అగ్రిగోల్డ్ పై విచారణ.. మీడియాను నిరోధించాలన్న లాయర్లు.. నిరోధింలేమన్న హైకోర్టు

అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసు నేపథ్యంలో ఏర్పరిచిన రిటైర్డ్ జడ్జి సూర్యారావు కమిటీ కొన్నిరికమెండేషన్స్ చేసింది. దీనిలో భాగంగానే జనవరి 1 నుండి అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయాలని సూర్యారావు కమిటీ హైకోర్టును సూచించింది.  హైకోర్టు కూడా కమిటీ రికమెండేషన్స్ స్వీకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే బాధితుల ఆందోళనతో హైకోర్టు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో మీడియాను నిరోధించాలని అగ్రిగోల్ట్ తరపు లాయర్లు హైకోర్టును కోరడం జరిగింది. కానీ హైకోర్టు మాత్రం మీడియాను నిరోధించలేమని తేల్చి చెప్పింది. కాగా దీనిపై విచారణను మధ్యాహ్నం 2.15 నిమిషాలకు వాయిదా వేశారు. మరోవైపు ఈ విషయంపై కారెం శివాజీ అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులకు సంబంధించి రెండో జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందుతులను అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నోరు విప్పడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బీనామీలను మేమే బయటపెడతామని హెచ్చరించారు. 46 లక్షల మంది బాధితులు రోడ్డున పడ్డారని.. వారిని వెంటనే ఆదుకోవాలని.. వ్యాఖ్యానించారు.

పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన పసునూరి దయాకర్

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభయ్యాయన్న సంగతి తెలిసిందే. ఈ రోజు నుండి వచ్చే నెల 23 వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో వరంగల్ ఉపఎన్నికల్లో అత్యధిక మెజార్టీ పొంది లోక్ సభ సీటు గెలుచుకున్న పసునూరి దయాకర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. దయాకర్ తో పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన సభ్యులు కొత్తగా ఎంపికైనా ఎంపీలకు అభినందనలు తెలిపారు. అనంతరం ఉభయ సభల స్పీకర్లు స్పీకర్ సుమిత్రా మహాజన్, హమీద్ అన్సారీ సభలను ప్రారంభించారు.

అమీర్ భార్య కిరణ్ రావ్ ది తెలంగాణనా?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ దేశ అసహనంపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. తన భార్య కిరణ్ రావు దేశం విడిచి వెళ్లిపోదాం అని తనతో అన్నదని అమీర్ చెప్పడంతో అమీర్ ఖాన్ తో పాటు ఆమె భార్య కిరణ్ రావు కూడా వార్తల్లోకి ఎక్కారు. అంతకుముందు ఎక్కడా పెద్దగా వార్తల్లోకి ఎక్కని కిరణ్ రావు తన భర్త అమీర్ ఖాన్ తో చేసిన వ్యాఖ్యలవల్ల ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిపోదామన్న ప్రతిపాదన తెచ్చిన కిరణ్ రావుది అసలు ఏ దేశమనే విషయంపై ఫోకస్ పెట్టారు. అయితే దీనిలో ఆసక్తికర విషయం ఏంటంటే కిరణ్ రావుకి తెలంగాణకి చెందిన మాలాలు ఉన్నట్టు తెలిసింది. ఆమె పూర్వీకులు తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజవంశీకులన్న కొత్త విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కిరణ్ రావు తాత మహబూబ్ నగర్లోని వనపర్తి రాజవంశీకులు కుటుంబానికి చెందిన వారు. కిరణ్ తండ్రిది కూడా తెలంగాణ ప్రాంతమే. కాకపోతే కిరణ్ తండ్రి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో భాగంగా బెంగళూరు.. కోల్ కతా.. ముంబయి మహానగరాల్లో స్థిరపడాల్సి వచ్చింది. దీంతో.. కిరణ్ రావ్ కూడా చిన్నప్పటి నుండి అక్కడే పెరిగి చదువుసంధ్యలు కూడా అక్కడే సాగడంతో ఈ ప్రాంతానికి దూరం కావాల్సి వచ్చింది. ఈ వివాదం వల్ల కిరణ్ రావ్ తెలంగాణ వాసి అనే ఓ కొత్త విషయం తెలిసింది. మొత్తానికి కిరణ్ రావ్ తన మాటను చెప్పడమేమో కాని అమీర్ ఖాన్ ను మాత్రం ఒక్క మాటతో వివాదాల్లోకి నెట్టేసింది.

మరికాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం

మరికాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ శీతాకాలంలో వేడి వేడిగా చర్చలు జరిపేందుకు అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్ర శస్త్రలతో సిద్దమయ్యాయి. ఇవాళ రేపు రాజ్యాంగం పై చర్చించనున్నారు. అంతేకాదు ఈ సమావేశాల్లో ప్రధాన బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు చర్చలు జరగాలంటే సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని సర్కార్ అన్ని పార్టీలను కోరింది. కాగా ఈ రోజు నుండి డిసెంబర్ 23 వరకూ ఈ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 34 బిల్లులపై చర్చలు జరపాలని అఖిలపక్షం నిర్ణయించింది. మరి ఎన్ని బిల్లులు చర్చకు వస్తాయో.. ఎన్ని బిల్లులకు అందరి ఆమోదం లభిస్తుందో చూడాలి.

బొత్స.. అక్కడ కింగ్.. ఇక్కడ?

బొత్స సత్యనారాయణ కాంగ్రస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి.. ఆ పార్టీ వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషించి కింగ్ లా ఓ చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పార్టీ మారిన తరువాత సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే బొత్స కాంగ్రెస్ ను వీడి వైకాపాలోకి రావడానికి ముందే జగన్ కు, బొత్సకు కొన్ని ఒప్పందాలు జరిగాయట. అయితే పార్టీలోకి మారిన తరువాత జగన్ ఇప్పుడు వాటిని విస్మరిస్తున్నారని బొత్స ఫీలవుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వైకాపాలోకి చేరిన కొత్తలో బొత్స బాగానే హడావుడి చేశారు. పార్టీలోకి చేరిన కొద్ది రోజుల్లోనే బొత్స ఏది చెబితే అది చేసేవారు జగన్ కూడా. దీంతో ఆయన హడావుడితో పార్టీలో ఉన్న నేతలు సైతం ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడే అనుకున్నారు కూడా. అయితే అదంతా కొద్ది రోజుల వరకే అన్న సత్యం తెలుసుకోలేకపోయాడు బొత్స. ఉత్తరాంధ్రలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం తానే చూసుకోవాలని.. అంతేకాదు  కోస్తాంధ్ర‌లోనూ కూడా తన పెత్త‌నమే ఉండాలని ఆశించార‌ట‌ బొత్స.. జగన్ అంత ఛాన్స్ ఇస్తాడా.. జ‌గ‌న్ త‌న త‌రువాత ఏ ఒక్క లీడ‌ర్నీ ఆ.. స్థాయిలోకి రానివ్వ‌డంలేద‌ట... అంతేకాదు ఇక పార్టీలో ఉన్న పాత రెడ్లు.. కొత్త కాపుల నుంచి చుక్కెదుర‌వుతోంద‌ట‌. దీంతో బొత్స అనవసరంగా  పార్టీ మారి దెబ్బైపోయామే అని వాపోతున్నారట. పాపం ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని మనిషిగా పేరు తెచ్చుకొన్న బొత్సకు ఇప్పుడు జగన్ రూపంలో ఝలక్ తగిలే సరికి తట్టుకోలేకపోతున్నారు. సొంత సోదరి విషయంలోనే ఖాతరు చేయని జగన్ అంత తేలిగ్గా నేతలను ఎదగనిస్తాడా.. ఇప్పుడు బొత్స విషయంలో కూడా అదే జరిగింది.

ముందు ఇంగ్లీష్ నేర్చుకోండి.. ఎంపీలకు చంద్రబాబు సూచన

మన తెలుగు తమ్ముళ్ల ఇంగ్లీష్ పాండిత్యం గురించి తెలిసిందే. దీనిపై అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నేతలకు క్లాస్ కూడా తీసుకున్నారు. జాతీయ మీడియాలో ఇంగ్లీష్ మాట్లాడటంలో తడబడిన నేతలు.. సరిగ్గా మాట్లాడలేక చంద్రబాబును కూడా ఇరుకున పెట్టారు. దీంతో చంద్రబాబు ఇక జాతీయ మీడియాలో మాట్లాడాల్సిన బాధ్యత గల్లా జయదేవ్ కు అప్పగించారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ పార్టీ నేతలకు ఇంగ్లీష్ పై క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో చర్చలు జరిపిన చంద్రబాబు అనేక సూచనలు సలహాలు ఇచ్చారు. దీంతో పాటు పార్లమెంట్ లో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడాలని.. ఇంగ్లీష్ పై పట్టు పెంచుకోవాలని సూచించారట. అలా మాట్లాడితేనే అందరికి సమస్యలు అర్ధమవుతాయని.. అప్పుడు సమస్యల పరిష్కారానికి పట్టుబట్టవచ్చని చంద్రబాబు నేతలతో అన్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉన్న ఎంపీల్లో అశోక్ గజపతిరాజు, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ లు మాత్రమే అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలరు. అయితే అశోక్ గజపతిరాజు రాష్ట్ర సమస్యలపై మాట్లాడే అవకాశం లేదు.. ఇక జయదేవ్ కార్పోరేట్ పరంగా అయితే మాట్లాడగలరు అంతే కాని మిగిలిన విషయాల్లో కాస్త ఆలోచించాల్సిన విషయమే.. ఇక ఉన్న రామ్మోహన్ నాయుడు ఒక్కడే సమస్యలపై క్లారిటీగా వివరణ ఇవ్వగలరు. దీంతో మిగిలిన ఎంపీలు కూడా రామ్మోహన్ నాయుడులా మాట్లాడగల సామర్థ్యం పెంచుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. మరి ఈసారి మన ఎంపీలు ఏం చేస్తారో చూడాలి.

ఫస్ట్ మోడీ.. తరువాత రాజ్ నాథ్ సింగ్.. ఆ తరువాత?

   ప్రతి పార్టీలో పార్టీ అధినేత ఫస్ట్ ప్లేస్లో ఉన్నా.. తర్వాత ప్లేస్ ఎవరో ఒకరికి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా అధినేత అందుబాటులో లేనప్పడు తరువాతే వ్యక్తే పార్టీ బాధ్యతలు చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ సదరు వ్యక్తి కూడా లేకపోతే పరిస్థితి ఏంటి.. ఆ తరువాత వ్యక్తి బాధ్యతులు స్వీకరిస్తారు. ఇప్పుడు అదే జరిగింది. దీంతో ఆవ్యక్తి స్థానం ఏంటో తెలిసింది. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా.. సుష్మా స్వరాజ్. మోడీ సర్కారులో ఫస్ట్ ప్లేస్ మోడీదే.. నో డౌట్ అలాగే మోడీ తరువాత రెండో ప్లేస్ ఎవరిది అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రాజ్ నాథ్ సింగ్. మోడీ విదేశీ పర్యటనలు చేస్తూ బిజీగా ఉంటూరు కాబట్టి ఇక్కడ ఇంఛార్జ్ గా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతులు నిర్వహిస్తారు. అలాగే రాజ్ నాథ్ సింగ్ లేనప్పుడు ఎవరు బాధ్యతలు చూసుకుంటారంటే అందరూ అరుణ్ జైట్లీ అనుకుంటారు అందరూ. కానీ అందరూ అనుకునేది తప్పని తెలిసిపోయింది. తాజాగా రాజ్ నాథ్ సింగ్ కూడా విదేశీ పర్యటనకు వెళ్లగా మూడు రోజులు సుష్మాస్వరాజ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే రాజ్ నాథ్ సింగ్ కు బాధ్యతలు అప్పగించారు. మోడీ కూడా తిరిగి వచ్చిన వెంటనే రాజ్ నాథ్ సింగ్ మోడీకి బాధ్యతలు అప్పగిస్తారు. మొత్తానికి ఎన్డీయే సర్కారులో మొదటి ప్లేస్ మోడీది రెండో ప్లేస్ రాజ్ నాథ్ సింగ్ ది మూడోది సుష్మా స్వరాజ్ ది అని తెలిసిపోయింది.

రెడీగా ఉండు జానారెడ్డి.. నేను మర్చిపోలేదు కేసీఆర్

రాజకీయాల్లో గెలపు, ఓటములు సహజమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పైవిధంగా స్పందించారు. గెలిచామని విర్రవీగిపోవడం.. ఓడిపోయామని కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు అని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారాన్ని ఓటర్లు నమ్మలేదని తమ పార్టీ తీరునే విమర్శించుకున్నారు. త్వరలో తమ సత్తా చూపుతామని అన్నారు. ఈ సందర్బంగా ఆయన గతంలో చేసిన వాగ్ధానం గురించి కూడా ప్రస్తావించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించారు. రానున్న మూడు సంవత్సరాలలో తెలంగాణ ప్రజలకు రెండో పంటకు నీరు అందిస్తే తాను గులాబీ కండువా కప్పుకుంటానని జానా గతంలో సవాల్ విసిరారు. అదే సవాల్ ను కేసీఆర్ వరంగల్ ఉపఎన్నిక గెలిచిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా గుర్తుచేశారు.. గులాబీ కండువా కప్పుకోవడానికి జానా సిద్దంగా ఉండాలని అన్నారు. దీనికి జానా స్పందించి తను చేసిన వాగ్ధానాన్ని మరిచిపోలేదని.. తన ఇచ్చిన హామీని కనుక నెరవేర్చినట్టయితే తాను తన పార్టీ ప్రచార సారథిగా ఉంటానని మళ్లీ వాగ్ధానం చేశారు. మరి మూడేళ్లలో ఏం జరుగుతుందో చూడాలి.

చంద్రబాబును ఆహ్వానిస్తా.. విమర్శించడం తగదు.. కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ డిసెంబర్ నెల చివరి వారాంతంలో చండీయాగం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈకార్యక్రమానికి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పిలుస్తారా? లేదా అన్న పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు కేసీఆర్ ను ఆహ్వానించారు కాబట్టి కేసీఆర్ కూడా చంద్రబాబును ఆహ్వానిస్తారని కొందరు అనుకుంటుంటే.. అది వ్యక్తిగత హోమం కాబట్టి పిలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని మరికొందరూ అనుకున్నారు. అయితే ఈ సందేహాలన్నింటికి కేసీఆర్ బ్రేక్ వేశారు. తను డిసెంబర్ నెలలో నిర్వహించే చండీయాగానికి చంద్రబాబును ఆహ్వానిస్తానని చెప్పారు. తన సొంత ఖర్చుతోనే యాగం నిర్వహిస్తున్నానని.. యాగం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందంటూ విమర్శలు చేయడం తగదని అన్నారు. మొత్తానికి ఇప్పటి వరకూ కేసీఆర్ చంద్రబాబును ఆహ్వానిస్తారా? లేదా? అంటూ చర్చించుకున్నారు.. ఇప్పుడు ఎలా పిలుస్తారు అనే దానిపై చర్చించుకుంటారేమో?

ఓడిపోయింది అభ్యర్ధి.. పార్టీ కాదు.. శంకర్రావు

వరంగల్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ పార్టీ.. తమ గెలుపుకు సంబంధించి ప్రెస్ మీట్ లు పెట్టి పార్టీని పొగుడుకుంటుంటే.. మిగిలిన పార్టీలు తమ పరాభవాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ.. పనిలో పనిగా అటు టీఆర్ఎస్ పై కూడా రెండు విమర్శలు పడేస్తున్నారు. అయితే తమ పార్టీని కవర్ చేయడంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నేత శంకర్రావు తన స్టైల్ ను చూపించారు. మామూలుగానే శంకర్రావు చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడి పోవడంపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి పార్టీ నేతలు సైతం విస్తుపోయేలా చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది అభ్యర్ధి సర్వే నారాయణ అంతేకానీ పార్టీ కాదు అని వ్యాఖ్యానించారు. సర్వే లోకల్ క్యాండిడేట్ కానందువల్లే ఓడిపోయారని అన్నారు. మొత్తానికి శంకర్రావు ఓటమికి కొత్త అర్ధాన్ని చెప్పారు. కాగా ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు గుడి కడతానని హడావుడి చేసిన శంకర్రావు ఇప్పుడు ఆ సంగతి మర్చిపోయినట్టు ఉన్నారు.

వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడుకు మృతి..

వరంగల్ జిల్లా ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేంద్రరెడ్డి కుమారుడు విశాల్ రెడ్డి మరణించాడు. వరంగల్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద మోటారు బైక్ మీద వెళుతున్న విశాల్ రెడ్డిని ఆర్టీసీ బస్సు ఒకటి బలంగా ఢీ కొట్టింది. దీంతో విశాల్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు. కాగా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగి మాజీ డీజీపీ.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పేర్వారం రాములు మనవలు అవిత్ పవార్, వరుణ్ పవార్ లు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మిల్క్ ట్యాంకర్ ను వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

అనురాధ మేనల్లుడు చింటూనే హంతకుడు.. ఎస్పీ

చిత్తూర్ మేయర్ అనురాధ, మోహన్ దంపతులు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. అనురాధ మేనల్లుడు చింటూనే హంతకుడని పోలీసులు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నిందితుల సంఖ్య పదకొండని జిల్లా ఎస్పీ తెలిపారు. కాగా మరో నిందితుడు మురుగ కూడా టూ టౌన్ పీఎస్ లో లొంగిపోయినట్టు పోలీసులు తెలుపుతున్నారు. మురుగ మరెవరో కాదుని.. 47 వ డివిజన్ కార్పొరేటర్ పద్మావతి భర్త అని.. అనురాధను చంపడానికి స్కెచ్ వేయడంలో మురగదే కీలక పాత్ర అని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపింది చింటూ, వెంకటా చలపతి అని.. ప్రధాన నిందితుడు చింటూ కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని..హత్యల వెనుక రాజకీయ కోణంపైనా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

అమీర్ అసహనం.. ఉన్నపళంగా యాప్‌ అన్ ఇన్‌స్టాల్..

  దేశంలో అసహనం పెరుగిపోతుందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు పుడుతున్న వేడి అంతా ఇంతా కాదు. ఇప్పుడప్పుడే ఆ వేడి కూడా చల్లారేలా కనిపించడంలేదు. దీనిపై అటు రాజకీయ నాయకులు.. సినీ నటులే విమర్శిస్తున్నారంటే ఇప్పుడు సామాన్య ప్రజలు సైతం అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మాటల్లోనే కాదు చేతల్లో వారి వ్యతిరేకతను చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే స్నాప్ డీల్ యాప్‌ను ఉన్నపళంగా లక్ష మంది అన్ ఇన్‌స్టాల్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆ పని చేసినట్లు ఓ ట్వీట్ దర్శనమిస్తోంది. అధికారికంగా ఈ సంఖ్య ఎంత అనేది తెలియదు కానీ ఇప్పటికే చాలా మంది యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేశారు. అంతేకాదు అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు నేను స్నాప్ డీల్ యాప్ అన్ఇన్‌స్టాల్ చేస్తున్నా అంటు ట్వీట్ చేస్తూ మరీ అన్ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఒక్క దీనికే కాదు.. ఇంకా అమీర్ ఖాన్ ప్రచార కర్తగా ఉన్న ప్రొడెక్టులను కూడా ఇదే ఎఫెక్ట్ ఉంటుందని అనుకుంటున్నారు. మొత్తానికి అమీర్ ఖాన్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ ఆవ్యాఖ్యల ప్రభావానికి మాత్రం బలైపోతున్నారు.

అఖిలపక్ష సమావేశం.. ప్రతిపక్షాలు సహకరించాలి.. వెంకయ్య

ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ములాయం, కేకే, తోట నర్సింహతో పాటు అన్నీ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు, పెండింగ్ బిల్లులపై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు కరువు, వరద పరిస్థితులు, నిత్యవసర వస్తువులు ధరలపై సమగ్ర చర్చ జరిపారు. అంబేద్కర్ 125 జయంతి పురస్కరించుకొని రెండు రోజుల పాటు ఉభయ సభల సమావేశాలు జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలు 28 రోజులు జరుగుతాయని.. మొత్తం 38 బిల్లులు చర్చుకు రానున్నాయని.. 7 కొత్త బిల్లులు.. 24 ప్రాధాన్యత బిల్లులపై చర్చ జరగనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బిల్లులపై కొన్ని సవరణలు సూచించిందని.. బిల్లుల సవరణపై అరుణ్ జైట్లీ దృష్టి సారించారని..అన్ని బిల్లులు పాస్ అయేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు.

జగన్ ఇప్పుడు ఎందుకు ఉలకట్లేదు.. పలకట్లేదు..

వరంగల్ ఉపఎన్నిక పోరు ఎట్టకేలకు ముగిసింది. అన్ని పార్టీలను పక్కకు నెట్టి టీఆర్ఎస్ ఇంతకు ముందు మెజార్టీ కంటే ఎక్కువ సంపాదించి లోక్ సభ సీటు దక్కించుకుంది. ఎన్నికల బరిలో దిగిన దయాకర్ దాదాపు నాలుగు లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక్కడి వరకూ బానే ఉంది. ఇప్పుడు గెలుపు కోసం విమర్శలు చేసిన పార్టీ నేతలు గెలిచిన తరువాత కూడా విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఒకరంటే.. గ్రేటర్ ఎన్నికలు నుండి టీఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభమవుతుందని ఇంకొకరు అంటారు. అయితే ఇది రాజకీయాల్లో ఎలాగూ కామన్ థింగ్.. కానీ అందరూ ఎవరి ధోరణిలో వారు విమర్శిస్తుంటే ఒక్కరి గళం మాత్రం ఎక్కడా వినిపించకపోవడం గమనార్హం. అదే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వరంగల్ ఉపఎన్నికల్లో మొత్తం వైసీపీకి లక్ష ఓట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కానీ వైసీపీ దక్కించుకున్న ఓట్లు మొత్తం.. 23,352 మాత్రమే. ఇంత‌కూ జ‌గ‌న్ లెక్క ఎక్క‌డ త‌ప్పింది. జ‌గ‌న్ చెప్పినా ఆయ‌న గారి సామాజిక‌వ‌ర్గం.. ఆయ‌న గారి మ‌తం.. ఆయ‌న గారి కులం ఓట్లేయ‌లేదా?.. మరి ఇంత పరాభవం పొందిన జగన్ మాత్రం ఎందుకు మౌనంగా.. ఏం ఉలకకండా.. పలకకుండా ఉన్నారు. కేసీఆర్, జగన్ కొంచెం సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఏం అనట్లేదా.. అదే వేరే పార్టీ కనుకు గెలిస్తే విమర్శించేవాళ్ల? అన్న ప్రశ్నలు మొదలవుతున్నాయి. లేకపోతే ఏదైనా మాట్లాడితే ప‌రాభ‌వం అంగీక‌రించిన‌ట్లౌతుంద‌ని సైలెంట్ గా ఉన్నారా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు అసలు ప్రచారానికి షర్మిళను తీసుకొచ్చి వుంటే ఇంకొన్ని ఓట్లన్న వచ్చేవి అని అనుకునే వారు కూడా ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా టీఆర్ఎస్ మాత్రం అన్ని పార్టీలను తుంగలో తొక్కి అత్యధిక మెజార్జీతో గెలుపొందింది. దీనికి ఏదైనా కారణం కావచ్చు.. కేసీఆర్ పాలన వరంగల్ ప్రజలకు నచ్చిఉండొచ్చు.. టీఆర్ఎస్ పై ఇంకా ప్రజల్లో వ్యతిరేక భావన రాకపోవచ్చు.. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు ఉపయోగపడచ్చు.. ప్రచారంలో కేసీఆర్ మాటలకు ప్రజలు ఫిదా అయి ఉండొచ్చు. ఏదైనా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారు రుజువైంది.

రాహుల్ పౌరసత్వం.. అంత అర్జంటుగా విచారించలేం.. సుప్రీంకోర్టు

కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రాహుల్ పౌరసత్వంపై విమర్శలు చేయడం.. దానికి రాహుల్ కూడా నా పౌరసత్వంపై దర్యాప్తు చేయించండి అంటూ సవాల్ విసరడం జరిగాయి. అంతేకాదు రాహుల్ గాంధీ పౌరసత్వంపై ప్రముఖ న్యాయవాది మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. సుప్రీంకోర్టు రాహుల్ పౌరసత్వంపై వేసిన పిటిషన్ పై వెంటనే విచారణ జరపాలని.. రాహుల్ గాంధీ పౌరసత్వంపై వెంటనే కేసు నమోదు చేసేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని.. ఆయన ద్వంద్వ పౌరసత్వం కలిగి ఎన్నికల్లో పోటీ చేశారని.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. పేర్కొన్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు మాత్రం తక్షణమే విచారించడానికి నిరాకరించింది. ఇప్పుడు అత్యంత అవసరంగా విచారించలేమని చెప్పింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్. దత్తు నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం.. మాజీ డీజీపీ మనవడు మృతి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం రాజేంద్రనగర్‌ మండలం కోకాపేట చౌరస్తా దగ్గర స్కోడా కారులో వరుణ్ పవార్ తో పాటు మరో నలుగురు  గచ్చిబౌలి నుంచి కారులో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్నారు. ఇంతలో కారు అదుపు తప్పి వెనుక నుండి మిల్క్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అవిత్ పవార్, వరుణ్ పవార్, జ్ఞాన్ దేవ్, పవన్ లు అక్కడికక్కడే మరణించారు. కాగా చనిపోయిన వారిలో వరుణ్ పవార్ మాజీ డీజీపీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పేర్వారం రాములు మనవడుగా తెలుస్తోంది.