నేడు రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం!

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదంపొందే అవకాశం వుంది. బుధవారమే రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేంద్రం భావించిన..తాము సూచించిన సవరణలు చేపట్టాల్సిందేనని బీజేపీ పట్టుబట్టడంతో బిల్లు ప్రవేశం వాయిదా పడింది. అయితే ఈరోజు విభజన బిల్లును ఎలాగైనా సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంటులో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ముఖ్యమంత్రి కిరణ్ రాజీనామాపై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చిస్తున్నారు. బిజెపి సూచించిన సవరణలపైన మలగుల్లాలు పడుతున్నారు. నేడు పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ జరగనున్న నేపథ్యంలో బయట భారీ బందోస్తు ఏర్పాట్లు చేసారు.

ముఖ్యమంత్రి కుర్చీ కోసం డిల్లీలో పైరవీలు షురూ

  రాష్ట్ర విభజన ప్రక్రియ అంతిమ దశకు చేరుకోవడం, కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో, ఇక అందరి దృష్టి ముఖ్యమంత్రి పీఠంపై పడింది. ఎన్నికలకు ఇంకా కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నఈ సమయంలో కూడా ముఖ్యమంత్రి పదవికి ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల నుండి అనేకమంది బారులు తీరి డిల్లీలో పైరవీలు చేయడం చూస్తుంటే, ప్రజాసేవ కోసమే పుట్టామని చెప్పుకొనే మన నేతలకి పదవీ లాలస ఎంతగా ఉందో అర్ధమవుతుంది. తెలంగాణా ఏర్పడుతున్న కారణంగా సంతోషంగా ఉన్న టీ-కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ఆరటపడినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, రాష్ట్ర విభజన జరుగుతునందుకు సీమాంధ్రలో ప్రజలు బాధతో అక్రోశిస్తుంటే, కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు డిల్లీలో తిష్టవేసి ఏ కాంగ్రెస్ అధిష్టానం, సోనియమ్మ అందుకు కారకులయ్యారో వారి చుట్టూనే ఏ మాత్రం సిగ్గులేకుండా ప్రదక్షిణాలు చేస్తూ ముఖ్యమంత్రి పదవి పైరవీలు చేస్తుండటం సీమాంధ్ర ప్రజల దౌర్భాగ్యమే. రేపు రాష్ట్రం విడిపోయిన తరువాత, రెండు నెలలు ముఖ్యమంత్రి పదవి కోసం ఇంతగా దిగజారిన వీరి చేతికే అధికారం అప్పజెప్పితే రాష్ట్ర భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందో చెప్పలేకపోయినా, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్రం నుండి విడుదలయ్యే భారీ నిధులతో వీరందరి భవిష్యత్తు ఉజ్వలంగా మారిపోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.

బళ్ళారి ఉక్కు మహిళ మనసెలా కరిగిపోయిందో?

  బళ్ళారి ఉక్కు మహిళగా పేరొందిన బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ తెలంగాణాకు బేషరతుగా మద్దతు ఇస్తామని మొదట ప్రకటించినప్పటికీ ఆ తరువాత మారిన పార్టీ వైఖరికి అనుగుణంగా తను కూడా మాట మార్చి సీమాంధ్రకు న్యాయం చేయనిదే బిల్లుకి మద్దతు ఈయలేమని చిలుక పలుకులు పలకడం మొదలుపెట్టారు. కానీ, అకస్మాత్తుగా ఆమెను ఎవరో హిప్నటయిజ్ చేసినట్లు లోక్ సభలో బిల్లుకి మద్దతు పలికి వచ్చారు. ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ “తాము ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చామని, అందువల్ల తెలంగాణా ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణా ప్రజలు తలుచుకొన్న ప్రతీసారి కూడా ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోవాలని” అని విజ్ఞప్తి చేసారు.   సభలో వెళ్ళేవరకు బిల్లుని అడ్డుకొని తీరుతామని ప్రగల్భాలు పలికిన బళ్ళారి ఉక్కు మహిళ సభలో అడుగుపెట్టగానే కాంగ్రెస్ ప్రతిపాదించిన బిల్లుని చూసి వెన్నలా కరిగిపోయి మద్దతు ఇవ్వడం అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. బళ్ళారి, ఓబులాపురం గనులను మేసిన గాలి సోదరులను ఆశీర్వదించిన పాపానికి, కాంగ్రెస్ పార్టీ తన అలావాటు ప్రకారం తన పెంపుడు చిలుకలను ఆ గనుల మీదకు వదులుతానని బెదిరించి ఆ ఉక్కుమహిళ మనసును కరిగించివేసిందా? అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిన్న లోక్ సభలో బిల్లుకి బేషరతు మద్దతు ఇచ్చిన బీజేపీ మళ్ళీ ఈరోజు అదే బిల్లు రాజ్యసభకు వచ్చినప్పుడు వ్యతిరేఖించడం కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈసారి వ్యతిరేఖించడానికి కారణం ఏమిటని అందరూ ఆలోచనలో పడ్డారు.

డిల్లీలో బొత్స లాబీయింగ్ దేనికో

  కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వార్తపై కేంద్రమంత్రి జైరాం రమేష్ స్పందిస్తూ అవసరమనుకొంటే రాష్ట్రపతి పాలన విధిస్తామని అన్నారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తన పదవి నుండి తప్పుకొంటున్నారని రూడీ చేసుకోగానే, ఆపదవిపై చాలా కాలంగా కన్నేసిన పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ డిల్లీలో వాలిపోయి లాబీయింగ్ చేస్తున్నారు. కానీ పైకి మాత్రం తను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే డిల్లీకి వచ్చినట్లు చెప్పుకొంటున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమయిన ఈ పరిస్థితుల్లో దానిని ఎలాగయినా ఆపెందుకే ప్రయత్నించాలి తప్ప, ముఖ్యమంత్రి రాజీనామా ఎందుకు చేసారు? ఆయన స్థానంలోకి ఎవరొస్తారు? రాష్ట్రపతి పాలన విదిస్తారా? వంటి రాజకీయాలు మాట్లాడటం సబబు కాదని ఆయన చాలా విచారపడుతూ తెలిపారు. అయితే ఆయన ప్రదాన్యాలేమితో, ఆయన డిల్లీలో ఎందుకు తిష్టవేసారో తేలికగానే ఊహించవచ్చును. ఈరోజు రాజ్యసభలో టీ-బిల్లుకి ఆమోదముద్ర పడగానే, ఇక ఆంధ్ర తెలంగాణా రాష్ట్రాల ఏర్పాటు ఇక లాంచనప్రాయమే. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా తనంతట తానే స్వయంగా అడ్డుతొలిగిపోయారు. పైగా ముఖ్యమంత్రి పదవికి సీమాంధ్ర నుండి చిరంజీవి, కన్నా లక్ష్మినారాయణ తప్ప గట్టి పోటీకూడా లేదు. కనుక ఇంతకంటే మంచి తరుణం ఉండదని బొత్స భావించడం సహజమే. అదీగాక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను, పీసీసీ అధ్యక్షుల నియామకాలకు ఎన్నికల నిబంధనలు అడ్డువచ్చేమాటయితే, అంతకంటే ముందుగానే ఎవరినో ఒకరిని అత్యవసరంగా ముఖ్యమంత్రిగా నియమించవలసి ఉంటుంది. అటువంటప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్రకు చెందిన వ్యక్తులను కంటే తెలంగాణా వ్యక్తులకే ప్రాధాన్యం ఈయవచ్చును. ఎందుకంటే, తెలంగాణాలో యంపీ సీట్లు సాధించుకోవడానికే ఇంత రిస్కు తీసుకొని ఇంత శ్రమపడింది గనుక. తెలంగాణాకు చెందిన వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా ప్రయోజనం పొందగలదు కానీ సీమాంధ్రకు చెందిన ఏ బొత్సకో కట్టబెట్టడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. బహుశః అందుకే పరిస్థితులు అంతా అనుకూలంగా ఉన్నాకూడా ఈ ఒక్క కారణంగా బొత్స లాబీయింగ్ చేయక తప్పడంలేదనుకోవాలి. అందువలన జైరాం రమేష్ చెప్పినట్లుగా ఎన్నికల ముందు కేంద్రం రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపకపోవచ్చును.

చిరంజీవి, కావూరి రాజీనామా చేయండి: కురియన్ ఆగ్రహం

      రాజ్యసభలో సమైక్య నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సా౦బ శివ రావులపై డిప్యూటీ చైర్మన్ కురియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనపై సభలో నిరసన తెలపాలనుకుంటే తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి నిరసన తెలపాలని సూచించారు. బీజేపీ నేతలు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు కూడా కల్పించుకుని సొంత పార్టీ నేతలే సభలో గందరగోళం చేయడం సరికాదని, రాజ్యసభకు కేంద్రమంత్రులు సమాధానం చెప్పడానికే రావాలని, నిరసనలు తెలపకూడదని వారు సూచించారు. మరోవైపు మత్స్యకారుల బిల్లుపై తేల్చిన తర్వాతే వేరే బిల్లుల సంగతి చూడాలని అన్నాడీఎంకే సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ చైర్మన్ వెల్‌లో సీమాంధ్ర ఎంపీలు సీఎం రమేష్, సుజనాచౌదరి, కేవీపీ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలుపుతున్నారు.

రాజ్యసభకు సీఎం రమేష్ క్షమాపణ

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న సందర్బంగా సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర సభ్యులు సభ మధ్యలోకి చేరుకొని సమైక్యనినాదాలతో, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ ముందున్న సెక్రటరి జనరల్ తెలంగాణ బిల్లుకు సంబంధించి లోక్ సభ నుండి వచ్చిన పేపర్లను చదవబోతుండగా వెనుకనే ఉన్న సీఎం రమేష్ ఆయన మీద పడి లాక్కున్నారు. దీనిని డిప్యూటీ చైర్మన్ కురియన్ తప్పుపట్టారు. ఈ సంఘటన జరిగిన వెంటనే రాజ్యసభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి మొదలుకాగానే టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సభకు క్షమాపణలు చెప్పారు."రాష్ట్ర విభజన అత్యంత భావోద్వేగమైన అంశం. అందుకే అలా వ్యవహరించాను. సెక్రటరీ జనరల్ నుంచి కాగితాలు లాక్కున్నందుకు క్షమాపణ చెబుతున్నాను" అని సి.ఎం.రమేశ్ సభా ముఖంగా తెలిపారు. 

లగడపాటి రాజీనామా ఆమోదించిన స్పీకర్

      విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామాను లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ఆమోదించారు. లగడపాటి రాజీనామాను ఆమె సభలో చదివి వినిపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడంపై మనస్థాపం చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను స్పీకర్ మీరా కుమార్ కి ఫ్యాక్స్ చేశారు.   రాష్ట్ర విభజనను ఆపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశానని, ఇలాంటి రాజకీయాల్లో తాను ఇమడలేనని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి రావొద్దన్నారు. ఈ ఘటన కొత్త రాష్ట్రాల డిమాండ్‌కు ఊతమిస్తుందని లగడపాటి వెల్లడించారు. ఇక నుండి ప్రజలంతా భారతీయులుగా, తెలుగువారిగా కలిసి మెలిసి ఉండాలని, రాష్ట్ర విభజన గురించి తాను ఇప్పుడు ఏం మాట్లాడిన ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.  

కిరణ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాకు గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. కిరణ్ రాజీనామాపై మీడియా సమావేశం అయిన వెంటనే క్యాంపు కార్యాలయం నుంచి రాజభవన్ బయలుదేరి వెళ్లి గవర్నర్ కు రాజీనామాను లేఖను సమర్పించారు. దీంతో గవర్నర్ వెంటనే ఆమోదముద్ర వేశారు. కిరణ్ ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని గవర్నర్ కోరకపోవడం విశేషం. కిరణ్ రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం తేలిగ్గా తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. కిరణ్ రాజీనామా ఉహించినదేనని, అందులో విశేషం ఏమిలేదని అన్నారు. రాష్ట్ర విభజన్ జరిగిన తరువాత కిరణ్ రాజీనామా చేయక తప్పదని అన్నారు.   రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్న మీడియా ప్రశ్నకు షిండే సమాధానం చెప్పలేదు.

కాంగ్రెస్ కి, సీఎం పదవికి కిరణ్ రాజీనామా

      సీట్ల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం తెలుగుజాతిని విడగొట్టి, తీవ్రనష్టం కలిగించిన దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి, సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తమ పార్టీల లాభం కోసం, ప్రజల ఓట్ల కోసం అన్ని పార్టీలు కాంగ్రెస్, జగన్, చంద్రబాబు, బిజెపి, కేసిఆర్ లు తెలుగు జాతికి నష్టం చేశారని మండిపడ్డారు.   రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు కష్టాలు ఎదుర్కొంటారని అన్నారు.  విభజన వల్ల ప్రజలకు లాభం చేకురాలి కాని ఈ విభజన వల్ల విద్యార్ధుల, రైతుల, ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అన్నారు.  రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రాజ్యంగా, సంప్రదాయ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు. దొంగలమాదిరి టీవీ ప్రత్యక్ష ప్రసారాలు ఆపివేసి,బిల్లు ఆమోదించడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  విభజన ప్రక్రియతో సిగ్గుతో తలవంచుకోవల్సి వచ్చిందని అన్నారు. నాకు నా భవిష్యత్తు ముఖ్యం కాదు, తెలుగు ప్రజల భవిష్యత్తు ముఖ్యమని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకి నేను వ్యతిరేఖం కాదు. ఇరుప్రాంత ప్రజల మేలు కోసమే ఇన్ని రోజులు పోరాటం చేశానని, ఎవరినైనా నొప్పించి వుంటే క్షమించాలని కిరణ్ కోరారు.  

ఈ 'చిన్నమ్మ'ను గుర్తుపెట్టుకోవాలి: సుష్మా

      తెలంగాణ బిల్లు ఎప్పుడు తెచ్చినా మద్దతిస్తామని చెప్పాం...ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని బిజెపి నేత సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అనేక మంది బలిదానాలు చేసుకున్నారు. అలాంటి వారి స్వప్నాలు నేరవేరే బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు విశ్వాస ఘాతుకానికి ఎలా పాల్పడతాం? అని ప్రశ్నించారు. అయితే తెలంగాణ ఇచ్చిన సోనియా అమ్మను గుర్తుచేసుకోనేటప్పుడు..ఈ చిన్నమ్మ చేసిన సహాయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని లోక్ సభలో వ్యాఖ్యానించారు.   హైదరాబాద్‌ను తెలంగాణకు ఇవ్వడం వల్ల తెలంగాణకు లాభమేనని, అదే సమయంలో సీమాంధ్రకు వచ్చే నష్టాన్ని ఎలా పూరిస్తారని సుష్మ ప్రశ్నించారు. కేవలం హామీలతో లాభం లేదని, ఎంత మొత్తం కేటాయిస్తారో ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. సీమాంధ్రలో ఏర్పాటు చేసే కీలకమైన సంస్థలన్నిటికీ ప్రణాళికా సంఘం అనుమతి ఇప్పించాలని, ఈ తాత్కాలిక బడ్జెట్‌లోనే కొంత మొత్తాన్ని కేటాయించాలని ఆమె కోరారు.

కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే

  సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్ ఎంతగా వంచించిందో, సీమాంధ్రకు న్యాయం చేయకపోతే బిల్లుకి మద్దతు ఈయబోమని చెపుతూవచ్చి చివరికి బిల్లుకి మద్దతు ఇచ్చిన బీజేపీ కూడా అంతకంటే ఎక్కువగానే వంచించిందని చెప్పక తప్పదు. పైగా తాము మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుకి కట్టుబడి ఉన్నదునే బిల్లుకి మద్దతు ఇచ్చామని, కానీ కాంగ్రెస్ పార్టీయే బిల్లు విషయంలో ద్వంద వైఖరి అవలంబించిందని గొప్పగా చెప్పుకొన్నారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ఆడిన ఈ నాటకంలో సీమాంధ్ర ప్రజలు మోసపోయారు. అయితే ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే బీజేపీ సీమాంధ్రకు అన్యాయం జరిగిందని, దానికోసం రాజ్యసభలో పోరాడుతామని మొసలి కన్నీరు కారుస్తోంది. కానీ, రెండు పార్టీలు కలిసి సీమాంధ్ర ప్రజలను ఇంత దారుణంగా వంచించిన తరువాత కూడా ఆ పార్టీలు ప్రజలని మభ్యపెట్టాలని ప్రయత్నించడం, తమ మాటలను ప్రజలు నమ్ముతారని భ్రమలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.   కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో , కేంద్రంలో తిరిగి అధికారంలోకి రాగలిగినపుడు ఆ హామీలకు విలువ ఏమయినా ఉంటుంది. లేకుంటే, తరువాత అధికారంలోకి వచ్చే బీజేపీ వాటిలో ఎన్ని అమలు చేస్తుందో, ఎన్నిటికి కొర్రీలు వేసి తప్పించుకొంటుందో ఎవరికీ తెలియదు. గతంలో విడిపోయిన రాష్ట్రాలకే ఇంతవరకు అతీగతీ లేనప్పుడు, లక్షల కోట్లు ఖర్చు వెచ్చించి మళ్ళీ మొదటి నుండి పునర్నిర్మాణం చేయవలసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, కాంగ్రెస్, బీజేపీలు పట్టించుకొంటాయని భావించడం అడియాశే అవుతుంది. కాంగ్రెస్ చేసిన ఈ దుశ్చర్యకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కనీసం మరో ఒకటి రెండు దశాబ్దాలపాటు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అందుకు ప్రతిగా తమను ఇంత ఘోరంగా వంచించిన కాంగ్రెస్, బీజేపీలు కూడా త్వరలో జరగనున్న ఎన్నికలలో తగు మూల్యం చెల్లించుకొనేలా ప్రజలే శిక్షించాలి. తమ ఆత్మాభిమానంపై చావుదెబ్బ తీసిన ఆ రెండు పార్టీలకు తగిన గుణపాటం చెప్పవలసి ఉంటుంది.

పురందేశ్వరి దంపతులు కాంగ్రెస్ కి గుడ్ బై

  రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఈ రోజు చాలా మంది మంత్రులు, శాసనసభ్యులు తమ పదవులకు, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామాలు చేసారు. అందులో ప్రముఖంగా పేర్కొనవలసిన వారు కేంద్రమంత్రి పురందేశ్వరి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, పార్ధ సారధి, ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్ ఉన్నారు. ఇంకా శాసనసభ్యులలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, యూవీ రమణ మూర్తి (యలమంచిలి), షాజహాన్ బాష (మదనపల్లి), రమేష్ బాబు( పెందుర్తి, వైజాగ్); రామారావు (తెదేపా-కొవ్వూరు) శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా మరికొందరు కూడా రేపు రాజీనామా చేయనున్నారు. అయితే అందరికంటే ముందుగా రాజీనామా చేస్తారనుకొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇంకా ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియలేదు. బహుశః రేపు ఉద్యమ 10.30గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన తరువాత రాజీనామా చేయవచ్చని సమాచారం. ఆయనతో బాటు కనీసం పాతిక మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రేపటితో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ దాదాపు సగంపైగా ఖాళీ అయిపోవచ్చును. విజయవాడ యంపీ లగడపాటి రాజగోపాల్ తను రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం దీనికి సిద్దపడే ముందుకు వెళ్ళింది గనుక పెద్దగా చింతించకపోవచ్చును. అదేవిధంగా ఇప్పుడు వీరందరూ రాజీనామాలు చేసినందున కొత్తగా ఒరిగేదేమీ ఉండదు.   బహుశః రేపటి నుండి బొత్ససత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతారేమో.ఇంట్లో శవం లేచి లేస్తే ఒకళేడుస్తుంటే, పోనీలే మంచం ఖాళీ అయిందని మరొకరు సంతోషించినట్లుంది ఆయన పని.  

విభజన బిల్లుపై సుప్రీంకు కావూరి

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యంగా విరుద్దమని, దీనిపైన సుప్రీం కోర్టుకు వెళ్తానని కేంద్రమంత్రి సాంబశివరావు అన్నారు. కోర్ట్ ఈ బిల్లుని కొట్టివేస్తుందని అయన అన్నారు. మరోవైపు విభజన అనంతరం పదేళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండనుంది. ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్‌కు కట్టబెట్టడంపై తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. తెలంగాణ విషయంలో భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంభించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అన్నారు. తెలంగాణ బిల్లును వెంటనే రాజ్యసభకు తీసుకొస్తామన్నారు. లోకసభలో విభజన బిల్లుకు మొత్తం 38 సవరణలు ఆమోదం పొందాయని తెలిపారు.

ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడంపై మనస్థాపం చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజనను ఆపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశానని, ఇలాంటి రాజకీయాల్లో తాను ఇమడలేనని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి రావొద్దన్నారు. ఈ ఘటన కొత్త రాష్ట్రాల డిమాండ్‌కు ఊతమిస్తుందని లగడపాటి వెల్లడించారు. ఇక నుండి ప్రజలంతా భారతీయులుగా, తెలుగువారిగా కలిసి మెలిసి ఉండాలని, రాష్ట్ర విభజన గురించి తాను ఇప్పుడు ఏం మాట్లాడిన ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఇక తాను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగలేనని, ప్రజాస్వామ్య దేశంలో రాచరికపు పోకడలు అన్యాయమని ఆయన బాధను వ్యక్తం చేశారు.

మజువాణితో తెలంగాణ బిల్లు ఆమోదం

      తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును సభ ఆమోదించినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. తెలంగాణ బిల్లుపై కేవలం 23 నిమిషాలు మాత్రమే చర్చించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లును లోక్ సభ ఆమోదించింది. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అధికారికంగా పూర్తయినట్టే. ఇక బిల్లును రేపు లేదా ఎల్లుండి రాజ్యసభకు పంపనున్నారు. అక్కడ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే కావచ్చు. 60 ఏళ్ల తెలంగాణ కల నెరవేరిందని, తెలంగాణ వాదులు సంయమనంతో ఉండాలని, సీమాంధ్ర సోదరులను అక్కున చేర్చుకుని అండగా ఉంటామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా కలిసింది, రెండు రాష్ట్రాలుగా విడిపోయిందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. ఈ విజయం కేసీఆర్, జయశంకర్ లదే అని చెప్పారు. హైదరాబాదులో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ నగరంలో అందరూ హాయిగా బతకవచ్చని చెప్పారు. కోట్లాదిమంది తెలంగాణ కలను సోనియాగాంధీ నిజం చేసిందని, ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు.

మంత్రి గంటా రాజీనామా

      కాంగ్రెస్ పార్టీకి, మంత్రి పదవికి రాష్ట్ర ఓడరేవులు, మౌలిక సదుపాయాల కల్పనా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయాన్ని గంటా తొలుత నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ గతంలో మంత్రి పదవికి ఆయన రాజీనామా కూడా చేశారు. దానిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదించలేదు. గంటా శ్రీనివాస రావు తన రాజీనమా లేఖను గవర్నర్ నరసింహన్‌కు ఫాక్స్ ద్వారా పంపించారు. గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు కొంత మంది కాంగ్రెసు శాసనసభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారని అంటున్నారు.

సోనియాకి దమ్ము౦దా?: మోదీ

      కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలపై బీజేపీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ కర్ణాటక దావణగెరె సభలో ప్రసంగిస్తూ...కాంగ్రెస్ పార్టీపై నిప్పులు కురిపించారు. యూపీఏను అధికారంలోకి తీసుకువచ్చిన ఆంధ్రప్రజలకి కాంగ్రెస్ వెన్నుపోటు పోడిచిందని అన్నారు. ఆంధ్రాలో అడుగుపెట్టే దమ్ము సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి వున్నాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని అన్నారు. సీమాంధ్రకు న్యాయం చేసే పరిస్థితులలో కాంగ్రెస్ లేదని, విభజనపై ఆహంకారంతో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.