అన్నవరం ప్రసాదం ఇక వంద గ్రాములే

  మీసాల స్వామిగా పేరొంది అన్నవరం సత్యనారాయణ స్వామి భక్తులకు ఇదో షాక్. స్వామివారి ప్రసాదం తయారీ ఖర్చులు పెరగడంతో ధర పెంచితే భక్తులు ఆగ్రహిస్తారని, బరువు తగ్గించేశారు. ఇన్నాళ్లూ స్వామివారి బంగీ ప్రసాదం 150 గ్రాములుండగా దాన్ని వంద గ్రాములకు కుదించారు. దినుసుల ధరలన్నీ పెరగడంతో ఏడాదికి 25 లక్షల ఖర్చు పెరిగిందని, అందువల్ల బరువు తగ్గించక తప్పలేదని ఈవో వెంకటేశ్వర్లు చెబుతున్నారు. అయితే, రేటు మాత్రం పది రూపాయలుగానే ఉంచామన్నారు. ఏవేం పెరిగాయి. నెయ్యి.. గతంలో రూ. 292, ఇప్పుడు 377 గ్యాస్ ధర.. 200 పెంపు గోధుమ ఇప్పుడు కిలో రూ.24 చక్కెర కిలో రూ. 29 ప్యాకర్ల చార్జీ.. గతంలో 35 పైసలు, ఇప్పుడు 50 పైసలు

చిత్తూరు నేతలిద్దరూ ఇక మాజీలే

   చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి పదవిని పొందిన రెండో వ్యక్తిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రికార్డుల్లో నిలిచిపోయారు. ఆయన, ఆయనతో పాటు మంత్రి గల్లా అరుణకుమారి మాజీలు అయ్యారు. రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ చేసిన సిఫార్సులకు ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేయడంతో నల్లారి, గల్లా తమ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు మాత్రమే. చిత్తూరు జిల్లా నుంచి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 1983లో తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి న తరువాత ఎన్నికైన రెండు నియోజకవర్గాల్లో తిరుపతికి రాజీనామా చేసి గుడివాడ నుంచి కొనసాగారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఇద్దరు కీలక నేతలు ఒకరు ముఖ్యమంత్రిగాను మరొకరు ప్రధాన ప్రతిపక్ష నేతగాను ఉన్న సమయంలోనే రాష్ట్ర విభజన జరిగింది.

ఒక్కటవుతున్న బొజ్జల, నాయుడు?

  ఒక్కటవుతున్న బొజ్జల, నాయుడు? ఒకనాటి గురుశిష్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎస్‌సీవీ నాయుడు ఒకే వేదికపై కనిపించారు. టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రథమ శిష్యుడి గా ఎస్‌సీవీనాయుడు పేరుపొందారు. కానీ ఎస్‌సీవీ నాయయుడు 2004లో వైఎస్ సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరి గురువు బొజ్జల పైనే పోటీచేసి గెలిచారు. మరోసారి 2009 ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో బొజ్జల, ఎస్‌సీవీ తలపడ్డారు. ఈ సారి విజయం బొజ్జల వైపు నిలచింది. అయితే కొంతకాలంగా ఎస్‌సీవీ నాయుడు టీడీపీలో చేరి నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.   మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ నుంచి స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పించేందుకు మంత్రి గల్లా అరుణకుమారి బుధవారం శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (టీడీపీ), మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి (కాంగ్రెస్) ఒకే వేదికపై పలకరించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ ఆవరణలో ఉన్న పొగడచెట్టు కింద కూర్చుని కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో మంత్రితో స హా ఈ నేతలంతా చెట్టు కింద కూర్చుని 30 నిమిషాలు ముచ్చటలాడారు.

తెలీదు.. గుర్తులేదు.. చెప్పలేను: రామోజీరావు

  ‘ఈనాడు’ పత్రిక వార్తా సేకరణ విభాగమైన ‘న్యూస్‌టుడే ’ ఎక్కడుందో తనకు తెలియదన్నారు ఆ పత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావు. దాని రిజిస్టర్డ్ ఆఫీసు హైదరాబాద్‌లోని తన ఈనాడు ఆవరణలోనే ఉందన్న సంగతి కూడా తెలియదనే చెప్పారాయన. కోర్టు సాక్షిగా ఆయన ఇలా ప్రతిదానికీ తనకు తెలియదని, గుర్తులేదని సమాధానాలు ఇవ్వటంతో.. ‘‘మీరు అవసరానికి అబద్ధాలాడుతున్నారు! ఔనా?’’ అని ప్రశ్నించారు ప్రతివాది తరఫు న్యాయవాది. ఇదంతా శనివారం కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగుప్ప జూనియర్ మున్సిఫ్ కోర్టులో జరిగింది. తనకు వ్యతిరేకంగా ‘ఈనాడు’ పత్రిక ప్రచురించిన కథనాలపై గనుల యజమాని, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి 2005లో పరువు నష్టం దావా వేశారు. దీనికి సంబంధించి ఆయన బెయిలు కోసం గతంలో స్వయంగా కోర్టుకు హాజరయ్యారు కూడా. రెండోసారి నిందితుడిగా తన వివరణ ఇచ్చారు. మూడోసారి శనివారం క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు పాటిల్ సిద్ధారెడ్డి, రవిచంద్ర ఆయన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పరువునష్టం వార్తను ప్రస్తావించిన న్యాయవాదులు రామోజీని వేసిన ప్రశ్నలు, ఆయనిచ్చిన సమాధానాలు ఇలాఉన్నాయి..   లాయర్: ఈనాడు 23 ఎడిషన్లకీ మీరేనా చీఫ్ ఎడిటర్?   రామోజీ: అవును నేనే. కానీ ఏ పేపర్లో ఏది పబ్లిష్ చేయాలన్నది వాళ్ల ఇష్టం. నేను చెప్పను.   లా: ఈ పరువు నష్టం వార్త రాసిందెవరు?   రా: నాకు తెలీదు. అయినా ఇది పరువు నష్టం వార్త కాదు.   లా: ఇది పరువు నష్టం వార్త కాదన్నది మీ అభిప్రాయమా? నిర్ణయమా?   రా: నా అభిప్రాయం మాత్రమే.   లా: ఈ వార్తలు మీకు తెలియకుండానే పబ్లిష్ చేశారా?   రా: మాకు న్యూస్‌టుడే అనే ఏజెన్సీ వార్తలు సప్లయ్ చేస్తుంది. వాటినే ప్రచురిస్తాం. అది ఇండిపెండెంట్ ఏజెన్సీ. (వాస్తవానికి ఇది ఈనాడుకు చెందిన వార్తా సంస్థ)   లా: అంటే న్యూస్‌టుడేతో మీకు ఎలాంటి సంబంధం లేదంటారా?   రా: అవును. దాంతో మాకెలాంటి సంబంధం లేదు.   లా: న్యూస్‌టుడే డెరైక్టర్ గోపాలరావు మీకు తెలుసా?   రా: తెలీదు. లా: ఆయన మీ ఉషోదయా హెచ్‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ కదా! ఈనాడు బిల్డింగ్‌లోనే ఉంటారు కదా?   రా: ఏమో! నాకు తెలీదు.   లా: ఏడాది కిందట న్యూస్‌టుడే ఉద్యోగులందరినీ ఉషోదయ సంస్థలో విలీనం చేశారు. ఆ సంగతైనా తెలుసా?   రా: ఏమో నాకు తెలీదు. ఒకసారి చూడాలి.   లా: న్యూస్‌టుడే అడ్రస్ ఎక్కడ? రా: ఏమో! నాకు తెలీదు.   లా: అది మీ ఈనాడు కాంపౌండ్‌లోనే ఉంది కదా! దాని రిజిస్టర్డ్ చిరునామా అదే కదా!! (ఆర్‌ఓసీ పేపర్లు చూపిస్తూ)   రా: ఏమో.. నాకు తెలీదు. చూడాలి.   లా: న్యూస్‌టుడే మరో డెరైక్టర్ బాపినీడు చౌదరి తెలుసా?   రా: తెలుసు. ఎందుకంటే ఆయన ఈటీవీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.   లా: న్యూస్‌టుడే కాకుండా వేరే తెలుగు ఏజెన్సీల నుంచి మీరు వార్తలు తీసుకుంటారా?   రా: తీసుకోం.   లా: మీపై హైకోర్టులో 200కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి కదా?   రా: ఏమో నాకు తెలీదు.   లా: మీరు ఇదివరకు ఒక పరువు నష్టం కేసులో రూ.10 వేలు జరిమానా కూడా కట్టారు కదా?   రా: ఏమో! నాకు గుర్తు లేదు. మరో ప్రశ్నకు సమాధానమిచ్చిన రామోజీ... తాను 15 ఏళ్లుగా ఫిలిం సిటీలోనే ఉంటున్నానని, ఈనాడులో ఏం జరుగుతోందో తనకు తెలియదని చెప్పారు. తాను అన్ని వార్తలూ చూడనని, ఎడిటోరియల్, పాలసీ వ్యవహారాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటానని అన్నారు.

జుకర్‌బర్గ్ సంపద డబుల్

  సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్(29 ఏళ్లు) సంపద దూసుకుపోతోంది. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే ఆయన సంపద దాదాపు రెట్టింపు స్థాయిలో ఎగబాకింది. దీనంతటికీ ఫేస్‌బుక్ షేరు ధర పరుగే కారణం. 2012 మే 18న ఫేస్‌బుక్ పబ్లిక్ ఇష్యూ సమయంలో జుకర్ బర్గ్ సంపద 18 బిలియన్ డాలర్లు. ఇప్పుడిది 33 బిలియన్ డాలర్లకు ఎగసింది. తాజా గణాంకాల ప్రకారం జుకర్‌బర్గ్ వద్ద 47.89 కోట్ల షేర్లు ఉన్నాయి. కంపెనీలో ఆయన వాటా 19.6%. 2004 ఫిబ్రవరిలో ఆరంభమైన ఫేస్‌బుక్ సంస్థ గత నెలలోనే పదేళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న యూజర్ల సంఖ్య 123 కోట్లు పైనే. మొబైల్ చాటింగ్ అప్లికేషన్ సేవల దిగ్గజం వాట్స్‌యాప్‌ను ఏకంగా 19 బిలియన్ డాలర్లు(రూ.1.18 లక్షల కోట్లు) వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు ఫేస్‌బుక్ ఇటీవలే ప్రకటించడం తెలిసిందే.

ఎండొచ్చినా.. వానొచ్చినా కరెంటు కోతే

  మన రాష్ట్రంలో గట్టిగా ఎండలు వచ్చినా, సరిగ్గా నాలుగు చినుకులు పడినా కరెంటు మాత్రం పోవడం ఖాయం. గడిచిన రెండు రోజులుగా రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో ఇలాగే ఉంటోంది. గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో చాలా సేపటి పాటు శివారు ప్రాంతాలలో కరెంటు కోతలు అమలు చేశారు. కొద్ది పాటి వర్షానికే కోఠి లాంటి ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోవడం, ట్రాఫిక్ జామ్ లాంటివి కనిపించాయి. ఇక ఆదివారం సాయంత్రం అయితే దాదాపు గంట పాటు గట్టిగానే వాన కురిసింది. అయితే సెలవు రోజు కాబట్టి ట్రాఫిక్ మీద మరీ అంత ఎక్కువ ప్రభావం కనిపించలేదు. కరెంటు మాత్రం ఎడా పెడా తీసేస్తూనే ఉన్నారు.

గల్ఫ్ లో పేలుడు.. ఐదుగురు భారతీయుల మృతి

  ఖతార్ రాజధాని దోహాలో భారీ పేలుడు జరిగి, ఐదుగురు భారతీయులు సహా పదకొండు మంది విదేశీయులు మృతి చెందారు. గురువారం నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దోహాలోని టర్కిష్ హోటల్ ల్లో సంభవించిన భారీ పేలుడులో మొత్తం 11 మంది మరణించారని, వారిలో 5గురు భారతీయులున్నారని ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటనలో మరో 35 మంది గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి భారతీయులను గుర్తించారు. మృతులలో రియాస్ ఖిజాకె మానోలిల్, అబ్దల్ సలీం, జకారియా పదింజారే, అనాకండి, వెంకటేష్, షేక్ బాబు అనే ఐదుగురు భారతీయులని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురు నేపాల్ దేశస్థులు ఉండగా, మరో ఇద్దరు ఫిలిప్పీన్స్ దేశస్థులు ఉన్నారు. భారతీయుల మృతదేహాలను స్వదేశానికి పంపేందుకు అక్కడి రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.

కావూరి కూడా జంప్ జిలానీయేనా?

  కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు. ఈ విషయం వాళ్లూ వీళ్లూ కాదు.. స్వయంగా కావూరే చెప్పారు. 47 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, కేడర్‌, ప్రజలతో మాట్లాడి భవిష్యత్‌ కార్యచరణ ప్రకటిస్తానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి 1984 నాటి కంటే అద్వాన్నంగా ఉందని అన్నారు. పార్టమెంట్‌లో టీబిల్లు అమోదించిన విధానం అవమానకరమని కూడా కావూరి విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను బలిపెట్టి ఇతర పార్టీల మద్దతుతో అధికారంలోకి రావడానికి విభజన చేయడం దురదృష్టకరమని అన్నారు. తనకు మంత్రి పదవి రానంత వరకు కాంగ్రెస్ పార్టీని, అధిష్ఠాన వర్గాన్ని తెగ తిట్టి పోసి, సమైక్య నినాదం భుజానికెత్తుకున్న కావూరి, ఆ తర్వతా ఒక్కసారిగా స్వరం మార్చి సోనియా, రాహుల్ గాంధీల భజన చేయడం తెలిసిందే. అలాంటిది మళ్లీ ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తే గెలవడం మాట అటుంచి డిపాజిట్లు కూడా రావని తెలిసిపోయినట్లుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఈ తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన కూడా జంపు జిలానీల లిస్టులో ఉన్నట్లు అర్థమైపోతోంది.

కేసీఆర్ కి అమావాస్యే అడ్డొచ్చిందా?

  తెలంగాణ వచ్చేస్తోంది కాబట్టి.. తెలంగాణా రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భవితవ్యం గురించి చర్చించేందుకు శనివారం జరగాల్సిన టీఆర్ఎస్ కీలక సమావేశం వాయిదా పడింది. ఆ రోజు అమవాస్య కారణంగా పొలిట్ బ్యూరో సమావేశాన్ని 3వ తేదీన నిర్వహిస్తామని టీఆర్ ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు స్వయంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టాలా.. లేక కమలంతో కదం కలపాలా అనే విషయం తేల్చుకోడానికి టీఆర్ఎస్ ఓ భారీ సమావేశం నిర్వహించాలనుకుంది. దానికి శనివారాన్ని ముందు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఆరోజు పార్టీ పొలిట్ బ్యూరో, పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ, రాష్ట్ర కార్యవర్గం కలిసి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం అవుతాయని ఆ పార్టీ ఇంతకుముందు ప్రకటించింది.   కానీ, మధ్యలో ఏమైందో గానీ.. కాంగ్రెస్ పార్టీకి, కేసీఆర్ కు మధ్య సంబంధాలు ఒక దశలో కాస్త చెడాయి. దాంతో విలీనం లేదా పొత్తు అనే విషయాన్ని శనివారమే తేల్చేస్తామని ముందు చెప్పినా.. తర్వాత మళ్లీ బీజేపీతో దోస్తీ కడితే ఎలాగుంటుందని కేసీఆర్ ఆలోచించారు. అంతే, వెంటనే కమలనాథులను సంప్రదించేందుకు వీలుగా తమ కీలక సమావేశాన్ని వాయిదా వేశారు. కానీ ఈ విషయాలన్నింటినీ బయటకు చెప్పేస్తే ఎందుకొచ్చిన తలొనొప్పి అని.. అమావాస్య వంక పెట్టారని వినికిడి.   కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం గురించి కేసీఆర్ సంకేతాలు ఇచ్చారని, తుది నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పగా, కాంగ్రెస్ తో విలీనం కంటే పొత్తే మేలని టీఆర్ఎస్ నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో పాటు ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి కూడా కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ పయనం ఎటు అన్న విషయం సోమవారం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది!

నీలంతో ఆరంభం .. నల్లారితో అంతం

  ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో 58 ఏళ్ళ తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్ గా మిగిలిపోయింది. 1956 నవంబర్ 1న ఏర్పడిన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి నేటివరకూ 16 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో ఎక్కువమంది రాయలసీమ నుంచి వచ్చిన వారే. సామాజిక న్యాయం అనేది అందని అందలమైంది. ఆంధ్రప్రదేశ్ జనాభా రీత్యా అత్యధికశాతం బీసీ వోటర్లు ఉన్నా ఒక్కరికి కూడా సీఎంగా అవకాశం దక్కలేదు. ఎస్టీలు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. ఎస్సీల్లో ఒక్క దామోదరం సంజీవయ్యకు సీఏంగా పని చేసే అవకాశం దక్కగా.. అదీ మూడేళ్ళ ముచ్చటగానే ముగిసింది.   రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 9 మంది సీఎంలుగా పనిచేశారు. కమ్మ కులం నుంచి ముగ్గురు, ఒకరు బ్రాహ్మణ, మరొకరు వైశ్య, వెలమల్లో ఒకరికి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది. రాయలసీమ నుంచి ఆరుగురు, కోస్తాంధ్రకు చెందిన ఆరుగురు, తెలంగాణలోని నలుగురు సీఎం కుర్చీని అధిరోహించారు. 16 మందిలో ఎక్కువ రోజులు పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు చంద్రబాబు సొంతం అవగా.. అతి తక్కువ రోజులు సీఎంగా వ్యవహరించిన వ్యక్తిగా నాదెండ్ల భాస్కరరావు చరిత్ర సృష్టించారు. అనంతపురం జిల్లావాసి అయిన నీలం సంజీవరెడ్డితో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల ప్రస్తానం చిత్తూరు జిల్లాకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ముగిసింది.   నీలంతో ఆరంభమైన సమైక్యాంధ్రప్రదేశ్ ..నల్లారి పాలనతో అంతమై అవశేషాంధ్రప్రదేశ్ గా మిగిలిపోయింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజికవర్గ ముఖ్యమంత్రుల హయాంలోనే ఇరుప్రాంతాల విలీనం.. రెండు ప్రాంతాలుగా విభజన జరగడం యాదృచ్చికమే అయినా చరిత్రపుటల్లో స్థానం సంపాదించుకుంది.

టిడిపికి సత్యవతి రాథోడ్ షాక్

      తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి వలసల జోరు కొనసాగుతుంది. టిడిపి ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, నగేష్ లు పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. సోమవారం టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. వీరేకాక మరికొంతమంది కూడా పార్టీని వీడడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కేసిఆర్ తో ఆమె ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. టిక్కెట్ పైన హామీ కూడా ఆయన హామీ ఇచ్చారట. సామాజిక తెలంగాణ టిడిపితోనే సాధ్యమని, తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని బడువర్గాలకు ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన వలసలు ఆగకపోవడంతో తెలంగాణ టిడిపి నేతల్లో కలవరం మొదలైంది.

కాంగ్రెస్ ని కాదు, విభజనని వ్యతిరేకించా: లగడపాటి

      ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలల్లోనే వుండాల్సిన అవసరం లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. విజయవాడలో తన అనుచరులతో జరిగిన సమావేశంలో రాజకీయాలలోకి తాను తిరిగిరానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో లేకపోయినా తాను ప్రజాసేవ చేస్తానని లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ విషయాన్ని కార్యకర్తలు అర్ధం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమైక్యాంధ్ర అందరి భవిష్యత్ అని తాను నమ్మినట్లు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. రాష్ట్ర విభజనకు విధి సహకరించిందని ఆయన అన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీను విమర్శించలేదని, ఒక్క విభజన విషయంలో కాంగ్రెస్ తీరును మాత్రమే వ్యతిరేకించానని రాజగోపాల్ స్పష్టం చేశారు. అయితే కొందరు అభిమానులు మాత్రం రాజకీయాల్లోకి తిరిగి రావాలని డిమాండ్ చేశారు. వారికి లగడపాటి సర్దిచెప్పారు.

సింగపూర్‌కు అంబరీశ్ తరలింపు?

      తీవ్ర అస్వస్థతకు గురై సుదీర్ఘ కాలంగా బెంగళూరులో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు, ఆ రాష్ట్ర మంత్రి అంబరీశ్‌ను సింగపూర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అంబరీశ్ శ్వాస కోశ ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. అప్పటి వరకు కృత్రిమ శ్వాసతోనే చికిత్సను కొనసాగిసాగించాలని, అయితే ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం నటుడు రజనీకాంత్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉన్నత చికిత్స కోసం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి తీసుకెళ్లాల్సిందిగా అంబరీశ్ సతీమణి సుమలతకు సూచించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ సూచన పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్‌ను సంప్రదించారు. ఆయన సూచన మేరకు ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ రణదీప్ గులేరియా బెంగళూరు చేరుకుని అంబరీశ్ వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించారు. ప్రస్తుతానికి సింగపూర్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. అయినా కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు అంబరీశ్‌ను సింగపూర్‌కు తరలించడానికి వైద్యులు చర్యలు చేపట్టారు.   

తెలుగు ఐఏఎస్ అధికారులు పనికిరారా?

      రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి పదవీ కాలాన్ని పొడిగించడం మీద తెలుగు ఐఏఎస్ అధికారులు మండిపడుతున్నారు. ఇక్కడి కేడర్ లో సమర్థులైన అధికారులు కావల్సినంత మంది ఉండగా వేరే రాష్ట్రానికి చెందిన ఆయనకు పొడిగింపు ఇవ్వడం ఏమిటని సీసీఎల్ఏ ఐవైఆర్ కృష్ణారావు నిలదీశారు. విభజన సమయంలో స్థానిక కేడర్‌లో సమర్థులున్నా గుర్తించకపోవడం దారుణమని ఆయన ఆగ్రహించారు. సమర్థులైన అధికారులు లేనప్పుడు, ప్రతిభావంతులైన అధికారులకు మాత్రమే పదవీ కాలం పొడిగింపు ఇవ్వాలనే నిబంధన ఉందని, ఆ నిబంధనను తుంగలో తొక్కారని విమర్శించారు.   రాష్ట్రానికి చెందిన అధికారులు పనికిరారనే భావన వచ్చేలా, మహంతి పదవీ కాలం పొడిగించడం అఖిల భారత సర్వీసు అధికారులను అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి శుక్రవారం ఐ.వై.ఆర్. ఘాటుగా లేఖ రాశారు. తెలుగు అధికారులను అవమానించేలా వ్యవహరించినందుకు నిరసనగా శనివారం నుంచి 10వ తేదీ వరకు పది రోజుల సెలవుపై వెళుతున్నట్లు సీఎస్‌కు రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. సీఎస్ మహంతి పదవీ కాలం పొడిగించడంపట్ల మిగతా తెలుగు ఐఏఎస్ అధికారులు కూడా భగ్గుమంటున్నారు. దీనిపై త్వరలో రాష్ట్రపతికి లేఖ రాయాలనే యోచనలో ఉన్నారు. చివరివరకు ఐ.వై.ఆర్. సీఎస్ అవుతారని భావించిన  మిగతా ఐఏఎస్ అధికారులు కూడా చివరి నిముషంలో జరిగిన పరిణామాల పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇది రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌లందరినీ అవమానించడమేనని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శామ్యూల్ కూడా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మావోయిస్టులు వర్సెస్ పోలీసులు

      పోలీసులు.. మావోయిస్టుల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టులపై పోలీసులు దాడిచేసి వారిని హతమార్చడంతో.. అందుకు ప్రతీకారంగా అన్నట్లు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో పోలీసు బృందంపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు.100 మంది మావోయిస్టులు పాల్గొన్న ఈ దాడిలో ఒక ఎస్.ఐ, నలుగురు కానిస్టేబుళ్లు మరణించారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఎస్‌ఐ వివేక్‌శుక్లాతో పాటు కానిస్టేబుళ్లు సందీప్‌సాహు, ఛవీలాల్ కాశి, ధనేశ్వర్ మండావి, నావల్‌కిషోర్ శాండిల్య అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు కానిస్టుబుళ్లు పుష్పేంద్ర కుమార్, పర్‌దేశీ రామ్, భగీరథీ మండావి గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్ తరలించినట్లు అదనపు డీజీపీ (నక్సల్ ఆపరేషన్) ఆర్.కె. విజ్ తెలిపారు.

బీజేపీ నేత బంగారు లక్ష్మణ్ కన్నుమూత

      బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ (74) మరణించారు. సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 2000-2001 మధ్య కాలంలో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. తెహల్కా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ సమయంలో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో 1999-2000 మధ్య కాలంలో ఆయన రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 1939 మార్చి 17న జన్మించిన బంగారు లక్ష్మణ్ 1996లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతని భార్య సుశీలా లక్ష్మణ్ కూడ 14వ లోక్సభకు రాజస్థాన్ నుంచి బిజెపి తరపున ఎంపికయ్యారు.

తొడగొట్టిన జగ్గన్న..దామోదరపై ఫైర్

      సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనను టీఆర్ఎస్ నాయకులే కాదని.. కాంగ్రెస్ పార్టీలోని ఒక నాయకుడు కూడా కదిలించలేడని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) తొడగొట్టారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సతీమణి పద్మిని ఈ స్థానం నుంచి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని తలపెడుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినే అయినా, అధిష్ఠానం నిర్ణయానికి మాత్రం తలొంచుతానని జగ్గారెడ్డి చెప్పారు. ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అయితే ఆయన ఒంటికాలిమీద లేచారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు. దొంగ మాటలతో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ పునర్‌ నిర్మాణం కేసీఆర్‌కే కాదు, తమకూ తెలుసునని చెప్పారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కాకుంటే ఆ పార్టీకే నష్టమన్నారు. సొంతంగా పోటీ చేస్తే టీఆర్ఎస్ ఓడిపోతుందని, 10 సీట్లు కూడా రావని అన్నారు. టీఆర్ఎస్ విలీనం చేయకుంటే ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులే మిగులుతారని చెప్పారు. టీఆర్ఎస్‌ విలీనం చేయకపోవడం ప్రజలు, కాంగ్రెస్‌ను మోసం చేయడమే అన్నారు. పార్టీ ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానని జగ్గారెడ్డి దీమా వ్యక్తం చేశారు.

నల్లారి వారి కాన్వాయ్ వెనక్కి

  'అధికారాంతమున చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్' అన్నారు పెద్దలు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి అలాగే అయ్యింది. లోక్ సభతో పాటు రాజ్యసభలో కూడా తెలంగాణా బిల్లు ఆమోదం పొందడంతో, ఇక చేసేది లేక.. తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఇన్నాళ్లూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇన్నాళ్ల బట్టి ఆయనకున్న కాన్వాయ్ విషయంలో అధికారులు వేలుపెట్టలేదు. ఇక రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని తెలిసిపోయిన తర్వాత ప్రోటోకాల్ అధికారులు నల్లారి వారి ఇంటికి వెళ్లి ఆయన కాన్వాయ్ నుంచి మూడు వాహనాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చల్లగా చెప్పారు. ఇక ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మాజీ ముఖ్యమంత్రికి కల్పించే స్థాయి భద్రత, ఆయనకు వ్యక్తిగతంగా ఉండే ముప్పును పోలీసులు అంచనా వేయడాన్ని బట్టి కల్పించే భద్రత మాత్రమే ఉంటాయన్న మాట. మొన్న దసరా సమయంలోనే కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి రెండు అత్యాధునిక ఎస్ యూ వీలను తన కాన్వాయ్ లో చేర్చారు. దాంతో దేశంలో అత్యంత ఖరీదైన కాన్వాయ్ ఉన్న ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. కాన్వాయ్ లోకి కొత్త కార్లు కావాలంటూ ఆదేశాలతో అధికారులు రెండు ల్యాండ్‌ క్రూయిజర్ ప్రాడో కార్లను కొనుగోలు చేశారు. ఒక్కో కారు ధర కోటిన్నర కాగా, వాటిని బుల్లెట్ ప్రూఫ్ చేయించడానికి మరో అరకోటి వెచ్చించారు. దీంతో రెండింటికి కలిపి నాలుగు కోట్లు ఖర్చయింది. ఇప్పుడు వాటన్నింటినీ వెనక్కి తీసుకున్నట్లే అయ్యింది. దసరా కానుకగా కిరణ్ తనకు తానే ఈ రెండు ఎస్ యూవీలను కొనుగోలు చేసి గిప్ట్ గా ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయన్నమాట.