ఆత్మవిశ్వాసం, నమ్మకం కలిగించాలి.. చంద్రబాబు

నెల్లూరు వరదలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. వరద బాధితుల్లో ఆత్మవిశ్వాసం, నమ్మకం కలిగించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాదు సాయంత్రం లోపు బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో పంచదార, కిలో కందిపప్పు, పామాయిల్ నూనె పంపిణీ చేయాలని చెప్పారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారం, పంటలకు రెండురోజుల్లో నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. కాగా నెల్లూరు జిల్లాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏరియల్ సర్వే చేశారు. నెల్లూరు వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మనుబోలు వద్ద గండిపడిన హైవేను ఆయన పరిశీలించి..యుద్ద ప్రాతిపదికన హైవే ను పునరుద్దరించాలని మోడీ ఆదేశించారని తెలిపారు. కాగా వరద నష్టంపై నివేదిక ఇచ్చిన తరువాత కేంద్రం సాయం చేస్తుందని స్పష్టం చేశారు.

నా భర్త గంగిరెడ్డికి ప్రాణహాని ఉంది..

ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గంగిరెడ్డిని విచారణ జరిపి పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నారు. అయితే ఇప్పుడు గంగిరెడ్డి భార్య మాళవిక చేస్తున్న ఆరోపణలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భర్త గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని.. ఆయన్ను ఎన్ కౌంటర్ చేయాలని  ప్లాన్ చేస్తున్నారని అంటుంది. అంతేకాదు తన భర్త గంగిరెడ్డికి ఎలాంటి ప్రాణహాని జరిగిన ప్రభుత్వందే బాధ్యత అని ఆమె డిమాండ్ చేస్తుంది. తన భర్తను చంద్రబాబు టార్గెట్ చేశారని.. అందుకే పోలీసులు ఆయన్ను వెంటాడి వేధించారని.. చంద్రబాబు వల్ల గంగిరెడ్డికి ప్రాణహాని ఉందంటూ గతంలో గవర్నరుకు లేఖ కూడా ఇచ్చామని అని చెప్పారు. అయితే పోలీసుల గంగిరెడ్డిని అరెస్ట్ చేసిన వారం రోజుల తరువాత ఆయన భార్య మాళవిక మీడియా ముందుకు రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు గంగిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన తరువాత ఎన్ కౌంటర్ చేయడమనేది అసాధ్యం. అలాంటప్పుడు ఆమె చేసే వాదనలో ఎలాంటి అర్ధం లేదు. మరి ఆమె ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తుందో.. ఈమె ఇలా ఆరోపణలు చేయడంతో కేసు మరో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఇంటర్ పోల్ సహాయంతో గంగిరెడ్డిని మారిషన్ లో పట్టుకున్న సంగతి విదితమే.

టీడీపీలోకి కొణతాల? ఈసారైనా జరిగేనా?

  మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీని వీడిన తరువాత కొణతాల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయిన అనంతరం ఇప్పుడు టీడీపీలో చేరుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే గత శాసనమండలి ఎన్నికల సమయంలోనే కొణతాల తెదేపాలోకి చేరాల్సి ఉంది. కాని అప్పుడు పెందుర్తి ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్య నారయణ కారణంగా అది జరగలేదు. ఎందుకంటే అప్పుడు కొణతాల టీడీపీలోకి చేరడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నాడు.. అయితే కొణతాలతో పాటు  పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని కూడా టీడీపీలోకి తీసుకురావాలని ప్రయత్నించాడు. కానీ దానికి బండారు సత్యనారాయణ అభ్యంతరం చెప్పడంతో కొణతాల చేరిక ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ కొణతాల చంద్రబాబును కలిసే సరికి మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం కొణతాల టీడీపీలో చేరికకు వెనుక ఉంది మంత్రి అయ్యన్న పాత్రుడని అర్ధమవుతోంది. ఈయనే కొణతాలను పార్టీలోకి తీసుకురావాలని.. కొణతాల కనుక వస్తే విశాఖలో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా కొణతాల చేరిక సాధ్యమవుతుందో లేదో చూడాలి.

సుబ్రహ్మణ్య స్వామి ఒక బ్లాక్ మెయిలర్.. శాడిస్ట్.. వీహెచ్

రాహుల్ జాతీయతపై రోజు రోజుకూ వివాదం ముదురుతోంది. రాహుల్ పౌరసత్వంపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. ఇప్పటికే బీజేపీ నేత సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నా పౌరసత్వంపై దర్యాప్తు చేయించండి అని మోడీకి సవాల్ విసిరారు. ఇప్పుడు ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతురావు కూడా స్పందించి..రాహుల్‌ గాంధీకి ద్విపౌరసత్వం ఉందంటూ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలు వాస్తవం కాదని.. సుబ్రహ్మణ్య స్వామి ఒక బ్లాక్ మెయిలర్, శాడిస్ట్ అని మండిపడ్డారు. బీహార్ ఎన్నికల్లో ఓటమిపాలైన బీజేపీ ప్రజల దృష్టి మరల్చేందుకే రాహుల్ పై ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అన్నారు. ప్రచారం కోసం ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ప్రధాని విచారణ కు ఆదేశించాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రజా సమస్యలు లేవదీయకుండా పక్కదోవ పట్టించేందుకు.. బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తుందని..ఎత్తుగడలు మాని కేంద్రం హుందాగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.

ఛత్తీస్‌గఢ్ సీఎం.. కరీనాతో సెల్ఫీ.. ఇలా చేస్తారా.. కాంగ్రెస్

  ప్రతిఒక్కరూ సెల్ఫీ దిగడం.. దానిని పోస్ట్ చేయడం కామన్ థింగ్. సామాన్య ప్రజల దగ్గర నుండి రాజకీయ నాయకులు వరకూ అందరూ సెల్ఫీలు దిగి ముచ్చట తీర్చుకునే వాళ్లే. అయితే అలా సెల్ఫీ దిగి విమర్శలు తెచ్చుకున్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన రాష్ట్రం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ యూనిసెఫ్ ల ఆధ్వర్యంలో బాలల హక్కలపై  జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా హాజరయ్యారు. అయితే కార్యక్రమం ముగిసే సమయానికి రమణ్ సింగ్ కరీనా కపూర్ తో సెల్పీ తీసుకున్నారు. అది కాస్త మీడియా కంట పడింది. అంతే ఇక రమణ సింగ్ పై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్నిచాలా సీరియస్ గా తీసుకొని రమణ సింగ్ పై మండిపడుతుంది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే పట్టించుకోని ముఖ్యమంత్రి, సినీ తారలతో సెల్ఫీలు దిగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా చేస్తారా అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

లాలు కొడుకులకి శాఖలు కేటాయించిన నితీశ్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిన్న రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నితీశ్ తోపాటు ఆయన మంత్రివర్గంగా 28 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈసారి ఆమంత్రి వర్గంలో లాలు కొడుకులు తేజ్ ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వి ప్రసాద్ లకు కూడా ఉండటం విశేషం. జేడీయూ, ఆర్డేడీ, కాంగ్రెస్ మహా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో అనుకున్న ప్రకారమే (4:4:2) పదవులు పంచుకోవడం జరిగింది. నితీశ్ కుమార్ కూడా భాగస్వామ్య పార్టీల నేతలకు సముచిత స్థానం కల్పించి అందరికీ న్యాయం చేశారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి కుమారులిద్దర్నీ బరిలోకి దించిన లాలూప్రసాద్ యాదవ్... నితీశ్ ప్రభుత్వంలో మాత్రం ప్రధాన భూమికను పోషించనున్నారు. కాగా లాలూ కొడుకుల్లో పెద్దవాడైన తేజ్ ప్రతాప్‌ యాదవ్ కి నితీశ్ ఆరోగ్యశాఖ కేటాయించారు. చిన్న కొడుకు అయినా తేజస్వి ప్రసాద్ యాదవ్‌కి రోడ్డు, భవనాల శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదాను కల్పించారు. కానీ హోంశాఖను మాత్రం తన వద్దే ఉంచుకున్నారు.

టీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టిన మావోయిస్టులు

గ్రీన్ హంట్ నిలిపివేయాలంటూ మావోయిస్టులు ఖమ్మంజిల్లాకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కిడ్నాప్ చేసిన ఆరుగురు నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. ఇవాళ ఉదయం చత్తీస్ గఢ్ సరిహద్దులో వారిని వదలిపెట్టినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆరుగురు నేతలు చర్లకు చేరుకున్నారు.. మరికాసేపట్లో భద్రాచలం చేరకోనున్నారు. కాగా భద్రాచలం టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ రామకృష్ణ, పటేల్ వెంకటేశ్వర్లు, పంతమూరు సురేష్, రెప్పకట్ల జానర్దన్, సత్యనారాయణ, ఊకే రామకృష్ణలను మావోలు కిడ్నాప్ చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లను ఆపాలని.. లేదంటే టీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు.

సజావుగా సాగుతున్న వరంగల్ ఉప ఎన్నికల పోలింగ్

  వరంగల్ లోక్ సభ స్థానానికి ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసే సమయానికి లైన్లో నిలబడి ఉన్నవారందరికీ ఓటు వేసేందుకు వీలుంటుంది. కడియం శ్రీహరి రాజీనామాతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలలో ఉన్న ఒకే ఒక స్థానానికి తెరాస, బీజేపీ, కాంగ్రెస్, వైకాపా, వామపక్షాలు బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ కుమార్ తో కలిపి మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వరంగల్ లోక్ సభ నియోజక వర్గంలో ఉన్న 15, 09, 671 ఓటర్ల కోసం 1,778 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మొత్తం 9, 428 మంది ఎన్నికల సిబ్బందిని, 20 కంపెనీల పోలీసు బలగాలను ఎన్నికల సంఘం నియమించింది. ఈ నెల 24వ తేదీన ఓట్ల లెక్కింపు చేసి అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.

మాలి ఉగ్రవాదుల చెర నుండి బందీలను విడిపించిన సంయుక్త దళాలు

  మాలీ రాజధాని బమాకో లో రాడిసన్ బ్లూ హోటల్లో ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కిన 170 మందిలో 143 మందిని సంయుక్త దళాలు సురక్షితంగా విడిపించాయి. మిగిలిన 27మంది ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులకు చిక్కిన 20 మంది భారతీయులు క్షేమంగా బయటపడ్డారు. సుమారు 9 గంటలపాటు సాగిన ఈ మిలటరీ ఆపరేషన్ లో మాలి, ఫ్రాన్స్, అమెరికా, ఐఖ్యరాజ్య సమితికి చెందిన భద్రతా దళాలు పాల్గొన్నాయి. సంయుక్త దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.   అల్ మౌరాబి టౌన్ అనే తీవ్రవాద సంస్థ ఈదాడికి పాల్పడినట్లు ప్రకటించుకొంది. అది అల్ ఖైదా అనుబంధ తీవ్రవాద సంస్థ. మాలీ ఉత్తర రాష్ట్రాలలో తువారెగ్, అరబ్ అనే మరో రెండు ఉగ్రవాద సంస్థలు కూడా దానితో బాటు పనిచేస్తున్నాయి. గత రెండు మూడేళ్ళుగా మాలిలో తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఉగ్రవాదుల దాడుల్లో ఏకంగా 27మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.   నిన్న ఉదయం ఉగ్రవాదులు రాడిసన్ బ్లూ హోటల్ లోకి ప్రవేశించి 170 మందిని బందీలుగా పట్టుకొన్న సమయంలో మాలి రాజధాని బమాకో సమీపంలోనే ఇటువంటి కమెండో ఆపరేషన్లను నిర్వహించడంలో సుశిక్షితులయిన, అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫ్రాన్స్, అమెరికా, ఐరాస భద్రతా దళాలు నిలిచి ఉండటం చాలా కలిసి వచ్చిందని భావించాలి. కేవలం మాలి భద్రతా దళాలు మాత్రమే ఈ మిలటరీ ఆపరేషన్ లో పాల్గొని ఉన్నట్లయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగేమో?   కనీసం పది మంది ఉగ్రవాదులను తాము చూసామని బందీలు చెప్పడంతో మిగిలిన ఉగ్రవాదుల కోసం సంయుక్త దళాలు హోటల్ ని ఆణువణువూ గాలిస్తున్నాయి. హోటల్ చుట్టూ సంయుక్త దళాలు మొహరించి ఉన్నందున ఎవరూ తప్పించుకొని పారిపోయే అవకాశం లేదు. కనుక మిగిలినవారు లోపల ఎక్కడయినా దాగి ఉన్నారా లేక చనిపోయిన 27మందిలో వారు కూడా ఉన్నారా? అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. పారిస్ దాడుల తరువాత వరుసపెట్టి జరుగుతున్న ఈ సంఘటనలను చూస్తుంటే భారత్ తో సహా అన్ని దేశాలు అటువంటి దాడులు పునరావృతం కాకుండా నిలువరించడానికి తగిన సన్నాహాలు చేసుకోవడం మంచిదని స్పష్టం అవుతోంది.

ఉగ్రవాదుల చెరలో 20మంది భారతీయులు

     పశ్చిమ ఆఫ్రికాలోని మాలీ దేశ రాజధాని బమాకో నగరంలో రెడిసన్ బ్లూ హోటల్లో శుక్రవారం ఉద్రయం ఉగ్రవాదులు ప్రవేశించి సుమారు 170 మందిని బందీలుగా పట్టుకొన్నారు. వారిలో ఖురాన్ చదువగలిగిన 7మందిని విడిచిపెట్టారు. కొంతమంది బందీలను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల చేతిలో చిక్కిన వారిలో 20మంది భారతీయులు కూడా ఉన్నారు. వారిలో కొంతమంది ఆ హోటల్లో ఒక దుబాయ్ సంస్థ తరపున పనిచేస్తుండగా మరికొందరు, ఏదో పని మీద బకామోకి వెళ్లి ఆ హోటల్లో దిగి ఉగ్రవాదులకు బందీలుగా చిక్కారని సమాచారం. 20 మంది భారతీయులు ఉగ్రవాదుల చేతికి చిక్కినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు దృవీకరించారు. మాలీ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదిస్తూ భారతీయుల క్షేమ సమాచారాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదుల చేతిలో చిక్కిన భారతీయులు అందరూ క్షేమంగా ఉన్నట్లే చెపుతున్నారు. హోటల్ ని చుట్టుముట్టిన భద్రతాదళాలు లోపలకి ప్రవేశించి బందీలను విడిపించేందుకు చాలా ప్రయత్నిస్తున్నాయి.

తండ్రి కేసీఆర్ ను మించిపోయిన కూతురు కవిత.. చిక్కుల్లో పడుతుందా?

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితను చూస్తుంటే తన తండ్రినే మించిపోయినట్టు కనిపిస్తోంది. ఏ విషయంలో అనుకుంటున్నారా.. ఎన్నికల ఖర్చు విషయంలో.. సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్ధి పరిమితికి మించి ఖర్చు పెట్టకూడదనే నిబంధన ఉంటుంది. అంతేకాదు వారి ఖర్చుల విషయంలో షాడో అబ్జర్వర్లు కూడా ఉంటారు. వారు అభ్యర్ధులు ఖర్చు చేసే ప్రతి ఒక్క పైసా లెక్క రాసుకొని వాటిని ఎన్నికల కమిషనర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. చివరికి షాడో అబ్జర్వర్లు ఇచ్చిన లెక్కకు, అభ్యర్థుల లెక్కకు సరిపోవాలి. ఇప్పుడు ఈ విషయంలో కవితకు కొత్త చిక్కులు వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు విషయంలో ఆమె ఇచ్చిన లెక్కలో తేడా కనిపిస్తుంది. అయితే తండ్రి కేసీఆర్ చూపించిన లెక్కల్లో 30 లక్షలు తేడా రాగా.. కవిత చూపించిన లెక్కల్లో 32 లక్షలు తేడా వచ్చింది. అయితే కేసీఆర్ పార్టీ ఇచ్చిన సొమ్ములను ఈసీకి సమర్పించలేదు. కానీ కవిత మాత్రం ఈసీ తనకు ఇచ్చిన నిధులకి యథాతథంగా లెక్కలు చూపించింది. అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. తప్పుడు లెక్కలు చూపించడం చాలా నేరం. మరి కవిత లెక్కపై ఈసీ చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

టీ టీడీపీ నేతల కొత్త రికార్డ్..

రాజకీయ నేతలు బహిరంగ లేఖలు రాయడం సాధారణమే. కానీ ఇప్పుడు బహిరంగ లేఖలు రాయడంలో కూడా టీ టీడీపీ నేతలు సరికొత్త రికార్డును సృష్టించారు. అప్పుడెప్పుడో కాంగ్రెస్ పాలనలో వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు  మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య వైఎస్‌కు వరుసపెట్టి బహిరంగ లేఖలు రాసేవారు. ఆ తరువాత వైఎస్ మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాజీ మంత్రి శంకర్ రావు బహిరంగ లేఖలు రాసి రికార్డు న‌మోదుచేశారు. ఇప్పుడు టీ టీడీపీ నేతలు ఆ రికార్డ్ ను సైతం బద్దలు కొట్టేశారు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీ టీడీపీ నేతలు వరుసపెట్టి ఏకంగా తొమ్మిది బహిరంగ లేఖలు రాశారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేత మోత్కుపల్లి నరసింహులు సంయుక్తంగా ఒక లేఖ ను విడుద‌ల చేశారు. రేవంత్‌ రెడ్డి, రమేశ్ రాథోడ్‌ మరో లేఖ, ఎర్రబెల్లి దయాకరరావు, ఒంటేరు ప్రతాపరెడ్డి పేరిట మరో లేఖ విడుదల అయ్యింది. అదేవిధంగా రావుల చంద్రశేఖరరెడ్డి, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి ఒకటి, అమరనాథ్‌ బాబు, బుచ్చిలింగం వేరొక లేఖ, ఆర్‌.కృష్ణయ్య, వీరేందర్‌ గౌడ్‌ ఒక లేఖ, శోభారాణి, సీతక్క మరో లేఖ రాసి సరికొత్త సంప్రదాయానికి తెరదీశారు. మరి అంత కష్టపడి రాసిన టీడీపీ నేతల లేఖలకు సీఎం కేసీఆర్ సమాధానం చెపుతారో.. లైట్ తీసుకుంటారో చూడాలి.

ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండెను చంపేస్తాం.. అలాగే ఒబామాను కూడా.. ఐసిస్

పారిస్ లో గత వారం ఉగ్రవాదులు దాడి జరిపి మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు పారిస్ లో దాడి జరిపినట్టే  అమెరికాలో కూడా దాడి జరుపుతామని ఐసిస్ హెచ్చరించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో పారిస్, అమెరికా భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. సుమారు 6 నిమిషాలు నిడివి గల ఓ వీడియోను ఇరాక్‌లో రూపొందించారు. ఈ వీడియో ద్వారా ఓ ఉగ్రవాది అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్‌ హౌస్‌ను బాంబులతో పేల్చేస్తామని.. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో మరిన్ని దాడులు చేస్తామని.. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండెను, అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ఒబామాను కూడా చంపేస్తామని హెచ్చరించాడు. ఆత్మాహుతి బాంబు దాడులు, కారు బాంబులతో మిమ్మల్ని చంపేస్తాం. మీరెక్కడికి వెళ్లినా వదిలిపెట్టం అని వీడియో ద్వారా ఉగ్రవాది బెదిరించాడు. ఈ వీడియోను విడుదల చేయడంతో అమెరికా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.