విజయవాడ ఎంపీ టిక్కెట్ : పవన్ కళ్యాణ్ మనస్తాపం?

  విజయవాడ తెలుగుదేశం ఎంపీ టిక్కెట్ వ్యవహారం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ని మనస్తాపానికి గురిచేసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టడానికి, బహిరంగ సభలు నిర్వహించడానికి వెన్నుదన్నుగా నిలిచిన పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ ఎంపీ తెలుగుదేశం టిక్కెట్ ఇప్పించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించాడు. చంద్రబాబు నాయుడు కూడా దీనికి సానుకూలంగా స్పందించాడు. అప్పటి వరకూ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వున్న కేశినేని నానిని పక్కన పెట్టి పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వడానికి అంగీకరించారు. అయితే చంద్రబాబు నిర్ణయం కేశినేని నానితోపాటు స్థానిక తెలుగుదేశం కార్యకర్తలకు రుచించలేదు. చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోలేదని బహిరంగంగానే విమర్శించడం ప్రారంభించారు. కేశినేని నాని కూడా నిరసన గళాన్ని వినిపించడం, రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాననే ‘సౌండ్’ ఇవ్వడంతో సదరు సీటు కేశినేని నానికే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే ఈ ఇష్యూలో విజయవాడ తెలుగుదేశం కార్యకర్తలు పవన్ కళ్యాణ్‌ని ఘాటుగా విమర్శించారు. మధ్యలో దూరిపోయి కేశినేని నానికి అన్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. టోటల్‌గా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణే ముద్దాయిలా నిలిచాడు. దీంతో పవన్ కళ్యాణ్ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇస్తున్నట్టు ప్రకటించడానికి ముందే స్థానిక తెలుగుదేశం క్యాడర్‌ని ఒప్పించి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగి వుండేది కాదని పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది.

కేశినేని నానికే విజయవాడ ఎంపీ టిక్కెట్!

  కేశినేని నానికే విజయవాడ పార్లమెంట్ స్థానానికి టీడీపి టిక్కెట్ ఖారారు అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన వత్తిడి మేరకు ఆయనకు టిక్కెట్ ఇవ్వాలని బాబు భావించారు. అయితే ఎప్పటి నుంచో విజయవాడ టీడీపీ అభ్యర్థిగా అందరూ భావిస్తున్న కేశినేని నానికి ఈ నిర్ణయంతో షాక్ తగిలింది. అయితే ఆయన దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. విజయవాడ స్థానం నుంచే పోటీ చేస్తానని భీష్మించారు. ఆయనకు సర్ది చెప్పాలని బాబు ప్రయత్నించినప్పటికీ కేశినేని నాని దారిలోకి రాలేదు. రెబల్ అభ్యర్థిగా బరిలో నిలబడే అవకాశాలు కనిపించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేశినేని నానినే విజయవాడ స్థానం నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మోడీ భార్యకి భారతరత్న ఇవ్వాలి: కాంగ్రెస్ లీడర్ వెటకారం

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వైవాహిక జీవితం మీద కాంగ్రెస్ నాయకుల దాడి నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. స్వయానా రాహుల్ గాంధీ కూడా నిన్నటి వరకూ దాడి చేసి, సదరు దాడి తనమీదే రివర్స్ అవుతూ వుండటంతో నోరు మూసుకున్నాడు. అయితే మిగతా కాంగ్రెస్ నాయకులు మాత్రం మోడీ మీద మాటల తూటాలు వదులుతూ పైశాచిక ఆనందాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా అస్సాం ముఖ్యమంత్ర తరుణ్ గొగోయ్ బోలెడంత వెటకారంతో కూడిన ప్రకటన చేశాడు. ‘మోడీ తనను ఎంతమాత్రం పట్టించుకోకపోయినా ఆమె ఎంతో ఓర్పుగా ఉన్నారు. సహనానికి ప్రతీకగా తన బాధని భరిస్తున్నారు. అంచేత నేను మోడీ భార్యకి ‘సహనం’ విభాగంలో భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాను’ అన్నారు. యశోదాబెన్‌కి భారతరత్న ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి హాదాలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నట్టు తరుణ్ గొగోయ్ ప్రకటించాడు. సహనం విషయంలో యశోదాబెన్ భారతదేశానికి మాత్రమే కాదు.. యావత్ ప్రపంచానికీ ఆదర్శం అని గొగోయ్ అన్నాడు.

ప్రియాంకకి పిన్ని వార్నింగ్!

      వరుణ్‌గాంధీ బీజేపీ నాయకుడు. మొన్నీమధ్య రాహుల్ గాంధీ నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరిగిందని నోరుజారి చెప్పి తన తల్లిచేత తలంటు పోయించుకున్నాడు. పాపం ఇతనేమో రాహుల్ గురించి పాజిటివ్‌గా మాట్లాడితే, ప్రియాంక మాత్రం అతని గురించి వెటకారంగా మాట్లాడింది. ‘‘వరుణ్‌గాంధీ నా సోదరుడు. కానీ, పాపం అతనికి బొత్తిగా లోకజ్ఞానం లేదు. తప్పు దారిలో నడుస్తున్న అతన్ని మంచి మార్గంలో నడిపించాల్సిన అవసరం వుంది’’ అని సోనియాగాంధీ గారాలపట్టి ప్రియాంక చేసిన కామెంట్లను వరుణ్ గాంధీ తల్లి, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ తీవ్రంగా ఖండించడంతోపాటు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ‘‘వరుణ్ తప్పు దోవలో నడుస్తుంటే, దేశమే అతన్ని సరైన దారిలో నడిపిస్తుంది. నీ సలహాలు అవసరం లేదు’’ అని మేనక స్పందించారు.

బీజేపీకి ప్రచారం : ఆలోచించి చెప్తానన్న పవన్ కళ్యాణ్

  పవన్ కళ్యాణ్‌జీ ఎన్నికల ప్రచారానికి రండి.. బీజేపీని బలపర్చండి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ని సోమవారం స్వయంగా కలసి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటకలో కూడా పార్టీకి ప్రచారం చేయాల్సిందిగా కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కిషన్ విజ్ఞప్తిని విన్న పవన్ కళ్యాణ్ తన సన్నిహితులతో ఈ విషయం మీద చర్చించి రెండు రోజుల్లో ప్రచారం విషయంలో నిర్ణయం తీసుకుంటానని కిషన్‌రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. నరేంద్రమోడీ విధానాలు నచ్చిన పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చారని, త్వరలో ప్రచారం చేస్తారని భావిస్తున్నామని అన్నారు. పవన్ చేసే ప్రచారం బీజేపీతోపాటు తెలుగుదేశం పార్టీకి కూడా ఉపయోగపడే అవకాశం వుందని ఆయన అన్నారు.

మోడీ పెళ్ళి ఇష్యూ: ఎవరికి ఎంతమంది భార్యలు?

      బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తనకు పెళ్ళి అయిన విషయం తాను స్వయంగా ప్రకటించలేదని, సొంత భార్య విషయమే బయటపెట్టని వ్యక్తి దేశానికి ఏం న్యాయం చేస్తాడని ఇటు యుపిఎ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తోపాటు యుపిఎ మిత్రపక్ష పార్టీలు మోడీమీద దాడి మొదలుపెట్టాయి. ఈ దాడిని బీజేపీ వర్గాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి.   మోడీ వ్యక్తిగత జీవితం, ఎప్పుడూ చిన్నప్పుడు జరిగిన పెళ్ళి విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న పార్టీలకు బీజేపీ నాయకులు కీలెరిగి వాత పెడుతున్నారు. ఉత్తరభారదేశంలో దీనికి టిట్ ఫర్ టాట్ అని రియాక్ట్ అవుతున్నారు. ఉత్తరభారతదేశంలో ఈ అంశం మీద బీజేపీ అతికిస్తున్న వాల్ పోస్టర్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆ వాల్ పోస్టర్లలో యుపిఎ భాగస్వామ్య పార్టీల్లో ఎవరికి ఎంతమంది భార్యలున్నారో ప్రకటించారు. ఈ వాల్ పోస్టర్‌లో ప్రధానంగా జవహర్ లాల్ నెహ్రూ విదేశీ వనితకు ముద్దు పెడుతున్న ఫొటో వుంది. అలాగే భార్యల లిస్టు విషయానికి వస్తే దిగ్విజయ్ సింగ్‌కి, ములాయం సింగ్ యాదవ్‌కి ఇద్దరేసి భార్యలు వున్నారట. శశి థరూర్‌కి ముగ్గురు భార్యలు. సమాజ్ వాది పార్టీ నాయకుడు ఆజమ్‌ఖాన్‌కి మొత్తం ఆరుగురు భార్యలున్నారు. ఇంతమంది భార్యలున్న వీళ్ళు బెటరా? దేశానికి సేవ చేయడం కోసం వైవాహిక జీవితాన్ని వదులకున్న మోడీ బెటరా అనే అర్థం వచ్చేలా ఆ పోస్టరుంది. ఈ పోస్టర్ మీద యుపిఎ భాగస్వామ్య పార్టీకు కిక్కురుమనడం లేదు.

పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కలుస్తారా?

      పవన్ కళ్యాణ్ కళ్యాణాల హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ప్రేమించి పెళ్ళాడిన నందినికి దూరమైన పవన్ కళ్యాణ్ తనతో ‘బద్రి’లో నటించిన రేణూ దేశాయ్‌కి చేరువయ్యాడు. ఆ తర్వాత నందినికి విడాకులిచ్చేశాడు. రేణూ దేశాయ్‌తో కొంతకాలం సహజీవనం, మరికొంతకాలం వైవాహిక జీవితం గడిపి, ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. కాలక్రమేణా రేణూ దేశాయ్‌తో వైవాహిక జీవితాన్ని ముగించేసి, ‘సెటిల్’ చేసుకున్నాడు.   ఇప్పుడొక విదేశీయురాలిని పెళ్ళాడాడు. ఈ హిస్టరీ ఇలా వుంటే, పవన్ కళ్యాణ్ నుంచి దూరమైపోయి తన స్వస్థలమైన పూణే వెళ్ళిపోయిన రేణు దేశాయ్ ఒక హిందీ సినిమాకి దర్శకత్వం వహిస్తూ బిజీగా వున్నారు. అయితే  తాజాగా రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌కి చేరువ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె తన ఫేస్ బుక్ అకౌంట్లో పవన్ కళ్యాణ్ గురించి చేసిన పాజిటివ్ కామెంట్లు దీనికి బలాన్నిస్తున్నాయి. రేణు దేశాయ్ పవన్ గురించి ఫేస్ బుక్‌లో చేసిన కామెంట్లు చాలా ఆసక్తికరంగా వున్నాయి. పవన్ కళ్యాణ్ చాలా ఉన్నత ఆశయాలున్న వ్యక్తి అట. పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదైనా చేయాలని నిరంతరం తపించే వ్యక్తి అట. తమమధ్య అభిప్రాయ భేదాలు వుండటం, వాటివల్ల తాము విడిపోవడం జరిగినప్పటికీ, పవన్ కళ్యాణ్ అంటే తనకెంతో గౌరవమట. రేణు దేశాయ్ సడన్‌గా ఇలా పబ్లిగ్గా పవన్ కళ్యాణ్‌ని పొగడ్డం చూస్తుంటే వీరిద్దరూ మళ్ళీ చేరువవుతారేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి.

విజయవాడలో లగడపాటి పోటీ?

      రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయబోనని ప్రకటించిన విజయవాడ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇప్పటి వరకూ తన ప్రతిజ్ఞకే కట్టుబడి వున్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్నానని ప్రకటించినప్పటికీ కిరణ్ కుమార్ నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీలో లగడపాటి చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు.   తాజాగా లగడపాటి విజయవాడ స్థానం నుంచి  పోటీ చేయాలని ఆయనపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. సీమాంధ్రలో జై సమైక్యాంధ్ర పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా వుంది. అసెంబ్లీ స్థానాల నుంచి కొంతమంది అభ్యర్థులు గెలిచే అవకాశం వున్నప్పటికీ పార్లమెంట్ స్థానాల నుంచి గెలిచే సత్తా వున్న వ్యక్తులు ఆ పార్టీకి కొరవడ్డారు. ఆ సత్తా వున్న ఒకే ఒక వ్యక్తి లగడపాటి రాజగోపాల్ అస్త్రసన్యాసం చేసి పోటీకి దూరంగా వున్నారు. మరోవైపు విజయవాడలోని లగడపాటి అనుకూల వర్గం కూడా లగడపాటి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో వున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వాళ్ళు ఎప్పటి నుంచో లగడపాటి మీద ఒత్తిడి తెస్తున్నప్పటికీ లగడపాటి సానుకూలంగా స్పందించనట్టు సమాచారం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో విజయవాడ పార్లమెంటు సీటుకు సంబంధించిన వివాదం ముదిరిపోవడంతో అక్కడ ఆ పార్టీ విజయావకాశాలు సన్నగిల్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి లగడపాటి సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయని జై సమైక్యాంధ్ర పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే సీమాంధ్రలో కీలకమైన పార్లమెంట్ స్థానాన్ని జేసీపీ గెలుచుకున్నట్టయితే పార్టీ ప్రతిష్ట పెరిగే అవకాశం వుందని అనుకుంటున్నారు. లగడపాటి  తన ఒట్టును గట్టుమీద పెట్టి విజయవాడ నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. లగడపాటి తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతున్నారు. లగడపాటి కూడా విజయవాడ నుంచి మళ్ళీ పోటీ చేయడానికి సానుకూలంగానే వున్నారని జేసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

తెదేపా సీమాంధ్ర అభ్యర్ధుల జాబితా

  తెలుగు దేశం పార్టీ తన సీమాంధ్ర అభ్యర్థుల మూడో జాబితాను కూడా ఈరోజు ఉదయం విడుదల చేసింది. అందులో 3 లోక్‌సభ మరియు 32 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ లోక్‌సభ అభ్యర్ధులు అనకాపల్లి - అవంతి శ్రీనివాస్ కాకినాడ - తోట నర్సింహం అమలాపురం - పి.రవీంద్రబాబు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు హిందూపురం - బాలకృష్ణ, భీమిలి - గంటా శ్రీనివాసరావు, కర్నూలు - టీజీ వెంకటేశ్, పాణ్యం - ఏరాసు ప్రతాప్‌రెడ్డి, పాతపట్నం - శత్రుచర్ల విజయరామరాజు, నంద్యాల - శిల్పామోహన్‌రెడ్డి, అవనిగడ్డ-మండలి బుద్ధ ప్రసాద్, విజయవాడ సెంట్రల్-బీ.ఉమామహేశ్వర రావు, ఆచంట-పితాని సత్యనారాయణ, సత్తెనపల్లి-కోడెల శివ ప్రసాద్,   పలాస - జీ.యన్.యన్. శివాజీ,  శ్రీకాకుళం - లక్ష్మీదేవి, నర్సన్నపేట -బీ. రమణమూర్తి,  పార్వతీపురం - చిరంజీవులు, గజపతినగరం - కేఏ నాయుడు, విశాఖ సౌత్ - వాసుపల్లి గణేష్, గాజువాక - పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి - పిలా గోవింద్, యలమంచిలి - పంచకర్ల రమేష్‌బాబు   పాయకరావుపేట - అనిత, రాజంపేట - మల్లికార్జునరెడ్డి, నందికొట్కూరు - లబ్బి వెంకటస్వామి, ఆళ్లగడ్డ - గంగుల ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం - శిల్పా చక్రపాణి రెడ్డి, డోన్ - కేఈ ప్రతాప్, పత్తికొండ - కేఈ కృష్ణమూర్తి, మడకశిర - ఎం వీరన్న,  రైల్వే కోడూరు - వెంకటసుబ్బయ్య, కాకినాడ సిటీ-వీ.వెంకటేశ్వర రావు( కొండబాబు), బాపట్ల-అన్నం సతీష్, గుంటూరు (పశ్చిమం)-మాడుగుల వేణుగోపాల్ రెడ్డి

కేశినేని నానికి చంద్రబాబు టిక్కెటిస్తారా..!

      విజయవాడ టిడిపి పార్లమెంట్ సీటుపై ఉత్కంఠ నెలకొంది. విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేది తానేనని ధీమాగా వున్న కేశినేని నానికి చివరి నిమిషంలో పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ పేరు తెరపైకి రావడంతో ఆ వర్గంలో కలవరం మొదలైంది. విజయవాడ లోక్‌సభ సీటును తనకే కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇవ్వకపోయినా తాను విజయవాడ నుంచే పోటీ చేస్తానని కేశినేని నాని స్పష్టం చేశారు. టీడీపీ సభ్యుడే కాని పొట్లూరికి ఏ విధంగా టికెట్ కేటాయిస్తారని ప్రశ్నించారు. పవన్‌కల్యాణే పీవీపీకి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును పట్టుబడుతున్నారని వస్తున్న వార్తలను.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఖండించాలని నాని కోరారు. పైసా డబ్బులు లేని వాళ్లకు కూడా అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించిన చంద్రబాబు, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగరని తప్పకుండా తనకే లోక్ సభ టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబును కలిసేందుకు కేశినేని నాని ఈ రోజు ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. అయితే చంద్రబాబు అందుబాటులో లేకపోవటంతో నాని వెనుదిరిగారు. ఓ గంట తర్వాత నాని బాబును కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా

  లోక్ సభ అభ్యర్ధులు: శ్రీకాకుళం - కిల్లి కృపారాణి, విజయనగరం - బొత్స ఝాన్సీ, అరకు - కిషోర్ చంద్రదేవ్, ఒంగోలు - దర్శి పవన్ కుమార్, నర్సాపురం - కనుమూరి బాపిరాజు, అమలాపురం - బుచ్చి మహేశ్వర రావు, ఏలూరు - నాగేశ్వర రావు, గుంటూరు - షేక్ వహీద్, బాపట్ల - పనబాక లక్ష్మి, తిరుపతి – చింతామోహన్, కాకినాడ - పల్లం రాజు, అమలాపురం - బుచ్చిమహేశ్వర రావు, రాజమండ్రి - కందుల దుర్గేష్, విజయవాడ - దేవినేని అవినాష్, నెల్లూరు - వాకాటి నారాయణ రెడ్డి, రాజంపేట – సాయిప్రతాప్, హిందూపురం - చిన వెంకట్రాముడు, నంద్యాల – బి.వై రామయ్య, కర్నూలు - కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నరసరావుపేట - కాసు కృష్ణా రెడ్డి. శాసన సభ అభ్యర్ధులు: నూజివీడు - చిన్నం రామకోటయ్య, గుడివాడ - అట్లూరి సుబ్బారావు, పామర్రు - డి.వై.దాస్‌, విజయవాడ వెస్ట్ - వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్‌ - మల్లాది విష్ణువర్థన్‌రావు, విజయవాడ ఈస్ట్ - దేవినేని రాజశేఖర్‌, మైలవరం - ఆప్పసాని సందీప్‌, నందిగామ - బోడపాటి బాబూరావు, జగ్గయ్యపేట - వేముల నాగేశ్వరరావు.   పెదకూరపాడు - పక్కల సూరిబాబు, తాడికొండ - చల్లగాలి కిషోర్‌, మంగళగిరి - కాండ్రు కమల, పొన్నూరు - తేళ్ల వెంకటేష్‌ యాదవ్, వేమూరు - రేవెండ్ల భరత్‌బాబు,రేపల్లె - మోపిదేవి శ్రీనివాసరావు, అమలాపురం - జంగా గౌతమ్‌, రాజోలు - సరెళ్ల విజయ ప్రసాద్‌, గన్నవరం - పాముల రాజేశ్వరీ దేవి, కొత్తపేట - ఆకుల రామకృష్ణ, మండపేట - కామన ప్రభాకరరావు   రాజానగరం - అంకం నాగేశ్వరరావు, రాజమండ్రి రూరల్ - శ్రీమతి రాయుడు రాజవెల్లి, జగ్గంపేట - తోట సూర్యనారాయణ మూర్తి, గుంటూరు ఈస్ట్ - ఎస్‌కే మస్తాన్ వలీ, చిలకలూరిపేట - ఎం. హనుమంతరావు, నరసరావుపేట - కాసు మహేష్‌రెడ్డి,సత్తెనపల్లి - యెర్రం వెంకటేశ్వరరెడ్డి,వినుకొండ - ఎం. మల్లిఖార్జునరావు,గురజాల - ఆనం సంజీవ్‌రెడ్డి   మాచర్ల - రాంశెట్టి నరేంద్ర బాబు,దర్శి - కోట పోతుల జ్వాలారావు,పర్చూరు - మోదుగుల కృష్ణారెడ్డి,అద్దంకి - గాలం లక్ష్మీయాదవ్, తెనాలి - నాదెండ్ల మనోహర్‌, బాపట్ల - సి.హెచ్. నారాయణరెడ్డి, ప్రత్తిపాడు - కొరివి వినయ్‌కుమార్, గుంటూరు వెస్ట్ - కన్నా లక్ష్మీనారాయణ, చీరాల - మెండు నిశాంత్‌ మార్కాపురం - ఏలూరి రామచంద్రారెడ్డి, సంతనూతలపాడు - నూతల తిరుమల రావు   ఒంగోలు - యెద్దు శశికాంత్‌ భూషణ్‌, కందుకూరు - వెంకట్రావ్ యాదవ్‌, కొండేపి - జి.రాజ్‌విమల్‌, రంపచోడవరం - కేవీవీ సత్యనారాయణ రెడ్డి,నిడదవోలు - కామిశెట్టి వెంకట సత్యనారాయణ, ఆచంట - ఇందుగపల్లి రామానుజ రావు,పాలకొల్లు - బాల నాగేశ్వరరావు,నరసాపురం – నాగతులసీరావు,భీమవరం - యెర్లగడ్డ రాము, ఉండి - గాడిరాజు లచ్చిరాజు   తాడేపల్లిగూడెం - దేవతి పద్మావతి,దెందులూరు - మాగంటి వీరేంద్ర ప్రసాద్‌,ఏలూరు - వెంకట పద్మరాజు, గోపాలపురం - కాంతవల్లి కృష్ణవేణి,పోలవరం - కంగల పోసిరత్నం,తిరువూరు - రాజీవ్‌ రత్న ప్రసాద్,గిద్దలూరు - కందుల గౌతమ్‌రెడ్డి,కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి,కోవూరు - జి.వెంకటరమణ   నెల్లూరు సిటీ - ఏసీ సుబ్బారెడ్డి, నెల్లూరు రూరల్‌- ఆనం విజయకుమార్‌రెడ్డి,సర్వేపల్లి - కె.పట్టాభిరామయ్య, గూడూరు - పనబాక కృష్ణయ్య,సూళ్లూరుపేట - డి.మధుసూదనరావు, వెంకటగిరి - ఎన్‌.రామ్‌కుమార్‌రెడ్డి, బద్వేల్ - జె.కమల్ ప్రభాస్‌,రాజంపేట - గాజుల భాస్కర్‌,కడప - మహ్మద్‌ అష్రాఫ్‌,రాయచోటి - షేక్ ఫజ్లే ఇల్లా   పులివెందుల - రాజగోపాల్‌రెడ్డి,ఆళ్లగడ్డ - టి.ఎ.నరసింహారావు,శ్రీశైలం – షబానా,నందికొట్కూరు - చెరుకూరి అశోకరత్నం,కర్నూలు - అహ్మద్ అలీఖాన్,నంద్యాల - జూపల్లి రాకేష్‌రెడ్డి, బనగానపల్లి - పేర రామసుబ్బారెడ్డి,.డోన్ - ఎల్‌.లక్ష్మీరెడ్డి,పత్తికొండ - కె.లక్ష్మీనారాయణరెడ్డి,కోడుమూరు - పి.మురళీకృష్ణ, ఆదోని - మనియర్ యూనిస్‌.

జూయన్టీఆర్ ని అందుకే దూరం పెడుతున్నారా?

  ఈసారి జూ.యన్టీఆర్, ఆయన తండ్రి హరికృష్ణ ఇద్దరినీ కూడా చంద్రబాబు పూర్తిగా పక్కనపెట్టేసినట్లేనని నారా లోకేష్ తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన కృష్ణా జిల్లాలో మొదలుపెట్టిన యువ ప్రభంజనం యాత్రలో మీడియాతో మాట్లాడుతూ “బాలకృష్ణతో సహా మేమేవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించలేదు. కానీ అందరూ కూడా పార్టీని తమదిగా భావించి తామంతట తామే స్వయంగా వచ్చి పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. అందువల్ల జూ.యన్టీఆర్ ని పార్టీ ప్రచారంలో పాల్గొనమని ప్రత్యేకంగా ఆహ్వానించనవసరం లేదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.   నాలుగు రోజుల క్రితం చంద్రబాబు కూడా ఇంచుమించు ఇదేవిధంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన కొడుకు నారా లోకేష్ అదే విధంగా చెప్పడం గమనిస్తే వారిరువురికి కూడా ఈసారి ఎన్నికల ప్రచారానికి జూ.యన్టీఆర్ ని ఆహ్వానించే ఆలోచనలేదని స్పష్టమవుతోంది. అయితే అందుకు చాలా బలమయిన ఉందనిపిస్తోంది.   హరికృష్ణ తన కొడుకు జూ.యన్టీఆర్ ని తేదేపాలో ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నించినప్పుడు, చంద్రబాబు నాయుడు తన వియ్యంకుడు బాలకృష్ణ సహకారంతో తన కొడుకు నారా లోకేష్ ని తన రాజకీయ వారసుడిగా, తేదేపాకు భావి అధినేతగా ఎదిగేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేసిన సంగతి అందరికీ తెలిసిందే. జూ.యన్టీఆర్ కి తన సినీరంగంపై తప్ప పార్టీ రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి ఏమీ లేకపోయినప్పటికీ, గత ఎన్నికలలో తాత స్వర్గీయ యన్టీఆర్ ను మరిపించేలా అలవోకగా సాగిన అతని వాగ్ధాటి, వేష బాషలు, ప్రచారశైలీ అన్నీ కూడా అతనే స్వర్గీయ యన్టీఆర్ కు నిజమయిన వారసుడు అని ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా భావించేలా చేసింది.   బహుశః అప్పటి నుండే చంద్రబాబు క్రమంగా, ఆయన భాషలో చెప్పాలంటే ఒక పద్ధతి ప్రకారం జూ.యన్టీఆర్ ని దూరం పెడుతూ వచ్చేరు. ఆ తరువాత వారి మధ్య వైకాపా ఫ్లెక్సీ బ్యానర్లతో అడ్డుగా పరదాలు కట్టడంతో, హరికృష్ణ, జూ.యన్టీఆర్ క్రమంగా తేదేపాకు దూరమయ్యారు. అది జూ.యన్టీఆర్ సినీ జీవితంపై కూడా విపరీతమయిన ప్రభావం చూపడంతో ఆ దూరం మరింత పెరుగుతూ వచ్చింది. అయితే కాగల కార్యం గందర్వులే తీర్చారన్నట్లుగా, జూ.యన్టీఆర్ తనంతట తానే పార్టీకి దూరం అయినప్పుడు మళ్ళీ అతనిని ఇప్పుడు పార్టీ ప్రచారం కోసం ఆహ్వానించడమెందుకు, మరుగున పడిన పార్టీ వారసత్వ సమస్యని కెలుక్కోవడమెందుకనే ఉద్దేశ్యంతోనే బహుశః వారిరువురూ ఆవిధంగా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వైకాపాలోకి సూపర్ సోదరుడు

  సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్, ఆయన తల్లి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి ఇటీవలే తెదేపా తీర్ధం స్వీకరించిన సంగతి అందరికీ తెలిసిందే. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు కూడా తెదేపాలో చేరేందుకు సిద్దమయ్యారు. కానీ ఆయనకు టికెట్ విషయంలో చంద్రబాబు ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరిపోయారు. ఒకే కుటుంబం సభ్యులు ఇలా వేర్వేరు పార్టీలలో చేరడం కొత్తేమీ కాకపోయినా, బద్ద శతృవులయిన ఈ రెండు పార్టీలలో వారి కుటుంబ సభ్యులు చెరో వైపు చేరినందున విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోక తప్పనిసరి పరిస్థితి ఎదురయిన్నట్లయితే, అది వారి కుటుంబానికి అంత గౌరవంగా ఉండబోదని చెప్పవచ్చును.

త్వరలో కాంగ్రెస్ నేతల రిటర్న్ జర్నీ?

  ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నుండి గుంపులు గుంపులుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిపడిన కాంగ్రెస్ నేతలకు చంద్రబాబు షాక్ ఇస్తున్నారు. వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనతో బాటు వచ్చిన నలుగురు విశాఖ కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఇంతవరకు వెలువరిచిన రెండు జాబితాలలో వారెవరి పేర్లు కనబడకపోవడంతో అందరిలో ఆందోళన మొదలయింది. ఇంకేముంది.. అందరూ అసమ్మతి గంట కొట్టేందుకు శ్రీనివాసరావు ఇంటిలో సమావేశమయిపోయారు.   వారిలో అవంతీ శ్రీనివాస్, కన్నబాబు తమకు టికెట్స్ దొరక్కపోతే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు సిద్దమని చెపుతుంటే, గాజువాక యం.యల్యే. వెంకట్రామయ్య తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయెందుకు చిరంజీవి, బొత్స సత్యనారాయణలతో అప్పుడే చర్చలు కూడా ఆరంబించేసారు. సీమాంద్రాలో పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడంతో ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులు లేక దిక్కులు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు మళ్ళీ గాజువాక నుండి టికెట్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తాజా సమాచారం.   అయితే చిరంజీవి అనుంగు సహచరుడు గంటా శ్రీనివాసరావు మాత్రం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్దంగాలేరు. చంద్రబాబు తనని ఎక్కడి నుండి పోటీ చేయమన్నా అభ్యంతరం చెప్పకుండా పోటీ చేస్తానని, ఒకవేళ టికెట్ ఇవ్వకున్నా కూడా తెదేపానే అంటి పెట్టుకొని ఉంటూ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తానని చంద్రబాబుకి వినబడేలా బిగ్గరగా చెపుతున్నారు. గంటా శ్రీనివాసరావు ప్రదర్శిస్తున్న ఈ లౌక్యాన్ని చూసి చంద్రబాబు ఐస్ అయిపోయి టికెట్ ఇస్తారో లేదో నేడో రేపో తేలిపోతుంది.   అయితే ఇదంతా చూస్తుంటే చంద్రబాబు రాష్ట్ర విభజన వ్యవహారంతో తనను తన పార్టీని ఘోరంగా దెబ్బతీయాలని చూసిన కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకోనేందుకే ఆ పార్టీ నేతలని తెదేపాలోకి ఆకర్షించారా? అందుకే నామినేషన్లకు గడువు ముగిసేవరకు వారి టికెట్స్ వ్యవహారం ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన ప్రకటించిన రెండు జాబితాలలో కలిపి కేవలం నలుగురైదుగురు కాంగ్రెస్ నేతలకు మాత్రమె టికెట్స్ వచ్చాయి. కానీ, కాంగ్రెస్ నుండి తెదేపాలోకి వచ్చిన వారి సంఖ్యా దాదాపు రెండు డజన్ల పైనే ఉన్నారు. మరి వారందరికీ కూడా చంద్రబాబు ఆఖరి నిమిషంలో హ్యాండివ్వబోతున్నారా?అనే సంగతి కూడా నేడో రేపో తుది జాబితా వెలువడగానే తేలిపోతుంది. అది కూడా తేలిపోతే కాంగ్రెస్ నేతలందరూ ‘ద్వారములు తెరిచియే ఉంచిన కాంగ్రెస్ గూటికి’ బిరబిరా పరుగులు తీస్తారేమో!   ఈలోగా కాస్త ముందు చూపు ఉన్న కన్నబాబు, అవంతీ శ్రీనివాస్ వంటి నేతలు స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేసి జాగ్రత్తపడుదామని భావిస్తుంటే, అంత రిస్కు తీసుకోవడం ఇష్టంలేని వెంట్రామయ్య వంటి నేతలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే ప్రయత్నంలో తమకు టికెట్ రాదని గ్రహించగానే కాంగ్రెస్ గూటికి తిరిగి పయనమయిపోతున్నారు. ఇంతకీ వీరందరిలో ఎవరు తెలివయిన వారు? కాంగ్రెస్ నేతలకి పసుపు కండువాలు కప్పి వారికి షేక్ హ్యాండిస్తున్న చంద్రబాబా? లేక అవకాశవాదులయిన కాంగ్రెస్ నేతలా?              

పెరటి మొక్క వైద్యానికి పనికి రాదన్నట్లు

  పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనే ఒక సామెత అక్షరాల చిరంజీవికి సరిపోతుంది. ఆయన తన మెగా చరిష్మాతో సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేస్తాడని ఆశతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి ఎన్నికల ప్రచారకమిటీ చైర్మన్ గా కీలక బాధ్యతలు అప్పగించింది. అవసరమయితే ఆయనను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా పంపి ప్రచారం చేయించుకోవాలనుకొంది. అయితే ఆయన సీమాంద్రా ప్రజలనే ఆకట్టుకోలేనప్పుడు ఇతర రాష్ట్రాలలో మాత్రం ఏమి సాధిస్తారని అందరూ పెదవి విరుస్తున్నారు. పొరుగు రాష్ట్రాల సంగతి తరువాత చూసుకోవచ్చును, కనీసం నేటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగానే ఉన్న తెలంగాణాకు ఆయనను పంపి ప్రచారం చేయించుకొనే దైర్యం చేయలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ.   ప్రస్తుతం టీ-కాంగ్రెస్ లో ప్రజాకర్షణగల సరయిన నేతలెవరూ లేకపోవడంతో, వారందరూ కలిసి కూడా ఒక్క కేసీఆర్ని గట్టిగా డ్డీ కొనలేక ఆపసోపాలు పడుతున్నారు. వారిని ఎదుర్కోవడానికి డిల్లీ నుండి జైరామ్ రమేష్ స్వయంగా రావలసి వచ్చిందంటే టీ-కాంగ్రెస్ పరిస్థితి అర్ధమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణాను వ్యతిరేఖించిన చిరంజీవిని ప్రచారానికి ఆహ్వానిస్తే అది కొరివితో తలగోక్కునట్లే అవుతుందని కాంగ్రెస్ నేతలకు తెలుసు. అందుకే సరయిన ప్రజాకర్షక నేతలు ఎవరూ లేకపోయినప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలు అలాగే ఎలాగో నెట్టుకొస్తున్నారు తప్ప తమ పెరట్లోనే ఉన్న చిరంజీవి గురించి ఎన్నడూ ఆలోచించలేదు.

తిక్కుంది కానీ దానికో లెక్క లేదు

  నా కొంచెం తిక్కుంది..కానీ దానికో లెక్కుంది…అని పవన్ కళ్యాణ్  డైలాగ్ చాలా పాపులర్ అయింది.సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ పెట్టి రాజకీయాలలో ప్రవేశించిన ఆయన “తూచ్...ఇప్పుడు పోటీ చేయబోవడం లేదు. అందువల్ల జనాలూ..మీకు నచ్చినోళ్ళకే ఓట్లేసేసుకోండి!” అని వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించేసారు. విజయవాడ టికెట్ కోసం అన్ని పార్టీల గడపలు ఎక్కిదిగిన పొట్లూరి వరప్రసాద్, అందు కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేసి పవన్ కళ్యాణ్ చేత జనసేన లాంచింగ్ చేయించగలిగారు కానీ ఆయన చేత ఎన్నికలలో పోటీ చేయించ లేకపోయారు. అయితే గజ్జి ఉన్నవాడికి అలా గోక్కొంటూ ఉంటేనే చాలా సుఖంగా ఉంటుందిట. అలాగే విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని తహతహలాడిపోతున్న పొట్లూరికి ఏదో విధంగా అక్కడి నుండి ఓసారి పోటీ చేసి మళ్ళీ చేతులు కాల్చుకొంటేనే కానీ ఆ దురద తీరేట్లు లేదు. అందుకే ఆయన టికెట్ కోసం పవన్ వెంటబడ్డారు. కానీ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించేసిన తరువాత మళ్ళీ రంగ ప్రవేశం చేసి, తన అభ్యర్ధిని పోటీలో దింపి ఓడిపోతే ఉన్న పరువు కూడా పోయే ప్రమాదం ఉంది గనుక, తను (కోడ్ బాషలో) మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన తెదేపాకు ఎన్నికల సందర్భంగా ఒక మెగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. పొట్లూరికి ఒక టికెట్ ఇస్తే వన్ ప్లస్ వన్ ఆఫర్ క్రింద తెదేపా-బీజేపీ రెండు పార్టీలకు ఫ్రీగా ప్రచారం చేసిపెడతానని టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చారు.   ఆ రెండు పార్టీలు పొత్తులయితే పెట్టుకోగలిగాయి కానీ నేటికీ సీట్ల సర్దుబాటు చేసుకోలేక తలలు పట్టుకొని కూర్చొన్నాయి. ఉన్న ఐదు రోజుల పుణ్యకాలంలో అప్పుడే ఒకరోజు గడిచిపోయింది కానీ వైజాగ్, విజయవాడ సీట్ల బేరం మాత్రం ఎంతకీ ఒక కొలిక్కి రావడం లేదు. ఆ రెండు సీట్లు కోసం ఆ రెండు పార్టీలు సిగపట్లు పడుతుంటే మధ్యలో పొట్లూరికి టికెట్ అంటూ పవన్ కూడా వారితో జాయిన్ అయ్యారు. తమ వాళ్ళని కాదని పొట్లూరికి టికెట్ కట్టబెడితే ఇక ఆ రెండు పార్టీలలో ముసలం పుడుతుంది. ఇవ్వకపోతే పవన్ ‘జై జనసేన’ అంటూ పొట్లూరిని పోటీలో నిలబెడితే అదొక పెద్ద సమస్య అవుతుంది.   రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయాల గురించి చిన్నపుడు నుండే సుదీర్గ పరిశోధన చేసి, ప్రపంచంలో ఉన్న అన్ని ఇజాలను మిక్సీ గ్రైండర్ లో వేసి రుబ్బి మరో కొత్త ఇజం కనిపెట్టిన పవన్ కళ్యాణ్, విజయవాడ టికెట్ కోసం ఆ రెండు పార్టీల కుస్తీ పట్ల గురించి తెలుసుకోలేకపోవడం విచిత్రమే. అయినా ఆయన స్వంత కుంపటిని వంటింట్లో దాచుకొని, పొరుగింటి పిన్నిగారి కుంపటి మీద గారెలు, పరమాన్నం వండుకోవాలనుకోవడం విడ్డూరంగానే ఉంది కదా! నిజమే.. అతనికి తిక్కయితే ఉంది గాని దానికో లెక్క మాత్రం లేదని జనాలు కూడా ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.

రజనీకాంత్ మద్దతుతో మారనున్న సమీకరణాలు

  తమిళనాడులో ఏదో ఒక స్థానిక పార్టీ అండ లేకపోయినట్లయితే ఎంత పెద్ద జాతీయపార్టీనయినా తమిళ తంబిలు ఆదరించరు. కానీ, తమిళనాడులో రెండు ప్రధాన ద్రవిడ పార్టీలయిన డీయంకే, అన్నాడీయంకేలు ఈసారి ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో, కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని భావిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులకు అంగీకరించలేదు. అందువల్ల ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో మిగిలిన చిన్నా చితకా పార్టీలను ఆశ్రయించక తప్పలేదు. కానీ వాటితో పొత్తుల వలన లాభం కంటే అధికారం చేపట్టిన తరువాత వారి గొంతెమ్మ కోరికలన్నిటినీ తీర్చలేక తలనొప్పులే అధికంగా ఉంటాయని ఇదివరకు చాలాసార్లే రుజువయింది. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆన్వేషిస్తున్న బీజేపీ తమిళనాట సినీ హీరోలకు ప్రజలలో విపరీతమయిన ఆదరణ ఉన్న సంగతి గ్రహించి తెలివిగా పావులు కదిపింది.   సినీ తారలతో, రాజకీయ నాయకులతో మంచి పరిచయాలున్న తుగ్లక్ పత్రిక సంపాదకుడు, పాత్రికేయుడు, నటుడు అయిన చో రామస్వామి ద్వారా సూపర్ స్టార్ రజనీకాంత్ ని బీజేపీ మద్దతు ఇమ్మని కోరారు. ఊహించని విధంగా రజనీకాంత్ నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్నట్లు వెంటనే ప్రకటించడమే కాకుండా రేపు నరేంద్ర మోడీని స్వయంగా కలిసేందుకు బయలుదేరుతున్నారు.   రజనీకాంత్ కి తమిళనాట లక్షలాది అభిమానులున్నారు. అదేవిధంగా ఆంధ్ర, కర్నాటక, కేరళలో కూడా చాలా మంది అభిమానులున్నారు. ఆయన స్వయంగా బీజేపీ ప్రచారంలో పాల్గొనకపోయినా, తాను బీజేపీకి మద్దతు ఇస్తున్నాని చెపితే ఆయన అభిమానులు కూడా బీజేపీకే ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇది తమిళనాడులో రెండు ప్రధాన ద్రవిడ పార్టీలయిన డీయంకే, అన్నాడీయంకేలకు మింగుడుపడని విషయమే. అది వారి విజయావకాశాల మీద కూడా పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అలాగని ఆ రెండు పార్టీలు రజనీకాంత్ ని వేలెత్తి చూపే దుస్సాహసం చేయలేవు. ఇప్పుడు వాటి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకల్లా తయారయిందని చెప్పవచ్చును. ఈ ఊపులో బీజేపీ మరి కొంతమంది సినీ తారలను పార్టీకి మద్దతు ఇచ్చేలా ప్రోత్సహిస్తే ఇక ఆ రెండు పార్టీలు తమ అతిశయం చంపుకొని కాంగ్రెస్, బీజేపీలను ఆశ్రయించక తప్పదేమో!

మోడీకి రజనీకాంత్ మద్దతు

        రాజకీయ రంగంలో మరో సంచలనం ఆవిష్కృతమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ బీజేపీకి మద్దతు ప్రకటించాడు. ఇప్పుడు మరో స్టార్ కూడా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాడు. ఆ స్టార్ మరెవరో కాదు.. స్టార్లకే స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ మోడీకి మద్దతు పలకనున విషయం తమిళనాడు రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. రజనీకాంత్ మోడీకి మద్దతు పలుకుతారన్న విషయాన్ని రజనీకాంత్ సన్నిహితుడు చో రామస్వామి వెల్లడించారు. ఆదివారం ఉదయం చెన్నైలోని రజనీకాంత్ నివాసానికి మోడీ వెళ్ళి రజనీని కలిసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.ఈ అంశంపై చెన్నైలో ముందుగానే పోస్టర్లు వెలిశాయి.    

ఈ కత్తుల పొత్తుల మతలబేoది

  నిజామాబాద్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న తెరాస అభ్యర్ధి కవిత తన ప్రచారం ప్రారంభిస్తూ బీజేపీకి ఓటేస్తే అది సీమాంధ్రుడయిన చంద్రబాబుకి వేసినట్లే అనే ఒక సిద్ధాంతం ప్రతిపాదించారు. కానీ అదే నియోజక వర్గం నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి ఎండల లక్ష్మీనారాయణ ఆమె కనిపెట్టిన సిద్ధాంతాన్నే తెరాసకు కూడా వర్తింపజేస్తూ, తెరాసకు ఓటేస్తే అది కాంగ్రెస్ కు వేసినట్లేనని ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ-తెదేపాలు పొత్తులు పెట్టుకొన్నాయి గనుక అవి ఎన్నికలలో గెలిస్తే అధికారం కూడా పంచుకోవచ్చును. గనుక ఆమె ఆవిధంగా ఆరోపణలు చేసి ఉండవచ్చును.   కానీ, తెరాస కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోకపోయినా కూడా ఎన్నికల తరువాత పరిస్థితులను బట్టి ఆ పార్టీకి మద్దతు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంటే వారి మధ్య కూడా ఒక రహస్య అవగాహన ఉందని స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్, తెరాస పార్టీలు రెండూ బద్ద శత్రువులులా ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నపటికీ ఎన్నికల తరువాత వారు ఒకరికొకరు సహకరించుకోవడం ఖాయం. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి పూర్తి మెజార్టీ సాధించే అవకాశం లేదు. ఒకవేళ అది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయిన మద్దతు కూడగట్టగలిగితే, అప్పుడు తెరాస తప్పకుండా దానికే మద్దతు ఇస్తుంది. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో తెరాస చెప్పుకొంటున్నట్లు దానికి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు గనుక ప్రభుత్వ ఏర్పాటుకి కాంగ్రెస్ మద్దతు తీసుకోక తప్పదు. కనుక తెరాసకు ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినట్లేనని బీజేపీ అభ్యర్ధి చేస్తున్న వాదన సమంజసమేనని చెప్పవచ్చును.   మరి ఎన్నికల తరువాత కలిసి పనిచేసే ఉద్దేశ్యం ఉన్నపుడు, కేసీఆర్ దురాశకు పోకుండా కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే, ఓట్లు చీలకుండా ఉండేవి. కాంగ్రెస్-తెరాస కూటమికి మరిన్ని ఓట్లు పడేవి. కానీ అలా చేయకుండా ఈ ముసుగులో గుద్దులాటలు దేనికో ప్రజలను మభ్యపెట్టడం దేనికో వారే చెప్పాలి.