బర్రెలక్కసభపై దాడి

తెలంగాణ రాజకీయాలలో నవ సంచలనం బర్రెలక్కపై దాడి జరిగింది. ఎంత చదువుకున్నా, ఏళ్ల తరబడి కోచింగ్ లు తీసుకున్న తెలంగాణలో ఉద్యోగాలు వచ్చే దారే కనిపించడం లేదని ఆరోపిస్తూ, ప్రభుత్వోద్యోగం కోసం కోచింగ్ లు తీసుకుంటూ డబ్బులు, సమయం వృధా చేసుకోవడం కంటే బర్రెలు కాసుకోవడం బెటర్ అంటూ శిరీష అనే నిరుద్యోగ యువతి బర్రెలక్కడా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది.  

తాను నిరుద్యోగుల గొంతుకనవుతానంటూ బర్రెలక్క ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగింది. మహబూబ్ నగర్‌లోని కొల్లాపూర్ నియోజకవర్గం నుండి బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచింది.  అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో శిరీష నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నది. ఆమె ప్రచారానికి జనం బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఆమెకు సంఘీభావం తెలుపుతున్నారు. పలువురు ప్రచారానికి ఆర్థికంగా సహకారం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీల గుండెల్లో దడ మొదలైంది. కేసీఆర్ ప్రచారంలో కూడా బర్రెలక్క ఎన్నికల చిహ్నం విజిల్ సందడి చేయడంతో ఆయన ఒకింత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇలా జోరుగా సాగుతున్న బర్రలక్క ప్రచారం ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారిందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.  

ఈ నేపథ్యంలో  బర్రెలక్క మంగళవారం కొల్లాపూర్ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో గుర్తుతెలియని వ్యక్తులు   దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు చీల్చుతాననే భయంతోనే తనపై దాడి చేశారని అన్నారు. తనపై దాడి చేసింది ఏ పార్టీ వారో తెలిదయన్నారు. రాజకీయాలు అంటేనే రౌడీయిజం అనేవారు.. కానీ తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానన్నారు. నిరుద్యోగుల కోసం పోరాడాటానికి వస్తే.. తనపై ఇలా దాడులు చేస్తున్నారని ఆమె భోరున విలపించారు. ఇప్పటి వరకు తనకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చినా తాను  ఎవరి పేరూ బయటపెట్టలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. పోలీసులకు తమకు రక్షణ కల్పించాలని కోరారు.

Teluguone gnews banner