ఆస్ట్రేలియాపై రివెంజ్ కు టీమ్ ఇండియా రెడీ!
క్రికెట్ లో విశ్వ విజేత ఎవరో తేలిపోవడానికి మరొక్క రోజు వ్యవధి ఉంది. టోర్నీ ఆసాంతం అనితర సాధ్యమైన ఆధిక్యత కనబరిచి ఆడిన పది మ్యాచ్ లలోనూ అపజయమనేదే లేకుండా ఫైనల్ కు క్వాలిఫై అయిన టీమ్ ఇండియా.. తడబడుతూ టోర్నీని ఆరంభించి.. అనూహ్యంగా పుంజుకుని చివరికి తుదిపోరుకు సిద్ధమైన ఆస్ట్రేలియా ఆదివారం (నవంబర్ 19) ఆహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ లో తలబడనున్నాయి. ఆస్ట్రేలియా అత్యధిక వరల్డ్ కప్ టోర్నీలలో విజేతగా నిలిస్తే.. టీమ్ ఇండియా ఇప్పటి వరకూ 1983, 2011లలో విశ్వవిజేతగా నిలిచింది.
ఇక వరల్డ్ కప్ 2023 అనూహ్య మలుపులతో ఉత్కంఠ భరితంగా సాగింది. నెదర్ ల్యాండ్స్ , ఆప్ఘనిస్థాన్ వంటి జట్లు పెద్ద జట్లకు షాక్ ఇచ్చి సత్తా చాటాయి. 2019 వరల్డ్ కప్ విజేత అయిన ఇంగ్లాండ్ ఈ సారి కూడా.. హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా టోర్నీలో అడుగుపెట్టినా.. అనూహ్యంగా సెమీస్ కు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు కూడా సత్తా చాటినా సెమీస్ దాటలేకపోయాయి.
ఇక ఫైనల్ మ్యాచ్ కు ముందు ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా ప్లేయర్ ఆఫ్ దీ టోర్నీ అవార్డు రేసులో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో టీమ్ ఇండియా ప్లేయర్సే ముందున్నారని చెప్పాలి. ఐసీసీ ప్రకటన మేరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కోసం రేసులో మొత్తం 9 మంది ఉండగా... వీరిలో నలుగురు టీమ్ ఇండియా ప్లేర్లే కావడం విశేషం. ఈ అవార్డు కోసం నలుగురు టీమ్ ఇండియా ప్లేయర్లు రేసులో ఉండగా, ఆస్ట్రేలియా ,
దక్షిణాఫ్రికా నుంచి ఒకరు చొప్పున రేస్ లో ఉన్నారు. వారిలో టీమ్ ఇండియా బ్యాటర్ కింగ్ కోహ్లీ ముందువరుసలో ఉన్నారు. కోహ్లీ ఇప్పటి వరకూ జరిగిన పది మ్యాచ్ లలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో మొత్తం 711 పరుగులు సాధించి ముందంజలో ఉండగా, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డికాక్ 594 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానాలలో వరుసగా రచిన్ రవీంద్ర (578), డిరిల్ మిచెల్ (552), ఉన్నారు. పరుగుల పరంగా చూస్తే టీమ్ ఇండియా స్కిప్పర్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే బుమ్రా, షమీ, జంపా పోటీ పడుతున్నారు. టీమ్ ఇండియా షమీ ప్రదర్శనతో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ షమీఫైనల్ గా మారిపోయిందని క్రిడా పండితులు అభివర్ణించారు. టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్ లకూ దూరంగా ఉన్న షమీ.. ఆ తరువాత ఆడిన ఆరు మ్యాచ్ లలో మొత్తం 23 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు.
ఆ తరువాతి స్థానాలలో 22 వికెట్లతో జంపా, 18 వికెట్లతో బుమ్రా రేసులో ఉన్నారు. ఇక మ్యాన్ ఆఫ్ ది టోర్నీ ఎవరన్నది పక్కన పెడితే.. ఆదివారం (నవంబర్ 19) జరిగే ఫైనల్ కు ముందు ఆస్ట్రేలియా మైండ్ గేమ్ ప్రారంభించేసింది. ప్రత్యర్థి జట్టు పై మైదానంలో ఆటలో పై చేయి సాధించడం కంటే ముందుగా మానసికంగా ప్రత్యర్థి జట్టును బలహీనం చేయడం కోసం నోటికి పని చెప్పింది. ఆసీస్ ప్లేయర్ లు ఆన్ ఫీల్డ్ గేమ్ తో సమానంగా ఆఫ్ ఫీల్డ్ లో మైండ్ గేమ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడూ అదే చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఫైనల్ కు ముందు నోటికి బాగా పని చెప్పినట్లు కనిపిస్తోంది. ఫైనల్ లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేస్తే రెండు వికెట్ల నష్టానికి 450 పరుగులు సాధిస్తుందని జోస్యం చెప్పాడు. ప్రతిగా ఇండియా 65 పరుగులకు ఆలౌట్ ఔతుందని పేర్కొన్నాడు. ఇప్పుడు మార్ష్ వ్యాఖ్యలపై టీమ్ ఇండియా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిచెల్ మార్ష్ వ్యాఖ్యలను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మార్ష్ వ్యాఖ్యలు ఇప్పటివి కాకపోయినా సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తూ టీమ్ ఇండియా అభిమానులను ఒకింత కంగారు పెడుతున్నాయి. ఇప్పటి వరకూ ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరకూడదని సగటు భారత అభిమాని కోరుకున్నాడు. అందుకే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెమీ ఫైనల్ లో భారత అభిమానులంతా దక్షిణాఫ్రికాకు ఔట్ రైట్ మద్దతు ఇచ్చారు. సరే ఆ సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికా పరాజయం పాలై ఆస్ట్రేలియా ఫైనల్ లో భారత్ తో తలపడడానికి రెడీ అయిపోయింది.
ప్రస్తుతం ఇరు జట్ల బలాబలాలూ, ఆటగాళ్ల ఫామ్ చూస్తే రెండు జట్ల మధ్యా పోరు హోరాహోరీ గా ఉండటం తథ్యమని, అయితే టోర్నీ ఆద్యంతం భారత్ బ్యాటింగ్, బౌలింగ్ గమనిస్తే.. హాట్ ఫేవరెట్ భారత్ అనే ఎవరైనా చెబుతారు. కానీ 2003 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా ఓటమి ఇప్పటికీ భారత అభిమానులను ఓ పీడకలలా వెంటాడుతూనే ఉంది. ఆ ఫైనల్ లో రికీపాంటింగ్ సారథ్యంలోని కంగారుల జట్ల టీమ్ ఇండియా 125 పరుగుల తేడాతో ఓడించి.. విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆస్ట్రేలియా పప్పులు ఉడకవనీ, మైండ్ గేమ్ తో భారత ఆటగాళ్ల మనోస్థైర్యాన్ని ఆ జట్టు దెబ్బతీయలేదని టీమ్ ఇండియా మాజీలు ధీమాగా చెబుతున్నారు. సెమీస్ లో న్యూజిలాండ్ పై గత ఓటములను పూర్తిగా మరచిపోయేలా టీమ్ ఇండియా ప్రదర్శన ఉందని వారు చెబుతున్నారు. కూడా 2003 లో వరల్డ్ కప్ ఫైనల్ లో ఓటమికి 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా అద్భుత విజయంతో రివెంజ్ తీర్చుకోవడం ఖాయమని అంటున్నారు.
2003లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్లో భారత్.. రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియాతో తలపడింది. అప్పట్లో ఏకంగా 125 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అయితే, ఈసారి భారత్ తనని తాను దుర్భేద్యమైన జట్టుగా నిరూపించుకుంది. ఆడిన మ్యాచ్లన్నీ గెలిచిన టీమిండియా చెన్నైలో జరిగిన మ్యాచ్లోనూ కమ్మింగ్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. కాబట్టి, ఈసారి ఆసిస్ ఆటలు సాగవని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు.