రాష్ట్ర నాయకుల "రహస్య లిపి''

 

 

 

- డా. ఎబికె ప్రసాద్

 

[సీనియర్ సంపాదకులు]
 

 

 

కవి శ్రీరంగం నారాయణ బాబు అనేక సంవత్సరాల క్రితం ఓ పాట రాశాడు. రంగూన్ (బర్మా)తో వర్తక, వ్యాపార లావాదేవీలు మన రేవు పట్టణాలనుంచి జరుగుతున్నప్పుడు ఓ జానపద దంపతుల జంట మధ్య నడిచిన సంభాషణకు అక్షర రూపమిచ్చాడు :

"రంగమెళితే నేటి రంగైనవోడ!  నే
     రంగమెళితే నేటి అచ్చరాల నీ పేరే పచ్చాపొడుసుకొన్నాను
    సాటుమాటుగ దాన్ని సదివించుకొన్నాను  రంగమెళితే నేటి? ...''

ఇక్కడ 'రంగం' అంటే రంగూన్ అనే. ఎవడిగోలవాడిదే అన్నట్టుగా తొలి రోజుల్లో మన కవిత్వం మనమేగాని యితరులకు తెలియకుండా వుండాలనే ఊహ ఉండేది మన కవులకు! ఈ దుస్థితిని కనిపెట్టి తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు అలాంటి "దుస్థితి''ని "రంగూను ఉత్తరాల''తో పోల్చుతూ వుండేవారు! ఇంతకీ ఈ "రంగూన్ ఉత్తరాల'' కథాకమామీషు ఏమిటి?! ఆనాటి ఆంధ్రదేశంలో శ్రీకాకుళం నుండి గోదావరి జిల్లాల వరకూ ఒకప్పుడు రంగూన్ తో భారీస్థాయిలో వ్యాపార లావాదేవీలు జరుగుతుండేవి. మొగలాయీలు, నిజాంపాలకులు కూడా తెలంగాణా తెలుగుప్రాంతంలో సముద్రప్రాంతం లేనందున మచిలీపట్నం, కాకినాడ రేవుల నుంచే వర్తక, వ్యాపారాలు నిర్వహించుకునే వారు!


నాటి వర్తక వ్యాపారానికి సంబంధించిన పరస్పర ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ రహస్య (సంకేత) లిపిలో సాగుతుండేవట. ఆ 'లిపి' చాలావరకు తెలుగు, ఉర్దూలే అయినప్పటికీ ఆ లిపిని అటు ఇటూ కూడా ఉత్తరాలు పంపేవారికి, అందుకునేవారికి మాత్రమే అర్థం చేసుకోగలిగేవాళ్ళట. అంటే, వ్యాపార రహస్యాలు వెల్లడి కాకుండా ఈ ప్రత్యేక 'లిపి' వాడేవారట! చాలామందికి గుర్తుందో లేదో మన చిన్నప్పుడు ఆట పాటల్లో ఉన్న పిల్లలు పెక్కుమంది 'క' భాషలో (సంకేత భాష) ఇతరులకు తెలియకుండా వాడుతూ వుండేవారు సరదాగా! కాని ఇప్పుడు అలాంటి భాష ఏదో రాష్ట్ర విభజన సమస్యపైన అటు కేంద్ర నాయకులకూ, ఇటు దశదిశా తెలియకుండా ప్రజల్ని సొంత ఎజెండాలతో వేధిస్తున్న పార్లమెంటు సభ్యులకు, శాసనసభ సభ్యులకూ, "సొంత పార్టీలు'' పెట్టుకుని యుతవలో, ప్రజలలో భ్రమలు గొలిపే రాజకీయ నాయకులకూ మధ్య "ఆసులో గొట్టాం''లా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ జరుపుతున్న "రాజకీయ వ్యాపార లావాదేవీలు'' కూడా "రంగూన్'' ఉత్తరాల మాదిరే నడుస్తున్నాయి! కాని 'వాళ్ళ' మోసపు సంభాషణ మాత్రం మనకు తెలియదు! రాష్ట్ర విభజన సమస్యపై వీళ్ళు ఇక్కడ రాష్ట్రప్రజలకు చెప్పేదొకటి, ఢిల్లీ పరుగెత్తి అక్కడ నాయకత్వం చెవిలో ఊది వచ్చేదొకటీ! భాషాజ్ఞానం నుంచే గాక, చరిత్ర పాఠాలను కూడా పాఠ్యప్రణాళికల్నుంచి ఎత్తించి వేయించిన ఘనులు మన పాలకులు!

 

అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, తెలుగుజాతి చరిత్ర తెలియని ఆ చరిత్రలో బొత్తిగా సంబంధం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం తెలుగుజాతిని అవమానిస్తూ రాష్ట్ర నాయకుల్ని తన చుట్టూ గానుగెద్దుల్లాగా తిప్పుకుంటున్నా రాష్ట్రనాయకులకు సిగ్గులేదు. ఇది దుర్భరం! తెలుగువారికి అవమానకరం. డాక్టర్ అంబేడ్కర్ పదేపదే హెచ్చరించినట్టుగా పార్లమెంటులో మెజారిటీ స్థానాలు దక్కించుకునే కోరికను సఫలం చేసుకునేందుకు కాంగ్రెస్ ఇన్నాళ్ళుగా ఆడుతూ వచ్చిన నాటకం మూడు ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంటులో ఉన్న సంఖ్యాబలం మీద ఆధారపడి, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను ఉత్తరాదివారు దెబ్బతీస్తున్నారన్న భావన దక్షిణాది వారిలో కలిగే ప్రమాదం ఉందని మరచిపోరాదు. ఎంతసేపూ ఉత్తరప్రదేశ్ కు చెందిన 80-85 సీట్లపైన, మధ్యప్రదేశ్, బీహార్ స్థానాలపైన కాంగ్రెస్ దృష్టి పెట్టడంవల్లనే అనేక దఫాలుగా ఆ పార్టీ సంక్షోభాలు ఎదుర్కొనక తప్పడంలేదు! ఈ గుర్తింపు, జ్ఞానం కాంగ్రెస్ నాయకత్వానికి ఇప్పటికీ లేదు. కనుకనే తమ లాభలబ్ది కోసం ఎక్కడికక్కడ తాడూబొంగరం లేని రాజకీయ విధానాలతో, కుట్రలతో 'వోటు-సీటు' ప్రయోజనాలతో ప్రజలను విభజించి తమ పబ్బం గడుపుకునే స్థానికపార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉండటం.


 

పైగా తెలుగుజాతి చరిత్ర గురించి, అది చరిత్రలో భాషా వ్యాప్తి ద్వారా, వందల, వేల సంవత్సరాల స్వీయ సంస్కృతీ విభావంతో మగధనుంచి మచిలీపట్నందాకా [మూడు ప్రాంతాలూ] శాతవాహన, కాకతీయ, విజయనగర యుగాల దాకా విలసిల్లిందని తెలియని కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలోని తెలుగేతర "మాయలమారుల'' దుష్టచతుష్టయం [దిగ్విజయ్ సింగ్, గులామ్ నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, తాజాగా ఆంటోనీ] తొమ్మిది కోట్ల మంది తెలుగుప్రజల భావితవ్యంతో జూదమాడుతున్నారు! ఈ విషయం తెలిసి కూడా కేవలం పదవులకోసం జాతి విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పచ్చి అవకాశవాద రాజకీయాల్లోకి జారుకున్న కొన్ని ప్రతిపక్షాల నాయకులూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.


 

రాజకీయ శక్తిగా రాష్ట్రప్రజా బాహుళ్యంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన సమస్త ప్రతినిధుల సమక్షంలో చర్చలు జరపకుండా కేవలం ఒక రాజకీయపార్టీకి చెందిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకపక్షంగా చేసిన రాష్ట్ర విభజన తీర్మానాన్ని కాలదన్ని రాష్ట ప్రయోజనాలను, తెలుగుజాతి ఐక్యతనూ కాపాడవలసిన ప్రధాన పార్టీల రాష్ట్రనాయకులు చొల్లుకబుర్లతోనూ, పనికిమాలిన "ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో''నూ కాలక్షేపం చేస్తున్నారు. కేంద్ర కాంగ్రెస్ స్వార్థబుద్ధితో చేసిన చారిత్రిక తప్పిదాన్ని తిప్పికొట్టే భారమూ, బాధ్యత, ఉద్యోగ, కార్మిక, కర్షక, విద్యార్థులు, యువత, మహిళాది వర్గాలపైన రాజకీయ పార్టీల స్వార్థపర నాయకులు మోపేశారు!
 


ఒకడు ప్రజల "ఆత్మగౌరవా''న్ని ఢిల్లీ వీథుల్లో కేంద్ర పాలకులకు పాదాక్రాంతం చేశాడు; ఇంకొకడు తన స్వార్థంకోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఆవురావురుమని అంగలార్చి, ఆ అవకాశం చివరికి తన చేజారిపోతుందన్న బెంగతో ఢిల్లీలో అనేకరోజుల తరబడి కాంగ్రెస్ నాయకత్వంతో రహస్య మంతనాలు జరిపి తన వేర్పాటువాదం ద్వారా విభజన ప్రక్రియ కోసం "సెలైన్ సత్యాగ్రహం'' తతంగాన్ని నడిపి కేంద్రాన్నీ, ప్రజలనూ మభ్యపెట్టిన స్థానిక పార్టీ మోసగాడైన 'దొర'; ఇంకొకడు పేరుకు 'వామపక్షం' అని చాటుకొంటూనే, తెలుగుజాతిని ఒక్క తాటిపైకి తెచ్చిన తెలంగాణా రైతాంగ సాయుధపోరాట స్ఫూర్తిని గాలికి వదిలేసిన వారు;ఇక మరొకడు ఇదీ అదీ గాదు "అత్తమీద కోపాన్ని దుత్తమీద తీర్చుకు''న్నట్టుగా ఒక మాజీముఖ్యమంత్రి కొడుకుమీద దుగ్ధనుతన ఆస్తిపాస్తుల రక్షణార్థం, కేంద్రానికి మోకరిల్లి తనపై వచ్చిన ఆర్థిక నేరారోపణలనుంచి ఎలాగోలా బయటపడడం కోసం కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలుగుజాతి విభజన ప్రతిపాదనకు స్వయం లేఖ ద్వారా దొంగచాటుగా మద్ధతు తెలిపివచ్చి, ఇప్పుడు "సమన్యాయం'' కల్పించాలన్న భట్టిప్రోలు పంచాయితీతో కాలక్షేపం చేస్తూ రాష్ట్రపర్యటనకు బయలుదేరి ఆత్మగౌరవం కోల్పోయి అడుగడుగునా అభాసుపాలవుతున్న ఒక రాష్ట్ర మాజీముఖ్యమంత్రీ!


 

ఈ అవకాశవాద రాజకీయాలను దళిత, బహుజనవర్గాలకు కూడా పాకించడం  - వీళ్ళు ప్రజాక్షేమం కోరిన రాజకీయులు కారనీ, సంపన్న రాక్షససంతతి అనీ మరొకసారి నిరూపితమయింది! ఇక మరో పోర్ఫేసర్ ఉన్నాడు, ఆయనగారు ముఖ్యమంత్రినీ, ఇతర మంత్రులనూ జీతాలు తీసుకోవటం మానేసి, రాజీనామాలు చేసి బయటకు రమ్మంటూ తాను మాత్రం పిల్లలకు పాఠాలు చెప్పడం మానేశాడు, యూనివర్సిటీనుంచి నెలవారీ జీతం [లక్షరూపాయలకు పైగానేనని ఉస్మానియా వర్గాలు] క్రమం తప్పకుండా పొందుతూ ఒక వేర్పాటు సంయుక్త కార్యాచరణ సంస్థకు నాయకస్థానంలో ఉన్నాడు. అయినా వేర్పాటువాద స్థానిక పార్టీపెట్టిన నాయకుడికీ, సంయుక్త కార్యాచరణ పేరిట వేరొక కుంపటి పెట్టిన ఈ ప్రొఫెసర్ కూ మధ్య పడిచావక [ఎందుకు పడటంలేదో చెప్పకుండా] ఎవరి దుకాణం వారు నడుపుకుంటున్నారు. ఉభయ వర్గాలు బెదిరింపుల ద్వారా వసూళ్లు మాత్రం చేసుకుంటున్నారని ఆ రెండు క్యాంపుల్లోని వారూ పరస్పరం ఆరోపించుకుంటున్నారు!



ముఖముఖాలు చూసుకోకపోయినా "కలిసే ఉన్నట్టు''గా ప్రజల్ని మాత్రం మోసగిస్తున్నారు. టాంక్ బండ్ విధ్వంసకాండకు కారణం నీవంటే నీవని వాదించుకున్నారు. ఇక స్థానిక పార్టీ నాయకుడైన 'దొర' ఊసరవెల్లి మాదిరిగా పొంతన లేకుండా వేర్వేరు ప్రకటనల ద్వారా ప్రాంతప్రజలను మభ్యపెడుతున్నాడు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం రేపో, మాపో వస్తుందని దాదాపు సంవత్సరకాలంగా ఊరిస్తూనే ఉన్నాడు! ఆ నమ్మకం సడలి పోయింతరువాత తేదీలు జరుపుకుంటూ వెడుతూన్నాడు ఇంతకూ కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిపిన చర్చలు ఏమి హామీపడ్డాడో ఇతడు తెలియదుగాని, సమస్యను "వాయిదాల రత్తయ్య''లా నానబెట్టడంలో అధిష్ఠానంతో 'మిలాఖత్' అవుతున్నాడు! విఫలమైన, మసకబారిన తన 'గౌరవాన్ని'' నిలబెట్టుకునే తాపత్రయంలో కాంగ్రెస్ లో తన పార్టీని "విలీనం'' చేస్తానని యిచ్చిన హామీ విషయంలో కూడా ప్రజల్ని మోసగించడానికిగాను ఒక్కోసారి ఒక్కో ప్రకటన చేస్తున్నాడు.

 

మొదట్లో హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాలస్వతంత్ర రాష్ట్రమైతేనే "ఒప్పుకుంటా''నని చెప్పిన ఈ మాటకారి హైదరాబాద్ ప్రతిపత్తిపైన కూడా తన వైఖరిని క్రమంగా మార్చుకుంటూ వస్తున్నాడు; ముందు పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉంచడానికి కూడా అంగీకరించని ఈయన, హైదరాబాద్ ప్రతిపత్తిపైన వచ్చిన మూడు రకాల కేంద్ర ప్రత్యమ్నాయాలలో తాను దేనికి సుముఖమో చెప్పకుండా దాటవేస్తూ "ఉమ్మడి రాజధానిగా రెండేళ్ళకు మించి ఒప్పుకునేది లేదని'' కొత్త ప్లేటు పెట్టాడు. కాంగ్రెస్ లో తన పార్టీ కలిసిపోవాలంటే ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని, ఆ తర్వాత తన పార్టీని 'గంగ' (కాంగ్రెస్)లో కలిపేస్తానని బీరాలు పలికిన ఈ అవకాశవాద నాయకుడు ఇక "ప్రత్యేక రాష్ట్ర్త''బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోవచ్చుననీ, అయితే 'హైదరాబాద్' అంశం తెలంగాణా ప్రజలు కోరుకుంటున్నట్టుగా  ఉండకపోవచ్చు''ననీ ఏదైనా "కిరికిరి పెట్టే అవకాశముందనీ'' "ఫామ్ హౌస్ నాయకుడు'' నెమ్మదిగా బయటపడ్డాడు!

 

అంటే, ఈ "దొర''నిత్యం కాంగ్రెస్ అధిష్ఠానంతో ఎలా మంతనాలు సాగిస్తున్నాడో, వ్యవహారమంతా రకరకాల ప్రభావాలకు లోనైన వ్యక్తిగా ఫామ్ హౌస్ నుంచే ఎలా నడిపిస్తున్నాడో రాష్ట్రప్రజలందరికీ దాచినా దాగని సత్యంగా గుట్టు బయట పడిపోయింది! ఇప్పుడతని బాధంతా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందో లేదోనన్న బాధకన్నా, ఏర్పడకపోతే తనను తెలంగాణా ప్రజలనుంచే చుట్టుముట్టే భయంకర పరిస్థితుల్ని తాను చవిచూడవలసి వస్తుందేమానాన్న విచారమే ఎక్కువగా ఆయన్ని పట్టిపీడిస్తోంది! కనుకనే కాంగ్రెస్ అధిష్ఠానం తద్వారా స్థానిక కాంగ్రెస్ నాయకత్వాలు "కుడితిలో పడిన ఎలుకలా'' కొట్టుకు చస్తున్నాయి! అంటే దారితప్పిన నాయకులందరికీ అధిష్ఠానం ఏం చెబుతుందో ప్రజలకు తెలియదు, అన్ని రకాల నాయకులు, మంత్రులు, ఎం.పీ.లూ, ఎం.ఎల్.ఎ.లూ తిరిగి అక్కడ ఏం చెప్పారో, ఇక్కడ జనాలకు ఏమి చెబుతున్నారో ప్రజలకు తెలియదు; ఏతావాతా రాష్ట్ర సమస్య తేలకుండా, అలా మరికొన్నాళ్ళు నానుతూ ఉంటుంది! నాయకుల మంతనాల రహస్య లిపిని బద్ధలు కొట్టాల్సినవారు ప్రజలే!

కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది : కేసీఆర్

  తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ది చెప్పారని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ప్రదర్మించలేదన్నారు.  తనను తిట్టడం తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఈ ప్రభుత్వ విధానం అని కేసీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్‌లో ప్రారంభమైంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గసభ్యులతో గులాబీ అధినేత భేటీ అయ్యారు.  కారు పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్‌ఎస్‌ సత్తా తెలిసేది. బీఆర్‌ఎస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్‌రెడ్డి ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదు. తీసుకొచ్చిన పాలసీ.. రియల్‌ ఎస్టేట్‌ కోసమే. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు వచ్చేది. ఇప్పుడు యూరియా కోసం ఫ్యామిలీ మొత్తం లైన్‌లో నిలబడే పరిస్థితి వచ్చింది’’ అని గులాబీ బాస్ విమర్మించారు

వైసీపీ, బీఆర్ఎస్ బంధానికి ఇంత కంటే రుజువుంటుందా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, ఆయన పార్టీ నేతలు, శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి.  అవన్నీ పక్కన పెడితే  తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన  ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని  తాడేపల్లిలోని జగన్ నివాసం అదేనండి తాడేపల్లి ప్యాలెస్ వద్ద పెద్ద ఎత్తున బ్యానర్లు, హోర్డింగ్ లు, కటౌట్ లు వెలిశాయి.  వీటిలో ఒక బ్యానర్ మాత్రం అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది.  ఆ భారీ కటౌల్ లో జగన్, కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు ఉండటమే అందుకు కార ణం. ఈ బ్యానర్ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ బ్యానర్ బీఆర్ఎస్, వైసీపీ బంధానికి నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో జగన్ కేటీఆర్ తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.  

బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి

  ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు. నాంపల్లి సెంట్రల్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.  అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆమని మాట్లాడుతు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి గర్వపడుతున్నాని తెలిపారు. ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.  ఆయన సనాతన ధర్మం కోసం మోదీ ఎంతో పాటుపడుతున్నారు" అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ, ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి, జయసుధ, జీవితా రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. కొందరు అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి  

మీరసలు హిందువులేనా, మీకసలు దేశ భక్తి ఉందా?.. విజయసాయి

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి హిందుత్వ అనుకూల వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సన్యాసం తీసుకుని వ్యవసాయమే వ్యాపకమంటూ ప్రకటించిన ఆయన అడపాదడపా రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే.  అన్నిటికీ మించి ఆయన ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ఆయన కమలం గూటికి చేరువ అవుతున్నారన్న సంకేతాలు ఇస్తున్నాయి. విజయసాయి కాషాయ మంత్రం జగన్ కు కషాయం కావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ఒక సందర్భంగా ఆయన హిందూమతంపై కుట్రలు జరుగుతున్నాయంటూ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఆశ చూపి మతమార్పిడులకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అక్కడితో ఆగకుండా గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై ఓ కమిటీ వేసి మరీ విచారణ జరపాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. దీంతో ఆయన జగన్ అండ్ వైసీపీ టార్గెట్ గా రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు తాజాగా  బంగ్లాదేశ్ లో ఆందోళనలు హింసాకాండపై ఎక్స్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి.. బంగ్లాదేశ్ లో హిందువులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నా యన్నారు. ఈ దాడులను ఆయన నరమేధంగా అభివర్ణించారు. ఈ దాడులను ఖండించని వారు అసలు హిందువులే కారనీ, వారికసలు దేశ భక్తే లేదంటూ విమర్శలు గుప్పించారు.  బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులను ఖండించకుండా మౌనంగా ఉన్న రాజకీయ పార్టీలకు, నాయకులకు ఈ దేశంలో కొనసాగే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు.   భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై  స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన తన రాజకీయ పున: ప్రవేశానికి కమలదళం గొంతుకను సిద్ధం చేసుకుంటున్నారని పరిశీలకులు అంటు న్నారు.  

పీపీపీపై న్యాయపోరాటం ఎలా? వైసీపీ మల్లగుల్లాలు!

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి అష్ఠకష్టాలు పడిన వైసీపీ.. కోటి సంతకాలంటూ చేసిన హడావుడి ముగిసింది. గవర్నర్ కు వినతిపత్రంలో ఆ ప్రహసనం దాదాపు ముగిసిపోయినట్లే. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పట్ల ప్రజల వ్యతిరేకత పెద్దగా కనిపించలేదని స్పష్టమైంది. దీంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఈ విషయంలో కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడానికి సన్నాహాలు చేస్తున్నది. అయితే ఇక్కడే ఆ పార్టీకి పెద్ద ఇబ్బంది వచ్చి పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పీపీపీ విధానం వద్దు అంటూ కోర్టును ఆశ్రయిస్టే ఆ పిటిషన్ అడ్మిషన్ స్థాయిలోనే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. ఎందుకంటే పీపీపీ విధానం అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడిన అంశం. కేంద్రం నుంచి పలు రాష్ట్రాలలో ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ అన్నది ఈ పీపీపీ విధానంలోనే జరుగుతోంది. సరే అది కాదని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది.  దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు. అది పక్కన పెడితే తాము సేకరించిన కోటి సంతకాలనూ కోర్టు ముందు ఉంచుతామన్న వాదనను వైసీపీ తెరపైకి తీసుకువస్తున్నది. అయితే అదీ అంత తేలిక కాదు. నిజంగా వైసీపీ కోటి సంతకాలు సేకరించి, వాటిని కోర్టుకు సమర్పించాలంటే, ఆ కోటి సంతకాలు చేసిన వారి గుర్తింపును కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి సంతకాల సేకరణ కార్యక్రమం ఎలా జరుగుతుందన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సంతకాలు చేసిన కోటి మంది ఐడెంటిటీని కోర్టు ముందు ఉంచడం అంటే అయ్యే పని కాదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు కాలేజీలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి ఎలా ముందుకు వెడుతుందన్నది ఆసక్తిగా మారింది. 

సానుకూల దృక్ఫథంతో సవాళ్లను అధిగమించా.. విద్యార్థులతో నారా లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.   సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి. అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న కుట్రలు జరిగాయి. పప్పు అంటూ బాడీ షేమింగ్,  హేళనలు ఇలా ఎన్నో ఎదుర్కొన్నారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నాలు జరిగాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ , మీమ్స్ తో లోకేష్ రాజకీయ ఎదుగుదనలను ఆరంభంలోనే అణచివేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ విషయాలన్నిటినీ మంత్రి నారా లోకేష్ రాజమహేంద్ర వరంలో శుక్రవారం (డిసెంబర్ 19) విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు. వాటన్నిటినీ అధిగమించడానికి తాను ఏం చేశారో పంచుకున్నారు.   తన శక్తిని అటువంటి ట్రోలింగ్స్, మీమ్లను ఖండించడానికీ, బుదలు ఇవ్వడానికీ వృధా చేయ కూడదని అందుకు బదులుగా  రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగడంపైనే దృష్టి సారించాననీ వివరించారు. తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో  పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.  తనకు ఎదురైన ప్రతి సవాలును సానుకూల దృక్ఫ థంతో ఎదుర్కొన్నానని చెప్పారు.  ఒక అడుగు వెనక్కి వేస్తే సరిదిద్దుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు చెప్పారు.   

రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే సవాల్ కు మంత్రి లోకేష్ సై

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభివృద్ధి విషయంలో తనతోనే పోటీ పడతానంటూ సవాల్ చేసిన పార్టీ ఎమ్మెల్యేను అభినందించారు. మనస్ఫూర్తిగా ఆ సవాల్ ను స్వీకరిస్తున్నానని సభా ముఖంగా ప్రకటించారు. ఇంతకీ విషయమేంటంటే.. రాజమహేంద్రవరంలో శుక్రవారం (డిసెంబర్ 19) పర్యటించిన నారా లోకేష్ అక్కడ  నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తాను నారా లోకేష్ తో పోటీ పడతానని అన్నారు. దీనికి నారా లోకేష్ చాలా చాలా సానుకూలంగా స్పందించారు. సిటీ  ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సవాల్ ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలతో మమేకమౌతూ ముందుకు సాగాలన్న లోకేష్.. ఆదిరెడ్డి వాసు కుటుంబం కష్ట సమయంలో తమకు అండగా ఉందని చెప్పారు.  జగన్ హయాంలో చంద్రబాబును అక్రమంగా రాజమహేంద్రవరం జైల్లో నిర్బంధించిన సమయంలో ఆదిరెడ్డి కుటుంబం తమకు అండగా నిలిచిందని చెప్పారు. ఆయనను తాను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. జగన్ ను సైకోగా అభివర్ణించారు. సైకో ఇంకా అరెస్టులు చేస్తానంటూ చేస్తున్న బెదరింపులను ఖండించారు.  అధికారంలో ఉండగా వైనాట్ 175 అంటూ గప్పాలు కొట్టిన వారు, గత ఎన్నికలలో టీమ్ 11 కు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు జరుగుతున్నాయన్న ఆయన ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని లోకేష్ సూచించారు. వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. 

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. కేటీఆర్ కు ముళ్ల కిరీటమేనా?

క‌మ్యూనిస్టుల‌కు  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనే ప‌ద‌వి ఎంత  ప‌వ‌ర్ ఫుల్లో.. బీఆర్ఎస్ వంటి పార్టీల‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి అంటే అంత వేల్యుబుల్.  అయితే బీఆర్ఎస్ లో సమస్య ఏమిటంటే.. పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు. నల్లేరు మీద బండినడక అనదగ్గ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పరాజయాలను ఎదుర్కొంటూనే ఉంటుందన్నారు.  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎంపికైన నాటి  నుంచి ఇప్ప‌టి  వ‌ర‌కూ   గ్రేట‌ర్, కార్పొరేషన్, ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఇవి రెండూ పూర్తయిన తరువాత  రెండు ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ అన్ని ఎన్నికలలోనూ ఆయన ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని పని చేశారు. అయితే వేటిలోనూ పార్టీని విజయం దిశగా నడిపించలేకపోయారు.  దుబ్బాక నుంచి మొద‌లు పెడితే నిన్న మొన్న‌టి  జూబ్లీహిల్స్ బై పోల్ వ‌ర‌కూ ప్ర‌తి ఎన్నికలోనూ పార్టీని పరాజయమే వరించింది.  ఇటీవ‌లి స్థానిక ఎన్నిక‌ల‌లోనూ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఓటమినే మూటగట్టుకుంది.   రేవంత్  విమర్శలను పక్కన పెడితే..  కేటీఆర్ కి కానీ,  బీఆర్ఎస్ కి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అచ్చిరాలేదన్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేటీఆర్ సమర్ధ నాయకుడిగా గుర్తింపు పొందడం వెనుక తండ్రి ఇమేజ్ ఉంది. సీఎం కుమారుడిగా, మంత్రిగా ఆయన మాటే వేదంగా అప్పట్లో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు సాగాయి. అయితే ఆ ఘనత అంతా కేసీఆర్ దేనని అంటారు విమర్శకులు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత.. ముందుండి పార్టీని నడిపించడంలో కేటీఆర్ వైఫల్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో సొంత పార్టీలోనే కేటీఆర్ నాయకత్వంపై సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.  ఎన్నికలలో వరుస పరాజయాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగింపుపైనా బీఆర్ఎస్ లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి.  అయినా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలలో కూడా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వారు ఉన్నారు. కానీ వారి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఈ స్థాయి చర్చ జరగడం లేదు. ఒక్క కేటీఆర్ విషయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన సామర్థ్యం, అర్హతపై రాజకీయ ప్రత్యర్థలు నుంచే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు, నేతల నుంచి కూడా ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  కేటీఆర్  పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  గా  ఉన్నన్ని రోజులూ బీఆర్ఎస్ గెలుపు అన్న మాటను మరచిపోవడం మంచిదన్న సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావే సోషల్ మీడియాలో పదె్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ముందు ముందు ఎలా నెట్టుకుని, నెగ్గుకుని వస్తారో?

సీఎం లోకేష్.. ముహూర్తం ఫిక్సైందా?

లోకేష్ ని 2027 ఉగాది నాటిక‌ల్లా  ముఖ్య‌మంత్రిని చేసే దిశ‌గా  కొన్ని  పావులు క‌దులుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. లోకేష్ ఢిల్లీ వెళ్లి మోడీ క‌లిసిన‌పుడు జ‌రిగే  ప్ర‌ధాన  చ‌ర్చ ఇదేనంటారు చాలా మంది. ఇటు ఢిల్లీ, అటు నాగ్ పూర్ వ‌ర్గాల స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే ఇదే జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం పరిశీలకుల్లో సైతం వ్యక్తం అవుతోంది.  ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో  నంబర్ 1, 2,  3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది.  అయితే ఈ హైరాక్కీని దాటి   త్వ‌ర‌లో  లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. లోకేష్ కు సీఎం పదవి విషయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి అగ్రనాయకత్వం సుముఖంగా ఉందంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కావడం లేదంటున్నారు పరిశీలకులు. సీఎం పదవి కోసం పవన్ తొందరపడటం లేదనీ, ఆయన తన పాతికేళ్ల పొలిటికల్ కేరీర్ లు ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.   అన్నిటికీ మించి లోకేష్ కు సీఎం పట్టాభిషేకం చేయడానికి నంబర్స్ కూడా బలంగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కు మించిన సంఖ్యా బలం ఉంది. ఇక కూటమి ఐక్యత విషయానికి వస్తే.. పవన్ కు కూటమి అవసరమా? కూటమికి పవన్ అవసరమా? అన్న ప్రశ్నే తలెత్తే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ కూటమి పటిష్ఠత గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రగతిలో లోకేష్ క్రెడిట్ ను గుర్తించడానికే మొగ్గు చూపుతున్నారు.  ఈ నేపథ్యంలోనే   సీఎం చైర్ కు లోకేష్ లైన్ క్లియ‌ర్ అయ్యిందనే అంటున్నారు పరిశీలకులు. 

ఓట్ చోరీ.. రాహుల్ ని గట్టెక్కించలేదెందుకు?

ఒక‌ప్పుడు ఇందిరాగాంధీ, ఆ తరువాత  రాజీవ్ గాంధీ.. భార‌త రాజ‌కీయాల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించారు. వారికి చట్టసభల్లో సంఖ్యాబలానికి ఒక పరిమితి అంటూ ఉండేది కాదు.  ఇప్పుడైతే వ‌రుస‌గా మూడోసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చినా, మూడో సారి బీజేపీకి స్వయంగా వచ్చిన స్థానాలు   240 కాగా.. ఎన్డీయే  భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో ఎలాగోలా  గ‌ట్టెక్కి అధికార పీఠం చేప‌ట్ట‌గ‌లిగింది. అదే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో అయితే అప్ప‌ట్లో  లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం  400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి  చేయ‌లేదు. ఎవ‌రి  క‌ష్టం  వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ చేస్తున్న ఆర్భాటాన్నీ, హంగామానూ బిల్డప్ ప్రక్రియగా కొట్టి పారేశారు.  ఏదో ఒక నేరేటివ్ బిల్డ‌ప్ చేయ‌డంలో భాగంగా రాహుల్ గాంధీ ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని  తెర‌పైకి తెచ్చారంటున్నారు. రాహుల్ అందిపుచ్చుకున్న ఓట్ చోరీ..  వ్యూహ‌క‌ర్త‌లిచ్చిన స‌ల‌హా  లేదా సూచ‌న  కావ‌చ్చు. అదీ కాదంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వమే స్వయంగా ఈ నినాదాన్ని ఎత్తుకుని ఉండవచ్చు. అయితే ఓటు చోరీ నినాదం ప్రజల్లోకి లోతుగా వెళ్లినట్లనిపించినా.. అది కాంగ్రెస్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చింది లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఓట్ చోరీ స్లోగ‌న్ తో బీహార్ ఎన్నిక‌ల‌కు వెళ్తే అది బూమ‌రాంగ్ అయ్యింది. రాహుల్ లాంటి ప్ర‌చార‌క్ ఉన్నంత వ‌ర‌కూ బీజేపీ  అధికారంలోకి వ‌స్తూనే ఉంటుంద‌న్న టాక్  అధికార కూటమిలో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.  రాహుల్ విషయంలో చెప్పుకోవలసిందంటూ ఏదైనా ఉంటే ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర.  ఆ యాత్ర ద్వారా.. రాహుల్  ఇటు కాంగ్రెస్ ని అటు ఇండి కూట‌మిని  ఈ మాత్ర‌మైనా  నిలబెట్టగలిగారు.   అలాగ‌ని రాజ‌కీయ ప‌రంగా అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేలాంటి చ‌ర్య‌లేవీ చేప‌ట్ట‌క పోవ‌డం వ‌ల్ల  కాంగ్రెస్ లో పెద్దగా జోష్ కనిపించడం లేదు.  కార్య‌క‌ర్త‌లను ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా ఉంచాలి.  అందులో భాగంగానే రాహుల్ గాంధీ.. ఈ నినాదం భుజానికి  ఎత్తుకున్నారు. త‌ర‌చూ త‌న వాద‌న‌ల రూపంలో  ఏదో ఒక అంశాన్ని, సమస్యను తెరమీదకు తీసుకువస్తుంటారు. తినగతినగ వేమ తియ్యగుండు అన్నట్లుగా.. నిరంతరం జనంలోకి ఏదో ఒక అంశాన్ని తీసుకువెడుతుంటే.. ఏదో ఒక లీడ్ దొరికి అధికారం ‘చేతి’కి రాకుండా ఉంటుందా అన్నది ఆయన ఆలోచనో, వ్యూహమో అయి ఉంటుందంటున్నారు పరిశీలకులు.   ఇవాళ్రేపు రాజ‌కీయంగా ఒక నెగిటివిటీని నూరిపోస్తే త‌ప్ప రాణించ‌లేని గ‌డ్డు కాలం న‌డుస్తోంది. అందుకే రాహుల్ ఈ దేశం నుంచి ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షాల‌ను పార‌దోలాల్సిన  అవ‌స‌రం క‌నిపిస్తోంద‌నీ,  వారి ప్ర‌భావం నుంచి దేశాన్ని కాపాడాలని అంటున్నారు కానీ అది ఎలా సాధ్యం అన్న విషయంలో మాత్రం రాహుల్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ క్లారిటీ కానరావడం లేదంటారు పరిశీలకులు. ఓట్ చోరీ నినాదం విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉండటం యాధృచ్ఛికమేనా?