అనుష్కకి అదేషాక్ తగులుతుందా..?

సినీ పరిశ్రమలో  హీరోలూ తమ సినిమాల్లో వచ్చిన లాభాల్లో వాటా కావాలని అడగటం పరిపాటి. ఇప్పుడు హీరోయిన్ లు కూడా కాస్త తెలివిమీరి పోయారు. వాళ్లకు కూడా సినిమాకి వచ్చిన లాభాల్లో వాటా అడుగుతున్నారు. టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న అనుష్క కూడా ఇదే దారిపట్టింది. తను ఆర్య జంటగా నటిస్తున్న సైజ్ జీరో సినిమా పై ఇప్పటికే అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఈ సినిమాకి గాను అనుష్క పారితోషికానికి బదులు సినిమాకి వచ్చిన ప్రాఫిట్ లో వాటా కావాలని అడుగుతుందట. గతంలో ఛార్మి కూడా జ్యోతి లక్ష్మీ సినిమాకి ఇలాగే చేసి చేతులు కాల్చుకుంది. మరి సినిమా హిట్ అయితే పర్లేదు కానీ ఏదైనా అటూ ఇటూ జరిగితే అనుష్క పరిస్థితి కూడా అలాగే అవుతుందా చెవులు కొరుక్కుంటున్నారు.  

కేంద్రానికి సుప్రీం ప్రశ్న... మీ వైఖరేంటీ

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని కృష్ణా జలాల వివాదంపై మీ వైఖరి చెప్పాలని సూటిగా ప్రశ్నించింది. గతంలో రాష్ట్ర ఒకటిగా ఉన్నప్పుడు బ్రిజేష్‌కుమార్‌ తుది, మధ్యంతర తీర్పు అమలు నిలిపివేయాలని పిటిషన్ వేశారు దీనిపై సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు జరుగగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వైద్యనాథన్‌ హాజరై వాదనలు వినిపించారు. అయితే వాదనలు విన్న సుప్రీంకోర్టు కృష్ణా జలాల వివాదంపై కేంద్రం వైఖరి చెప్పాలని అదేసమయంలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటి వాటాలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

నాందేడ్ రైలు ప్రమాదం.. గ్రానైట్ రాయికి పూజలు

  బెంగుళూరు నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు అనంతపురలంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ఓ గ్రానైట్ లారీ అదుపు తప్పి రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురి ప్రాణాలు బలిగొన్న. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రాణాలను బలిగొన్న గ్రానైట్ రాయికి ఎవరో పూజలు చేశారు. రైల్వే ట్రాక్ పక్కనే పడి ఉన్న 20 టన్నుల గ్రానైట్ రాయికి గుర్తు తెలియని వ్యక్తులు పసుపు కుంకుమ జల్లి కొబ్బరికాయ కొట్టారు పూజలు చేయడంతో కలకలం రేపింది. అయితే గ్రానైట్ రాయికి సంబంధించిన యజమానులే ఈ పూజలు నిర్వహించి ఉంటారని అంటున్నారు. మరోవైపు ఇంకోసారి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలనే పూజలు నిర్వహించారని మరికొందరు అంటున్నారు. అంతేకాదు ఈ ప్రమాదంలో తక్కువ ప్రాణ నష్టం జరిగినందుకు రైల్వే అధికారుల సూచన మేరకు కొందరు కాంట్రాక్టర్లు పూజలు నిర్వహించారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పూజలు ఎవరు చేశారో.. ఎందుకు చేశారో తెలియదు కాని ఇప్పుడు అక్కడ అది పెద్ద హాట్ టాపిక్ అయింది.

ఆవిషయం మీరే చెప్పండి.. చంద్రబాబు

ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు మరియు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా తదితరులు పాల్గొన్నారు. ముందు 45 నిమిషాలు మాత్రమే అపాయింట్ మెంట్ ఉండగా ఈ చర్చ మాత్రం దాదాపు గంటన్నర పైగా సాగింది. ఏపీ ప్రత్యేక హోదాపైన సమస్యలపైన సుదీర్ఘ జరిగింది. సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఆర్ధికంగా చాలా నష్టపోయిందని.. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని వదులుకోవడం వల్ల చాలా నష్టపోయామని.. అంతేకాక తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్రులపై వ్యవహరిస్తున్న తీరు తదితర విషయాలు మాట్లాడారు. మాకు ఇష్టం లేకుండా రాష్ట్ర విభజన చేశారు.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లా ఏపీ అభివృద్ధి చెందాలని దానికి కేంద్రమే సహాయం చేయాలని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందేనని.. ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వని నేపథ్యంలో ఎందుకు ఇవ్వలేక పోతున్నారో కూడా మీరే చెప్పాలని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే చంద్రబాబు చెప్పిన అంశాలన్నింటిని విన్న మోదీ స్పందించి ‘‘ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే. ఏపీ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలో ఉన్న అంశాలు, కేంద్రం ఇచ్చిన హామీలకు మేం కట్టుబడి ఉన్నాం.. వాటి నుంచి వైదొలగే ఆలోచన లేదు’’ అని తేల్చి చెప్పారు. అయితే చంద్రబాబు ఏపీ సమస్యలను మోదీకి వివరిస్తున్నప్పుడు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా ఒకటి రెండుసార్లు అడ్డుపడగా చంద్రబాబు కూడా గట్టిగానే సమాధానమిచ్చారు. రుణ మాఫీ పేరుతో ఎక్కువ ఖర్చు చేశారని ఇప్పుడు లోటు బడ్జెట్‌ అని మా వద్దకు వస్తే ఎలా?’’ అని ప్రశ్నించగా..  రైతులకు రుణ మాఫీ మా ఎన్నికల వాగ్దానం. అభివృద్ధితోపాటు సంక్షేమం కూడా సమతుల్యం చేసుకోవాలి. ఆర్థిక సిద్ధాంతాలు వినడానికి బాగానే ఉంటాయి కానీ రాజకీయంగా మా మనుగడ కూడా చూసుకోవాలి. రైతులు బాగా చితికిపోయినందువల్లే ఆ హామీ ఇచ్చాం. అమలు చేశాం’’ అని కాస్త ఘాటుగానే చెప్పారు.

ఏపీకి కేంద్రం మరో ఝలక్

కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరోషాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?రాదా అనే సందేహాలే ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ప్రత్యేక హోదా విషయంపై నిన్న చర్చించిన విషయం తెలిసిందే. అయితే విభజన చట్టంలో ఉన్నహామీలన్ని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఏపీ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తామని చెప్పింది కానీ ప్రత్యేక హోదాపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కానీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ప్రత్యేక హోదాపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి.. ప్రత్యేక హోదా విషయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. హోదాకు బదులు రాష్ట్రానికి కావాల్సిన, దక్కాల్సిన సాయం అంతటిని కేంద్రం చేస్తుందని చెప్పారు. దీని బట్టి ప్రత్యేక హోదా చాలా వరకూ రానట్టే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదాపై షాకిచ్చిన కేంద్రం విజయవాడ నగరానికి మెట్రో రైలు లేదని  చెప్పి మరో షాకిచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావించిన మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి చుక్కెదురైంది. ఏ నగరంలోనైనా మెట్రోరైలు రావాలంటే ఆనగర జనాభా కనీసం 20 లక్షలకు పైగా ఉండాలని కానీ విజయవాడలో 15 లక్షల కంటే తక్కువ జనాభా ఉందని కాబట్టి విజయవాడకు మెట్రో అవసరం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నెల రోజుల ముందే లేఖ రాసింది.

"చిరుదోశ".. రాంచరణ్ గిఫ్ట్

  చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి తనయుడు రాంచరణ్ దోశను గిఫ్ట్ గా ఇచ్చాడు. రాంచరణ్ ఏంటి దోశ గిఫ్ట్ ఇవ్వడమేంటి అనుకుంటున్నారా.. అక్కడే ఉంది ట్విస్ట్.. చిరంజీవి పుట్టిన రోజుకు వినూత్న పద్దతిలో రాంచరణ్ చిరంజీవికి.. చిరుదోశ పేరిట బహుమతి ఇచ్చాడు. చిరుదోశ ఏంటని అనుకుంటున్నారా అదే చిరంజీవి పేరుతో చిరుదోశ. దీని సంబంధించిన రాంచరణ్ తేజ్ పేటెంట్ రైట్స్ కు దరఖాస్తు చేశారు. అంతేకాదు చిరుదోశకు పేటెంట్‌ వచ్చిన వెంటనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్టాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా చిరుదోశ లభిస్తుందని రామ్ చరణ్ తెలియచేసారు. దోశలో పల్లీల పచ్చడితో పాటు శాకాహార, మాంసాహార కూరలను కూడా అందివ్వనున్నట్టు.. అంతేగాక తక్కువ ధరకే నాణ్యమైన వంటకాలను కూడా వినియోగదారులకు అందించనున్నట్లు తెలియచేసారు. ఇప్పటి వరకూ దోశల్లో ఎన్నో వైరైటీలు తిని ఉంటాం అయితే ఇక నుండి చిరుదోశ కూడా తినచ్చు.

23ఎకరాల్లో తాత్కాలిక రాజధాని ఏర్పాటు?

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో హైదరాబాద్ నుండి ఉద్యోగులను, ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకి తరలించబోతున్నందున అందుకు అవసరమయిన ఏర్పాట్లను చురుకుగా చేస్తోంది. విజయవాడ, గుంటూరు పట్టణాలలో ఉన్న ప్రభుత్వ భవనాలను అన్నిటినీ ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకొని, ఉన్నతాధికారుల కార్యాలయాలన్నిటినీ ఒకేచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం విజయవాడ-గుంటూరు మధ్య హైవేని ఆనుకొని ఉన్న హరిహాంత్ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన 23ఎకరాలను స్వాధీనం చేసుకొని అందులో తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సిద్దం అవుతోంది. అందుకోసం ఆ సంస్థ నుండి భూమిని స్వాధీనం చేసుకొంటూ ఒక జి.ఓ.జారీ చేసింది. అందుకు బదులుగా ఆ సంస్థకు నవులూరు వద్ద అంతే మొత్తం స్థలం కేటాయించబోతోంది.   ఉన్నతాధికారులు, మంత్రుల కార్యాలయాలన్నీ ఇక్కడే ఏర్పాటు చేయడం ద్వారా రాజధాని నిర్మాణ పనుల పర్యవేక్షణ, రాష్ట్ర పరిపాలన వ్యవహారాలు అన్నీ ఇక్కడి నుండే చక్కబెట్టడం సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయం కూడా అక్కడే నిర్మిస్తారో లేక వేరే చోట ఏర్పాటు చేస్తారో ఇంకా తెలియదు. ఒకవేళ సచివాలయం కూడా అక్కడే ఏర్పాటు చేస్తే మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ ఇక్కడ నుండే పనిచేస్తారు కనుక అదే రాష్ట్రానికి ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉంటుంది. త్వరలోనే అక్కడ తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. అక్కడ శాశ్విత భవనాలు కాకుండా ప్రీ-ఫ్యాబ్రికేటడ్ భవనాలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా శాశ్విత రాజధానిలో భవనాలు సిద్దం కాగానే, ఈ తాత్కాలిక భవనాలను ఎటువంటి నష్టమూ లేకుండా తొలగించవచ్చును.

ఫిర్యాదు పై బెదిరింపు.. మళ్లీ రేప్ చేస్తా..

  కంప్లైట్ వెనక్కి తీసుకో లేదంటే మరోసారి రేప్ చేస్తా.. ఇది ఒక నిందితుడు బాధితురాలని బెదిరించిన విధానం. ఈ ఘటన ఎక్కడ జరగిందనుకుంటున్నారా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లా కుర్వారాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుర్వార గ్రామానికి చెందిన  అంకుర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడికోసం దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలో నిందితుడు యువతిపై బెదిరింపులు మొదలుపెట్టాడు. ఇంట్లో తాను ఒంటరిగా ఉన్న సమయంలో బాధితురాలని కలిసి తనపై పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని లేకపోతే మరోసారి రేప్ చేస్తానని బెదరించాడట. దీంతో బాధితురాలు మళ్లీ నిందితుడి వైఖరిపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో ప్రత్యేక బృందంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పవన్ కళ్యాణ్ కు అవగాహన లేదు.. మురళీమోహన్

భూసేకరణ వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత మురళీ మోహన్ పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మురళీ మోహన్ స్పందించారు. రాజధాని ప్రాంతంలో తాను భూమిని  కొనుగోలు చేశానన్న వార్తలు అవాస్తవమని.. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అవసరమైతే తాను కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి భూసేకరణ విషయంలో రాజధానిలో పర్యటిస్తానని.. రాజధాని ప్రాంతంలో తనకు అంగుళం భూమి కూడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీనే రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఔటర్ రింగు రోడ్డు కోసం తన 18 ఎకరాల భూమిని లాక్కుందని.. ఈ నేపథ్యంలోనే తను సుప్రీంకోర్టును ఆశ్రయించానని అన్నారు. ఇదిలా ఉండగా తానే పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. భూసేకరణ విషయంలో రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దని పవన్ కళ్యాణ్ చెప్పేది కరెక్ట్ అని అన్నారు. అయితే, రాజధాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రైతులు భూమిని ఇవ్వాలన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఈయన గత కొంతకాలంగా గుండెపోటుతో బాధపడుతున్నారు. అయితే మంగళవారం ఉదయం ఈయన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్‌లో నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు చెబుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం ఆయన పిఏసి చైర్మన్‌గా ఉన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణ ఖేడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాగా కిష్టారెడ్డి మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ నీరుపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ జిల్లా గొప్ప నేతను కోల్పోయిందని సంతాపం తెలిపారు.  డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కిష్టా రెడ్డి మృతి తెలిసి తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు.

ఏపీకి "స్పెషల్" కాదు "స్పెషల్" 'స్పెషల్" స్టేటస్

ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై ఈ రోజు చర్చించిన విషయం  తెలిసిందే. అయితే ఈ భేటీలో ఏపీ ప్రత్యేక హోదా ఇంకా స్పష్టత రాలేదు కానీ.. కేంద్రం మాత్రం విభజన చట్టంలో అన్ని హామీలు నెరవేరుస్తామని.. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని మాత్రం చెప్పింది. అయితే ఈ ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను మించిన ఆదరణ ఇస్తుందని.. ఏపీకి స్పెషల్ స్టేటస్ కాదు.. స్పెషల్ స్పెషల్ స్టేటస్ వస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా అన్న పదం వాడేందుకు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని రాయితీలు, ప్రయోజనాలు వస్తాయో, వాటన్నింటినీ సాధించేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. తమ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అప్పుడు ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చింది ఆ హామీని తప్పకుండా నెరవేర్చాలని అన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చుతామని కేంద్రం చెప్పిందని.. అలాగే ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని.. దీనిపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు.  ఇదిలా ఉండగా ఉండగా మరోవైపు సుజనా చేసిన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ ప్యాకేజీలతో కూడిన రాయితీలు ఉంటాయని సుజనా చేసిన వ్యాఖ్యలను బట్టి ఏపీకి ప్రత్యేక హోదా రావడం అనుమానంగానే ఉందని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. అంతేకాక ఏపీకి ప్రత్యేక కాదు.. స్పెషల్ స్పెషల్ స్టేటస్ అని చేసిన వ్యాఖ్యలు కూడా నిజమేనా లేక వెటకారమా అని అనుకుంటున్నారు.

ప్రత్యేక హోదా పై షాక్

  ఏపీ ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోడీ సీఎం చంద్రబాబుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, యనమల రామకృష్ణుడు,  పలువురు అధికారులు పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ భేటీలో ఏపీ ప్రత్యేక హోదా.. ప్యాకేజీ.. ఇంకా ఏపీకి కావలసిన అవసరాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి న్యాయం చేయడానికి కేంద్ర ఎప్పుడూ సహకరిస్తుందని అన్నారు. అంతేకాదు విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని.. ఆర్ధికంగా నష్టపోయిన ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని ప్రధాని మోడీ చెప్పారని అరుణ్ జైట్లీ చెప్పారు.  అయితే ఎంతగానో ఎదురుచూస్తున్న ఏపీ ప్రత్యేక హోదాపై మాత్రం ఇప్పుడు కూడా స్పష్టత రాలేదు. ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం మా చర్చల్లో ఉందని అరుణ్ జైట్లీ బాంబు పేల్చారు. విభజన చట్టంలోని 46, 90, 94ల పైన ప్రధానంగా చర్చించామని చెప్పారు. ఈసారి కూడా ఏపీ ప్రజల ఆశలకు భ్రేక్ పడింది. మరి ఇంకా కేంద్రం ప్రత్యేక హోదాపై చర్చలు దగ్గరే ఉంది మరి దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో.. ఒకవేళ తీసుకున్నా ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

చంద్రబాబు మోడీల భేటీ.. ఓ కన్నేసిన టీ సర్కార్

ఈరోజు ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ.. సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?రాదా? ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను కేంద్రం  నెరవేరుస్తుందా ఇలా చాలా ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందని ఒక పక్క ఆంధ్ర రాష్ట్ర నేతలు ప్రజలు ఎంతలా చూస్తున్నారో మరోపక్క తెలంగాణ ప్రభుత్వం కూడా అంతలా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మోడీ.. చంద్రబాబు భేటీల పై ఓ కన్నేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఏపీకి ఇచ్చేహామీలను బట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్లాలని.. అంతేకాదు రాష్ట్ర విభజనపుడు ఆంధ్రతో పాటు తెలంగాణకు కూడా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి తీసుకురావాలని టీ సర్కార్ భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే కేంద్ర ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏమో కాని ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఏపీకి భారీగానే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏపీకి ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీ ఏ విధంగా ఉంటుందో చూసి దానిని బట్టి తెలంగాణకు ప్యాకేజీ కోసం ప్రభుత్వాన్ని కోరుతామంటున్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలనైనా అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి రాష్ట్రం లో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణనే అని.. తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైందని అన్నారు. అందుకేసమే పోరాడి  ప్రత్యేక రాష్ట్రం కోసం సాధించామని.. తెలంగాణ ప్రాంతంలో ఏడు జిల్లాలు వెనుబడి ఉన్నాయని.. ఏపీకి ఎలాగైతే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారో అలాగే తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

డీఎస్ గవర్నర్ భేటీ.. రాష్ట్రాల వివాదాలపై చర్చ

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సలహాదారు డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణకు ఇతర రాష్ట్రాలు కర్నాటక, మహారాష్ట్రలతో పలు అంశాల్లో వివాదాలున్నప్పటికీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్న వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని, అదే విధంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన ప్రయోజనాలపై దృష్టిసారించాలని డి శ్రీనివాస్ గవర్నర్‌ను కోరినట్టు సమాచారం.

చంద్రబాబు మోడీల భేటీ.. సర్వత్ర ఉత్కంఠం

  ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కూడా పాల్గొంటారు.      మరోవైపు ఇప్పటికే ఏపీకి కావలసిన అవసరాలు.. ఉన్న సమస్యలకు సంబంధించిన 200 పేజీల ముసాయిదాను ఏపీ ప్రభుత్వ తయారు చేసుకుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కావలసినంత ఇవ్వడానికి ఉన్నా ప్రత్యేక హోదా విషయంలో మాత్రం కాస్తంత వెనుకాడుతున్న నేపథ్యంలో చంద్రబాబు మాత్రం ఎలాగైనా ప్రత్యేక హోదా సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఉత్తరఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ.. ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేయనున్నారు.   అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందా?లేదా? ప్రత్యేక ప్యాకేజీ ఎంతిస్తారు? విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తారా? ఏపీకి కావలసిన అన్ని అవసరాలను తీరుస్తుందా? ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే వారి భేటీముగిసే వరకు ఆగాల్సిందే.