పది శాతం వాటా ఇస్తే చాలు: జగన్

  ఈరోజు శాసనసభలో తెదేపా, వైకాపా సభ్యుల మధ్య హత్యా రాజకీయాలపై వాదోపవాదాలు జరిగాయి. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “పరిటాల రవి హత్యతో నాకు ఎటువంటి సంబంధమూ లేకపోయినా, తెదేపా సభ్యులు పదేపదే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ, ఆ కేసుతో సంబంధం ఉన్న జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ ని తెదేపాలోకి ఏవిధంగా ఆహ్వానించి టికెట్ ఇచ్చారు? నేను లక్ష కోట్లు కూడబెట్టానని తెదేపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. వారు గనుక నిజంగా నావద్ద లక్ష కోట్లున్నాయని నమ్ముతున్నట్లయితే, దానిలో కేవలం పది శాతం నాకిచ్చి మిగిలినది అంతా వారే తీసుకోవచ్చును. తెదేపా నేతలు ఇకనయినా ఈ అసత్య ప్రచారం మానుకోకుంటే వారిపై పరువు నష్టం దావా వేస్తాను,” అని హెచ్చరించారు.

జగన్ బంపర్ ఆఫర్... లక్షకోట్లలో పదిశాతం...

  వైసీపీ నాయకుడు జగన్ తెలుగుదేశం పార్టీకి బిగ్ ఆఫర్ ఇచ్చారు! తన వద్ద లక్ష కోట్లు ఉన్నాయని టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారని, తన దగ్గర అంత డబ్బు ఉంటే.. పది శాతం తనకు ఇచ్చి మిగతాది టీడీపీ నేతలు తీసుకోవచ్చని చెప్పారు. తనకు సంబంధం లేని పరిటాల రవి హత్య కేసులో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, పరిటాల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ బ్రదర్స్‌ను తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించాలని వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

సీమాంధ్రులను తరిమేయడానికే సర్వే... వీడియో విడుదల...

  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే అసలు ఉద్దేశం హైదరాబాద్ నగరంలో సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన దాదాపు 55 వేల మంది ఉద్యోగులు, లక్ష మంది విద్యార్థులను ఈ నగరం నుంచి పంపేయడమేనంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో పీఆర్వోగా పనిచేస్తున్న విజయ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యల వీడియో తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీడియాకి విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా నెట్వర్క్లో హల్చల్ చేస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వేము నరేందర్ రెడ్డి ఈ వీడియోను విడుదల చేశారు. సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం పీఆర్వో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇందులో ఉన్నాయి.

సమగ్ర కుటుంబ సర్వే చేసుకోండి: హైకోర్టు

  తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకి హైకోర్టు సానుకూలత వ్యక్తం చేసింది. ఇప్పటికిప్పుడు సర్వేని ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. ఈ విషయం మీద కృష్ణయ్య అనే న్యాయవాది హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం నాడు ఈ పిటిషన్ మీద న్యాయమూర్తి ఇంట్లో విచారణ జరిగింది. జీహెచ్ఎంసీ తరఫున కమిషనర్ సోమేష్ కుమార్ న్యాయమూర్తి ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమగ్ర కుటుంబ సర్వేకి సానుకూలంగా హైకోర్టు స్పందించింది. సర్వే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. సర్వే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే హై కోర్టుకు స్పష్టమైన వివరణ ఇచ్చిందని పేర్కొంది. జీవో నంబర్ యభైలో సర్వేకి సంబంధించిన అన్ని వివరాలనూ ప్రభుత్వం స్పష్టంగా తెలిపిందని హైకోర్టు పేర్కొంది.

సమగ్ర సర్వేపై కీలక సమాచారం...

  తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన కీలక సమాచారం వెల్లడి అయింది. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఈ సమాచారాన్ని బయటకి వెల్లడించారు. సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కొంతమంది ఎన్యుమరేటర్లు ప్రజల దగ్గర వున్న ప్రతి సర్టిఫికెట్, కార్డుకు ఫొటోస్టాట్ కాపీ కావాలని అడుగుతుండటంతో ప్రజల్లో ఈ విషయంలో అయోమయం తలెత్తింది. జీహెచ్ఎంసీ కాల్ సెంటర్కు దీనిపై భారీ సంఖ్యలో ఫోన్లు వస్తుండటంతో కమిషనర్ సోమేష్ కుమార్ ఈ అంశంపై ఓ స్పష్టత ఇచ్చారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ఎలాంటి ఫొటోస్టాట్ (జిరాక్స్) కాపీలు ఇవ్వక్కర్లేదని ఆయన చెప్పారు. కేవలం ఒరిజినల్ ఐడీ కార్డులు చూపెడితే సరిపోతుందని వివరించారు. అందువల్ల మంగళవారం జరిగే సమగ్ర సర్వేకి సంబంధించి ఏ ఫొటోస్టాట్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదు.

లోటస్‌పాండ్ మీటింగ్... 20 మంది ఎమ్మెల్యేల డుమ్మా...

  వైసీపీ అధ్యక్షుడు జగన్ హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో వున్న గల తన నివాసంలో ఆదివారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడం రాజకీయవర్గాల్లో చర్చకి కారణమైంది. ఈ సమావేశానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన వైసీపీఎల్పీ సమావేశం 20 మంది పార్టీ శానససభ్యులు హాజరు కాకపోవడంతో పార్టీ అధ్యక్షుడు జగన్ వారి కోసం ఎదురుచూసి రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. ఆలస్యంగా కూడా వారు రాలేదు. ప్రయాణ సౌకర్యం లేనందున, వ్యక్తిగత పనుల కారణంగా రాలేకపోతున్నట్లు కొంత మంది తెలియజేసినట్లు సమాచారం. అయితే, కొంత మంది మాత్రం ఏ విధమైన సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. దీంతో జగన్ తీవ్రంగా మండిపడినట్లు చెబుతున్నారు. సమావేశానికి హాజరు కాని ఈ 20 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి చేరువ అవుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి.

సమగ్ర సర్వేపై విచారణ పన్నెండున్నరకి వాయిదా...

  మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో విచారణ ప్రారంభమైంది. కృష్ణయ్య అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో ఈ విచారణ జరుగుతోంది. ఈ విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ హాజరయ్యారు. సమగ్ర సర్వే నిర్బంధం కాదని, ఇది ఐచ్ఛిక సర్వే అని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు ఇప్పటికే విన్నవించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విచారణ మధ్యాహ్నం పన్నెండున్నరకి వాయిదా పడింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎలాంటి జీవో లేకుండా విచారణ జరపడం చట్ట విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఆర్టికల్ 162 ప్రకారం ప్రభుత్వ సర్కులర్ చెల్లుబాటు కాదని న్యాయమూర్తికి విన్నవించారు. పంచాయితీరాజ్ విభాగం నుంచి కేవలం సర్కులర్ మాత్రమే జారీ చేశారని పేర్కొన్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో చూడాల్సి వుంది.

విశాఖ విమానాశ్రయం.. సినిమావాళ్ళకి భూములు...

  విశాఖపట్టణం అభివృద్ధికి సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు వివరించారు. ఇప్పటికే విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. అంతర్జాతీయ విమానశ్రయం ఏర్పాటు చేయాలని కూడా సంకల్పించారు. అయితే ఇప్పుడున్న విమానాశ్రయం నేవీ అధీనంలో వుంది కాబట్టి కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటును నేవీ వ్యతిరేకిస్తోందని మంత్రి అయన్నపాత్రుడు తెలిపారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యపడదు. అలాగే విశాఖ పట్టణంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే విశాఖలో సినిమా పరిశ్రమ కోసం 1500 ఎకరాల భూమిని సిద్ధం చేశారు. సినిమా పరిశ్రమ ఎప్పుడు విశాఖకు తరలి వస్తే అప్పుడు భూమి అప్పగిస్తామని మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు.

ఓడిపోతామని తెలిసినా నందిగామలో జగన్ పార్టీ పోటీ...

  కృష్ణాజిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మరణంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ స్థానం నుంచి తంగిరాల కుటుంబ సభ్యులే పోటీ చేసే అవకాశం వుంది అక్కడ తంగిరాల కుటుంబానికి చెందిన వ్యక్తే గెలిచే అవకాశం వుంది. కారణం, ప్రజల్లో తంగిరాలకు ఉన్న మంచి పేరు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసినప్పటికీ పోటీలో నిలవాలని జగన్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, నందిగామ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నందిగామ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో అక్కడ రాజకీయ సందడి నెలకొంది.

సమగ్ర కుటుంబ సర్వే ఉపసంహరణ

  తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేని పోలవరం ముంపు మండలాలలో ఉపసంహరించారు. ఖమ్మం జిల్లాలోని కూనవరం, వర రామచంద్రాపురం, చింతూరు, వేలేరుపాడు, కుక్కునూను, భద్రాచలం (భద్రాచలం పట్టణం మినహా) మండలాలలో కూడా సమగ్ర కుటుంబ సర్వే జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో అక్కడి ప్రజల్లో అయోమయం నెలకొంది. తాము ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవాళ్ళమా, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళమా అనే అయోమయంలో పడిపోయారు. అయితే ఈ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో ఈ ప్రాంతాలతో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. దాంతో తమ తప్పు తెలుసుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ మండలాలలో సర్వే నిర్వహించరాదని ఆయా మండలాల తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఈ ఆరు మండలాలలో సర్వే ఉపసంహరించుకున్నారు.

హైదరాబాదులోనే ఉంటా: చంద్రబాబు

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన తరువాత, ఇక ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా వివిధ మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను విజయవాడకు తరలించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టమని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో గల మేధా టవర్స్ ఐటీ పార్కులో ఉన్న విశాలమయిన భవనసముదాయంలో వివిధ శాఖలకు కార్యాలయాలు కేటాయింపు మొదలయినట్లు తాజా సమాచారం. మంత్రి నారాయణ మాట్లాడుతూ త్వరలోనే శాఖల కార్యాలయాలు హైదరాబాదు నుండి విజయవాడకు తరలింపు కార్యక్రమం కూడా మొదలవుతుందని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ముందు చెప్పినట్లుగానే, హైదరాబాదు, విజయవాడ మధ్య తిరుగుతూ పరిపాలన కొనసాగించవచ్చును. నిజానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వీలయినంత త్వరగా విజయవాడకు తరలిపోవాలని భావిస్తున్నప్పటికీ, జంట నగరాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజల పట్ల తెలంగాణా ప్రభుత్వం వైఖరిలో మార్పు కనబడనంత వరకు అక్కడి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదును వీడకపోవచ్చును. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదులో మరో పదేళ్ళపాటు ఉండేందుకు అవకాశం ఉన్నందున, వీలయినంత కాలం అక్కడ నుండే పరిపాలన కొనసాగిస్తానని చెప్పడం గమనిస్తే, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించినప్పటికీ, జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రప్రజలకు అండగా నిలిచేందుకే ఆయన హైదరాబాదును అంటిపెట్టుకొని ఉంటున్నారని భావించవచ్చును.

ఏపీ శాసనసభ సమావేశాలలో వైకాపా రభస

   కొద్ది సేపటి క్రితం మొదలయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వైకాపా సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఇప్పటికి రెండు సార్లు వాయిదాపడి, మళ్ళీ మూడవసారి మొదలయ్యాయి. కానీ వైకాపా సభ్యులు సభను కొనసాగనివ్వడం లేదు. రాష్ట్రంలో క్షీణిస్తున్నశాంతి భద్రతలపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై స్పీకర్ చర్చకు అంగీకరించేవరకు తమ ఆందోళన విరమించమని వైకాపా స్పష్టం చేసింది. వారి ఆందోళన నడుమే స్పీకర్ సభా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార తెదేపా హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని వైకాపా నేత శ్రీకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి అచ్చెం నాయుడు అంతే ధీటుగా బదులిస్తూ ఆపని చేసినవారే ప్రభుత్వాన్ని నిందించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని ఎద్దేవా చేసారు. ప్రస్తుతం రాష్ట్రం ఒక సంధి దశలో ఉంది. అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఈ సమస్యలన్నిటిపై అధికార, ప్రతిక్ష పార్టీలు శాసనసభలో చర్చించి, వాటి పరిష్కారం కోసం ప్రయత్నించవలసి ఉంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 12వరకు జరగవలసి ఉండగా, తెలంగాణా రాష్ట్ర శాసనసభ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 6వ తేదీతోనే ముగిస్తున్నారు. జీరో అవర్లో దానిపై చర్చకు స్పీకర్ అనుమతించినప్పటికీ విలువయిన కొద్దిపాటి సమయాన్ని హత్యారాజకీయాలపై చర్చజరగాలంటూ వైకాపా సభను స్తంభింపజేయడం చాలా అనుచితం.

ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా

  ఈత కొట్టడానికి వెళ్ళిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన హైదరాబాద్‌లోని గండిపేట చెరువులో జరిగింది. ఈతకు వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ యువకులు ఈ విషయంలో జాగ్రత్తగా వుండటం లేదు. ఫలితం.. తల్లిదండ్రులకు గర్భశోకంగా మిగులుతోంది. హైదరాబాద్ గండిపేట చెరువులోకి స్నానానికి వెళ్లిన హుమాయున్ నగర్‌కు చెందిన అబ్దుల్, సల్మాన్, సతీష్ అనే యువకులు నీళ్ళలోకి దిగిన వెంటనే మునిగిపోయి చనిపోయారు. గండిపేట చెరువులో రాళ్ళు బాగా ఎత్తు పల్లాలతో వుంటాయి. అడుగు తీసి అడుగు వేస్తే నీటి లోపలకి జారిపోయే విధంగా పరిస్థితి వుంటుంది. ఈ ముగ్గురు యువకులు మరణించడానికి కూడా ఇదే కారణమని స్థానికులు భావిస్తున్నారు.

కేసీఆర్ సర్వే ఆంధ్రోళ్ళని తరిమేయడానికేనట... వీడియో

  తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే మీద ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. కేసీఆర్ ఈ సర్వేని సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారిని భయభ్రాంతులకు గురిచేయడానికి నిర్వహిస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదో మిలటరీ రూల్ మాదిరిగా నిర్వహిస్తున్న ఈ సర్వే మీద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారిలో మాత్రమే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సర్వే బలవంతంగా చేయమని, ప్రజల మీద సర్వే రుద్దమని, ఇష్టం వున్నవారే సర్వేకి సహకరించవచ్చని కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ సర్వే మీద అందర్లోనూ అనుమానాలున్నాయి. ఆ అనుమానాలకు తగ్గట్టుగానే ఈ సర్వే నిర్వహిస్తోంది తెలంగాణలోని సీమాంధ్ర విద్యార్థులను, ఉద్యోగులను తరిమేయడానికే అనడానికి ఒక వీడియో ఆధారం దొరికింది. సీఎం కేసీఆర్ పీఆర్వో విజయ్ అనే వ్యక్తి మాట్లాడినట్టుగా భావిస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ప్రసాద్‌ అనే పేరుతో పేర్కొంటున్న వ్యక్తి తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వే చేయిస్తున్నది సీమాంధ్రులను తరిమేయడానికేనిన స్పష్టంగా చెప్పడం భయాందోళనలు కలిగిస్తోంది. అసలు ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు... అతను నిజంగానే కేసీఆర్ పీఆర్వోనా? తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే వెనుక ఉన్న ఉద్దేశం సీమాంధ్రులను తరిమేయడమేనా? ఈ అంశాలన్నిటి మీద స్పష్టత వచ్చేలా చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద వుంది.ఈ కింది వీడియో చూస్తే అసలు విషయమంతా తెలిసిపోతుంది.

కొలిక్కి వచ్చిన సివిల్ సర్వీసెస్ విభజన

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల విభజన ఒక కొలిక్కివచ్చింది. ఈ అంశం మీద ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం సమావేశం అయ్యింది. లాటరీ ప్రక్రియ ద్వారా రోస్టర్ విధానంతో అధికారుల కేటాయింపు పూర్తి చేసింది. లాటరీలో మొదట తెలంగాణ రాష్ట్రం పేరు రావడంతో రోస్టర్ విధానాన్ని తెలంగాణ నుంచే అమలు చేశారు. రెండు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ పోస్టులను లాటరీ ద్వారా నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఐఏఎస్-163, ఐపీఎస్-112, ఐఎఫ్‌ఎస్-65 మంది అధికారులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కు ఐఏఎస్-211, ఐపీఎస్-144, ఐఎఫ్‌ఎస్-85 మంది అధికారులను కేటాయించారు. వచ్చే శనివారానికల్లా అధికారుల కేటాయింపు పూర్తవుతుంది. అధికారుల విభజన 13:10 నిష్ఫత్తిలో జరుతుతుంది.