గాడిదకు గడ్డేసి.. మోడీని అడిగితే ఎలా? కిషన్ రెడ్డి..

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల తూటాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యర్ధులను ఏకిపారేయడంలో తన స్టైలే వేరు. తిట్లతో పాటు సామెతలని కూడా యాడ్ చేస్తూ చాలా గమ్మత్తుగా తిడుతుంటారు. అలా కేసీఆర్ తరుచూ వాడే సామెతే (గాడిదకు గడ్డేసి… ఆవును పాలు ఇవ్వమంటే ఇస్తుందా ?) ఇప్పుడు కేసీఆర్ పై ప్రయాగించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వరంగల్ ఉపఎన్నికల ప్రచార నేపథ్యంలో కేసీఆర్ అందరిని విమర్శించినట్టే కిషన్ రెడ్డిని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ సమయంలో రాజీనామా చేయమని కిషన్ రెడ్డిని అడిగితే దద్దమ్మలా పారిపోయాడని అన్నారు. అంతే దీనికి కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ స్టైల్ లోనే ఆయనకు ధీటుగా సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందని నేతలు మోడీని విమర్శిస్తున్న నేపథ్యంలో.. గాడిదకు గడ్డేసి.. మోడీని అడిగితే ఏం లాభం అంటూ కేసీఆర్ ను గాడిద అనేశారు కిషన్ రెడ్డి. అంతేకాదు వరంగల్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందేమో అని భయపడే ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. మొత్తానికి సైలెంట్ గా ఉండే కిషన్ రెడ్డి కేసీఆర్ స్టైల్లోనే కేసీఆర్ ను గాడిద అని విమర్శించడంతో అందరూ షాకవుతున్నారు.

‘నువ్వెంత అంటే నువ్వెంత’ .. రావెల వర్సెస్ ఎంపీపీ

టీడీపీ మంత్రి రావెల కిశోర్ బాబుకు తన సొంత నియోజకవర్గమైన ప్రత్తిపాడులో చేదు అనుభవం ఎదురైంది. మంత్రి రావెలపై ఎంపీపీ తోట లక్ష్మీ కుమారి విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రి రావెల గుంటూరు జెడ్పీ సమావేశంలో పాల్గొనగా.. ఈ సమావేశంలో పలువురు ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అయితే వారు గ్రామాల సమస్యల్ని తెలుపుతున్న నేపథ్యంలో  తోట లక్ష్మీ కుమారి కూడా మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో మంత్రి రావెల కలుగజేసుకొని ‘నువ్వు మాట్లాడటానికి చాలా టైమ్‌ ఉంది.కూర్చోవమ్మా అని అడ్డుపడ్డారు. దీంతో లక్ష్మీ కుమారికి, రావెలకి మధ్య వాగ్వాదం నెలకొంది. సుమారు అరగంట సేపు వీరిద్దరూ వాదులాడుకోవడం..‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయిలో మాటల యుద్ధం జ‌ర‌గ‌డం.. ఇద్దరి అనుచరుల మధ్య తోపులాట కూడా జరగింది. దీంతో ఆగ్రహం చెందిన రావెల అక్కడినుండి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఇప్పుడు రావెల తీరుపై అక్కడి ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రిగా ఆయన ఇలా ప్రవర్తించడం తగదని.. ప్రజాప్రతినిధులను గౌరవించాలని మండిపడుతున్నారు. ఆఖరికి ఈ గొడవ కాస్త చంద్రబాబు దృష్టికి వెళ్లడం జరిగింది. మరి చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

రష్యా విమానం.. జ్యూస్‌ టిన్‌‌లో బాంబు పెట్టి పేల్చేశాం.. ఐసిస్

ఇటీవల ఈజిప్ట్ లో రష్యా విమానం కూలిపోయి అనేక మంది ప్రాణాలు పోయిన సంగతి తెలిసిందే. ఈజిప్ట్ లోని సినాయ్ పర్వత ప్రాంతంలో ఈ విమానం కూలిపోయిందని అప్పుడు అధికారులు తెలిపినా దానికి కారణం ఉగ్రవాదులే అని అనుమానం వ్యక్తమయింది. ఆతరువాత ఉగ్రవాదులే విమానాన్ని పేల్చేసినట్టు చెప్పారు.. కానీ మొదట ఆ ప్రకటనను ఎవరూ నమ్మకపోయినా ఆఖరికి అది నిజమే అని తేలింది. అయితే ఇప్పుడు అసలు విమానాన్ని ఎలా పేల్చారు అన్నదానిపై వారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా విమానాన్నితాగిపారేసిన పైనాపిల్‌ జ్యూస్‌ టిన్‌‌లో డిటోనేటర్‌ను అమర్చి పేల్చివేసినట్టు తెలిపారు. ఈ బాంబు విమానంలోకి తీసుకెళ్లడంలో మా అనుచరులు పోలీసులను బురిడి కొట్టించారని అన్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన బాంబు ఫొటోను.. బాంబును విమానంలోకి చేర్చిన ప్రయాణికుల పాస్ పోర్టు ఫోటోలను కూడా తమ అధికార మ్యాగజైన్ ఢబిక్ లో ప్రచురించారు. తమపై బాంబుల వర్షం కురిపించే దేశాలకు ఇది ఓ హెచ్చరిక అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

మోడీ తరువాత స్థానాన్ని ఆక్రమించిన కేజ్రీవాల్

ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ట్విట్టర్ ఫాలోవర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరికి కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు మోడీ. ఇప్పుడు ప్రధాని తరువాత ఆస్థానాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఆక్రమించారు. మంత్రి నరేంద్ర మోడీ తరువాత ఆ ఘనత సాధించిన రెండో రాజకీయ నేతగా అరవింద్ కేజ్రీవాల్ అవతరించారు. రాత్రికి ట్విట్టర్ లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 60 లక్షలకు చేరిందని ట్విట్టర్ లో 60 లక్షల మార్క్ ను కేజ్రీవాల్ దాటారని 'ఆప్' సోషల్ మీడియా చీఫ్ అంకిత్ లాల్ తెలిపారు. కాగా మోడీకి మొత్తం 1.6 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తిలో కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా ఒకరు

నా జీవితంలోనే ఎపుడూ చూడలేదు.. చంద్రబాబు

భారీ వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలైపోయింది. ఈ వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాఫ్టర్ ద్వారా జిల్లాను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన నెల్లూరుజిల్లాలో సంభవించిన వర్షాలకు ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. పర్యవేక్షణ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడుతూ ఇలాంటి వర్షం తన జీవితంలోనే ఎపుడూ చూడలేదని ఆయన అనడం గమనార్హం. అంతేకాదు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఈ వర్షాల గురించి ప్రధానికి వివరించారు. అయితే... వర్షసూచన తెలియడంతో ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తం చేయడం.. జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణనష్టం బాగా తగ్గింది.

అరుణ్ జైట్లీ, రాహుల్ గాంధీల భేటీ.. ఎందుకో?

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటికి బీజేపీ నేత అరుణ్ జైట్లీ వెళ్లారు. వెళ్లడం ఏంటి సుమారు అరగంట సేపు రాహుల్ గాంధీతో ముచ్చటించారు కూడా. ఇక్కడి వరకూ బానే ఉన్నా.. అసలు రాహుల్ గాంధీ ఇంటికి అరుణ్ జైట్లీ ఎందుకు వెళ్లారు అని.. వాళ్ల భేటీ వెనుక కారణం ఏంటని అందరూ ఒకటే గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ నేతలు ఎప్పుడూ ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. అరుణ్ జైట్లీ కూడా రాహుల్ గాంధీని చాలా సార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారని.. బుర్రలేని మేధావి అని ఇంకా చాలా కామెంట్లే చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్, అరుణ్ జైట్లీ ని ఎందుకు కలిశారా అని అందరి అనుమానం. అయితే మరో ఐదు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలకమైన జీఎస్టీ బిల్లు - ఇటీవల ప్రకటించిన ఎఫ్ డిఐ సంస్కరణలు తదితర అంశాలపై విపక్షాల మద్దతు కోరేందుకే ఆయన వెళ్లి ఉంటారని చాలామంది అనుకుంటున్నారు. ఇది ఒక కారణమైతే.. డిసెంబరు నెలలో జైట్లీ కుమార్తె సోనాలి పెళ్లి ఉంది కాబట్టి..ఈ పెళ్లికి రాహుల్ ను సోనియా గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించేందుకే రాహుల్ ఇంటికి వెళ్లారని మరికొంత మంది అనుకుంటున్నారు. మరి వారిద్దరూ ఎందుకు భేటీ అయ్యారో వారికే తెలియాలి. కాగా మొన్నటికి మొన్న సోనియా గాంధీ, ప్రియాంకాలు స్పీకర్ సుమిత్ర మహాజన్ ఇంటికి వెళ్లినప్పుడు కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే దానికి కారణం సుమిత్ర మహాజన్ మనవరాలు కారణమని.. తన మనవరాలికి ప్రియాంక అంటే ఇష్టమని చెప్పిన నేపథ్యంలో సుమిత్ర మహాజన్ ఇదే విషయాన్ని సోనియాకు తెలియజేయటంతో సోనియా తన కూతురు ప్రియాంకని తీసుకొని స్పీకర్ ఇంటికొచ్చారని తెలిసింది. మొత్తానికి కారణం ఏదైనా కాని ఇలా వ్యక్తిగతంగా అయినా ప్రతిపక్షాలు.. అధికార పక్షాలు కలవడం సంతోషకరమైన విషయమే.

వరంగల్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు

వరంగల్ ఉపఎన్నిక ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా ముగియనుంది. అయితే ఈ ప్రచారం నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన చిక్కుల్లో పడిందా అంటే అవుననే సంకేతాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలు ఎవరికి వారు ఎక్కడా తగ్గకుండా మాటలు చెపుతుంటారు. కానీ ఈ విషయంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలకు మాత్రం కాస్త దూకుడు ఎక్కువనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ దూకుడుతనమే పార్టీని చిక్కుల్లో పడేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా ప్రచారంలో హామీలు ఇవ్వకూడని నేపథ్యంలో పలు అంశాలపై టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదులు అందజేసింది. క్రిస్మస్‌ను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం, ఉస్మానియా విద్యార్థుల మెస్‌ ఛార్జీలను రద్దు చేయటం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలకు శిక్షణ, కళ్యాణలక్ష్మి పథకంలోకి బీసీలను చేర్చటం, వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు వైద్య కళాశాలకు వీసీ నియామకం తదితర అంశాలను ఫిర్యాదులో ప్రస్తావించింది. దీంతో రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ నివేదికలను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిని పరిశీలించి దీనిపై వివరణ ఇవ్వాలని సూచించింది. మొత్తానికి అన్నిసందర్భాల్లో దూకుడు పనికిరాదని టీఆర్ఎస్ నేతలకు ఎప్పుడు అర్ధమవుతుందో.

మోడీ ఇంటి వద్ద తుపాకీ కాల్పులు..

నిన్న రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ అధికార నివాసం వద్ద కాల్పులు జరగడంతో కలకలం రేగింది. ఒక పక్క పారిస్ లో ఉగ్రవాదుల తుపాకీ మోతలతో జనాలు భయపడి చస్తున్న నేపథ్యంలో ఈ కాల్పులు జరిగే సరికి కలకలం రేగింది. ఢిల్లీలోని 7, రేస్ కోర్స్ రోడ్‌లో మోడీ నివాసం ఉండగా.. అక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా.. రాత్రి ఉన్నట్టుండి తుపాకీ మోతలు వచ్చాయి. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై ఈ కాల్పులు ఎక్కడినుండి వచ్చాయా అని చూసేసరికి మీడియా పార్కింగ్ వద్ద భద్రతా విధుల్లో ఉన్న ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ చేతిలోని ఏకే 47 మిస్ ఫైర్ కారణంగానే ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు తేలింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాకీని లోడ్ చేస్తుండగా మిస్ ఫైర్ అయి ఈ ఘటన జరిగిందని.. దీనివల్ల ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదని చెప్పారు.  

తుపాకుల మోతతో దద్దరిల్లిన పారిస్

  పారిస్ నగరానికి ఉత్తరాన్న గల సెయింట్ డెనిస్ అనే ప్రాంతం నిన్న తుపాకులు కాల్పులు, బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. గత శుక్రవారం సాయంత్రం పారిస్ నగరంపై ఐసిస్ ఉగ్రవాదులు దాడులు చేసిన తరువాత, ఆ దేశ భద్రతా దళాలు, నిఘా వర్గాలు ఉగ్రవాదుల కోసం నగరాన్ని జల్లెడ పట్టారు. సెయింట్ డెనిస్ అనే ప్రాంతంలో ఒక అపార్టుమెంటులో ఒక ఫ్లాట్ కొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు నిఘావర్గాలు కనుగొన్నాయి. తక్షణమే ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఆ సంగతి పసిగట్టిన ఉగ్రవాదులు భద్రతా దళాలపై ఎదురు కాల్పులు జరపడంతో వారు ఎక్కడ నక్కి ఉన్నారో భద్రతాదళాలు చాలా సులువుగా కనుగొనగలిగాయి.   ఉగ్రవాదులు ఉంటున్న భవనాన్ని భద్రతాదళాలు చుట్టుముట్టగానే లోపలి నుండి ఒక మహిళా ఉగ్రవాది బయటకు వచ్చి తనను తాను పేల్చి వేసుకొని ఆత్మాహుతి దాడికి ప్రయత్నించింది. కానీ భద్రతా దళాలు చాలా అప్రమత్తంగా ఉండటంతో ఆ దాడిలో ఎవరూ చనిపోలేదు కానీ ఆమెతో బయటకు వచ్చిన మరొక ఉగ్రవాది చనిపోయినట్లు సమాచారం. ఆ ప్రేలుడు దాటికి పరిసర ప్రాంతాలలో ఇళ్ళ కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఉగ్రవాదులకి, భద్రతా దళాలకి సుమారు ఏడు గంటలపాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. భద్రతా దళాలను ఉగ్రవాదులు అన్ని గంటల పాటు నిలువరించగలిగారంటే, వారు ఎన్ని ఆయుధాలు సిద్దం చేసి ఉంచుకొన్నారో అర్ధం అవుతోంది. వారు త్వరలో మరో దాడికి పాల్పడేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా వారి ఫోన్ సంభాషణలపై నిఘా ఉంచిన స్వాట్ (స్పెషల్‌ వెపన్స్‌ అండ్‌ టాక్టిక్స్‌) కనుగొంది.   ఈ భీకర పోరాటంలో ఐదుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు కానీ ఐదుగురిని సజీవంగా బందించగలిగారు. బందీలుగా చిక్కిన వారిలో ముగ్గురు ఉగ్రవాదులని పారిస్ ప్రాసిక్యూటర్ ఫ్రాన్కొయిస్ మోలిన్స్ ప్రకటించారు. కానీ పారిస్ నగరంపై జరిగిన దాడుల ప్రధాన సూత్రధారి అబ్దెల్ హమీద్ అబ్బావుద్ తమ అధీనంలో లేడని, అతను కాల్పులలో చనిపోయాడా లేదా అనే విషయం ఇంకా విచారణలో తేలవలసి ఉందని అయన తెలిపారు.

రేపు సాయంత్రంతో ప్రచారం ఆపాలి.. ఇక ఇళ్లలోనే ఉండాలి.. భన్వర్ లాల్

రేపు సాయంత్రం ఐదు గంటల కల్లా వరంగల్ ఉపఎన్నిక ప్రచారం ముగించాలని ఎన్నికల ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ ఎన్నికల పోలింగ్ ఉంటుందని.. అన్నిపోలింగ్ కేంద్రాల్లో సాయుధ కానిస్టేబుళ్ల బలగాలు  ఉంటాయని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకూ 9  ఫిర్యాదులు అందాయని.. వివరణ కోరుతూ సీఎస్ కు నోటీసులు పంపించామని తెలిపారు. అంతేకాదు స్థానికేతర నేతలంతా రేపు సాయంత్రం 5 గంటల కల్లా జిల్లా విడిచి వెళ్లాలని.. వారు ఇళ్లు విడిచి బయటకు రాకూడదని ఆదేశించారు. బల్క్ ఎస్ఎంఎస్ లు పంపినా.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా ఫిర్యాదు చేయాలంటూ తెలిపారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశామని చెప్పారు.

కేసీఆర్, చంద్రబాబు.. సూపర్ అండర్ స్టాండింగ్

వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. తెలంగాణ అధికార పార్టీ నుండి కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక వైసీపీ నుండి జగన్, టీడీపీ-బీజేపీ తరుపున చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా నేతలే ప్రచారం చేస్తూ పని కానిచేస్తున్నారు. అయితే అందరి ప్రచారం సంగతేమో కాని కేసీఆర్ ప్రచారం మాత్రం కొంచెం గమనించాల్సిన విషయమే. ఎందుకంటే తను ప్రచారం చేసిన దగ్గరనుండి ఇప్పటివరకూ చంద్రబాబును పై ఒక్క విమర్శ కూడా చేయకపోవడం. సాధారణంగా కేసీఆర్ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా.. చంద్రబాబుపై ఎప్పుడు అవాకులు చవాకులు పేల్చుదామా అని చూస్తుంటారు. అయితే అది ఒకప్పుడు మాట. అంటే వారిద్దరి మధ్య స్నేహం కుదరకముందు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే.. ఆఫ్టర్ ఏపీ శంకుస్థాపన.. బీఫోర్ ఏపీ శంకుస్థాపన అన్నట్టు తయారైంది. ఏపీ శంకుస్థాపన పుణ్యమా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య స్నేహ బంధం ఏర్పడిందనే చెప్పాలి. ఇక అప్పటినుండి ఎప్పుడూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే సీఎం లు మారారు. దానికి వరంగల్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారమే నిదర్శనం. ఎందుకంటే ప్రచారంలో కేసీఆర్.. కాంగ్రెస్, వైసీపీ, బీజేపీ పార్టీలను ఏకిపారేశారు కానీ.. టీడీపీపైకాని, చంద్రబాబు పైకాని ఒక్క విమర్శ కూడా చేయకపోవడం గమనార్హం. ఇక ఎలాగూ చంద్రబాబు వరంగల్ ప్రచారంలో దూరంగా ఉన్నారు. మొత్తానికి కేసీఆర్, చంద్రబాబు మంచి అండర్ స్టాండింగ్ మీదున్నట్టు అర్ధమవుతోంది.

ఏపీ కాంగ్రెస్ తో అలా.. టీ కాంగ్రెస్ తో ఇలా.. జగన్ స్ట్రాటజీ ఏంటో చెప్మా..!

రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఒక్కోసారి నేతలు చేసే పనులు అర్ధంకాకపోయన దానిలో ఉన్న అంతరార్ధం ఏంటా అని అనుమానాలు వ్యక్తమవుతాయి. ప్రస్తుతం జగన్ చేసే పని చూస్తుంటే అలానే అనిపిస్తుంది ఎవరికైనా. వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో జగన్ చాలా చురుకుగా పాల్గొంటున్నారు. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చిపడింది. ఎందుకంటే ఏపీ ప్రతిపక్షంగా ఉన్న జగన్ పార్టీ అండ్ కో అక్కడ చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో.. ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా ఉందని తెలుస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదా కోసం జగన్ చేసిన దీక్షకు మద్దతు పలికింది. దీనిలో భాగంగానే పైకి కనిపించకపోయినా గత కొద్దిరోజులుగా రెండు పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడి వరకూ బానే ఉంది.. అయితే ఏపీ కాంగ్రెస్ తో దోస్తి కట్టిన జగన్.. తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఏమైందో ఏమో కాని అక్కడ ప్రచారానికి వెళ్లి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కు పడే ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు కూడా జగన్ ప్రచారంతో ఎగరేసుకుపోతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీ కాంగ్రెస్ తో దోస్తీ కట్టి.. తెలంగాణ కాంగ్రెస్ ను ఇబ్బందికి గురుచేస్తున్న జగన్ మనసులో ఏముందో.

పార్టీ మారనున్న శైలజానాథ్..? ఏకాకిగా రఘువీరా?

  కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం ఎప్పటినుండో మొదలైంది. అడపా దడపా ఎవరో ఒకరు వేరే పార్టీలోకి మారుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తి అయిన శైలజానాథ్ కూడా చేరుతున్నారా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి.  శైలజానాథ్ చాలా తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతగా ఎదిగారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ.. ఓ వెలుగు వెలిగారు. అయితే అది ఒకప్పుడు.. రాష్ట్రం విడిపోకముందు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాత పరిస్థితి వేరు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సరైన ఉనికి లేదు. అయితే అప్పుడే శైలజానాథ్ వైసీపీ లోకి కాని.. టీడీపీలోకి కాని మారే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కానీ అప్పుడు పార్టీ మారకుండానే 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయి.. ఇక ఆతరువాత మామూలుగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాలం గడుపుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులనుబట్టి చూస్తే ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడప్పుడే తెరుకునే పరిస్థితిలో లేదన్న విషయం అర్ధమై పార్టీ మారదామని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే శైలాజానాథ్ పై టీడీపీ అంత ఆసక్తి చూపించకపోవడంతో ఆయన వైసీపీ గూటికి వెళదామనుకుంటున్నట్టు.. ఈ విషయంలో జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్టు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా శింగనమలలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి టీడీపీ అభ్యర్ధి యామినీ బాల చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో గత కొద్దిరోజులుగా పద్మావతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కారణంగా ఈసారి శింగనమల నుంచి శైలజానాథ్ ను పోటీలో దించాలని జగన్ చూస్తున్నారని అనుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకరిద్దరు సీనియర్ నేతలు కూడా పార్టీని వదిలిపెట్టి వెళిపోతున్నారు. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ లో రఘవీరా  రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు శైలజానాథ్ కూడా పార్టీ మారితే ఇక ఏకాకిగా మిగిలిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

డిసెంబర్ కల్లా అమెరికానే దాటబోతున్న భారత్

  ప్రపంచ జనాభాలో చైనా మొదటి స్థానం తరువాత భారత్ రెండో స్థానంలో ఉంది.. ఇది అందరికి తెలిసిన సంగతే. ఇప్పుడు ఇంకో విషయంలో కూడా భారత్, చైనా తరువాత స్థానాన్ని పొందబోతుందని.. అది ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా.. ఇంటర్నెట్ వినియోగంలో. ఇప్పటికే మనదేశంలో ఇంటర్నెట్ వినియోగం చాలా పెరిగిపోయింది. పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యలయాల దగ్గరనుండి ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వినియోగించడం. అందునా ఇంటర్నెట్ సౌకర్యాన్ని మరింత చవగ్గా అందుబాటులోకి తెస్తుండటంతో మన దేశంలో ఇంటర్నెట్ వినియోగం చాలా వేగంగా పెరుగుతోంది. దీంతో వచ్చే డిసెంబర్ లోగా ఇంటర్నెట్ వినియోగంలో అగ్రరాజ్యమైన అమెరికాను సైతం మనం దేశం బీట్ చేయోచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో 37.5 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. డిసెంబరు నెలాఖరుకు ఈ సంఖ్య 40 కోట్లు దాటొచ్చని సమాచారం. ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగంలో చైనా మొదటిస్థానంలో ఉండగా అమెరికా రెండో స్థానం.. భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. మొత్తానికి అభివృద్ధిలో కాకపోయిన ఈ విషయంలో అయినా అమెరికాని దాటగలిగాం.

పారిస్ పేలుళ్ల ప్రధాన సూత్రధారి అబ్దల్ అమీద్ అబౌద్ హతం..

పారిస్ లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ మొదలయ్యింది. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దురు పోలీసులు మృతి చెందగా మరో ఇద్దురు పోలీసులు గాయపడ్డారు. కాగా పారిస్ పోలీసులు సెయింట్ డెవిస్ ప్రాంతంలోని అపార్ట్ మెంట్ ను చుట్టుముట్టి కాల్పులు జరపగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.. ఐదుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు అపార్ట్ మెంట్లో పేలుళ్ల ప్రధాన సూత్రధారి అబ్దల్ అమీద్ అబౌద్ ను కాల్చి హతం చేసినట్టు.. ఒక మహిళా ఉగ్రవాది తనను తాను కాల్చుకున్నట్టు పారిస్ పోలీసులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా సెయింట్ డెవిస్ ప్రాంతంలో పోలీసులు  హై అలర్ట్ ప్రకటించారు.. ఇళ్ల నుండి ఎవ్వరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

స్పాట్ ఫిక్సింగ్ కేసులో కొత్త మలుపు.. చిక్కుల్లో శ్రీశాంత్

  క్రికెట్ ఐపిఎల్ మ్యాచ్ స్పాట్ ఫిక్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. క్రికెటర్స్ శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్లపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ట్రిబ్యునల్ కోర్టు వీరి ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ట్రిబ్యునల్ కోర్టు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోలీసులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పిటిషన్ ను కూడా దాఖలు చేశారు. దీంతో పోలీసులు పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పుడు హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్లు చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది.