సీమాంధ్రులను ఆకట్టుకున్న కేటీఆర్

  గ్రేటర్ ఎన్నిల్లో పార్టీలన్నీ నువ్వా.. నేనా అంటూ పోటా పోటీగా ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు అందరికి తలెత్తే ప్రశ్న ఏంటంటే.. సెటిలర్లు కూడా టీడీపీని నమ్మలేదా.. సెటిలర్లు ఉన్న ఏరియాలు కూడా టీఆర్ఎస్ పార్టీకే పట్టం గట్టాయి. ఎందుకు..? ఇలా ప్రశ్నలెన్నో తలెత్తుతన్నాయి. ఎందుకంటే.. ఇద్దరు సీఎంల కొడుకులు సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీగా ప్రచారం చేశారు. ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచారం చేశారు. మరి ఆయన ప్రచారానికి కూడా ప్రజలు ఇంప్రెస్ అవ్వలేదా..?. అయితే కేటీఆర్ మాత్రం సీమాంధ్రులను ఆకట్టుకునే విధంగా మాట్లాడారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇక సీమాంధ్రులు కూడా కేటీఆర్ మాటలకు పడిపోయారేమేకాని టీఆర్ఎస్ పార్టీకే ఓటేశారు. అంతేకాదు ఎప్పుడూ సీమాంధ్రులకు ఒక్క సీటు కూడా ఇవ్వని కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం దాదాపు 20 స్థానాలను సీమాంధ్రులకు ఇచ్చారు. ఇది కూడా ఒక కారణం అయి ఉండచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..    ఎక్కడో సెటిలర్లు ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే.. అది కూడా చాలా తక్కువ మెజార్టీతో టీడీపీ అభ్యర్ధులు గెలిచారు.

పాతబస్తీలో మజ్లిస్‌… మిగతా చోట్ల తెరాస!

హైదరాబాదు ఓటర్లు అధికార పక్షానికి ఊహించని రీతిలో పట్టాన్ని కట్టబెట్టారు. ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం పాతబస్తీ మొత్తాన్నీ మజ్లిస్‌ కైవసం చేసుకోగా, నగరంలోని మిగతా ప్రాంతాలలో తెరాస విజయఢంకా మోగించనుంది. సెటిలర్లు ఉన్న కొండాపూర్‌ వంటి ప్రాంతాలలో సైతం తెరాసకి ఎదురులేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపంచడం లేదు. కేవలం అయిదు సీట్లలోపే ఆ పార్టీకి దక్కేట్లు ఉన్నాయి. మాజీ మేయర్ అయిన బండ కార్తీకరెడ్డి వంటి హేమాహేమీలు సైతం తెరాస ప్రభంజనానికి తలవంచక తప్పలేదు. మొత్తానికి ఈ ఎన్నికలలో తెరాస సెంచరీ సీట్లని సాధించే దిశగా ఫలితాలు వస్తున్నాయి.  

బ్రెజిల్‌లో దోమలకు అయిదు రోజుల పండగ!

ప్రపంచమంతా జికా వైరస్‌తో వణికిపోతోంది. అన్ని దేశాలలోకెల్లా దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్‌ దేశానికి ఈ వైరస్ వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటివరకూ జికా వైరస్‌ సోకి బ్రెజిల్‌లో వందలాది మంది పిల్లలు మెదడుకి సంబంధించిన లోపాలతో పుట్టారు. అయినా బ్రెజిల్ వాసులు జికా వైరస్‌కు పెద్దగా భయపడుతున్నట్లు లేదు. బ్రెజిల్‌ దేశంలో రెండో అతిపెద్ద నగరం అయిన ‘రియో డి జెనెరో’లో ఇవాల్టి నుంచి అయిదు రోజుల పాటు పెద్ద ఎత్తున కార్నివాల్‌ (జాతర) జరగబోతోంది. ఈ కార్నివాల్‌కి దేశం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల దేశాల నుంచీ కూడా లక్షలాది మంది జనం తరలి వస్తారని అంచనా. ఇన్ని లక్షల మంది ఒక చోటకి చేరడం వల్ల జికాను వ్యాప్తి చేసే ఈడిస్‌ దోమలు విజృంభిస్తాయని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కార్నివాల్‌ తరువాత రియో నుంచి తిరిగి వెళ్లేవారు తమతో పాటు జికా వైరస్‌ను ప్రపంచం నలుమూలలకీ తీసుకువెళ్లే ప్రమాదం లేకపోలేదు. అయినా ఈ హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు సరికదా… ‘అవన్నీ పట్టించుకుంటే జీవితాన్ని సరదాగా గడిపేది ఎలా?’ అంటూ ఎదురు సమాధానం చెబుతున్నారట. మరో పక్క కార్నివాల్‌కు వచ్చేవారి నుంచి డబ్బులు దండుకోవడం కోసం స్థానిక హోటళ్లన్నీ ఎదురుచూస్తున్నాయి. కొందరికి సరదా కావాలి! మరి కొందరికి డబ్బు కావాలి! ఇంతకీ దీని వల్ల ప్రపంచానికి ఏం జరుగుతుందో ఎవరికి కావాలి?

ముస్లిం యువకుని కోసం… శివాలయంలో పూజలు బంద్‌!

కేరళలో జరిగిన ఒక అరుదైన సంఘటనలో మానవత్వానికి మతాలు అడ్డురావని తేలిపోయింది. అక్కడి తిరువనంతంపురంలోని ఒక చిన్న ఊరు అత్తింగల్. అందులోని శివాలయ ఉత్సవ కమిటీలో షబ్బీర్‌ అనే కుర్రవాడు కూడా చురుకుగా పాలుపంచుకునేవాడు. షబ్బీర్‌ను గత ఆదివారం కొందరు కొట్టి చంపేశారు. అందుకు సంతాపంగా అత్తింగల్ శివాలయంలో రెండురోజుల పాటు ఎలాంటి పూజాదికాదికాలూ నిర్వహించలేదు. షబ్బీర్‌ను తమ మిత్రునిగానే భావించాం కానీ వేరే మతం వాడిగా ఎప్పుడూ చూడలేదని… షబ్బీర్‌ ఇటు శివాలయానికీ అటు మసీదుకీ కూడా నిరభ్యంతరంగా వెళ్తూ ఉండేవాడని ఆలయ కమిటీ మెంబర్లు చెప్పారు. షబ్బీర్‌ మృతికి సంతాపంగా ఈ నెల 9వ తేదీన తలపెట్టిన ఊరేగింపుని కూడా రద్దు చేసింది ఆలయ కమిటీ.

చెప్పులు వేసుకున్నారని సల్మాన్‌‌, షారుక్‌ లపై కేసు

బాలీవుడ్ నటులు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ లు హిందువుల దేవాలయంలోకి చెప్పులతో వెళ్లినందుకు గాను వారిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలసిందే. హిందూ మహాసభల మహారాష్ట్ర యూనిట్‌ అధ్యక్షుడు భరత్‌ రాజ్‌పుత్‌ అనే వ్యక్తి వీరిద్దరూ పాదరక్షలతో దేవాలయంలోకి వెళ్లడం అది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే ఇప్పుడు వారిపై దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ కేసుని విచారణకు స్వీకరించిన మీరట్‌లోని అదనపు జిల్లా కోర్టున్యాయమూర్తి మార్చి 8న విచారించనున్నారు.

పనిలో చేరతారా? పని పట్టమంటారా?- దిల్లీ హైకోర్టు

దిల్లీలో పదవ రోజుకి చేరుకున్న నగరపాలక ఉద్యోగుల సమ్మె మీద దిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తి చేసింది. దిల్లీ నగరపాలక ఉద్యోగులు తమకు జీతాలు సరిగా చెల్లించడంలేదంటూ సమ్మెని చేపట్టిన సంగతి తెలిసిందే! దీని వల్ల దేశ రాజధాని కాస్తా చెత్తతో నిండిపోయింది. ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త వలన దుర్గంధం మాట అటుంచితే ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఉద్యోగులు కానీ ఒక్క మెట్టు కూడా కిందకి దిగే సూచనలు కనిపించడం లేదు. ఇదంతా కూడా గత ప్రభుత్వాల వల్ల ఏర్పడిన సంక్షోభం అనీ, ఈ సమ్మె వెనుక కేంద్రంలో అధికారం సాగిస్తున్న బీజేపీ ఉందనీ కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వ చేతకానితనం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష బీజేపీ దుమ్మెత్తి పోస్తోంది. కానీ ఈ ఇద్దరి మధ్యా సామాన్య ప్రజలు నలిగిపోతున్నారంటూ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నగరంలో పారిశుధ్యానికి నగరపాలక ఉద్యోగులదే బాధ్యత అనీ, కాబట్టి తక్షణమే విధులలో చేరమని అల్టిమేటం జారీ చేసింది. తమ మాటని పక్కన పెట్టి ఎవరన్నా ఇంకా విధులలో చేరకుండా అలసత్వం వహిస్తే, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. మరి ఉద్యోగులు న్యాయస్థానం మాటైనా వింటారా లేకపోతే చట్టాన్ని సైతం ధిక్కరిస్తారా అన్నది వేచి చూడాల్సిందే!

ఘనంగా విశాఖలో నౌకాదళ విన్యాసాలు..

విశాఖ పట్నం సాగరతీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఘనంగా ప్రారంభమైంది. ఈసందర్బంగా వారు చేసే విన్యాసాలను వీక్షించడానికి సందర్శకులు వేల సంఖ్యలో హాజరవుతున్నారు. యుద్ధనౌకల నమూనాలతో కూడిన శకటాలు.. సముద్రంలో విద్యుద్ధీపాలతో అలంకరించిన యుద్ధనౌకలు ప్రజలను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన, భారతీయ నౌకా దళానికి సంబంధించిన నౌకలు, జలంతర్గాములు, విమానాలు, హెలికాఫ్టర్ల విన్యాస ప్రదర్శన అలరించనున్నది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ రేపు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇంక్రిమెంట్ కోల్పోయిన గవర్నర్ నరసింహన్..

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇంక్రిమెంట్ కోల్పోయారంట.. అది కూడా తెలుగు చదవడం.. రాయడం రాకపోవడంవల్ల. ఇంతకీ గవర్నర్ ఎంత ఇంక్రిమెంట్ కోల్పోయారా అనుకుంటున్నారా రూ. 240 రూపాయలు. ఆ వివరాలేంటో చూద్దాం.. గవర్నర్ నరసింహన్ ఈ రోజు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ల సదస్సులో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ఐపిఎస్‌, ఐఏఎస్‌ అధికారులు ఇక్కడ పని చేసే సమయంలో తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి అని గతంలో ఏపీపీఎస్సీతో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేశారు. పీఎస్సీ పెట్టే పరీక్షల్లో తెలుగు రాయడం, చదవడం వచ్చా అంటే వచ్చు అని చెప్పానని.. కానీ వారు చదవమంటే చదవలేకపోయా.. ఆ తరువాత ఎలాగో కష్టపడి ఆరు నెలల్లో తెలుగు మాట్లాడటం వచ్చింది.. కానీ ఈలోపు నెలకు 40 రూపాయల ఇంక్రిమెంట్ చొప్పున ఆరు నెలల్లో 240 రూపాయలు నష్టపోయా అని అన్నారు. దీంతో అక్కడ ఉన్నవారందరూ నవ్వారు.

ముద్రగడ వర్సెస్ కృష్ణయ్య.. ఎవరి పంతం నెగ్గుతుంది..?

ఒకవైపు కాపులను బీసీల్లో చేర్చాలని.. తమ జాతికి న్యాయం చేయాలి అంటూ ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్నారు. ఈరోజు నుండి ఆయన ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరిస్తామని.. దీనిపై కమిటీ ఏర్పాటు చేశాం.. త్వరలోనే నివేదిక ఇస్తామని చెపుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు బిసి సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు, టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాత్రం ఎట్టి పరిస్థితిలో అది జరగనివ్వం అని కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చే ప్రయత్నాన్ని చంద్రబాబు విరమించుకోవాలని.. చంద్రబాబు జేజమ్మ దిగొచ్చినా కాపులను బీసీ ల్లో చేర్చనివ్వబోమని.. చిన్న చిన్న కులాలను బీసీ జాబితాలో చేరిస్తే స్వాగతిస్తామని, కానీ... అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను చంద్రబాబు కాదు కదా.. ప్రధాని దిగివచ్చినా బీసీ జాబితాలో చేర్చనివ్వబోమని చెపుతున్నారు. మరి ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకవేళ ముద్రగడ పంతం పట్టినట్టు కాపులను బీసీల్లో చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే కృష్ణయ్య కూడా దీక్ష చేపట్టడానికి ఏమాత్రం వెనుకాడని పరిస్థితి ఏర్పడింది. మరి కృష్ణయ్య చెప్పినట్టు ప్రభుత్వం ఈ ప్రయత్నాన్ని విరమించుకుంటుందా.. లేకపోతే కృష్ణయ్య చెప్పినట్టు కాపుల్లోనే చిన్న చిన్న కులాలను మాత్రం బీసీలో కలుపుతారా.. అలా చేస్తే దానికి ముద్రగడ ఒప్పుకుంటారా ఇలా పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి ఎవరి పంతం నెగ్గుతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

ముద్రగడ ఆమరణ దీక్ష..

తూర్పు గోదావరి జిల్లా, కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాధం, ఆయన సతీమణి తమ నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్బంగా ముద్రగడ మాట్లాడుతూ..కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నానని.. నా ప్రాణం నా జాతికి అంకితం.. నా జాతి కోసం దీక్ష చేస్తున్నానని తెలిపారు. ఎవరూ కిర్లంపూడి రావద్దు.. తమ ప్రాంతంలో ఉండే నిరసన తెలపండి... కాపు సోదరులు అందరూ భోజనం మాని కంచంపై స్పూన్లతో చప్పుడు చేయండి.. ఆ చప్పుడుకైనా సీఎం మన జాతికి న్యాయం చేస్తారని ఆశిద్దాం అని పిలపునిచ్చారు. తనకు పోలీసు రక్షణ ఏం అవసరం లేదని.. పోలీసులు వెళ్లిపోవచ్చని అన్నారు. చర్చలకు నేను వ్యతిరేకం కాదు.. చర్చలకు ప్రభుత్వం తరుపున దూతలు ఎవరొచ్చినా ఆహ్వానిస్తానని తెలిపారు.