విమానంలోనే మరణించిన కో పైలెట్

  లయన్ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి థాయ్ ఎయిర్ పోర్టు నుంచి 152 మంది ప్రయాణికులతో గాల్లోకి ఎగిరింది. ఆ సమయంలో విమానాన్ని కో పైలెట్ నడుపుతున్నాడు. గాల్లోకి ఎగిరిన కాసేపటికి కో పైలెట్ పక్కనే వున్న పైలెట్ యథాలాపంగా కో-పైలెట్ వైపు చూసి అదిరిపోయాడు. కారణం.. కో పైలెట్ సీట్లో కూర్చునే మరణించి వున్నాడు. అప్పటి వరకూ విమానం అతని కంట్రోల్లో వుందని అనుకుంటూ తాపీగా కూర్చున్న పైలెట్ అలర్ట్ అయి విమానాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కో పైలెట్ విమానంలోనే మరణించిన విషయాన్ని తెలుసుకున్న అధికారులు విమానాన్ని వెంటనే వెనక్కి తెప్పించి ఎమర్జెన్సీ లాండింగ్ చేయించారు. విమానం నడుపుతున్న కో పైలెట్ మరణించాడన్న విషయాన్ని ఆ తర్వాత తెలుసుకున్న విమానంలోని 152 మంది ప్రయాణికులు బతుకు జీవుడా అనుకున్నారు.

కారెక్కిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి

హైదరాబాద్‌కి చెందిన దివంగత రాజకీయ నాయకుడు పి.జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి కొంత కాలం కాంగ్రెస్‌ పార్టీలో వుండి, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆమె కారెక్కారు.. తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఆమె ఖైరతాబాద్ చౌరస్తాలోని తన తండ్రి పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం స్థానిక మహంకాళీ ఆలయం దగ్గర పూజలు చేశారు. ఆ తర్వాత ర్యాలీగా టీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్ళారు. ఈ ర్యాలీని తెలంగాణ ఎక్సయిజ్ శాఖ మంత్రి పద్మారావు జెండా ఊపి ప్రారంభించారు. ఒంటెలు, గుర్రాలు, కార్లు, ద్విచక్ర వాహనాలతో ఈ ర్యాలీని నిర్వహించారు.

కరుణానిధి భార్య, కుమార్తెకి బెయిలు మంజూరు

  2జీ కుంభకోణంలో 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో టెలికం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఏడుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రాజా, కనిమొళి కోర్టుకు హాజరయ్యారు. అలాగే కరుణానిధి భార్య, కనిమొళి సవతి తల్లి దయాళు అమ్మాళ్‌కు కూడా బెయిల్ లభించింది. దయాళు అమ్మాళ్‌కు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. అయితే, ఈ కేసులో తన పేరును తొలగించాలన్న దయాళు అమ్మాళ్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దయాళు అమ్మాల్, రాజా, కనిమొళిలతో పాటు మరో ఏడుగురికి బెయిల్ మంజూరయింది.

‘పీకే’ కొత్త పోస్టర్... అమీర్‌ఖాన్ ఒంటిమీద బట్టలున్నాయ్...

  బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన తాజా చిత్రం ‘పీకే’ పోస్టర్ని ఆమధ్య విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఒంటిమీద బట్టల్లేకుండా ‘అక్కడ’ కేవలం ఓ పాత టేప్ రికార్డర్ మాత్రమే పెట్టుకుని కనిపించి అల్లకల్లోలం చేశాడు. రైలు పట్టాలపై టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడిన అమీర్ ఖాన్ ను అనేక కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. అయినా అమీర్ ఖాన్ అందరికి ధీటుగా జవాబిచ్చారు. తాను పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్ విడుదల చేయలేదని.. సినిమా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందని సమాధానమిచ్చాడు. ఆగస్టు 20 తేదిన విడుదల చేసే రెండవ పోస్టర్ లో ట్రాన్సిస్టర్ కూడా అడ్డుగా ఉండదంటూ చమత్కరించిన అమీర్ ఖాన్ బుధవారం నాడు ఈ సినిమా సెకండ్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు. ఈ పోస్టర్ ఎంత సంచలనం సృష్టిస్తుందో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్టర్‌లో అమీర్ ఖాన్ ఒంటి నిండా బట్టలు కప్పుకుని వుండి మళ్ళీ జనాన్ని ఆశ్చర్యచకితుల్ని చేశాడు.ఈసారి పోస్టర్లో ట్రాన్సిస్టర్ కూడా వుండదని అంటే జనాలు ఏవేవో ఊహించుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఈ పోస్టర్ వుంది.. నిజమే ఈసారి అమీర్ చేతిలో ట్రాన్సిస్టర్ కూడా లేదు. నిండుగా బట్టలేసుకుని బ్యాండ్ మేళం బూర చేతిలో పట్టుకుని నిలుచున్నాడు.

ఉదయ్ కిరణ్ ఎలా మరణించాడంటే.. ఇదిగో ఫోరెన్సిక్ రిపోర్ట్...

సినీ కథానాయకుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న ఇంతకాలానికి ఆయన మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం స్పష్టంగా వున్నప్పటికీ, ఫోరెన్సిక్ నివేదిక అందేవరకూ ‘ఆత్మహత్య’గా భావించని పోలీసులు ఉదయ్ కిరణ్‌ది అనుమానాస్పద మరణంగానే కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ రిపోర్టు అందకపోవడం వల్ల ఇప్పటి వరకు చార్జిషీట్ కూడా దాఖలు చేయలేదు. ఇప్పుడు వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని నిర్ధారించింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఊపిరి ఆడకపోవడం వల్లనే ఉదయకిరణ్ మరణించారు. ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఉదయ్ కిరణ్ మద్యం సేవించాడు.

అంకెల్లో ఆశలు చూపిన యనమల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్...

  * 1,11, 824 కోట్లతో బడ్జెట్ రూపకల్పన. * 85వేల 151 కోట్ల ప్రణాళికేతర వ్యయం. * 26వేల కోట్ల ప్రణాళికా వ్యయం. * రెవెన్యూ లోటు రూ.6,064 కోట్లు. * ఆర్థిక లోటు రూ.12,064 కోట్లు. * స్థూల జాతియోత్పత్తిలో ఆర్థికలోటు 2.30 కోట్లు * స్థూల జాతియోత్పత్తిలో రెవెన్యూ లోటు 1.16 కోట్లు * ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం రెవెన్యూ లోటు 25, 574 కోట్లు * ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం ద్రవ్య లోటు 37, 910 కోట్లు * శాంతిభద్రతలకు రూ.3,339 కోట్లు * విపత్తుల నిర్వహణకు రూ.403 కోట్లు * ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి రూ.111 కోట్లు * ఇరిగేషన్కు రూ. 8,467 కోట్లు * ఇంధన రంగానికి రూ, 7164 కోట్లు * ఆర్ అండ్ బి కి రూ.2, 612 కోట్లు * పర్యావరణం, అడవులు, సెన్స్ అండ్ టెక్నాలజీ రూ. 418 కోట్లు * ఉన్నత విద్య: రూ.2,272 కోట్లు * ఇంటర్మీడియట్ విద్య: రూ. 812 కోట్లు * పాఠశాల విద్య: రూ.12, 595 కోట్లు * ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం: 4,388 కోట్లు   * 2012-13 రాష్ట్ర స్థూల ఉత్పత్తి: రూ.4,19,391 కోట్లు * 2013-14 రాష్ట్ర స్థూల ఉత్పత్తి: రూ.4, 75,859 కోట్లు * ప్రతి కుటుంబానికి రుణమాఫీ చెల్లిందేందుకు రూ. 1.50 లక్ష కేటాయింపు * సాంఘిక సంక్షేమానికి రూ.2,657 కోట్లు * గిరిజన సంక్షేమానికి రూ. 1150 కోట్లు * బీసీ సంక్షేమానికి రూ. 3,130 కోట్లు * మైనార్టీ సంక్షేమానికి రూ.3.371 కోట్లు * స్త్రీ శిశు సంక్షేమానికి రూ. 1059 కోట్లు * వికలాంగులు, వృద్ధులకు రూ.65 కోట్లు * యువజన సేవలు రూ.126 కోట్లు * పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ. 113 కోట్లు * గృహ నిర్మాణానికి రూ.8,808 కోట్లు * పౌరసరఫరాలశాఖ రంగానికి రూ. 2318 కోట్లు * గ్రామీణాభివృద్ధి రంగానికి రూ.6094 కోట్లు * అక్టోబర్ 2 నుంచి వృద్ధులు, వికలాంగులకు రూ. 1500 పెన్షన్ * పంచాయతీ రాజ్కు రూ. 4260 కోట్లు * గ్రామంలో నీటి సరఫరాకు రూ.1152 కోట్లు * పట్టణాభివృద్ధి రూ.3,134 కోట్లు * కార్మిక ఉపాధిరంగానికి రూ. 276 కోట్లు * 2012-13 తలసరి ఆదాయం రూ. 76, 041 * 2013-14 తలసరి ఆదాయం రూ. 85,795.

ఏపీ బడ్జెట్ ప్రసంగం విశేషాలు... కొన్ని...

  లక్ష కోట్లకుపైగా కేటాయింపులతో రూపకల్పన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ విశేషాలు   * 1,11, 824 కోట్లతో బడ్జెట్ రూపకల్పన. * 85వేల 151 కోట్ల ప్రణాళికేతర వ్యయం. * 26వేల కోట్ల ప్రణాళికా వ్యయం. * రెవెన్యూ లోటు రూ.6,064 కోట్లు. * ఆర్థిక లోటు రూ.12,064 కోట్లు.   * విజన్ 2020కి కొత్త హంగులు.. విజన్ 2029 ఫార్ములాతో ముందడుగు. * వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్. * లక్షన్నర వరకు రైతు రుణాల మాఫీ. * రాష్ట్ర విభజన కారణంగా రెవిన్యూ లోటు ఏర్పడింది. అందువల్లే ఈ ఏడాదికి జనరంజకమైన బడ్జెట్‌ ఇవ్వలేకపోతున్నాం. * అన్ని పథకాలకు ఆధార్ తప్పనిసరి. * విశాఖలో విమ్స్, తిరుపతిలో స్విమ్స్ కేంద్ర నిధులతో అభివృద్ధి. * విజయవాడ- కాకినాడల మధ్య గ్రీన్‌ఫీల్డ్ పోర్టు. * రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్.   * జేఎన్ఎన్ఆర్ఎం కింద స్మార్ట్ సిటీల అభివృద్ధి. * చిత్తూరు, కాకినాడలలో ట్రిపుల్ ఐటీ. * కాకినాడలో ప్రైవేటు రంగంలో మరో వాణిజ్య పోర్టు ఏర్పాటు. * కాకినాడలో ఎల్ఎన్జీ టర్మినల్. * విశాఖ గంగంవరం పోర్టు దగ్గర మరో ఎల్ఎన్జీ టర్మినల్. * విశాఖ, విజయవాడ, తిరుపతి, కడప ఎయిర్‌పోర్టుల విస్తరణ. * వైజాగ్- చెన్నై కారిడార్‌ అభివృద్ధికి ప్రాధాన్యం. * కొత్తగా 6 ఏపీఎస్పీ బెటాలియన్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు, * పేద విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు 13 బీసీ స్టడీ సర్కిల్‌లు ఏర్పాటు * రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్.

ఆధార్ కార్డ్ లేకపోతే రేషన్ కార్డ్ కట్....

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక ఆధార్ కార్డ్ మీద పూర్తిగా ఆధారపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ ప్రభుత్వ పథకానికి అయినా ఆధార్ కార్డునే ఆలంబనగా తీసుకోవాలని భావిస్తోంది. ప్రప్రథమంగా రేషన్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు ఉండితీరాలన్న నిబంధన పెట్టింది. దీనిలో భాగంగానే ఆధార్ కార్డు లేకుంటే రేషన్ కార్డులను కట్ చేస్తామని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇవే ఆదేశాలు త్వరలో రాష్ట్రమంతటా విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తెలుపురంగు రేషన్‌కార్డు, గ్యాస్ కనెక్షన్, చివరకు విద్యుత్ కనెక్షన్ వంటివి అన్నింటికీ ఆధార్ కార్డు ఉండి తీరాలన్న నిబంధనను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బీకేఎస్ అయ్యంగార్ కన్నుమూత

  అయ్యంగార్ యోగా పద్ధతిని ఆవిష్కరించిన ప్రముఖ యోగా గురువు పద్మవిభూషణ్ బీకేఎస్ అయ్యంగార్ పూణెలోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన 95 సంవత్సరాల పండు వృద్ధాప్యంలో కన్నుమూశారు. ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యతోనే ఆయన్ని పూణెలోని ఆస్పత్రిలో చేర్చారు. దీనికితోడు మూత్రపిండాలు కూడా విఫలం కావడంతో ఆయన కన్నుమూశారు. బీకేఎస్ అయ్యంగార్ యోగా గురువుగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, ఈ సంవత్సరంలో పద్మ విభూషణ్ సత్కారాలు పొందారు. యోగా గురించి ఆయన అనేక గ్రంథాలు రాశారు. 95 ఏళ్ళ వృద్ధాప్యంలో కూడా ఆయన యోగాసనాలు వేసేవారు. అయ్యంగార్ మృతిపట్ల ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అయ్యంగార్ అభిమానులకు సంతాపం తెలిపారు. అయ్యంగార్ సేవలు కొన్ని తరాల పాటు గుర్తుండిపోతాయని, ప్రపంచంలోని చాలామందికి ఆయన యోగాను పరిచయం చేశారని ఆయన అన్నారు.

అమెరికా జర్నలిస్టు తల నరికేశారు... దారుణం

  ఇరాక్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తాము రెండేళ్ళ క్రితం కిడ్నాప్ చేసిన అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ పోలీని తలనరికి చంపేశారు. జర్నలిస్టు తల నరకక ముందు ఫొటోని, తల నరికిన తర్వాత ఫొటోని, వీడియో కూడా మీడియాకి విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఈ వీడియో సంచలనం సృష్టించింది. ‘అమెరికాకు ఓ సందేశం’ అనే పేరుతో తీవ్రవాదులు ఈ వీడియో పోస్ట్ చేశారు. నారింజ రంగు దుస్తులు ధరించిన ఫోలీని ఓ ఎడారి ప్రాంతంలో మోకాళ్ల మీద నిలబెట్టి, పక్కనే ఓ ఉగ్రవాది తలకు ముసుగు వేసుకుని నల్ల దుస్తుల్లో ఉన్నాడు. సాధారణంగా నారింజరంగు దుస్తులను అమెరికా సైన్యం అదుపులో ఉండే ఖైదీలకు వేస్తారు. అతడి పక్కనే ఉన్న ఉగ్రవాది ఇంగ్లీషులో మాట్లాడాడు. ఆ తర్వాత అతడు జేబులోంచి కత్తి తీసి, ఫోలీకి మరణశిక్ష విధిస్తున్నట్లు చెప్పాడు. ఇరాక్లో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశించడంతో అందుకు ప్రతీకారంగా ఈ శిక్ష వేస్తున్నామన్నారు. ఫోలీ కూడా తన చావుకి అమెరికాయే కారణం అని చెప్పినట్టుగా వీడియోలో వుంది. తర్వాత యూట్యూబ్ ఈ వీడియో తొలగించింది.

షర్మిలని విడుదల చేయండి: కోర్టు

  ఆత్మహత్యాయత్నం నేరం మీద అరెస్టు చేసిన మణిపూర్ పౌర హక్కుల మహిళా నేత ఇరోమ్ షర్మిల చానును విడుదల చేయాలని స్థానిక సెషన్స్‌కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ రాష్ట్రంలో అమలులో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఎత్తివేయాలంటూ మణిపూర్ ఐరన్ లేడీగా ఇరోమ్ గత 14 ఏళ్లగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దాంతో ఆమె మీద ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి జుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. అప్పట్నుంచి ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ముక్కుద్వారా ద్రవ ఆహారాన్ని అందజేస్తున్నారు. అయితే సెక్షన్ 309 కింద ఆమెపై మోపిన ఆత్మహత్యాయత్నం ఆరోపణలు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని కోర్టు స్పష్టం చేసింది. జుడీషియల్ కస్టడీలో ఉన్న షర్మిలను తక్షణం విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఇరోమ్ షర్మిల విషయంలో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును కోర్టు తప్పుపట్టింది.

కాంగ్రెస్‌కి ప్రతిపక్ష హోదా లేదు.. తేల్చేసిన స్పీకర్

  లోక్‌సభలో ప్రతిపక్ష హోదాపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. అయితే ఆ డిమాండ్‌ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. సభ నియమాలను అధ్యయనం చేసిన తరువాత ఆమె కాంగ్రెస్ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరాదన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పీకర్ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక లేఖ అందింది. లోక్‌సభలో తమ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గేకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పీకర్ మహాజన్‌కు గతంలోనే లేఖ రాశారు. ఈ అంశంపై అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ అభిప్రాయాన్ని స్పీకర్ తెలుసుకున్నారు. లోక్‌సభలో 282 సీట్లు గెలుచుకున్న బీజేపీ తరువాత 44 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ప్రతిపక్ష నేత హోదాకోసం మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. అయితే అవసరమైన 10 శాతం సీట్లకు 11 స్థానాల దూరంలో కాంగ్రెస్ ఉన్నందున కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చుతున్నట్టు స్పీకర్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే ప్రస్తుత నియమాలను మార్చాల్సి ఉంటుందని, ఇది సభలో జరగాల్సిన వ్యవహారమని ఆమె అన్నారు.

సింగపూర్‌కి చేరుకున్న కేసీఆర్ బ‌ృందం

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి బయల్దేరి సింగపూర్‌కి చేరుకున్నారు. అక్కడ ఆయన నాలుగు రోజులపాటు పర్యటిస్తారు. కేసీఆర్‌తోపాటు మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు కూడా సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. ముఖ్యంగా ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడానికి కేసీఆర్ సింగపూర్ వెళ్ళారు. 22, 23 తేదీలలో ఈ సమ్మేళనం జరగనుంది. కేసీఆర్ 24వ తేదీన తిరిగి వస్తారు. తెలంగాణను అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని కేసీఆర్ చెబుతున్నారు. సింగపూర్ పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. సింగపూర్ పర్యటన ముగిసిన అనంతరం ఆయన మలేసియాకు వెళ్తారు. ఆరు పదులు దాటిన కేసీఆర్ తన జీవితంలో మొదటిసారి విదేశాలకు వెళ్ళారు. గతంలో అనేక పదవులు నిర్వహించినప్పటికీ ఆయన ఎప్పుడూ దేశం దాటి వెళ్ళలేదు. మొన్నటి వరకూ ఆయనకు పాస్ పోర్ట్ లేదని, మూడు రోజుల క్రితమే ఆయనకి పాస్ పోర్ట్ వచ్చింది.

అసెంబ్లీలో యనమల బడ్జెట్ ప్రతిపాదనలు

  రాష్ట్ర విభజన తర్వాత రూపొందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఈ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం 11 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఉదయం 8 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమై బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. అనంతరం బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టారు. సభలో ఆమోదం పొందిన తర్వాత బడ్జెట్ పత్రాలను గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పదేళ్ళ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించినట్టు ఆయన తెలిపారు.

కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదు.. పాకిస్థాన్ వాగుడు..

  పాకిస్థాన్ హద్దులు మీరుతోంది. నోటికొచ్చినట్టు వాగుతోంది. చివరికి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదన్న మాట పాపిష్ఠి పాకిస్థాన్ నోటి నుంచి వచ్చింది. ఇంతకాలం జమ్ము-కాశ్మీర్‌ని వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ వచ్చిన పాకిస్థాన్ ఇప్పుడు ఎవర్ని చూసుకునో కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదన్న మాటలు మాట్లాడుతోంది. కాశ్మీర్‌లోని వేర్పాటువాదులైన హురియత్ నాయకులతో భారతదేశంలోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చర్చలు జరపడంతో భారత్ ఆగ్రహించింది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దాంతో పాకిస్థాన్‌ ఈ పొగరుబోతు మాటలు మాట్లాడుతోంది. పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తస్నిం అస్లాం స్పందిస్తూ, ‘‘కాశ్మీర్ వేర్పాటు వాదులతో మాట్లాడటం భారతదేశ ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం కాదు. చర్చల విరమణకు భారతదేశం దీన్నొక సాకుగా తీసుకుంటోంది. భారతదేశం అనుకుంటున్నట్టుగా కాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగం కాదు. అదొక వివాదాస్పద భూభాగం. దానిపై ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాలున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. అలాగే కాశ్మీర్ అంశం ఎంతమాత్రం భారత అంతర్గత సమస్య కాదని, అది ముమ్మాటికీ అంతర్జాతీయ సమస్యేనని వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ షా గిలానీ తేల్చిచెప్పారు.

రవిశాస్త్రి మార్పు మంచిదే...

  భారత క్రికెట్ జట్టు టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రి నియామకం మంచిదేనని, దానివల్ల ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. ఈ మార్పు భారత క్రికెట్‌కు మంచిదేనని అన్నారు. అయితే ఇంగ్లండ్‌తో గత మూడు టెస్టుల్లో ఎదురైన పరాభవాల నేపథ్యంలో కెప్టెన్ ధోనిని, కోచ్ ఫ్లెచర్‌ను మార్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఫ్లెచర్ భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడడం తగదని అన్నారు. ‘బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని కెప్టెన్, కోచ్‌లకు తెలిపాను. వారిద్దరూ దీనికి అంగీకరించారు. ప్రతీ విషయాన్నీ ఆయనే పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఏ విషయంలోనైనా ఆయన నా సహాయం కోరితే సంతోషంగా అంగీకరిస్తాను’ అని పటేల్ అన్నారు.

నిజమే... ఎల్లంగౌడ్ లొంగిపోయాడు...

  నకిలీ నోట్ల చెలామణీ ముఠా నాయకుడు, హైదరాబాద్‌ శివార్లలో ఒక కానిస్టేబుల్‌ని కాల్చిచంపిన ఎల్లంగౌడ్‌ని అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. అయితే ఎల్లంగౌడ్‌ని అరెస్టు చేయడంలో పోలీసుల ప్రతాపం ఏమీ లేదని, ఎల్లంగౌడ్‌ తానే లొంగిపోయాడని తెలుస్తోంది. ఎల్లంగౌడ్ హైదరాబాద్ శివార్లలో కానిస్టేబుల్‌ని కాల్చి చంపిన తర్వాత అతగాడిని పట్టుకోవడానికి ఆరు పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ బృందాలేవీ ఎల్లంగౌడ్‌ని పట్టుకోవడంతో ప్రగతి సాధించలేదని తెలుస్తోంది. చివరికి ఒఖ రాజకీయ నాయకుడి ద్వారా ఎల్లంగౌడ్ స్వయంగా లొంగిపోయినట్టు తెలుస్తోంది. మొదట ఎల్లంగౌడ్‌ని తామే అరెస్టు చేశామని ప్రకటించుకున్న పోలీసులు ఆ తర్వాత ఎల్లంగౌడ్‌ లొంగిపోయాడని తెలిపారు.