నాకు బెదిరింపు లేఖ వచ్చింది.. బీజేపీ నేత

ఈ మధ్య కాలంలో ఉగ్రవాదుల అక్రమాలు ఎంత ఎక్కువయ్యాయో వారి బెదిరింపు లేఖలు కూడా అలానే ఎక్కువయ్యాయి. ఇటీవలే ప్రధాని మోడీకి, పారికర్ కు బెదిరింపు లేఖలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఓ బీజేపీ సీనియర్ నేత తనకు కూడా బెదిరింపు లేఖ వచ్చిందంటూ చెబుతున్నారు. షానవాజ్ హూస్సేన్.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల నుంచి పోస్ట్ ద్వారా తనకు బెదిరింపులు వచ్చాయని.. ఉర్దు, ఇంగ్లీష్ బాషల్లో టైప్ చేసి బెదిరింపు లేఖను పంపించారని  పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు గతంలో కూడా సోషల్ మీడియా ద్వారా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని చెప్పారు.  కాగా డీసీపీ జతిన్ నర్వాల్ మాట్లాడుతూ షానవాజ్ హూస్సేన్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించామని లేఖ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ జతిన్ నర్వాల్ వివరించారు.

నేతాజీ జయంతి.. రహస్య ఫైళ్లను విడుదల చేసిన మోడీ..

ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్య ఫైళ్లను ఈరోజు విడుదల చేశారు. సుమారు 100 ప్రతులను ప్రధాని విడుదల చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ముందుగా నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నేతాజీ కుటుంబ సభ్యులను పలకరించి వారికి సానుభూతి తెలిపారు. అయితే గత ఏడాది అక్టోబర్ లో నేతాజీ కుటుంబ సభ్యులను కలిసిన ప్రధాని.. నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు రహస్య ఫైళ్లను విడుదల చేశారు. దీంతో ఇప్పుడు నేతాజీ మరణానికి సంబంధించిన అంశాలు కొన్నైనా బయటపడే అవకాశం ఉందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇటీవలే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతాజీకి సంబంధించిన 64 రహస్య పత్రాలను బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.

సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌

హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను నిర్దోషి అని బొంబాయి హైకోర్టు తీర్పు నిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ ఈ వ్యవహారంపై సల్మాన్ కు చిక్కులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రాసిక్యూషన్‌ ఆధారాలను బొంబాయి హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, సల్మాన్‌కు శిక్ష విధిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పే సరైనదని ఈ కేసును వాదించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సందీప్‌ షిండే అన్నారు. కాగా 2002 వ సంవత్సరంలో సల్మాన్ వేగంగా కారు నడపడంవల్ల.. ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా.. నలుగురికి తీవ్రంగా గాయాలైన సంగతి తెలిసిందే.

సునంద పుష్కర్ కేసు.. ఎయిమ్స్ నివేదికతో శశిథరూర్ కి చెమటలు

కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో తవ్వే కొద్ది నిజాలు బయటపడుతున్నాయి. ఈ మధ్యనే ఎయిమ్స్ మెడికల్ బోర్డు సునంద పుష్కర్ విషప్రయోగం వల్లనే మరణించినట్లు నివేదిక ఇచ్చింది. దీంతో ఇప్పుడు శశిథరూర్ కు చెమటలు పడుతున్నాయట. గతంలో ఆమె విష ప్రయోగం వల్ల మరణించలేదు అని నివేదిక రావడంతో కాస్త ఊరట చెందిన శశిథరూర్ తాజాగా వచ్చిన నివేదికతో భయపడుతున్నారంట. ఇప్పుడు ఆల్ప్రజొలామ్ అనే ఔషధాన్ని అధిక మోతాదులో తీసుకోవడమే సునంధ మరణానికి కారణమని.. ఇంకా తన ఒంటిపై సిరంజి గుచ్చిన గుర్తును బట్టి విషపూరిత ఇంజెక్షన్ కూడా కారణమై ఉండొచ్చుని భావిస్తున్నామని.. అలాగే శరీరంపై గాయాలనుబట్టి మరణానికి ముందు తీవ్రపెనుగులాట చోటుచేసుకున్నట్లు తెలుస్తోందని ఎయిమ్స్ నివేదిక ఇచ్చింది. దీంతో ఈ కేసు తనకు ఎక్కడ చుట్టుకుంటుందా అని శశిథరూర్ కు చెమటలు పడుతున్నాయట.

మతం అడిగి మరీ కాల్చేశారు..

కొన్ని సార్లు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటికి అనుకోని విధంగా ప్రచారం వచ్చేస్తుంది. దీనికి రోహిత్ ఆత్మహత్య ఉదంతంమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడో ఉన్న నేతలు సైతం ఇక్కడికి వచ్చి మరీ స్పందించి వెళుతున్నారు. అయితే అలాంటి సంఘటనే ఇప్పుడు మహారాష్ట్రలోని పూణె లో చోటు చేసుకుంది. కానీ ఇక్కడ విద్యార్ధికాదు అంతే తేడా. మహారాష్ట్రలోని పూణె లో ఒక కుర్రాడి మతం అడిగి.. అతను హిందువు అని చెప్పాక అతనిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వివరాల ప్రకారం.. సావన్ రాథోడ్ అతనికి 17 ఏళ్ల . ఒకరోజు ఆ కుర్రాడి దగ్గరికి  ముగ్గురు కుర్రాళ్లు వచ్చి.. ఏం చేస్తున్నావని.. పేరేంటని ప్రశ్నించారని.. తన పేరు సావన్ రాథోడ్ అని చెప్పగా వారు నువ్వు హిందువా అని అడిగారని.. అవునని చెప్పడంతో తన మీద పెట్రోల్ పోసి కాల్చేశారని.. ఆస్పత్రిలో ఉన్న సావన్ రాథోడ్ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీం షేక్.. జుబేర్ తండోలీ.. ఇమ్రాన్ తంబోలీ అనే యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ముగ్గురు చెప్పేది మాత్రం భిన్నంగా ఉందని పోలీసులు తెలుపుతున్నారు. ఆ కుర్రాడు కారు బ్యాటరీలు దొంగలించాడని.. అందుకే పెట్రోల్ పోసి తగలబెట్టేశామని పోలీసులకు చెప్పినట్లుగా చెబుతున్నారు.

రోహిత్ ఆత్మహత్యపై సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు..

వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అలాగే ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి మోడీ సర్కార్ కు డ్యామేజ్ తెచ్చిపెడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య ఇప్పటికే దేశమంతటా సంచలనం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై సుబ్రహ్మణ్యస్వామి స్పందిస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న ఆందోళనకారుల్ని ఉద్దేశించి నోరు జారారు. రోహిత్ ఆత్మహత్యను కమ్యూనిస్టులు వెనుకుండి నడిపిస్తున్నారని వారి గురించి చెప్పే నేపథ్యంలో "కుక్కలు" అని  అభివర్ణించారు. దీంతో ఇప్పుడు ఇది వివాదాస్పదమైంది. మరోవైపు మోడీ రోహిత్ ఆత్మహత్య గురించి మాట్లాడుతూ ఈ దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయింది అంటూ వ్యాఖ్యానించారు. అయితే మోడీ ఈ వ్యాఖ్య చేయడానికి కాస్త ముందుగా సుబ్రమణ్య స్వామి సోషల్ మీడియాలో ఇలా వ్యాఖ్యనించారు. మరి సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలకు బీజేపీ ఎలా స్పందిస్తుంది.. అతనిపై చర్యలు తీసుకుంటుందా అన్న విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

అన్ని పార్టీలను తిట్టేస్తున్న ఓవైసీ.. ఒక్క టీఆర్ఎస్ ను తప్ప..

టీఆర్ఎస్ కు, మజ్లిస్ కు మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయి అని ఎప్పటి నుండో అందరికి ఉన్న అనుమానాలే. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీ వాళ్లు ఆ పార్టీ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ప్రచారంలో ఒక పార్టీ వాళ్లు ఇంకో పార్టీని విమర్శించడం కామన్. కానీ మజ్లిస్ వ్యవహారం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రచారంలో భాగంగా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఏకిపారేస్తున్నారు. తమ విజయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్.. టీడీపీ.. బీజేపీలు ఏకమై తమ మీద కుట్ర చేస్తున్నాయని విమర్సిస్తున్నారు కానీ.. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ను ఒక్క మాట కూడా అనడం లేదు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య సంబంధం గురించి ఇప్పుడు నిజమనే అనిపిస్తుంది అంటున్నారు రాజకీయ పెద్దలు.

మనసు మార్చుకున్న రచయితలు..

ఈ మధ్య కాలంలో "అవార్డు వాపసీ" పేరుతో పలువురు రచయితలు, ప్రముఖులు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఏర్పడిన అసహనానికి నిదర్శనంగా దాదాపు 40 మంది రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇచ్చి నిరసనను తెలిపారు. అయితే ఇప్పుడు వారిలో కొంత మంది రచయితలు తమ అవార్డులను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. సాహిత్య అకాడమీకి చెందిన పలువురు రచయితలు తమ అవార్డులు వెనక్కి పంపగా ఇప్పుడు తమ మనసు మార్చుకొని అవార్డుల్ని వెనక్కి తీసుకునేందుకు ఓకే చెప్పారంట. 40 మందిలో 10 మంది ఇప్పటికే అంగీకరించారని.. మిగిలిన వారు కూడా అంగీకరించే పరిస్థితులే కనిపిస్తున్నాయని చెబుతున్నారు అకాడమీ ప్రతినిధులు. అంతేకాదు తమకు పంపిన అవార్డులను తిరిగి సదరు అవార్డు గ్రహీతలకు పంపుతున్నట్లు సాహిత్య అకాడమీ పేర్కొంది.  

టీడీపీ ఎత్తుతో బీజేపీ మైండ్ బ్లాక్..

గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ వ్యూహాలు ఆ పార్టీకి ఉన్నాయి. ఏ పార్టీకి తగ్గ ఎత్తుగడలు ఆ పార్టీ వాళ్లు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు ప్రచారంలో తెగ బిజీగా ఉన్నారు. అయితే అన్ని పార్టీల సంగతేమో కానీ మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ-బీజేపీల మధ్య సంఘటనలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే సీట్ల విషయంలో రేవంత్ రెడ్డి పట్టు వల్ల సగానికి పైగా స్థానాలు తీసుకుందామనుకున్న బీజేపీకీకి 150 స్థానాల్లో కేవలం 60 మాత్రమే దక్కాయి. ఈ ఒప్పందానికి బీజేపీ కూడా ఒప్పుకొని సై అంది. కానీ ఇప్పుడు టీడీపీ వేసిన ఓ ఎత్తుగడకి బీజేపీకి దిమ్మతిరిగిపోయిందంట. అదేంటంటే.. గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లు టీడీపీ 90 స్థానాలు.. బీజేపీ 60 స్థానాలు తీసుకుంది. దీనిలో భాగంగానే జూబ్లిహిల్స్ డివిజ‌న్‌ను టీడీపీ బీజేపీకి కేటాయించింది. అయితే మిత్రపక్షానికి సీటు కేటాయిస్తూనే టీడీపీ రెబల్‌గా వేసిన ఆకుల వెంకటేశ్వరరావుకు ఆ పార్టీ బీ- ఫారం ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ అభ్యర్థిగా వెంకటేశ్వరరావుకు బీ-ఫారం అందజేయడంతో ఆయన ఖైరతాబాద్‌లో రిటర్నింగ్ అధికారికి అందించారు. దీంతో టీడీపీ ఎత్తుకు బీజేపీ మైండ్ బ్లాక్ అయ్యిందంట. మరోవైపు బీజేపీ పార్టీ అభ్యర్ది చండ్ర మధు బీ-ఫారం అందజేశారు. దీంతో ఇప్పుడు మిత్రపక్ష పార్టీ నేతల మధ్యే పోటీ ఏర్పడింది. ఎలాగైనా సీటు గెలుచుకోవాలన్న బీజేపీకి ఈ రూపంగా ఎదురుదెబ్బ తగిలింది.

రోహిత్ ఆత్మహత్య రాజకీయం చేయోద్దు.. తల్లి శోకాన్ని అర్థం చేసుకోండి..మోడీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య చేసుకున్న దగ్గర నుండి ఇప్పటి వరకూ ఎంతో మంది నాయకులు అక్కడికి వచ్చి రోహిత్ ఆత్మహత్యపై మాట్లాడారు. ఇప్పుడు మొదటిసారి ప్రధాని మోడీ రోహిత్ ఆత్మహత్యపై నోరు విప్పడం జరిగింది. లక్నోలో బిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వేముల రోహిత్ ఆత్మహత్య తనను కలచివేసిందని.. అతని ఆత్మహత్యను రాజకీయం చేయకుండా.. తన తల్లి  శోకాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.  రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైన పరిస్థితి రావడం దురదృష్టకరమని..  రోహిత్ మృతితో భారత దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు. రోహిత్ కుటుంబానికి ప్రధాని మోడీ తన సంతాపాన్ని తెలిపారు.

చెవిరెడ్డి తో ఆడుకుంటున్న పోలీసులు..!

ఈ మధ్య వైసీపీ నేతలు పలు వివాదాలు.. పలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంగతి అసలు చెప్పనక్కర్లేదు. ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇక ఆయనకు తగ్గట్టే పోలీసులు కూడా చెవిరెడ్డిని ఆస్టేషన్ కి.. ఈ స్టేషన్ కి తిప్పుతూ ఆడుకుంటున్నారు. ఓ కేసులో భాగంగా చెవిరెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. పార్టీ అధినేత జగన్ చెవిరెడ్డిని పరామర్శించడానికి వచ్చారు. అయితే జగన్ పరామర్శ అనంతరం.. పోలీసులు చెవిరెడ్డిని పీలేరు తీసుకెళ్లారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదైన కేసులో చెవిరెడ్డికి అక్కడ జడ్జి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దాని తరువాత మళ్లీ పోలీసులు అతనిని నెల్లూరు సెంట్రల్ జైల్లో  విడిచి వెళ్లారు. మొత్తానికి కేసులేమో కానీ.. స్టేషన్ల చుట్టూ తిప్పుతూ పోలీసులు ఆయనను ఆడుకుంటున్నారు.

రోహిత్ సూసైడ్ లేఖ.. కొట్టేసిన పేరాలో ఏముంది..?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ది రోహిత్ ఆత్మహత్య ఇప్పటికే దేశమంతటా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో కీలక  పరిణామం చోటుచేసుకుంది. రోహిత్ ఆత్మహత్య చేసుకంటూ ఒక సూసైడ్ లెటర్ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందులో ఒక పేరా కొట్టేసుంది. దీంతో ఇప్పుడు కొట్టేసిన పేరా గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాను రాసిన ఒక పేరాను నిండా కొట్టేసి.. అక్షరాలు ఏ మాత్రం కనిపించకుండా ఇంకుతో రుద్దేసి ఉన్న పేరాగ్రాఫ్ పక్కన నేనే కొట్టేస్తున్నాను.. అంటూ రోహిత్ సంతకం ఉంది. దీంతో తాను కొట్టేయాలనుకుంటే ఏదో ఒక అడ్డగీత గీసి కొట్టేయోచ్చు కదా.. కానీ ఇలా ఒక్క అక్షరం కూడా కనపడకుండా కొట్టేయడం వెనుక ఏం ఉద్దేశం ఉంది..? అలా కొట్టేయాల్సిన అవసరం ఏంటని..? ఇలా ప్రశ్నలు వేస్తున్నారు. ఈ అనుమానాల మధ్యే రోహిత్ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపారు. దీంతో ఏ ఫలితాలు వస్తాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మళ్ళి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..19 మంది బలి

మళ్ళి మరోచోట ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈ సారి దానికి 19 మంది బలి అయిపోయారు.సోమాలియా రాజధాని మొగదిషు లోని ఒక ప్రముఖ రెస్టారెంట్ మీద ఉగ్రవాదులు బాంబు దాడి చేసారు. ఆ సమయం లో రెస్టారెంట్లో సాయంత్రపు భోజనం చేస్తున్న వారిలో కొందరు ఈ బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మృతులలో స్త్రీలు, పసి పిల్లలు కూడా ఉన్నారు. అయితే బాంబుదాడి కి పాల్పడ్డ వారిలో నలుగురు ఉగ్రవాదులు మరణించగా, ఒకరిని అరస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వరసగా ప్రపంచం లో ఎక్కడో ఒకచోట ఉగ్రవాదులు ఇలా దాడులకి పాల్పడుతూ అమాయక ప్రజల ప్రాణాలని హరించటాన్ని ఖండిస్తూ అప్పుడే నిరసనలు వెల్లువెత్తు తున్నాయి.

మహిళలను వేధించినందుకు రెండు జన్మల శిక్ష..

అది శిక్ష ...అలాంటి శిక్ష పడితేనే ..ఆడవారి మీద అకృత్యాలకి తెర పడేది ..అంటూ ఇప్పుడు సోషల్ మీడియా లో కొందరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారికి అంత నచ్చిన ఆ తీర్పు లో నేరస్తుడు ఓ పోలీస్ అధికారి. డ్యూటీ లో వుండగా మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణ. అది రుజువు కావడంతో అతనికి శిక్ష విధించింది కోర్టు. ఇందులో చెప్పుకోతగ్గ విషయం ఏంటంటే 263 సంవత్సరాల జైలు శిక్ష వేసారు. అంటే రెండు జన్మలు ఎత్తినా తీరని శిక్ష అన్నమాట. పైగా తీర్పు మీదపై కోర్టుకు వెళ్ళే అనుమతి  కూడా నిరాకరించారు. ఇదంతా అబివృద్ది చెందిన అమెరికాలో జరిగింది. అమెరికాలోని ఒక్లహామ నగరంలో విధులు నిర్వహించిన డేనియల్ హాల్ట్ క్లాక్ ఎందరో మహిళలను లైంగికంగా వేదించాడట. పోలీసు అధికారి విధులలో వుండి ఇలా చేయటాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది కోర్టు. మహిళల మీద జరిగే అకృత్యాలు ఆగాలంటే శిక్షలు ఈ తరహాలో వుండాలి. అప్పుడే నేరస్తులు బయపడేది..నేరాలు అదుపులోకి వచ్చేది.

ఢిల్లీలో హై అలర్ట్‌.. హైదరాబాద్ లో నలుగులు అరెస్ట్

దేశంలో ఈ మధ్య ఉగ్రవాదుల చర్యలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించారు. ఇంకో నాలుగు రోజుల్లో రిపబ్లిక్ డే రానున్న సందర్భంగా దేశ రాజధానిలో ఫుల్ ఎలర్ట్ ను ప్రకటించారు. మరోవైపు పఠాన్ కోట్ నుండి ముగ్గురు ఉగ్రవాదులు ఢిల్లీ బయలుదేరినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో క్యాబ్ డ్రైవర్ ని హత్య చేసి అదే క్యాబ్ లో ఢిల్లీకి బయలుదేరినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజధాని ఢిల్లీకి వచ్చే మార్గాలన్నింటిని కట్టుదిట్టం చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా వారు దాడులు జరపవచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఐబీ హైఅలర్ట్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కార్యక్రమాలను భగ్న చేసేందుకు ఉగ్రవాదులు దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ లో నలుగురు అనుమానితులను అరెస్ట్ చేయగా మరో ఐదుగురికి కోసం గాలిస్తున్నారు. మొత్తం దేశ వ్యాప్తంగా 25 మంది ఐసిస్ అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

అత్యంత చెత్త పాస్ వర్డ్ ఇదే..!

పాస్ వర్డ్ ల సంగతి అందరికి తెలిసిందే. ముబైల్ ఫోన్ దగ్గర నుండి ఏటీఎమ్ ల వరకూ.. సోషల్ మీడియాను సంబంధించి ప్రతి ఒక్కదానికి పాస్ వర్డ్ లు పెట్టుకుంటాం. ఇలాంటి పాస్ వర్డ్ లలో కూడా చెత్త పాస్ వర్డ్ లు ఉంటాయని అధ్యయనంలో చెప్పారు పరిశోధకలు. దాదాపు 20 లక్షల సంబంధించి..వారు ఉపయోగించే పాస్ వర్డ్స్ ఆధారంగా జరిగిన ఆధ్యయనంలో మనిషి వాడే పాస్ వర్డ్ లలో ‘‘123456’’ ముందు స్థానంలో నిలిచింది. అంతేకాదు గత మూడేళ్ల నుండి ఈ పాస్ వర్డ్ ముందు స్థానంలో నిలిచి అత్యంత చెత్త పాస్ వర్డ్ గా నిలిచింది. దీంతో పాటు ‘‘స్టార్ వార్స్’’.. ‘‘సోలో’’.. ‘‘ప్రిన్సెస్’’ లాంటి పాస్ వర్డ్ లు కూడా ఉన్నాయి. మరి  ఇక పాస్ వర్డ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.

నన్ను కొట్టారు.. మా అమ్మను అవమానించారు.. రాహుల్..కేజ్రీవాల్ అప్పుడు మాట్లాడలేదేం..?

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలసిందే. అయితే ఈ వివాదానికి సంబంధమున్న అత్యంత కీలకమైన వ్యక్తి ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ రాహుల్ గాంధీ.. కేజ్రీవాల్ పై మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ సంఘానికి చెందిన 30 మంది వచ్చి నన్ను కొట్టారని.. నాచేత బలవంతంగా క్షమాపణలు చెప్పించారని అన్నారు. తనపై దాడి చేసిన వారిపై కృష్ణ చైతన్య అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే నువ్వు ప్రత్యక్షంగా చూశావా అని ప్రశ్నించారని.. లేదని చెప్పటంతో నాపై  దాడి జరగలేదని తేల్చారని వాపోయాడు.  మరో విద్యార్ది సాక్ష్యం చెప్పడంతో విద్యార్థులపై ఆర్నెల్లు సస్పెన్షన్ విధిస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్న విషయాన్ని సుశీల్ వెల్లడించారు. అంతేకాదు తనపై దాడి చేసిన ఉదంతానికి సంబంధించి ఆధారాలు.. సాక్ష్యాలు ఉన్నాయని.. సుశీల్ కుమార్ చెప్పారు. తనపై దాడి జరిగిన విషయంపై మా అమ్మ ఫిర్యాదు చేయడానికి వెళితే.. వీసీ ఛాంబర్ లోనే అవమానించారని.. దానికి సంబంధించిన ఆధారాలు కావాలంటే సీసీ కెమేరా ఫుటేజ్ పరిశీలించాలని కోరారు. తన కులం ఓబీసీ అని ఒక ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి భావస్వేచ్ఛను హరించినప్పుడు కేజ్రీవాల్, సీతారాం ఏచూరి ఎక్కడికి వెళ్లారు? నన్ను కొట్టినప్పుడు వాళ్లేందుకు మాట్లాడలేదు..మా అమ్మకు వీసీ ఛాంబర్ లోనే అవమానం జరిగింది. దానికి ఇప్పటివరకూ ఎవరూ మాట్లాడింది లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.