మజ్లిస్తో తెరాస బంధం ముగిసిందా!
గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగానో, ఉద్రిక్తంగానో మొత్తానికి ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇప్పడు తెరాసకి అనుకూలంగా రావడంతో మేయర్ పదవిని సొంతంగానే దక్కించుకునే స్థితికి తెరాస చేరుకుంది. ఎలా చూసుకున్నా తమకి 75కి పైగానే సీట్లు వస్తాయనీ, 90 సీట్లు దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదనీ తెరాస నాయకులు సంబరపడిపోతున్నారు. ముఖ్యమంత్రి తనయుడు స్వయంగా రంగంలోకి దిగడం అంతా తానై అన్నీ తానై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో మొదటి నుంచీ ఈ ఎన్నికలు తెరాసకి అనుకూలంగా సాగే అవకాశాలు కనిపించాయి. దానికి తోడు నిన్న జరిగిన పోలింగ్ సరళి ఆసాంతం తెరాసకి కలిసొచ్చేలా ఉంది. దాంతో గ్రేటర్ పీఠం ఇప్పడు తెరాస పేరున దాదాపు ఖాయమైపోయింది. ఇప్పటి దాకా తెరాసకీ, మజ్లిస్కీ మధ్య కొంత సహృద్భావ వాతావరణమే ఉండేది. మజ్లిస్ని మంచి చేసుకునేందుకు తెరాస, నిజాంను సైతం పొగిడిన సందర్భాలు లేకపోలేదు.
కానీ నిన్న మజ్లిస్ కార్యకర్తలు ఏకంగా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ నివాసం మీదే దాడి చేయడం, ఆ సందర్భంలో నాయిని కూడా మజ్లిస్ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం చూస్తుంటే ఈ మిత్రత్వం ఇక ముగిసిందేమో అనిపిస్తోంది. ఒకవేళ మేయర్ పదవిని దక్కించుకునేందుకు తెరాసకి తగినంత బలం చేకూరితే మజ్లిస్తో దోస్తీ చేయాల్సిన అసలే ఉండదు. అవసరం లేకుండా రాజకీయాలలో ఎవరూ మిత్రపక్షంగా ఉండరు కదా! మరి ఈ ఎన్నికల ఫలితాలతో మజ్లిస్ కాస్తా తెరాసకి కూడా దూరమైనట్లేనా!