నేటి నుండి వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల చిన్న సంఘటన జరిగినా హైదరాబాద్ నుండి రెక్కలు కట్టుకొని ఎగిరి వచ్చేసి అక్కడ వాలిపోయే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ పక్కనే ఉన్న తెలంగాణా జిల్లాలలో తెలంగాణా జిల్లాలలో పర్యటించలేదు...ప్రజా సమస్యలపై పోరాడలేదు. కనీసం తెలంగాణా వైకాపా నేతలు కూడా ప్రజా సమస్యల పోరాడలేదు. కారణాలు అందరికీ తెలిసినవే. తెలంగాణాలో తన ఉనికే చాటుకోవడానికి ఇష్టపడని వైకాపా ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. కానీ అది ఎందుకు పోటీ చేస్తోందో కారణాలు అందరికీ తెలుసు.
వైకాపా తరపున నల్లా సూర్య ప్రకాష్ వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అతనికి మద్దతుగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేటి నుండి వరుసగా నాలుగు రోజుల పాటు వరంగల్ లోక్ సభ నియోజక వర్గం పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచారం చేస్తారు. మొదటి రోజు పరకాల, హన్మకొండ, వరంగల్, స్టేషన్ ఘన్ పూర్ లలో రోడ్ షోలు నిర్వహించి, తొర్రూరులో బహిరంగ సభలో పాల్గొంటారు.
రేపు పరకాల నియోజక వర్గంలోని ఆత్మకూరు నుండి ప్రచారం మొదలుపెట్టి శాయంపేట, రేగొండ, భూపాలపల్లిలలో రోడ్ షోలు నిర్వహిస్తారు. చివరగా పరాకాలలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. బుదవారం నాడు పరకాల నియోజక వర్గంలో సంగెం, గీసుగొండ మండలాలో ప్రచారం చేసిన తరువాత గ్రేటర్ వరంగల్ పరిధిలో ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ మరునాడు హన్మకొండ, కాజీపేట, ధర్మాసాగర్ లలో ప్రచారం చేస్తారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు.