తల్లిని చంపేసి… బిడ్డకు జననమా: నరేంద్ర మోడీ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే విషయంలో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించాయని బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దుమ్మెత్తి పోశారు. రెండు రాష్ట్రాలుగా విభజించేటప్పుడు పాటించాల్సిన కనీస విషయాలేవీ పాటించలేదని, తల్లిని చంపి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా చేశారని మండిపడ్డారు. తల్లిలాంటి సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు ప్రకటించిన ప్యాకేజీలు, పన్ను రాయితీలు ఏవీ సామాన్యుడికి పనికొచ్చేవి కావని మోడీ తేల్చిచెప్పేశారు. తాను త్వరలోనే సీమాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తానని కూడా నరేంద్ర మోడీ చెప్పారు.   రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ఎంతవరకు కారణమో, బీజేపీ కూడా అంతే కారణమని మండిపడుతున్న సీమాంధ్ర ప్రాంత వాసులు ఇప్పటికే తమ ఆగ్రహాన్ని రకరకాల రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ లాంటి నాయకులు రాజ్యసభలో విభజనకు అనుకూలంగా మాట్లాడటంతో పలు ప్రాంతాల్లో నరేంద్ర మోడీ ఫ్లెక్సీలను కూడా తగలబెట్టారు. ఈ ఆగ్రహాన్ని కొంతవరకైనా చల్లార్చి, ఆ ప్రాంతంలో కనీసం ఒకటి రెండైనా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలలో భాగమే నరేంద్రమోడీ చేసిన ఈ వ్యాఖ్యలని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ తో కదం కలుపుదామా?

  మీ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి మార్నింగ్ వాక్ చేసేందుకు సిద్దమేనా? అయితే మరిచిపోకుండా రేపు ఉదయం 6 గంటలకి హైదరాబాదులో ఉన్న పీవీ ఘాట్ వద్దకు వచ్చేయండి. అక్కడ మీ కోసం మీ అభిమాన హీరో పవన్ కళ్యాన్ ఎదురు చూస్తుంటాడు. ఆయనతో బాటే దర్శకుడు త్రివిక్రమ్ కూడా వస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే వారిరువురూ రేపు (మార్చి 2, ఆదివారం) ప్రజాహిత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు హృదయ స్పందన ఫౌండేషన్ వారు కలిసి సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఓ వాక్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పాల్గొనబోతున్నారు. పీవీ ఘాట్ వద్ద సరిగ్గా ఉదయం 6గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమం నెక్లెస్ రోడ్డు వాడ ముగుస్తుంది. పవన్ కళ్యాన్ వస్తున్నాడంటే మరి ఆయన అభిమానులు రాకుండా ఉంటారా? అందువల్ల ఆయనతో కలిసి నడిచేందుకు సిద్దమయిపొంది మరి.

రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలుతున్నఈ సమయంలోనే మళ్ళీ 41సం. ల తరువాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించబోతున్నారు. కేంద్ర క్యాబినెట్ సూచించిన విధంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించేందుకు అంగీకరిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు ఆమోదముద్ర వేసారు. ఈరోజు రాత్రిలోగా గవర్నర్ నరసింహన్ కు కేంద్రం నుండి లేఖ అందగానే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుంది.   అయితే దీనివలన ప్రజలకు, రాజకీయ పార్టీలకు లేదా ఇతర సంస్థలకు ఎటువంటి ఇబ్బందీ లేకపోయినప్పటికీ, ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాన్ని నిద్రావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విదించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటు. అయితే, గత ఆరు నెలలుగా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, మంత్రి వర్గం అన్నీ ఉన్నపటికీ అవి ఉండీలేనట్టే సాగింది. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా అనంతరం,కాంగ్రెస్ మంత్రులందరూ రాష్ట్రాన్ని, పాలనను గాలికొదిలేసి ముఖ్యమంత్రి పదవి కోసం డిల్లీలో కూర్చొని కీచులాడుకొంటూ చివరికి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో రెండుగా విడిపోతున్న తెలుగు ప్రజలకు రాష్ట్రపతి పాలనను బహుమతిగా ఇచ్చారు. అందుకు తాము చాలా సంతోషిస్తున్నామని ఆనం రామినారాయణ రెడ్డి వంటి మంత్రులు నిసిగ్గుగా శలవిస్తున్నారు.

రేపు బీహార్ లో చప్పట్ల మోత

  సీమాంధ్రకు స్పెషల్ స్టేటస్ ప్రకటించిన కేంద్రంపై బీహార్ రాష్ట్రం ఆగ్రంతో ఉండి. బీహార్ కు కూడా ప్రత్యేక హోదా కల్పించాలంటూ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పలు రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఆందోళనకు దిగాయి. అధికారంలో ఉన్న జెడియూ భారీ సంఖ్యలో ఖగడాల ప్రదర్శన చేసారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రాష్ట్రానికి ప్రత్యేల హోదా బీహార్ వాసుల జన్మ హక్కు అని నినాదించారు. ఇదే అంశంపై బీహార్ బిజెపి నేతలు సైతం రైల్ రోకో నిర్వహించారు. ఈ విషయంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఉద్యమ బాట పట్టారు. ఈనెల 2న వినూత్న బంద్ కు జేడియూ పిలుపు. ఆరోజున ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఐదు నిమిషాల పాటు గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరారు. ఈ మోతకు అదిరిపడి ఢిల్లీ పెద్దలు బీహార్ కు ప్రత్యేక హోదా తెచ్చిపెడుతుందని అన్నారు.

అప్పటివరకు పిచ్చామే చేతిలోనే అధికారం

  సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు పిచ్చామె చేతిలోనే అధికారం ఉంటుందని, తన చేతిలోని రాయి ఎక్కడ విసిరితే అక్కడే సీమాంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏర్పడుతుందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆ పిచ్చామే విసిరిన రాయి నిజామాబాద్ లో పడిన కూడా ఆ ప్రాంతాన్ని సీమాంధ్ర రాజధానిగా ఒప్పుకోవాల్సి వస్తుందని జేసీ మండిపడ్డారు. వైకాపాలో చేరాలంటే ఎంపీ టిక్కెట్టుకు రూ.30కోట్లు, ఎమ్మెల్యే టికెట్ కు రూ.5 కోట్లు అడుగుతున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో కేవలం డబ్బు మాత్రమే పనిచేయదని, అభ్యర్థి గుణగణాలు, శక్తిసామర్థ్యాలు ముఖ్యమని పేర్కొన్నారు. తెలంగాణ సీఎంగా కేసీఆరే అవుతారని అన్నారు. ఇటు సీమాంధ్ర ప్రాంతంలో, అటు తెలంగాణ ప్రాంతంలోను కూడా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని జేసీ అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో ఇన్నాళ్ళుగా ఉన్న అనుబంధం తెంచుకోవడం బాధగానే ఉందని, కానీ కాంగ్రెస్ ఉంటేనేం..పోతేనేం.. అని కొందరు చెప్పడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని ఆయన అన్నారు.

జేఏసీల రాజకీయ రంగ ప్రవేశం

  తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాలు కొత్త రాజకీయ నాయకులకు పురుడుపోశాయి. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండే ప్రభుత్వోద్యోగులు, న్యాయవాదులు, విద్యార్ధులు తదితరులు ఈ ఉద్యమాల పుణ్యామాని రాజకీయ నేతలతో, వారి పార్టీలతో, మంత్రులతో భుజాలు రాసుకొని తిరిగే భాగ్యం పొందారు. ఉద్యమాల కోసం వారు స్థాపించుకొన్న జేఏసీలే వారికి సమాజంలో, రాజకీయాలలో ఒక సరికొత్త గుర్తింపుని, హోదాని, పలుకుబడిని కల్పించాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు వీధికొకటి చొప్పున జేఎసీలు పుట్టగొడుగుల్లా వెలిసాయి. అయితే అన్ని జేఏసీలను, నేతలను ఒకేగాట కట్టలేము. ఉద్యమాలు పతాక స్థాయిలో నడుస్తున్న తరుణంలో వాటిలో అనేకం చురుకయిన పాత్ర పోషించి, దారి తప్పుతున్న రాజకీయ నేతలను అదుపుచేస్తూ తమ భాద్యత నెరవేరగానే స్వచ్చందంగా తప్పుకొన్నవీ చాలానే ఉన్నాయి.   అయితే ఉద్యమాలు ముగిసిన తరువాత కూడా ఇంకా తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నవి కూడా ఉన్నాయి. అవి ఉద్యమంలో తము పడిన కష్టానికి రాజకీయ పార్టీల నుండి టికెట్స్ రూపంలో ప్రతిఫలం ఆశిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో ఇంకా సజీవంగా ఉన్న ఇటువంటి జేఏసీలు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి అధికారం చెప్పట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. అయితే ఇది తప్పని ఎవరూ అనకపోయినప్పటికీ, తమ ఉద్యమ లక్ష్యం నెరవేరిన తరువాత ఇంకా జేఏసీలను సజీవంగా ఉంచడం, దానిని తమ రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకోవాలనుకోవడం సబబు కాదు. జేఏసీ నేతలకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి, ప్రభుత్వంలో పాలు పంచుకోవాలనుకొంటే ముందుగా జేఏసీలను పూర్తిగా రద్దు చేసి, తమ ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేసి, ఎన్నికలలో పోటీ చేస్తే ఎవరూ తప్పు పట్టలేరు.

రాహుల్ కి ముద్దుపెడితే చంపేసాడు

  ఎవరైన సినిమా తారలు, రాజకీయ నాయకులు.. ఇలా ఎవరైనా తమ గ్రామానికి వచ్చినప్పుడు ఒక షేక్ హ్యాండ్, కుదిరితే ఆటోగ్రాఫ్, ఫోటో దిగడం మాములుగా జరుగుతూనే ఉంటుంది. కానీ తన అభిమాన హీరో/నాయకుడికి ముద్దిచ్చే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి. కానీ ఆ ముద్దు ఇవ్వడం వల్ల తాను చనిపోతానని అసలు ఊహించలేము కదా! అసలు విషయమేమిటంటే... రాహుల్ గాంధీ ఇటీవలే అసోంలోని జోరత్ లో స్వయం సహాయక గ్రూపులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు రాహుల్ కు మరింత దగ్గరగా వచ్చి అనుకోకుండా అతని చెంపలపైన, నుదిటిపైన ముద్దులు పెట్టేశారు. అయితే అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యురాలు బొంటీ ఉత్సాహం పట్టలేక రాహుల్ బుగ్గపై ముద్దు పెట్టింది.ఈ విధంగా అక్కడున్న కొంతమంది రాహుల్ కి ముద్దుల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమం అన్ని చానల్స్ లలో ప్రచారం అయ్యింది. అయితే ఈ విషయం తెలుసుకున్న బొంటీ భర్త తీవ్ర మనస్తాపానికి గురై, భార్యను నిలదీయగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో బొంటీ భర్త ఆవేశంతో భార్యను సజీవ దహనం చేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యయత్నం చేసాడు. బొంటీ ఆ మంటల్లో ఆహుతి అయ్యింది. కానీ ప్రస్తుతం బొంటీ భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం తాయిలం

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతీసారి సామాన్య ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. ఏ కొత్త పన్నులతో అవి తమ కష్టార్జితాన్ని దోచుకొంటాయో అని వారు భయపడతారు. అదేవిధంగా ఎన్నికలను చూసి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు బెంగపెట్టుకొంటాయి. ఐదేళ్ళు ప్రజలతో ప్రభుత్వాలు ఆడుకొంటే, ఎన్నికలు వచ్చినప్పుడు ఓ రెండు మూడు నెలలు వాటితో ప్రజలు ఆడుకొనే అవకాశం కలుగుతుంటుంది. కానీ ఆ మూనేళ్ళ ముచ్చటలో కూడా తమదే పైచేయి కావాలని ప్రభుత్వాలు వాటిని నడుపుతున్నరాజకీయ పార్టీలు తాయిలాలు విసురుతుంటాయి.   సబ్సీడీ గ్యాస్-ఆధార్ బందం త్రెంపి ప్రజలకు గ్యాస్ ట్రబుల్ నుండి విముక్తి కలిగించిన కేంద్ర ప్రభుత్వం, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 10 శాతం డీఏ పెంచి ఎన్నికల తాయిలాలు ఉదారంగా పంచిపెట్టింది. పేద, మధ్యతరగతికి చెందిన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ పింఛన్ కనీస వెయ్యికి పెంచింది. నగరాలు, పట్టణాలలో ఉన్న ఓటర్లతో బాటు మారుమూల గ్రామాలలో భారంగా బ్రతుకులీడుస్తున్న గిరిజన ఓటర్లను కూడా మరిచిపోకుండా వారికి ఏడాదికి కనీసం 150 రోజులు ఉపాధి కల్పించేందుకు అంగీకరించింది. ఇంకా ఇటువంటివి చిన్నచిన్న తాయిలాలు చాలానే ప్రకటించింది. ఐదేళ్ళ పాటు అనేక కుంభకోణాలు చేసుకొంటూ కాలక్షేపం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడేసరికి ఒక్కసారిగా మేల్కొని అవినీతి చట్టాలను, మహిళా, గిరిజన సంరక్షణ చట్టాలు అంటూ చాల హడావుడి చేసింది. ఇక పార్లమెంటు సమావేశాలు కూడా ముగిసిపోవడంతో ఇప్పుడు ఇటువంటి తాయిలాలు పంచిపెడుతూ ప్రజలను మంచి చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఐదేళ్ళ పాటు సమర్ధమయిన, అవినీతి రహితమయిన పాలన అందించి ఉంటే, ఈ తిప్పలు పడే బాధ ఉండేది కాదు కదా?

కెసిఆర్ పై గెలుస్తా .... జగ్గారెడ్డి

  కెసిఆర్ పై గెలుస్తా .... జగ్గారెడ్డి   కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణావాది తూర్పు జయ ప్రకాశ్ రెడ్డి టి.ఆర్.ఎస్. అధినేత కెసిఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మొదటి నుండి సమైక్యవాది అయిన జయప్రకాశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వచ్చే ఎన్నికలలో తాను సమైక్యవాదిగానే సంగారెడ్డి నియోజకవర్గం నుండే పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ అనుమతిస్తే తెలంగాణాలోని ఏ స్థానం నుండైనా కిసిఆర్ కి ప్రత్యర్థిగా నిలబడి కెసిఆర్ ను మట్టికరిపిస్తానని కూడా చెపుతున్నారు. రాష్ట్ర విభజనవల్ల కొంతమంది లాభపడతారే తప్ప తెలంగాణాకు ఒరిగిందేమీ లేదని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలంగాణా అభివృద్ధి చెందుతుందని విలేఖరుల సమావేశంలో తూర్పు జయప్రకాశ్ రెడ్డి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంపై వెంకయ్య మండిపాటు

  విశాఖలో సీఐఐ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న భాజపా జాతీయనేత ఎం.వెంకయ్యనాయుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలివైన కేంద్ర ప్రభుత్వం ఉంటే ఈ విభజన ప్రక్రియను కాస్త ముందే పూర్తి చేసేది. రాష్ట్రాన్ని విభజించేసారు. కానీ ఏర్పాటుకు ఇంకా సమయముందని అంటున్నారు. అంటే వచ్చే అక్టోబరు వరకు సీమాంద్రలో ఆర్థిక పరిస్థితి ఎలా అనేది కేంద్రం పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు భవిష్యత్తులో అన్ని చోట్లా నిర్మించాలని సూచించారు. ఏ రాష్ట్రంలో అయిన అధికార వికేంద్రీకరణ జరగాలి అని అన్నారు.

గ్యాస్ ట్రబుల్ నుండి ప్రజలకు విముక్తి

  ఎన్నికలలో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ప్రజలకు ఎన్ని హామీలయినా ఇస్తాయి. ఏదోవిధంగా ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తాయి. అధికారంలో ఉన్నపార్టీకయితే ఆ అవకాశం మరికొంచెం ఎక్కువ ఉంటుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వమయితే ఇక మరి చెప్పనే అక్కరలేదు. కనబడిన, కనబడని ప్రతీ అవకాశాన్ని విచ్చలవిడిగా వాడేసుకొంటుంది.   అటువంటి సవాలక్ష ఐడియాలలో నగదు బదిలీ పధకం, ఆధార్ కార్డ్, సబ్సీడీ గ్యాస్ వంటివి కూడా ఉన్నాయి. నగదు బదిలీ పధకంతో ఏదో అద్భుతం జరిగిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు చేసి ప్రచారం చేసింది. కానీ, కొన్ని రాష్ట్రాలలో అమలు చేసిన పైలట్ ప్రాజెక్టులే బెడిసికొట్టాయి. అయినా వెనక్కితగ్గల్లేదు. నగదు బదిలీతో ప్రజల ఓట్లన్నీ తన ఖాతాలోకే బదిలీ అయిపోతాయనే దురాశతో సబ్సీడీ గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీని ఆధార్ కార్డుల ద్వారా నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలోనే జమా చేయామని హుకుం జారీ చేసింది. అయితే ప్రజలకు నగదు బదిలీ చేసే సదుద్దేశ్యంతో గాక, పెట్రోలియం కంపెనీలు క్రమంగా గ్యాస్ ధరలను పెంచుకొంటూ, వారి చేతిలో చిక్కిన సబ్సీడీ మొత్తాన్ని తమ ఇష్టానుసారంగా సులువుగా కత్తిరించుకొనేందుకే ఈ పన్నాగం పన్నింది. లోపభూయిష్టమయిన ఈ విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తడంతో, అదే అదునుగా ప్రత్యర్ధ రాజకీయ పార్టీలు దానిని తమకు ఎక్కడ నుకూలంగా మలచుకొంటారో అనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై సబ్సీడీని నగదు బదిలీ పధకం ద్వారా నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాలలో జామా చేసే పద్దతిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గ్యాస్ డీలర్లకు పెట్రోలేయం కంపెనీల నుండి లేఖలు కూడా జారీ అయియ్యాయి. గనుక, ప్రజలు గ్యాస్ సిలిండర్-ఆధార్ కార్డ్-నగదు బదిలీ పధకం నుండి బంద విముక్తులు అయినట్లే! అయితే ఇందుకు సంతోషించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటువేసి గెలిపించుకొంటారా లేదా అనేది వారే నిర్ణయించుకోవలసి ఉంటుంది.

ఐదుగురు భారతీయులను సజీవ సమాధి

  సౌదీలో ఐదుగురు భారతీయులను సజీవ సమాధి చేసారు. ఇది ఘోరం జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పొట్టకూటి కోసం సౌదీకి వెళ్ళిన ఈ ఐదుగురు భారతీయ కార్మికులను అక్కడి వారు చిత్రహింసలు పెట్టి మరీ చంపేసారట. ఈ హత్య కేసులో సౌదీ పోలీసులు దాదాపు 25మందిని అరెస్టు చేయగా..2010లో ఈ నేరం చేసినట్లుగా ముగ్గురు నిందితులు కోర్టులో అంగీకరించారు. కోర్టులో వారు చెప్పిన విషయమేమిటంటే... స్నేహితుడి సమాచారం మేరకు ఓ రోజు రాత్రి ఫ్రెండ్ ఫాంకి వెళ్లానని ఓ వ్యక్తి చెప్పాడు. అయితే అక్కడ ఉన్న ఐదుగురు వ్యక్తుల చేతులు కట్టేసి, అక్కడే ఉన్న ఓ యజమాని కూతురు, మరో మహిళను లైంగికంగా వేధించాడని తన స్నేహితుడు తనకు చెప్పినట్లుగా తెలిపాడు. అంతే కాకుండా మద్యం తాగిన తర్వాత భారతీయులను ఓ గదిలో బంధించి తీవ్రంగా కొట్టామని, ఆ తర్వాత వారిని తాళ్ళతో కట్టేసి, ట్రక్ లో తరలించి, ఫాంలో 2.5 మీటర్ల లోతున గొయ్యి తవ్వి, బ్రతికుండగానే వారిని, వారితో పాటు గుర్తింపు కార్డులను కూడా అందులో పూడ్చేసినట్లు తెలిపాడు. అయితే ఈ విషయంపై సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్పందించి... బయటపడిన శవాల ఎముకలకు డీఎన్ఏ పరిక్షలు నిర్వహించిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని, అసలు అవి భారతీయులవో కాదో అనే విషయం తెలియనుందని అన్నారు.

అవన్నీ పుకార్లే: లక్ష్మినారాయణ

  అవినీతి, అసమర్ధత, స్వార్ధ రాజకీయాల కారణంగా నానాటికి ప్రజల దృష్టిలో పలుచనవుతున్న రాజకీయ పార్టీలు, ప్రజలలో మంచి పేరున్న ఒక సినిమా స్టార్ లేదా సామాజిక కార్యకర్త లేదా మరెవరినయినా పార్టీలోకి రప్పించి, వారిని ముందుంచుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంటాయి. లేదా ఫలానా గొప్ప వ్యక్తి తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకొంటాయి.   సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మినారాయణ, గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ గనుల త్రవకాల కేసులు, జగన్ అక్రమాస్తుల కేసులు చేధించి ప్రజల దృష్టిలో ఒక హీరోగా నిలిచారు. నీతి నిజాయితీలకు మారుపేరుగా, ప్రభుత్వ,రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ముక్కు సూటిగా దూసుకుపోయే ఒక అత్యుతమ అధికారిగా, మంచి పేరు సంపాదించిన సీబీఐ జేడీ లక్ష్మినారాయణకు, ఆయన నీతి నిజాయితీ, సమర్ధతలే శాపంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయనను జగన్ కేసులలో దర్యాప్తుకు నియమించినప్పటికీ, మరెవరి ఒత్తిళ్లకు లొంగడం వలననో ఆయనకు ఎటువంటి పోస్టింగు ఇవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలలపాటు ఖాళీగా కూర్చోబెట్టింది. కానీ, ఆయన తన మనోస్తయిర్యం కోల్పోలేదు. పైగా ఆ సమయాన్ని పూర్తిగా సద్వినియోగించుకొంటూ యువతకు స్వామీ వివేకానంద వంటి మహనీయుల భోదనల గురించి వివరిస్తూ దేశమాత సేవలో వారు కూడా పాల్గొనవలసిన అవసరముందని యువతకు ప్రేరణ కలిగించేవారు.   అయితే, ఆయన పరిస్థితిని అలుసుగా తీసుకొన్న రాజకీయ పార్టీలు ఆయన త్వరలోనే తన పదవికి రాజీనామా చేసేసి తమ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం చేసుకోసాగాయి. ఆయన ఆమాద్మీ పార్టీలో చేరుతున్నారని, బీజేపీలో చేరుతున్నారని ప్రచారం మొదలయింది. ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాను ఏ రాజకీయ పార్టీలోను చేరబోవడం లేదని, తను పూర్తికాలం సర్వీసులోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. తను రాజకీయ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని ఆయన స్పష్టం చేసారు.