ఆస్ట్రేలియాపై రివెంజ్ కు టీమ్ ఇండియా రెడీ!

క్రికెట్ లో విశ్వ విజేత ఎవరో తేలిపోవడానికి మరొక్క రోజు వ్యవధి ఉంది. టోర్నీ ఆసాంతం అనితర సాధ్యమైన ఆధిక్యత కనబరిచి ఆడిన పది మ్యాచ్ లలోనూ అపజయమనేదే లేకుండా ఫైనల్ కు క్వాలిఫై అయిన టీమ్ ఇండియా.. తడబడుతూ టోర్నీని ఆరంభించి.. అనూహ్యంగా పుంజుకుని చివరికి తుదిపోరుకు సిద్ధమైన ఆస్ట్రేలియా ఆదివారం (నవంబర్ 19) ఆహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ లో  తలబడనున్నాయి. ఆస్ట్రేలియా అత్యధిక వరల్డ్ కప్ టోర్నీలలో విజేతగా నిలిస్తే.. టీమ్ ఇండియా ఇప్పటి వరకూ 1983, 2011లలో  విశ్వవిజేతగా నిలిచింది. ఇక వరల్డ్ కప్ 2023 అనూహ్య మలుపులతో ఉత్కంఠ భరితంగా సాగింది. నెదర్ ల్యాండ్స్  , ఆప్ఘనిస్థాన్ వంటి జట్లు పెద్ద జట్లకు షాక్ ఇచ్చి సత్తా చాటాయి. 2019 వరల్డ్ కప్ విజేత అయిన ఇంగ్లాండ్ ఈ సారి కూడా.. హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా టోర్నీలో అడుగుపెట్టినా.. అనూహ్యంగా సెమీస్ కు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు కూడా సత్తా చాటినా సెమీస్ దాటలేకపోయాయి.  ఇక ఫైనల్ మ్యాచ్ కు ముందు ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా ప్లేయర్ ఆఫ్ దీ టోర్నీ అవార్డు రేసులో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో  టీమ్ ఇండియా ప్లేయర్సే ముందున్నారని చెప్పాలి.   ఐసీసీ ప్రకటన మేరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కోసం రేసులో మొత్తం 9 మంది ఉండగా... వీరిలో నలుగురు టీమ్ ఇండియా ప్లేర్లే కావడం విశేషం. ఈ అవార్డు కోసం నలుగురు టీమ్ ఇండియా ప్లేయర్లు రేసులో ఉండగా, ఆస్ట్రేలియా ,    దక్షిణాఫ్రికా నుంచి ఒకరు చొప్పున  రేస్ లో ఉన్నారు. వారిలో టీమ్ ఇండియా బ్యాటర్ కింగ్ కోహ్లీ ముందువరుసలో ఉన్నారు. కోహ్లీ ఇప్పటి వరకూ జరిగిన పది మ్యాచ్ లలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో మొత్తం 711 పరుగులు సాధించి ముందంజలో ఉండగా,  దక్షిణాఫ్రికా   స్టార్ బ్యాటర్ డికాక్ 594 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానాలలో  వరుసగా రచిన్ రవీంద్ర (578), డిరిల్ మిచెల్ (552), ఉన్నారు. పరుగుల పరంగా చూస్తే టీమ్ ఇండియా స్కిప్పర్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో నిలిచాడు.  ఇక బౌలర్ల విషయానికి వస్తే బుమ్రా, షమీ, జంపా  పోటీ పడుతున్నారు. టీమ్ ఇండియా షమీ ప్రదర్శనతో వరల్డ్ కప్ సెమీ ఫైనల్ షమీఫైనల్ గా మారిపోయిందని క్రిడా పండితులు అభివర్ణించారు. టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్ లకూ దూరంగా ఉన్న షమీ.. ఆ తరువాత ఆడిన ఆరు మ్యాచ్ లలో మొత్తం 23 వికెట్లు పడగొట్టి టోర్నీలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా నిలిచాడు. ఆ తరువాతి స్థానాలలో 22 వికెట్లతో జంపా, 18 వికెట్లతో బుమ్రా రేసులో ఉన్నారు.  ఇక మ్యాన్ ఆఫ్ ది టోర్నీ ఎవరన్నది పక్కన పెడితే.. ఆదివారం (నవంబర్ 19) జరిగే ఫైనల్ కు ముందు ఆస్ట్రేలియా మైండ్ గేమ్ ప్రారంభించేసింది. ప్రత్యర్థి జట్టు పై మైదానంలో ఆటలో పై చేయి సాధించడం కంటే ముందుగా మానసికంగా ప్రత్యర్థి జట్టును బలహీనం చేయడం  కోసం నోటికి పని చెప్పింది. ఆసీస్ ప్లేయర్ లు ఆన్ ఫీల్డ్ గేమ్ తో సమానంగా ఆఫ్ ఫీల్డ్ లో మైండ్ గేమ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడూ అదే చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఫైనల్ కు ముందు నోటికి బాగా పని చెప్పినట్లు కనిపిస్తోంది. ఫైనల్ లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్  చేస్తే రెండు వికెట్ల నష్టానికి 450 పరుగులు సాధిస్తుందని జోస్యం చెప్పాడు. ప్రతిగా ఇండియా 65 పరుగులకు ఆలౌట్ ఔతుందని పేర్కొన్నాడు. ఇప్పుడు మార్ష్ వ్యాఖ్యలపై టీమ్ ఇండియా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిచెల్ మార్ష్ వ్యాఖ్యలను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  మార్ష్ వ్యాఖ్యలు ఇప్పటివి కాకపోయినా సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తూ టీమ్ ఇండియా అభిమానులను ఒకింత కంగారు పెడుతున్నాయి. ఇప్పటి వరకూ ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరకూడదని సగటు భారత అభిమాని కోరుకున్నాడు. అందుకే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెమీ ఫైనల్ లో భారత అభిమానులంతా దక్షిణాఫ్రికాకు ఔట్ రైట్ మద్దతు ఇచ్చారు. సరే ఆ సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికా పరాజయం పాలై ఆస్ట్రేలియా ఫైనల్ లో భారత్ తో తలపడడానికి రెడీ  అయిపోయింది. ప్రస్తుతం ఇరు జట్ల బలాబలాలూ, ఆటగాళ్ల ఫామ్ చూస్తే రెండు జట్ల మధ్యా పోరు హోరాహోరీ గా ఉండటం తథ్యమని, అయితే  టోర్నీ ఆద్యంతం భారత్ బ్యాటింగ్, బౌలింగ్ గమనిస్తే.. హాట్ ఫేవరెట్ భారత్ అనే ఎవరైనా చెబుతారు.  కానీ 2003 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా ఓటమి ఇప్పటికీ భారత అభిమానులను ఓ పీడకలలా వెంటాడుతూనే ఉంది. ఆ ఫైనల్ లో రికీపాంటింగ్ సారథ్యంలోని కంగారుల   జట్ల టీమ్ ఇండియా   125 పరుగుల తేడాతో ఓడించి.. విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆస్ట్రేలియా పప్పులు ఉడకవనీ, మైండ్ గేమ్ తో భారత ఆటగాళ్ల మనోస్థైర్యాన్ని ఆ జట్టు దెబ్బతీయలేదని టీమ్ ఇండియా మాజీలు ధీమాగా చెబుతున్నారు. సెమీస్ లో న్యూజిలాండ్ పై గత ఓటములను పూర్తిగా మరచిపోయేలా టీమ్ ఇండియా ప్రదర్శన ఉందని వారు చెబుతున్నారు.  కూడా 2003 లో వరల్డ్ కప్  ఫైనల్ లో ఓటమికి 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా అద్భుత విజయంతో రివెంజ్ తీర్చుకోవడం ఖాయమని అంటున్నారు.  2003లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్.. రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియాతో తలపడింది. అప్పట్లో ఏకంగా 125 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అయితే, ఈసారి భారత్ తనని తాను దుర్భేద్యమైన జట్టుగా నిరూపించుకుంది. ఆడిన మ్యాచ్‌లన్నీ గెలిచిన టీమిండియా చెన్నైలో జరిగిన మ్యాచ్‌లోనూ కమ్మింగ్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. కాబట్టి, ఈసారి ఆసిస్ ఆటలు సాగవని అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు.

ఎపికి తుఫాను గండం తప్పినట్టే

 బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి మిధిలీ అని నామకరణం చేశారు. మాల్దీవులు సూచించిన మేరకు ఈ పేరు పెట్టారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఈ తుపాను ఒడిశాలోని పరదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఏమాత్రం ఉండబోదని ఐఎండీ తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల వైపు మళ్లడంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పినట్టయింది. అయితే రానున్న రెండు రోజులు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గాని, జల్లులు గాని కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  తెలిపింది.గంటకు 20 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఈ తుపాను రేపు (నవంబరు 18) తెల్లవారుజామున బంగ్లాదేశ్ తీరంలోని ఖెపుపారా వద్ద తీరం దాటనుంది. ఇది భూభాగంపైకి ప్రవేశించే సమయంలో బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో గంటకు 80 కి.మీ పైగా వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

నీకో దణ్ణం.. నీ పార్టీకో దణ్ణం..తానేటి వనితకు నిరసన సెగ

ఏపీ హోం మంత్రి తానేటి వనితను ప్రజలు, సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రిని గంటన్నర పాటు నడిరోడ్డుపైనే నిలబెట్టి వెనుదిరిగి వెళ్లిపొమ్మన్నారు. హోంమంత్రి కదా.. భారీ సంఖ్యలో పోలీసులను రప్పించుకుని  లైన్ క్లియర్ చేయించుకున్నారు. దీంతో  ఆమె తీరు పట్ల మరింత ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మా ఊరికి వచ్చి మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ ప్రజలు తిరగబడ్డారు. చివరికి వైసీపీ మండల స్థాయి నేతలు, గ్రామ నేతలు ప్రజలకు నచ్చజెప్పడంతో మంత్రి వనిత బాధితుడిని పరామర్శించి సాయం చెక్కును అందించి, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం హామీ ఇచ్చి అక్కడ నుండి వెనుదిరిగారు. బాధితుడి చావుకు ప్రభుత్వం, పోలీసులే కావడం, స్వయంగా హోంమంత్రి అలసత్వం కారణంగానే బాధితుడు మరణించడంతో సొంత పార్టీ కార్యకర్తలలో కూడా ఆగ్రహం పెల్లుబికింది. ప్రజలైతే ఏకంగా మంత్రిపై తిరగబడ్డారు. మీ పరామర్శ మాకు అవసరం లేదంటూ గో బ్యాక్ నినాదాలిచ్చారు. మనుషుల్ని చంపేసి ఓదార్పు యాత్రకు వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మీరూ వద్దు.. మీ ప్రభుత్వం వద్దు.. మీకో నమస్కారం.. మీ పార్టీకో నమస్కారం అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల ఆరున  కొవ్వూరు నియోజకవర్గం దొమ్మేరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నిర్వహించారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక వైసీపీ నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఒక దానిలో స్థానిక నాయకుల ఫోటోల్ని చించేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు అందగా.. మహేందర్ అనే దళిత యువకుడిని అరెస్ట్ చేసి పోలీసులు హింసించారు. మహేందర్ వైసీపీ కార్యకర్త అవ్వడమే కాకుండా హోంమంత్రి తానేటి వనిత కోసం కూడా  పనిచేశాడు. కానీ, ఫ్లెక్సీల గొడవ వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అతన్ని చితకబాదారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సమయంలోనే మహేందర్ తానేటి వనితకు ఫోన్ చేయగా.. నిన్నేం చేయరు పంపించేస్తార్లే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారట. చిత్రహింసల అనంతరం పోలీసులు అతడ్ని విడిచి పెట్టారు. స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన మహేందర్ అవమానభారంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఇది ఒకరకంగా పోలీసుల హత్యే,  ముఖ్యంగా హోంమంత్రి విజయం కోసం పనిచేసి, హోంమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేసిన దళిత సామజిక వర్గానికి చెందిన కార్యకర్తను పోలీసులే చిత్రహింసలు పెట్టి చంపేశారు. తనకు సాయం చేయాలని కోరుతూ మంత్రికి ఫోన్ చేసినా ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ నిండు ప్రాణం పోయింది.  దీనిని స్థానిక ప్రజలు, వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. స్థానికంగా పార్టీలో ఉన్న ఆధిపత్య పోరు ఫ్లెక్సీల వివాదానికి దారితీయడం..  పోలీసులు అత్యుత్సాహంతో ఓ కార్యకర్త కన్నుమూశాడు. హోంమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో ఈ విషయం రాష్ట్రస్థాయిలో  సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి పరిహారం చెక్కులు అందించేందుకు మంత్రి వెళ్లడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రజలు మంత్రిని రానివ్వకుండా అడ్డుకోవడంతో మంత్రి రోడ్డుపైనే గంటన్నర వేచిచూడాల్సి వచ్చింది.  మంత్రి ఏది ఏమైనా పరామర్శించే వెళ్తానని భీష్మించుకోవడంతో స్థానిక ప్రజలు మంత్రిని చుట్టుముట్టి ముందుకు కదలనీయకుండా చేశారు. అదే సమయంలో స్థానిక తెలుగుదేశం దళిత నేతలతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను  హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం భారీ ఎత్తున పోలీసులు రంగంలోకి దిగడం, స్థానిక వైసీపీ నేతలు కల్పించుకొని బాధిత కుటుంబాన్ని ఒప్పించి మంత్రిని కలిసేలా చేశారు. దీంతో తాను తీసుకొచ్చిన పరిహారం చెక్కు  బాధితుడి కుటుంబానికి అందజేసి.. వారి ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం ఇస్తానన్న హామీ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో ఈ వ్యవహారం ఉభయగోదావరి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దళిత యువకుడిని పోలీసులే హింసపెట్టి చంపడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతుండగా.. ప్రశ్నిస్తున్న వారిని ఎక్కడిక్కడ నిర్బంధించడం వివాదాస్పదమౌతోంది. 

ఓటమి మాట.. బెదరింపు బాట.. కేసీఆర్ ఎందుకిలా?

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇక ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అయితే రోజుకి మూడు నాలుగు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు. 18 రోజుల్లో 43 నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రచారం పూర్తి చేశారంటే  కేసీఆర్ ఏ స్థాయిలో  ఉరుకులెత్తుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. కేసీఆర్‌ ఇప్పటి వరకు దాదాపు 50 ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. రెండు విడతల ప్రచారం పూర్తి చేసుకుని చివరిదైన మూడో విడత ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే  గతంలో ఎన్నడూ లేనంతగా కేసీఆర్ సభల ప్రసంగాలలో మాటలు మీరుతున్నారు. అయోమయమో, టెన్షనో కానీ ఎన్నికల బహిరంగసభల్లో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కాకుండా పోతున్నది. కేసీఆర్ అంటే మంచి వక్త. తెలంగాణ సమాజం మూలాల్లోకి వెళ్లి మాట్లాడగల సత్తా ఉన్న నేత. ఇంకా చెప్పాలంటే తన ప్రసంగాలతోనే ప్రజలను ఆకట్టుకోగలరు, ప్రత్యర్థులను బెంబేలెత్తించగలరు. కానీ ఈసారి కేసీఆర్ ఎందుకో తడబడుతున్నారు. ఆయన ప్రసంగాలలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాజాగా కేసీఆర్ నిజామాబాద్, మెదక్, బోధ్ బహిరంగసభల్లో మాట్లాడుతూ జాతీయ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. భవిష్యత్తంతా ప్రాంతీయపార్టీలదేనని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రాంతీయపార్టీలదే హవా అని పదేపదే చెప్పారు. అయితే  ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి మరీ జాతీయ పార్టీ చేసిన సంగతి కేసీఆర్ ఎలా మర్చిపోయారో  అర్థం కావడం లేదని ఆ సభకు హాజరైన జనం చర్చించుకోవడం కనిపించింది. మహారాష్ట్ర, ఒడిస్సా, కర్నాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో  పర్యటించి చాలా రోజులు ఢిల్లీలోనే మకాం వేసిన సంగతి.. వివిధ రాష్ట్రాలకు చెందిన రైతుసంఘాల నేతలతో సమావేశాలు, రైతులకు పంచిన చెక్కుల సంగతి  మర్చిపోయారా అని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక నల్లగొండ, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన సభల్లో అయితే కేసీఆర్‌ సహనం కోల్పోయారు.  సభలో ఈలలు వేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్‌ సభలో అయితే ఈలలు వేస్తున్న యువకులపై తిట్ల దండకం అందుకున్నారు.  హైలాగా.. తలకాయ లేదా.. వాన్ని పట్టుకోండి.. అంటూ అసహనంతో ఊగిపోయారు.   పలు చోట్ల అయితే అభ్యర్థులను కాదు పార్టీలను చూసి ఓటేయాలని కేసీఆర్ కోరుతున్నారు. అంటే తమ ఎమ్మెల్యే అభ్యర్థి పనికిరాడని ఆయనే  జనాల ముందు ఒప్పుకున్నట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక ఉచిత విద్యుత్‌, రైతు బంధు పథకాలను ప్రజలను ఆకట్టుకొనేలా వివరించడంలో విఫలమయ్యారు.  ధరణి తీసేస్తరట, ఆలోచించాలి.. చర్చకు పెట్టాలి అంటూ మాట్లాడారు. ధరణి పోర్టల్ ఫెయిల్యూర్ అని నిపుణులు ఎప్పుడో తేల్చారు. ఈ క్రమంలో అలాంటి వాటి జోలికి వెళ్లకపోతేనే మంచిది. కానీ, అది తీసేస్తే నష్టం అనేలా కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇక అన్నిటికీ మించి మేము ఓడిపోతే మాకేం నష్టం లేదు.. ప్రజలకే నష్టం అని బెదరింపులకు దిగుతున్నారు.  అసలు ఓడిపోతే అనే మాట కేసీఆర్ నోట ఎందుకు వచ్చిందన్న చర్చ  ఇప్పుడు రాజకీయ వర్గాలలో  జరుగుతోంది. బీఆర్ఎస్ గెలుపుపై కేసీఆర్ కు నమ్మకంలేకనే ఫైనల్ గా ఇలా మమ్మల్ని ఓడిస్తే   మీకే నష్టం అంటూ  వార్నింగ్ ఇస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.  ఇప్పటి వరకు నిర్వహించిన 50 సభల్లో మూస ధోరణి ప్రసంగమే కావడంతో కేసీఆర్‌ సభలకు రావడానికి జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో పలు చోట్ల ప్రజలు లేక వెలవెలబోతున్న సభలను చూసి కేసీఆర్ అసహనానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. దాదాపుగా అన్ని పార్టీలకు ఇప్పుడు జనసమీకరణ అవసరమే. అయితే బీఆర్ఎస్ మీద ఉన్న అసంతృప్తికి తోడు స్థానికంగా అభ్యర్థుల మీద అసంతృప్తి వెరసి చాలా చోట్ల  బీఆర్ఎస్ సభలు జనం లేకవెలవెల పోతున్న పరిస్థితి కనిపిస్తోంది.  డబ్బులు వెదజల్లినా జనసమీకరణ భారమవుతోంది. అలాంటి సభలలో కేసీఆర్ లో మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.   అందుకే జనాలను హెచ్చరిస్తున్నట్లుగా  మేము ఓడిపోతే మీరే నష్టపోతారని మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ స్పీచ్ అంటే పంచులు, చురకలు,  పిట్ట కథలతో సాగేది. అందుకే మీడియా కూడా ఫోకస్ చేసేది. కానీ ఈసారి అవేవీ లేకపోగా కేసీఆర్ లో ఆగ్రహం, అసహనం కనిపిస్తుంది. అందుకే ఆయన నోట ఓడిపోతే అనే మాట వినిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల... రైతులకు 24 గంటల విద్యుత్,  2 లక్షల ఉద్యోగాల భర్తీ, 4వేల పెన్షన్ 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. 62 ప్రధాన అంశాలతో ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. దీనికి అభయహస్తం అనే పేరు పెట్టింది. 42 పేజీలతో ఈ మేనిఫెస్టోని రూపొందించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోని గాంధీభవన్‌లో రిలీజ్ చేశారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల అంశమైన 24 గంటల విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలను బిఆర్ఎస్ వక్రీకరించదని అప్పట్లో రేవంత్ స్పష్టం చేశారు. అయినా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ మేనిఫెస్టో పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చినట్టయ్యింది. జాబ్ కేలండర్, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ,వయోజనులకు 4 వేల పెన్షన్  వంటి అంశాలు కీలకమైనవిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ మేలు చేసేలా ఈ మేనిఫెస్టోని రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా కాంగ్రెస్ అభివర్ణించింది. ఇందులో ఇదివరకు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలతోపాటూ.. మరికొన్ని కీలక అంశాలను చేర్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేష్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లను మొదటి 16 పేజీలలో కాంగ్రెస్ తెలిపింది.

దాగుడుమూత దండాకోర్ సినిమా చూపిస్తున్న జగన్ సర్కార్!

ఇకపై ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలూ తమ తమ ఉత్తర్వులను ఏపీ గెజిట్ వైబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులను అప్ లోడ్  చేయకపోవడంపై సాధారణ పరిపాలనా శాఖ (జిఏడీ) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడించిన ప్రభుత్వం ఇకపై అన్ని జీవోలు క్రమం తప్పకుండా గెజిట్ వెబ్ సైట్లో పొందుపరచాలని పేర్కొంది. కొన్ని ప్రభుత్వ విభాగాలు జీవోలు అప్ లోడ్ చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన జీఏడీ.. ఇకపై అన్ని జీవోలు అప్లోడ్ చేయాలని పేర్కొంది. దాంతోపాటు జీవోఎంఎస్, జీవోఆర్టీలను నిరంతరం అప్ లోడ్ చేయాలని జీఏడీ నోట్ విడుదల చేసింది. 2022 ఫిబ్రవరి 1 నుంచి నేటి వరకు జారీచేసిన జీవోలను వెంటనే సైట్ లో పెట్టాలని ఆదేశించింది. జీవోలు అప్ లోడ్  చేయడమే కాకుండా, వాటి వివరాలు కేబినెట్ సెక్షన్ అధికారికి పంపాలని వివరించింది. జీవోలు అప్ లోడ్  చేయకపోతే.. ఇన్ చార్జీలను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసే పలు జీవోలు పబ్లిక్ కి తెలియడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని హైకోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో హడావిడిగా వివిధ శాఖలకు జీఏడీ ఈ నోట్ విడుదల చేసింది. అయితే  జీవోలపై ప్రభుత్వం ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇదే మొదటి సారి కాదు. కోర్టులలో ఈ కేసు విచారణకు వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ వస్తోంది. కానీ  ఆచరణ మాత్రం సూన్యం.  గతంలొ 2021 సెప్టెంబర్ 7న ఒకసారి ఇలాగే అన్ని ప్రభుత్వ శాఖలను హెచ్చరిస్తూ ఆదేశాలిచ్చారు. అన్ని శాఖలు తమ పరిధిలోని అన్ని జీవోలు ఏపీ గెజిట్ వైబ్ సైట్ లో పొందు పరచాలని ఆదేశించారు. కానీ చాలా జీవోలు ప్రజలకు కనిపించడం లేదు. ఆ తర్వాత 2022లోనూ సాధారణ పరిపాలన శాఖ ఇదే ఆదేశాలు ఇచ్చింది. కానీ  జీవోలు మాత్రం ఏపీ గెజిట్ వెబ్ సైట్లో కనిపించలేదు.   ఈ ఏడాది మే నెలలోలో కూడా జీవోల అప్ లోడింగ్ పై ప్రభుత్వ శాఖలకు మరోసారి ఆదేశాలు జారీ  అయ్యాయి. అయినా ఇప్పటికీ పరిస్ధితిలో మార్పు లేదు.  జీవోలు అప్ లోడ్ చేయకపోవటాన్ని ఇటీవలే హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి హడావిడిగా వివిధ శాఖలకు జీఏడీ అన్ని జీవోలు అప్ లోడ్ చేయాలని ఆదేశిస్తూ  నోట్ విడుదల చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఆదేశాలు కూడా ఉతుత్తి ఆదేశాలేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ప్రభుత్వం ప్రతీ రోజూ పలు అంశాలపై వివిధ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలను జీవోల రూపంలో  విడుదల చేస్తుంది. ఈ జీవోల ఆధారంగానే సంబంధిత వ్యక్తులు, సంస్ధలు, అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. వీటిని గతంలో జీవోఐఆర్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసే వారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2021లో పలు మార్పులు చేసి ఏపీ గెజిట్ పేరుతో కొత్త వెబ్ సైట్  తీసుకువచ్చింది. సైట్ పేరు అయితే మారింది కానీ  జీవోలు మాత్రం అప్ లోడ్ కావడం లేదు. దీనిపై చాలా కాలంగా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నాలుగున్నరేళ్ల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అంశంపై ఇప్పటికే పదిసార్లు ఫిర్యాదులు, పదుల సంఖ్యలో ఆదేశాలు ఇచ్చారంటే ఇది ఏ స్థాయిలో  వివాదాస్పదం అయ్యిందో అర్ధం అవుతుంది. ప్రభుత్వం ఎన్నిసార్లు ఆదేశాలిచ్చినా పూర్తిస్థాయిలో జీవోలు అప్ లోడ్ కావడం లేదు. వాస్తవానికి ప్రభుత్వమే మా ఆదేశాలు ఉత్తుత్తివే.. జీవోలు అప్ లోడ్ ప్రశక్తేలేదన్న విధంగా వ్యవహరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   చాలాసార్లు రహస్య జీవోలు తెచ్చి ఆయా శాఖలకు ఆదేశాలివ్వడం, ఆ శాఖ గుట్టుచప్పుడు కాకుండా అమలు చేయడం జరిగిపోతుంది. అలాంటి రహస్య జీవోలకు కూడా నంబరు ఉంటుంది కానీ  అందులో కంటెంట్‌ మాత్రం కనపడదు.   ఈ ప్రభుత్వంలో  జీవోలు ఏవీ కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఇప్పుడు జీవోలన్నీ విడుదల చేయమంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కూడా ఉత్తుత్తివేనన్న అభిప్రాయమే సర్వత్రా వినవస్తోంది.  జగన్ ప్రభుత్వం తీసుకొనే పలు నిర్ణయాలపై మీడియాలో చర్చ జరగడం, సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవడం, కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు రావడం తెలిసిందే. దీంతో ఈ జీవోల రూపంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఏపీ గెజిట్ లో జీవోలను అప్ లోడ్  చేయడం మానేశారు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోవడం.. ఆయా శాఖలు ఆ ఆదేశాలను అమలు చేయడం జరిగిపోతున్నది. కానీ ప్రజలకే అసలు విషయం తెలియడం లేదు. ప్రభుత్వానికి పారదర్శకత చాలా అవసరం. కానీ  జగన్ సర్కార్ లో అదే లోపించింది. దీంతో హైకోర్టు ఆగ్రహించి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. ఆ వెంటనే ప్రభుత్వం అన్ని శాఖలకు మరోసారి ఆదేశాలిచ్చింది. కానీ, ఈ ఆదేశాలు అమలవుతాయా అంటే  మాత్రం అనుమానమే అన్న సమాధానమే వస్తోంది. 

ఒక్క అడుగు.. ఒకే ఒక్క అడుగు!

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆ ఎన్నికల వేడిని మించి మరో వేడి దేశం అంతటా జనాలను నిలవనీయడం లేదు.  ఆబాల గోపాలం ఒక రకమైన ఉత్సాహం, పట్టలేనంత ఉత్కంఠతో ఊగిపోతున్నారు. నిజమే.. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో కూడా జనం మూడ్ అంతా ఎన్నికలపై కంటే.. దేశంలో ఒక మతంలాంటి క్రికెట్ మీదే ఉంది.  భారత్ వేదికగా  జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ చివరి అంకానికి వచ్చేసింది. విశ్వవిజేతగా నిలవడానికి తలపడనున్న జట్లేవో కూడా తేలిపోయింది. రెండు చాంపియన్ జట్ల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (నవంబర్ 19)న జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ పైనే ఇప్పుడు యావద్దేశం దృష్టి సారించింది. ప్రధాని మోడీ సైతం ఎన్నికల ప్రచారానికి సైతం విరామం చెప్పి అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి స్టేడియంకు వెళ్లనున్నారు.  ఇంతకీ ఆఫైనల్ లో తలపడనున్న రెండు చాంపియన్ జట్లూ ఏమిటంటే.. ఇప్పటికే రెండు సార్లు మెగా క్రికెట్ టోర్నీ వరల్డ్ కప్ లో విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. అదే టీమ్ ఇండియా ఒకటైతే...ఏకంగా ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మరో జట్టు. దీంతో అహ్మదాబాద్ లో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటి వరకూ జరిగిన టోర్నీలో ఈ రెండు జట్ల ప్రదర్శనా తీసుకుంటే.. నిస్సందేహంగా టీమ్ ఇండియా బెటర్ పెర్ఫార్మెన్స్ తో హాట్ ఫేవరెట్ గా ఉందనే చెప్పాలి. ఈ టోర్నీలో  లీగ్ దశలో ఆడిన ఎనిమిది మ్యాచ్ లలోనూ సాధికారికంగా విజయం సాధించి.. ఆ తరువాత నాకౌట్ దశలో సెమీస్ లో దక్షిణాఫ్రికాపై అలవోక విజయం సాధించి ఈ టోర్నీలో ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా నిలిచిన టీమ్ ఇండియా మరొక్క విజయం సాధిస్తే విశ్వ విజేతగా నిలుస్తుంది.  ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. తడబడుతూ, అసలు సెమీస్ అర్హత సాధిస్తుందా అన్న సందేహాల నడుమ గొప్పగా పుంజుకుని సెమీస్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్ కు వచ్చింది.  ఇంత వరకూ క్రికెట్ విశ్వవిజేతగా ఐదు సార్లు విజయం సాధించి గొప్ప రికార్డు ఉన్న ఆస్ట్రేలియాతో.. మూడు సార్లు విజేతగా నిలిచి విండీస్ తో కలిసి రెండో స్థానంలో ఉన్న భారత్ తలపడనుండటంతో ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.  రికార్డులను పక్కన పెడితే.. ప్రస్తుతం టీమ్ ఇండియా ఉన్న ఫామ్ చూస్తే భారత్ విజయం నల్లేరుమీద బండినడకే అని విశ్లేషణలు చేస్తున్న క్రీడా పండితులు కూడా ఆసీస్ ను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదనీ, ఓటమిని అంగీకరించిన ఆసీస్ విజయం కోసం చివరి వరకూ పోరాడుతుందని చెబుతున్నారు. విన్, డిఫీట్ రికార్డులను పక్కన పెడితే.. భారత్ వేదికగా టోర్నీ జరుగుతుండటం భారత్ కు ఓ విధంగా కలిసి వస్తుందని చెప్పాలి. అలాగే.. 2011 నుంచి వస్తున్న ట్రెండ్ ను ఒకసారి గమనిస్తే.. ఆతిథ్య జట్టే కప్ గెలుచుకుంటూ వస్తోంది. ఆ రకంగా చూసినా భారత్ వైపే త్రాసు మొగ్గు చూపుతోంది. 2011లో వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యమిచ్చింది. అప్పుడు ధోనీ కెప్టెన్సీలోని టీమ్ ఇండియా విశ్వ విజేతగా నిలిచింది. ఆ తరువాత క్రికెట్ వరల్డ్ కప్ కు 2015లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. అప్పుడు కూడా ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 2019లో వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఇంగ్లాండే ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి విజేతగా నిలిచింది.  1975లో మొదలైన వరల్డ్ కప్ టోర్నీ ప్రతి నాలుగేళ్లకూ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు ప్రపంచకప్ టోర్నీలకూ ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. తొలి రెండు సార్లూ విండీస్ విజయం సాధించగా 1983లో అండర్ డాగ్స్ గా టోర్నీలో అడుగుపెట్టిన భారత జట్టు కపిల్ దేవ్ సారథ్యంలో సంచలన విజయం సాధించింది తొలి సారిగా విశ్వ విజేతగా నిలిచింది.  ఆ తరువాత మళ్లీ 28 సంవత్సరాల తరువాత ధోనీ సారథ్యంలోని టీమ్ ఇండియా  విశ్వవిజేతగా నిలిచింది. ఇక ముచ్చటగా మూడో సారి ప్రపంచకప్ ను ముద్దాడేందుకు టీమ్ ఇండియా మరొక్క విజయం సాధిస్తే చాలు.  క్రికెట్ గాడ్ రికార్డును సైతం అధిగమించేసి తిరుగులేని ఫామ్ లో ఉన్న కింగ్ కోహ్లీ, ఫస్ట్ పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా చెలరేగి బ్రహ్మాండమైన ఆరంభాన్నిస్తున్న హిట్ మేన్, జట్టు సారథి రోహిత్ శర్మ, అలవోకగా పరుగులు సాధిస్తున్న యువ బ్యాట్స్ మన్ శుభమన్ గిల్.. మిడిలార్డర్ లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్, రాహుల్ లతో భారత బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేధ్యంగా కనిపిస్తోంది. ఇంకా ఇప్పటి వరకూ సూర్యకుమార్ యాదవ్, అజయ్ జడేజా వంటి వారికి పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసే అవకాశమే లభించలేదంటే టాప్ ఆర్డర్ ఎంత పటిష్టంగా ఉందో అర్ధమౌతుంది. ఇక బౌలింగ్ విభాగం విషయానికి వస్తే.. ఇంత కాలం స్పిన్ మాత్రమే భారత్ బలం అన్న అభిప్రాయాన్ని మన పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలు మార్చి పారేశారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ ఇండియా పేస్ అటాక్ ను ఎదుర్కోవడంలో అన్ని జట్లూ ఇబ్బంది పడ్డాయి అనడానికి సందేహించాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా షమీ మిస్సైల్ లాంటి బంతులతో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మెన్ కు ఎలా ఆడాలో తెలియని పరిస్థితి కల్పించాడంటే అర్ధం చేసుకోవచ్చు. ఇక స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్ లు కూడా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్లు పరుగుల కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి కల్పించారు. మొత్తంగా జట్టు ఇప్పటి వరకూ కొనసాగించిన ఫామ్ ను కొనసాగిస్తే..తడబడుతూ ఫైనల్ కు చేరిన ఆసీస్  ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని క్రీడా పండితులు అంటున్నారు. 

పులివెందుల జగన్ చేజారినట్లేనా?

పులివెందుల.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది వైఎస్ కుటుంబమే.  నాలుగున్నర దశాబ్దాలుగా పులివెందుల నుంచి పోటీ చేస్తున్నదీ, విజయం సాధిస్తున్నదీ కూడా వైఎస్ కుటుంబమే. 1978 నుంచి  పులివెందుల నుంచి వైఎస్‌ జగన్‌ కుటుంబం పోటీ చేస్తున్నది. గెలుస్తున్నది.  పులివెందుల నుంచి 1978, 1983, 1985లో వైఎస్ రాజశేఖరరెడ్డి విజయం సాధించారు. 1989లో వైఎస్సార్‌ కడప ఎంపీగా పోటీ చేస్తే, ఆయన సోదరుడు వైఎస్‌ వివేకానందరెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.   ఆ తర్వాత 1994లోనూ వివేకానే గెలుపొందగా.. మళ్ళీ 1999, 2004, 2009ల్లో వైఎస్సార్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్సార్‌ మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ సతీమణి విజయమ్మ గెలుపొందారు. ఆ తరువాత కూడా వైసీపీ నుంచి మరోసారి విజయమ్మ పోటీ చేశారు. విజయం సాధించారు.   ఇక 2014, 2019ల్లో   జగన్‌ పులివెందులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  అందుకే పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. నిన్నమొన్నటి వరకూ అందరూ ఆఖరికి ప్రతిపక్షాలతో సహా ఈ విషయమే చెప్పేవారు. అయితే ఇప్పుడు  ఆ పరిస్థితి మారిందా? ఇప్పుడు వైఎస్ కుటుంబం కంచుకోట పులివెందుల బద్దలు అవుతుందా? పులివెందులలో జగన్ ఓటమి ఖాయమైందా అంటే రాజకీయవర్గాలు, పరిశీలకులు అవును ఆ పరిస్థితి ఉందని అంటున్నారు. విపక్షాలైతే పులివెందుల ఇంకెంత మాత్రం వైఎస్ కుటుంబ కంచుకోట కాదని ఖరాకండీగా చెప్పేస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత కడప జిల్లా రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య తర్వాత ప్రజల దృష్టి, ఆలోచనా మారిందన్న అభిపాయాలు వ్యక్తమౌతున్నాయి. బాబాయిని హత్యచేసింది అబ్బాయేననే బలమైన ఆరోపణలు ఉండగా.. ఆ అబ్బాయితో సహా నిందితులకు జగన్ కొమ్ముకాస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  వివేకా హత్య కేసులో నిందితులు ఎవరన్నది న్యాయదేవత ఇంకా తేల్చకపోయినా, నిజం ఏంటన్నది పులివెందుల ప్రజలకు స్పష్టంగా అర్ధమైంది. సాక్షాత్తు వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. అన్న జగన్ పై తనకు నమ్మకం లేదంటూ.. నాన్నను చంపిన వాళ్ళని నా అనుకున్న వాళ్ళే కాపాడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు, తనకు న్యాయం చేయాలని ఇతర రాష్ట్రాల కోర్టుల చుట్టూ తిరగడం, కూతురు అల్లుడే ఆస్తి కోసం వివేకాను చంపారనేలా వైసీపీ నుంచి రివర్స్ ప్రచారం చేయడం పులివెందుల ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ కేసులో పలువురు అప్రూవర్లు గా మారడంతో ఈ కేసులో అసలు నిజా నిజాలు ఏంటన్నది పులివెందుల నియోజకవర్గం మొత్తం రచ్చబండ మీద చర్చగా బయటపడిపోయాయి.  ఇక  వైఎస్ సొంత కుటుంబంలో వివాదాలు కూడా ఇక్కడ జగన్ కు మైనస్ గా మారాయి.  తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను కూడా జగన్ దూరం చేసుకోవడం సొంత నియోజకవర్గం మీద ప్రభావం చూపిందంటున్నారు. తల్లి విజయమ్మ ఇప్పుడు జగన్ తాడేపల్లి నివాసంతో పాటు సొంత గడ్డ పులివెందులకు కూడా దూరం అయ్యారు. హైదరాబాద్ కూతురు షర్మిల వద్దనే ఆమె ఉంటున్నారు.   అందుకు జగనే కారణమని పులివెందుల ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఆస్తులు, పదవుల కోసమే జగన్ తల్లి, చెల్లిని తరిమేశారన్న సంకేతాలు బలంగా ప్రజలలోకి వెళ్లిపోయాయి. నియోజకవర్గంలో అటు తండ్రి,  ఇటు బాబాయ్ తో దగ్గరి సంబంధాలు ఉన్న  వారంతా ఇప్పుడు జగన్ పై నమ్మకం కోల్పోయారు. ఆ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు.   అసలే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంతృప్తికి, సొంత నియోజకవర్గంలో నెలకొన్న ఈ పరిస్థితులు కూడా తోడయ్యాయి. ఇలా ఎన్నో అంశాలతో సొంత గడ్డపై కూడా జగన్ కు వ్యతిరేకత ఎదురౌతోంది. మరోవైపు తెలుగుదేశం పులివెందుల ఇంచార్జి బీటెక్ రవి సైతం పులివెందుల నియోజకవర్గంలో దూకుడు పెంచారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు. పార్టీ కార్యాలయాలను ప్రారంభించి చాప కింద నీరులా విస్తరించారు. దీంతో జగన్ కంచుకోట గేట్లు బద్దలయ్యాయని అంటున్నారు. ఈ విషయం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. కానీ అప్పట్లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల  శాఖల మంత్రి.. పట్టభద్రులు కాదు.. తమ ఓటర్లు వేరే ఉన్నారంటూ  మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. మరి ఇప్పుడు నిఘా వర్గాలు హెచ్చరించాయో.. సొంత సర్వేలలో ఫలితాలు షాక్ కొట్టేలా చేశాయో కానీ ఇప్పటికిప్పుడు జగన్ పులివెందుల మీద ఫోకస్ పెంచినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే బీటెక్ రవిని సీఎం జగన్ అక్రమంగా అరెస్టు చేయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఈ తరుణంలో భూ పంపిణీ కోసం ప్రత్యేక జీవో జారీ చేయడం ఆ ఆరోపణలు వట్టి ఆరోపణలు కావని తేలుస్తోంది.   పులివెందులలో ఓటమి   భయంతోనే జగన్ ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అమ్మకు అన్నం పెట్టలేనోడు.. జగన్ డైలాగ్.. సోషల్ మీడియాలో యమా ట్రోలింగ్!

అమ్మ‌కు అన్నం పెట్ట‌లేనోడు.. పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేయిస్తాన‌న్న‌ట్టు చంద్ర‌బాబు వ్య‌వ‌హారం ఉంద‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. కూతురిని ఇచ్చిన మామ‌కు వెన్నుపోటు పొడిచిన వాడు.. పేద‌ల‌కు వెన్నుపోటు పొడ‌వ‌కుండా ఉంటాడా? అంటూ ప్రశ్నిస్తూ జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల‌లో వ‌రిక‌పూడిశెల ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి శంకుస్థాప‌న చేసిన అనంత‌రం మాట్లాడిన సీఎం జగన్ యధావిధిగా ముందే ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును తల ఎత్తకుండా చదువుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్య‌క్తి ఈ వ‌రిక‌పూడిశెల ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి క‌నీసం అనుమ‌తులు కూడా తీసుకురాలేక‌పోయార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము అన్ని అనుమ‌తులు తీసుకుని ఇప్పుడు శంకుస్థాప‌న చేశామని చెప్పుకొచ్చారు. ఇక పేద‌లు, మ‌హిళ‌ల కోసం ఒక్క ప‌థ‌కం పెట్టిన చ‌రిత్ర కూడా చంద్ర‌బాబుకు లేద‌న్న జగన్.. చంద్ర‌బాబు త‌న బినామీల భూముల ధ‌ర‌లు పెంచుకునేందుకే అమ‌రావ‌తి రాజ‌ధానిని ఎంచుకున్నారని విమ‌ర్శించారు. బీసీల తోక‌లు క‌ట్ చేస్తాన‌ని చంద్రబాబు అహంకార పూరితంగా మాట్లాడార‌ని, ఎస్సీల్లో ఎవ‌రైనా పుట్టాల‌నుకుంటారా? అని అన్నార‌ని జగన్ కులాలను కూడా టచ్ చేస్తూ విమర్శలు చేశారు. అయితే  సీఎం జగన్ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎలాంటి కార్యక్రమానికి హాజరైనా.. ఎలాంటి స్పీచ్ ఇచ్చినా అది సోషల్ మీడియాలో   తెగ వైరల్ అయిపోతోంది. ఆయన పార్టీ కార్యక్రమాలలో ఎప్పుడూ పాల్గొనరు.. ఆయన ప్రభుత్వ కార్యక్రమాలనే పార్టీ కార్యక్రమాలుగా మార్చేసుకుని ప్రసంగాలు దంచేస్తుంటారు. తాజాగా వరికిపూడిశెల ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో కూడా అదే చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ ప్రసంగంపై నెటిజెన్లు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు.  ముఖ్యంగా అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు గాజులు, మామ‌కు వెన్నుపోటు పొడిచిన వాడు.. పేద‌ల‌కు వెన్నుపోటు పొడ‌వ‌డా అనే డైలాగులను మీమర్లు తెగ వాడేసుకుంటున్నారు. తల్లి విజయమ్మను పక్క రాష్ట్రానికి తరిమేసి ఇక్కడ అమ్మకు అన్నం పెట్టలేనోడు అంటూ సామెతలు చెప్పడాన్ని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు. జగన్ తల్లి ఫోటోతో సహా జగన్ డైలాగ్ కలిపిన యూట్యూబ్ షాట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మామకు వెన్నుపోటు డైలాగుకు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఫోటోను కలిపి.. బాబాయికి గొడ్డలి పోటు పొడిచినోడు పేదలకు కత్తి పోటు పొడవడా అంటూ కౌంటర్ యూట్యూబ్ షాట్స్ హల్ చల్  చేస్తున్నాయి. ముఖ్యంగా చంద్ర‌బాబు త‌న బినామీల భూముల ధ‌ర‌లు పెంచుకునేందుకే అమ‌రావ‌తి రాజ‌ధానిని ఎంచుకున్న్నారన్న వ్యాఖ్యలపై విపరీతంగా కౌంటర్లు వేస్తున్నారు. మూడు రాజధానులని, మూడు ప్రాంతాల‌కు స‌మ‌న్యాయం చేస్తానంటూ జగన్ నాలుగున్నరేళ్లగా మాయ మాటలతో ఆరు కోట్ల ఆంధ్ర ప్రజలను దగా చేస్తున్నాడని నెటిజనులు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే చంద్రబాబు కట్టిన అమరావతి నుండే పాలన చేస్తూ.. అమరావతిని చంపేందుకు జగన్ చేస్తున్న కుట్రలను ఘోరంగా తూర్పార పడుతున్నారు.  పేద‌లు, మ‌హిళ‌ల కోసం చంద్రబాబు ఒక్క ప‌థ‌కం తెచ్చారా? అనే ప్రశ్నపై టీడీపీ శ్రేణులు ఆధారాలతో సహా ఏకిపారేస్తున్నారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత తెలుగుదేశం దే కాగా తొలిసారిగా మహిళలకు 33 అసెంబ్లీ సీట్లు, 5 మంత్రి పదవులు ఇచ్చి ఎన్టీఆర్ రాజకీయాలలో మహిళల ప్రాధాన్యత పెంచారు. అలాగే చంద్రబాబు శాసనసభకు తొలి మహిళా స్పీకరును అందించారు.  అలాగే గ్రామాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు చంద్రబాబు తీసుకొచ్చిన ‘డ్వాక్రా’ సంఘాలు తెలుగునాట ఊరూరా ఓ విప్లవాన్ని తీసుకువచ్చాయి. ఇప్పుడు ఈ డ్వాక్రా సంఘాలు ఏ స్థాయిలో విజయవంతం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ మహిళలు అష్టకష్టాలూ పడేవారు. ఆ పరిస్థితి నుండి   'దీపం' పథకాన్ని ప్రవేశపెట్టి ఆ రోజుల్లోనే దాదాపు 33 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి మహిళల కష్టాలను తీర్చిన  ఘనత చంద్రబాబుదే. విద్య, ఉపాధి రంగాలలో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు,  డీఎస్సీ వంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో మహిళలకు పెద్ద పీట వేయడంతో ఇప్పుడు ప్రతి పది మంది మహిళా టీచర్లలో ఆరుగురు ఆనాడు ఎంపికైన వారే ఉన్నారు. ఇక తెలుగుదేశం అంటేనే బీసీలకు పెద్ద పీట వేసిన పార్టీగా గుర్తింపు పొందింది. . తెలుగుదేశం ప్రభుత్వాలలో బీసీ నేతలే అత్యున్నత పదవులను అనుభవించారు. అలాగే అప్పట్లోనే చంద్రబాబు బీసీల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి వారికి ఉపాధి కల్పిస్తూ దన్నుగా నిలిచారు. ఎస్సీల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు పెట్టి ఆర్ధికంగా ఎదిగే అవకాశాన్ని కల్పించింది కూడా చంద్రబాబే. దీంతో వీటన్నిటినీ ఉదహరిస్తూ టీడీపీ శ్రేణులు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తున్నారు.

బీజేపీకి రాములమ్మ గుడ్ బై.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న విజయశాంతి!

చివరకు అనుకున్నదే అయ్యింది.   బీజేపీకి రాములమ్మ విజయశాంతి గుడ్ బై చెప్పేశారు.   తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. శుక్రవారం(నవంబర్ 17) తెలంగాణ పర్యటనకు  రానున్న కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ సమక్షంలో, విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. దీనితో సుదీర్ఘకాలం బీజేపీలో ఆమె పోషించిన పాత్ర ముగిసిపోయింది. అయితే రాములమ్మ రాజీనామా విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఫైర్ బ్రాండ్, మాజీ ఎంపి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేస్తారని చాలా కాలంగా వినిపిస్తున్నా, బీజేపీ హైకమాండ్ తీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆమె చేష్టల ద్వారా స్పష్టమౌతున్నా, అమెతో మాట్లాడేందుకు కానీ, ఆమె ఆగ్రహం లేదా అసంతృప్తికి కారణమేమిటో తెలుసుకుని పరిష్కరించేందుకు కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇసుమంతైనా చొరవ చూపకపోవడం పార్టీ శ్రేణులలో అసంతృప్తికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన సేవలు వినియోగించుకోని పార్టీ నాయకత్వంపై ఆమె చాలాకాలం నుంచి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ మేరకు సందర్భం వచ్చినప్పుడల్లా ట్వీట్లు చేసి, పార్టీని ఇరుకున పెట్టినా, నాయకత్వం ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు చేయలేదు. తెలంగాణకు ఇద్దరు ముగ్గురు ఇన్చార్జిలు ఉన్నప్పటికీ, వారెవరూ ఆమెతో మాట్లాడి అసంతృప్తి చల్లార్చే ప్రయత్నాలు చేయలేదు. ఆ క్రమంలో ఆమెకు ఆందోళన కార్యక్రమాల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ అది.. రాములమ్మలోని అసంతృప్తిని ఇసుమంతైనా తగ్గించలేదు.   నిజానికి విజయశాంతి సేవలు వినియోగించుకోవడంలో బీజేపీ నాయకత్వం విఫలమైందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జనంలో ఆమెకునన ఇమేజ్, సినీ గ్లామర్, ముక్కుసూటిగా కేసీఆర్ పాలనను నిర్భయంగా విమర్శలు చేసే ప్రసంగాలు తెలంగాణ ప్రజలకు సుపరిచితాలే. అటువంటి విజయశాంతి సేవలను బీజేపీ వినియోగించుకు ఉండి ఉంటే.. పార్టీ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండి ఉండేది కాదనీ.. పార్టీ క్యాడర్ బాహాటంగానే చెబుతోంది.     బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమెకు పార్టీలో సముచిత గౌరవం లభించేది. అయితే కిషన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమెను పట్టించుకోవడమే మానేసి పూర్తిగా పక్కన పెట్టారనీ, ఇదే ఆమె పార్టీ నుంచి వైదొలగడానికి కారణమని పార్టీ వర్గాలే అంటున్నాయి.  కిషన్ రెడ్డి వ్యవహారశైలిపై ఆమె పలు మార్లు పార్టీ నేతల వద్ద అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని చెబుతున్నారు. అసలు మొదట్టో విజయశాంతిని కేటీఆర్ పై సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న చర్చ జరిగింది. అందుకు విజయశాంతి అంగీకారం కూడా తెలిపారు. కానీ  చివరి జాబితాలో కూడా తన పేరు లేకపోవడం, లోక్‌సభ ఎన్నికల్లో పోటీపైనా స్పష్టత ఇవ్వకపోవడంతోనే విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పేశారని అంటున్నారు.  కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకార సభకు హాజరైన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాకను ఆక్షేపిస్తూ, విజయశాంతి అర్ధంతరంగా సభ నుంచి నిష్క్రమించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ‘తెలంగాణకు అడ్డుపడ్డ వారితో వేదిక పంచుకోవడం ఇష్టం లే కనే వెళ్లిపోయానంటూ ఆమె  చేసిన ట్వీట్ పై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం, కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార సభకు ఆహ్వానించి వేదికపై చోటు ఇవ్వడాన్ని విజయశాంతి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెకు పార్టీలోని పలువురు మద్దతు తెలిపారు కూడా. అయితే పార్టీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో ఆమె విసిగిపోయారని అంటున్నారు. అందుకే   ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ, వారిని విజయశాంతి కలవలేదని అంటున్నారు. దీంతొ అప్పుడే విజయశాంతి పార్టీ మారుతారన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.  కాగా విజయశాంతి నిష్క్రమణతో బీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే బలమైన నేతలందరికీ బీజేపీ పొమ్మనలేక పొగబెడుతోందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.  కేటీఆర్‌తోపాటు, కీలకమైన మంత్రులపై బలమైన అభ్యర్ధులను పోటీకి దింపకపోవడం, టికెట్లు తీసుకున్న అభ్యర్ధులు.. బీఆర్‌ఎస్ అభ్యర్ధులకు ఎక్కడా ఇబ్బంది కలిగించకపోవడం, అసలు చాలామంది అభ్యర్ధులు ప్రచారపర్వంలోనే నాన్ సీరియస్ గా ఉండటం వంటి కారణాలతో ఈ అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ కు పులివెందుల టెన్షన్!

అభద్రతా? భయమా?.. తెలియదు కానీ.. జగన్ ఇప్పుడు నీడను చూసినా ఉలిక్కిపడుతున్నారు.  సింహం సింగిల్ గా వస్తుంది.. భయం మీనింగే తెలియని బ్లడ్.. కొండను సైతం ఢీ కొట్టగల మొనగాడు.. ఎంతటి శక్తులనైనా ఎదురించగల మొనగాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి వైసీపీ నేతలు నిన్న మొన్నటి వరకూ చెప్పిన డైలుగులు ఇవి.  అయితే, ఇలాంటి డైలాగులు సినిమాలలో పేలుతాయేమో కానీ   కానీ రాజకీయాలలో మాత్రం కామెడీ పీసులుగా మిగిలిపోతాయి.  అందునా ఇలాంటి డైలాగులు జగన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పినవైతే.. మరీ ఓవర్ చేస్తున్నారు కదా అని పార్టీ శ్రేణులే సెటైర్లు వేసుకుంటాయి.   రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండి కూడా జగన్  రాజధాని ప్రాంతంలో రోడ్ల మీదకి వెళ్లేందుకు కూడా బిక్కు బిక్కు మంటూ కాసంత దూరానికి కూడా హెలికాఫ్టర్లో వెడుతున్నారు. సొంత ప్రాంతం పులివెందులలో  పర్యటనలకూ రోడ్లు బ్లాక్ చేయించుకుంటున్నారు. ఆయన రోడ్డు మీదకు వస్తున్నారంటే మనుషులెవరూ ఎదురుపడకుండా బ్యారికేడ్లు, పరదాలు..  ఇలాంటివి చూశాక కూడా వైసీపీ నేతలు జగన్ గురించి ఆహా ఓహో అంటూ చెబుతున్న డైలాగులు వినేవారికి పొగడ్డలుగా కాకుండా ఎగతాళి చేస్తున్నారా అన్న సందేహం వచ్చేలా చేస్తున్నాయి.  అది భయమా, అతి జాగ్రత్తా అన్నది పక్కన పెడితే.. ఇప్పుడు రాజకీయంగా కూడా జగన్ అభద్రతకు  లోనవుతున్నారా? ప్రతిపక్ష పార్టీల నేతలంటే భయపడుతున్నారా అన్న చర్చ జనంలోనే కాదు.. పార్టీ శ్రేణుల్లో కూడా జరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దగ్గర నుండి తాజాగా బీటెక్ రవి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వరకూ  విపక్ష నేతలను అడుగడుగునా అడ్డగించి పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నది. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి నిరసనా తెలిపేందుకు అనుమతి లేదంటూ అనధికారికంగా 144వ సెక్షన్ విధిస్తున్నారు. తెలుగుదేశం నేతలు కదిలితే చాలు అనుమతి లేదంటూ పోలీసులు కట్టడి చేసేస్తున్నారు. అసలు కేసేంటి? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించినా పోలీసుల దగ్గర సమాధానం ఉండడం లేదు. పై అధికారులు చెప్పారు.. మేం చేస్తున్నాం.. అనుమతి లేదు కదలొద్దు అంటూ పోలీసులు ఎక్కడివాళ్ళని అక్కడే నిర్బంధిస్తున్నారు. అందుకు ఉదాహరణలు కోకోల్లలు. తాజాగా  బీటెక్ రవి అరెస్ట్ మరో ఉదాహరణ.  సీఎం జగన్ రాజకీయ ప్రత్యర్థి, పులివెందుల తెలుగుదేశం ఇన్చార్జ్  బీటెక్ రవి వ్యక్తిగత పనిమీద మంగళవారం సాయంత్రం పులివెందుల నుంచి కడప వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని వల్లూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అప్పటికప్పుడు కడప ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించి కడపలో జడ్జి ఎదుట హాజరుపరచగా రవికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.  నిజానికి రవి తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కోరినా పోలీసుల దగ్గర సమాధానం లేదు. కనీసం ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామో చెప్పకుండానే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. జడ్జి ఎదుట హాజరు పరిచాక కానీ ఆ కేసు బయటపడలేదు. లోకేష్ యువగళం యాత్ర కోసం కడప జిల్లాకు వచ్చినప్పుడు ఎయిర్ పోర్ట్ లో జరిగిన తోపులాట కేసులో ఇప్పుడు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఎప్పుడో పది నెలల క్రితం కేసు. అప్పుడు ఈ కేసులో రవికి బెయిల్ దక్కగా.. ఇప్పుడు దాన్ని నాన్ బెయిలబుల్ గా మార్చినున్నట్లు తెలుస్తుంది. ఇది ఒక్కటే కాదు.. బీటెక్ రవిపై చాలా రకాల కేసులు నమోదు చేయడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ పై పోటీ చేసేందుకు ప్రత్యర్థి  లేకుండా చేయాలని చూస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి తన సొంత గడ్డ పులివెందుల విషయంలో కూడా  కూడా జగన్ ఎందుకింత అభద్రతా భావంతో ఉన్నారన్నది ఆసక్తిగా మారింది. రాజకీయ పునాదులు కదులుతుండడంతోనే బీటెక్ రవిని అరెస్టు చేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పులివెందులపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ప్రభుత్వ స్థలాల పంపిణీ విషయంలో జగన్ సర్కార్ తాజాగా ఓ ప్రత్యేక జీవో తీసుకొచ్చింది. పులివెందుల పురపాలక సంఘం పరిధిలోని మూడు గ్రామాల్లో 1100 ఎకరాల ప్రభుత్వ భూములను 1100 మందికి ఎకరా చొప్పున అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను పంపిణీ చేయకూడదని గతంలో అంటే  2012లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిషేధం విధించింది. దాని నుండి ఇప్పుడు జగన్ పులివెందుల మండలాన్ని మినహాయింపు ఇస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అంటే సొంత నియోజకవర్గం, సొంత మండలంలో ఇప్పుడు భూములు పంచి ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారని భావించాల్సి వస్తుంది. ఒకవైపు బీటెక్ రవి అరెస్ట్, మరోవైపు ప్రత్యేక జీవోలు తెచ్చి మరీ భూముల పందేరం వంటివి చూస్తే జగన్ కు పులివెందుల టెన్షన్ పట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తెలంగాణలో రాహుల్ మకాం...17 నుంచి 23 వరకు 

ఎన్నికలు కూత వేటు దూరంలో ఉండగా తెలంగాణలో కాంగ్రస్ స్పీడ్ పెంచింది. జోడో యాత్రతో తెలంగాణ ప్రజలకు దగ్గరైన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను మరో మారు పలకరించడానికి రానున్నారు. కాం‍గ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఆరు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన టూర్‌ ఖరారైనట్లు తెలుస్తోంది.17వ తేదీన తెలంగాణకు రానున్న రాహుల్‌ 23 దాకా ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం.శుక్రవారం ఉదయం తెలంగాణకు రానున్న రాహుల్‌ గాంధీ అదే రోజు పాలకుర్తి,వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్‌ నిర్వహించే సభల్లో పాల్గొంటారు.అక్కడి నుంచి వరుసగా ఆరు రోజుల పాటు ఆయన  సభల్లో పాల్గొననున్నారు.ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతీ నియోజకవర్గంలోనూ పార్టీకి చెందిన అగ్రనేతల పర్యటనలు ఉండేలా కాంగ్రెస్‌ కసరత్తులు చేస్తోంది.ఈ క్రమంలోనే ఒకేరోజు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీసమావేశాలు ఉండేలా ప్లాన్‌ చేస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో దూసుకుపోతుంది. సిక్స్ గ్యారెంటీస్ తో  కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షణ రోజు రోజుకి పెరుగుతోంది. తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం యాంటీ ఇన్ క్యుంబెన్సీ మూట గట్టుకుంది. తెలంగాణ సాధించిన నేతగా కెసీఆర్ కు వరుసగా రెండు పర్యాయాలు అధికారం కట్టబెట్టారు.  మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి  బిఆర్ఎస్ నేత కెసీఆర్ ఉవ్వీలూరుతున్నప్పటికీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని  విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం  నుంచి రాహుల్ పర్యటన అని తెలుస్తోంది. కర్నాటకలో అధికారంలో ఉన్న బిజెపిని మట్టికరిపించిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్ తో తెలంగాణలో అడుగుపెట్టింది. లిక్కర్ స్కాంలో ఉన్న కల్వకుంట్ల కవితను బిజెపి ప్రభుత్వం ఇంత వరకు అరెస్ట్ చేయలేదని బిఆర్ఎస్ బీ టీం బిజెపి అని  కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో  తీసుకెళ్తుంది.   

మిర్యాలగూడ బిఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో తాజాగా  హైదరాబాద్‌తో పాటూ నల్గొండ, మిర్యాలగూడ‌లో 40 ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు ఇంట్లో తెల్లవారుజామున 4 గంటల నుంచీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్క నల్గొండలోనే 30 బృందాలు తనఖీలు చేపడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు నిల్వ చేసినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ రైడ్స్‌ జరగుతున్నాయి.  హైదరాబాద్‌ సహా నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నల్లమోతు భాస్కర్  అనుచరుడు శ్రీధర్‌ నివాసంలో కూడా ఐటీ దాడులు జరిగాయి. శ్రీధర్‌ నివాసంలో తెల్లవారుజామున నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నల్లమోతుకు వ్యాపారాలు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. పలు పవర్‌ప్లాంట్లలో నల్లమోతు భాస్కర్‌రావు పెట్టుబడులు పెట్టినట్టు వివరాలు సేకరించారు. ఎన్నికల కోసం భారీగా డబ్బులు నిల్వ చేసినట్టు నల్లమోతు భాస్కర్‌రావుపై ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీకి బాలినేని రాంరాం?

బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి. ఈ ఇద్దరూ బంధువులే కాకుండా ఒకప్పుడు ఆప్త మిత్రులు కూడా. అంతే కాదు ఇద్దరూ కూడా   సీఎం జగన్ మోహన్ రెడ్డికి బంధువులు. జగన్ కాంగ్రెస్ తో  విభేదించి సొంత కుంపటి పెట్టుకున్నప్పుడు ఇద్దరూ జగన్ వెంటే వచ్చారు. బాలినేని అయితే పదవులకు రాజీనామా చేసి మరీ జగన్ వెంట నడిచారు.. అందుకే అప్పటి నుండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఇద్దరిదే వైసీపీలో పెత్తనం. అయితే  ఇద్దరితో పోలిస్తే సుబ్బారెడ్డి జగన్ కు మరింత దగ్గరి బంధువు. అందుకే ఆయనను రెండుసార్లు ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక సమీకరణాల పేరుతో రెండున్నరేళ్లకే బాలినేనిని మంత్రి పదవి నుండి తప్పించారు. ఇక ఇప్పుడు సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పదవీ కాలం ముగిసి సొంత జిల్లాకు చేరిన క్షణం  నుంచీ అవుట్ అండ్ అవుట్ గా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుబ్బారెడ్డి హవాయే  సాగుతున్నది. నిజానికి చాలా కాలంగా బాలినేని జిల్లా రాజకీయాలలో సొంత పార్టీతోనే పోరాడుతున్నారు. పలుమార్లు అలకబూనడం.. అధిష్టానం పిలిచో, పిలిపించుకునో బుజ్జగించడం రివాజుగా మారిపోయింది. అయితే   ఇప్పుడు మాత్రం బాలినేనిలో  అసంతృప్తి తారస్థాయికి చేరిందంటున్నారు.  రెండేళ్లుగా బాలినేని  సమయం వచ్చినప్పుడల్లా సొంత పార్టీలోనే రెబల్ గా వాయిస్ వినిపిస్తున్నారు. సొంత పార్టీ నేతల తప్పులను ఎత్తి చూపుతూ అధిష్టానానికి కంట్లో నలుసుగా మారిపోయారు. ముఖ్యంగా సుబ్బారెడ్డి అనుచరుల అక్రమాలను బయటపెడుతూ పార్టీలో చర్చకు తెర లేపారు. దీంతో ఆ మధ్య బాలినేని అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేయగా బాలినేని వైసీపీ పెద్దలపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మరోసారి జిల్లాలో తన మాటకు విలువ లేకుండా చేశారని ఆవేశాన్ని వెళ్లగక్కారు. ఆ తర్వాత సుబ్బారెడ్డి భూఅక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో అసలైన దోషులను వదిలేశారంటూ పోలీసులపైనే విమర్శల దాడి చేశా రు. దీంతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్ఠానంబాలినేని పిలిచి బుజ్జగించి సంయమనం పాటించాలని జిల్లాలో అధికారం, పెత్తనం నీదే అంటూ హామీలిచ్చింది. కానీ, జిల్లాలో సుబ్బారెడ్డి హవాయే కొనసాగుతుండడంతో బాలినేనిలో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ఇక ఇప్పుడు బాలినేని పార్టీకి రాంరాం చెప్పేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ శ్రేణుల్లోనే జోరుగా ప్రచారం జరుగుతున్నది. తాజాగా ఓ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఇకపై తాను జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించబోతున్నట్లు చెప్పడం ద్వారా బాలినేనికి పార్టీలో ఇక చోటులేదన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో  వైసీపీ పార్టీ, పగ్గాలు గంపగుత్తగా సుబ్బారెడ్డి చేతుల్లో జగన్ పెట్టేశారని తేటతెల్లమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బాలినేని పార్టీని వీడి వెళ్లడమో, లేకుంటే పార్టీయే అతడిని బయటకు పంపించడమో జరుగుతుందని అంటున్నాయి.   సుబ్బారెడ్డికి పూర్తి స్థాయిలో జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం అంటే ఇంత కాలం పొమ్మనలేక పొగబెట్టిన జగన్ ఇప్పుడు పొగ ఎందుకు అనుకున్నారో ఏమో బాలినేనిని పొమ్మని ఏకంగా మంటే పెట్టేశారని పరిశీలకులు అంటున్నారు.  జగన్ మోహన్ రెడ్డి బాలినేనిని వదులుకునేందుకు ఎప్పుడో సిద్ధమయ్యారని.. అందుకే ఇన్నాళ్లు ఇలా సుబ్బారెడ్డితో పొగబెట్టించారని వైసీపీలో చర్చ జరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో  ముసుగులో గుద్దులాట, దాగుడుమూతలు ఎందుకనుకున్నారేమో.. నేరుగా సుబ్బారెడ్డి నోటితోనే జిల్లా పార్టీలో తాను యాక్టివ్ అవుతాననీ, వచ్చే ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పించి బాలినేనికి ఆయన స్థానం ఏమిటో డైరెక్ట్ గా చూపించేశారు.   వైవీ సుబ్బారెడ్డి పోటీ చేస్తే ఒకటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం లేదా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తారు. ఈ రెంటిలో ఏది జరిగినా బాలినేనికి చిక్కులు తప్పవు.  ఎందుకంటే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  బాలినేని   ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి  మాగుంట శ్రీనివాసులు సిట్టింగులుగా ఉన్నారు. మాగుంట బాలినేని మనిషే. ఆర్ధిక బలమున్న మాగుంటను గత ఎన్నికల ముందు   బాలినేనే చొరవ చూపి వైసీపీలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఇరువురూ కూడా పార్టీలో ఇమడలేకపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనూ ఇరువురూ కూడా తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వెళ్లారని గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.    ఇప్పుడు సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో బాలినేని ఇక వైసీపీని వీడడం ఖాయమని రాజకీయ వర్గాలు  అంటున్నాయి. అదే జరిగితే రానున్న ఎన్నికలలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ కు మార్గం సుగమం అయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రెగ్యులర్ బెయిలా.. క్వాష్ పిటిషన్ తీర్పా.. ఏం జరుగుతుంది? ఏందుకీ జాప్యం??

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం బనాయించి అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజుల పాటు జైల్లో ఉంచిన స్కిల్ కేసు పరిస్థితి ఏంటి? ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ పై ఉండగా.. ఈ బెయిల్ గడువులోగా ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ వస్తుందా? సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు ఎప్పుడు వస్తుంది? క్వాష్ పిటిషన్ లో ఊరట లభిస్తుందా లేదా? ఇలా  స్కిల్ కేసుపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. స్కిల్ కేసులో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. అక్టోబర్ నెలలోనే సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేయగా ఈ నెల మొదటి వారంలోనే తీర్పు వెలువడాల్సి ఉంది. కానీ,  దీపావళి సెలవుల తర్వాతకు తీర్పు వాయిదా పడింది. ఈ నెల 23లోగా క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుపై నమోదైన అన్ని కేసులకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఈ తీర్పు కీలకం కానుంది.  ఇక ఇదే కేసులో ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉండగా పూర్తిస్థాయి బెయిల్ పిటిషన్ ఈ బుధవారం (నవంబర్ 15) హైకోర్టులో విచారణ చేయాల్సి ఉంది. కానీ, ఆ రోజు విచారణ వాయిదా పడింది.  స్కిల్ కేసులో చంద్రబాబు నేరం చేశారనే దానిపై వివరాలు ఇవ్వాలని, సీఐడీ ఆరోపించినట్లుగా టీడీపీ ఖాతాలోకి 27 కోట్లు వచ్చాయనే వివరాలు ఇవ్వాలని కోర్టు సీఐడీని కోరింది. అయితే ఏపీ సీఐడీ ఇన్నాళ్లు మౌనంగా ఉండి సరిగ్గా బుధవారం విచారణ అనగా మంగళవారం( నవంబర్ 14) స్కిల్ ప్రాజెక్టు వివరాలు కావాలని టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చింది. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం తరఫు న్యాయవాదులు.. వాయిదాలపై వాయిదాలు కోరుతూ బెయిలుపై కోర్టు నిర్ణయం జాప్యం అయ్యేలా వ్యవహరిస్తున్నారని సర్వులకూ అర్ధమైంది.  అందుకు అనుగుణంగానే   బుధవారం(నవంబర్ 15) హైకోర్టు విచారణలో ఏదీ తేలక గురువారానికి (నవంబర్ 16)వాయిదా వేశారు. ఆ రోజు కూడా బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి చేస్తారా అన్నది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.  నిజానికి ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. గత విచారణలో అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేరని.. సీఐడీ ఏకంగా 22వ తేదీకి వాయిదా కోరారు. కానీ, కోర్టు కుదరదంటూ 15వ తేదీకి వాయిదా వేసింది. కానీ, ఇప్పుడు 14వ తేదీన వివరాలు కావాలని టీడీపీకి నోటీసులు ఇవ్వగానే మరోసారి వాయిదాకేనని అర్ధమైపోయింది. ప్రస్తుతానికి అయితే ఈనెల చివరి వరకూ చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ కొనసాగనుంది. ఆ లోపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు, హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ పూర్తవుతుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే అసలు రిజర్వ్ లో ఉన్న తీర్పు ఎందుకు ఆలస్యమవుతున్నది? హైకోర్టులో బెయిల్ పిటిషన్ కూడా విచారణ ఎందుకు ఇలా  వాయిదాల మీద వాయిదాలు పడుతోంది అన్న చర్చలు కూడా సహజంగానే జరిగిపోతున్నాయి.  నిజానికి ఈ కేసు ఇటు సీఐడీ కోర్టు నుండి అటు సుప్రీంకోర్టు వరకూ ఎప్పుడో విచారణ పూర్తి అయ్యేది. కానీ, సీఐడీ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసును వాయిదాల మీద వాయిదాలు పడేలా చేస్తూ కేసును కొనసాగేలా చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే పలువురు న్యాయనిపుణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నేరం నిరూపించే స్థాయిలో ప్రభుత్వం వద్ద ఆధారాలు లేకపోవడం, సీఐడీ బనాయించిన కేసులకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతోనే న్యాయస్థానాలలో ఈ కేసు విచారణ వాయిదాల మీద వాయిదాలు పడేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా, దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నదని   న్యాయ నిపుణులు అంటున్నారు. సీఐడీ తమ వద్ద ఆధారాలు లేకపోయినా ప్రభుత్వ న్యాయవాదులతో వాయిదాలు కోరేలా చేస్తూ ప్రభుత్వానికి రాజకీయంగా లబ్ది చేకూర్చాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఏది ఏమైనా ఈ నెలలోనే ఈ కేసులో తీర్పు రావాల్సిన అవసరం ఉండగా సీఐడీ, ప్రభుత్వ తరపు న్యాయవాదులు అందుకు ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తారన్నఅనుమానాలూ, సందేహాలూ సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

బాలకృష్ణ కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్త... స్వల్ప ఉద్రిక్తత

ప్రముఖ సినీ నటుడు,  టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత అశ్వర్థరెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన బాలయ్య... తిరిగి ఇంటికి వెళ్తుండగా మధు అనే వైసీపీ కార్యకర్త ఆయన కారును అడ్డుకున్నాడు. తన చేతిలో ఉన్న ప్లకార్డుతో వాహనాన్ని అడ్డుకోబోయాడు. మధును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.దీంతో అక్కడ కొంతసేపు హైడ్రామా చోటుచేసుకుంది. అనంతరం అక్కడి నుంచి బాలయ్య కాన్వాయ్ బయల్దేరింది.  అంతకుముందు ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు  జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం- జనసేన పార్టీల ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వహించారు.

మోడీ సర్కార్ కు ఎన్నికల కోడ్ లేదా? వర్తించదా?

ఎన్నికలకు ముందు వాగ్దానాలు, వరాలు కురిపించడం రాజకీయపార్టీలకు మామూలే. అవి అమలు చేయగలమా? లేదా? అన్న విషయం పట్టించుకోకుండా.. ఎన్నికలలో ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా పార్టీలు ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించడం కొత్తేమీ కాదు. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత సంయమనం పాటించాలి. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలూ ఓటర్లకు ఆకస్మిక ధనలాభం చేకూర్చే వాగ్దానాలు చేయరాదు. ఎన్నికల సంఘం ఇటువంటి వాగ్దానాలపై కన్నేసి ఉంచాలి. అయితే ఆ పని ఎన్నికల సంఘం సక్రమంగా చేస్తోందా అంటే అనుమానమే అన్న సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఇటీవల ఛత్తీస్ గఢ్ ఎన్నికల సభలో ప్రధాని మోడీ   ఉచిత నిత్యావసర వస్తువుల పంపిణీ పథకాన్ని మరో అయిదు సంవత్సరాలు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి  గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన  కింద కోవిడ్‌ సమయంలో దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందే విధంగా ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.   ఈ పథకాన్ని 2022డిసెంబర్‌ నెలలో జాతీయ ఆహార భద్రతా చట్టంలో విలీనం చేసి, మరో ఏడాది పాటు  పొడిగించారు. ఆ పథకం ఈ ఏడాది డిసెంబర్‌ నెలతో ముగుస్తోంది. అటువంటి పథకాన్ని   మరో అయిదేళ్లు పొడిగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చత్తీస్‌ గఢ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేయడం ప్రజానీకాన్నే కాకుండా కేంద్రం లోని అధికారులు, మంత్రులను సైతం రెండు విధాలుగా ఆశ్చర్యానికి గురిచేసింది. దేశ జనాభాలో సుమారు 60 శాతం మందికి వర్తించే ఈ బృహత్తర పథకాన్ని ఎకాయెకిన అయిదేళ్లపాటు పొడిగించడం ఈ ఆశ్చర్యానికి ఒక కారణమైతే.. ఆ ప్రకటన చేయడానికి ఆయన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణాన్ని ఉపయోగించుకోవడం మరో కారణం. కచ్చితంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అనుచిత లబ్ధి పొందే దురాలోచనతోనే మోడీ ఎన్నికల ప్రచార సభలో ఈ ప్రకటన చేశారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అసలు ఎన్నికల నిబంధనలు అనేవి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు వర్తించవా? అని   నిలదీస్తున్నాయి. ఆ ప్రకటనపై ఇప్పటి వరకూ ఎన్నికల సంఘం ఎటువంటి స్పందనా లేకుండా మౌనం వహించడాన్నీ ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదనడానికి ఇంత కంటే ఉదాహరణ కావాలా అని మండి పడుతున్నాయి. మోడీ ఎన్నికల నిబంధనలను ఇసుమంతైనా లెక్క చేయరనడానికి ఇంతకు ముందు కూడా పలు ఉదంతాలు రుజువులుగా ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన పోలింగ్ బూత్ లో ఓటు వేసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్నికల చిహ్నమైన కమలాన్ని చేతిలో పట్టుకున్నారు.  ఆ సమయంలో ఆ తీరును ప్రశ్నించిన మీడియాకు ఆయన తాను కమలం పువ్వును కాకుండా, హస్తం గుర్తును పట్టుకుంటానా అని ఎదురు ప్రశ్నించారు. అప్పట్లో ఈ విషయంపై ఎన్నికల సంఘం నోటీసులు కూడా ఇచ్చింది. ఆ తరువాత వాటి సంగతి ఏమై ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. ఇక ప్రస్తుతానికి వస్తే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉచిత బియ్యం పథకాన్ని ఏకంగా ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఈ ఎన్నికలలోనే కాకుండా వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రయోజనం పొందడమే లక్షయంగా కనిపిస్తోంది.  అంతే కాకుండా ఈ ప్రకటన ద్వారా మోడీ తన ద్వంద్వ వైఖరిని తానే చాటుకున్నారు.  దేశంలో  పేదరికం ఇదివరకటి స్థాయిలో లేదని మోడీ సర్కార్ చాలా కాలంగా చెబుతూ వస్తున్నది. తన ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో 13  13.50 కోట్ల మంది పేద ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చినట్టు మోడీ సర్కార్ ప్రకటించారు. ఇప్పుడు దేశంలో 60 శాతం మందికి మరో ఐదేళ్ల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామంటూ మోడీ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించడం ద్వారా.. దేశంలో పేదరికం తగ్గడం మాట అటుంచి మరింత పెరిగిందని ఆయనే చెప్పినట్లు అయ్యింది. నిజంగానే దేశంలో పేదరికం తగ్గినట్లైతే ఈ పథకాన్ని ఎందుకు ప్రకటించినట్లు? వాస్తవానికి   ప్రపంచ బ్యాంకు కూడా భారతదేశంలో పేదరికంగా బాగా తగ్గిపోయిందని గణాంకాలతో సహా వెల్లడించింది. 2004లో 39 శాతానికి పైగా ఉన్న పేద ప్రజానీకం  2019 నాటికి 12.7 శాతానికి తగ్గిపోయినట్టు పేర్కొంది. అదే నిజమైతే ఇన్ని కోట్ల మందికి ఉచితంగా బియ్యం సరఫరా చేయడం ఎందుకు? ఎందుకంటే నిస్సందేహంగా ఎన్నికల లబ్ధి కోసమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రి విధాన ప్రకటన చేయడం కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనే అని అంటున్నారు.  అయితే బీజేపీ, మోడీ మాత్రం దీనిని  ఎన్నికల వాగ్దానాల్లో భాగమని బుకాయిస్తోంది.  మిగిలిన పార్టీలు   ఎన్నికల వాగ్దానాలు చేస్తున్నట్టే తాము కూడా వాగ్దానం చేశామని   వాదిస్తోంది. ఎన్నికల సంఘం మాత్రం మౌనం వహిస్తోంది.