ప్రియాంక గాంధి కూతురు ఓ ఆట ఆడుకుంటోంది

  ప్రియాంక గాంధి అంటే దేశంలో తెలియనివారుడరు. రాహుల్‌ గాంధీని తప్పించి పార్టీ పగ్గాలను ప్రియాంకకు అప్పగించమని అడుగుతున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు! ప్రియాంక రాజకీయాలలో ఎంతవరకు రాణిస్తారో లేదో తెలియదు కానీ ఆమె కూతురు మాత్రం ఇప్పడు క్రీడలలో తెగ వెలిగిపోతున్నారు. పుదుచ్చేరిలో జరుగుతున్న జాతీయస్థాయి సబ్‌జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ పోటీలలో ఇప్పడు అందరి చూపు ‘మిరాయా వాద్రా’ వైపే ఉన్నాయి. ప్రియాంక, రాబర్ట వాద్రాల గారాలపట్టి అయిన మిరాయా ఈ పోటీలలో హర్యానాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో హర్యానా జట్టు తమిళనాడు జట్టు ముందు చిత్తుగా ఓడిపోయినా, రెండో లీగ్ మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్ జట్టు మీద ఆధిపత్యం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ మిరాయా వాద్రా చురుకుగా ఆడారని ప్రేక్షకుల అంటున్నారు. మిరాయా ఆట తీరుని చూడటానికి ప్రియాంక కూడా పుదుచ్చేరికి చేరుకున్నారట. గత ఏడాది జరిగిన రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలలో మిరాయా తొలిసారి మీడియా ముందుకి వచ్చారు. కేవలం ప్రియాంక కూతురుగానే ఆమెను అప్పట్లో భావించారు. ఇప్పడు క్రీడాకారిణిగా రెండోసారి కనిపిస్తున్నారు. మున్ముందు రాజకీయవేత్తగా కూడా మిరాయాను చూడాల్సి ఉంటుందేమో!  

దేవుడిని నమ్మనందుకు 800 కొరడా దెబ్బలు…

  అష్రఫ్‌ ఫయాద్‌ ఒక కవి. అతనికి దేవుడంటే అంతగా నమ్మకం లేదు. అదే విషయాన్ని ఆయన తరచూ తన కవితలలో, వ్యాసాలలో రాసేవాడు. అదే అతను చేసిన నేరం! సౌదీ అరేబియాకు చెందిన అష్రఫ్‌కు ఆ దేశం మరణశిక్షను విధించింది. అఫ్రఫ్‌ నాస్తికుడు అని నిరూపించేందుకు ఆయన రాసిన ‘Instructions within’ అనే పుస్తకాన్ని కోర్టు సాక్ష్యంగా తీసుకుంది. అఫ్రఫ్‌కు మరణదండన విధించారని తెలియగానే ఆయన తండ్రి గుండెపోటుతో చనిపోయారు. కనీసం తన తండ్రి అంత్యక్రియలకు కూడా అఫ్రప్ హాజరయ్యే అవకాశం లభించలేదు. అఫ్రఫ్‌కు విధించిన శిక్ష మీద ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో ‘జాలి’ తలచి ఆ శిక్షను ఇప్పుడు కాస్త కుదించింది. మరణశిక్షకు బదులుగా అష్రఫ్‌ ఎనిమిది ఏళ్ల కారాగార శిక్షనీ, 800 కొరడా దెబ్బలనీ భరించాల్సి ఉంటుంది. ఈ 800 కొరడా దెబ్బలనీ 16 దఫాలుగా విధిస్తారు. అఫ్రఫ్‌ తాను దైవద్రోహం చేసినట్లుగా బహిరంగంగా ఒక ప్రకటన కూడా చేయవలసి ఉంటుంది. ఇలాంటి శిక్షలు ప్రపంచానికి కొత్తేమో కానీ సౌదీ అరేబియాకు మాత్రం కాదు. చిన్నచిన్న నేరాలకి కూడా కఠినమైన శిక్షలను విధించడం అక్కడ పరిపాటే! పోయిన ఏడాది సౌదీ అరేబియా 153 మంది పౌరులకు మరణదండన విధించింది!

మజ్లిస్‌తో తెరాస బంధం ముగిసిందా!

  గ్రేటర్‌ ఎన్నికలు ప్రశాంతంగానో, ఉద్రిక్తంగానో మొత్తానికి ముగిశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కూడా ఇప్పడు తెరాసకి అనుకూలంగా రావడంతో మేయర్‌ పదవిని సొంతంగానే దక్కించుకునే స్థితికి తెరాస చేరుకుంది. ఎలా చూసుకున్నా తమకి 75కి పైగానే సీట్లు వస్తాయనీ, 90 సీట్లు దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదనీ తెరాస నాయకులు సంబరపడిపోతున్నారు. ముఖ్యమంత్రి తనయుడు స్వయంగా రంగంలోకి దిగడం అంతా తానై అన్నీ తానై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో మొదటి నుంచీ ఈ ఎన్నికలు తెరాసకి అనుకూలంగా సాగే అవకాశాలు కనిపించాయి. దానికి తోడు నిన్న జరిగిన పోలింగ్‌ సరళి ఆసాంతం తెరాసకి కలిసొచ్చేలా ఉంది. దాంతో గ్రేటర్‌ పీఠం ఇప్పడు తెరాస పేరున దాదాపు ఖాయమైపోయింది. ఇప్పటి దాకా తెరాసకీ, మజ్లిస్‌కీ మధ్య కొంత సహృద్భావ వాతావరణమే ఉండేది. మజ్లిస్‌ని మంచి చేసుకునేందుకు తెరాస, నిజాంను సైతం పొగిడిన సందర్భాలు లేకపోలేదు. కానీ నిన్న మజ్లిస్‌ కార్యకర్తలు ఏకంగా ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ నివాసం మీదే దాడి చేయడం, ఆ సందర్భంలో నాయిని కూడా మజ్లిస్‌ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం చూస్తుంటే ఈ మిత్రత్వం ఇక ముగిసిందేమో అనిపిస్తోంది. ఒకవేళ మేయర్‌ పదవిని దక్కించుకునేందుకు తెరాసకి తగినంత బలం చేకూరితే మజ్లిస్‌తో దోస్తీ చేయాల్సిన అసలే ఉండదు. అవసరం లేకుండా రాజకీయాలలో ఎవరూ మిత్రపక్షంగా ఉండరు కదా! మరి ఈ ఎన్నికల ఫలితాలతో మజ్లిస్‌ కాస్తా తెరాసకి కూడా దూరమైనట్లేనా!

మీ పిల్లల్ని అదుపులో ఉంచండి… గుజరాత్‌ ముఖ్యమంత్రికి మోదీ హెచ్చరిక!

  గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌ను సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న పనికి ఆహారభద్రత పథకం గుజరాత్‌లో సరిగా అమలు జరగడం లేదంటూ సుప్రీం కోర్టు ఆమెకు అక్షింతలు వేసింది. మరోవైపు తన వర్గానికి తగిన రిజర్వేషన్లు కల్పించాలంటూ హార్ధిక్‌ పటేల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తాజాగా మోదీ కూడా ఆమె పిల్లల తీరు గురించి ఆనందిబెన్‌ను హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆనంది బెన్ కొడుకు సంజయ్‌, కూతురు అనార్‌లు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తున్నట్లు ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ కూడా రియల్‌ ఎస్టేట్‌ తదితర వ్యాపారాలు చేస్తూ తమ వ్యాపారానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. దానికి తగినట్లుగానే రాష్ట్ర ఆర్ధిక శాఖ, రోడ్లు భవనాల శాఖ వంటి కీలక శాఖలన్నీ ఆనందిబెన్ చేతుల్లోనే ఉన్నాయి. అసలే ముఖ్యమంత్రి ఆపై ఆర్ధిక మంత్రి… ఇక ఆమె తల్చుకుంటే జరగంది ఏముంటుంది. ఆనందిబెన్‌ తీసుకునే కీలక నిర్ణయాలలో ఆమె పిల్లల పాత్ర ఉందన్న విషయం దిల్లీదాకా పాకడంతో మోదీ ఆమెను హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఆరోపణల్లో నిజం ఉన్నా లేకున్నా విపక్షాలకు అలాంటి విమర్శలు చేసే అవకాశం ఇవ్వవద్దని ఆమెకు మోదీ సూచించారట. మరి ఆమె వారసులు మోదీని చూసైనా వెనక్కి తగ్గుతారో లేదా!  

జికా వైరస్‌ పేరుతో టాటా కారు!

  ప్రపంచాన్నంతా వణికిస్తున్న వైరస్‌ జికా. పుట్టబోయే పిల్లలను సైతం వదలని ఈ వైరస్‌ ఇప్పడు టాటా సంస్థని కూడా తాకింది. కారణం! టాటా మూడేళ్లపాటు కృషి చేసి రూపొందించిన కారుకి జికాని పోలిన పేరు పెట్టుకోవడమే! తమ కారు వేగంగా ఉంటుంది అన్నదానికి సూచనగా టాటా తన కొత్త కారుకి Zippy Car అన్న పేరుని నిర్ణయించింది. దీన్ని పొడి అక్షరాలలో ZICAగా మార్చి అదే బ్రాండుతో విపణిలోకి వెళ్లాలని ఆశించింది. కానీ ఈ పేరు Zika Virusకు దగ్గరగా ఉండటంతో ఇప్పుడు టాటాకి లేనిపోని తలనొప్పులు మొదలయ్యాయి. ప్రచారం కోసం కావాలనే జికా వైరస్‌కు దగ్గరగా ఉన్న పేరుని ఎంచుకున్నారన్న విమర్శలూ మొదలయ్యాయి. విమర్శలే పనిచేశాయో లేకపోతే అలాంటి పేరు అసందర్భంగా ఉంటుందని తోచిందో కానీ ఇప్పుడు టాటా తన ZICA కారుకి మరో పేరుని వెతుక్కేనే పనిలో పడిపోయింది. కానీ అప్పటి వరకూ ఈ కారు పాత పేరుతోనే ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకూ డిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలో కూడా ఇదే పేరుతో ఈ కారుని ప్రదర్శించనున్నారు. ఈ కారు ఏమేరకు వ్యాపిస్తుందో చూడాలి మరి!

A-1 నిందితుడుగా ముద్రగడ పద్మనాభం

  గత నెల 31న తుని వద్ద జరిగిన హింసాకాండకి సంబంధించి పోలీసులు పలు కేసులను నమోదు చేశారు. రైల్వే ఆస్తులను తగలబెట్టడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం, విధులలో ఉన్న పోలీసుల మీద దాడి చేయడం… ఇలా దాదాపు 50కి పైగా కేసులను మోపారు. వీటిలో కొన్ని కేసులలో ముద్రగడ పద్మనాభంని A-1 నిందితునిగా చేర్చడం జరిగింది. ఆందోళనకారులు చాలా కెమెరాలను, సెల్‌ఫోన్లనూ ధ్వంసం చేసినప్పటికీ విధ్వంసానికి తగిన సాక్ష్యాలని పోలీసులు సేకరించగలిగారు. వీటన్నింటి ఆధారంగా దాదాపు 300 మంది నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది. తునిలో జరిగిన సభ హింసాత్మకంగా మారడం అప్పటికప్పుడు జరిగిన పరిమాణం కాదనీ, దీని వెనుక ఒక వ్యూహం ఉందనీ పోలీసులు అనుమానిస్తున్నారు. రైలు పట్టాలకి దగ్గరగా సభాస్థలిని ఎంచుకోవడం, రత్నాచల్‌ వచ్చే సమయానికి రైల్‌రోకోను తీవ్రతరం చేయడం అనేవి ఒక ప్రణాళిక ప్రకారమే జరిగాయని అంటున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే ముద్రగడ పద్మనాభంతో పాటు సభ జరిగేందుకు స్థలాన్ని అందించిన కొబ్బరితోట యజమాని మీద కూడా కేసు మోపినట్లు చెబుతున్నారు.

నోటా లేకపోవడంతో పోలింగ్‌ శాతం తగ్గిందా!

  అత్యంత ఆర్భాటంగా సాగిన గ్రేటర్‌ ఎన్నికలలో నోటా గుర్తులేకపోవడం వల్ల ఏమన్నా నష్టం జరిగిందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు పౌరులు. 2013 సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులలో ఎవ్వరూ కూడా ఓటరుకి నచ్చకపోతే అతను NONE OF THE ABOVE (NOTA) గుర్తుని ఎంచుకోవడం ద్వారా తన అయిష్టతను తెలియచేయవచ్చు. 2013 తరువాత వచ్చిన అన్ని ఎన్నికలలోనూ నోటాని అమలుచేశారు. పైగా కొన్ని స్థానిక ఎన్నికలలో సైతం నోటాని బ్యాలెట్‌లోకి చేరుస్తున్నారు. కానీ ఓటర్లందినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ గ్రేటర్‌ ఎన్నికలలో నోటా సదుపాయం లేకుండా పోయింది. చాలామంది విద్యావంతులు తమకి ఏ అభ్యర్థీ ఇష్టం లేకపోయినప్పటికీ, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నోటాని ఒక అస్త్రంగా భావిస్తారు. కానీ ఆ సౌకర్యం ఈసారి ఎన్నికలలో లేకపోవడంతో వారు పోలింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల కనీసం రెండు శాతం ఓట్లు తగ్గినట్లు అంచనా! ఎన్నికల కమీషన్‌ మాత్రం స్థానిక ఎన్నికలలో నోటాకి సంబంధించిన స్పష్టత లేకపోవడం వల్లే తాము దానిని అమలుచేయలేదని చేతులు దులిపేసుకుంది.

షబ్బీర్‌ అలీ మీద దాడి!

  గ్రేటర్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ చివరి అంకంలో బాహాబాహీ యుద్ధాలు తప్పలేదు. పాతబస్తీలో జరిగిన పురానాపూల్‌ సంఘటనలో సాక్షాత్తు కాంగ్రెస్‌ ముఖ్యనేత షబ్బీర్‌ అలీ మీదే దాడి జరిగింది. అక్కడ మహమ్మద్‌ గౌస్ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గౌస్‌ ఒకప్పుడు మజ్లిస్‌ తరఫున గెలిచి ఇప్పడు కాంగ్రెస్‌ పక్షానికి మారడంతో స్థానిక మజ్లిస్‌ కార్యకర్తలంతా ఆయన మీద గుర్రుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే అరెస్టులు, వాగ్వాదాలు సాగాయి. సాయంత్రానికి ఇరుపక్షాల నేతలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిపోయింది. గౌస్‌కి మద్దతుగా వచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాహనాన్ని మజ్లిస్‌ కార్యకర్తలు ధ్వంసం చేయడమే కాకుండా, అందులో ఉన్న షబ్బీర్‌ అలీ మీద భౌతికంగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు చోద్యం చూస్తుండిపోవడం గమనార్హం. చివరికి పోలీసులు జోక్యంతో ఉద్రిక్తత చల్లారింది.

TRSదే గెలుపు!

గ్రేటర్‌ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్‌ పోల్స్ సందడి మొదలైంది. ఇవి కాకుండా వివిధ పార్టీలు కూడా తమ వర్గాల ద్వారా ఓటర్ల ఎవరికి విజయాన్ని కట్టబెట్టారన్న దానిమీద ఒక నిర్ణయానికి వచ్చాయి. శాతం ఓటర్లు, పోలింగ్‌ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నదాని ప్రకారం ఈ ఎన్నికలలో టీఆర్ఎస్‌ తాను కూడా ఊహించనన్ని సీట్లను గెల్చుకోబోతోంది. మరో పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేకుండానే తాను సొంతగా మేయర్‌ అభ్యర్థిని గెలిపించుకునే స్థాయిలో ఈ పార్టీకి విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్‌ పోల్స్ ప్రకారం టీఆర్ఎస్‌ 75 నుంచి 80 వార్డులను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక రెండో స్థానం ఎవరిదన్నదే ఇప్పుడ తేలాల్సిన విషయం. అటు టిడిపి-బిజేపీ కూటమికీ, ఇటు ఎంఐఎంకీ కూడా 30 సీట్లు వస్తాయని ఊహిస్తున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం కాంగ్రెస్ నాలుగో స్థానానికి పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు 10 మించి వార్డులు దక్కవని కొందరి అంచనా! మరో వైపు 600కి పైగా ఉన్న స్వతంత్ర అభ్యర్థులు చాలామంది దారుణంగా ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

పోలింగ్‌ అద్భుతంగా జరిగింది- ఎన్నికల అధికారి!

  ఏవో చిన్నా చితకా సంఘటనలు మినహా పోలింగ్‌ అద్భుతంగా జరిగిందని ఎన్నికల అధికారి జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలలో ఓటింగ్‌ శాతం పెరిగిందని చెప్పారు. 2009తో 40.9 శాతం పోలింగ్ జరగగా అది ఇప్పుడు 45 శాతానికి పెరగడం సంతోషకరమన్నారు. ఈసారి కేవలం 4 దొంగ ఓట్లు మాత్రమే పడ్డాయనీ, గతంతో పోల్చుకుంటే ఇది నామమాత్రమేనన్నారు. ఇక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు మొరాయించిన సందర్భాలు కూడా చాలా తక్కువేనన్నారు జనార్ధనరెడ్డి. 7802 యంత్రాలలో కేవలం 9 యంత్రాలు మాత్రమే… అది కూడా కొద్ది నిమిషాల సేపే మొరాయించాయని చెప్పారు. ఈసారి వెబ్‌కాస్ట్ ద్వారా ఓటింగ్‌ జరిగే విధానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం వల్ల చాలా సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించగలిగామని చెప్పారు. అయితే పోలింగ్‌ 50 శాతం కంటే తక్కువగా ఉండటం తనకు కూడా నిరాశ కలిగించే అంశమన్నారు. నగర పౌరులలో ఉన్న ఈ జడత్వం పోయేందుకు తాము చాలా కృషి చేశామనీ అయితే ఓటర్లలో అవగాహన కలిగించేందుకు ఇది సరిపోయినట్లు లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించారు జనార్ధనరెడ్డి.

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్!

  ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన హైదరాబాద్‌ నగరపాలిక ఎన్నికలు ఎట్టకేళకు ముగిసాయి. దాదాపు 45 శాతం చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాతంగానే ముగిసిందంటూ ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. లంగర్‌హౌజ్‌ వద్ద బీజేపీ- టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మధ్య కొంత తోపులాట చోటుచేసుకుంది. ఇక అజంపురాలోని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ నివాసం మీద మజ్లిస్‌ కార్యకర్తలు దాడి చేయడంలో పోలీసులు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. మరోవైపు సమస్యాత్మకంగా భావించే పాతబస్తీలోనూ కొంత ఉద్రిక్తత నెలకొంది. పాతబస్తీలోని మీర్‌చౌక్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌- మజ్లిస్‌ పార్టీలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సంఘటనలో కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌ అలీలకు స్వల్ప గాయాలు అయ్యాయి.

"జికా వైరస్" పై ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జన్సీ

లాటిన్‌ అమెరికా దేశాల్లోని ప్రజలకు జికా వైరస్ ఈ మధ్య కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బ్రెజిల్ నుండి.. అమెరికా దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ ను అరికట్టడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నా అవి మాత్రం విఫలమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల గర్భిణీ స్త్రీలకు ఎక్కువ సమస్యలు వస్తున్న నేపథ్యంలోనే ఆదేశాల్లో 2018 వరకూ గర్భదారణ దాల్చవద్దని.. ఆదేశాలు కూడా జారీచేసింది. ఇప్పుడు ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని.. చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ వో) కీలక సమావేశం నిర్వహించి.. ముందే మేల్కొని దీనికి తగిన చర్యలు తీసుకోవడానికి హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించింది. వైరస్ కు టీకాను కనిపెట్టే దిశగా పలుదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు చర్చలు జరపనున్నారు.

పఠాన్‘కోట’లో పాగా

శత్రుదేశం గూఢచారులు నేరుగా మన సైనిక స్థావరాల్లో పాగా వేస్తున్నారు. కాబట్టే ఇటీవలి కాలంలో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు పేట్రేగిపోతున్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట కంటోన్మెంట్ లో ఇర్షాద్ అనే వ్యక్తి అరెస్టుతో ఈ దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెలుగు చూసింది. ఇర్షాద్ ఐఎస్ఐ ఏజెంటు. ఇతడు పఠాన్ కోట కంటోన్మెంట్ లో కార్మికుడిగా చేరి అక్కడి రహస్యాలన్నీ పాక్ ఐెఎస్ఐకి చేరవేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. భారతీయుడైన ఇర్షాద్ స్మార్ట్ ఫోన్ నుంచి కంటోన్మెంట్ కు సంబంధించిన రహస్య సమాచారం స్వాధీనం చేసుకున్నారు. దీన్ని అతడు జమ్ములోని సజ్జాద్ కు పంపించాడు. సజ్జాద్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భారత సైన్యంలో పఠాన్ కోట కంటోన్మెంట్ అత్యంత ప్రధానమైన  సైనిక స్థావరం. ఇంకా ఇలాంటి చీడపురుగులు ఎన్ని ఉన్నాయన్న దానిపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఇటీవలే పఠాన్ కోట ఎయిర్ ఫోర్స్ మీద జరిగిన దాడి దృష్ట్యా, వాటికి పాల్పడిన తీవ్రవాదులకు ఇర్షాద్ తోడ్పాటు కూడా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. పాక్ మన దేశంలో టెర్రరిజాన్ని ఫ్రోత్సహిస్తోందనడానికి ఇదొక నిదర్శనం.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సల్మాన్ ఖాన్ ఓటు..

జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న వేళ చాలా విచిత్రకరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంత మంది పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోతే.. కొన్ని చోట్ల మాత్రం ఇక్కడ లేని వాళ్ల పేర్లు కూడా వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు ఓటర్ల జాబితాలోకి బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ పేరు వచ్చి చేరింది. ఈరోజు గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్ననేపథ్యంలో గౌలిపుర డివిజన్‌ లో ఒక ఓటరు పేరు సల్మాన్‌ఖాన్‌, తండ్రిపేరు సలీమ్‌ఖాన్‌గా పేర్కొంటూ సల్మాన్‌ ఫొటోతో జాబితాలో ఓటు ఉంది. అంతేకాదు అందులో సల్మాన్ వయసు 64 ఏళ్లుగా అధికారులు పేర్కొన్నారు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వల్లనే జాబితాలో ఇలాంటి విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోర్టులోనే పెళ్లి చేసుకున్న క్రికెటర్..

పెళ్లిళ్లు ఒక్కొక్కళ్లు ఒక్కొరకంగా చేసుకుంటారు. కొంత మంది చాలా సింపుల్ గా పెళ్లిళ్లు చేసుకుంటే.. కొంతమంది చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. ఇప్పుడు క్రికెటర్ వరుణ్ ఆరోన్ కూడా చాలా వెరైటీగా పెళ్లి చేసుకున్నారు. టీమిండియాలో పేసర్ గా పేరుతెచ్చుకున్న వరుణ్ ఆరోన్ సింఫుల్ గా అదీ కోర్టులో పెళ్లి చేసుకొని అందరిని విస్మయానికి గురి చేశారు. జంషెడ్ పూర్ లోని కోర్టులో వరుణ్ తన చిన్ననాటి స్నేహితురాలైన రాగిణి సింగ్ ను పెళ్లాడారు. చాలా సింపుల్ గా చట్టబద్ధంగా కోర్టులో ఏకమైన ఈ జంట.. ఫిబ్రవరి 4న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటారని చెబుతున్నారు.

మీరూ ఓటేయ్యండి.. ఎన్టీఆర్.. ఒంటి గంట వరకు 25.83 శాతం పోలింగ్

జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ పోలింగ్ కేంద్రానికి తన తల్లి, భార్యతో వచ్చి ఓటు వేశారు. ఈసందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనకు అనారోగ్యంగా ఉన్నా కూడా తన ఓటు హక్కును తాను వినియోగించున్నానని.. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయడానికి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది అందరూ వచ్చి ఓటేయండి అని విజ్ఞప్తి చేశారు. ఓటుపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. తాను అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఓటు వేయడానికి వచ్చానని తెలిపారు. కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 25.83 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

అనుపమ్‌ ఖేర్‌కు మరో ఎదురుదెబ్బ!

అనుపమ్‌ ఖేర్‌కు పద్మభూషణ్ వచ్చిన సంబరం త్వరలోనే అడుగంటిపోయేట్లు ఉంది. బీజేపీని తరచూ సమర్థించే ఈ నటుడు అందుకు బదులుగా ఏదో చిక్కులో ఇరుక్కుంటూనే ఉన్నాడు. ఇప్పడు తాజాగా అనుపమ్‌ని పాకిస్తాన్‌లో అనుమతించేందుకు ఆ దేశం వీసాని మంజూరు చేయకపోవడంతో అనుపమ్ పేరు కాస్తా పొరుగుదేశాలకి కూడా పాకినట్లుంది. కరాచీలో జరిగే సాహిత్య సమావేశానికి హాజరయ్యేందుకు అనుపమ్ వీసాను కోరడంతో, పాకిస్తాన్‌ దాన్ని తిరస్కరించింది. ఒక పక్క బీజేపీకి మద్దతుని అందించడం వల్లే అనుపమ్‌కి పద్మభూషణ్‌ వచ్చిందని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. దానికి తగినట్లుగానే అనుపమ్‌ తనను మైకు దగ్గరకు పిలిచిన చోటల్లా దేశంలో అసహనం ఏమాత్రం లేదు అని అడగకుండానే చెబుతున్నారు. నిన్నటికి నిన్న కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కి ‘కాంగ్రెస్‌ చెంచా’ అని బిరుదునిచ్చి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పడు తన వీసాను తిరస్కరించినందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని ఏం దుమ్మెత్తి పోస్తారో చూడాలి మరి! పాకిస్తాన్‌ అధికారులు మాత్రం ఈ వివాదంలో తలదూర్చేందుకు సిద్ధంగా లేరు. అసలు అనుపమ్‌ ఖేర్‌ వీసా దరఖాస్తు తమకు అందలేదంటూ చేతులు దులిపేసుకున్నారు. అవును మరి... మాటల మాంత్రికుడు అనుపమ్‌తో తలపడేందుకు ఎవరు మాత్రం సిద్ధంగా ఉంటారు!