలు చేస్తానని, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో కూడిన నియోజకవర్గ స్థాయి, మండలస్థాయి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని, కమిటీ నిర్ణయం ప్రకారం అభివృద్ధి పనులు చేసుకుందామని అన్నారు.   మధిరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజి, అవుటర్ రింగ్ రోడ్, రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషిచేస్తానని హామీ యిచ్చారు.తెలుగుదేశం పార్టీ మొదటినుంచి తనను కూడా   కుటుంబసభ్యునిగా చూస్తున్నదని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ పరిస్థితి అంటే తెలుగుదేశం కాంగ్రెస్ కు మద్దతు నివ్వడం ఒక్క మధికకే కాకుండా రాష్ట్రం అంతటా కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బిటెక్ రవి అరెస్ట్...14 రోజుల రిమాండ్ 

జగన్ ప్రభుత్వం ప్రతి పక్ష నేతలను టార్గెట్ చేసుకుని అరెస్ట్ ల పర్వం ప్రారంభించింది. ఇటీవల పులివెందులలో టిడిపి నేతలను అరెస్ట్ చేసిన జగన్ ప్రభుత్వం తాజాగా బీటెక్ రవిని అరెస్ట్ చేసింది ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో బీటెక్ రవి అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. బెయిలబుల్ సెక్షన్ లను నాన్ బెయిలబుల్ సెక్షన్ లు గా మార్చిన ఘనత ఎపి పోలీసులకు దక్కింది. పది నెలల క్రితం కడప విమానాశ్రయం వద్ద పోలీసులతో వాగ్వాదం, ఆందోళన చేపట్టిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత బిటెక్‌ రవి కడప కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైడ్రామా మధ్య మంగళవారం అర్ధరాత్రి ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వ్యక్తిగత పనిమీద మంగళవారం సాయంత్రం పులివెందుల నుంచి కడప వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించిన అనంతరం కడపలో జడ్జి ఎదుట హాజరుపరిచారు. దీంతో బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.  ఇదిలావుండగా బిటెక్‌ రవి అరెస్టుపై కడప డీఎస్పీ షరీఫ్‌ వివరాలు వెల్లడించారు. విమానాశ్రయం వద్ద జరిగిన తోపులాటలో తమ ఏఎస్‌ఐకి గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి కేసు నమోదు చేశామని, బీటెక్‌ రవి అందుబాటులో లేకపోవడంతో  అరెస్టు చేసినట్టు వివరించారు. పులివెందులలో ‘యువగళం పాదయాత్ర’ ప్రారంభానికి 2 రోజుల ముందు జనవరి 25న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఆహ్వానం పలికేందుకు బిటెక్ రవి కడప విమానాశ్రయానికి వెళ్లారు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, రవి అనుచరులు తరలి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి వీల్లేదని చెప్పిన పోలీసులతో బిటెక్ రవి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట, ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. పాత కేసులను తిరిగి తోడి టిడిపి నాయకులు, కార్యకర్తలను వేధించడం వైసీపీ ప్రభుత్వం ఆనవాయితీగా పెట్టుకుంది. 

పాలకొల్లులో  ఉద్రికత్త... దేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్ట్  

పాలకొల్లులో తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. టిడ్కో ఇళ్ల వద్ద వంటా వార్పు, పాలకొల్లును చూడు పేరుతో నిరసనకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. అయితే బుధవారం ఎమ్మెల్యే రామానాయుడిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.. రామానాయుడు ఇంటి దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. ఎమ్మెల్యే బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు.అధికార ప్రతిపక్ష నేతల నిరసనల ప్రదర్శనలతో పాలకొల్లులో ఉద్రిక్తత నెలకొంది.. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో పోలీసులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును  అరెస్టు చేశారు. బుధవారం పాలకొల్లు చూడు పేరుతో ఎమ్మెల్యే నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పెంకిళ్లపాడు టిడ్కో గృహాల వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. దీనికి పోటీగా వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇంజార్జ్ గొడాల గోపి కూడా నిజం చెబుతాం పేరుతో కార్యక్రమం చేపట్టారు. దీంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.. పెంకిళ్లపాడు వెళ్లే క్రమంలో అంబేడ్కర్ విగ్రహం వద్దకు ఎమ్మెల్యే చేరుకున్నారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి ఎమ్మెల్యే కింద పడ్డారు. అనంతరం ఎమ్మెల్యే రామానాయుడును అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయనను భీమవరం వైపు తీసుకెళ్లారని టీడీపీ కార్యకర్తలు తెలిపారు.రామానాయుడు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడికి వచ్చిన టీడీపీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిమ్మల రామానాయుడు టిడ్కో ఇళ్ల దగ్గరకు వెళతారని ఊహించి ముందుగానే అరెస్ట్ చేశారు. ఆయన్ను అరెస్ట్ చేయకుండా టీడీపీ, జనసేన శ్రేణులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదా, తోపులాట జరిగింది. టీడీపీకి మద్దతుగా జనసేన నాయకులు నిలిచారు. వైఎస్సార్‌సీపీ ఆందోళనకు అనుమతి ఇచ్చి, తమకు అనుమతి ఇవ్వలేదని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 ప్రియాంక, కేజ్రీవాల్ కు ఈసీ నోటీసులు 

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు చేసినందుకు గాను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. మోదీపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసినందుకు తమకు ఫిర్యాదు అందిందని, అందుకు సమాధానం చెప్పాలని ప్రియాంకకు పంపిన ఆదేశాల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోని సేవర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  ఈ ఫిర్యాదు వచ్చింది.  “ఒక సీనియర్ నేత, అది కూడా ఒక జాతీయ పార్టీ స్టార్ క్యాంపెయినర్ చెప్పే మాటలు నిజమని ప్రజలు నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో రుజువులు లేకుండా మాట్లాడటం సరికాదు. వాస్తవిక ప్రాతిపదికను కలిగి ఉండాలి’’ అని బిజెపి పేర్కొంది. నవంబర్ 16  రాత్రి ఎనిమిది గంటల్లోపు  కారణాన్ని తెలియజేయాలని ఎన్నికల సంఘం  ప్రియాంక గాంధీకి నోటీసులో పేర్కొంది.  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి కూడా ఇదే తరహా నోటీసులు జారీ అయ్యాయి.ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై గురువారంలోగా జవాబివ్వాలని అరవింద్ కేజ్రీవాల్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసుల్లో ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా ఆప్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో  అనైతిక వీడియో క్లిప్‌లను పోస్ట్ చేశారని బీజేపీ ఆరోపణ  చేసిన విషయం తెలిసిందే.

ఊపందుకున్న ఎన్నికల ప్రక్రియ... నేటి నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీ 

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. మరో 15 రోజుల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే.. ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారి పోలింగ్‌ కేంద్రం, బూత్‌ల వివరాలతో కూడిన చీటీల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. ఇవాళ్టి(నవంబర్ 15) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ స్లిప్పుల పంపిణీ చేయనున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రాసెస్ జోరందుకుంది. బుధవారం నుంచి రాష్ట్రంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ చేపట్టనున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ఈ నెల 23 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3న కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు ఈసీ వెల్లడించింది. తెలంగాణతో పాటు మిజోరాం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మిజోరాంలో ఇప్పటికే పోలింగ్ పూర్తవగా.. ఛత్తీస్ గఢ్ లో మొదటి దశ పోలింగ్ పూర్తయింది. ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో మొత్తం 3,26,18,205 ఓటర్లు, ఇందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది స్త్రీలు, 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 15,406 మంది, విదేశాలలో ఉంటున్న 2,944 మంది కూడా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,99,667 మంది యువ ఓటర్లు ఉండగా.. ఇందులో 90 శాతం మంది తొలిసారిగా ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో నామినేషన్ దాఖలు గడువు ఇప్పటికే ముగియగా.. బుధవారం (నవంబర్ 14)  తో ఉపసంహరణ గడువు కూడా ముగుస్తుంది. స్క్రూటినీ తర్వాత అసెంబ్లీ ఎన్నికల బరిలో 4,798 నామినేషన్లు నిబంధనల మేరకు ఉన్నాయని ఈసీ అధికారులు ప్రకటించారు. ఇందులో అత్యధికంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో 86 మంది నామినేషన్ వేసి బరిలో నిలిచారు. అత్యల్పంగా నారాయణ పేటలో ఏడుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. మేడ్చల్‌లో 67 మంది, కామారెడ్డిలో 58 మంది, కొడంగల్‌లో 15 మంది బరిలో ఉన్నారు.

18న తెలంగాణలో అమిత్ షా ఎన్నికల ప్రచారం

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. అదే రోజున సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ తర్వాత నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్‌లలో నిర్వహించే సభలలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.   తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. అగ్రనేతలను ప్రచార బరిలోకి దింపుతోంది. దీపావళి పండుగ తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ ఇప్పటికే చెప్పింది. అందులో భాగంగానే  అమిత్ షా  ఈనెల 18 తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నిజానికి 17న అమిత్‌ షా తెలంగాణకు రావాల్సి ఉండగా ఒకరోజు ఆలస్యంగా షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకేరోజు నాలుగు ప్రాంతాల్లో సభలు, రోడ్‌షోలతో కేంద్ర హోంమంత్రి పాల్గొననున్నారు. 18న ఉదయం 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న అమిత్‌ షా అక్కడి నుంచి  గద్వాలలో,  నల్గొండ సభల్లో, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయనున్నారు. అదే రోజు  హైదరాబాద్‌కు చేరుకుని జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం  ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ఎన్నికల ప్రచార సభలు, రోడ్‌ షోలతో బీజేపీ స్పీడ్ పెంచింది.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ , ఆయన కుమారుడిపై హత్యాయత్నం కేసుల నమోదు

బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడిపై కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి బీఎస్పీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ ఘర్షణ నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. కాగజ్‌నగర్ పోలీసులు తనపైనా, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ స్కాలర్ అయిన తన కుమారుడితోపాటు పార్టీలోని మరో 11 మంది సీనియర్ సభ్యులపైనా హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప కనుసన్నల్లోనే ఈ కేసులు నమోదయ్యాయని ఆయన ఆరోపించారు.ఎమ్మెల్యే వాహనం నుంచి తాను రూ. 25 వేలు దొంగిలించానని, ఆయన డ్రైవర్ ఫిర్యాదు చేశాడన్నారు. ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, అందులోనూ 26 ఏళ్లు ఎటువంటి మచ్చలేకుండా సేవ చేసిన అధికారి రూ. 25 వేలు దొంగతనం చేస్తాడా? అని ఆర్ ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు.  కేసీఆర్ దుష్పరిపాలనకు ఇదో మచ్చుతునక అని విమర్శించారు. ఇలాంటి తప్పుడు కేసులు తనను భయపెట్టలేవని, నీతితప్పిన బీఆర్ఎస్ పాలన నుంచి సిర్పూరును విముక్తి చేసే వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. ‘బీఆర్ఎస్, బీజేపీ కూటమి’ కుట్రల నుంచి తెలంగాణను కాపాడతానని శపథం చేశారు.

తెలంగాణలో 608 నామినేషన్ల తిరస్కరణ 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 4798 మంది అభ్యర్థులు 5716 నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల పరిశీలనలో 608 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి, హుజూరాబాద్‌లో ఈటల జమున నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. అత్యధికంగా 7 నియోజకవర్గాల్లో బిఎస్ పి అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. రేపటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది.  తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసిన దరిమిలా.. తదనంతర ఘట్టం కూడా పర్తయ్యింది. అదేనండీ.. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు.  నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి కె.జానారెడ్డి, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ భార్య జమున వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల పరిశీలన పూర్తవగా.. నెల 15వ తేదీ వరకు నామినేషణ్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ రోజు సాయంత్రంలోపు ఎన్నికల బరిలో ఎవరు ఉన్నారు.. ఎవరు తప్పుకున్నారు అనే అంశంపై, అభ్యర్థుల వివరాలపై క్లారిటీ వస్తుంది. 

  టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే...

టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన పాలకమండలి మంగళవారం(నవంబర్ 14) తిరుమలలో భేటీ అయింది. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. 114 జీవో ప్రకారం అర్హులైన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని పాలకమండలి నిర్ణయం తీసకుంది. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంపై ఈ సమావేశంలో చర్చించారు.    ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. అలిపిరి గోశాల వద్ద ఈ నెల 23 నుంచి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నారు. టీటీడీ పర్మినెంటు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా రూ.6,850 ఇవ్వనున్నారు. పప్పు దినుసులు, చక్కెర, నెయ్యి నిల్వ చేసేందుకు అలిపిరి వద్ద మరో గోదాం నిర్మించాలని నిర్ణయించారు. కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.15.54 కోట్ల మంజూరు చేసేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. తిరుమల నడకదారుల్లో వన్యమృగాల నుంచి భక్తుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భద్రతా పరికరాల కొనుగోలుకు రూ.3.5 కోట్ల మంజూరుకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది.

నడకదారిలో చిరుత కలకలం 

 తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో  కాలి నడకన వెళ్లడానికి భక్తులు జంకుతున్నారు. మంగళవారం (నవంబర్ 14)మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తున్నది. కడప జిల్లాలోని పులివెందులకు చెందిన కొంతమంది భక్తులు రోడ్డు దాటుతుండగా చిరుత పులి సంచారాన్ని గుర్తించారు. దీంతో విషయాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కాలినడక భక్తులను అధికారులు గుంపులుగుంపులుగా అనుమతిస్తున్నారు. వాటర్‌ హౌస్‌ వద్ద సెక్యూరిటీ సిబ్బంది భక్తులను నిలిపి బ్యాచులుగా పంపుతున్నారు. కాగా, మరోసారి చిరుత సంచారంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. గత ఆగస్టులో నెల్లూరు జిల్లాకు చెందిన మూడేండ్ల చిన్నారి లక్షితపై చిరుత పులి దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో లక్షిత మృతి చెందింది. అంతకు ముందు మరో బాలుడిపై కూడా చిరుత దాడి చేసింది. అయితే ఆ సమయంలో ఆ బాలుడి కుటుంబ సభ్యులు పెద్దగా అరవడంతో బాలుడిని కొద్ది దూరం తీసుకెళ్లి చిరుత వదిలి వెళ్లింది. దీంతో చిరుత పులలను బంధించేందుకు అటవీ, టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు. చిరుతల కదలికలున్న మార్గాల్లో సీసీటీవీ కెమెరాలు, బోన్లను ఏర్పాటు చేసి వాటిని బంధించిన సంగతి విధితమే. అయితే తాజాగా మరో చిరుతపులి కన్పించడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్ల మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.  అధికారులకు సమాచారం అందగానే  అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులను గుంపులుగా అనుమతించాలని నిర్ణయించారు. ఒంటరిగా వెళ్లే భక్తులపై చిరుత దాడి చేసే అవకాశం ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది వాటర్ హౌస్ వద్ద భక్తులను ఆపుతున్నారు. గుంపులు గుంపులుగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. 

ఇదేమిటబ్బా..!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్టోబర్ 11న అంటే శనివారం ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది.  గత వారం రోజులుగా ఆయన గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ క్రమంలో విశాఖపట్నంలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకోవడం.. అందులోభాగంగా.. మెరుగైన వైద్య చికిత్స కోసం.. పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తరలించాలని సదరు ఆసుపత్రి వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని భాగ్యనగరానికి తరలించారు. కానీ ఇక్కడే వచ్చి పడింది అసలు చిక్కంతా అనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.  జగన్ గద్దెనెక్కిన తర్వాత.. మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకు వచ్చారు. ఆ క్రమంలో విశాఖపట్నం రేపోమాపో రాజధానిగా కొలువు తీరనుందని.. అలాంటి రాజధాని నగరంలో విద్య, వైద్యం, రవాణా తదితర సౌకర్యాలన్నీ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలని.. కానీ విశాఖపట్నంలో మెరుగైన వైద్యం లేదంటూ బొత్సకు వైద్య పరీక్షల నిర్వహించిన వైద్యుల  ద్వారా అవగతమవుతోందని.. అందుకే ఆయనను పక్కా రాష్ట్రం హైదరాబాద్ తరలించారనే విషయం స్పష్టమవుతోందనే ఓ చర్చ జోరందుకుంది.  ఇక రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్  కార్యక్రమం, జగనన్న ఆరోగ్య సురక్షా పథకం అమల్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. జగన్ పాలనలో అన్ని రంగాంల్లో రాష్ట్రం దూసుకు పోతున్నదని వైసీపీ మాజీలు, తాజా మంత్రులే కాదు.. ఆ పార్టీలోని కీలక నాయకులు సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు మీడియా ముందుకు వచ్చి ఢంకా బజాయించి మరీ చెబుతుంటారు. మరి విశాఖపట్నంలో వైద్య సేవలు అంత బావుంటే.. మంత్రివర్యులు ప్లస్ ఉత్తరాంధ్ర కింగ్ బొత్స ఇలా హైదరాబాద్‌కు వెళ్లి ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాల్సి వచ్చిందనే  ప్రశ్న సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. నెటిజనులు బోత్స సత్యనారాయణతో పాటు జగన్ సర్కార్ ను కూడా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.    గతంలో కరోనా సమయంలో సైతం జగన్ కేబినెట్‌లోని పలువురు మంత్రులు వారి కుటుంబాలు   హైదరాబాద్ తరలి వెళ్లి ఆక్కడ కరోనా చికిత్స తీసుకున్నాయి.. ఇంకా  స్పష్టంగా చెప్పాలంటే.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును..  హైదరాబాద్  కు ఎయిర్ లిఫ్ట్  చేసి మరీ వైద్యం అందించారని.. అంత దాకా ఎందుకు ఇటీవల మంత్రి పినిపే విశ్వరూప్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారండతో.. ఆయన్ని బొంబాయి తరలించారని.. నెటిజనులు గుర్తు చేస్తున్నారు.     అయినా రేపోమాపో విశాఖ రాజధాని కానుందని వైసీపీ అగ్రనేతలు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు విశాఖ కేంద్రంగా మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదనే సందేహాలు   పోలిటికల్ సర్కిల్‌లో  వ్యక్తమౌతున్నాయి. మరోవైపు విశాఖపట్నానికి ప్రస్తుతం ఇన్‌చార్జి మంత్రిగా వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీ ఉన్నారని.. మరి బోత్స వ్యవహారంపై ఓ బాధ్యత కలిగిన ఆదే శాఖకు చెందిన మంత్రిగా..  ఆమె ఏం సమాధానం చెబుతారని నెటిజనులు నిలదీస్తున్నారు. ఇంకో వైపు కరోనా సమయంలో.. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ గుర్తున్నాయనీ, ఇంకా వివరంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని కరోనా బాధితులు   చికిత్స కోసం తెలంగాణలోని హైదరాబాద్‌కు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేశారని.. కానీ  అక్కడి కేసీఆర్ ప్రభుత్వం వారిని తెలంగాణ భూభాగంలో అడుగు పెట్టనివ్వలేదని.. అలాంటి సంఘటనల జరిగిన దృష్ట్యా.. మనం, మన రాష్ట్రం అన్ని రంగాల్లో కాకుంటే.. కనీసం వైద్య ఆరోగ్య రంగంలో అయినా గణనీయ ప్రగతి సాధించి ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది అనారోగ్య జీవులు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు పరుగులు తీసే పరిస్థితి ఉండేది కాదు కదా అంటున్నారు. ఈ కనీస  అవగాహన  వైసీపీ సర్కార్ కు, ఆ ప్రభుత్వంలోని మంత్రులకు  లేక పోవడం నిజంగా సిగ్గుచేటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదీ ఏమైనా.. రాష్ట్రంలో అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం  రకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ప్రముఖ ఆసుపత్రులు ఉన్నాయని.. వాటిని విస్మరించి.. ప్రజాప్రతినిధులు ఇలా పక్క రాష్ట్రం హైదరాబాద్ వెళ్లి చికిత్స చేయించుకోవడంతో.. ఆ తర్వాత ఆ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన కీలక నేతలు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, పువ్వాడ అజేయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ఆ రాష్ట్ర అభివృద్ధిపై వివిధ సభల్లో వెటకారం,  హేళనగా మాట్లాడడం.. వారికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో మళ్లీ జగన్ కేబినేట్‌లోని బొత్స లాంటి వారు.. ప్రెస్ మీట్ పెట్టి  కౌంటర్ ఇవ్వడం రివాజుగా మారిపోయిందని.. అయినా బొత్సలాంటి వారు వైద్యం కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లడం వంటి సంఘటనలు చూస్తుంటే ఏపీ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలలో తప్పేముందని అనిపించక మానదని పరిశీలకులు చెబుతున్నారు. 

బస్సు యాత్ర కూడా తుస్సు.. వైసీపీ పుట్టి మునగడం ఖాయం!

ఏపీలో అధికార  వైసీపీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది.  అధికార పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా సూపర్ సక్సెస్ కావాలి. ఎందుకంటే మందీ మార్బలం, అధికారం యంత్రాంగం అన్నీ  చేతిలోనే ఉంటాయి కనుక ఏదో ఒక మార్గంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవచ్చు. కానీ, వైసీపీ అన్నీ ఉన్నా తన కార్యక్రమాలను సక్సెస్ చేసుకోలేకపోతున్నది. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది అన్నది సుస్పష్టం. ఆ అసంతృప్తి, ఆ ప్రజాగ్రహమే  ఇప్పుడు వైసీపీ కార్యక్రమాలపై ప్రతిబింబిస్తోంది. ఇప్పటికే వైసీపీ పలు కార్యక్రమాలు తలపెట్టగా ఒక్కటీ ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు వైసీపీ రెండు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అందులో ఒకటి సామాజిక బస్సు యాత్ర కాగా, మరొకటి  ఏపీకి మళ్ళీ జగనే ఎందుకు కావాలి. రెండో కార్యక్రమం పూర్తిగా రెవెన్యూ అధికారులు, ఉద్యోగులను నిర్వహించాలని అధికార పార్టీ నిర్ణయించి, ఆ పని వారికి అప్పగించింది.  బస్సు యాత్ర మాత్రం గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకూ అందరూ పాల్గొనాలని జగన్ ఆదేశించారు. కానీ, బస్సు యాత్రకు కార్యకర్తలు కూడా మొహం చాటేస్తున్నారు. ఎక్కడిక్కడ నలుగురు నేతలతో ఈ కార్యక్రమాన్ని మమ అనిపిస్తున్నారు. అనిపిస్తున్నారనే కంటే జనం, పార్టీ క్యాడర్, నాయకులు కూడా మోహం చాటేస్తుండటంతో మమ అనిపించడం తప్ప పార్టీ నేతలకు మరో మార్గం, గత్యంతరం లేని పరిస్థితి అని చెప్పడమే కరెక్ట్ అని పరిశీలకులు అంటున్నారు.  ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైసీపీ పెద్దలకు కూడా తెలుసు. కానీ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. ప్రజలకు ఇంత చేశాం చేశాం.. అంత చేశాం.. ఇన్ని సొమ్ములు పందేరం చేశాం.. ఇక మాకు తమకు తిరుగే ఉండదని చెప్పుకుంటున్నారు. అయితే పార్టీ పరంగా చేపడుతున్న ఏ కార్యక్రమమూ  సక్సెస్ కావడం లేదు. సక్సెస్ సంగతి పక్కన పెడితే అట్టర్ ప్లాప్ అవుతోంది. గడపగడపకూ కార్యక్రమమే ఇప్పటి వరకూ అందుకు ఉదాహరణగా ఉండగా,  ఇప్పుడు కీలక నియోజకవర్గాల్లో చేపట్టిన బస్సు యాత్ర పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇప్పటికే పలు అంతర్గత సర్వేలు పార్టీ హై కమాండ్ ను కలవర పెడుతున్నాయి.  ఇటీవలి రాజకీయ పరిణామాలు కూడా వైసీపీ గ్రాఫ్ పాతాళానికి పడిపోయేలా చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు పూర్తిగా జగన్ కక్షసాధింపుగానే ప్రజలు చూస్తున్నారు. వరసపెట్టి ఆరు కేసులు నమోదు చేయడం కూడా దురుద్దేశపూర్వకమేనని ప్రజలు నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు.   దీంతో అసలే తగ్గిన ప్రభుత్వ గ్రాఫ్ ను చంద్రబాబు అరెస్ట్ మరింత దిగజార్చి పూర్తిగా అదఃపాతాళానికి పడిపోయేలా చేసింది. నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ ప్రజా అవసరాలను గాలికి వదిలేసి రాజకీయ అంశాలకే ప్రాధాన్యమిచ్చారన్న టాక్ ఉంది. దీనిని నిజం చేస్తున్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేసేవారు. చంద్రబాబు విషయంలో కూడా వైసీపీ నేతలు అదే అత్యుత్సాహం ప్రదర్శించారు. వరసబెట్టి అందరూ చంద్రబాబు దోషి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. అయితే జనం వారి మాటలను పట్టించుకోలేదు. జగన్ రాజకీయ కక్షసాధింపు అని నిర్ణయానికి వచ్చేశారు.   ఫలితంగా ఇప్పుడు వైసీపీ పరిస్థితి పూర్తిగా చతికిలా పడిపోయింది. పోనీ పార్టీ అధినేత జగన్  అయినా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారా ? అంటే అదీ లేదు. తాను తాడేపల్లి ప్యాలెస్ దాటి  బయటకు రావడం లేదు. ఒక వేళ వచ్చినా పరదాల చాటునే ఉంటున్నారు. చివరాఖరికి సొంత నియోజకవర్గంలో కూడా  జనం నిరసనల కారణంగా మొహంచాటేసిన పరిస్థితి ఇటీవల పులివెందులలో ఎదురైంది. దీంతో ఆయన తన పని బటన్లు నొక్కడం మాత్రమేననీ, మిగిలినదంతా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులే చూసుకోవాలని చెప్పేసి చేతులెత్తేశారు.  మీరే నా నమ్మకం.. మీరే నా సైన్యం.. మీ దీవెనలే నా ఆశీస్సులు అంటూ ఎమోషనల్ టచ్ తో  ప్రసంగాలు చేస్తూ,  నాయకులు, క్యాడర్ ను ప్రజలలోకి వెళ్లాలని ఆదేశా లిస్తున్నారు.   ఇదే ట్రెండ్ కొనసాగితే పుట్టి మునగడం ఖాయమని మంత్రులు సైతం అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఛాన్స్ దొరికితే గోడ దూకేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. జగన్ ను బయటకు వచ్చి ఏదైనా చేయాలని కోరే స్థాయి ఎవరికీ లేదు. ఒకవేళ కోరినా ఆయన వచ్చే పరిస్థితీ లేదు. వచ్చినా ఆయన ప్రసంగాల పవర్  ఏంటో అందరికీ తెలిసిందే. అందుకే జగన్ వచ్చినా పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏదీ లేదన్న నిర్ణయానికి పార్టీ క్యాడర్ దాదాపుగా వచ్చేసినట్లే కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.   ఇలా బస్సు యాత్రల పేరిట తమను పంపించి ఇంకా పలచన చేస్తున్నారన్న భావన వైసీపీ నేతలలో బలంగా వ్యక్తమౌతోందని అంటున్నారు.  మొత్తంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ బస్సు యాత్ర తుస్సు మనడంతో ఈ సారి ఎన్నికలలో వైసీపీ పుట్టిమునగడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తెలుగుదేశం 6.. జనసేన 5.. టార్గెట్ 160!

ఏపీలో ప్రధాన ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి విదితమే.  ఇప్పటికే రెండు పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని పలు దశలలో చర్చలు జరిపాయి. మంగళవారం (నవంబర్ 13) తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ జరిగింది. ఆ భేటీలో మ్యానిఫెస్టోపై ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేనిఫెస్టో సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా ఉంది. దీని మీదే కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేనిఫెస్టో కోసం టీడీపీ ఆరు అంశాలను ప్రతిపాదించగా, జనసేన పార్టీ ఐదు అంశాలను చేర్చారు. మొత్తం 11 అంశాలతో కూడిన ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం అయ్యింది. త్వరలోనే ఈ మేనిఫెస్టో ప్రకటిస్తామని కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన యనమల వెల్లడించారు.  ఈ 11 అంశాలలో బీసీలకు రక్షణ చట్టం, అమరావతి రాజధానిగా కొనసాగింపు, పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం, ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహాకాలు, రద్దు చేసిన సంక్షేమ పథాకాలపై పునరుద్ధరణ, అసమానతలు తొలిగిపోయి ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు, సూక్ష్మ, చిన్న తరహా అంకుర సంస్థల ఏర్పాటుకు రూ.10 లక్షల వరకు రాయితీ వంటి ప్రధాన అంశాలున్నాయి. ఈ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీలో తెలుగుదేశం నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, కొమ్మారెడ్డి పట్టాభి రాం పాల్గొనగా, జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ పాల్గొన్నారు. ఇది మినీ మేనిఫెస్టో  మాత్రమే.. టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటే తప్పనిసరిగా అమలౌతుందనే వమ్మకం కలిగించడం కోసమే ఈ మినీ మేనిఫెస్టోను తీసుకొచ్చినట్లు ఇరు పార్టీలూపేర్కొన్నాయి. ఇక ఈ మేనిఫెస్టోలో యువతకు నమ్మకం కలిగించేలా ఉపాధి పథకాల ప్రస్తావన ఉంటుందన్నారు.  సౌభాగ్య పథం పేరుతో యువత వ్యాపారాలకు ఆర్థిక సాయం అందించే అంశాన్ని జనసేన ప్రతిపాదించిందని, సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రాభివృద్ధికి వ్యూహ రచన చేస్తామని యనమల చెప్పారు.  సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని, అసమానతలు తొలిగి ఆర్ధిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు.  ఇక  తెలుగుదేశం ప్రతిపాదించిన సూపర్ సిక్స్ అంశాల్లో తొలుత మహాశక్తి పేరిట ఆడబిడ్డలకు ప్రత్యేక నిధి, 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళ  ఖాతాలో నెలకు 1500, తల్లికి వందనం పేరుతో ప్రతీ బిడ్డా చదువుకునేందుకు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ  ప్రతి ఒక్కరికి ఏటా 15 వేలు, దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఉచితం, మహిళలందరికీ జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం, యువత కోసం యువగళం పేరుతో ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3వేల నిరుద్యోగ భృతి,  5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ, అన్నదాత పేరిట రైతులకు ప్రకటించిన మేనిఫెస్టోలో ఏటా 20 వేలు ఆర్థిక సహాయం, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం వంటి పథకాలతో పూర్ టు రిచ్ పేరిట ప్రతి పేదవాడిని ధనికుడిని చేసేలా ప్రత్యేక కార్యాచరణను టీడీపీ ప్రకటించింది. మొత్తంగా టీడీపీ 6 ప్రధాన అంశాలు, జనసేన 5 ప్రధాన అంశాలతో మినీ మ్యానిఫెస్టో రూపకల్పనకు ఇరు పార్టీలు ఆమోదం తెలిపాయి. కాగా, నవంబర్ 1 నుంచి మొత్తం 160 రోజుల పాటు ఈ మినీ మ్యానిఫెస్టో హామీల్ని జనంలోకి తీసుకెళ్లేందుకు వీలుగా ఇరు పార్టీల నాయకులు, క్యాడర్ ఇంటింటికీ వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. రాష్ట్ర స్ధాయి నుండి క్షేత్రస్దాయి వరకూ ఇరుపార్టీల నేతలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఎప్పటికప్పుడు మేనిఫెస్టో అంశాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా  ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే  పూర్తిస్ధాయిలో ఇరు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. అలాగే  మేనిఫెస్టో అంటే పేజీలకు పేజీలు రూపొందించి ప్రజలకు అర్ధం కాకుండా మాయ చేయడం కంటే.. సాధ్యమైనంత చిన్నదిగా.. అందులో ప్రజలకు అన్నీ కలిసి వచ్చేలా రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే ముందుగా ఈ మినీ మ్యానిఫెస్టోను సింపుల్ గా.. ఉన్నంతలో అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా.. ముఖ్యంగా సిద్ధాంతాలు అందరికీ అర్ధమయ్యేలా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అసలు మ్యానిఫెస్టో కూడా ఇదే తరహాలో సంక్షేమంతో కూడిన అభివృద్ధి అజెండాగా రూపొందించనున్నారని ఇరు పార్టీల వర్గాలు చెబుతున్నాయి.

జగన్ ప్యాకప్ ఖాయం.. ఐ ప్యాకే చెప్పేసింది!

జగన్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని ఇప్పటి వరకూ విశ్లేషకులూ, పరిశీలకులూ, పలు సర్వేలూ చెప్పాయి. కానీ ఇక పడిపోవడానికి, దిగజారడానికి ఏమీ లేదని జగన్ నమ్ముకున్న ఐప్యాక్ తేల్చేసింది. వాళ్లూ, వీళ్లూ ఇంత కాలం జగన్ పని అయిపోయిందని చెబుతుంటో ఏమో వాళ్లూ, వీళ్లూ చెప్పినవి ఎందుకు నమ్మాలి అనుకున్న వైసీపీ నేతలకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్.. ఈయన ఎవరన్న డౌట్ వచ్చిందా? డౌట్ ఎందుకు ఆయనే అవును అక్షరాలా ఆయనే వైసీపీ ఎన్నికల వ్యూహకర్త పీకేనే... అవును పీకేయే వైసీపీ పని అయిపోయింది. ఇక తట్టాబుట్టా సర్దేసుకోవడమే తరువాయి అని కుండ బద్దలు కొట్టేశారు. దీంతో వైసీపీకి తత్వమే కాదు సత్యమూ బోధపడింది. ఐప్యాక్ తాజాగా నిర్వహించిన సర్వేలో ఏపీ ఓటర్లు ఎటుమొగ్గు చూపుతున్నారన్నది తేటతెల్లమైపోయింది.  ఇప్పటికిప్పుడు అని కాదు.. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా  అధికార  వైసీపీకి ఓటమి తథ్యమని ఐపాక్ సర్వే తేల్చేసిందని వాళ్లూ వీళ్లూ కాదు.. వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. అదీ అలాంటి ఇలాంటి ఓటమి కాదు.. దిమ్మతిరిగి బొమ్మ కనిపించే లాంటి ఓటమి అని ఐప్యాక్ సర్వేయే చెప్పిందంటూ.. వాస్తవంగా రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఊహించలేనంత దారుణంగా ఉండి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.  పరిశీలకులు విశ్లేషణలతో పని లేకుండానే  క్షేత్ర స్థాయిలో  అసలు పరిస్థితి ఏమిటి? జనం జగన్ పాలన గురించీ, వైసీపీ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు. వారి మూడ్ ఎలా ఉంది? వచ్చే ఎన్నికలలో వారు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అన్న విషయాలు అందరికంటే  గడపగడపకూ, వైఎపీ నీడ్స్ జగన్, సామాజిక సాధికార బస్సు యాత్ర అంటూ జనంలోకి వెళ్లిన, వెళ్లడానికే జంకుతున్న వైసేపీ నాయకులకే  బాగా తెలుసు. అయితే  వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మాత్రం ‘నేను బటన్లు నొక్కుతూ పప్పుబెల్లాల్లా సొమ్ములు పందేరం చేస్తుంటే ఓట్లెందుకు పడవు.. మీరు జనంలోకి వెళ్లి మనం పందేరం చేసిన సొమ్ముల లెక్కలు చెప్పండి చాలు’ అంటూ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఊదరగొడుతున్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి, సర్వేల పేరిట, తనను తాను మోసం చేసుకుంటూ, పార్టీ నేతలనూ, ఎమ్మెల్యేలను ఇంత కాలం మోసం చేస్తూ వచ్చారు.  అయితే ఇప్పడు  ఐప్యాక్’ తాజా సర్వేతో  అంతా తేటతెల్లమైపోయింది.  పార్టీ నేతలే కాదు, కార్యకర్తలు కూడా కాడె వదిలేసే పరిస్థితి వచ్చింది. సామాజిక సాధికార యాత్రకు కార్యకర్తలు కూడా మొహం చాటేయడమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇంతకీ ఐప్యాక్ సర్వే వైనాట్ 175 అంటున్న జగన్ గాలి తీసేసింది. ఎట్ లీస్ట్ 31 కూడా కష్టమేనని తేల్చేసింది. ఆ నివేదికను ఏకంగా జగన్ కే అందజేసింది.  మీటల మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలేనని జగన్ కు తెలియజేసింది. ఈ సర్వే వెల్లడి కావడం కంటే కొంచం ముందే ప్రశాంత్ కిషోర్ స్వయంగా  ఉచితాలు పందేరం చేసి, అభివృద్ధిని అటకెక్కించేస్తే దేశంలో రాష్ట్రాలన్నీ ఏపీలా తయారౌతాయని తేల్చేశారు. ఏపీ పాలన, జగన్ తీరు తనకు చెడ్డపేరు తెచ్చిపెట్టాయన్న ఆవేదనా వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత దేశ విదేశాల్లో ఆయనకు  లభిస్తున్న మద్దతు. వ్యక్తమవుతున్న సానుభూతి, అన్నిటినీ మించి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ మరో సారో మరింతగా వెలుగులోకి వచ్చింది.  జగన్ రెడ్డి అరాచక పాలనలో గట్టు తప్పి, ఆగాధంలోకి కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలు ఎక్కించాలంటే, చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడయిన ముఖ్యమంత్రి అవసరమనే భావన ప్రజలలో ఏర్పడిందని   సర్వేలో  పేర్కొంది. 

బాబూమోహన్ కు ప్రచారం చేయం.. అందోల్ బీజేపీ క్యాడర్ రివోల్డ్

అందోల్ బీజేపీ అభ్యర్థి, నటుడు బాబూమోహన్ కు సొంత పార్టీ కార్యకర్తలే ఎదురు తిరిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబూ మోహన్ తరఫున పని చేసేది లేదని కుండ బద్దలు కొట్టేశారు. నియోజకవర్గంలో బీజేపీ  ప్రతిష్ట మసకబారడానికి బాబూమోహన్ కారణమని ఆరోపించారు. బాబూమోహన్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమం నిరాడంబరంగా జరగడమే ఆయనకు నియోజకవర్గంలో పట్టులేదనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని వట్‌పల్లి, అందోలు, టేక్మాల్, రాయికోడ్‌ మండలాలకు చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాబూ మోహన్ తరఫున ప్రచారం చేసేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఈ మేరకు వారు రాయికోడ్‌ మండలంలోని సిరూర్‌ లో  సమావేశమై  నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై కూడా చర్చించారు.  బాబూమోహన్ కు టికెట్ విషయంలో బీజేపీ అధిష్ఠానం నిర్ణయాన్ని సైతం వారు తప్పుపట్టారు.  అందోల్ లో బీజేపీకి కనీసం డిపాజిట్ దక్కడం సంగతి అటుంచి, నోటాతో కూడా పోటీ పడలేని పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజామద్దతు లేని బాబూమోహన్ కు ప్రచారం చేసి తమ  రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోలేమని వారు హై కమాండ్ కు  తెలియజెప్పేందుకు తీర్మానించుకున్నారు. అదే సమయంలో తామంతా అందోల్ కాంగ్రెస్ అభ్యర్థి  దామోదర రాజనర్సింహకు మద్దతునివ్వాలని తీర్మానించారు. దీంతో ప్రచారం ప్రారంభం కాకుండానే బాబూమోహన్ ఓటమి ఖరారైపోయినట్లైందని పరిశీలకులు అంటున్నారు.  

చివరాఖరికి శ్రీరెడ్డికీ వైసీపీ సొమ్ములెగ్గొట్టింది!

ఒక రాజకీయ పార్టీని ప్రమోట్ చేసే సోషల్‌మీడియాకు.. ఆ పార్టీ నిర్వహకులు డబ్బులు ఎగ్గొడుతున్నారంటూ అలా ప్రమోట్ చేసిన వారు మీడియాకు, వీడియోకు ఎక్కడం మొదటి సారిగా జరిగింది.  ఇంతకూ ఒక రాజకీయ పార్టీ కోసం సామాజిక మాధ్యమంలో విపరీతంగా ప్రమోట్ చేసి ఆ సోషల్‌మీడియా ఉద్యమకారిణి ఎవరంటే  ఆమె శ్రీరెడ్డి. శ్రీరెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్ లో ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసి బాగా పాపులర్ అయిన శ్రీరెడ్డి.. ఆ తరువాత కూడా వంటల వీడియోలతో, రాజకీయ పార్టీలూ, నేతలపై సంచలన వ్యాఖ్యలతో అన్ని వర్గాల వారికీ బాగా సుపరితమైన పేరే. ఆ శ్రీరెడ్డి జగన్ పార్టీ వైసీపీకి అనుకూలంగా సామాజిక మాధ్యమంలో పలు పోస్టులు పెట్టారు. పనిలో పనిగా తనదైన ప్రత్యేక శైలిలో విపక్షాలపైనా, విపక్షాల నాయకులపైనా సంచలన ఆరోపణలు, విమర్శలూ చేశారు. అయితే శ్రీరెడ్డి ఆ పనులన్నీ వైసీపీ పట్ల తనకు ఉన్న అభిమానంతో చేశారని ఇంత వరకూ అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఇప్పుడు ఆమె  సోషల్ మీడియాలో తన చేత పార్టీని ప్రమోట్ చేయించుకుని ఇప్పుడు వైసీపీ డబ్బులు ఎగ్గొట్టిందంటూ ఓ పోస్టు పెట్టారు. ఆమె సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.    సినీ రంగంలో మహిళలపై వేధింపులపై మీడియాకు ఎక్కడం,  తనకు సభ్యత్వం ఇవ్వనందుకు నిరసన వ్యక్తం చేస్తూ, హైదరాబాద్ ఫిలిం చాంబర్ ఆఫీసు వద్ద అర్ధనగ్న ప్రదర్శనలతో బాగా  గుర్తింపు పొందిన శ్రీరెడ్డి తన చర్యల వల్ల సినీమాలలో అవకాశాలు దొరకలేదు. దాంతో   సోషల్‌మీడియాలో బూతు పురాణం, సంచలన వ్యాఖ్యలతో  పొట్టపోసుకుంటున్న శ్రీరెడ్డి ఇప్పుడు వైసీపీ తనకు డబ్బులు ఎగ్గొట్టిందంటూ వీడియోకి ఎక్కడం సంచలనం సృష్టిస్తున్నది.  తెలుగుదేశం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ఇష్టారీతిన విమర్శలతో చెలరేగిపోతూ, అదే సమయంలో వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను ఆకాశానికి ఎత్తేసిన శ్రీరెడ్డి అధికార పార్టీ సోషల్ మీడియాకు ముందుండి నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అదే శ్రీరెడ్డి ఇప్పుడు వైసీపీపై నోరు పారేసుకుంది. తన చేత వైసీపీ సోషల్ మీడియాలో పార్టీని ప్రమోట్ చేయడానికి పని చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టేసిందని అదే సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు.   జగనన్న కోసం మంచీ చెడూ మరచి విపక్షాలు, విపక్ష నేతలపై ఇష్టారీతిన విమర్శలు చేయించుకున్న అధికార పార్టీ సోషల్ మీడియా వింగ్ అలా చేసినందుకు ఇస్తానన్న సొమ్ములు ఎగ్గొట్టిందని తీవ్ర ఆరోపణలు చేశారు.   అయినా జగనన్న హయాంలో పని చేసిన ఎవరికి సక్రమంగా వేతనాలు అందుతున్నాయనీ, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ కు సొమ్ములు ఇవ్వలేదంటూ శ్రీరెడ్డి మీడియాకు ఎక్కడమని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  జగనన్న ఇమేజ్ ను పెంచడానికీ, విపక్షాలను అడ్డగోలు విమర్శలతో తూర్పారపట్టడానికి  వైసీపీ సోషల్ మీడియా వింగ్ అహోరాత్రుళ్లూ పని చేస్తున్నదన్నది కాదనలేని వాస్తవం. మరి అంతగా వెట్టి చాకిరీ చేయించుకున్న వైసీపీ సామాజిక మాధ్యమ సైన్యానికి ఇవ్వాల్సిన సొమ్ములు ఇవ్వకుంటే ఎలా? శ్రీరెడ్డిలా ఆ వింగ్ లో ఉన్న మిగిలిన సామాజిక మాధ్యమ సైన్యం కూడా వీడియోలకు, మీడియాకు ఎక్కితే.. అదే జగన్ ఇమేజ్ అధ:పాతాళానికి పడిపోవడం ఖాయం కాదా? పెంచిన వాళ్లకు తగ్గించడం తెలియకుండా ఉంటుందా? ఆ దిశగా బోల్డ్ లేడీ శ్రీరెడ్డి తొలి అడుగువేసిందంటున్నారు.      వైసీపీ సోషల్‌మీడియా సైనికులకు జీతాలు అందడం లేదనీ, పని చేయించుకోవడం తప్ప వేతనం గురించి అధికార పార్టీ అస్సలు ఆలోచించడం లేదంటూ శ్రీరెడ్డి అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చేప్పేశారు.   వైసీపీ సోషల్‌మీడియాను సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌రెడ్డి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.   వైసీపీ పక్షాన సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి తీరు అందరికీ తెలిసిందే. ఆమెకు ఆగ్రహం  వస్తే ముందు వెనుకలు ఆలోచించకుండా దూకుడుగా విమర్శలు చేసేస్తారు. గతంలో ఒక సారి  వైసీపీ పాలన కంటే, చంద్రబాబు పాలన బాగుందంటూ తన గ్రామంలోని ఓ దేవాలయ దుస్థితిని ఉన్నదున్నట్లు చెప్పేశారు. అంతే కాదు ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నా వైసీపీలో తనకు ఎలాంటి గుర్తింపూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పుడు ఏకంగా వైసీపీ సోషల్ మీడియాలో పని చేసే వారికి జీతాలివ్వడం లేదంటూ రోడ్డెక్కారు.    దీంతో వైసీపీ పరువు గంగలో కలిసిపోయినట్లైంది. శ్రీరెడ్డి ఆరోపణలపై వైసీపీ స్పందన ఎలా ఉంటుందో, ఉండబోతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే అనూహ్యంగా శ్రీరెడ్డికి మాత్రం జగన్ వ్యతిరేకుల నుంచి సానుభూతి, సంఘీభావం వ్యక్తం అవుతోంది.

పుట్టినిల్లు తెలుగుదేశం.. మెట్టినిల్లు కాంగ్రెస్.. రేవంత్ రెడ్డి బోల్డ్ స్టేట్మెంట్!

తెలంగాణ ఎన్నికలలో తెలుగుదేవం హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల బరిలో నిలబడకపోవడంతో ఇక్కడ ఇప్పుడు అన్ని పార్టీలకు తెలుగుదేశం అవసరం వచ్చి పడింది. అందుకే ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరూ తెలుగు దేశం నామస్మరణ చేస్తున్నారు. ఏపీలో జనసేన తెలుగుదేశంతో కలిసి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం జనసేన  బీజేపీతో కలిసి వెళ్ళింది. అయితే, ఇక్కడ తెలుగుదేశం పోటీలో లేకపోవడంతో బీజేపీ వయా జనసేన తెలుగుదేశం పార్టీని  దగ్గర చేసుకొనే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ జనసేన నేతలను తెలుగుదేశం నేతలతో సంప్రదింపులకు పంపుతూ వారి ద్వారా మద్దతు కోసం ప్రయత్నిస్తున్నది. ఇక బీఆర్ఎస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల తేదీ ప్రకటన  వెలువడడంతోనే  బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ, ఆయనకు సంఘీభావం ప్రకటిస్తూ ఆ పార్టీకి దగ్గరయ్యే కార్యక్రమం మొదలు పెట్టారు. మంత్రి కేటీఆర్ అయితే ఏకంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో  తెలుగుదేశంపై విమర్శలకు అవకాశమే లేదని.. లోకేష్ తనకు తమ్ముడంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం తనకు పుట్టినింటితో సమానమంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు.  తెలుగుదేశం తన పుట్టిల్లు అని.. కాంగ్రెస్ తనకు అత్తిల్లు అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. తాను తెలుగుదేశం కూతురుని, కాంగ్రెస్   కోడలిని అంటూ కొత్త భాష్యం చెప్పారు. కూతురు పుట్టింట్లో తల్లిదండ్రుల పక్షాన ఉంటూ.. అత్తింటికి రాగానే ఆ ఇంటి గౌరవాన్ని కాపాడుతుందని.. అలాగే తాను ఇపుడు కాంగ్రెస్ గౌరవాన్ని కాపాడే కీలక పాత్రలో ఉన్నానని చెప్పారు. అదే టైంలో తాను తన పుట్టింటి గొప్పలు చెప్పలేను అని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడి మొదలు పెట్టారు. రాజకీయాలు అన్నాక ఎదురుదాడి సహజం. ఎన్నికల వేళ ఇది మరింత ఎక్కువగా ఉండటం సహజమే. కనుక ఆ విషయం పక్కన పెడితే తెలంగాణలో  తెలుగుదేశం సానుభూతిపరులు ఏ పార్టీకి అండగా ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. చాలా నియోజకవర్గాలలో తెలుగుదేశం కార్యకర్తలు బహిరంగంగానే కాంగ్రెస్ కు జైకొట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ర్యాలీలలో కూడా  తెలుగుదేశం జెండాలను రెపరెపలాడుతున్నా యి. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతోనే తెలుగుదేశం తెలంగాణలో పోటీ నుండి తప్పుకున్నట్లు రాజకీయ వర్గాలలో బలమైన ప్రచారం జరుగుతుండగా.. ఇప్పటికే తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ తో మమేకమైపోయారు. అయితే ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ మాత్రం తెలుగుదేశం సానుభూతిపరులకు గాలం వేస్తూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఓ స్ట్రాంగ్ మెసేజ్ పాస్ చేశారు. చంద్రబాబు అంటే తనకు ఇష్టం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా అంటూ మాట్లాడిన రేవంత్.. తన మనసులో ఎప్పటికీ చంద్రబాబు ఉంటారని చెప్పుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్న సమయంలో.. ఓ మీడియా ప్రతినిధి చంద్రబాబు అరెస్ట్ ని ఎలా చూస్తున్నారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. దానికి రేవంత్ అరెస్ట్ గానే చూస్తున్నాను అని బ్యాలాన్స్డ్ గా సమాధానం చెప్పారు. అయితే, ఆ తర్వాత వ్యూహాత్మకంగా టీడీపీ పోటీ నుంచి వైదొలిగిన తరువాత  ఇలా చంద్రబాబుపై తన ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని చాటారు.  మొత్తంగా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణ  తెలుగుదేశం శ్రేణులు అవుట్ రేటెడ్ గా రేవంత్ కు మద్దతుగా నిలవడం గ్యారంటీ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రేవంత్ తన బోల్డ్ కామెంట్స్ తో తెలంగాణలో తెలుగుదేశం శ్రేణుల మనసు గెలుచుకున్నారని అంటున్నారు.