విలీనం పాట మళ్ళీ ఇప్పుడెందుకో

  తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కేసీఆర్ ఏదో మాటవరసకి అన్నమాట పట్టుకొని, అటు తెదేపా, ఇటు టీ-కాంగ్రెస్ నేతలు కూడా ఆయనని ఒకటే సతాయిస్తున్నారు. కాంగ్రెస్ లో ఇంకా విలీనం చేయనందునే తెలంగాణా ఏర్పాటు ఆలస్యమవుతోందని తెదేపా నేతలు చేస్తున్నఆరోపణలు తెరాసను బద్నాం చేయడానికే అనుకొన్నా, రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంత రావు కూడా తెదేపాకు కోరస్ పాడటం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ నిజంగానే తెలంగాణాపై గేమ్ ఆడుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర విభజనతో తన రాజకీయ ప్రత్యర్దులందరినీ తుడిచిపెట్టేదామని అడియాసకు, అత్యాశకు పోయిన కాంగ్రెస్ అధిష్టానానికి తల బొప్పికట్టడంతో, మరో నాలుగు నెలలు కళ్ళుమూసుకొంటే ఆనక వచ్చేవాళ్ళే ఆ తిప్పలేవోపడతారని భావిస్తోందో మరేమో గానీ, గత రెండు నెలలుగా తెరాస విలీనం గురించి మాట్లాడనిది ఇప్పుడు మళ్ళీ విలీనం పాట జోరుగా అందుకొంది. తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేయకపోయినట్లయితే ఆ సాకుతో ఈ సమస్య నుండి బయటపడాలని యోచిస్తున్నట్లున్న కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ ఈ విలీనం ఐడియా బెడిసికొడితే, నెపం నెట్టివేసేందుకు బీజేపీ ఉండనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో తెరాస కలిపేస్తే, తెరాస నుండి ఇబ్బంది ఉండదని కాంగ్రెస్ భావిస్తున్నపటికీ, ముందుగా బలయిపోయేది కాంగ్రెస్ పార్టీ నేతలే! ఏమయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి వ్రతం చెడినా ఫలం దక్కేలా లేదు

దీనబందుతో పురందేశ్వరి చెలగాటం

  దీనబందు, కళాబందు, ఆత్మబందు, భక్తబందు, వైద్యబందు వంటి అనేక వీరత్రాళ్ళు వేయించుకొని వాటిని భారంగా మోసుకు తిరుగుతున్న రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామి రెడ్డికి పాపం! కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది నందమూరి గడుసుపిల్ల పురందేశ్వరి. ఆయన పాపం.. ఎన్నికల కోసం ఎదురు చూడకుండా బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి ఒక పద్దతి ప్రకారం ప్రజాసేవ, కళాసేవ, దైవసేవ ఇత్యాది నానారకాల సేవలు చేసుకుపోతూ, జస్ట్ విశాఖ లోక్ సభ టికెట్ మాత్రమే పుచ్చుకొంటానని చెప్పుకొంటుంటే, ఆ పురందేశ్వరి ‘నేను కూడా ఇక్కడే కంటిన్యూ అయిపోతా’నని చెపుతూ పాపం! ఆ పెద్దమనిషిని ఒకటే అల్లరి పెట్టేస్తోంది.   అప్పటికీ ఆయన చాలా విశాల హృదయం గలవాడు గనుక ‘ఇగో పిల్లా... నువ్వు కావాలంటే ఆ పక్కనున్నఏ నరసాపురంకో పోయి పోటీ చేసుకో’ అని మంచిగా చెప్పి చూసాడు. పైగా ‘సోనియమ్మ చాన్నాళ క్రితమే నాకు వైజాగ్ టికెట్ కన్ఫర్మ్ చేసేసారు’ అంటూ ఓ దైవరహస్యం కూడా బయట పెట్టేరు. కానీ ఆమె వింటే కదా! పైగా వాళ్ళాయన వెంకటేశ్వర రావు కూడా ఆమెకు తోడుగా వచ్చి అడ్డుగోలు వాదనలు మొదలుపెట్టేసాడు. “అల్లపుడేపుడో నాగార్జున సాగర్ డ్యాం కడుతున్నపుడు నువ్వు సిమెంట్ బ్లాకులో అమ్ముకోలేదా? కాంట్రాక్టుల కోసం పైరవీలు చేయలేదా?” అంటూ ఏవేవో అవాకులు చవాకులు వాగి పాపం! ఆ పెద్దాయన మనసు నొప్పించేసాడు.   ‘వైజాగ్ టికెట్ కోసం నేను మాట్లాడితే, ఈయనేమిటి హిస్టరీ మాట్లాడుతూ నా పరువు తీసేస్తున్నాడు’ అని ఆగ్రహంతో ఊగిపోతూ ‘నా మూడోకన్ను తెరుస్తా.. మరో ముక్క ఎక్సట్రా మాట్లాడినా పరువు నష్టం దావా వేస్తా’ నని మెళ్ళో వ్రేలాడుతున్న రుద్రాక్షలు పట్టుకొని భీకర శపథం చేసేసారు ఆ భక్తబందు. అందుకు ఆ దగ్గుబాటి అదర లేదు, బెదరలేదు. పైగా ‘ఆ.. వేస్తే పోయేది నీ పరువే కాని నాది కాదు,’ అని బెదిరించారు. ‘సోనియమ్మ కాళ్ళమీద పడితే టికెట్ రావచ్చు. కానీ కోర్టుకెళితే పోయిన పరువు తిరిగి రాదూ కదా..’ అని బాధపడుతూ పాపం ఆ దీనబందు వెనక్కి తగ్గవలసి వచ్చింది.   అయితే ఆ తరువాత నుండి వైజాగ్ లో మొక్కలు నాటుడు, మందులు పంచుడు, కచేరీలు పెట్టుడు వంటి అనేక కార్యక్రమాలు స్పీడ్ పెంచేసి ‘ఇక వైజాగ్ టికెట్ నాదే’నని కుదుట పడుతుంటే, మళ్ళీ ఎక్కడి నుండో హటాత్తుగా ఊడిపడిన పురందేశ్వరి ‘నేను కూడా వైజాగ్ జనాలకి బోలెడు సర్వీస్ చేస్తున్నాను. ఆ సంగతి నేను ఊరంతా బ్యానర్లు తగిలించుకొని చాటింపు వేసుకోకపోయినా జనాలకి తెలుసు. వాళ్ళు ఎవరు కావాలనుకొంటే వారికే టికెట్’ అని కౌంటర్ ఇచ్చేసి సీమాంధ్రకి ప్యాకేజీ కోసం డిల్లీ ప్లేన్ ఎక్కేసింది.   ఆ మహాతల్లి మళ్ళీ వైజాగ్ వచ్చేలోగా జనాలని కాస్త మంచి చేసుకొంటే బెటర్ అని మన పెద్దాయన అగనంపూడిలో ఓ క్యాన్సర్ ఆసుపత్రికి శంకు స్థాపన చేసేసి, సినిమా వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళతో క్రికెట్ ఆడించి జనాలని ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు కూడా. అయితే ప్యాకేజీ కోసం డిల్లీ వెళ్లిన చిన్నమ్మ ఇంతకీ ఎవరి ప్యాకేజీ కోసం మాట్లాడారో ఇంకా ప్రకటించనప్పటికీ, డిల్లీ నుండి ప్లేన్ వైజాగ్ లో దిగగానే ‘నేను వైజాగ్ నుండే పోటీ చేస్తున్నాను’ అని అనౌన్సమెంటు చేసేసారు. ఆమె అనౌన్సమెంటుకి పాపం దీన బందుగారి బీపీ మళ్ళీ పెరగడం ఆరంబించింది పాపం!

టికెట్ల కేటాయింపులో లోకేష్ కీలక పాత్ర

  వచ్చేఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లపై తెదేపా గత ఆరేడు నెలలుగా కసరత్తు చేస్తోంది. అదిప్పుడు మరికొంచెం ఊపందుకొన్నట్లు తెలుస్తోంది. గతంలోలాగే ఈసారి కూడా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ అభ్యర్ధుల ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తండ్రీకొడుకులు ఇరువురూ కూడా వేర్వేరుగా సర్వేలు నిర్వహిస్తూ, ఆ ఇద్దరి సర్వేలలో మంచి మార్కులు సంపాదించుకొన్నఅభ్యర్ధులతో మరొక లిస్టు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.   అభ్యర్ధుల అంగబలం, అర్ధం బలంతో బాటు, ప్రజాధారణ, కార్యకర్తల, స్థానిక నేతల మద్దతు, విశ్వసనీయత, విజయావకాశాలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్ధులను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర విభజన ప్రక్రియ, ఎన్నికల పొత్తుల సంగతి తెలనంతవరకు టికెట్స్ వ్యవహారం కూడా తేలడం కష్టమే. బహుశః ఫిబ్రవరి రెండో వారంలోగా తెదేపా అభ్యర్ధుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో జిందాల్ ?

      అమెరికా రాజకీయాల్లో ఎదుగుతూ వస్తున్న భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ ఆ దేశ అధ్యక్ష పదివికి పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రిపబ్లిక్ నాయకుడిగా లూసియానా గవర్నర్‌ విధులు నిర్వహిస్తున్నా జిందాల్...2016లో అధ్యక్ష పదివికి పోటీ పడతారని అంటున్నారు. అమెరికన్ టీవి ఛానల్ సి-స్పాన్స్ న్యూస్ మేకర్ ఇంటర్వ్యూలో రిపబ్లికన్ పార్టీ సెనెటర్ డేవిడ్ విట్టర్ మాట్లాడుతూ..రజాదరణ గల బాబీ జిందాల్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగితే అందరూ సంతోషిస్తారని అన్నారు.అతని నాయకత్వంపై గౌరవం ఉందని తెలిపారు. రాజకీయాలకు కావాల్సిన అన్ని విలువలు జిందాల్‌కు ఉన్నాయని చెప్పారు. కానీ తనకు దాని గురించి ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలియదని విట్టర్ తెలిపారు. అయితే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు బరిలో ఉంటారంటే మాత్రం.. జిందాల్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ కూడా జిందాల్ అధ్యక్ష బరిలో నిలుస్తారనే భావిస్తున్నారని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ మద్దతు తాత్కాలికమే: ఆమాద్మీ

    ఆమాద్మీ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తామని గవర్నర్ కు లేఖ వ్రాసిన కాంగ్రెస్ పార్టీ, తీరా చేసి ఆమాద్మీ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధంకాగానే, తామేమీ బేషరతుగా మద్దతు ఇస్తామని వాగ్దానం చేయలేదని మాట మార్చింది. ఇక కాంగ్రెస్ చేతిలోంచి డిల్లీని గుంజుకోవాలని విశ్వప్రయత్నం చేసి, దానికి ఆమాద్మీతన చీపురు కట్ట అడ్డం వేయడంతో కంగు తిన్నబీజేపీ, తమ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోనేందుకే కాంగ్రెస్ అమాద్మీకి మద్దతు ఇస్తోందని ఆక్రోశిస్తోంది.   ఎన్నికలలో కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టిన ఆమాద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతి పార్టీతో అధికారం కోసం చేతులు కలిపి డిల్లీ ప్రజలను మోసం చేశాయని ఆరోపించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆమాద్మీ పార్టీకి ఎంతో కాలం మద్దతు ఈయకపోవచ్చని బీజేపీ జోస్యం చెప్పింది.   బీజేపీ జోస్యం నిజమయ్యే అవకాశం ఉందని దృవీకరిస్తూ అమాద్మీకి చెందిన ప్రశాంత్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ, “మాకు కాంగ్రెస్ ఎంత కాలం మద్దతు కొనసాగిస్తుందో మాకు అనుమానమే. అది ఒక నెలా నాలుగు నెలలా లేక ఆరు నెలలా? అనేది దానినే నిర్ణయించుకోనివ్వండి. కానీ మేము మాత్రం కాంగ్రెస్ ఎటువంటి షరతులు పెట్టినా అంగీకరించబోము. మా ఎన్నికల మ్యానిఫెస్టోని మేము ఖచ్చితంగా అమలుచేసి తీరుతాము."   "ఒకవేళ కాంగ్రెస్ నచ్చకపోతే ఎప్పుడయినా మద్దతు ఉపసంహరించుకావచ్చును. అందుకు సిద్దపడే మేము ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దమవుతున్నాము. అయితే మాకున్న కొద్దిపాటి వ్యవధిలో కూడా దేశంలో ప్రజాభిప్రాయాలకి అనుగుణంగా కూడా పరిపాలన చేయవచ్చని నిరూపించబోతున్నాము,” అని అన్నారు.   బహుశః వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఎన్నికల సంఘం షెడ్యుల్ ప్రకటించగానే కాంగ్రెస్ ఏవో గిల్లి కజ్జాలు పెట్టుకొని, కుంటి సాకులు చెప్పి అమాద్మీకి తన మద్దతు ఉపసంహరించవచ్చును. ఆవిధంగా అయితే, మళ్ళీ డిల్లీలో ఎన్నికలు నిర్వహించి, ఈ నాలుగు నెలలో అమాద్మీ ప్రభుత్వం చేసిన తప్పుల లిస్టు గురించి ప్రచారం చేసుకొని డిల్లీలో మళ్ళీ అధికారం చెప్పట్టే ప్రయత్నం చేయవచ్చును.

ప్రజాస్వామ్యన్ని గౌరవించిన గొప్ప వ్యక్తి నీల౦: ప్రణబ్

      అనంతపురంలో జరిగిన నీలం సంజీవరెడ్డి శతజయంతి ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరై ప్రసంగించారు. రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, లోక్ సభ స్పీకర్ గా నీలం సేవలను ప్రశంసించారు. భారతదేశంలో ఇన్ని పదవులు చేపట్టిన తొలి భారతీయుడు నీలం సంజీవరెడ్డి మాత్రమేనని ప్రణబ్ అన్నారు. స్పీకర్ గా అవిశ్వాసం సమయంలో సభను చర్చకు పిలిచిన ఘనత ఉందని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్నారని, క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు వెళ్లారని అన్నారు. మహాత్మగాంధీ స్ఫూర్థితో ఆయన పనిచేశారని, ఓ లక్ష్యం కొరకు పనిచేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయని అన్నారు. ప్రణబ్ రాక సంధర్భంగా అనంతపురంలో పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. సమైక్యవాదులు ఎక్కడా కనిపించకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దింపి అడ్డుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ మరో రూపం కేజ్రివాల్

      కాంగ్రెస్ అవినీతి మీద పోరాడిన మ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ అదే పార్టీ మద్దతు తీసుకుని అధికార పీఠం దక్కించుకోవడం పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ మరో రూపం అని కూడా అంటున్నారు. అధికారం కోసం కేజ్రీవాల్ తన సిద్ధాంతాలను సైతం వదులుకున్నారని బీజేపీ నేత హర్షవర్ధన్ విమర్శించారు. ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు తిరస్కరించిన అవినీతి కాంగ్రెస్ తో జత కట్టడమేమిటని ప్రశ్నించారు. అధికారం కోసం కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను మోసం చేశారని, ప్రజలకు ఏఏపీ ఇచ్చిన హామీలన్నిటినీ ఆ పార్టీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమని, ఆయన ప్రజాస్వామ్య వ్వవస్థను బలోపేతం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు.

టిడిపిలోకి మాగుంట శ్రీనివాసులు..!!

      రాష్ట్రవిభజనతో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీలలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం...కాంగ్రెస్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం.   అయితే ఈసారి మాగుంట నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీచేయాలని భావిస్తున్నారు. ఇదేగాని జరిగితే నెల్లూరులో రాజకీయాలు రసవత్తరంగా మారుతాయి. గత ఉపఎన్నికలలో వైకాపా తరపున నెల్లూరు నుంచి పోటిచేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి 2.91లక్షల భారీ మెజారిటితో గెలుపొందారు. దీంతో కడప తరువాత మరో కంచుకోటగా వైకాపా నేతలు నెల్లూరును భావించడం మొదలు పెట్టారు. సీమాంద్రలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, టిడిపిల మద్యనే పోటీ ఉండబోతున్న తరుణంలో మాగుంట టిడిపిలో చేరి పోటీచేస్తే అది మేకపాటికి సవాలు విసిరినట్లు అవుతుంది. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో పెద్ద బలగం ఉంది. దీంతో ఈ సారి నెల్లూరు లో రెండు దిగ్గజాల మధ్య పోటీ ఖాయమని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

తూచ్! ఆమాద్మీకి బేషరతు మద్దతు ఇస్తామని చెప్పలేదు : కాంగ్రెస్

  అమాద్మీ పార్టీ కోరకుండానే ఆ పార్టీకి బేషరతుగా బయట నుండి మద్దతు ఇస్తామంటూ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీం జంగ్ కు కొద్ది రోజుల క్రితమే లేఖ వ్రాసిన కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు అమాద్మీపార్టీ కాంగ్రెస్ మద్దతు తీసుకొని ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దమని ప్రకటించగానే, కాంగ్రెస్ పార్టీ తామేమీ బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పలేదంటూ మాట మార్చింది.   కాంగ్రెస్ పార్టీకి చెందిన డిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీ అమాద్మీకి బేషరతుగా మద్దతు ఇస్తామని ఎన్నడూ వాగ్దానం చేయలేదు. ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత అంశాల వారిగా ఆ ప్రభుత్వ పనితీరుని బట్టి మద్దతు ఇస్తాము తప్ప గుడ్డిగా మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు,” అని కుండ బ్రద్దలు కొట్టారు.   ఇక మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “అమాద్మీ చేసిన అనేక వాగ్దానాలలో చాలా వరకు ఆచరణ సాధ్యం కానివి. వాటిని అమలు చేయడం వీలుకాదని నా అభిప్రాయం. ప్రతీ విషయానికి ప్రజాభిప్రాయం కోరుతామని చెపితే ఇక ఆమాద్మీ ప్రభుత్వం పనిచేయగలదా? ఒక్కో ప్రాంతానికి విడివిడిగా బడ్జెట్ తయారు చేసి, ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకొని నిధులు కేటాయించడం సాధ్యమయ్యేపనేనా? ఏమయినప్పటికీ ప్రజాదరణతో అధికారం చేపడుతున్న అమాద్మీ పార్టీకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక తన ఎన్నికల మ్యానినిఫెస్టోను అమలుచేయవలసిన బాధ్యత ఆపార్టీపైనే ఉంది,” అని షీలా దీక్షిత్ అన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్

    భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవనుంది. డిల్లీలో రాజకీయ దిగ్గజాలయిన కాంగ్రెస్, బీజేపీలను మట్టికరిపించిన ఆమాద్మీ (సామాన్యుడు) త్వరలో డిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేప్పట్టబోతున్నాడు. కాంగ్రెస్,బీజేపీల మద్దతు స్వీకరించడానికి నిరాకరించిన అమాద్మీపార్టీ, ఒక సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయం కోరుతూ రిఫరెండం నిర్వహించింది. అందులో అత్యధిక శాతం ప్రజలు కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పరచమని కోరడంతో, ఆమాద్మీ పార్టీ డిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకి తాము అంగీకరిస్తున్నట్లు కొద్ది సేపటి క్రితమే ప్రకటించింది. ఆ పార్టీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ మరో ముగ్గురు సహచరులతో కలిసి ఎటువంటి ఆర్భాటం, ఊరేగింపులు లేకుండా ఒక చిన్న కారులో డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీం జంగ్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ సంసిద్దత తెలియజేసేందుకు బయలుదేరి వెళ్ళారు. ఆమాద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా ఈనెల 26న ప్రమాణం స్వీకరించే అవకాశం ఉంది. ప్రజలను దూరంగా ఉంచే పాత సాంప్రదాయాలకు స్వస్తి పలుకుతూ, ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని డిల్లీ నగరం నడిబొడ్డున ప్రజల సమక్షంలో జంతర్ మంతర్ వద్ద నిర్వహించాలని ఆమాద్మీ పార్టీ భావిస్తోంది.

టిడిపి అడ్రస్ గల్లంతు కావడం ఖాయ౦: కెసిఆర్

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇక ఎవరూ అడ్డుకోలేరని తెరాస అధ్యక్షుడు కెసిఆర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని ఆయన అన్నారు.   టీడీపీ జుక్కల్ ఎమ్మెల్యే షిండే వెంట పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లోకి వచ్చారంటే, ఆ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చనని అన్నారు.   తెలంగాణ టీడీపీ నేతలు కూడా షిండే బాటలో ఉద్యమంలోకి రావాలి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే మాతృ ద్రోహులుగా మారకుండా తెలంగాణ ప్రజల్లో గౌరవం పెంచుకోవాలని కేసీఆర్ హితవు పలికారు. ఏనుగు వెళ్లింది.. తోక చిక్కిందంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అభివర్ణించారు. బీహార్‌లోనూ లాలూప్రసాద్ పార్టీ బలంగా ఉండేది. బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం విడిపోయాక ఆ ప్రాంతంలో లాలూ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు.. ఇదేందని అక్కడి ప్రజలను అడిగితే.. 'లాలూ పార్టీది, మాది వేర్వేరు రాష్ట్రాలు' అని బదులిచ్చారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి కూడా అంతే'' అని చెప్పారు.  

వైకాపా గూటికి జెసి

  సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పాటు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ అధిష్టానం వడి వడిగా అడుగులు వేస్తుండటంతొ ఆ పార్టీ సీమాంద్ర నాయకులు ఇక ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరుతుండగా తాజాగా అనంతపురంలో మరోషాక్‌ తగలనుంది. అనంతపురం జిల్లాలొ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకునిగా ఉన్న జెసి దివాకర్‌ రెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఆయన తనయుడు పవన్‌ వైసిపి పార్టీ వైపు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయాలని భావిస్తున్నారట. ఇప్పటి వరకు జిల్లాలో బలమైన వర్గంగా ఉన్న జెసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరటంతో కాంగ్రెస్‌ ఆ జిల్లాలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పాడింది.

భీమవరం బుల్లోడు ఆడియో ఫంక్షన్‌లో అపశృతి

  సునీల్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో తెరకెక్కుతున్న భీమవరం బుల్లొడు ఆడియో ఫంక్షన్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఫంక్షన్‌లో తొక్కిసలాట జరగటంతో సురేష్‌ అనే యువకుడు మరణించాడు. పశ్చివ గోదావరి జిల్లా భీమవరంలో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని స్థానిక డిఎన్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. అయితే ఊహించిన దానికన్నా అభిమానులు ఎక్కువగా రావటంతో చేసిన ఏర్పాట్లు సరిపోక తొక్కిసలాట జరిగింది. వెనుక వరనుసలో కూర్చున్న వారు ముందు వారిని తోసేయటంతో సురేష్‌ కిందపడిపోయాడు తరువాత జరిగిన తొక్కిసలాటలో సురేష్‌ మృతి చెందాడు.

రాష్ట్రపతి అనంతపురం పర్యటన

  శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి చేరుకున్న రాష్ట్రపతి నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.ఆయనతో పాటు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర సమయంలో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో అనంతపురం వెళతారు. అనంతపురంలో జరిగే నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జరిగే నీలం శతజయంతి ముగింపు వేడుకల్లో పాల్గొనటంతో పాటు, తరువాత పుట్టపర్తిలొని సత్యసాయి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత మూడు గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు.ఈ పర్యటనలో మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొననున్నారు. ప్రణబ్ రాక నేపథ్యంలో అనంతపురం, పుట్టపర్తిలలో భద్రత కట్టుదిట్టం చేశారు. డీజీపీ దగ్గరుండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

అశోక్ బాబుకు పోలీసులు నోటిసులు

      ఎపి ఎన్జీవో నేత అశోక్ బాబుకు కష్టాల పరంపర మొదలైనట్టుంది. సమైక్యాంధ్ర ఉద్యమం పుణ్యమాని ఒక్కసారిగా మీడియా స్టార్ అయిపోయిన అశోక్ బాబును వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కంగుతినిపిస్తున్నాయి. ఎపిఎన్జీవోల మధ్య లుకలుకలు, సమ్మెను అర్థంతరంగా ఆపేశారని విమర్శలు, ఎపి ఎన్జీవో ఎన్నికలపై దీని ప్రభావం, రాజకీయనాయకుల సహకారం అడగాల్సి రావడం వంటివన్నీ ఒకత్తయితే ఇప్పుడు ఏకంగా ఓయు పోలీసులు నుంచి నోటిసులు అందుకోవాల్సి రావడం మరోకెత్తు. రెచ్చగొట్టే ప్రసంగాలు, వాఖ్యనాలు చేశారంటూ అశోక్ బాబుకు శనివారం ఓయూ పోలీసులు నోటిసులు జారీ చేశారు. ఈ నెల హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇక్కడే పుట్టాం..కలిసుందాం: కిరణ్

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైద్రాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సమైక్యవాణి విన్పించారు. ‘ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి..’అందుకే తాము కలిసి ఉండాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.తాము ఎందుకు కలిసి ఉండాలని కోరుకుంటున్నామో గీతా రెడ్డి వంటివాళ్లు అర్థం చేసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మాటలకు గీతారెడ్డితో పాటు తదితరులు నవ్వుకున్నారు.శ్రీసిటిలో ఆయన శనివారం పెప్సికో బేవరేజ్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. విభజన.. సమైక్య ఉద్యమాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుంటు పడలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పడం కొసమెరుపు.