acp sanjeevarao

ఏసీపీ సంజీవరావుపై దాడి.. టీఆర్ఎస్ వ్యూహం అదేనా?

  కూకట్ పల్లి ఏసీపీ సంజీవరావు ఇంటిపై ఏసీబీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలో ఏసీబీ.. ఏసీపీ ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. దీనిలో భాగంగానే సంజీవరావుకు ఉన్న అనేక అక్రమాస్తులు బయటపడ్డాయి. ఇదంతా ఒకవైపు అయితే సంజీవరావు టీ టీడీపీ బంధువు అనే విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ సోదా వెనుక రాజకీయ కోణం కూడా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలో వరంగల్ ఉపఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కావాలనే ఏసీపీ ఇంటిపై దాడులు నిర్వహించిందని..ఆ రకంగా ఆ టీడీపీ నేతను ఇరుకున పెట్టాలని ఈ ప్లాన్ వేసిందని అనుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ,టీడీపీ తరుపున అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చేందుకు గాను ఆ టీడీపీ నేత గ్రౌండ్ వర్క్ చేస్తున్న నేపథ్యంలో.. మానసికంగా దెబ్బకొట్టేందుకే టీఆర్ఎస్ ఇలా చేసిందని.. దానివల్ల టీడీపీ నేత తన దూకుడిని తగ్గిస్తారని టీఆర్ఎస్ భావించి ఉండవచ్చని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం వారి మాటలను ఖండించి ప్రభుత్వానికి ఎవరైనా ఒకటే.. అవినీతికి పాల్పడితే ఎవరికైనా శిక్ష తప్పదు అంటు చెబుతున్నారు. మరి దీనిలో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Warangal By Polls

వరంగల్ ఉపఎన్నిక... గెలుపు అధికారపక్షందేనా?

  వరంగల్ ఉపఎన్నికల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి.  ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఎవరి ప్రచారంలో వారు బిజీగా ఉన్నారు. అంతా బానే ఉన్నా ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ వరంగల్ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారన్నది ప్రధాన చర్చ. అయితే దీనికి సంబంధించి ఎవరి సర్వేలు వారికి ఉన్నా.. ఫలితాలపై మాత్రం అటు మీడియా పరంగా కాని.. వివిధ పార్టీల పరంగా కాని తీసుకుంటే రెండింటిలోనూ ఒక విషయం మాత్రం స్ఫష్టంగా అర్ధమవుతోంది. అదేంటంటే తుది ఫలితం తెలంగాణ అధికారపక్షానికి సానుకూలంగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. వరంగల్ ఉప ఎన్నికల్లో తెలంగాణ అధికారపక్షం గెలుపు ఖాయమంటున్నారు. తక్కువలో తక్కువ వేసుకుంటే.. 3.5లక్షల మెజార్టీ ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ మధ్య టీఆర్ఎస్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిసిన విషయమే. అందరూ కాకపోయినా కొంతమంది మాత్రం టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగానే ఉన్నారు. దీంతో మునుపటి కంటే మెజార్టీ కాస్త తగ్గొచ్చు అంటున్నారు. కాగా వరంగల్ ఉపఎన్నికల్లో.. ఏడు నియోజక వర్గాల్లో రెండు నియోజక వర్గాల నుండి టీఆర్ఎస్ కు ఎటువంటి ఢోకా లేదని.. ఇక్కడి నుండే ఎక్కువ మెజార్టీ వస్తుందని.. ఇంకో రెండు నియోజక వర్గాల్లో కాస్త అటు ఇటుగా రావచ్చని.. ఇక మిగిలిన మూడు నియోజక వర్గాల్లో మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ కు రాకపోవడం. మరి ఈ సర్వే ఎంతవరకూ నిజమో తెలియాలంటే ఎన్నికలు అవ్వాల్సిందే.. ఫలితాల వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

ap cabinet

ఏపీ క్యాబినేట్ సమావేశం.. మంత్రులపై చంద్రబాబు గుస్సా..

  నిన్న ఏపీ క్యాబినేట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు అంశాలపై కాబినేట్ చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాలపై చర్చించగా.. దీనిపై చంద్రబాబు మంత్రులపై కాస్తంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఎవరు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించిన చంద్రబాబు. ఈ విషయంపై మీకు సమాచారం ఉందా అని అటవీశాఖామంత్రి బొజ్జట గోపాల కృష్ణారెడ్డితో పాటు.. మరో మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశ్నించగా.. తమకు ముందుగా తెలీదని చెప్పటంతో బాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులు వ్యతిరేకత చూపించిన నేపథ్యంలో వారికి గిరిజనుల మనోభావాల్నిదెబ్బ తీసే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకూడదని అదే సమయంలో బాక్సైట్ తవ్వకాల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు రెండు రోజుల నుండి ఏపీ లోని పలుజిల్లాల్లో  ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ఈవిషయంపై కూడా చంద్రబాబు మంత్రులపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. వరదల సమయంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాల్సింది పోయి.. ఊరికే ఉండిపోవటం ఏమిటని మంత్రులు దేవినేని ఉమ.. చినరాజప్పపై మండిపడ్డారు. మొత్తానికి ప్రశాంతంగా జరగాల్సిన క్యాబినెట్ సమావేశం చాలా సీరియస్ గా జరిగినట్టు తెలుస్తోంది.

Digvijay Singh

కల్లు తాగిన దిగ్విజయ్ సింగ్!

  వరంగల్ ఉప ఎన్నికలు ప్రచారం కోసం డిల్లీ నుండి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సోమవారం వరంగల్లో పార్టీ కార్యాలయంలో కల్లు తాగారు. అదేమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. అది కూడా ఎన్నికలలో ఓటర్లను ఆకట్టుకోవడానికేనని సర్ది చెప్పుకోకతప్పదు. పార్టీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం గౌడ కులస్తులతో జరిగిన ఒక సమావేశంలో దిగ్గీ రాజావారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారు తాము తాటి చెట్లు ఎక్కేందుకు ఉపయోగించే, మోకు(తాడు)ను అందించగా, దానిని ఆయన తన మెడలో వేసుకొని వారు అందించిన స్వచ్చమయిన కల్లును కాంగ్రెస్ నేతలందరి సమక్షంలో లొట్టలేసుకొని తాగారు. తెరాస ప్రభుత్వం చేతకానితనం మూలంగా రాష్ట్రంలో స్వచ్చమయిన కల్లు కంటే కల్తీ కల్లే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయని, అది తాగి అమాయకులయిన ప్రజలు అనేకమంది అనారోగ్యం పాలవుతున్నారని దిగ్విజయ సింగ్ అన్నారు.

paries terror attack

పారిస్ దాడిపై ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు..జల్సాలు చేసినపుడు తెలియలేదా?

  ఈ మధ్య ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వార్తల్లో నిలవడం రాజకీయ నేతలకు పరిపాటైపోయింది. ఒకపక్క పారిస్ లో ఉగ్రవాదులు దాడి జరిపి మారణహోమం సృష్టించగా అక్కడి ప్రజలు భయాందోళనతో ఉంటే ఇప్పుడు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిరియా, ఇరాక్ దేశాల్లో ఉన్న చమురు నిల్వలు దోచుకొని.. ఆ దేశాల్లోని చమురు క్షేత్రాలను ఆక్రమించి.. ఆ డబ్బుతో పారిస్‌లో జల్సాలు చేసిన రోజున, ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదా? అని ఆజంఖాన్ ప్రశ్నించారు. అమెరికా వంటి అగ్రరాజ్యాలు చేసిన చర్యలకు ప్రతిఫలమే పారిస్ లో ఉగ్రవాదుల దాడి అని.. ఇప్పుడైనా అగ్రరాజ్యం ఈ చర్యలను గుర్తించాలని అన్నారు. ఇరాక్, సిరియాలోని ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తుండటంతో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాదు.. వేలమంది నిరాశ్రయులను చేసింది. దీనిని ఎలా సమర్థించుకుంటారు?' అని ఆజంఖాన్ పేర్కొన్నారు.

uttar pradesh cm akhilesh yadav

బీహార్ లో ఏం జరిగింది.. వాళ్లు అధికారంలోకి రాలేదా..

  బీహార్ ఎన్నికల్లో మహా కూటమి విజయం సాధించిన సంగతి తెలసిందే. ఇప్పుడు అదే తరహాలో ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2017 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గాను వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని.. మహాకూటమిగా ఏర్పడి బరిలోకి దిగుతామని అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే పొత్త పెట్టుకుంటామని చెప్పారు కాని ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారన్న విషయం చెప్పడానికి మాత్రం నిరాకరించారు. అయితే ఇదే విషయంతో మంత్రి ఫరీద్ మహపూజ్ కిద్వాయ్ మాట్లాడుతూ సమాజ్ వాదీ-బీఎస్పీల మద్య పొత్తు ఉంటుందని తెలిపారు. అయితే సమాజ్ వాదీ-బీఎస్పీ పార్టీల మధ్య ఉన్న సఖ్యత అందరికి తెలిసిందే. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇదే విషయాన్ని మంత్రి గారి ముందు ఉంచగా  బీహార్ లో ఇప్పుడు ఏమి జరిగింది.. బీహార్ లో జేడీయూ- అర్జేడీలు పరిస్థితి కూడా అంతే.. కానీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాలేదా అని తిరిగి ప్రశ్నించి అందరూ షాకయ్యేలా చేశారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తారని.. బీహార్ ఎన్నికల్లో అదే జరిగిందని.. మేము అభివృద్ది ఎజెండాతోనే ఎన్నికల బరిలోకి దిగుతామని అన్నారు. మొత్తానికి బీహార్ ఎన్నికలు మాత్రం రాజకీయాల్లో పలు మార్పులనే తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు.

kcr

గవర్నర్ కూడా ఓ ఇల్లు అడిగారు.. కేసీఆర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ లోని ఐడీహెచ్ కాలనీలో డబులు బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దీదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వం లక్ష్యం.. అందుకే వారికోసం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించాం అని అన్నారు. ఇక నుండి పేదలకు కట్టించే ఇళ్లు డబుల్ బెడ్ రూం ఇళ్లే ఉంటాయి అని తెలిపారు. ఈ ఏడాది 60 వేల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని.. నియోజక వర్గానికి 400 ఇళ్ల చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామని అన్నారు. అంతేకాదు తనకూ ఓ ఇల్లు మంజూరు చేయండని గవర్నర్ అడిగారని.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సైతం ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రశంసించారని.. కేంద్రం సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ అన్నారు.

ktr

రాజీనామాకు రెడీ.. కేటీఆర్

  వరంగల్ ఉపఎన్నికలో భాగంగా ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ నేతలను ప్రజలు ప్రశ్నలు అడుగుతున్నారని.. టీఆర్ఎస్ నేతలను నిలదీస్తున్నారని అంటూ వస్తున్న వార్తలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అది కేవలం మీడియా సృష్టే అని మండిపడ్డారు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన పైవిధంగా స్పందించారు. తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగానే పాలిస్తుందని.. కావాలనే ప్రతిపక్షాలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు ఎన్నికలో వరంగల్ అభ్యర్ధి కనుక ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. అలాగే కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పడికి ఏడాదిన్నర పైన అవుతుంది... ఇప్పటివరకూ ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది లేదు.. కనీసం తెలంగాణ గురించి మాట్లాడింది లేదు.. అలాంటిది బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు.. అసలు వారికి ఓట్లు అడిగే హక్కు కూడా లేదని తేల్చి చెప్పారు.

dmdk vijayakanth

తన తప్పును సరిచేశాడని ఎమ్మెల్యేని పొట్టలో గుద్దిన హీరో..

  తన తప్పును సరిచేయడానికి చూసిన సొంత పార్టీ ఎమ్మెల్యేను పొట్టలో గుద్ది మీడియాకి ఎక్కారు డీఎండీకే అధ్యక్షుడు, తమిళ నటుడు విజయకాంత్‌. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల తమిళనాడులో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు గాను తమిళనాడు కడలూరు లో అనేక గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ ఆ గ్రామాల ప్రజలను పరామర్శించడానికి వెళ్లారు. అయితే అక్కడ ప్రజలను ఉద్దేశించి విజయకాంత్ మాట్లాడుత్న సమయంలో తప్పులు దొర్లాయి. దీంతో పక్కనే ఉన్న శివకుళందై అనే ఎమ్మెల్యే విజయకాంత్ తప్పులను సరిచేయడానికి చూశారు. అంతే విజయకాంత్ వెంటనే ఆ ఎమ్మెల్యే వీపుపై గట్టిగా ఒక దెబ్బ వేసి.. పొట్టలో ఒక గుద్దు గుద్దారు. దాంతో ఎమ్మెల్యేకి ఎం చేయాలో తెలీకా క్వశ్చన్ మార్క్ ఫేస్ తో నిల్చుండిపోయారట. కాగా విజయకాంత్  కు ఇలాంటి పనులు చేయడం కొత్తేమి కాదని.. ఆయన మధ్యమ ప్రియుడు కావడంతో మద్యం పుచ్చుకోవడం వల్ల ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడని.. తరచూ ఇలాంటి వివాదాలతో మీడియాకి ఎక్కుతూనే ఉంటారని అనుకుంటున్నారు.

red sanders smuggler gangi reddy

గంగిరెడ్డి ఆస్తులు రూ.400 కోట్ల ఉండొచ్చు.. డిజిపి రాముడు

  అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగిరెడ్డిని పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా డిజిపి రాముడు మాట్లాడుతూ ఎర్రచందనం కేసులో గంగిరెడ్డి 2014లోనే అరెస్ట్ అయ్యాడని.. ఆ తరువాత బెయిల్ ద్వారా బయటకు వచ్చి విదేశాలకు పారిపోయాడని అన్నారు. అలా తాను ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్తూ చివరికి మారిషన్ చేరుకున్నాడని.. మారిషన్లో గంగిరెడ్డిని పట్టుకోవడంలో అధికారులు బాగా సహకరించారని అన్నారు. గంగిరెడ్డి దొంగసారా నుంచి హత్యాయత్నం వరకు మొత్తం 28 కేసులు ఉన్నాయన్నారు. గంగిరెడ్డి ఆస్తులు రూ.400 కోట్ల వరకు ఉండొచ్చు అని తెలిపారు. అయితే, ఆయన ఆస్తుల పైన ఈడీ విచారణ చేస్తోందని, అప్పుడే అసలు ఎన్ని ఆస్తులున్నాయో తేలుతుందన్నారు.

kodali nani

జగన్ గంగలో దూకితే నేను దూకుతా.. కొడాలి నాని

గుడివాడలోని వైసీపీ కార్యలయం వివాదం నేపథ్యంలో కొడాలి నాని టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసిందని అన్నారు. వైఎస్సార్ సీపీ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని.. భూమారెడ్డి, రోజాను కూడా టార్గెట్ చేశారు అని వ్యాఖ్యానించారు. నేను రెండు నెలల్లో భవనం ఖాళీ చేసి యజమానురాలికి ఇస్తానని చెప్పాను.. ఇంతలోనే టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. దమ్ముంటే 2019 ఎన్నికల్లో గుడివాడ నుండి చంద్రబాబు పోటీ చేయాలని అన్నారు. ఎంత మంది బుద్దా వెంకన్నలు వచ్చినా ఎవరికీ భయపడనని చెప్పారు. త్వరలోనే నా విశ్వరూపం చూపిస్తా అని.. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ తోనే ఉంటాం.. జగన్ గంగలో దూకితే నేను కూడా గంగలో దూకుతా.. ఒకవేళ జగన్ ను వీడాల్సి వస్తే రాజకీయాలనుండే తప్పుకుంటా అని అన్నారు. ఎన్టీఆర్ తర్వాత నేను అభిమానించే వ్యక్తి జగన్ అని అన్నారు.

ఏమాత్రం తగ్గని మోడీ ఇమేజ్..!

  బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో మోడీ దూకుడికి ఇక బ్రేకులు పడ్టట్టే  అనుకున్నారు. కానీ అది ఊహ మాత్రమే అని తెలిసేలా చేశారు మోడీ మరోసారి. సాధారణంగా మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు మోడీ జపంతో ఊగిపోతారు. అయితే బీహార్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి అలాంటి వాటికి బ్రేక్ పడుతుందనుకున్నారు. కానీ తాజాగా బ్రిటన్ పర్యటనలో ఉన్న మోడీకి మాత్రం ఘన స్వాగతం లభించింది. అంతేకాదు బ్రిటన్ లోని వెంబ్లే బహిరంగ సభలో మోడీ చేసిన ప్రసంగానికి మంచి స్పందన లభించింది.  ప్రవాస భారతీయుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామని.. ప్రవాస భారతీయులు స్వచ్ఛ్ భారత్ కోసం ఎంతో కృషి చేస్తున్నారని.. అహ్మాదాబాద్ నుంచి లండన్ కు డైరెక్ట్ విమాన సర్వీసును డిసెంబరు 15 నుంచి ప్రారంభించబోతున్నామని ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగానికి ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు దీనికి సంబంధించి బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ కూడా తన ట్విట్టర్లో ట్వీట్స్ చేశాడు. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం అద్భుతమని, ఆయన చేసిన ప్రసంగానికి భారతీయుడుగా గర్విస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. మొత్తానికి బీహార్ ఎన్నికల్లో ఓడిపోయినా కాని మోడీ ఇమేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.

వైఎస్సార్ కార్యాలయం వివాదం.. ఏం చేస్తారో చేసుకోండి.. కొడాలి నాని

కృష్ణాజిల్లా, గుడివాడలోని వైఎస్సార్ కార్యాలయం వివాదంగా మారింది. వైఎస్సార్ కార్యాలయాన్ని ఖాళీ చేయించి.. కార్యలయం పేరు తొలగించి.. రంగులు వేయించి పోలీసులు యజమానురాలికి అప్పగించారు. దీంతో కొడలి నాని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు కావాలనే పోలీసులను పంపి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.. కార్యాలయం  తాళం పగలకొట్టి ఇప్పటి నుండి నేను ఇక్కడే ఉంటాను.. దమ్ముంటే ఏం చేస్తారో చేసుకోండి అంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. దీంతో టీడీపీ నేతలు కూడా కొడాలి నానికి ప్రతిసవాల్ విసిరారు. ఈ సందర్బంగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ కార్యాలయం దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మరీ కొడాలి నాని అక్రమాలను భయటపెడతామని అన్నారు. దీనిలో భాగంగానే బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు.. ఇంకా పలువురు టీడీపీ కార్యకర్తలు కార్యలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వివాదం ముదరడంతో గుడివాడలో భారీగా పోలీసులు మొహరించారు.

నేటి నుండి వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో జగన్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల చిన్న సంఘటన జరిగినా హైదరాబాద్ నుండి రెక్కలు కట్టుకొని ఎగిరి వచ్చేసి అక్కడ వాలిపోయే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ పక్కనే ఉన్న తెలంగాణా జిల్లాలలో తెలంగాణా జిల్లాలలో పర్యటించలేదు...ప్రజా సమస్యలపై పోరాడలేదు. కనీసం తెలంగాణా వైకాపా నేతలు కూడా ప్రజా సమస్యల పోరాడలేదు. కారణాలు అందరికీ తెలిసినవే. తెలంగాణాలో తన ఉనికే చాటుకోవడానికి ఇష్టపడని వైకాపా ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. కానీ అది ఎందుకు పోటీ చేస్తోందో కారణాలు అందరికీ తెలుసు.   వైకాపా తరపున నల్లా సూర్య ప్రకాష్ వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అతనికి మద్దతుగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేటి నుండి వరుసగా నాలుగు రోజుల పాటు వరంగల్ లోక్ సభ నియోజక వర్గం పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచారం చేస్తారు. మొదటి రోజు పరకాల, హన్మకొండ, వరంగల్, స్టేషన్ ఘన్ పూర్ లలో రోడ్ షోలు నిర్వహించి, తొర్రూరులో బహిరంగ సభలో పాల్గొంటారు.   రేపు పరకాల నియోజక వర్గంలోని ఆత్మకూరు నుండి ప్రచారం మొదలుపెట్టి శాయంపేట, రేగొండ, భూపాలపల్లిలలో రోడ్ షోలు నిర్వహిస్తారు. చివరగా పరాకాలలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. బుదవారం నాడు పరకాల నియోజక వర్గంలో సంగెం, గీసుగొండ మండలాలో ప్రచారం చేసిన తరువాత గ్రేటర్ వరంగల్ పరిధిలో ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ మరునాడు హన్మకొండ, కాజీపేట, ధర్మాసాగర్ లలో ప్రచారం చేస్తారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు.