పవన్ కళ్యాణ్ మూడవ పెళ్ళి..!!

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడో పెళ్ళి కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ నగర్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియన్ నటి, తీన్ మార్ కోస్టార్ డానా మార్క్స్తో సహవజీవనం చేస్తున్న పవన్ కళ్యాణ్ దానిని చట్టబద్దం చేయించెందుకు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని అంటున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తుంది.   కొన్ని నెలల క్రితం తన రెండో భార్య రేణుదేశాయ్ కు విడాకులిచ్చిన పవన్.. ఆ తరువాత డానా మార్క్స్తో తో సహజీవనం చేస్తున్నాడని వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప కూడా పుట్టిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిని పవన్ కూడా ఖండించలేదు. తాజాగా పవన్ కళ్యాణ్ తో కలిసి డానా క్రిస్టమస్ ను సెలబ్రేట్ చేసుకుందని కూడా చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ మూడో పెళ్ళి కూడా రంగం సిద్దమైనట్లు కనిపిస్తోంది.  దీనిపై పవర్ స్టార్ ఈ సారైనా స్పందిస్తాడా లేదా వేచిచూడాల్సిందే!  

డిశంబర్ 28న ఆమాద్మీ ప్రమాణ స్వీకారం

  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకి ఆమాద్మీ పార్టీకి అనుమతి ఈయడంతో, ఈ నెల 28న(శనివారం) డిల్లీ ప్రభుత్వపగ్గాలు చెప్పట్టేందుకు అమాద్మీ సిద్ధం అవుతోంది. డిల్లీలో సుప్రసిద్ధ రామ్ లీలా మైదానంలో మధ్యాహ్నం 12గంటలకు ప్రజల సమక్షంలో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఆయన ఆరుగురు అనుచరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.   అమాద్మీకి మొదట బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తాము అంశాల వారిగానే మద్దతు ఇస్తామని, అమాద్మీ ప్రభుత్వం తమ నేతలకు వ్యతిరేఖంగా చర్యలు చేపడితే చూస్తూ ఊరుకోబోమని చెపుతోంది. ఇప్పుడు దానికి మరో వాక్యం అదనంగా జోడిస్తూ అమాద్మీకి తాము మూడు నెలల గడువు ఇస్తున్నామని, దాని పని తీరును బట్టి మద్దతు కొనసాగించే విషయం పరిశీలిస్తామని ప్రకటించింది. అంటే ముందే ఊహించినట్లుగా రాబోయే ఎన్నికల ముందు మద్దతు ఉపసంహరించి అమాద్మీ ప్రభుత్వాన్ని పడగొట్టబోతోందని స్పష్టం అవుతోంది.   అందుకు అమాద్మీ కూడా మానసికంగా సిద్ధమయ్యే ఉంది గనుక అమూల్యమయిన ఈ మూడు నెలల సమయంలో “నిజంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని’ ఏర్పాటుచేసి తనను తాను నిరూపించుకోగలిగితే, ఈసారి పూర్తి మెజార్టీతో ఎన్నికయి ఎవరి మద్దతు లేకుండా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కలుగుతుంది.

లక్నోకి వెళ్ళినా ఒరిగిదేముంది

  ఆలూ లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు, శాసనసభ, మండలిలో రాష్ట్ర విభజన బిల్లుపై ఎటువంటి చర్చజరిగే అవకాశం లేకపోయినప్పటికీ, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఉత్తరాఖండ్ విభజనపై అక్కడ శాసనసభలో ఏవిధంగా చర్చ జరిగింది? అందుకు అనుసరించవలసిన విధి, విధానాలేమిటి? వాటిని అక్కడి సభాపతి ఏవిధంగా అమలుచేసారు?వంటి విషయాలపై అధ్యయనం చేసేందుకు లక్నో వెళ్లారు. అసలు సభలో బిల్లుపై చర్చ జరిగే అవకాశమే లేదని తెలిసినప్పుడు ఆయన ఎంత అధ్యయనం చేస్తే మాత్రం ఏమి ప్రయోజనం? అందువల్ల సభలో బిల్లుపై చర్చ జరగాలంటే ముందుగా సభని స్తంబింపజేస్తున్నపార్టీలను ఏవిధంగా దారిలో పెట్టాలో తెలుసుకొని వస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందేమో? బహుశః ఈసారి సమావేశాలు మొదలయినప్పుడుసభను స్తంబింపజేస్తున్న వారినందరినీ సస్పెండ్ చేసి మిగిలినవారితోనే సభ నిర్వహిస్తారేమో?

కావురికి ఇంట్లో ఈగల మోత

  నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్లే సీమంధ్ర కేంద్ర మంత్రులలో సమైఖ్యాలోచన కూడా ఉండదని సీమంధ్ర ప్రజలు గ్రహించలేకపోయారు కానీ, తెలంగాణా నేతలు, ప్రజలు మాత్రం ఆ విషయం బాగానే గ్రహించారని ఒప్పుకోక తప్పదు. కేంద్ర మంత్రి కావూరివారు మొన్నఉభయగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఆయనకి కోడిగుడ్లతో సత్కారం చేస్తే, నిన్నఆయన కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో పర్యటించినప్పుడు మాత్రం తెలంగాణా వాదుల నుండి ఆయనకు ఎటువంటి ప్రతిఘటనా ఎదురవలేదు. ఆయన తెలంగాణాకి వ్యతిరేఖంగా ఎన్నిమాటలు మాట్లాడినా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలాగే ఆయన కూడా ఎన్నడూ అడ్డుపడలేదు. తన పదవిని కాపాడుకొనేందుకు పాపం ఆయన పడుతున్న తిప్పలను తెలంగాణా వాదులు సానుభూతితో అర్ధం చేసుకొన్నారు గనుకనే కేంద్రమంత్రిగా సిరిసిల్లా చేనేతన్నలకు వరాలు కురిపించడానికి వస్తున్న ఆయనకు స్వాగతం పలికారు. కానీ సార్వత్రిక ఎన్నికలు వస్తునందున ఆయన మంత్రిగిరీ మహా అయితే మరో రెండు మూడు నెలలుకు మించి ఉండబోదని తెలిసినప్పటికీ ఆయన తను శాశ్వితంగా అధికారంలో ఉండబోతున్నట్లు అనేక వాగ్దానాలు గుప్పించడమే విశేషం.

ఆమాద్మీని మీడియా కనికరిస్తే...

  చాలా విచారకరమయిన విషయమేమిటంటే, నిత్యం నీతులు, ఆదర్శాలు వల్లెవేస్తూ దేశం కోసం చాలా ఆవేదన పడిపోయే మన భారత మీడియా, తన రేటింగ్స్ పెంచుకోవడానికి ఏదో ఒక వ్యక్తిని లేక వ్యవస్థని లేక రాజకీయ పార్టీని ఆకాశానికి ఎత్తేసి ఎంత హంగామా చేస్తుందో, పోటీలో అందరికంటే తామే ముందుండాలనే దురాశతో మళ్ళీ ఆ వ్యక్తులను, వ్యవస్థలనే నిర్దాక్షిణ్యంగా అధః పాతాళానికి తొక్కేసేందుకు కూడా వెనుకాడదు. అమాద్మీ పార్టీకి చెందిన వినోద్ కుమార్ బిన్నీఅనే శాసనసభ్యుడు తనకు మంత్రి పదవి ఈయలేదని నిన్న పార్టీ సమావేశం నుండి అలిగి వెళ్లిపోయాడనే వార్తకు మీడియా ఇచ్చిన ప్రాధాన్యమే అందుకు ఉదాహరణ.   రాజకీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు తమకు పెనుసవాలుగా మారిన అమాద్మీ సర్వ నాశనమయిపోవాలని కోరుకోవడం సహజమే. కానీ, నిత్యం దేశం కోసం ఆవేదన పడిపోయే మీడియా కూడా సమాజంలో ఒక మంచి మార్పుకోసం ప్రయత్నిస్తున్నఅమాద్మీకి అండగా నిలబడకపోగా, ఆ పార్టీ నైతిక స్థయిర్యం దెబ్బతీసేలా పనిగట్టుకొని ప్రచారం చేయడం చాలా తప్పు. అమాద్మీ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకముందే అది చేసిన వాగ్దానాలను అమలుచేయడం అసంభవమని, అమాద్మీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయని, అమాద్మీ ప్రభుత్వం ఎంతో కాలం ఉండబోదని మీడియా పనిగట్టుకొని ప్రచారం చేయడం వల్ల దేశంలో ఒక మంచి రాజకీయ ప్రయోగం జరగకుండా ముందే అడ్డుపడినట్లవుతుంది.   మీడియా కూడా ఈ వ్యవస్థలో భాగమేనని, ఆ వ్యవస్థ బాగుపడితే తను కూడా ఇంకా ప్రయోజనం పొందే అవకాశం ఉందని గ్రహించి, మీడియా కూడా అమాద్మీ నిజాయితీగా చేస్తున్నఒక మంచి ప్రయత్నానికి యధాశక్తిన సహకారం అందించాలి. లేకుంటే కనీసం అమాద్మీని దెబ్బతీసే ప్రయత్నాలయినా చేయకుండా అమాద్మీని(సామాన్యుడిని) కనికరిస్తే ఈ దేశానికి మహోపకారం చేసినదవుతుంది.

మంత్రి శ్రీదర్‌బాబకు కోర్టు సమన్లు

  మంత్రి శ్రీదర్‌బాబుపై కరపత్రాలను పంచిన శ్రీరామ్‌ అరెస్ట్‌ కేసులో మంత్రి కి నోటిసులు అందాయి. మంత్రితో పాటు హొం శాఖ కార్యదర్శి, డీజిపి, కరీంనగర్‌ జిల్లా ఎస్‌పి, గోవావరి ఖని పోలీసులకూ నోటీసులిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీరామ్‌ భార్య స్వరూప చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాల ఉన్నందున కోర్టు ప్రాధమిక విచారణకు స్వీకరించింది. అయితే కేవలం కరపత్రాలను పంచిన కేసులో ముద్దాయిని కాళ్లకు చేతులకు సంకెళ్లతో కోర్టుకు తీసుకురావడం, విచారణ పేరుతో కొట్టడాన్ని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. కరపత్రాలు పంచినట్టుగా ప్రాధమిక ఆదారాలు ఉన్నందున కేసు విచారణకు స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించిన కోర్టు శ్రీరామ్‌ను చంచల్‌గూడ జైళుకు తరలించాల్సిందిగా ఆదేశించింది.

అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గం రెడీ

  ప్రభుత్వ ఏర్పాటుకి సంసిద్దత వ్యక్తం చేసిన ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా డిల్లీ ముఖ్యమంత్రిగా భాద్యతలు చెప్పట్టబోతున్నారు. ఆయన తన మంత్రి వర్గం సభ్యుల పేర్లను ఈరోజు ఖరారు చేసారు. మనిష్ సిసోడియా, రాఖి బిర్లా, సోమనాథ్ భారతి, సౌరభ్ భరద్వాజ్, గిరీష్ సోనీ మరియు సతేంద్ర సోనీ మంత్రులుగా ప్రమాణ స్వీఎకారం చేయనున్నారు. వీరిలో ఎవరికీ కూడా రాజకీయ నేపధ్యం కానీ అనుభవము కానీ లేదు. అయితే అందరూ ప్రస్తుత వ్యవస్థలో లోపాలను సరిద్దాలనే పట్టుదలతో చేస్తున్న ఉద్యోగాలను, వృత్తులను వదులుకొని రాజకీయాలలోకి వచ్చారు. వీరిలో ముఖ్యమంత్రిగా భాద్యతలు చెప్పట్ట నున్న అరవింద్ కేజ్రేవాల్ అందరి కంటే ఉన్నత విద్యావంతుడు . ఆయన ఖరగ్ పూర్ ఐఐటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసారు. ఆదాయపన్నుల శాఖలో జాయింట్ కమీషనర్ గా పనిచేసిన ఆయన రాజకీయాలలోకి వచ్చేందుకు తన ఉన్నతోద్యోగాన్నివదులుకొన్నారు. 2006లో ప్రతిష్టాత్మకమయిన రామన్ మెగసెసే అవార్డును అందుకొన్నారు.

కాంగ్రెస్ మద్దతు ఎందుకు?: కేజ్రీవాల్ వివరణ

      కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించుకోవడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. బేజీపి అయితే ఒక అడుగు ముందుకు వేసి కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఆమ్ ఆద్మీ పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోదీ ప్రభ౦జనాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతోందని ఆరోపించింది. ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీడలో ఒక పావుగా మారిపోయిందని కూడా బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ అమ్ములపొదిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక బాణంగా మారిపోయిందని కూడా బీజేపీ నిప్పులు చెరిగింది.   అయితే తాము ఏ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నదీ వివరిస్తూ ఆమ్ ఆద్మీ మంగళవారంనాడు ఒక వీడియోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ కేవలం బయటనుంచి మాత్రమే మద్దతు ఇస్తున్నదని, తమ రెండు పార్టీలకూ మధ్య ఎటువంటి ఒప్పందాలూ లేవని ఆ పార్టీ వివరించింది. కాంగ్రెస్ పార్టీ గనక తమకు మద్దతు ఉపసంహరించుకోవదలిస్తే ఉపసంహరించుకోవచ్చునని, అటువంటప్పుడు తాము మళ్లీ ప్రజల వద్దకు వెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొన్నది.

అవినీతి అంతంతోనే అభివృద్ధి

      తొమ్మిదేళ్ళ తెలుగుదేశం పాలన అత్యంత నీతివంతంగా సాగిందని అందువల్లే రాష్ట్రం సర్వోతోముఖాభివృద్ధి దిశాగా పయనించిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ తమ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించిందని, సర్వవ్యవస్థలనూ అవినీతిమయం చేసిందన్నారు. ఆ పార్టీ నేతలు పాల్పడిన అవినీతే దీనికి కారణమన్నారు. అవినీతి రహిత ప్రభుత్వం రావాలని, అభివృద్ధి పథంలో రాష్ట్రం తిరిగి ముందుకు సాగాలని అందరూ ఏసుక్రీస్తును ప్రార్థించాలని సూచించారు. ఈ సందర్భంగా దళిత క్రిస్టియన్లను ఎస్టీలుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.

టిడిపి ఎంపీగా పవన్ కళ్యాణ్..!!

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టిడిపి పార్టీ తరపున పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీచేస్తారని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో వైకాపా నుంచి కేవీపీ వియ్యంకుడు.. పారిశ్రామికవేత్త రఘురామకృష్ణం రాజుకు టికెట్ దాదాపుగా ఖరారై౦ది. అలాగే కాంగ్రెస్ నుంచి సిటింగ్‌ ఎంపీగా కనుమూరి బాపిరాజు రంగంలో ఉన్నారు. అయితే భారీ కేండిడేట్లు రంగంలో ఉన్న ఈ నియోజకవర్గ౦లో బరిలోకి పవన్ కూడా దీగడంతో పోటీ రసవత్తరంగా మారనుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఎలక్షన్స్ వ్యూహంలో భాగంగానే తెలుగుదేశం పార్టీ...ఆయన వైపు చూస్తున్నారన్న ప్రచారం సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆ మధ్యన బాలకృష్ణ ఆ మేరకు రాయబారం నిర్వహించినట్లు చెప్పుకున్నారు. స్వయంగా బాలకృష్ణ పవన్‌ను వెంటబెట్టుకుని చంద్ర బాబుతో చర్చలు జరిపారని, ఆ మేరకు టీడీపీలో చేరేందుకు పవన్‌ కల్యాణ్‌ సుముఖత వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలపై పవన్ నుంచి  ఖండన రాకపోవడం...తాజాగా టిడిపి తరపున లోక్‌సభకు పోటీ చేస్తారని వార్తలు రావడం..పవన్ మౌనం అంగీకారమేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.

హామీలే 'కేజ్రీవాల్' కు సవాళ్ళు..!

      అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏఏపీ పలు వాగ్ధానాలు చేసింది. ఇప్పుడు ఆ హామీలే ఆ పార్టీకి పెద్ద సవాల్‌గా మారనున్నాయి. కరెంటు చార్జీలను 50శాతం తగ్గిస్తామని, నగరంలోని ప్రతి ఇంటికి రోజూ 700 లీటర్ల చొప్పున తాగునీటిని ఉచితంగా ఇస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. వీఐపీ సంస్కృతిని తొలగిస్తామని, జనలోక్‌పాల్ చట్టం చేస్తామని కూడా పేర్కొంది. అయితే వీటిని నెరవేర్చాలంటే కత్తి మీద సాము చేయాల్సిందేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.   ప్రజల భాగస్వామ్యంతో సరికొత్త పాలన అందిస్తామని, ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలకు భిన్నంగా వ్యవహరిస్తామని కేజ్రీవాల్  చెబుతున్నారు. ప్రమాణ స్వీకార తేదీని ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. అయితే ఈ నెల 26న ఈ కార్యక్రమం ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 4న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 31, ఏఏపీకి 28, కాంగ్రెస్‌కు 8 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 36 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీతో పాటు ఏఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు విముఖత వ్యక్తం చేయడంతో రెండు వారాలుగా అనిశ్చితి ఏర్పడింది. షరతుల్లేకుండా మద్దతిస్తామంటూ కాంగ్రెస్ లేఖ ఇవ్వడంతో అధికార పగ్గాలు చేపట్టడానికి ఏఏపీ ముందడుగేసింది.