నేను ఎందుకొచ్చానంటే.. రాహుల్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ జన్మదినం సందర్బంగా విద్యార్ధులు అర్ధరాత్రి నుండే నిరసన మొదలు పెట్టారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న నే హెచ్ సీయూ చేసుకొని విద్యార్ధులకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 'భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, ఆశయాలు పెట్టుకున్న ఓ జీవితం అర్థాంతరంగా ముగిసింది. రోహిత్ స్నేహితులు, ఫ్యామిలీ అభ్యర్థన మేరకు న్యాయం పోరాటం చేసేందుకు ఇక్కడకు వచ్చాను. పక్షపాతం, అన్యాయం నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్న ప్రతి భారతీయ విద్యార్థి ఆశయం కోసం కట్టుబడి ఉన్నాం' అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ప్రముఖ రచయిత్రి నాయని కృష్ణకుమారి కన్నుమూత

తెలుగు సాహిత్యానికి నేడు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. జీవితాన్ని ఆసాంతం రచనలకే అంకితం చేసిన ప్రముఖ రచయిత్రి నాయని కృష్ణకుమారి (86) నేడు కన్నుమూశారు. ప్రముఖ కవి నాయని సుబ్బారావు కుమార్తె అయిన కృష్ణకుమారి చిన్ననాటి నుంచే రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి కనబరిచేవారు. 18 ఏళ్ల అతి పిన్న వయసులోనే ‘ఆంధ్రుల కథ’ పేరిట ఆంధ్రుల చరిత్రను రాశారు. అప్పట్లో ఆ పుస్తకాన్ని పాఠ్యపుస్తకంగా నిర్దేశించింది ప్రభుత్వం. తెలుగులో ఉన్నత విద్యను పూర్తిచేసుకున్న తరువాత హైదరాబాదులో స్థిరపడ్డారు కృష్ణకుమారి. అంచెలంచెలుగా తెలుగు పథంలో ఎదుగుతూ తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పదవీ విరమణ చేశారు. కథలు, కవితలు, వ్యాసాలు, సాహితీ విమర్శలు… ఇలా కృష్ణకుమారిగారు అన్ని సాహితీ ప్రక్రియలలోనూ రాణించారు. జానపద సాహిత్యం మీద సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి పి.హెచ్‌.డి. పట్టాను సైతం సాధించారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన కృష్ణకుమారి మరణం పట్ల  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.

రాహుల్ గాంధీ అప్పుడెందుకు రాలేదో.. వెంకయ్య నాయుడు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ జన్మదినం సందర్భంగా చేపట్టిన దీక్షలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శల బాణాలు వదిలారు. కెనడా ప్రతినిధుల బృందం ఈరోజు వెంకయ్య నాయుడిని కలిశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనివర్శిటీ వాతావరణాన్ని రాహుల్ కలుషితం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీపైన కూడా ఆయన మండిపడ్డారు. రోహిత్ ఆత్మహత్యపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాద్దాంతం చేస్తుంది.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇదే యూనివర్శిటీ నుండి 9 మంది చనిపోయారు.. మరి ఇప్పుడు మాట్లాడుతున్న నేతలంతా అప్పుడు ఏమయ్యారంట అని ప్రశ్నించారు. అప్పుడు చేసుకున్న ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని.. రాహుల్ గాంధీ ముందుగానే స్పందించి ఉంటే ఇప్పుడు రోహిత్ ఆత్మహత్య చేసుకునే వాడు కాదని అన్నారు. అంతేకాదు వరంగల్‌లో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు.

కాలికి బలపం కట్టుకొని తిరిగా.. చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేశారో వివరించారు. ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, ఆ అభివృద్ధి ఫలితాలనే నేడు అనుభవిస్తున్నారని అన్నారు. అంతేకాదు హైదరాబాద్ లో ఐటీని ఎలా అభివృద్ది చేయడానికి కష్టపడ్డారో కూడా తెలిపారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి చాలా కష్టపడ్డానని.. ఐటీ కంపెనీలు తీసుకురావడానికి అమెరికాలో తాను కాలికి బలపం కట్టుకొని తిరిగానని ఆయన చెప్పారు. ముందుచూపుతో ఐటిని అభివృద్ధి చేశానని అన్నారు. ఇంకా గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 14 శాసనసభ సీట్లు, రెండు పార్లమెంటు సీట్లు గెలిచామని, టిడిపిపై ప్రజలు అచంచల విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.

ఆయన్ని ఫుల్లుగా వాడుకుంటానంటున్న చంద్రబాబు..

కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాళ్లకి ఎక్కడికెళ్లినా ప్రశంసలు వాటంతట అవే వస్తాయి. అలాంటిది ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి చేతే అలాంటి ప్రశంసలు అందితే ఇంకేలా ఉంటది. అలాంటిదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఐవైఆర్ కృష్ణారావు విషయంలో జరిగింది. ఐవైఆర్ కృష్ణారావు ఈ నెల 31న రిటైర్ కానున్నారు. అయితే గతంలో చంద్రబాబు ఒకసారి ఆయన గురించి మాట్లాడుతూ ఆయన రిటైర్ అయినా.. ఆయన్ను పూర్తిగా వాడేస్తామంటూ చెప్పారు. ఆయన చెప్పినట్టు ఇప్పుడు అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనను వదులుకోవడం ఇష్టంలేని ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఆయనకు బ్రాహ్మణ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా.. దేవాదాయ అర్చకులు.. ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్టుకు ఐవైఆర్ ను ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రిటైర్డ్ అయినా కూడా ఐవైఆర్ కృష్ణారావు ఈ జంట పదవులతో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. మొత్తానికి ఐవైఆర్ కృష్ణారావు ను పూర్తిగా వాడుకుంటామన్న ప్రభుత్వం అనుకున్న పనిచేసింది.

అన్నా.. తమ్ముడు అనుకుంటూనే చినబాబుల పోరు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు ఒకరి మీద ఒకరు విమర్సల బాణాలు వేసుకుంటూ ఉండేవారు. అయితే తరువాత పరిస్థితులు మారడంతో ఇద్దరు సీఎం లు ఇప్పుడు సన్నిహితంగా ఉంటూ.. దాదాపు విమర్శలకు దూరంగానే ఉంటున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు సీఎంల తనయులు మాత్రం అన్నా.. తమ్ముడు అనుకుంటూనే పోటా పోటీగ విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ అనసూయ అనే మహిళ మీద ట్విట్టర్ వార్ జరిగింది. ఇప్పుడు మరో అంశం మీద ఇద్దరు కౌంటర్లు వేసుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో ప్రచారం చేస్తున్న లోకేశ్ ను ఉద్దేశించి కేటీఆర్.. లోకేశ్ గెస్ట్ లాంటి వాడు అని అభివర్ణించాడు. దీనికి లోకేశ్ సైలెంట్ గా ఉంటాడా.. కేటీఆర్ కు ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. హైదరాబాద్ గల్లీల్లో తిరిగి పెద్ద అయిన తనకు.. గుంటూరులో చదువుకున్న కేటీఆర్ గెస్ట్ అనటమేమిటంటూ కౌంటర్ వేశారు. మళ్లీ దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘మా తమ్ముడు లోకేశ్.. ఆంధ్రాలో ముఖ్యమంత్రి కావటానికి ప్రయత్నిస్తాడా? లేక తెలంగాణ నుంచి పోటీ చేస్తాడా? ఆ విషయం ముందు చెప్పమనండి’’ అంటూ లోకేశ్ ను ఇరుకున పెట్టే ప్రశ్న సంధించాడు. మరి దీనికి లోకేశ్ ఎలా సమాధానం చెబుతాడో వెయిట్ చేద్దాం.

మోడీ.. నిన్న స్వచ్ఛ భారత్.. ఈరోజు స్టాచ్యూ క్లీనింగ్

ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది నెలల క్రితం స్వఛ్చ భారత్ అంటూ నలుగురి చేత చీపుర్లు పట్టించి మరీ తుడిపించేరు. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీల వరకూ అందరూ కాస్తో.. కూస్తో చీపుర్లు పట్టి.. శుభ్రం చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు మళ్లీ స్వచ్ఛ భారత్ తరహా మరో నినాదానికి పిలుపు నిచ్చారు మోడీ. అదే "స్టాచ్యూ క్లీనింగ్".స్వాతంత్ర్య సమరయోధులు కావొచ్చు.. రాజకీయ నాయకులు కావొచ్చు.. ప్రముఖులు కావొచ్చు.. ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తిని స్మరించుకునేందుకు ఏర్పాటు చేసే విగ్రహాలను చక్కగా కడిగి శుభ్రంగా ఉంచాలన్నది తాజాగా మోడీ పిలుపు. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. దీనిలో భాగంగానే ఆయన  #statuecleaning పేరుతో ఒక హ్యాష్ టాగ్ ఓపెన్ చేసి ప్రతిఒక్కరూ తాము కడిగి.. శుభ్రపరిచిన విగ్రహాల ఫోటోల్ని పోస్ట్ చేయాలని.. తాను కొన్ని  ఫోటోల్ని రీట్వీట్ చేస్తానంటూ మోడీ ప్రకటించారు. మొత్తానికి మొన్నటి వరకూ చీపుర్లు పట్టించిన మోడీ.. ఇప్పుడు చెంబుడు నీళ్లని పట్టిస్తున్నారు.

వైద్యుడి మీద దాడి చేసిన ఎమ్మల్యే కొడుకు

అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లిపోతుందని కొందరి భావన. అలాంటివారి పుత్రరత్నాల ప్రవర్తన కూడా ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదు. దానికి తాజా ఉదాహరణగా ఒక ఎమ్మెల్యే కొడుకు వైద్యుని మీద దాడి చేసిన సంఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. బిహార్‌కు చెందిన కుంతీదేవి, లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి చెందిన RJD పార్టీ తరఫున శాసనసభ్యురాలిగా ఉన్నారు. ఆమె కొడుకు రంజిత్‌ యాదవ్‌ ఇవాళ గయలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోకి దూసుకువెళ్లి, ఆక్కడ విధులు నిర్వహిస్తున్న సత్యేంద్ర కుమార్‌ సిన్హా అనే వైద్యుని చితకబాదారు. చాలా సందర్బాలలో ఇలాంటి దాడులను చూసీ చూడనట్లు ఊరుకుంటారు. కానీ సదరు వైద్యుడు రంజిత్‌ మీద పోలీస్ కంప్లైంట్‌ ఇచ్చేందుకు నిర్ణయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రంజిత్‌ యాదవ్‌ తండ్రి కూడా ఒకప్పడు శాసనసభ్యుడే. కాకపోతే ఆయన మీద మోపబడిన ఒక హత్యానేరం రుజువు కావడంతో ప్రస్తుతం జైళ్లో ఉన్నారు. మరి రంజిత్‌ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తారో లేకపోతే ప్రజాసేవకి జీవితాన్ని అంకితం చేస్తారో చూడాలి. విమర్శకులు మాత్రం లాలూ రాజ్యంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉంటాయని పెదవి విరుస్తున్నారు.

సీ.ఎం కొడుకుకీ భాగముంది!

కేరళని ముంచెత్తిన సోలార్‌ స్కాంలో రోజుకో కొత్త విషయం బయటకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సరితా నాయర్‌ ఇవాళ జరిగిన న్యాయవిచారణలో మరో బాంబు పేల్చారు. కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీకి మాత్రమే కాదు, ఈ సోలార్‌ స్కాంలో ఆయన పుత్రరత్నం చాందీ ఉమెన్‌కి కూడా భాగస్వామ్యం ఉందని తేల్చారు. చాందీ ఉమెన్‌ షోకిల్లా రాయుడనీ, స్కాంలో దిగమింగిన సొమ్ముతో అతను గల్ప్‌లో విహారయాత్రలు సాగించేవాడనీ చెప్పారు సరిత. తాను చెప్పిన వివరాలన్నింటికీ ఫొటోలతో సహా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. సరిత చెబుతున్న విషయాలకీ, ముఖ్యమంత్రి మాటలకూ పొంతన లేకపోవడంతో ఎక్కడో తేడా జరుగుతోందన్న అనుమానం మాత్రం బలపడుతోంది. ఇంతకు ముందు జరిగిన విచారణలో కేరళ ముఖ్యమంత్రి సరితతో తనకి పెద్దగా పరిచయం లేదనీ, తామిద్దం కేవలం మూడుసార్లే కలుసుకున్నాననీ చెప్పడం గమనార్హం. సరితను కూడా ఇవే విషయాలు చెప్పమంటూ అదే రోజున సరితకు వచ్చిన ఫోన్‌ కాల్స్‌ ఇప్పడు సంచలనం సృష్టిస్తున్నాయి. పైగా సరిత కూడా స్వయంగా ఈ వాదనని నిరాకరిస్తూ, తామిద్దం తరచూ కలిసేవాళ్లమని కుండ బద్దలు కొట్టేశారు. తాను నిర్దోషినంటూ ఉమెన్‌ చాందీ చెబుతున్న ప్రతిసారీ మరో బలమైన సాక్ష్యం ఆయన మాటలకు ఎదురొడ్డుతోంది. ఏదేమైనా కానీ తాను మాత్రం ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలిపెట్టేది లేదని ఉమెన్‌ చాందీ పట్టుదలగా ఉన్నారు. ఇంకెన్ని సాక్ష్యాలు బయటకి వచ్చినా ఆయన తన పట్టుదలని వీడేట్లు లేరు

విమర్శకులకు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్..

తెలుగు దేశం పార్టీ పుట్టింది హైదరాబాద్లోనే అని.. నా మనసుకు దగ్గరగా ఉన్న నగరం హైదరాబాద్ అని చంద్రబాబు అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు సనత్‌నగర్ పాటిగడ్డ ప్రచారంలో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనపై విమర్సలు చేసిన వారికి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో నాకేం పని అంటూ కొందరు అంటున్నారు.. గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాను.. ఏపీ రాజధాని అభివృద్ధి నిమిత్తం అక్కడికి వెళ్లి పాలన చేస్తున్నాను..అంతేకాని ఇక్కడ ఎవరికో భయపడి వెళ్లడంలేదు అని ఘాటుగా సమాధానమిచ్చారు. అలాగే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు వచ్చాయంటే అది నా చొరవేనని, హైదరాబాద్‌లో గల్లిగల్లిలో సీసీ రోడ్లు వేయించానని..టీడీపీ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌ నగరంలో ఫ్లై ఓవర్లు కట్టించింది తానేనని తెలిపారు.

పెరుగుతున్న సోలార్ స్కాం హీట్..

కేరళ సీఎం ఊమెన్‌ చాందీ సోలార్ స్కామ్ లో ఇప్పటికే పీకల్లోతు ఉచ్చులో కూరుకుపోయారు. ఇప్పటికే ఈ స్కాంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ సీఎంకు రూ.కోటి తొంభై లక్షలు ఇచ్చానని చెప్పడంతో సీఎంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇప్పుడు కేరళ రాష్ట్రం సోలార్ స్కామ్ హీట్ తో వేడెక్కిపోయింది. మరోవైపు సీపీఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. సీఎం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్‌ ను చుట్టుముట్టారు. దీంతో వారిని అడ్డుకోవడానకి వచ్చిన పోలీసులపై కూడా కార్యకర్తలు రాళ్ళు విసరడంతో వారిని చెల్లాచెదురు చేయడానికి.. పోలీసులు బాష్పవాయు గోళాలు, లాఠీలు ఉపయోగించారు. మొత్తానికి సీఎం సోలార్ స్కాం వ్యవహారంతో రాష్ట్రం హీటెక్కిపోతుంది.

రేవంత్ రెడ్డి నయా సమాచారం..

తెలంగాణలో అధికార పార్టీని కానీ.. పార్టీ అధినేతని కానీ ఘాటూగా విమర్శించాలంటే మాత్రం టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తరువాతే ఎవరైనా. ఆయన చేసే విమర్శలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. రేవంత్ రెడ్డి గతంలో కేటీఆర్.. హరీశ్ ల మధ్య ఉన్న బేధాభిప్రాయాల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో కూడా మరోసారి కేటీఆర్.. హరీశ్ రావుల మధ్య విభేధాల గురించి ప్రస్తావించారు. కేటీఆర్..హరీశ్ రావుల మధ్య పంచాయితీ ఉందంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు మరో కొత్త విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. అది కేసీఆర్ ఫ్యామిలీలో లుకలుకలు ఉన్నట్టు. దీనికి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి కేటీఆర్..కవిత.. కేసీఆర్ చెబుతున్న మాటల్లో పొంతన లేకపోవటమే నిదర్శనం అని అన్నారు. మరి రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో ఎంత వరకూ నిజముందో.. రేవంత్ రెడ్డి మాటలకు ఆపార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

పార్టీ మారినా చంద్రబాబు అంటే ఇష్టమంటున్న ఎమ్మెల్యే..

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు టీడీపీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినా కూడా తనకు చంద్రబాబు అంటే ఇష్టమని చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పక్క పార్టీల నేతలను తిట్టడం కామన్. అలాగే ప్రచారంలో పాల్గొన్న కృష్ణారావు కూడా అందరి పార్టీ నేతలపై విమర్శలు చేశారు. మొన్నటి వరకూ ఉన్న టీడీపీ పార్టీ నేతలపై కూడా విమర్శలు గుప్పించారు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడిపై మాత్రం ఆయన ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. ఇదే విషయాన్ని అడుగ్గా.. దీనికి ఆయన టీడీపీ పార్టీలో నేను పాతికేళ్లు పనిచేశాను.. చంద్రబాబు అంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమని అన్నారు. అంతేకాదు చంద్రబాబు పాదయాత్రకు 250 మంది కార్యకర్తలతో రాష్ట్రం అంతటా తాను కూడా తిరిగాను.. నాకు టికెట్ ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు.. కానీ ఆఖరికి టిక్కెట్ ఇచ్చారని అన్నారు. ఇదిలా ఉండగా ప్రచారంలో భాగంగా కృష్ణారావు క‌టౌట్లలో కూడా కొంద‌రు చంద్ర‌బాబు ఫొటోను పెడుతున్నార‌ట‌. దీనిపై కూడా ఆయ‌న ఏమీ అన‌డం లేదట. మరి ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

అటు కేటీఆర్.. ఇటు లోకేశ్.. మధ్యలో అనుసూయ

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అన్నీ పార్టీలు తమ జెండాలతో ప్రచారం చేయడంలో మునిగిపోయాయి. ఇతర పార్టీ నేతలపై కామెంట్లు, కౌంటర్లు వేసుకుంటూ పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి పార్టీలన్నీ. అయితే అందరి ప్రచారం సంగతి పక్కన పెడితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో యువనేతలు.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తనయులు కేటీఆర్, లోకేశ్ ల మధ్య జరుగుతున్న వార్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే ఇద్దరూ చాలా తెలివిగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనే లోకేశ్ అధికార పార్టీపై విమర్శలు చేయగా.. దానికి కేటీఆర్.. లోకేశ్ ను తమ్ముడూ అంటూనే చురకలు అంటించారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ జరుగుతుంది. అది కూడా ఒక అనసూయ అనే మహిళ వల్ల.. ఆమెకు వీరిద్దరికీ సంబంధం ఏంటంటారా.. లోకేశ్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా అనసూయ అనే మహిళ ఆయన వాహనం వద్దకు వచ్చి తనను ఆదుకోవాలని కోరిందట. దీనికి గాను లోకేశ్ కేటీఆర్ కు ట్వీట్ చేశారట.  ‘‘అనసూయ అనే మహిళ పొరపాటున నన్ను మీరనుకుంది..తనను ఆదుకోవాలని నా వాహనం ముందు నిలిచింది..మిమ్మల్ని కలిసి తన గోడుకు చెప్పుకొనే మరో మార్గం లేకనే ఇలా చేసింది’’ అని ట్వీట్‌ చేశారు. దీనికి కేటీఆర్ స్పందించి.. ‘‘బ్రదర్‌ సంతోషం.. రాష్ట్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్న పార్టీతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిసే ఆమె ఇలా చేశారని అర్థం చేసుకోగలరు. ఆమెను తప్పకుండా ఆదుకుంటాం. అనసూయే కాదు… ఆమెలాంటి మహిళలందరినీ ఆదుకుంటాం. ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు’’ అని జవాబిచ్చారు. అంతేకాదు లోకేశ్ కు గుడ్ లక్ కూడా చెప్పారంట. మరి కేటీఆర్ ట్వీట్ కు లోకేశ్ ఎలా రీ ట్వీట్ ఇస్తారో చూడాలి.

రైల్వేశాఖ కొత్త నిర్ణయం.. టికెట్ల విషయంలో కూడా..

రైల్వేశాఖ ఈసారి మరో తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకున్న రైల్వేశాఖ మరో నిర్ణయం తీసుకొని ప్రయాణికులకు షాకిచ్చింది. అదేంటంటే.. సాధారణంగా ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఇప్పటివరకూ మనకు ఐఆర్ సీటీసీ ద్వారా చేసుకునే వీలుంది. అది అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు టికెట్ బుక్ ఫెసిలిటీ పై కూడా ఆంక్షలు విధించింది రైల్వేశాఖ. మామూలుగా అయితే ఇప్పటివరకూ నెలకు పది టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.. కానీ ఫిబ్రవరి 15 నుంచి వెబ్ సైట్ ద్వారా కేవలం ఆరు టిక్కెట్లు మాత్రమే కొనుగోలు చేసుకునే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయంతో ప్రజలు రైల్వేశాఖ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఒకవేళ ఎక్కువ టిక్కెట్లను కొనుగోలు చేయాల్సివస్తే అప్పుడు పరిస్థితి  ఏంటని.. రైళ్లలో సౌకర్యాలు సరిగా చూసుకొని రైల్వేశాఖ.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ముందుంటుందని అంటున్నారు. మరి రైల్వేశాఖ ఇప్పటికైనా ప్రయాణికులను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవడం మానుకుంటుందో లేదా తమ పని తాము చేసుకుంటూ పోతుందో చూడాలి.