Women more forgiving towards attractive men

అందగాడు తప్పు చేస్తే ఆడవాళ్లకు ఓకె

తప్పులు ఎవరైనా చేస్తారు అది సహజం. కాని తప్పు చేసినవాళ్లను క్షమించే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ క్షమించడంలో కూడా మనిషి అందాన్ని బట్టి తేడా చూపిస్తారట మహిళలు. అదేంటీ అనుకుంటున్నారా... అవునండీ దీనిపై అమెరికాలో అధ్యయనం కూడా జరిగిందట. అసలు విషయం ఏంటంటే అమెరికాలోని ఈస్టన్ కెంటకీ యూనివర్సిటీకి చెందిన జెరెమీ గిబ్బన్, జొనాథన్ గోర్ అనే పరిశోధకులు ఈ అంశంపై పరిశోధన జరిపారు. దాదాపు 170 కాలేజీలకు చెందిన అమ్మాయిలను, అబ్బాయిలను పరిశోధించారట. అమ్మాయిలకు అందంగా ఉన్న అబ్బాయిలను, లేని అబ్బాయిలను చూపించి సందర్బాన్ని సృష్టించి వాళ్లలోని రియాక్షన్స్ బట్టి ఓ నివేదిక తయారుచేశారు. పరిశోధనలో తేలిందేంటంటే కాస్త అందంగా, ఆకర్షణీయంగా ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఈజీగా క్షమించేస్తారట.. కానీ అందంగా లేని వారిని కొంత సమయం వరకు క్షమించినా ఆఖరికి వారికి చెప్పుదెబ్బలు తప్పవంటున్నారు పరిశోధకులు.

revanth reddy

కాంగ్రెస్ వాళ్లు చవటలు.. టీఆర్ఎస్ వాళ్లు సన్నాసులు.. రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెదేపా మహానాడులో ఎప్పటిలాగే తన వాక్చాతుర్యాన్ని చూపించారు. మహానాడులో ప్రసంగిస్తూ ఆయన కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ప్రస్తావిస్తూ కేసీఆర్ గారు సర్వే పేరిట 12 గంటల్లో ఇంట్లో ఎంత మంది ఉన్నారు, ఎన్ని కోళ్లు ఉన్నాయి, ఎన్నిపందలు ఉన్నాయి అని లెక్కలు చూశారు కానీ 12 నెలలైనా అమర వీరుల లెక్కలు మాత్రం తేల్చలేకపోయారని ఎద్దేవ చేశారు. తెలంగాణ తొలి ఉద్యమంలో అసువులు బాసిన 369 మందికి, మలి ఉద్యమంలో పాల్గొన్న 1200 మంది అమరవీరుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ తీర్మానం చేశారు. ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలను ఎదుర్కొని తెచ్చుకున్న తెలంగాణను.. ఉద్యమానికి నాయకత్వ వహించాడన్న ఒక్క కారణంతో కేసీఆర్‌ను నమ్మి ఆయన చేతిలో పెట్టారని అన్నారు. ఓ వైపు చవటలు కాంగ్రెస్ వాళ్లు తెలంగాణ ఇచ్చామంటారు... మరోవైపు సన్నాసులు టీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ తెచ్చినం. అంటారు. వీళ్లు ఇచ్చినప్పుడు, వాళ్లు తెచ్చుకున్నప్పుడు ఉద్యమంలో అంతమంది చావులకు కారకులెవరని ప్రశ్నించారు. ఉద్యమంలో చనిపోయిన వారికి రూ. 10 లక్షలు అందిస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఆ విషయమే మర్చిపోయిందని, తాము కనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ. వెయ్యికోట్లు పెట్టి అమరవీరుల స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు.

balakrishna mahanadu

తెలంగాణలో అధికారంలోకి వస్తాం.. బాలకృష్ణ

తెదేపా 34వ మహానాడు కార్యక్రమం రెండోరోజు సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తనదైన శైలిలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో అన్ని పార్టీలను ఏకతాటిపై తెచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ పాలనలోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రభావం చూపించారని అన్నారు. ఈ రోజు బడుగు బలహీన వర్గాలు అధికారంలో ఉన్నాయంటే అది ఎన్టీఆర్ చలవేనని, వాళ్లను అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే నని వెల్లడించారు. చాలా దారుణంగా ఒక్కటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారని, విభజన తరువాత రాష్ట్రాన్నికాపాడగలిగేది ఒక్క చంద్రబాబు మాత్రమే అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Malia Obama

ఒబామా కూతురికి కట్నంగా 50 ఆవులు, 70 గొర్రెలు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూతురు మాలియా ఒబామా ఓ యువ లాయర్ మనసును దోచేసింది. కెన్యాకు చెందిన ఫెలిక్స్ కిప్రోనోది అనే యువ లాయర్ 2008 నుండి మాలియా ఒబామాను ప్రేమిస్తున్నానని, ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులతో కూడా చర్చించానని చెప్పాడు. అంతే కాదండోయ్ ఆమెకు కట్నంగా 50 ఆవులు, 70 గొర్రెలు, 30 మేకలు కూడా ఇస్తానని చెప్తున్నాడు ఈ వన్‌సైడ్ లవర్. తనది నిజమైన ప్రేమని, డబ్బు మీద ఆశతో మాలియాను లవ్ చేయడం లేదని, మాలియాను పెళ్లి చేసుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. మాలియాతో పెళ్లి విషయాన్ని జులైలో కెన్యా పర్యటనకు రానున్న ఒబామాతో మాట్లాడతానని, పర్యటనకు మాలియాను కూడా తీసుకురావల్సిందిగా లేఖ రాస్తానని తెలిపాడు. ఒకవేళ మాలియా వస్తే తనకు పాలు పితకడం, కెన్యా వంటకం ఎలా చేయాలో నేర్పిస్తానని అప్పుడే కలల లోకంలో విహరిస్తున్నాడు కిప్రోనో.

Man sets himself ablaze BJP meet

కిషన్ రెడ్డి ఎదుటే ఆత్మహత్యాయత్నం

ఓ వైపు సభ జరుగుతుంది మరోవైపు అందరూ నిశ్సబ్దంగా వింటున్నారు ఇంతలో ఓ యువకుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నల్లొంగ జిల్లాలో 'ప్రజా పునరంకిత' సభలో పాల్గొన్నారు. అయితే ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడి ఉన్న వారంతా ఉలిక్కిపడి అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. భాజపా నేత కిషన్ రెడ్డికి అయితే మాట పడిపోయి షాక్ కు గురయ్యారు. అక్కడ ఉన్న జీజేపీ కార్యకర్తలు మాత్రం ఆ యువకుడిని రక్షించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొంత సేపటికి షాక్ నుంచి తేరుకున్నకిషన్ రెడ్డి హాస్పిటల్ కి వెళ్ళి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

nara lokesh

చంద్రబాబు కంటే లోకేశ్ కే ఎక్కువ రెస్పాన్స్

బుధవారం జరిగిన 34వ తెదేపా మహానాడులో నారా లోకేశ్ కు మాత్రం మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా ప్రజలలోకి వెళ్లడం, రాష్ట్ర రాజధాని అభివృద్ధి విషయంలో అమెరికా పర్యటన చేసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన విషయంలో నారా లోకేశ్ పాత్ర చాలానే ఉంది. దీంతో ప్రజలలో ఆయనపై నమ్మకం పెరిగింది. దీనికి గాను నిన్న జరిగిన మహానాడులో కూడా ఎంతో మంది సీనియర్ తెదేపా నాయకులు ఉన్నా, ఆఖరికి చంద్రబాబు కంటే కూడా నారా లోకేశ్ కే ఎక్కువ స్పందన లభించింది. దీంతో లోకేశ్‌ కృషికి ప్రశంసలు లభించడం పార్టీలో ఆయన పాత్ర పెరగబోతోందన్న దానికి సూచికని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే చంద్రబాబు ఈ మహానాడులో లోకేశ్ కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్నప్పటికీ.. మహానాడులో ఆయన కలిసేవారు.. ఆయనను కలిసేవారిని చూస్తుంటే మాత్రం రాజోయే రోజుల్లో లోకేశ్ పార్టీకి కీలకమని తెలుస్తోంది.

National Green Tribunal

అమరావతికి లైన్ క్లియర్

  తుళ్ళూరు మండలంలో రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి నేటి వరకు కూడా అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ వాటినన్నిటినీ అధిగమించుకొంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయినా ఇంకా దానికి అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి.   సారవంతమయిన పంట భూములలో ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపడుతోందని దాని వలన సామాజిక, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని, అదే విధంగా కృష్ణా నదీ తీరాన్న నిర్మించడం వల్ల రాజధానికి వరదల ప్రమాదం కూడా పొంచి ఉందని, కనుక అక్కడ రాజధాని నిర్మించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి (‘స్టే’) ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన పందలనేని శ్రీమన్నారాయణ జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) లో ఒక పిటిషను వేశారు.   ఆయన వాదనలు విన్న జస్టిస్‌ యూడీ సాల్వి, జస్టిస్‌ ఎన్‌ఎస్‌ నంబియార్‌, నిపుణులు డాక్టర్‌ దేవేంద్ర కుమార్‌ అగర్వాల్‌, ప్రొఫెసర్‌ ఏఆర్‌ యూసుఫ్‌, బిక్రంసింగ్‌ సజ్వన్‌తో కూడిన విస్తృత ధర్మాసనం రాజధాని నిర్మాణంపై స్టే ఇచ్చేందుకు తిరస్కరించింది. కానీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఈ పిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ అంశంపై విచారణను జూలై 27కి వాయిదా వేసింది.

Vijayanagar Institute of Medical Sciences

కడుపులో 173 నాణేలు

ఓ వ్యక్తి కడుపులోంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 173 నాణేలు తీసి అరుదైన శస్త్ర చికిత్స చేశారు కర్ణాటకలోని విజయనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యులు. వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలో స్థిరపడ్డాడు. అయితే అతనికి మతిస్థిమితం లేని కారణంగా అప్పుడప్పుడు తనకు తెలియకుండా నాణేలు మింగేవాడు. దీంతో అతనికి విపరీతమైన కడుపునొప్పి, మూత్ర విసర్జన సమస్యలు తలెత్తడంతో కుటుంబసభ్యులు అతనిని ఆస్పత్రిలో చేరిపించగా స్కానింగ్ లో అతని కడుపులో నాణేలు ఉన్నట్టు చెప్పారు. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేసి 173 రూపాయి నాణేలు, ఐదు.. పది రూపాయల నాణేలు బయటకు తీశారు.

NTR

స్వర్గీయ ఎన్టీఆర్ కు ప్రముఖుల నివాళి

  స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, హరి కృష్ణ, జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు ఇంకా అనేకమంది తెదేపా నేతలు వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు, కళారంగానికి అపారమయిన సేవ చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్నఅవార్డు ఇచ్చి గౌరవించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అందుకోసం ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా కేంద్రం మీడియా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

Railway Zone

విజయవాడలో రైల్వే జోన్ ఏర్పాటుకి డిమాండ్

  మోడీ ప్రభుత్వం అధికారం చేప్పట్టి ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్వయంగా రాష్ట్రానికి వచ్చి ఆంద్రప్రదేశ్ కి రైల్వే జోన్ మంజూరు చేసినట్లు ప్రకటిస్తారని సమాచారం అందుకోగానే దానిపై కూడా అప్పుడే రాజకీయాలు మొదలయిపోయాయి. రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగానే ఏర్పాటు చేయాలని మొదటి నుండి అనుకొంటున్నదే. కనుక ఇక నేడో రేపో రైల్వే మంత్రి వచ్చి ఆ ప్రకటన చేయడమే ఆలశ్యమని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో దానిని విశాఖలో కాక విజయవాడ-గుంటూరు మధ్యనే ఏర్పాటు చేయాలంటూ రైల్వే మజ్దూర్ యూనియన్ అదనపు కార్యదర్శి అవధానుల హరి డిమాండ్ చేసారు. రాజధాని అమరావతి దగ్గర రైల్వే జోన్ ఏర్పాటు చేసి, నల్లపాడు-బీబీనగర్ ల మధ్య రైల్వే లైన్ల డబ్లింగ్ పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేసినట్లయితే ఆంద్ర, తెలంగాణా రాజధానులు మరింత బాగా అనుసంధానం అవుతాయని అన్నారు. అలాకాదని రాజకీయ కారణాలతో రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటుచేసినట్లయితే అది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని ఆయన వాదించారు. కొసమెరుపు ఏమిటంటే సురేష్ ప్రభు వచ్చేరు కానీ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించలేదు. దానిపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని త్వరలోనే శుభవార్త వింటారని ప్రకటించడంతో అందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటికే అనేక అంశాల మీద రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి కనుక ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియని ఆ రైల్వే జోన్ కోసం ప్రజలు వాదోపవాదాలు చేసుకోవడం రాష్ట్రానికి మేలు చేయదని అందరూ గ్రహించాలి.

singer

దరువు అంజన్న కిడ్నాప్?

  ప్రజా గాయకుడు, తెలంగాణ పోరాటంలో తన గళం విప్పి ఉద్యమించిన కళాకారులు, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు దరువు అంజన్న కిడ్నాప్‌కి గురైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు తన భర్త కిడ్నాప్ అయ్యాడంటూ దరువు అంజన్న భార్య సునీత హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నుంచి తన భర్తకు బెదిరింపు కాల్ వచ్చిందని, ఆ తర్వాత తన భర్త కనిపించకుండా పోయాడని, ఎమ్మెల్యే రసమయి బాలకిషనే తన భర్తను కిడ్నాప్ చేయించి వుంటాడని అనుమానిస్తున్నానని అంజన్న భార్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రసమయి బాలకిషన్‌కి వ్యతిరేకంగా అంజన్న గత కొద్దిరోజులుగా ధూంధాం నిర్వహిస్తున్నారు. అందువల్లే రసమయి బాలకిషన్ తన భర్తను కిడ్నాప్ చేయించి వుండవచ్చని అంజన్న భార్య తెలిపారు.

Lokesh speech at Mahanadu

ప్రమాదబీమా పథకం టీడీపీదే

పార్టీ కార్యకర్తలకు ప్రమాదబీమా పథకం ప్రవేశపెట్టిన ఘనత తమదేనని అన్నారు టీడీపీ యువనేత లోకేష్..ఈ కార్యక్రమాన్ని చూసే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టారని ఆయన చెప్పారు. ఆయన టిడిపి మహానాడులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీస్ లో కూర్చుని సూట్ కేసులు కలెక్ట్ చేస్తున్నాని నాపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని... సూట్ కేసులు మోసే సంస్కృతి కాంగ్రెస్ దేనని లోకేష్ విమర్శించారు. 54 లక్షల మంది కార్యకర్తలే టిడిపి బలమన్నారు. 11 నెలల్లో 50వేల మంది కార్యకర్తలను కలుసుకున్నాని, కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని లోకేష్ స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు 450 మంది కార్యకర్తల పిల్లలకు ఉపాధి కల్పించామన్నారు. కృష్ణా, వరంగల్ జిల్లాల్లో టీడీపీ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి కార్యకర్తల పిల్లలను చదివిస్తామన్నారు.

chandrababu fires on ysrcongress

వైకాపా కుట్రలను తిప్పికొట్టిన రైతులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపైన నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టుకే అక్రమమని అభివర్ణిస్తూ ఆ పార్టీ నాయకులు ఎర్రచందనం స్మగ్లర్లతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. ఎర్రచందనం అక్రమరవాణాకు పాల్పడుతున్నవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ వేదికపై నుంచి నేను అడుగుతున్నాను - మీకు ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలు లేకపోతే ఎందుకు ఖండించడంలేదు అని ఆయన ప్రశ్నించారు. మీరు లాలూచీపడ్డారు కాబట్టే ఎర్రచందనం స్మగ్లర్ల అరాచకాలను ఖండించడానికి ముందుకు రావడంలేదని ఆయన విమర్శించారు. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజధాని విషయంలో కూడా స్థానిక ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని యత్నించిందని, కాని తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని విషయంలో చిత్తశుధ్ధితో ఉందని గ్రహించిన రైతాంగం 33 వేల ఎకరాలు భూ సమీకరణకు ప్రభుత్వానికి అందించి వైసీపీ కుట్రలను భగ్నం చేశారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రైతాంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన ఈ రైతులను ఎవ్వరినీ జీవితమంతా గుర్తుపెట్టుకుంటానని ఆయన చెప్పారు.

కాంగ్రెస్‌ దుష్టపాలనలో రైతులు బలి

కాంగ్రెస్‌ పార్టీని హయాంలో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుందని, దాదాపు 25 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దుష్టఆలోచనతో కాంగ్రెస్‌ రెండు రాష్ర్టాలలోనూ బోర్లా పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ తన విధానాలవల్ల భూస్థాపితం అయ్యిందని, ఇక కోలుకునే పరిస్థితి లేదని ఆయన పునరుద్ఘాటించారు. పదేళ్లపాటు అధికారంలో కొనసాగిన కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి ఆలవాలంగా కాలయాపన చేసి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌తో, తెలంగాణాలో టీఆర్‌ఎస్‌తో మిలాఖత్‌ కావడం ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని విఫలయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. కానీ ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి ఆ పార్టీకి జీవితకాలం గుణపాఠం చెప్పారని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

2022 నాటికి టాప్‌ 3లో ఆంధ్రప్రదేశ్

విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం కలిగిందని బాబు తెలిపారు. 2022 నాటికి దేశంలోనే టాప్‌-3 స్థానంలో ఏపీ ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో విపరీతమైన సహజవనరులు ఉన్నాయన్నారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పారాశ్రామికాభివృద్ధికి సముద్ర తీరాన్ని వినియోగించనున్నట్లు చెప్పారు. భూగర్భ జలాలు పెరగాలంటే నీరు-చెట్టు కార్యక్రమం అవసరమని అభిప్రాయపడ్డారు. బిందుసేద్యం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యతనిస్తామన్నారు. ఏడాదిలోగా ప్రతి ఇంటికి ఫైబర్‌ కనెక్టివిటీని కల్పించనున్నట్లు తెలిపారు. టెక్నాలజీ ఎంత ఉపయోగించుకుంటే అంత లాభమని చంద్రబాబు పేర్కొన్నారు. అందరికీ అనువుగా ఉండాలనే అమరావతిలో రాజధాని పెట్టామని వివరించారు.