సీమాంద్రకు రాజధాని నిర్మిస్తా: బాబు

      కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నాశనమైందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని, త్వరలో ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కాంగ్రెస్‌కు ఎప్పుడూ లేదని విమర్శించారు. రాజకీయ లబ్ధికోసం, ఓట్లు, సీట్లు కోసం తెలుగుజాతిని కాంగ్రెస్ రెండుగా చీల్చిందని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. టీఆర్ఎస్, వైసీపీలు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యాయని తాను చెప్పిన మాటలు వాస్తవమయ్యాయని తెలిపారు. టీడీపీ రెండు ప్రాంతాలలోనూ బలంగా ఉందని, తెలంగాణలోని బలహీనవర్గాలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీమాంద్రలో రాజధాని ఎలా నిర్మించాలో తనకు తెలుసునని అన్నారు. వైకాపాకు తెలిసింది చంచల్గూడ జైలేనని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే సీమాంద్రకు అన్ని వసతులు గల రాజధానిని టిడిపి నిర్మిస్తు౦దన్నారు.

ఇక రాజధాని అంశంతో రాజకీయాలా?

  ఇంతవరకు రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆంధ్రాకో లేదా తెలంగాణాకో అనుకూలంగా మాట్లాడినట్లయితే రెండో ప్రాంతంలో ఓట్లు పోతాయని రాజకీయ పార్టీలు భావించేవి. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా ఇదే సూత్రం వర్తింపజేస్తున్నారు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కర్నూలుని రాజధానిని చేయాలంటూ రెండు రోజులు దీక్షకు కూర్చొన్న ఆయన రాయలసీమకు చెందిన చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురూ కూడా మిగిలిన జిల్లాలలో ఓట్లు పోతాయనే భయంతోనే రాజధాని విషయం మాట్లాడకుండా దాటవేస్తున్నారని, ఇటువంటి నేతల వలననే రాయలసీమ వెనుకబడిపోయిందని ఆక్షేపించారు.   తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కొత్త రాజధానిని ఏవిధంగా నిర్మించుకోవాలో తనకు బాగా తెలుసని చెపుతూనే రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని ఎన్నికల తరువాత అధికారం చెప్పట్టే కొత్త ప్రభుత్వమే చూసుకొంటుందని చెప్పడం చూస్తే బైరెడ్డి ఆరోపణలు నిజమేనేమోనని నమ్మవలసివస్తోంది.   ఇప్పటికే అనేకమంది రాజకీయ నేతలు తమ తమ ప్రాంతాలలోనే రాజధాని నిర్మించాలని స్థానిక ప్రజల, విద్యార్ధుల, మేధావుల, ఉద్యోగుల మద్దతు కూడా గట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందువలన ఇంతవరకు సమైక్యాంధ్ర నినాదంతో ప్రజలను ఆక్కట్టుకోవాలని ప్రయత్నించిన రాజకీయ నేతలు బహుశః రేపు జరుగబోయే ఎన్నికలలో రాజధాని అంశాన్ని రాజకీయ చేసి లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తారేమో.

తెలంగాణాలో మళ్ళీ ఓదార్పు లు

      తెలంగాణ ఉద్యమ సమయంలో 'సమైక్యాంధ్ర' నినాదం అందుకొని సీమాంధ్రపై పట్టుకోసం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి గట్టిగా కృషి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కాకపోయినా సీమాంధ్రపై పట్టు కోసం నిరాహార దీక్షలు, ధర్నాలు, సమైక్య సభలు, శంఖారావాలు  అంటూ చాలానే చేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగిపోయింది గనుక మళ్ళీ తెలంగాణలో భవిష్యత్తుపై దృష్టి పెట్టారు. ఈ రోజు తెలంగాణ నేతలతో జగన్ భేటి అయ్యారు. తెలంగాణలోనూ పార్టీ స్థానిక సమస్యలపై దృష్టిపెడుతుందనీ, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్ళాలని వైఎస్‌ జగన్‌ ఆయా నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మళ్ళీ తెలంగాణాలో పార్టీ నేతలను వెతుకొంటూ జగన్ త్వరలో అంటే మార్చి15 నుండి నల్గొండలో ఓదార్పు యాత్రలు చెప్పట్టబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సంబరాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రజలకు ఆయన ఓదార్పు దేనికో?    

వీలినం...రాహుల్ తో కేసిఆర్ మంతనాలు

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు ఢిల్లీలో రోజు వరుస భేటిలతో బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు ఉదయం ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్ తో కేసిఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ వీలీనం, ఎన్నికల పొత్తుల పై ఈ భేటిలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రము ఇచ్చినందుకు కృతజ్ఞతగా కొన్నిరోజులుగా ఢిల్లీ లోని ముఖ్యనేతలందరిని కలుస్తున్నారు. ఈ రోజు రాష్ట్రపతిని కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.   ఆదివారం కుటుంబ సమేతంగా కేసిఆర్ సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అవసరాలపై ఆమెకు నివేదికనిచ్చారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఏకైక కారకురాలు సోనియా గాంధీయేనని, అందుకే ఆమెకు కృతజ్ఞతలు చెప్పడానికే కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చానని చెప్పారు. తమందరికీ సోనియా తన దీవెనలు అందజేశారని చెప్పారు.  

సీఎం సీటుపై కాంగ్రెస్ నేతల కన్ను

      రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు గల అవకశాలపై కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి షిండే వెల్లడించడంతో కాంగ్రెస్ నేతల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రి పీఠ౦ ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. సీమాంద్రలో కన్నాలక్ష్మీనారాయణ, పీసీసీ బొత్స సత్య నారాయణ, ఆనం రా౦ నారాయణ రెడ్డి రేసులులో వుండగా, తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జానారెడ్డి, ఎస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి. శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అదిష్టానం నుంచి కేంద్రమంత్రి చిరంజీవికి కూడా పిలుపు రావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి సీటు కోసం ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ లు నడుస్తున్నాయి. ఈ రోజు సోనియాతో సభాపతి నాదెండ్ల మనోహర్, దామోదర రాజనరసింహ, సీనియర్ నేత గంగా భవానీ లు వేర్వేరుగా భేటి అయ్యారు. డిగ్గీతో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు భేటీ అయ్యారు.

ధర్మాన ఎఫెక్ట్...వైకాపాకు మాజీల షాక్

      మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేరికతో వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీకి శ్రీకాకుళ౦ జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. ధర్మాన చేరికకు నిరసనగా ఇద్దరు మాజీ సీనియర్ నేతలు కణతీ విశ్వనాథం, హనుమంతు అయ్యప్పదొరలు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆదివారం ఆత్మగౌరవ సభ నిర్వహించి వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ధర్మాన మొహం కూడా చూడనని ప్రకటించిన జగన్ మోహన్ రెడ్డి..ఆయనను తన పక్కన ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. తాము ఏపార్టీలో చేరబోయేది త్వరలో ప్రకటిస్తామని అన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి రాజీనామా జిల్లాలో వైకాపా గట్టి దెబ్బగా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. వీరు ఏ పార్టిలో చేరుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్, టిడిపి పార్టీకి చెందిన నేతలు వీరితో పోటాపోటీ భేటీలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు బట్టి వీరు టిడిపికి ప్రాధాన్యం ఇచ్చే అవకశాలు కనిపిస్తున్నాయి.

టిడిపి గూటికి టీజీ, ఏరాసు, గంటా

      రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల కిరణ్ కుమార్ రెడ్డి కేబినేట్ లో సభ్యులుగా వున్న ముగ్గురు మంత్రులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ రోజు లేదా రేపు టిడిపిలో అధికారకంగా చేరనున్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొంతమంది నేతలు టిడిపిలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. టీజీ కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తుండగా.. ఏరాసు పాణ్యం అసెంబ్లీ సీటుకు మారబోతున్నారు. గంటా శ్రీనివాసరావు విశాఖ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. నంద్యాల సిటింగ్ ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి అక్కడి నుంచే టీడీపీ తరపున పోటీ చేస్తారు. సీమాంధ్ర టీడీపీ విస్తృతస్థాయి సమావేశం సోమవారం జరగనుంది.

రాష్ట్రపతి పాలన లేనట్టే...!!

      రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన? లేక కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తారా? అనే దానిపై మరో రెండు రోజుల్లో స్పష్టతా రానుంది. సీఎ౦ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా తరువాత రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ నరసింహన్ నివేదిక పంపించారు. అయితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై విదించడంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వ ఏర్పాటుకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానున్న తరుణంలో రాష్ట్రపతి పాలన విధించడం సమంజసం కాదంటూ రాష్ట్ర అగ్రనేతలు అధిష్టానంపై ఒత్తిడి తెలుస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వున్న అవకాశాలపై షిండే కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ముఖ్యమంత్రి పదవి ఎవరకి దక్కబోతోంది అనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు: హోంమంత్రి

      సమైక్య రాష్ట్రంలోనే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందినప్పటికి, రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని అభిప్రాయపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తరువాత కేంద్రం సీమా౦ద్రకు నిధులు కేటాయించడానికి మూడు, నాలుగు నెలల సమయం పడుతుందని, ఈ సమయంలో సీమాంద్రకు నిధులు కేటాయించడంపై తాము అధ్యయనం చేయాల్సి వుందని అన్నారు. విభజన ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తామని పార్లమెంటులో ప్రధాని ప్రకటించనప్పటికీ, దానికి కొంత సమయం పడుతుందని అన్నారు.

జేసీది ఆవేదనా? ఆవేశమా?

  సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి సోనియాగాంధీని దిగిపొమ్మని డిమాండ్ చేసినందుకు ఆయనకి కాంగ్రెస్ పార్టీ షో-కాజ్ నోటీసు జారీ చేసింది, కానీ ఆ తరువాత దానిని పక్కన పడేసింది. రాష్ట్ర విభజన కూడా జరిగిపోవడంతో ఇక ఆయనే స్వయంగా పార్టీని వదిలేయాలనుకొంటున్నారు. అందుకే ఆయన తన ఆవేదనని, ఆక్రోశాన్ని వ్రేళ్ళగ్రక్కుతూ ఈరోజు సోనియా గాంధీ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు.   “ఆమె చేతిలో అధికారం పిచ్చోడు చేతిలో రాయిలా ఉంది. ఆమె ఆ రాయిని ఎప్పుడు ఎవరి మీదకి విసురుతుందో ఎవరికీ తెలియదు. అటువంటి ఆమె మా పార్టీకి అధ్యక్షురాలవడం మా దౌర్భాగ్యం. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ అవన్నీ వృధాశ్రమే. ఎందుకంటే ఆ సోనియమ్మ విసిరిన రాయి ఎక్కడ పడితే అదే మన రాజధాని అని సీమాంధ్ర ప్రజలు మహాప్రసాధంలా స్వీకరించాలి. తమ కర్మ అంతేనని తృప్తి పడటం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఈ నిపుణుల కమిటీలు, నివేదికలు అన్నీ వృధా శ్రమే. ఇదివరకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి తయారు చేసిన కృష్ణా కమిటీకే దిక్కు లేనప్పుడు, మళ్ళీ రాజధాని కోసం కొత్త కమిటీలెందుకు? ఆమె వేలెత్తి ఏ ప్రదేశాన్ని చూపిస్తే అదే మన రాజధాని అవుతుంది. ఏ విషయంలోనయినా ఆమెదే అంతిమ నిర్ణయం. అదే అందరికీ మహా ప్రసాదం అని స్వీకరించాలి తప్ప ఎవరూ ప్రశ్నించకూడదు. వేరే ఏ పార్టీలు చేర్చుకొని కారణంగానే మా పార్టీ లో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి, సోనియమ్మకి భజన చేసుకొంటూ కాలక్షేపం చేసుకొంటున్నారు. ఈ ఎన్నికల తరువాత ఆంధ్ర రాష్ట్రంలో మరిక కాంగ్రెస్ కనబడదు. ఇక నుండి ఇక్కడ కూడా తమిళనాడులో లాగే ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తుంది.” అని మీడియాతో అన్నారు.   ఆయన వాడిన భాష చాలా కటోరంగా ఉన్న, ఆయన అభిప్రాయలు మాత్రం ప్రజలలో దాగిన ఆవేదన, అక్రోశాలను ప్రతిఫలిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు కేంద్రంలో అధికారంలో కొనసాగడానికి పెద్ద అండగా నిలిచిన తెలుగు ప్రజల పట్ల ఆమె, ఆమె చుట్టూఉన్న కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా చాలా హీనాతి హీనంగా వ్యవహరించారు. అయినప్పటికీ, కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పార్టీ టికెట్ల కోసం, మంత్రి పదవుల కోసం ఆమె చుట్టూ నిసిగ్గుగా ప్రదక్షిణాలు చేస్తున్నారు. రేపు ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని తెలిసి ఉన్నపటికీ, వేరే పార్టీలలోకి వెళ్లేందుకు సమస్యలు ఉన్నందునే వారు గత్యంతరంలేక కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. అయితే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తమ భయాన్ని కప్పి పుచ్చుకోనేందుకు బయటకి పోయేవారే పిరికిపందలని నిందిస్తున్నారు.

వైకాపాకు అగ్నిపరీక్షగా మారనున్న ఎన్నికలు

  త్వరలో జరగనున్న ఎన్నికలు తెదేపా, వైకాపాలకు జీవన్మరణ పోరాటం వంటివి గనుక అవి గెలుపు కోసం శక్తికి మించి కృషి చేస్తాయి. ఈసారి వాటికి కలిసొచ్చే అంశం ఏమిటంటే ప్రజలలో తీవ్ర కాంగ్రెస్ వ్యతిరేఖత నెలకొని ఉండటం. అదేవిధంగా నష్టం కలిగించే అంశం ఏమిటంటే ఉన్న13జిల్లాలలో అనేక కొత్త, పాత పార్టీలు పోటీ పడటం.   వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన సమైక్యవాదంతో కాంగ్రెస్ వ్యతిరేఖతను తన పార్టీకి అనుకూలంగా మలుచుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే రాష్ట్ర విభజన జరిగిపోయినప్పటికీ ఎన్నికల వరకు ఆ వేడిని నిలిపి ఉంచేందుకు రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా సుప్రీం కోర్టులో మళ్ళీ న్యాయ పోరాటానికి సిద్దపడుతున్నారు. కానీ, ఇప్పుడు ఏదయినా ఒక పార్టీ ధర్నా చేసినా, రాష్ట్రపతిని కలిసినా మిగిలిన పార్టీలు కూడా దానిని అనుసరించక తప్పని విచిత్రమయిన పరిస్థితి, సంప్రదాయం నెలకొని ఉన్నందున సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, తెదేపా కూడా సుప్రీంకోర్టులో కేసులు వేయవచ్చును, రాష్ట్రపతిని కలిసినా ఆశ్చర్యం లేదు. అందువల్ల వైకాపా ఇతర ప్రయత్నాలు కూడా గట్టిగానే చేయవలసి ఉంటుంది.   బహుశః త్వరలోనే పెద్ద ఎత్తున సీమాంధ్ర అంతటా పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించి రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని అందుకు సహకరించిన బీజేపీని, విభజనకు లేఖ ఇచ్చినందుకు తెదేపాను ఎండగట్టవచ్చును. కానీ చంద్రబాబుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిపాలనానుభవం లేదు. పైగా చాలా దుందుడుకు స్వభావం. గత పదేళ్లుగా అస్తవ్యస్తమయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి, సమర్ధంగా పాలన సాగిస్తూనే రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలంటే అందుకు చాలా అనుభవం, కార్యదక్షత, నేర్పు కావలసి ఉంటుంది. చంద్రబాబు తన దీక్షా దక్షతలను నిరూపించుకొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అవేమి లేకపోగా అతని వెనుక జైలు జీవితం, అనేక అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసులు మాత్రమే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. పైగా కాంగ్రెస్ పార్టీతో రహస్య సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణలు ప్రజలలో ఆయనపట్ల అపనమ్మకం కలిగిస్తున్నాయి. ఆయన ఇమేజే వైకాపాకు పెద్ద అండగా ఉంది గనుక, ఇప్పుడు కూడా ఆయన ఈ వ్యక్తిగత అంశాలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపకమానవు.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అందులో జేరుదామని ఇంతకాలం ఎదురు చూసిన కాంగ్రెస్ నేతలు, మారిన పరిస్థితుల్లో కొంతమంది కాంగ్రెస్ లోనే ఉండేందుకు సిద్దపడుతుంటే మిగిలినవారు తెదేపా, వైకాపాలవైపు చూస్తున్నారు. అందువల్ల అటువంటి వారినందరినీ వైకాపా వైపు ఆకర్షించే ప్రయత్నం గట్టిగా చేసి పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. కానీ సరిగ్గా ఇదే కారణంతో పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు మొదలయి, జగన్మోహన్ రెడ్డి పార్టీపై అదుపు కోల్పోయినట్లయితే వైకాపా కూడా మరో ప్రజారాజ్యంగా మారి ఎన్నికలలో మునిగి కాంగ్రెస్ పార్టీలో తేలుతుంది. మరి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపాను జగన్మోహన్ రెడ్డి ఒడ్డుకు చేరుస్తారో లేక కాంగ్రెస్ నావ ఎక్కించి చిరంజీవిలా క్షేమంగా బయటపడతారో చూడాలి.

సోనియా గాంధీకి 'పిచ్చి'పట్టింది

      కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపైన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియా గాంధీకి పిచ్చి పట్టిందని అన్నారు. అధికారం అనే రాయి ఆమె చేతిలో వుందని, ఆ రాయితో ఏం చేస్తుందో తనకే తెలియదని ఆరోపించారు. ఆమె పిచ్చితో తెలుగు ప్రజలకు అనేక సమస్యలు సృష్టించిందని పేర్కొన్నారు. తానూ సృష్టించిన సమస్య ఫలితంగానే రాజధానికి ఎక్కడ అనేది సీమాంధ్ర ప్రజలకు అర్ధం కావడం లేదని అన్నారు. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ త్వరలో మాయమవుతుందని, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలు పార్టీలలో దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. తమిళనాడు మాదిరి ఆంధ్రాలో కూడా ప్రాంతీయ పార్టీల రాజ్యం రాబోతుందని జోస్యం చెప్పారు. కొంతమంది రెండు రోజులు ముఖ్యమంత్రి పదవి కోసం గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నారని ఆరోపించారు.

కాపు రిజర్వేషన్ లపై కాంగ్రెస్ దృష్టి!

      సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ అదిష్టానం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో బాగంగానే కాపుల రిజర్వేషన్ పై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కన్నా సత్యనారాయణ సోనియా గాంధీతో భేటి కావడం ప్రాధాన్యం సత్కరించుకుంది. రాష్ట్రంలోని కాపుల రిజర్వేషన్ లకు సంబంధించిన నివేదికను ఆయన సోనియా గాంధీకి అందజేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా కాపులకు రిజర్వేషన్ లు ఇవ్వలని ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజనతో సీమాంద్రలో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ బలోపేతం కావడానికి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్యాకేజ్ ఎన్నికల కోసమేనా

  రాష్ట్ర విభజనతోనే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖరారయిపోయిందని అందరూ భావిస్తున్నపటికీ, అ పార్టీ అధిష్టానం బొత్స, డొక్కా, వట్టి, చిరంజీవి, అనం, రామచంద్రయ్య, సుబ్బిరామిరెడ్డి వంటి విదేయులైన వారినందరినీ ఒక త్రాటి పైకి తీసుకు వచ్చిన తీరు చూస్తే ఎన్నికలలో కాంగ్రెస్ కూడా గట్టిగానే పోటీ ఇవ్వబోతునట్లు స్పష్టమవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అనుచరులు పార్టీ నుండి నిష్క్రమించడంతో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అసమతి గళం వినిపించే అవకాశం లేకుండా పోయింది. బహుశః టికెట్స్ కేటాయింపు సమయంలో కొంత వినిపిస్తుందేమో. సీమాంధ్రకు ఇవ్వబోయే ప్యాకేజీ గురించి, రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ తెదేపా, వైకాపాలు ఇచ్చిన లేఖలు, రాష్ట్రాన్ని విడదీయడానికి సహకరించిన కిరణ్ కుమార్ రెడ్డి ని నిందిస్తూ ఎన్నికలలో నెగ్గుకు రావాలని కాంగ్రెస్ ఆలోచన. కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడని నిరూపించుకొన్నారు గనుక కనీసం వారికి ఆ అవకాశం కల్పించేందుకయినా కొత్త పార్టీ పెట్టవలసి ఉంటుంది.   ఎన్నికల తరువాత మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో ఉన్నకాంగ్రెస్ పార్టీ తను ఎలాగు ఆ వాగ్దానాలను అమలు చేయనవసరం లేదు గనుక అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఈ రెండు మూడు నెలలలో సీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు ఎన్ని వరాలు, ప్యాకేజీలయినా ప్రకటించవచ్చును. అందువల్ల అందరూ ఊహిస్తున్నట్లుగా కాంగ్రెస్ పోరాడకుండా చేతులెత్తేయబోదని స్పష్టమవుతోంది.

మంది ఎక్కువయితే...

  రాష్ట్ర విభజన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేసింది గనుక ఇక రాజకీయ పార్టీలన్నీ మరో రెండు నెలలలో జరగనున్న ఎన్నికల కురుక్షేత్రానికి తమ సేనలను, వ్యూహాలను సిద్దం చేసుకొని కత్తులు పదును పెట్టుకొంటున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెస్, వై.కాంగ్రెస్, తెదేపాల మధ్యే పోటీ ప్రధానంగా ఉంటుందని చెప్పవచ్చును. ఆమూడు కాక బీజేపీ, లోక్ సత్తా పార్టీలు కూడా బరిలో ఉండగా, కొత్తగా ఆమాద్మీ, మందకృష్ణ, బైరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి (పెట్టబోయే) కొత్త పార్టీలు కూడా వచ్చి చేరబోతున్నాయి. గతంలో 23జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్తా ఒకేసారి 13 జిల్లాలకు కుచించుకుపోవడంతో, ఒకేసారి ఇన్ని పార్టీలు వచ్చి చేరడంతో ‘మంది ఎక్కువయితే మజ్జిగ పలచబడుతుందన్నట్లు’ ఇన్ని పార్టీల మధ్య ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఇప్పటికే అస్తవ్యస్తమయి, ఇంకా ఇప్పుడు పునర్నిర్మాణం కూడా కావలసిన ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. అత్యంత క్లిష్టమయిన ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్త్రప్రజలు, కులం, మతం వంటి బలహీనతలకు, పార్టీలు పంచిపెట్టే తాయిలాలకు లొంగిపోకుండా విజ్ఞత ప్రదర్శించి సరయిన పార్టీకే పూర్తి మెజారిటీతో గెలిపించవలసి ఉంటుంది. అలాకాదని ప్రజలు ఈ రాజకీయ పార్టీల నడుమ చీలిపోయినట్లయితే, డిల్లీలో ప్రభుత్వ పరిస్థితే ఎదురవుతుంది.

60ఏళ్ళ కల నెరవేరింది: తెలంగాణపై ప్రధాని

      15వ లోక్‌సభ సమావేశాల ముగింపు సందర్బంగా ప్రధాని మన్మోహన్ సింగ్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఎలాంటి అస్థిరతకు తావు లేకుండా, ప్రాధాన్యం లేని లాభ నష్టాల గురించి చింతించకుండా క్లిష్టమైన కొన్ని నిర్ణయాలను ఈ దేశం తీసుకోగలదని తెలంగాణ ఏర్పాటైన తీరుతో స్పష్టమయ్యిందని చెప్పారు. కీలకమైన అంశాల విషయంలో వ్యక్తిగతవాదాలను వదిలిపెట్టి జాతి ఐక్యత కోసం కృషి చేసే సత్తా మనకు ఉందని లోక్‌సభ నిరూపించిందన్నారు. అణగారిన వర్గాల్లో ఆశలు రేకెత్తించిన ఆహార భద్రత చట్టం మరొక చారిత్రక చట్టమని ప్రధాని అన్నారు. 15వ లోక్‌సభకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. హోం మంత్రి షిండే మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అంశం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. పదేళ్ల కిందట తమ పార్టీ అధ్యక్షురాలు ఈ మేరకు హామీ ఇచ్చారని, దీన్ని అమలు చేసే క్రమంలో బీజేపీ కూడా తమకు సహకరించటం స్వాగతించాల్సిన విషయమన్నారు.

అద్వానీకి లోక్ సభ వీడ్కోలు!

      భారతీయ జనతా పార్టీ కులగురువు, రాజకీయ బీష్ముడు 87ఏళ్ళ అద్వానీ త్వరలో రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారా? లోక్ సభ సమావేశాలలో ఆఖరి రోజు జరిగిన సన్నివేశాలు చూస్తుంటే ఇది నిజమేనని అంటున్నాయి రాజకీయ వర్గాలు! 15వ లోక్ సభ సమావేశాల చివరి రోజు సభలో అద్వానీ అందరూ పొగడ్తలతో ముంచెత్తుతూ దాదాపు వీడ్కోలు స్థాయిలో ప్రశంసిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సభలో భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. సభలో సభ్యులందరూ ఆయన్ని 'ఫాదర్ ఆఫ్ ది హౌస్' గా అభివర్ణించారు. ఆయన అడుగుజాడల్లో నడిచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానంటూ సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ''అద్వానీజీ మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్తాను...పార్టీ బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేసిన మీరు..పార్టీ బలోపేతం అవుతుంటే..మీరు బలహీనమవుతున్నారు'' అని ములాయంసింగ్ యాదవ్ అన్నారు.

కొత్త పార్టీకి ముహూర్తం ఖరారయిందా

  నిన్న మొన్నటి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గురించే మీడియాలో ఎక్కువగా చర్చలు జరుగుతుండేవి. కానీ, రాజీనామా చేసిన తరువాత ఆయన మళ్ళీ మీడియాకు కనబడలేదు. అయితే ఈరోజు ఆయన సన్నిహిత సహచరుడు మరియు మంత్రి పితాని సత్యనారాయణ రేపు 23వ తేదీన కిరణ్ కుమార్ రెడ్డి తన కొత్త పార్టీని ప్రకటిస్తారని, అందులో తను తన అనుచరులు అందరం జేరుతామని మీడియాకు తెలపడంతో, కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ కోసం కసరత్తు చేస్తున్నట్లు అర్ధమవుతోంది.   ఇంతకాలంగా రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా గట్టిగా పోరాడినవారిలో ముఖ్యుడైన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం చేయగా, గంటా శ్రీనివాసరావు తెదేపాలో జేరెందుకు ఆసక్తి చూపుతునట్లు సమాచారం. ఇక టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు తాము ఏ పార్టీలో చేరుతామో ఇప్పుడే చెప్పలేమన్నారు. అందువలన ఇప్పుడు కిరణ్ కొత్త పార్టీ పెడితే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారనేది అనుమానమే. ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయినందున, సమైక్య నినాదం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. పైగా రాష్ట్ర విభజనను అడ్డుకొంటానని ఆయన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరినీ  త్రప్పు ద్రోవ పట్టించి విభజన జరిగేందుకు కారకుడయ్యాడని బొత్ససత్యనారాయణ, రామచంద్రయ్య, చిరంజీవి వంటివారు విస్పష్టంగా చెపుతున్నారు. అంటే ఈ విషయం వారికి కూడా తెలిసినప్పటికీ రాష్ట్ర విభజన జరిగే వరకు అందరూ మౌనంగా ఉండిపోయి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ అధిష్టానానికి అందరూ సహకరించారని వారే స్వయంగా అంగీకరిస్తున్నారన్న మాట!   ఇక కిరణ్ విషయానికి వస్తే ఆయన అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ రాజీనామా చేస్తున్న తరుణంలో కూడా సోనియా, రాహుల్ గాంధీలని తీవ్రంగా విమర్శించకపోగా, తనకు ఈ హోదా, గౌరవం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకొంటూ పదవి నుండి సవినయంగా తప్పుకొన్నారు. అందువల్ల  నేటికీ ఆయన కాంగ్రెస్ విధేయుడేనని స్పష్టమవుతోంది. బొత్స తదితరులు చెప్పిన మాటల ప్రకారం చూసినట్లయితే రాష్ట్ర విభజనలో అధిష్టానానికి ఆయనే సహకరించారని అర్ధం అవుతోంది.   మరి కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి, ఇంతగా విధేయత చూపిస్తున్న ఆయన ఎన్నికల తరువాత తన పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే కలిపేయకుండా ఉండరని భావించే ప్రజలకు ఏవిధంగా నమ్మకం కలిగించగలరు? ఇంతకీ ఆయన కొత్త పార్టీ దేనికోసం సాధిస్తున్నారు? అని ఆలోచిస్తే అది కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా ఓట్లు చీల్చి తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోనేందుకే తప్ప ఏదో సాధించడానికి కాదని అర్ధమవుతుంది.

మాతృభాషతోనే సృజనాత్మకత

      మీ పిల్లలు అమ్మ భాషలో మాట్లాడుతున్నారా? అంటే మాతృ బాషలో. అచ్చ తెలుగులో ఎంచక్కా మాట్లాడగలిగితే పరవాలేదు. లేకపోతె మాత్రం పరిశోధకులు చెప్తున్నా ఈ విషయాన్నీ గమనించండి.   ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది ఏంటంటే... మాతృభాషలో చక్కగా మాట్లాడగలిగే పిల్లల్లో సృజనాత్మకత, పరాయి బాషలలో మాట్లాడే పిల్లల్లో కంటే ఎక్కువ ఉంటుందట. అంటే ... పూర్తిగా మాతృభాషలో ఆలోచించటం మానేస్తే, వినూత్నతకు దూరమైపోయినట్లే. సహజంగా బాష బీజాలు తల్లి గర్భంలో ఉండగానే పడతాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. బిడ్డ పుట్టి పెరుగుతున్నప్పుడు చుట్టూ ఉండే వారిని గమనిస్తూ, మాటలు నేర్చుకుంటూ, భావాలను వ్యక్తీకరించటం మొదలు పెడతాడు. అన్నీ భావావేశాలను చక్కగా వ్యక్తీకరించగలుగుతాడు. ఎప్పుడైతే వేరే భాషలో మాత్రమే మాట్లాడవలసి వస్తుందో.. అప్పుడు తన భావవ్యక్తీకరణలో మార్పు రావడం మొదలు పెడుతుందట. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో మాతృభాషలోనే మాట్లాడటం మంచిది అంటున్నారు పరిశోధకులు. అలాగే గేయాలు, కథలు, పద్యాలు వంటి వాటిని మాతృభాషలో నేర్పిస్తే పిల్లల్లో మాతృభాష పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు వస్తుంది. అలాగే తన భావాలను చక్కగా, స్పష్టంగా వ్యక్తీకరించే నేర్పు కూడా వస్తుంది. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంటే అమ్మ భాషను పది కాలాల పాటు కాపాడుకోవడానికి, అలాగే ఆ భాష తీయదనాన్ని ముందు తరాలకు చేరేలా చేయటానికి మనం ఏం చేయాలి అన్నది సమాలోచించుకోవలసిన రోజు. ప్రభుత్వం ఏం చేయాలన్నది పక్కన పెడితే.. వ్యక్తులుగా మన పరిధిలో మనం ఏం చేయగలం అన్నది ఆలోచించాలి. దానికి పునాది మన ఇంటినుంచే పడాలి. పరాయి భాషలను గౌరవిస్తూ, మన మాతృభాషను పూజించటం ఎలాగో పిల్లలకు నేర్పాలి. తేట తెలుగు తీయదనాన్ని రుచి చూపించాలి. అందుకు చేయవలసిందల్లా పిల్లలతో అచ్చ తెలుగులో మాట్లాడటం, చిట్టి చిలకమ్మా వంటి కధాగేయాలను, పద్యాలనూ నేర్పించటం, కథలు, పొడుపు కథలు, సామెతలు మొదలైన వాటిని పిల్లలకు చెప్పటం అలాగే మన తిధి, వార, నక్షత్రాలను నేర్చుకునేలా చేయటం. ఇవన్నీ పిల్లల్లో భాషపట్ల ఆసక్తిని రేకెత్తిస్తాయి. తెలుగులో మాట్లాడటమే కాదు. చదవటం, రాయటం నేర్పించటం కూడా ముఖ్యమే. అప్పుడే రేపటి తరం వరకు తెలుగు భాష నిలిచేది. ఇదంతా భాషకి మనం చేసే సేవ అని అనుకున్నా మంచిదే. ఎవరి పరిధిలో వారు ఎంతో కొంత చేయటం మొదలు పెడితేనే భాష మనగలిగేది. అంతకన్నా ముఖ్యంగా అమ్మ భాష పిల్లల సృజనాత్మక సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది అని అధ్యయనాలు గట్టిగా చెబుతున్నాయి కాబట్టి... పిల్లలను తెలుగులో మాట్లాడగలిగేలా, రాయగలిగేలా ప్రోత్సహిద్దాం. ......రమ