రోహిత్ ఆత్మహత్య.. రోహిత్ తండ్రి ప్రశ్నలతో ఇంకా అనుమానాలు..!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య చేసుకన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటికే ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రోహిత్ తండ్రి మాటలు వింటుంటే ఇప్పుడు ఇంకా అనుమానాలు రేకెత్తుతున్నాయి. రోహిత్ ఆత్మహత్యపై అతని తండ్రి వేముల మణికుమార్ మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత పరికివాడు కాదని అన్నారు.  చదువుల్లో ఎంతో ఉన్నతంగా రాణిస్తున్న తన కుమారుడు రోహిత్‌ను ఉద్దేశపూర్వకంగా ఎవరో హతమార్చి ఉరివేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రోహిత్ ఆత్మహత్యపై పలు ప్రశ్నలు సంధించారు మణికుమార్. రోహిత్ తో పాటు నలుగురు విద్యార్ధులను సస్పెండ్ చేశారు.. వారి సమస్యను పరిష్కరించుకునేందుకు ఐదుగురు కలిసి నిరాహార దీక్ష చేస్తున్నారు.. అలాంటప్పుడు తన కుమారుడు ఒక్కడే శిబిరం నుంచి వెలుపలకు వెళ్లి గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటని .. ఒకవేళ తాను నిజంగా ఆత్మహత్య చేసుకోవాలని భావించినా పోరాట పటిమతో అందరి ముందు ఆత్మహత్య చేసుకొనే వాడు కాని ఇలా ఒంటరిగా ఆత్మహత్య చేసుకునేవాడు కాదని.. అయినా వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోదలిస్తే మొత్తం ఐదుగురూ కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండేవారు కదా అని ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతుంది.

రోజాపై పరువునష్టం దావా..

టీడీపీ ఎమ్మెల్యే అనితపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను అనిత మరోసారి రోజాపై విరుచుకుపడ్డారు. రోజా తనపై చేసిన వ్యాఖ్యలకు తాను మానసికంగా చాలా బాధ పడ్డానని.. రోజా తీవ్రవాది కన్నా ప్రమాదకారి అని.. ఆమె అసెంబ్లీలో అలా రెచ్చిపోతుంటే ఆపార్టీ అధినేత ఆమెను నియంత్రించకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం ఏంటో తనకు అర్ధం కావట్లేదని అన్నారు. అంతేకాదు రోజా తనపై చేసిన వ్యాఖ్యలకుగాను ఆమెపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఇలానే చేయాలని.. అందుకే తనపై కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. దానికి సంబంధించిన నోటీసులు కూడా రోజాకు పంపినట్టు ఆమె తెలిపారు. మరి రోజా ఎలా స్పందిస్తుందో..

విజయవాడ వాసులకు చంద్రబాబు చురకలు..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ వాసులకు చాలా సింపుల్ గా.. నవ్వుతూనే చురకలు అంటించినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో విజయవాడలోని అద్దెలు బాగా పెరిగిపోయాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా ప్రస్తావించి.. తాను హైదరాబాద్ లో ఉన్న సచివాలయ ఉద్యోగుల్ని విజయవాడకు రమ్మని చెప్పానని.. దీనికి వారు బెజవాడలో అద్దెలు హైదరాబాద్ కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారని.. కాస్ట్ ఆఫ్ లివింగ్ భారీగా ఉందని చెప్పినట్లుగా వెల్లడించారు. అంతేకాదు కాస్త వెటకారంగా మహానగరాల్లో పక్కింటి గురించి పట్టించుకోరని..కానీ బెజవాడలో మాత్రం పక్కింటి వ్యవహారాలు పట్టించుకుంటారంటూ చురకలు అంటించారు. మన రాజధాని అమరావతి అభివృద్ధి చెందడానికి కొంచెం సమయం పడుతుంది.. అప్పటిలోపు చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోవాలి.. పెద్ద మనసు చేసుకోవాలని హితవు పలికారు. మరి చంద్రబాబు మాటలని ప్రజలు వంటపట్టించుకుంటారా.. అద్దెలు తగ్గిస్తారా.. చూడాలి మరి..

మళ్లీ మొదలెట్టిన జగన్..

ఒక పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసం.. ఏపీ పెట్టుబడులు తీసుకురావడానికి క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్నారు. నారా లోకేశ్.. మిగిలిన నాయకులు గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. మిగిలిన పార్టీలు కూడా అదే ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇక ఖాళీగా ఉన్నది ఎవరయ్యా అంటే వైసీపీ పార్టీ ఒక్కటే. అందుకే వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియడంలేకనో.. లేక అందరూ తనను మరిచిపోయారు.. ఒకసారి గుర్తు చేద్దామనుకుంటున్నాడేమో... సంబంధం లేకుండా.. అందరూ మరిచిపోయిన ప్ర్తత్యేక హోదాని మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ప్రత్యేక హోదా సాధన కోసం యువభేరీ కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వైయస్ జగన్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరారు. అక్కడి నుంచి ఆయన కాకినాడ చేరుకుంటారు. మొత్తానికి సద్దుమణిగిన వ్యవహారాన్ని జగన్ మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు. మరి ఈసారైనా ఆయన ప్లాన్ వర్కవుట్ అవుద్దో లేదో చూడాలి.

సెటిలర్స్ అనాల్సిన అవసరం లేదు.. వెంకయ్య

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీపై చవాకులు విసిరారు. హైదరాబాద్ అందరిదని, సెటిలర్స్ అనాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తాను వివాదాలు మాట్లాడేందుకు రాలేదని.. హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలవ్వాలంటే మంతి నేతలు రావాలని.. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని..ఓటర్లకు పిలుపునిచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం నగరమంతా ఏర్పాటు చేసిన ప్రకటనలు, హోర్డింగులు గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలను చూసి మోసపోవద్దని అన్నారు. పనిలో పనిగా మజ్లిస్ పార్టీపై కూడా నాలుగు విమర్శల బాణాలు వదిలారు. పాతబస్తీలో వెనుకబాటుకు కారణమెంటో మజ్లిస్ పార్టీ చెప్పాలని ఎద్దేవ చేశారు. కాగా ఈ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్ హై అలర్ట్.. ఉగ్రవాదుల కదలికలు

ఉత్తరాఖండ్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్ లో ఎనిమిది మంది ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న అనుమానంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.  సిసి టివి ఫుటేజ్ ల ఆధారంగా ఎనిమిది నుండి పది మంది ఉగ్రవాదులు డెహ్రాడూన్ లో ప్రవేశించారని పోలీసులు గుర్తించడంతో ఎక్కడైనా అనుమానిత వ్యక్తి లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాల్సిందిగా ప్రజలను కోరారు. కాగా అర్థ కుంభ మేళా కొనసాగుతున్న నేపథ్యంలో రూర్కెలో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన నేపథ్యంలో బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని ఉత్తరాఖండ్ డిజి బీఎస్ సింధు తెలిపారు. అయితే నగరంలోని ఏ ప్రాంతంలో వీరిని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించామో వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

బీజేపీలోకి సుభాష్ చంద్రబోస్ మనమడు..

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. నేతాజీకి సంబంధించిన పలు రహస్య ఫైళ్లను బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకరు బీజేపీలోకి చేరుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. పశ్చిమబెంగాల్ లో ప్రముఖుల కుటుంబాల్లో  బోస్ కుటుంబం కూడా ఒకటి. అలాంటి బోస్ కుటుంబానికి చెందిన.. ఆయన మనవడు అయిన చంద్రకుమార్ బోస్ బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరాడు. ఈ సందర్భంగా బోస్ మనమడు మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చిట్ ఫండ్ పరిశ్రమ మాత్రమే వృద్ధి చెందుతుందంటూ వ్యాఖ్యానించారు.

రాజమౌళి పద్మశ్రీ పై రచ్చ.. కర్ణాటక పుణ్యమా..?

ఒక్క సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన దర్శకుడు ఎవరంటే రాజమౌళి అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అలాంటి దర్శకుడి ప్రతిభకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇక్కడి వరకూ బానే ఉన్నా..ఇప్పుడు ఆ పద్మశ్రీ పై పలువురు పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు రాజమౌళికి పద్మశ్రీ వచ్చిందని సంతోషిస్తుంటే.. అంతలోనే అది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల పుణ్యం కాదని.. కర్ణాటక రాష్ట్రం కారణంగా ఆ పురస్కారం లభించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాజమౌళికి ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం వార్తలో బ్రాకెట్ లో కర్ణాటక అని ఉంది. దీంతోనే అసలు రచ్చ మొదలైంది. రాజమౌళికి వచ్చిన పద్మశ్రీ అవార్డు కర్ణాటక ప్రభుత్వం సిఫార్సు చేస్తే వచ్చిందని.. తెలుగు రాష్ట్రాలు మరిచిపోయిన ఈ విషయాన్ని పక్కనున్న కర్ణాటక ప్రభుత్వం పట్టించుకొని ఇప్పించిందని అంటున్నారు. దీనిపై తెలుగు సినీ అభిమానులు కూడా అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీనిపై రాజమౌళి స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం గత ఏడాదే తమ పేరును ప్రతిపాదించిందని.. కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు వచ్చిందని అన్నారు. అయినా నేను నాలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డని.. నేను పుట్టింది కర్ణాటకలో.. చదువుకుంది ఏపీలో.. పని చేసింది తమిళనాడులో.. స్థిరపడింది తెలంగాణలో అంటూ చెప్పుకొచ్చారు.

జెండా వందనం సాక్షిగా..కాంగ్రెస్ నేతల కొట్లాట..

కొట్లాటలు - కుమ్ములాటలకు మారుపేరైన కాంగ్రెస్ నాయకులు ఆఖరికి గణతంత్ర దినోత్సవం రోజున కూడా కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ ఘటన నల్లొండ జిల్లా భువనగిరిలో జరిగింది. నల్గొండ జిల్లా భువనగిరిలో రిపబ్లిక్ డే సందర్భంగా జెండాను ఎవరు ఎగరేయాలన్న విషయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు మధ్య వివాదం ఏర్పడింది. దీంతో పార్టీ నేతల మధ్య ఘర్ణణ పెరగడంతో కార్యకర్తలు కూడా ఒకరినొకరు దూషించుకుంటూ చొక్కాలు - కాలర్లు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. అంతేకాదు పోలీసు స్టేషన్లో ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ కొట్లాటలో పడి ఆఖరికి అక్కడ జెండా వందనం కూడా చేయకుండానే ఆపేశారు.

అజార్ మీద చేయి పడనీయం – పాక్‌!

భారతదేశం యావత్తునీ కుదిపేసిన పఠాన్‌కోట్ దాడి మీద పాకిస్తాన్‌ మరో సారి తన ద్వంద్వ నీతిని ప్రదర్శించింది. తొలుత ప్రపంచదేశాల ఒత్తిడికి తల ఒగ్గిన పాక్‌, పఠాన్‌కోట్ నిందుతుల తమ దేశంలోనే ఉంటే తప్పక దండిస్తామని చెప్పింది. పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న జైష్‌-ఏ-మహమ్మద్‌ నాయకుడైన మసూద్‌ అజారే ఈ దాడులకి సూత్రధారి అని భారత్‌ తేల్చిచెప్పడంతో పాకిస్తాన్‌కి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. తుపాకుల దగ్గర నుంచి, పాదరక్షల దాకా పఠాన్‌కోట్ వద్ద దొరికిన వందలాది సాక్ష్యాలన్నీ తన వైపు వేలెత్తి చూపడంతో పాకిస్తాన్‌ ఆత్మరక్షణలో పడింది. చివరికి తప్పనిసరి పరిస్థితులలో మసూద్‌ అజార్‌ను అరెస్టు చేశామని పాకిస్తాన్ ప్రకటించినా, ఆ దేశపు చర్యల గురించి రక్షణ నిపుణులు సందేహాస్పదంగానే ఉన్నారు. అందుకు తగినట్లుగానే పాక్ ఆ తరువాత మాట మార్చింది. అజార్‌ను అరెస్టు చేయలేదు, కేవలం పారిపోకుండా నిఘా ఉంచాం అంటూ సెలవిచ్చింది. ఇప్పుడు మరో మెట్టు కిందకి దిగి అజార్‌ను ప్రశ్నించేందుకు భారత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పేసింది. మరో వైపు ఇండియా పఠాన్‌కోట్ సంఘటనను దేశ ప్రతిష్ఠకు సవాలుగా భావిస్తోంది. మసూద్‌ అజార్‌ను అతని సోదరుడు అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్‌ను ఎలాగైనా దేశానికి రప్పించి శిక్షించాలన్న పట్టుదలతో ఉంది. మసూద్‌ అజార్‌ జైష్‌-ఏ-మహమ్మద్‌ అనే తీవ్రవాద సంస్థను స్థాపించి భారతదేశపు పార్లమెంటు మీద దాడి మొదల్కొని ఇప్పటి పఠాన్‌కోట్‌ దుస్సంఘటన వరకు మన దేశం మీద ఎన్నో దాడులను సాగించాడు. ఈ దాడులకు వెనుక ఉండే ఆలోచన మసూద్‌ అజార్‌దే అయినప్పటికీ వాటిని అమలుపరిచే బాధ్యత మాత్రం తమ్ముడు అబ్దుల్‌ రవూఫ్‌దే! మరి వారిద్దరినీ భారత్‌ శిక్షించగలుగుతుందా? లేకపోతే మరిన్ని దాడులకు సిద్ధపడాల్సి ఉందా? అన్నది ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్న ప్రశ్న! ఆ ప్రశ్నకి జవాబు మాత్రం పాకిస్తాన్‌ దగ్గరే ఉంది.

రిపబ్లిక్ డే వేడుకల్లో కేసీఆర్.. అమర జవాన్ల స్తూపానిని నివాళులు

తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్‌ కవాతు మైదానంలోని గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమర జవాన్ల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ ముఖ్యఅతిథికా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్రమంత్రులు జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రణబ్‌

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈరోజు 67వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా వేడుకలు మిన్నంటాయి. ఈ సందర్భంగా రాజ్‌పథ్‌కు పలువురు ప్రముఖుల చేరుకున్నారు. భారతదేశ ప్రధమ పౌరుడు..రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ఫ్రాన్స్‌ అధ్యక్షడు హొలాండ్ లు రాజ్‌పథ్‌కు చేరుకున్నారు. మరోవైపు రాజ్‌పథ్‌ మార్గంలో హెలికాప్టర్ల ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనికుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో 76మంది ఫ్రెంచి సైనికులు కవాతు నిర్వహించారు. టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకు, రాడార్ల ప్రదర్శన ఆకట్టుకుంది. కాగా రాజ్‌పథ్‌వద్ద భద్రతా బలగాలు భారీ స్థాయిలో మోహరించాయి.

హాలీవుడ్ లో అడుగుపెడుతున్న ధనుష్..

భారత దేశంలో పెద్దదైన సినీ పరిశ్రమ బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికే చాలా మంది నటీ నటులు కష్టపడుతుంటారు. అలాంటిది అక్కడ ఈజీగా అరంగేట్రం చేసి ఇప్పుడు ఎంతో మంది కలలు కనే హాలీవుడ్ లోకి కూడా అడుగు పెడుతున్నాడు ఓ కుర్ర హీరో.. అతను ఎవరో కాదు రజనీకాంత్ అల్లుడు, తమిళనాట టాలెంటెడ్ నటుడు ధనుష్. ధనుష్ కు ఈ అరుదైన అవకాశం దక్కింది. త్వరలో ధనుష్ ఓ హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడు. "ద ఎక్స్ టార్డనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్" అనే సినిమాలో హాలీవుడ్ హీరోయిన్లు ఉమా తుర్మన్, అలెగ్జాండ్రా దడారియోలతో ధనుష్ జతకట్టనున్నాడు. ఈ సందర్బంగా ఈ చిత్ర డైరెక్టర్ మర్జానే సత్రపి మాట్లాడుతూ ఈ సినిమాలో హీరో కోసం తాను ఎన్నో ఇండియన్ సినిమాలు చూశానని.. అప్పుడే ధనుష్ ని చూశానని.. ధనుష్ అయితే తాను అనుకున్న పాత్రకి సరిగ్గా సరిపోతాడనిపించిందని చెప్పాడు. ఈ సినిమాలో ప్రేమ, సాహసం, అద్భుతాలు కలగలిపి ఉంటాయని తెలిపారు.

రామ్ గోపాల్ వర్మ తాట తీస్తానన్న వంగవీటి రాధా

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గట్టి వార్నింగే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. రామ్ గోపాల్ వర్మ వంగవీటి రంగా కథతో ఓ సినిమా తీస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రాధాకృష్ణ తన తండ్రి జీవితాన్ని నేపథ్యంగా చేసుకొని వర్మ సినిమా తీయడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. చిత్రంలో వాస్తవాన్ని చూపిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతేకానీ రంగా జీవితం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తాటతీస్తామని హెచ్చరించారు. మరి రాధాకృష్ణ వార్నింగ్ కు వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

కేంద్రం పద్మ అవార్డులు.. మీడియా మొగల్ రామోజీరావుకి పద్మవిభూషణ్.. రాజమౌళికి పద్మశ్రీ

2016 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఈరోజు పలు పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఈ అవార్డులు దక్కాయి. మన తెలుగు వారిలో మువీ మొగల్ రామోజీరావుకి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. పత్రికా రంగంలో ఎనలేని కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు అందించారు. ఇంకా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కు కూడా పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. ఇంకా వీరితోపాటు నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి, ధీరూబాయ్ అంబానీ(మరణానంతరం), సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, శ్రీశ్రీ రవిశంకర్‌, జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్‌, విశ్వనాథన్ శాంత, డా. వాసుదేవ్ కులకుంటె ఆత్రే, అవినాశ్ దీక్షిత్(భారత సంతతి) అవార్డు వరించింది. . కాగా టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళికి పద్మశ్రీ అవార్డు దక్కింది పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు వీరే. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, సానియా మీర్జా టెన్నిస్ క్రీడాకారిణి, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌, ఉదిత్ నారాయణన్‌, వినోద్ రాయ్(మాజీ కాగ్), హేస్నమ్ కన్హయిలాల్, ఎన్ఎస్ రామనుజ తాతాచార్య, బరిందర్ సింగ్ హమ్దర్ద్, డి. నాగేశ్వర్ రెడ్,డి స్వామి తేజోమయానంద, రాబర్ట్ డి బ్లాక్‌విల్(భారత యూఎస్ మాజీ అంబాసిడర్), ఇందూ జైన్ రవిచంద్ర భార్గవ రాం, వి సుతార్ హఫీజ్, కాంట్రాక్టర్ వెంకట్ రామారావు ఆళ్ల, బ్రిజేందర్ సింద్ పద్మ శ్రీ అవార్డ్ గ్రహీతలు: ఉజ్వల్ నికమ్(సీనియర్ లాయర్), బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్, ఎస్ఎస్ రాజమౌళి(బాహుబలి దర్శకుడు),  భోజ్‌పురి గాయని మాళిని అవాస్థి,   ప్రెడ్రగ్ కె నికిక్ (యోగా-సైబీరియా),  హూయి లాన్ ఝాంగ్(యోగా-చైనా)