మార్పు మొదలైంది!.. వైసీపీ ఓటమి ఖరారైంది!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆ మార్పు స్పష్టంగా గోచరిస్తోంది. ఇప్పటి దాకా ఇష్టారీతిగా, అడ్డగోలుగా, అధికార పార్టీ ఏం చెబితే అది చేసిన అధికారులు ఇప్పుడు నిబంధనలు మీరమని ఆ పార్టీ నేతల ముఖం మీదే చెప్పేస్తున్నారు. వైసీపీ ప్రయోజనాల కంటే మా ఉద్యోగ భద్రతే మాకు ముఖ్యమంటూ తెగేసి చెబుతున్నారు. నాలుగున్నరేళ్ల పై చిలుకు కాలంగా రాష్ట్రంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం వేరువేరు అని ఎవరూ అనుకోవడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేస్తారు. బాధితుల ఫిర్యాదులు స్వీకరించడానికి వారి చేతులు రావు అన్నట్లుగానే సాగింది. ఇక ప్రభుత్వం తరఫున పని చేయాల్సిన అధికారులు అధికార పార్టీ కార్యకర్తలను మించి పార్టీ భక్తి ప్రదర్శిస్తారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఇప్పటి వరకూ అదే  పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు వంటి నాయకుడిని కూడా ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేసేస్తారు. కారణం చెప్పమంటే ముందు అరెస్టు చేస్తున్నాం, తరువాత దర్యాప్తు చేసి అరెస్టుకు కారణమేంటో చెబుతాం అంటూ తర్కానికి అందని వాదనను తెరమీదకు తీసుకువస్తారు. ఇలా జగన్ పార్టీ కనుసన్నలలో నడిచిన అధికారులకు ఇప్పుడు తమ విధులు, పరిమితులు, ఉద్యోగ ధర్మం, అన్నిటికీ మించి రూల్స్ గుర్తుకు వస్తున్నాయి.  ఎన్నికల ముంగిట అటువంటి వారిలో హఠాత్తుగా జ్ణానోదయం కలగడానికి కారణం ఎన్నికలు కాదు. ఆ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందన్న ఉప్పందడమేనని పరిశీలకులు అంటున్నారు.  నిన్న మొన్నటి వరకూ అధికార పార్టీ సభలు అంటే అడ్డగోలుగా వేలకు వేల బస్సులను కేటాయించేసి సామాన్య ప్రజల ఇక్కట్ల గురించి కనీసం ఆలోచన కూడా చేయని ఆర్టీసీ అధికారులు ఇప్పుడు మారారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఈ నెల 17న చిలకలూరి పేటలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు కావాలన్న తెలుగుదేశం లేఖకు ఆర్టీసీ ఆఘమెఘాల మీద స్పందించింది. బస్సులు కేటాయిస్తాం.. ఎన్ని బస్సులు కావాలో ఇండెంట్ పెట్టండంటూ రిప్లై ఇచ్చింది. ఇది నిజంగా ఆశ్చర్యకరపరిణామమే. ఎందుకంటే సిద్ధం సభకు వేలకొద్దీ బస్సులు కేటాయించిన ఆర్టీసీ విపక్షాల సభకు మాత్రం బస్సులు ఇచ్చే ప్రశక్తేలేదని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చింది. తెలుగుదేశం ఆధ్వర్యంలో చిలకలూరి పేటలో జరిగే సభకు బస్సులు కావాలంటూ తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడి లేఖకు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించారు. గత ఐదేళ్లుగా ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థలా కాకుండా వైసీపీ రవాణా సంస్ధగా మారిపోయిందనడంలో సందేహం లేదు. జగన్ సభలకు, వైసీపీ కార్యక్రమాలకు ఎన్ని వేల బస్సులను కేటాయించిందో, అలా కేటాయించిన బస్సులకు ఆ పార్టీ నుంచి సొమ్ములు ముట్టాయా లేదా అన్న లేక్కలు లేవు. అంతా వైసీపీ ఇష్టారాజ్యంగా నడిచిపోయింది.  అయితే తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలిసి పని చేయనున్నదన్న విషయం తేటతెల్లమయ్యాకా అన్ని శాఖల అధికారులలో వచ్చినట్లుగానే ఆర్టీసీ అధికారుల్లో కూడా మార్పు మొదలైంది.   వైసీపీ గెలిచే చాన్స్ లేదన్న నమ్మకం బలపడటంతో ఇప్పటి వరకూ ఊడిగం చేసిన అధికారులు మెల్లమెల్లగా తాము నిబంధనలకు లోబడే ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తున్నామని చెప్పుకోవడానికి తాపత్రేయ పడుతున్నారు.  ఒక్క ఆర్టీసీ అని కాదు, దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పుడైతే ప్రస్ఫుటంగా మార్పు కనిపిస్తోంది కానీ, జగన్ సర్కార్ భవిష్యత్ ను మాత్రం ఐఏఎస్, ఐపీఎస్ అధకారులు ముందుగానే కనిపెట్టేశారు. గత ఏడాది జూన్ నాటికే రాష్ట్రంలో వైసీపీ సర్కార్ మరోమారు అధికారంలోకి వచ్చే సరిస్థితి లేదని వారికి తెలిసిపోయింది. అదెలాగంటారా? జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై  అధికారం కోల్పోతుందా అన్న విషయం తెలుసుకోవడానికి రాజకీయపార్టీలు సాధారణంగా సర్వేల మీద ఆధారపడతాయి. సొంతంగా సర్వేలు నిర్వహించుకుంటాయి. ఆ సర్వేల ఆధారంగా కార్యాచరణను రూపొందించుకుంటాయి. కానీ ఇలాంటి సర్వేలేవీ అవసరం లేకుండానే  వచ్చే ఎన్నికలలో విజయం సాధించే పార్టీ ఏది? పరాజయం పాలయ్యే పార్టీ ఏది అన్న విషయం అందరికంటే ముందే పసిగట్టేయగలరు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారులు. వారినే రాజకీయ పరిభాషలో బాబూస్ అని పిలుస్తారు. వారెలా కనిపెట్టేయగలరంటారా? అదంతే వారికన్నీ అలా తెలిసిపోతుంటాయంతే.  వారికి ఎలా తెలిసిపోతుందంటారా? అదంతే.. వారు ప్రజలలోకి రాకపోయినా రాజకీయ క్షేత్రంలో ఎక్కడ ఏం జరుగుతోందో ఇట్టే కనిపెట్టేయగలరు? వారి ఉద్యోగ ధర్మంలో భాగంగా వారికి ఉండే నెట్ వర్క్ అలాంటిది.  రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేనట్టుగా కనిపించే వీరు రాజకీయ పరదాల మాటున జరుగుతున్నదేమిటో ఇట్టే కనిపెట్టేయగలరు. రేపు ఎన్నికలలో గెలిచే పార్టీ ఏదో, ఓడే పార్టీ ఏదో ఇప్పుడే చెప్పేయగలరు? అటువంటి బాబూస్ ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్లు చేయడానికి ముందు వెనుకలాడుతున్నారు. నిబంధనలను ఒకటికి రెండు సార్లు చూసుకుని అవిధేయత ప్రదర్శించకుండానే తమ పరిధి దాటి పని చేయలేమని జగన్ సర్కార్ పెద్దలకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. అంతే కాదు.. ఏ మాత్రం చాన్స్ దొరికినా ఒక సారి తెలుగుదేశం అధినేత దృష్టిలో పడితే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచే  బాబూస్ లో ఈ మార్పు కనిపించింది. చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్న సమయంలో ఏపీకి చెందిన పలువురు బాబూస్ అక్కడకు వెళ్లి మరీ ఆయనను కలిసి వచ్చేవారు. తాము నిబంధనలను అతిక్రమించి పని చేసిన సందర్భాలను ఏకరవు పెట్టి ప్రభుత్వ ఒత్తిడే తప్ప అది తమ అభిమతం కాదని విన్నవించుకున్నారు.   ఇక ఎన్నికల ముంగిట వారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా నింబంధనలకు అనుగుణంగా పని చేయడానికే మొగ్గు చూపుతున్నారు. తద్వారా అధికార పార్టీ అడుగలు మడుగులొత్తడం లేదని విపక్ష నేతకు తెలిసేలా చేయడానికి తాపత్రేయ పడుతున్నారు. దీంతో అధికారుల వద్ద జగన్ పార్టీ నేతల పప్పులు గతంలోలా ఉడకడం లేదని అంటున్నారు. ఈ మార్పు.. జగన్ ప్రభుత్వ పతనానికి సంకేతంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. 

గుత్తా తనయుడు కాంగ్రెస్ వైపు అడుగులు 

తెలంగాణలో బిఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ లో ఎక్కువగా టిడిపి శ్రేణులున్నాయి.  బిఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఈ శ్రేణులన్నీ పక్క చూపులు చూస్తున్నాయి. ఒకప్పుడు కెసీఆర్ కూడా టీడీపీ నేత. టిడిపి హాయంలో డిప్యూటి స్పీకర్ అధిరోహించి మంత్రి పదవి రాకపోవడంతో తెలంగాణ ఉద్యమం పేరిట బయటకొచ్చారు. సక్సెస్ అయ్యారు. అప్పటి వరకు ఉన్న తెలంగాణ ఉద్యమకారులతో బాటు  టిడిపి శ్రేణులు బిఆర్ఎస్ లో కొనసాగాయి. మూడోసారి అధికారంలో వస్తానని కెసీఆర్  కలలు కని భంగపడ్డారు. దీంతో పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంది. బిఆర్ ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ లో చేరి కెసీఆర్ కు ఖంగు తినిపించారు. తాజాగా కాంగ్రెస్ తో భేటీ అయిన వారిలో బిఆర్ ఎస్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యసలహాదారు వేం నరేందర్ రెడ్డితో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం వేం నరేందర్ రెడ్డిని ఆయన కలిశారు. గుత్తా అమిత్ రెడ్డి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నల్గొండ లోక్ సభ లేదా భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ తర్వాత బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడంపై వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి టిక్కెట్‌ను ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ధరణిపై సంచలన కామెంట్స్ 

మా ప్రభుత్వం అధికారంలో వస్తే ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో కలిపేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.  ధరణి పోర్టల్ తో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి సర్కారు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీ సభ్యులు తాజాగా చేసిన ఆరోపణలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈమేరకు సోమవారం ఈ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కనీవినీ ఎరగని భూ కుంభకోణం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగిందని తీవ్ర విమర్శలు చేశారు.  నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, అయినప్పటికీ అలాంటి భూములను మాజీ మంత్రి కేటీఆర్ ఫ్యామిలీకి బదలాయించారని ఆరోపించారు. 2014 వరకు రాష్ట్రంలో భూ హక్కుల విషయంలో అందరికీ సమాన న్యాయం ఉండేదని, 2015 తర్వాత చాలా మంది రైతులు తమ భూములపై హక్కులు కోల్పోయారని చెప్పారు. గత ప్రభుత్వం ఎవరితోనూ ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే భూ రికార్డులను ప్రక్షాళన చేసిందని, దీనిని దివాలా తీసిన కంపెనీకి అప్పజెప్పడంతో రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు.  గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఈ కమిటీ పేర్కొంది. ప్రజా దర్బార్ లో భారీగా అందిన ఫిర్యాదులే దీనికి సాక్ష్యమని తెలిపింది. ఈ సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతుకుతున్నట్లు వివరించింది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్ ను తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల ఈ సమస్యను పరిష్కరించేందుకు ధరణి పోర్టల్ పై ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ పై వచ్చిన ఫిర్యాదులను, పోర్టల్ పనితీరు సహా పలు అంశాలను పరిశీలించిన ఈ కమిటీ సభ్యులు తాజాగా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి కేటీఆర్ పై ఈ కమిటీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఎన్నికల బరిలో దస్తగిరి, కోడికత్తి శీను.. జగన్ కు ఇక వణుకే!

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో విజ‌యంకోసం అనేక అడ్డ‌దారులు తొక్కారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.విపక్షాలు అవి కేవలం విమర్శలు కావు, వాస్తవాలు అంటూ పలు ఉదాహరణలు చూపుతున్నారు. ఇంతకీ జగన్  గ‌త ఎన్నిక‌ల్లో అంత‌లా   ఏం చేశారు.  ఆయ‌న విజ‌యంలో కీల‌క భూమిక పోషించిన అంశాలు ఏమిటి ?  అన్న ప్రశ్నకు   ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న‌వారికి వెంట‌నే  గుర్తుకు వచ్చేవి బాబాయ్ హ‌త్య, కోడికొత్తి  దాడి. ఈ రెండు ఘ‌ట‌న‌లు 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని విజ‌య‌తీరాల‌కు చేర్చ‌డంలో కీల‌క భూమిక పోషించాయ‌న‌డంలో ఎలాంటి  సందేహం లేదు.  ఎందుకంటే.. వైసీపీ అధికారంలోకి రావ‌డంతోపాటు, భారీ సంఖ్య‌లో అసెంబ్లీ, ఎంపీ సీట్ల‌ను గెలుచుకోవ‌డానికి ఈ రెండు ఘ‌ట‌న‌లు ఎంతో దోహ‌ద‌ప‌డ్డాయి. అయితే  ఆ రెండు ఘ‌ట‌న‌లుకూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగాయ‌న్నవిమర్శ:లు అప్పటి నుంచీ ఉన్నాయి. ఆ విమర్శలు కేవలం విమర్శలు కావు, వాస్తవమే అనిపించేలా ఈ ఐదేళ్లలో ఆ కేసుల విషయంలో జరిగిన పరిణామాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలు ఉణ్నాయి.  దీంతో జ‌గ‌న్ తాను తీసుకున్న గొయ్యిలో తానే ప‌డ‌బోతున్నాడ‌ని పరిశీలకులే కాదు, సామాన్య జనం కూడా అంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించి.. జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డానికి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ‌త్య, మ‌రోవైపు కోడిక‌త్తి దాడి ఘ‌ట‌న‌లు ఎంతో దోహ‌ప‌డ్డాయి. గ‌త ఎన్నికల స‌మ‌యంలో వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసు ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచల‌నాన్నే సృష్టించింది.  అప్పట్లో వివేకాను హత్య వెనుక అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న అనుచ‌రులే ఉన్నారని ప్ర‌జ‌లు న‌మ్మేలా చేయ‌డంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజ‌యం సాధించారు. అయితే, ఇటీవల కాలంలో వివేకా హత్య కేసులో బయటపడుతున్న నిజాలు ఏపీ ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. వివేకా హత్య కేసులో జగన్ ప్రోత్సాహం, అవినాశ్ ప్రమేయం ఉందని ఆ కేసు దర్యాప్తులో ఒక్కొక్కటిగా  బయటపడుతున్నాయి. ఈ కేసులో నిందితుడుగా ఉన్న ద‌స్త‌గిరి అప్రూవ‌ర్‌ గా మారాడు. జైలు నుంచి బెయిల్‌పై బ‌య‌ట‌కు  వ‌చ్చాడు. ప్రస్తుతం ద‌స్త‌గిరి సైతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ‌ట్టి స‌వాల్ విసురుతున్నాడు. పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌గ‌న్ రెడ్డిపై పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.  జై భీమ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న‌ట్లు ద‌స్త‌గిరి ప్ర‌క‌టించాడు. మరోవైపు కోడిక‌త్తి కేసులో ముద్దాయిగా ఉన్న శ్రీ‌నివాస్ బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. గత‌ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అద్భుత విజ‌యం సాధించ‌టంలో కోడికత్తి శ్రీ‌నివాస్ ది కూడా కీల‌క భూమిక అని అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. జ‌గ‌న్ ఎలాగైనా 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌నే ఉద్దేశంతో ఎయిర్ పోర్టులో జ‌గ‌న్ పై కోడిక‌త్తితో శ్రీనివాస్ దాడికి ప్ర‌య‌త్నించాడు. ఈ దాడిలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భుజానికి స్వ‌ల్ప గాయ‌మైంది. అప్పట్లో తనపై  దాడిచేయించింది చంద్రబాబు, ఆయన మనుషులే అంటూ ఊరూ వాడా ఏకమయ్యేలా ప్రచారం చేసుకుని ప్రజల సానుభూతి పొందిన జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే, కోడికత్తి కేసులో నిందితుడైన శ్రీను మాత్రం.. జగన్ పై ప్రజల్లో సింపతీ రావాలనే తాను అలా చేశానని చెప్పాడు. తాజాగా కోడికత్తి శ్రీను.. అసెంబ్లీలో ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి బరిలో నిలిపిన అభ్యర్థిని ఓడించేందుకు పోటీ చేయబోతున్నాడు. కొడికత్తి శీను కూడా జైభీమ్ భారత్ పార్టీలో చేరి  అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు ప్రకటించాడు.  2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి విజయానికి దోహదపడిన ఈ రెండు ఘటనల్లో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులూ కూడా 2024 ఎన్నికల్లో  జగన్ కు వ్యతిరేకంగా పోటీలో  నిలవనుండడంతో  జగన్ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. పులివెందులలో దస్తగిరి, అమలాపురంలో కోడికత్తి శ్రీను ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో.. జగన్ మోహన్ రెడ్డిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న భయం వైసీపీ నేతలను వెంటాడుతున్నది. ఎన్నికల వేళ వారిద్దరూ నిజాలను ప్రజలకు వెల్లడిస్తే, ఆ రెండు ఘటనల్లో జగన్ ప్రమేయం ఉందని చెబితే వైసీపీని ప్రజలు చీదరించుకుకుంటారన్న ఆందోళన జగన్ లోనూ ఆయన శిబిరంలోనూ వ్యక్తం అవుతోంది. ఇప్పటికే   జగన్ ఐదేళ్ల అక్రమ, అరాచక పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఇప్పటికే ఓటమి ఖాయమైంది. తాజాగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు, కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడు ఇద్దరూ ఎన్నికల బరిలో నిలిచి ఆ కేసులకు సంబంధించిన నిజాలను బయటపెడితే ఇక వైసీపీకి పడతాయనుకుంటున్న కాసిని ఓట్లు కూడా పడవన్న ఆందోళన వైసీపీ అభ్యర్థులను వెంటాడుతున్నది.  ఏపీలో తాజా పరిస్థితిని గమనిస్తున్న ప్రజలు.. జగన్ తీసిన గొయ్యిలో ఆయనే పడబోతున్నారంటున్నారు.   

పొత్తు ఎఫెక్ట్.. ఏపీ బీజేపీలో టికెట్ల కోసం పోటీ!

ఏపీలో  కమలం ఖాతా ఓపెన్ చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకోసమే తాత్సారం చేసి చేసి తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి నడిచేందుకు నిర్ణయించుకుంది. తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసి అడుగులు వేయకుండా ఏపీలో జీరోయే అన్న విషయం బీజేపీ ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సిన వాస్తవం. కావడంతో చివరి నిముషం వరకూ బెట్టు చేసి, సీట్ల బేరసారాల్లో తమ బలానికి మించి ఒకటి రెండు సీట్లైనా అదనంగా పొందాలన్న వ్యూహాన్ని అనుసరించింది. సరే బీజేపీ వ్యూహం ఫలించిందా లేదా అన్నది పక్కన పెడితే తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కూడా అడుగులు వేస్తుందన్న విషయంలో సందిగ్ధత తొలిగిపోయింది. ఇక ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ ముందు ఉంది. ఏపీ బీజేపీలో నిన్న మొన్నటి వరకూ పోటీ చేయడానికి అభ్యర్థులు పెద్దగా కనిపించని పరిస్థితి. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన కూటమితో పొత్తు కుదిరిందో.. ఇక ఆ పార్టీలో టికెట్ల కోసం పోటీ పడే ఆశావహుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. పొత్తుకు ముందు బీజేపీ రాష్ట్రంలో ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోందన్న ప్రకటనలు వెలువడ్డాయి. ఆ సమయంలో పార్టీ తరఫున పోటీ చేయడానికి కాగడా పెట్టి వెతికినా అభ్యర్థులెవరూ కనిపించని పరిస్థితి ఉంది.  విశాఖ నుంచి పోటీ అంటూ గత కొన్నేళ్లుగా అక్కడే మకాం వేసి.. తన స్థాయిలో నానా రకాలుగా రాజకీయం చేసిన జీవీఎల్ కూడా ఒంటరి పోరు అనగానే పోటీకి వెనుకడుగు వేస్తున్నారని రాష్ట్ర బీజేపీ వర్గాలే అప్పట్లో చెప్పాయి. అయితే ఒక సారి పొత్తు కుదిరిందన్న వార్త వెలువడగానే.. నిన్న మొన్నటి వరకూ పోటీ అంటే  ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు.  కానీ ఇప్పుడు పార్టీ తరఫున పోటీ చేయడానికి టికెట్ల కోసం పార్టీ హైకమాండ్ ముందు క్యూ కడుతున్నారు.  ఇప్పుడు పొత్తు లో  భాగంగా 10 అసెంబ్లీ,6 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయడానికి బీజేపీ రెడీ అవుతోంది.  అయితే ఎంత మంది ఆశావహులు పోటీకి తయారైనా.. పొత్తులో భాగంగా తమకు ఆమోదయోగ్యమైన వారినే పోటీలో నిలబెట్టాలని చంద్రబాబు ముందుగానే బీజేపీ హైకమాండ్ ను ఒప్పించడంతో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు కచ్చితంగా చంద్రబాబు ఆమోదించిన వారే  అయి ఉంటారనడంలో సందేహం లేదు. చంద్రబాబు ఈ షరతుతోనే పొత్తుకు అంగీకరించడానికి కారణం.. ఏపీ బీజేపీలో ఒక వర్గం ఈ ఐదేళ్లుగా జగన్ సర్కార్ తో అంటకాగింది.   ఆ వర్గం జగన్ విధానాలను విమర్శించిన పాపాన పోలేదు. అదే సమయంలో  తెలుగుదేశంపైనా, చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించింది.  మొత్తం మీద ఈ సారి పొత్తుల వల్ల ముందు ముందు తనకు కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఇబ్బందులు రాకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలూ తీసుకునే ముందుకు అడుగు వేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఎపిలో ఇద్దరు ఎమ్మెల్సీల పై అనర్హత వేటు 

వైసీపీ అధినాయకత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసింది. పార్టీ లైన్ దాటి పనిచేశారంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఆధారాలను కూడా సమర్పించింది.  ఇక ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి. రామచంద్రయ్యలపై కూడా అనర్హత వేటు వేయాలని కూడా మండలి ఛైర్మన్ మోషెన్ రాజు కు ఫిర్యాదు చేసింది.వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి జనసేన పార్టీలో చేరగా, సి. రామచంద్రయ్య టీడీపీలో చేరడాన్ని సీరియస్ గా తీసుకుని చర్యలకు సిద్ధమయింది. అయితే వీరిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయగా స్పీకర్, మండలి ఛైర్మన్ విచక్షణపై ఆధారపడి ఉంది. అయితే  మంగళవారం అనూహ్యంగా  ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది.  ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. జనసేనలో చేరిన వంశీకృష్ణ, టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్యలపై ఆయన చర్యలు తీసుకున్నారు. వీరిద్దరూ వైసీపీ తరపున ఎమ్మెల్సీలుగా గెలుపొందారు. అయితే ఇటీవల ఇద్దరూ వైసీపీకి గుడ్ బై చెప్పి పార్టీలు మారారు. దీంతో, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ శాసనమండలి ఛైర్మన్ కు, మండలి కార్యదర్శికి మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సమగ్ర విచారణ నిర్వహించిన అనంతరం ఇద్దరి సభ్యత్వాలపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేశారు

కొలిక్కి వచ్చిన సర్దుపాట్లు.. లోక్ సభకే పవన్ పోటీ?!

తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఎలాంటి పొరపొచ్చాలూ లేకుండా సజావుగా ముగిసింది. తెలుగుదేశం అధినేత  చంద్రబాబు నాయుడి నివాసంలో జరిగిన కీలక భేటీలో సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన, తెలుగుదేశం పార్టీలు త్యాగాలకు వెనుకాడకపోవడం చూస్తుంటే.. పొత్తు పటిష్ఠంగా ఉండేందుకు ఆ పార్టీలు కంకణం కట్టుకున్నాయని స్పష్టమౌతోంది.  తాజాగా కుదిరిన ఒప్పందం మేరకు పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలు కలిసి మొత్తం 31 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తాయి.  వీటిలో బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలలోనూ,  జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి.  ఇక్కడ తెలుగుదేశం కూడా తన కోటా నుంచి ఒక  స్థానాన్ని బీజేపీ కోసం త్యాగం చేసింది.  దీనితో సీట్ల సర్దుబాటు ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా ముగిసిందనే చెప్పాలి.   తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు నివాసంలో జనసేనాని పవన్ కల్యాణ్,  కేంద్రమంత్రి షెకావత్, బీజేపీ నాయకుడు  జయంత్ దాదాపు ఎనిమిది గంటలకు పైగా  దీర్ఘంగా చర్చించి.. సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అవగాహనకు వచ్చారు.  పొత్తులో  భాగంగా ఎవరికి ఏ సీటు వచ్చినా అక్కడ గెలుపు గుర్రాన్నే నిలబెట్టాలనీ,  ఎట్టి పరిస్థితిలో ఆ సీటు వైసీపీకి వెళ్లకూడదన్న విషయంలో మూడు పార్టీలూ ఏకాభిప్రాయంతో ఉన్నాయి.  గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక  ఉండాలని, ఈ విషయంలో పంతాలు, పట్టింపులకు పోరాదనీ నిర్ణయించారు. అవసరమైతే  అవసరమైన  స్థానాలలో ఇప్పటికే ప్రకటించిన  అభ్యర్ధుల మార్పు చేర్పులకూ వెనుకాడరాదని కూడా ముగ్గురు నేతలూ ఒక అభిప్రాయానికి వచ్చారు.   ఇదంతా సీట్ల సర్దుబాటు విషయంలో జరిగిన చర్చ అయితే రాష్ట్రంలో  వైసీపీ అరాచక, హింసాత్మక తీరుపై కూడా చర్చ జరిగిందని అంటున్నారు. అలాగే రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరుపై కూడా చర్చ జరిగిందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అలా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులలో కొందరు కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్ వచ్చిన వారు కూడా ఉన్నారన్న విషయంపై చంద్రబాబు కేంద్ర మంత్రి, బీజేపీ నేతలకూ వివరించారని అంటున్నారు.  ఎన్నికల సమయంలో ఆ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశాలున్నాయన్న అనుమానాన్ని చంద్రబాబు కేంద్ర మంత్రి వద్ద వ్యక్తం చేశారంటున్నారు.  అటువంటి వారి జాబితా తనకు ఇవ్వాలని కేంద్ర మంత్రి షెకావత్ కోరగా,  ఆ జాబితాను చంద్రబాబు షెకావత్ కు అందజేశారని అంటున్ారు. ఎన్నికల కోడ్ అమలులోనికి వచ్చిన తరువాత ఆ జాబితాలో ఉన్న వారందరినీ ఎన్నికల విధుల నుంచి తప్పించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గట్టిగా డిమాండ్ చేసినట్లు తెలిసింది.  గత ఎన్నికల ముందు కూడా ఇలాగే డీజీపీ, ఇంటలిజన్స్ ఏడీజీ, సీఎస్‌ను తప్పించిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు కేంద్ర మంత్రికి గుర్తు చేశారని తెలిసింది. మొత్తంగా సీట్ల సర్దు బాటు విషయంలోనే కాదు, ఎన్నికలలో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న అనుమానాలు ఉన్న అధికారుల విషయంపై కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కేంద్ర మంత్రి షెకావత్ తోనూ, బీజేపీ జాతీయ నాయకుడు జయంత్ తోనూ చర్చించినట్లు తెలిసింది. గెలుపే లక్ష్యంగా ప్రతి అడుగూ పడాలన్న ఈ భేటీలో నిర్ణయించారని అంటున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటు వేసే వాతావరణం ఉండాలని అందుకు కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి షెకావత్ చెప్పినట్లు తెలుస్తోంది. 

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష.. అంటూ బీఆర్ఎస్ నుంచి జంపింగులు!

రాజకీయాలలో అధికార పక్షం ప్రతిపక్షం కావడం, ప్రతిపక్షం అధికార పక్షం కావడం అత్యంత సహజం. ఏ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదు. అందుకే రాజకీయాలలో  విజయానికి పొంగిపోకూడదు, పరాజయానికి కుంగిపోకూడదు అంటారు. అయితే కొందరు మాత్రం విజయం సాధిస్తే తనంతటోడు లేడని విర్రవీగుతారు. పరాజయం ఎదురైతే ప్రత్యర్థులంతా కలిసి కుట్ర చేశారని గగ్గోలు పెడతారు. మొత్తం మీద ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే పాపం తన ఓటమికి ప్రత్యర్థులు కుట్ర చేశారని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రిన, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎదుర్కొంటున్నారు.  తాను పన్నినదే వ్యూహం, తాను చేసిందే రాజకీయం అన్నట్లుగా అధికారంలో ఉన్నంత కాలం వ్యవహరించిన ఆయన సొంత పార్టీ నేతలకు కూడా ఎన్నడూ అందుబాటులో లేరు. సచివాలయానికి వెళ్లిందే లేదు. తాను ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియెట్ అన్నట్లుగా వ్యవహరించారు. జన బాహుల్యం బాధలను పట్టించుకోకుండా గంటల తరబడి ట్రాఫిక్ ను నిలిపివేసి మరీ అత్యంత రద్దీగా ఉండే సమయాలలోనే ఫామ్ హౌస్ నుంచి క్యాంపు కార్యాలయానికీ, క్యాంపు కార్యాలయం నుంచీ ఫామ్ హౌస్ కూ రాకపోకలు సాగించారు. తనకు నచ్చిన వారు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టాలి అన్న రీతిలో వ్యవహరించారు. తనతో విభేదించి పార్టీ నుంచి బహిష్కృతుడైన ఈటల రాజేందర్, తనపై విమర్శల వర్షం కురిపించి, నిగ్గదీసి నిలదీసే రేవంత్ రెడ్డి వంటి వారు ప్రజా మద్దతుతో గెలిచినా తన ముందు అసెంబ్లీలో కూర్చోవడాన్ని సహించలేక.. వారు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశమే లేకుండా సస్పెన్షన్ల వేటుతో తన పంతం నెగ్గించుకున్నారు. అయితే  అదంతా గతం.. ఇప్పుడు కేసీఆర్ విపక్షంలో ఉన్నారు. నాడు తాను ముఖం చూడటానికి కూడా ఇష్టపడని రేవంత్ ముఖ్యమత్రిగా ఉన్నారు. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. కీలకమైన బడ్జెట్ రోజున, అలాగే ఇరిగేషన్ పై చర్చకు కూడా సభకు హాజరు కాకుండా ముఖం చాటేశారు. ఇదంతా ఒకెత్తైతే.. ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేసే వ్యూహంతో ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మరొక ఎత్తు. ఒక రకంగా దీనికి ఒక ట్రెండ్ గా మార్చింది మాత్రం కేసీఆర్ అనే చెప్పాలి. గతంలో కూడా జంప్ జిలానీలు ఉండేవారు. ఒక పార్టీ నుంచి మరో పర్టీలోకి జంప్ చేసిన నేతలు అరుదేమీ కాదు. కానీ అసలు ప్రత్యర్థి పార్టీయే ఉండకూడదు అన్న లక్ష్యంతో సామదానభేద దండోపాయాలను ఉపయోగించి ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని లాగేసుకునే పరిస్థితి మాత్రం లేదు. కానీ కేసీఆర్ సరిగ్గా అలాగే చేశారు.   ఇప్పుడు అందుకు ఫలితం అనుభవిస్తున్నారు. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి జంపింగులు జోరందుకున్నాయి.  ఆ పార్టీ నుండి నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్  గూటికి, లేదా కమలం గూటికి చేరిపోతున్నారు. వారిని కట్టడి చేసే ప్రయత్నం చేసే నైతికత కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేకుండా పోయింది. బిఆర్ఎస్ మాజీ  ఎంపీలు సీతారాం నాయక్, నగేష్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి నిన్న బిఆర్ఎస్ కారు దిగి కాషాయం కండువా కప్పుకున్నారు. అలాగే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప, పైళ్ల శేఖర్ రెడ్డి త్వరలోనే గులాబీ బాస్ కు గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.  వెళ్లేవారిని అడ్డుకోలేక ఉన్నవారిని కట్టడి చేయలేక కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.  ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కొనసాగుతున్న వలసలను చూస్తుంటే.. కేసీఆర్ కు పార్టీపై పట్టు పూర్తిగా పోయిందన్న భావన కలుగక మానదు. పార్టీ మారి వెడుతున్న వారిని ఆపడానికి ప్రయత్నించడం అటుంచి, వారు పార్టీకి ద్రోహం చేశారు, చేస్తున్నారు అన్న విమర్శ కూడా చేయలేని పరిస్థితుల్లో ప్రస్తుతం కేసీఆర్ ఉన్నారు. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడం ద్వారా ఆ పార్టీలను నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో ఆయన అడుగులు వేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం తరఫున ఎన్నికైన వారందరినీ బీజేపీలో చేర్చుకుని ఆ పార్టీకి చట్ట సభలో ప్రాతినిథ్యం లేకుండా చేశారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి కూడా పెద్ద ఎత్తున వలసనలను ప్రోత్సహించి ఆ పార్టీని బలహీనం చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నది. కేసీఆర్ అప్పట్లో వలసల కోసం బీఆర్ఎస్ తలుపులు బార్లా తెరిచేశారు. తొలి నుంచీ అంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి తన వెన్నంటి నడిచిన ఉద్యమ కారుల కంటే బయటి పార్టీల నుంచి వచ్చి చేరిన వారికే పెద్ద పీట వేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. బీఆర్ ఎస్ విపక్షానికి పరిమితమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ముఖ్యమంత్రిగా ఇలా ప్రభుత్వం ఏర్పాటైందో లేదో  అలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కట్టి మరీ రేవంత్ తో భేటీకి పోటీలు పడ్డారు.   ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే రేవంత్ దూకుడు పెంచారు. పదే పదే తన సర్కార్ కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రకటనలకు కౌంటర్ గా ఆయన తాను తలుపులు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. వాస్తవ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఆ మాత్రమైనా సీట్లు లభించాయంటే.. అది గ్రేటర్ పుణ్యమే అని చెప్పాలి. అటువంటి గ్రేటర్ పరిధిలోనే పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దాదాపు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ రేవంత్ తో టచ్ లోకి వెళ్లిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.  అంతే కాదు.. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి గుత్తా వంటి వారే గైర్హాజరయ్యారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో  బీఆర్ఎస్ తరఫున నిలబడే అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ వెతుక్కోవలసిన పరిస్థితుల్లో ఉందంటే ఒక్క ఓటమితో కేసీఆర్ ఎంతగా డీలా పడిపోయారో అర్ధం చేసుకోవచ్చు. సరిగ్గా అందుకే అదును చూసి దెబ్బకొట్టిన విధంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో  బహిరంగ సభలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు మినహాయిస్తే మిగిలిన బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారని ప్రకటించారు. వారంతా తెలంగాణ అభివృద్ధికి తన ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నారనీ, అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చేందుకు చేస్తున్న కృషిని అభినందిస్తున్నారనీ, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావడం కోసం తమ వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లూ సుస్థిరంగా కొనసాగడానికి మద్దతు ఇస్తామని చెబుతున్నారనీ రేవంత్ చెప్పారు.  త‌మ‌ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని  కుట్ర‌లు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని  విస్పష్టంగా చెప్పారు. అంతే కాదు గతంలో కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చే విధంగా తనతో గోక్కోవద్దు, అలా గోక్కున్న వాడెవడూ బాగుపడలేదంటూ  రిటార్డ్ ఇచ్చారు.  

కుర్చీ రాజకీయమా?

ఒక చిట్టడవిలో ఒక కోతుల గుంపు నివసించేది. ఒకరోజు అమ్ము అనే  కోతికి ఒక కొబ్బరిచిప్ప దొరికింది. దానికి అదేంటో అర్థం కాలేదు. పైన గరుకుగా, లోపల మెత్తగా ఉండటంతో కొరికి చూసింది. రుచిగా ఉండటంతో కొబ్బరిని కొరికి తినే సింది. ఖాళీ కొబ్బరి చిప్పను పడేయడానికి దానికి మనసొప్పలేదు. చెట్టుపైన ఒక చోట దాచుకుంది. రోజూ ఆ కొబ్బరిచిప్పను జాగ్రత్తగా కాపాడుకునేది. దాని వింత చేష్టలు చూసి మిగతా కోతులు నవ్వుకునేవి. ఒకరోజు జోరున వర్షం కురిసింది. కోతులన్నీ తడిసి ముద్దయ్యాయి. అమ్ము మాత్రం కొబ్బరిచిప్పను తలపై గొడుగులా పెట్టుకుని తడవకుండా ఉంది. కొబ్బరిచిప్ప గొడుగులా ఉపయోగపడటంతో దాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మిగతా కోతులకేసి చూస్తూ వేళాకోళమాడింది. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలోనూ కొబ్బరిచిప్పను తలపై పెట్టుకుని తిరిగేది. కొబ్బరి చిప్ప దొరకడం అదృష్టంగా భావించేది. మిగతా కోతులకు కూడా కొబ్బరిచిప్ప దొరకడం గురించి గొప్పగా చెప్పేది. అమ్ము బడాయి మాటలు విని మిగతా కోతులు నవ్వుకునేవి. ఒకరోజు సాయంత్రం కోతులన్నీ చెట్టు కింద చేరి ఆడుకుంటున్నాయి. అదే సమయంలో ఈదురుగాలులు మొదలయ్యాయి. చెట్ల కొమ్మలు ఊగుతుండటం, ఆకాశంలో మబ్బులు కమ్ముతుండటంతో కోతులన్నీ భయంతో ఓ మూలన చేరాయి. అమ్ము మాత్రం కొబ్బరి చిప్ప ఉందన్న దైర్యంతో ‘నాకు వానపడినా భయం లేదు. నా దగ్గర కొబ్బరి చిప్ప ఉందిగా’ అంటూ గెంతులేయసాగింది. ఈ కోతి పరిస్థితి తెలంగాణలో బిఆర్ఎస్ పరిస్థితి ఒకే మాదిరిగా ఉంది. నిన్న యాదరగుట్ట లక్ష్మినరసింహా స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్బంగా ముఖ్యమంత్రి  హోదాలో మొదటిసారి రేవంత్ రెడ్డి హజరయ్యారు. ఈ కార్యక్రమానికి డిప్యూటి సీఎం కొద్దిగా ఆలస్యంగా చేరుకున్నారు . అప్పటికీ వేదిక మీద  ముఖ్యమంత్రితో బాటు  కేబినెట్ మంత్రులు ఆసీనులయ్యారు. ఆలస్యంగా రావడంతో బట్టి విక్రమార్క కూర్చునే కుర్చీ ఎత్తును అధికారులు సరిగ్గా చూసుకోలేకపోయారు. అందుబాటులో ఉన్న కుర్చీ ఇచ్చారు. మిగతా కుర్చీల కంటే ఈ కుర్చీ కొద్దిగా ఎత్తు తక్కువ ఉండటంతో బిఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. యాదగిరి గుట్టలో  కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేశారు.  యాదగిరిగుట్టలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానించారని బీఆర్ఎస్ నాయకులు చేస్తోన్న విమర్శలకు కాంగ్రెస్ పార్టీ దీటుగా స్పందిస్తోంది. యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్టూల్స్‌పై కూర్చోగా, భట్టివిక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కింద కూర్చున్నారు. దీంతో... దళితులు, వెనుకబడిన వర్గాల వారిని కాళ్ల వద్ద కూర్చోబెట్టుకున్నారని బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు. యాదగిరిగుట్టలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు సీఎం పక్కన ఉన్నారని, భద్రాద్రిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నారని వివరించారు. సోషల్ మీడియాలో యాదగిరిగుట్టను ట్రోల్ చేస్తుండటంతో కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ భట్టివిక్రమార్క పైన కూర్చొని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు కింద కూర్చున్న ఫొటోను షేర్ చేసింది. బీఆర్ఎస్ నాయకులకు రెండు ఫొటోలు పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చింది. అందులో ఓ ఫొటోలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లు భట్టి విక్రమార్కలు పక్క పక్కన కుర్చీల్లో కూర్చొని ఉండగా... కోమటిరెడ్డి వెంకట రెడ్డి కింద కాళ్లపై కూర్చొని రాహుల్ గాంధీ చేతిలోని దోశను ఆరగిస్తున్నట్లుగా ఉంది. 'కాంగ్రెస్ అంటేనే ఆకాశమంతా సమానత్వం' అని పేర్కొంది. ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.మరో ట్వీట్‌లో రేవంత్ రెడ్డి కాలుమీద కాలు వేసుకొని ఉండగా, మల్లు భట్టి విక్రమార్క మీసాలు దువ్వుతున్నట్లుగా ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇందులో వారిద్దరు నవ్వుతూ సరదాగా ముచ్చటించుకుంటున్నారు. 'తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని... తరిమేవాళ్ళను హితులుగా తలిచి ముందుకెళ్లాలని' అని ట్వీట్ చేసింది.

జగన్ పార్టీ దేనికి సిద్ధం?

సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ పరిస్థితి చూస్తే.. ఆ పార్టీ నిజంగానే ఎన్నికలకు సన్నద్ధమౌతోందా, లేదా ఓటమిని అంగీరించేసి చేతులెత్తేయడానికి సిద్ధం అయిపోయిందా అన్న అనుమానం కలగక మానదు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబీతాలను  వరసగా విడుదల చేస్తూ, మార్చిన వాటినే మారుస్తు, అసలు ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి నిలబడతారు అన్న క్లారిటీ లేకుండా ఆ పార్టీ అధినేత చేస్తున్న విన్యాసాలు వైసీపీ నాయకులనే కాదు, శ్రేణులను సైతం నైరాశ్యంలో ముంచేస్తున్నాయి.  ఇప్పుడు నియోజకవర్గ ఇన్ చార్జ్ లు అంటూ ప్రకటించినా, చివరకు అభ్యర్థిగా వారినే ప్రకటించి బీఫారం ఇస్తారా అన్న అనుమానాలు జాబితాలో పేర్లు ఉన్నవారిలోనే వ్యక్తం అవుతున్నాయి. ఈ వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వనుంది. ఇప్పటికీ అధికార వైసీపీలో అభ్యర్థుల గందరగోళం అలాగే ఉంది. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారన్న విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. కొందరు కేబినెట్ మంత్రులు పోటీ చేసే నియోజకవర్గాలేమిటన్నది కూడా ఇప్పటికీ తేలలేదు. కొందరైతే టికెట్ ఇచ్చినా పోటీ చేయలేం మహప్రభో అని జగన్ కు ఓ దణ్ణం పెట్టి ఊరుకుంటున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి శిబిరం మాత్రం నిబ్బరంగా తన పని తాను చేసుకుపోతున్నది. పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు, సమన్వయంతో సమష్టి ప్రచార వ్యూహాలు, ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటన వంటి అంశాలన్నిటినీ సాఫీగా చేసుకుంటూ పోతున్నది. అందుకు భిన్నంగా అధికార పార్టీలో మాత్రం అయోమయం, గందరగోళం, అసంతృప్తి, నిరసనలు అట్టుడుకుతున్నాయి.   వీటికి తోడు వరుసగా వెలువడుతున్న సర్వేలన్నీ ప్రతికూలంగా ఉండటంతో జగన్ పార్టీలో వణుకు మొదలైంది. మేకపోతు గాంభీర్యం పదర్శిస్తూ సిద్ధం సభలు నిర్వహించినా, సొమ్ము, మద్యం సరఫరా చే సినా జన సమీకరణ అనుకున్నంతగా చేయలేని పరిస్థితుల్లో వైసీపీ ఉంది. దీంతో ఇప్పటికే మొదలైన వలసలు.. షెడ్యూల్ విడుదల తరువాత మరింత జోరందుకుంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కేసీఆర్‌ మెడ‌కు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. చంద్ర‌బాబే దిక్కా!

ఒక‌ప్పుడు ఓటుకు నోటు కేసు అంటూ బీఆర్ ఎస్ అధినేత,  తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన హడావుడి అంతాఇంతా కాదు.. అయితే ఆ కేసు ఇప్పుడు కేసీఆర్‌ మెడ‌కు చుట్టుకోబోతోందా?  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్టు కాబోతున్నారా?  అప్ప‌ట్లో చంద్ర‌బాబును దేవుడు కూడా కాపాడ‌లేడ‌ని చెప్పి కేసీఆర్‌కు.. ఇప్పుడు చంద్ర‌బాబు దేవుడు కాబోతున్నాడా?  అంటే అవున‌నే చ‌ర్చ తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది.  ఈ చ‌ర్చ‌కు ప్ర‌ధాన కార‌ణం  ప్ర‌ణీత్ రావు వ్య‌వ‌హారం. బీఆర్ ఎస్ హ‌యాంలో స్పెష‌ల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ ప్ర‌ణీత్ రావు ఆధ్వ‌ర్యంలో ప‌లు పార్టీల నేత‌లు, ఇత‌రుల ఫోన్లు ట్యాపింగ్ జ‌రిగిన‌ట్లు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌ణీత్ రావును స‌స్సెండ్ అయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ లో నాన్ బెయిల‌బుల్ కేసు న‌మోదైంది.  ప్ర‌స్తుతం ప్ర‌ణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ  విచార‌ణ‌లో ప్రణీత్ రావు షాకింగ్ విష‌యాల‌ను వెల్ల‌డిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌ణీత్ పూర్తి స్థాయిలో గుట్టువిప్పితే మాజీ సీఎం కేసీఆర్ మెడ‌కు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు గ‌ట్టిగానే చుట్టుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు కావ‌డానికి రాజ‌కీయాల్లో పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కు ఈ విష‌యం తెలిసిన‌ప్ప‌టికీ.. ఆ ప‌రిస్థితిని ప్ర‌త్య‌క్షంగా ఎదుర్కోబోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డం  రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.  అయితే  ఎప్ప‌టిలాగే కొన్నిరోజులు ఈ అంశంపై హ‌డావుడి ఉంటుంది. ఆ తరువాత ఈ వ్య‌వ‌హారాన్ని ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం మ‌ర్చిపోతుంద‌ని కొంద‌రు భావించారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్య‌వ‌హారాన్ని తేలిగ్గా తీసుకొనే ప‌రిస్థితి కనిపించడం లేదు. కేసీఆర్ త‌న హ‌యాంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల క‌ద‌లిక‌లు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేవార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు రేవంత్ సైతం ప‌లుసార్లు ఈ అంశాన్ని లేవ‌నెత్తిన‌ప్ప‌టికీ ఉప‌యోగం లేకుండా పోయింది. రేవంత్ సీఎం అయిన త‌రువాత.. హోంశాఖను త‌న‌వ‌ద్దే ఉంచుకోవ‌టానికి ప్ర‌ధాన కార‌ణం  పోలీస్ శాఖ‌ను సెట్‌రైట్ చేసే బాధ్య‌త‌ను తీసుకోవాలన్న నిర్ణయంతోనే అంటున్నారు. ఆ క్ర‌మంలోనే కేసీఆర్ కుటుంబానికి పోలీస్ శాఖ‌పై ఉన్న ప‌ట్టును పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేందుకు చ‌ర్య‌లు ప్రారంభించారు. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఫోన్ ట్యాపింగ్ ను వజ్రాయుధంలా వాడుకున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉండ‌టంతో.. ఆ వ‌జ్రాయుధాన్ని తిరిగి వాళ్ళ మీదకే ప్రయోగించడానికి రేవంత్ ప‌క్కాప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.  బీఆర్ ఎస్ హ‌యాంలో రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారంలోనే కాదు.. బీజేపీ నేత‌ల వ్య‌వ‌హారంలో ఫోన్ ట్యాపింగ్ కు మాజీ సీఎం కేసీఆర్ పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ హ‌యాంలో ఫామ్ హౌస్ లో ప్రముఖ బీజేపీ నాయకులను డబ్బుతో పట్టుకొన్నామ‌ని కేసీఆర్ తెగ హంగామా చేసిన విష‌యం తెలిసిందే. దేశంలో అన్ని రాష్ట్రాల నాయకులకు, న్యాయమూర్తులకు లేఖ‌లు రాసి బీజేపీ తన ప్ర‌భుత్వాన్ని పడగొట్టడానికి  కుట్ర చేస్తే తాను పట్టుకొన్నామ‌ని అప్పట్లో కేసీఆర్  హ‌డావుడి చేశారు. అంతేకాదు  ప్రధాని మోడీని  నానా విధాలుగా దుర్భాష‌లాడారు. ఆ దెబ్బతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారి దేశానికే ప్రధాని అవుతాన‌ని కేసీఆర్ క‌ల‌లు క‌న్నారు. కానీ, కేసీఆర్ ను దేశంలో ఎవ్వరూ నమ్మలేదు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి నాటినుంచి సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టి కేసీఆర్ పునాదులు క‌దిలిస్తున్నారు. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ హ‌యాంలో ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం వెలుగులోకి  రావడంతో కేసీఆర్, బీఆర్ ఎస్ నేత‌లు మాత్రం తేలుకుట్టిన దొంగ‌ల్లా మౌనంగా ఉన్నారు..  రేవంత్ రెడ్డి మాత్రం చాపకింద నీరులా తన పనితాను చేసుకొంటూ పోతున్నారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని రేవంత్ ప్ర‌భుత్వం టీఎస్‌పీఎస్‌సీ చైర్మ‌న్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈ నియామకాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. మాజీ డీజీపీపై అవినీతిప‌రుడ‌నే ముద్ర వేశారు. ఆయ‌న్ను ఎలా టీఎస్‌పీఎస్‌సీకి చైర్మ‌న్ గా నియ‌మిస్తారంటూ   ప్ర‌భుత్వంపై చిందులు తొక్కారు క‌విత‌. అప్పుడు క‌విత గోల‌పెడితే అర్థం కాలేదు.  కానీ, మెల్ల‌మెల్ల‌గా అర్థ‌మ‌వుతోంది ఏమిటంటే.. మ‌హేంద‌ర్ రెడ్డి అప్రూవ‌ల్ గా మారిపోతే  త‌మ హ‌యాంలో గుట్టుచ‌ప్పుడు కాకుండా జ‌రిపిన వ్య‌వ‌హారాలు ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డ‌తాయోన‌న్న భ‌యంతోనే క‌విత అలా మాట్లాడిన‌ట్లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  బీఆర్ ఎస్ హ‌యాంలో ఒక్కో వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌స్తుండ‌టంతో క‌ల్వ‌కుంట్ల కుటుంబంలోనూ క‌ల‌హాలు మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. బీఆర్ ఎస్ హ‌యాంలో ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో రేవంత్ రెడ్డికి మాత్ర‌మే అన్యాయం  జ‌ర‌గ‌లేదు.. బీజేపీ నేత‌లుసైతం ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో ఇబ్బందిప‌డ్డ‌ారు. దీంతో కేసీఆర్ గుట్టు  విప్పి.. జైలుకు పంపించ‌డంలో రేవంత్ రెడ్డికి కేంద్రంలోని మోడీ స‌హ‌కారం కూడా ఉంద‌ని, ఉంటుందని ప్ర‌చారం జ‌రుగుతుండ‌టం కేసీఆర్ కు పుండుమీద కారం చ‌ల్లిన‌ట్లు ఉంద‌ని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం కేసీఆర్ విష‌యంలో రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తుందనీ, రేవంత్‌ ఆపరేషన్ సక్సెస్ అవుతుందన్న ప్ర‌చారం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో  పోరుగా సాగుతోంది.   కేంద్రం, రాష్ట్రంలో కూడా కేసీఆర్ కు మద్దతు లేకపోవడంతో తప్పించుకొనే అవకాశంలేక కొత్త ఎత్తుగడగా తనమీద కాంగ్రెస్‌, బీజేపీలు క‌లిసి ప‌గ‌తోనే దాడిచేస్తున్నాయ‌ని, తాను సత్తెపూసను అని జనాన్ని నమ్మించి   సానుభూతి పొందాలని కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు.  ఇందుకోసం వంద‌ల యూట్యూబ్ చాన‌ల్స్ సృష్టించి. అక్రమంగా సంపాదించిన వేలకోట్లు వెదచల్లి తప్పుడు వార్తలతో రేవంత్ రెడ్డిపై బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో క‌రవు వ‌చ్చిన స‌మ‌యంలో రైతులు ప‌డ్డ ఇబ్బందుల వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తూ.. రేవంత్ రెడ్డి హ‌యాంలో రాష్ట్రంలో క‌రువుతో ప్ర‌జ‌లు అల్లాడుతున్నారంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారనీ, ఆ ప్రచారంతో  లోక్ సభ  ఎన్నిక‌ల్లో  ల‌బ్ధిపొందాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  పార్ల‌మెంట్‌ ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా కేసీఆర్ హ‌యాంలో ఫోన్ ట్యాపింగ్ గుట్టును ర‌ట్టు చేసేందుకు రేవంత్ ముందుకెళ్తే  ఆఖ‌రి అస్త్రంగా చంద్ర‌బాబును శరణు వేడేందుకు సైతం కేసీఆర్ వెనుకాడ‌ర‌ని అంటున్నారు. దీంతో గ‌తంలో చంద్ర‌బాబును ఆ దేవుడుకూడా కాపాడ‌లేడ‌న్న కేసీఆర్ కు త్వ‌ర‌లో చంద్ర‌బాబే దేవుడైనా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు.

అధికార పార్టీలో గందరగోళం.. విపక్ష కూటమిలో క్లారిటీ.. జగన్ పనైపోయిందా?

ఎన్నికల షెడ్యూల్ రోజుల వ్యవధిలో వెలువడనుంది. మోస్ట్లీ ఈ వారంలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తి అవుతాయి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి  ఈ పరిస్థితుల్లో ఒక స్పష్టత ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల్లో చిన్న పాటి గందరగోళం కూడా ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక, గెలుపు గుర్రాల ఎంపిక విషయంలో  వాటిలో ఒకింత అయోమయం ఉంటుంది. కానీ విచిత్రంగా ఏపీలో మాత్రం అధికార పార్టీలో విచిత్రంగా పరిస్థితి పూర్తి రివర్స్ లో ఉంది. విపక్షాలు పొత్తుల విషయంలో, సీట్ల సర్దుబాటులో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా ముందుకు సాగుతుంటే.. అధికారంలో ఉండి కూడా అభ్యర్థలను ఖరారు చేయలేక మల్లగుల్లాలు పడుతోంది. జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తూ, మార్పుల మీద మార్పులు చేస్తూ నానా కంగాళీ చేస్తున్నది. అసమ్మతి అగ్నిగుండంలా రగులుతోంది. అసాధారణంగా అధికార పార్టీ నుంచే  వలసలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడైనా ఎన్నికల వేళకి అధికార పార్టీలో స్పష్టత ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలో గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల నుండి తాజాగా తెలంగాణ ఎన్నికల వరకూ తెలుగు రాజకీయాలలో అదే చూశాం. కానీ ఏపీలో అధికార పార్టీలో గందరగోళం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అదే సమయంలో  ప్రతిపక్ష టీడీపీ జనసేనతో పొత్తులో , బీజేపీని కూడా కలుపుకుని   కూడా ధీమాగా కనిపిస్తున్నది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ, పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో కానీ విపక్ష కూటమిలో పూర్తి క్లారిటీ కనిపిస్తోంది. అదే సమయంలో ఏ పార్టీతోనూ పొత్తుల మాటే లేని అధికార వైసీపీలో  మాత్రం తీవ్ర గందరగోళ పరిస్థితి కనిపిస్తున్నది. అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో.. ఎంపీ అభ్యర్థి ఎవరో.. ఎవరు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారో కూడా అర్ధంకాక క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇప్పటి దాకా విడుదలైన జాబితాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిత్వం ఖరారైందన్న ఆనందం నేతలలో కనిపించడం లేదు. మరో జాబితాలో ఈ ఖారారైన సీటు గల్లంతౌతుందేమోనన్న భయంచ ఆందోళన వారిలో వ్యక్తం అవుతున్నాయి. అంతేనా అసలు షెడ్యూల్ విడుదలయ్యే నాటికి   పార్టీలో ఉండేది ఎవరో.. పోయేది ఎవరో  అన్న నిర్వేదం కూడా పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.   ఏపీలో ఎన్నిక‌లకు ఇంకా నిండా  నాలుగైదు వారాలు కూడా లేదు.   అయినా పార్టీలో అసంతృప్తి భగ్గుమంటున్నా, నేతలు పక్షుల్లా పార్టీ గూడు వదిలి ఎగురిపోతున్నా నిలువరించేందుకు చిన్నపాటి ప్రయత్నం కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో జగన్ ఎందుకు మిగిలిపోయారు. కనీసం చెలరేగి పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? సీట్ల మార్పులో ఇంత గందరగోళం నెలకొన్నా సరిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? అంటే పార్టీ నేతలలో తన మాటు చెల్లుబాటు కాదన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారా అన్న అనుమానాలు వైసీపీ శ్రేణుల నుంచే వ్యక్తం అవుతున్నాయి. అన్నిటికీ మించి ఇప్పటి వరకూ నిర్వహించిన నాలుగు సిద్ధం సభల స్పందన చూసిన తరువాత జగన్ పరిస్థితి చేయిదాటిపోయిందన్న నిర్ణయానికి వచ్చి చేతులెత్తేశారా అన్న భావన కూడా వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తున్నది. చివరిగా ఆదివారం (మార్చి 10) బాపట్ల జిల్లాలో నిర్వహించిన సిద్ధం సభకు ఎంత ప్రయత్నించినా అనుకున్న మేర జనాలను తరలించడంలో అధికార పార్టీ విఫలం కావడమే రానున్న ఎన్నికలలో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందనడానికి తార్కానంగా చెబుతున్నారు. ఐదేళ్ల పాలనలో తాను సాధించిందేమిటీ, మరో సారి అధికారంలోకి వస్తే ఏం చేస్తాను అన్న విషయాలను చెప్పడం మాని, విపక్షాలపై విమర్శలకే జగన్ ప్రసంగం పరిమితం కావడాన్ని బట్టే జగన్ తన వైఫల్యాన్ని అంగీకరించేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సిద్ధం సభ.. ప్లాప్ అని ఒప్పుకోలేక.. సక్సెస్ అని చెప్పుకోలేక.. పాపం వైసీపీ

కాలు గడప దాటదు కానీ, మాటలు కోటలు దాటేస్తాయన్నట్లు తయారైంది వైసీపీ పరిస్థితి. బిల్డప్ బాబాయ్ లకే సాధ్యం కాని లెవెల్ లో గంభీర ప్రకటనలు చేయడం.. వాస్తవంలో మాత్రం చెప్పినదానికీ జరిగిన దానికీ ఇసుమంతైనా పొంతన లేకపోవడం జగన్ పార్టీకి పరిపాటిగా మారిపోయింది. రాష్ట్రంలో యుద్ధానికి సిద్ధం కావాలంటూ సిద్ధం పేరిట ఇప్పటికే మూడు బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ తాజాగా ఆదివారం (మార్చి 10) బాపట్లలో నిర్వహించిన చివరి సిద్ధం సభలో మాత్రం చతికిల పడిపోయింది. ఆరంభ శూరత్వం తప్ప.. సిద్ధం సభల ద్వారా సాధించిందేమీ లేదని తేటతెల్లమైపోయింది. ఇప్పటి వరకూ ఏమూలో కాస్తో కూస్తో విజయంపై నమ్మకం ఉన్న క్యాడర్ కు కూడా రానున్న ఎన్నికల ఫలితం ఏమిటన్నది కళ్లకు కట్టింది జగన్ చివరి సిద్ధం సభ. 15లక్షల మందికి పైగా వస్తారంటూ ఆర్భాటంగా గొప్పలు చెప్పుకున్న ఆ పార్టీ నేతలు చివరికి కనీస స్థాయిలో కూడా జనాన్ని సమీకరించలేక చేతులెత్తేసి.. ఇక గెలుస్తామంటూ కనీసం మాటవరసకు కూడా చెప్పుకోవడానికి అవకాశం లేని స్థాయికి పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేశారు.  తొలి సిద్ధం సభలో యుద్ధానికి సమయం వచ్చేసిందనీ, ఇక చొక్కాలు మడతపెట్టేయాలనీ క్యాడర్ కు పిలుపు నిచ్చిన జగన్ చివరి సిద్ధం సభకు వచ్చేసరికి జనాన్ని కూడా సమీకరించలేని పార్టీ దుస్థితిని అందరికీ చూపించేశారు.  తాడేపల్లి ప్యాలెస్ దాటి అడుగు బయటపెడితే జనం తన ముఖం చూడరని ఈ సభ ద్వారా తేటతెల్లం చేసేశారు. అందుకే ఇంత కాలం బయటకు వస్తే రోడ్లకు ఇరువైపులా పరదాలు ఏర్పాటు చేసుకున్న సంగతిని దాపరికం లేకుండా ఈ సభ ద్వారా చెప్పేశారు. చివరి సిద్ధం సభ నాటికి కనీసం అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేయలేని దుస్థితిని చాటుకున్నారు. ఎన్నిక మేనిఫెస్టో కూడా ప్రకటించలేని దయనీయ స్థితిని ఎల్లరకూ తెలిసేలా చేయగలిగారు జగన్.  ఇప్పటి దాకా మైకు పట్టుకుంటే చాలు చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడటం తప్ప తాను ఈ ఐదేళ్ల కాలంలో చేసినది ఇదీ, తన హయాంలో జరిగిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోలేని జగన్.. ఎన్నికల సన్నాహకంలో భాగంగా  అఖరి అంకమైన సిద్ధం సభలో మరోసారి తనకు అధికారం కట్టబెడితే ఇది చేస్తాను అని కూడా చెప్పుకోలేని పరిస్థితి తనదని తేటతెల్లం చేసేశారు. మసిపూసి మారేడు కాయ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన జగన్.. సిద్ధం సభ సందర్భంగా అందులోనూ ఘోరంగా విఫలమయ్యారు. లక్షల మంది హాజరౌతారంటూ ఆర్భాటంగా ప్రకటించుకుని మరీ నిర్వహించిన ఈ సభకు జనాలు రాకపోయినా వచ్చినట్లు బిల్డప్ ఇచ్చుకునేందుకు చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమవ్వడమే కాకుండా పార్టీనీ, జగన్ ను కూడా నవ్వుల పాటు చేసింది. ఇంతకీ జనం హాజరు విషయంలో జగన్ మసిపూసి మారేడు కాయ చేయడానికి చేసిన ప్రయత్నమేంటంటే సభా ప్రాంగణమంతా గ్రీన్ కార్పెట్లు పరిచేసి.. జనం రాకపోయినా ఆ తరువాత వచ్చినట్లుగా కావలసినట్లు మార్చేసుకోవచ్చని చేసిన ప్రయత్నం ఘోరంగా విఫలమైంది వైసీపీ. ఆ ప్రయత్న మంతా సామాజిక మాధ్యమంలో కళ్లకు కట్టినట్లు వచ్చేయడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇక సిద్ధం సభ పూర్తయిన తరువాత వైసీపీ విడుదల చేసిన విజువల్స్ లో జనం ఉన్నట్లుగా చూపించడానికి ఫొటోలను మిక్స్ చేసి చేసిన యత్నం కూడా మీడియాలో ఆధారాలతో సహా వచ్చేసింది.  దీంతో సిద్ధం సభ విషయంలో వైసీపీ పరిస్థితి తేలు కుట్టిన దొంగలా తయారైంది. జనం వచ్చారని చెప్పుకోలేక, రాలేదని ఒప్పుకోలేక నానా ఇబ్బందులూ పడుతోంది.  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సిద్ధం సభకు సంబంధించి వైసీపీ మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసిన ఫొటోలను తన ఎక్స్ ఖాతా ద్వారా రివీల్ చేసి  సీఎం జగన్ సిద్ధం సభలకు జనం రాకపోయినా... మార్ఫింగ్ ఫొటోలు వేసుకుంటూ సభ విజయవంతమైనట్టు చెప్పుకుంటున్నారని టీడీపీ యువనేత నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. 

భధ్రాది రామన్నను దర్శించుకున్న రేవంత్ రెడ్డి

యాదాద్రిలో లక్ష్మినరసింహాస్వామిని దర్శించుకున్న వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంజిల్లాలోని భధ్రాచలం రాములవారిని దర్శించుకున్నారు. ఈ జిల్లా నుంచి నలుగురు మంత్రులు ప్రస్తుత కేబినెట్లో ఉన్నారు.  మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు మాత్రం ముఖ్యమంత్రికి స్వాగతించిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క స్వాగతం పలికారు. ఆలయ ఈవో, పండితులు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

వైఎస్, బాబు పాలన ఎంతో నయం.. జగన్ పాలనలోనే క్రిస్టియన్లకు కష్టాలు.. బ్రదర్ అనీల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి గత ఎన్నికలలో తాను అధికారంలోకి రావడానికి దోహదపడిన ప్రతి అంశమూ కూడా ఇప్పుడు ప్రతికూలంగా  మారి అధికారానికి దూరం కావడానికి దోహదపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఎన్నికలలో కారణాలేమైతేనేం.. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు వేరువేరుగా రంగంలోకి దిగాయి. దీంతో జగన్ కు సునాయాసంగా అధికారం దక్కింది.  తెలుగుదేశం, జనసేన, బీజేపీలో వేర్వేరుగా పోటీ చేయడం ఒక్కటే కాదు.. రాష్ట్రంలో క్రైస్తవ సమాజం మొత్తం గంపగుత్తగా జగన్ కు మద్దతు పలకడం కూడా జగన్ పార్టీ విజయానికి ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.   అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యిందంటున్నారు. స్వ‌త‌హాగా సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న కుటుంబం  క్రిస్టియన్లు కావ‌డంతో ఆ మ‌తానికి చెందిన వారు దాదాపు గంప‌గుత్త‌గా   వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలిచారు.  అలా నిలవడానికి ప్రధాన కారకుల్లో ఒకరు   జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోద‌రి ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌ అనడానికి సందేహం అవసరం లేదు. అప్పట్లో  ఆయన ఏపీ వ్యాప్తంగా ప‌ర్య‌టించి క్రిస్టియ‌న్ల‌ను వైసీపీవైపు మొగ్గు చూపేలా చేయడంలో సఫలీకృతులయ్యారు.  క్రిస్టియ‌న్లు అంటే కేవ‌లం ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాలే కాదు.. బీసీలు, ఓసీల్లోని క‌మ్మ‌, కాపు, రెడ్డి కుల‌స్థులు కూడా అధికంగానే ఉన్నారు.  కులంతో సంబంధం లేకుండా కేవ‌లం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్రిస్టియ‌న్ అనే కార‌ణంతో  అప్పట్లో చంద్ర‌బాబును దూరంపెట్టి వాళ్లంతా జ‌గ‌న్ కు మద్దతుగా నిలిచారు. అయితే అదంతా గతం. ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో.. ఇప్పుడు గతంలో జగన్ కు మద్దతుగా నిలిచిన క్రిస్టియన్లు ఇప్పుడు గతంలోలా గంపగుత్తగా ఆయనవైపు నిలిచే పరిస్థితి లేదు.  ఎందుకంటే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన క్రిస్టియ‌న్ల‌కు ఆయన చేసిన మేలేమీ లేకపోగా.. కులం ప్రాతిపదికన వారిని చిన్న చూపు చూశారు.  ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా జగన్ సర్కార్ వ్యవహరించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్సీఎస్టీలపై దాడులు జరిగాయి.  అంతే కాదు.. గత ఎన్నికలలో క్రిస్టియన్ల ఓట్లు గంపగుత్తగా వైసీపీకి మళ్లడంలో కీలక భూమిక పోషించిన షర్మిల భర్త బ్రదర్ అనీల్ ఇప్పుడు జగన్ కు దూరం జరిగారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన కాంగ్రెస్ కు అనుకూలంగా క్రిస్టియన్లను ఏకం చేయడం కోసం పని చేస్తున్నారు.   దీని వల్ల తనకు జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో జగన్ కు తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా తన మేనత్త, అంటే తన తండ్రి సోదరి విమలారెడ్డిని రంగంలోకి దింపారు.  ఆమె  జిల్లాల్లో  విస్తృతంగా పర్యటనలు చేస్తూ.. చ‌ర్చి ఫాద‌ర్లతో భేటీ అవుతున్నారు. అయితే క్రిస్టియన్ సొసైటీలో విమలారెడ్డికి పెద్దగా గుర్తింపు లేదు. అధికార పార్టీ అండతో మాత్రమే ఆమె చర్చి ఫాదర్లకు తాయిలాలు పంచుతూ తన సమావేశాలకు హాజరయ్యేలా చేసుకోగలుగుతున్నారు. అయితే చర్చి ఫాదర్లు, పాస్టర్లతో ఆమె సమావేశాలు పెద్దగా ఫలితాన్నిస్తున్నట్లు కనిపించడం లేదు. అంతే కాకుండా ఇంత పంచుతాము, అంత ఇస్తాము అంటూ ప్రలోభపెట్టి తీరా సమావేశం పూర్తయిన తరువాత ఏదో అరకొరగా చేతిలో పెట్టి చేతులుదులుపుకోవడంతో విమలారెడ్డిపై ఫాదర్లు, పాస్టర్లలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాకినాడలో  ఆమె నిర్వహించిన సదస్సుకు దాదాపు రెండు వేల మంది పాదర్లు, పాస్టర్లు పాల్గొన్నారు. అంత సంఖ్యలో వారు రావడానికి కారణం నిర్వాహకులు భేటీ ముగిసిన తరువాత ఒక్కొక్కరికీ వేయి రూపాయలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురి చేయడమే. ఈ విషయం సదస్సు ముగిసిన తరువాత ఫాస్టర్లు ఆందోళనకు దిగడంతో వెల్లడైంది. వేయి రూపాయలు ఇస్తామని చెప్పి తీరా సదస్సు ముగిశాకా ఐదొందలు మాత్రమే చేతిలో పెట్టారంటూ కాకినాడ సదస్సుకు హాజరైన ఫాస్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో వ్రతమూ చెడి, ఫలమూ దక్కలేదన్నట్లుగా తయారైంది  వైసీపీ పరిస్థితి. సముదాయించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన నిర్వాహకులు మొహం చాటేశారు. విమలారెడ్డి చర్చి బ్యాక్ డోర్ నుంచి కారులో పలాయనం చిత్తగించారు. ఈ సంగతి మీడియాలో ప్రముఖంగా రావడంతో విమలారెడ్డికి అసలే అంతంత మాత్రంగా ఉన్న రెపుటేషన్ మరింత తగ్గింది.  ఇక ఇప్పుడు షర్మిల భర్త బ్రదర్ అనీల్ రంగంలోకి దిగారు. జగన్ కు, ఆయన పార్టీకి వ్యతిరేకంగా పాస్టర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జగన్ ఏలుబడిలో పాస్లర్లు ఎదుర్కొన్న సమస్యలను సవివరంగా వివరిస్తున్నారు. క్రైస్తవులకు మేలు జరగలేదని చెబుతున్నారు. తాజాగా అమలాపురంలో పాస్టర్ల సమావేశంలో పాల్గొన్న బ్రదర్ అనీల్ కుమార్ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలనలో కానీ   క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు.   వైఎస్ హయాంలో క్రైస్తవులు ఇబ్బందులకు గురౌతున్నారని  చెప్పకనే చెప్పారు. వైఎస్ బిడ్డే కదా అని జగన్‌కు అవకాశం ఇస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని అనీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.   రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పడం ద్వారా నేరుగా జగన్ పేరు ఎత్తకుండానే ఆయన పార్టీకి ఓటువేయవద్దని సూటిగా, సుత్తిలేకుండా స్పష్టంగా చెప్పారు.  జగన్ రెడ్డిని గెలిపించడం అంటే దేవుడ్ని మోసం చేసడమేనంటున్నారు.  శత్రువులంతా అంతమైపోవాలని భగవంతుడిని ప్రార్థిద్దామంటున్నారు. అనిల్ రెడ్డి అమలాపురంలో చేసిన వ్యాఖ్యల వల్ల  ఆయన  సువార్త సభలను ఏపీలో పెట్టుకోలేని పరిస్థితులను జగన్ సృష్టించారని తేటతెల్లమౌతున్నది.  మొత్తం మీద బ్రదర్ అనీల్ ప్రసంగాలు క్రిస్టియన్లను వైసీపీకి దూరం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ కు అనుకూలంగా క్రైస్తవ సమాజాన్ని కదిలించిన ఆయన ప్రసంగాలు ఇప్పుడు అదే  జగన్ కు  క్రీస్టియన్లను దూరం చేయడం తథ్యమని అంటున్నారు. 

యాదాద్రి సాక్షిగా భట్టి విక్రమార్కకు అవమానం

తెలంగాణలో  పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలో రావడంలో సీనియర్ కాంగ్రెస్ నేత, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలకపాత్ర పోషించారు.  2023 మార్చి 16న ఆదిలాబాద్​ జిల్లాలోని బోథ్ నుంచి పీపుల్స్​ మార్చ్ పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలో మీటర్లు పూర్తి చేసిన భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వంలో వివక్షకు గురవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్వామి వారిని దర్శించుకున్నారు. పూజ సమయంలో రేవంత్, ఆయన భార్య, కోమటిరెడ్డి, ఉత్తమ్ లు కొంత ఎత్తున్న స్టూళ్లపై కూర్చున్నారు. వీరి పక్కన మల్లు భట్టి తక్కువ ఎత్తున్న పీఠంపై కూర్చున్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం జరిగిందని అన్నారు. ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటమని చెప్పారు.  ఇదే అంశంపై బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శలు గుప్పించింది. యాదాద్రి దేవాలయం సాక్షిగా దళితుడైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, బహుజన బిడ్డ కొండా సురేఖను రేవంత్ రెడ్డి అండ్ కో ఘోరంగా అవమానించిందని ట్వీట్ చేసింది. వారు పైన కూర్చిని భట్టి విక్రమార్క, కొండా సురేఖను రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అవమానించారని వ్యాఖ్యానించింది. 

నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ప్రకటించిన జనసేనాని 

ఎపిలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. టిడిపి, బిజెపి, జనసేన పొత్తు ఖరారైన తర్వాత ఈ వేగం మరింత ఎక్కువైంది. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో అభ్యర్థి పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేశ్ ను ఆయన ఎంపిక చేశారు. కందుల దుర్గేశ్ ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి తరపున దుర్గేశ్ పోటీ చేయబోతున్నారని జనసేన పార్టీ ప్రకటించింది.  ఇప్పటికే నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణల పేర్లను పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి జాబితాలో టీడీపీ 94 మంది పేర్లను ప్రకటించింది. మరోవైపు బీజేపీ, జనసేనలకు పొత్తులో భాగంగా 8 లోక్ సభ, 30 శాసనసభ స్థానాలను టీడీపీ కేటాయించినట్టు తెలుస్తోంది. 

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి యాదాద్రిలో...

యాదాద్రి నిర్మాణం బిఆర్ఎస్ హాయంలో జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే యాదాద్రిలో నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను రేవంత్ రెడ్డి ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.  శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి దేవ‌స్థానం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా యాదాద్రి చేరుకున్న‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దంప‌తులకు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా తొలిరోజు ప్ర‌ధాన ఆల‌యంలో సీఎం దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ప్ర‌భ‌త్వం త‌ర‌ఫున స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు, అమ్మ‌వారికి ముత్యాల తలంబ్రాలు స‌మ‌ర్పించారు. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌ట్ రెడ్డి వెంక‌ట్ రెడ్డి, కొండా సురేఖ, ప్ర‌జాప్ర‌తినిధులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.  ఇక రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారి యాదాద్రికి వెళ్ల‌డంతో ప్రొటోకాల్ స‌మ‌స్య‌లు రాకుండా ఆల‌య ఆఫీస‌ర్లు, పోలీసులు ముందే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్ర‌మంలో కొండ‌పైకి ఇత‌ర వాహ‌నాల‌ను అనుమ‌తించ‌లేదు. ఉద‌యం 11 గంట‌ల త‌ర్వాత భ‌క్తుల‌కు ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డం జ‌రిగింది. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 11రోజుల పాటు జరగనున్నాయి. మహాదివ్య పుణ్యక్షేత్రమైన యాదాద్రి పంచనారసింహుల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మరో తిరుమల క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రీశుల వైభవం నలుదిశల్లోని భక్తజనులను అలరింపజేసేలా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు రంగం సిద్ధం చేశారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఆలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత రెండోసారి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.