ఈ చిరుతపులికి కోరలు లేవు కాబట్టి సరిపోయింది!

గత ఆదివారం బెంగళూరులోని ఒక పాఠశాలలోకి ప్రవేశించిన చిరుతపులి ఆ రోజంతా అధికారులకి చెమటలు పట్టించింది. తన దారికి ఎదురువచ్చిన అధికారుల మీదా, పర్యావరణవేత్తల మీదా చిరుతపులి తీవ్రంగా దాడి చేసేందుకు ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ ఆ చిరుతకు ఒక కన్ను సరిగా కనిపించడం లేదనీ, కోరలు కూడా సరిగా లేవనీ తేలింది. లేకపోతే, చిరుత దాడికి గురైన వారు మృత్యువాత పడక తప్పేది కాదు. బెంగళూరు శివార్లలో ఉన్న మరాఠహళ్లి అనే ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. బెంగళూరులో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు పర్యావరణవేత్తలని కలచివేస్తున్నాయి. కేవలం చిరుతలే కాదు… ఏనుగులు, దేవాంగపిల్లులు, జింకలు, అరుదైన పక్షులు తరచూ బెంగళూరు పట్టణంలో ప్రవేశిస్తున్నాయి. వాటిని అడ్డుకునేందుకో, పట్టుకునేందుకు పట్టణవాసులు చేస్తున్న ప్రయత్నంలో తీవ్రంగా గాయపడుతున్నాయి. బెంగళూరు పట్టణం నిదానంగా విస్తరిస్తూ, తన చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాన్ని ఆక్రమించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటున్నారు మేధావులు. బెంగళూరు చుట్టుపక్కల ఉన్న అద్రంగి, ఉజ్జని వంటి అటవీ ప్రాంతాల నుంచి అప్పుడప్పుడూ పొరపాటున పట్టణంలో ప్రవేశిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. పట్టణవాసులు మాత్రం ఎప్పటిలాగే అటవీ జంతువులు తమ నివాస ప్రాంతాలలోకి చొచ్చుకువస్తున్నాయని వాపోతున్నారు! ఇంతకీ ఎవరు ఎవరి ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నట్లు?

ప్రియాంక సీక్రెట్ తెలియాలంటున్న కత్రినా..

సాధారణంగా ఒక హీరోయిన్ ను ఒక హీరోయిన్ పొగుడుకోవడం చాలా రేర్. అందులోనూ బాలీవుడ్ లో ఇది కొంచెం ఎక్కువ. అక్కడ హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ మాత్రమే కాదు.. కొంద మంది హీరోయిన్ల సంగతైతే.. పచ్చగడ్డి వేస్తేనే భగ్గమంటుందా అనే రేంజ్ లో కోల్డ్ వార్ జరుగతుంటుంది. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా కత్రినా కైఫ్ మరో నటి ప్రియాంక చోప్రాని మాత్రం పొగిడేసింది. ఫితూర్‌ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె  ప్రియాంక హాలీవుడ్‌ ఎంట్రీ గురించి ప్రస్తావించింది. హాలీవుడ్‌లో సినిమాలు చేయాలంటే ఎంతో ధైర్యం, పట్టుదల, ఏకాగ్రత కావాలని అవన్నీ ప్రియాంకలో ఉన్నాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉందని తెలిపింది. మరి ఇది విన్న ప్రియాంక కత్రినాకు తన సక్సెస్ సీక్రెట్ ఏంటో చెబుతుందో లేదో చూడాలి. 

అవార్డులతో ఉపయోగం లేదు...ఇర్ఫాన్‌ ఖాన్‌

బాలీవుడ్ నటులు ఈమధ్య వివాద్సపద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు వారి జాబితాలో బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కూడా చేరిపోయాడు. ఇర్ఫాన్‌ ఖాన్‌ అవార్డులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో అవార్డులు ఎవరికీ ఉపయోగకరంగా ఉండట్లేదని.. ‘అవార్డులు గెలుచుకోవడం వల్ల నటీనటులకు.. దర్శకులను ఎలాంటి ప్రయోజనం కలగట్లేదు. వీటి వల్ల డబ్బులు రావు.. అవకాశాలు రావు. ఎందుకంటే వాటికి ప్రాధాన్యం లేకుండా పోతోంది. అదే హాలీవుడ్‌లో అయితే అకాడమీ.. గ్లోబల్‌ అవార్డులకు ఎంతో ప్రాధాన్యముంది. ఎవరైనా ఆ అవార్డును గెలుచుకుంటే వారి కెరీర్‌ అమాంతం ఉన్నతస్థాయికి చేరుతుంది. మంచి సినిమా అవకాశాలు వస్తాయి. డబ్బు కూడా ఎక్కువగా వస్తుంది’ అని అవార్డులపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. కాగా ఇటీవలే అవార్డుల గురించి రిషికపూర్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే.

కాపులను చేర్చడానికి వీల్లేదు.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని..

ఒకవైపు కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ ఆందోళనలు చేపడితే.. ఇప్పుడు కాపులను బీసీల్లో చేర్చడానికి వీల్లేదంటూ ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈరోజు విజయవాడలో బీసీ సంఘాల నేతలు సమావేశమైన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చొద్దంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని మురళీ గౌడ్ అనే వ్యక్తి గందరగోళం సృష్టించాడు. వివిధ పార్టీల్లో పదవులు అనుభవిస్తూ బీసీ సంఘాల కోసం ఏం చేశారు అంటూ.. వెంటనే పదవులకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో సమావేశం దగ్గరకు పోలీసులు భారీగా చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

ఎమ్మెల్యేలను లొంగ తీసుకుంటున్నారు..

తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ జంపింగ్ పై ఆపార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పైన కత్తి పెట్టి  టిఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని.. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని.. విపక్షాలను నిర్వీర్యం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని అన్నారు.  పార్టీ ఫిరాయింపుల పైన పార్లమెంటులో చట్టం తేవాల్సి ఉందని..  ఒత్తిడి చేసి ఎమ్మెల్యేలను లొంగ తీసుకుంటున్నారని, పార్టీ మారకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నారని, ఇలా చేస్తే భవిష్యత్తులో కెసిఆర్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని హెచ్చరించారు.

విజయవాడలో బీసీ సంఘాల సదస్సు..

విజయవాడలో ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం జరగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఆకలి పోరాటం కాదు.. ఆత్మగౌరవ పోరాటం అని అన్నారు. కాపుల్ని బీసీల్లో ఏ ప్రతిపాదికన చేర్చుతారంటూ గతంలోనే హైకోర్టు ప్రశ్నించింది అని గుర్తుచేశారు. అంతేకాదు జనాభాకు తగినట్టు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేకుంటేనే బీసీల్లో కలపడానికి అర్హత ఉంటుంది.. అయినా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలే తప్ప ఇతర కులాల్ని చేర్చకూడదని అన్నారు. సమాజంలో చిన్న చూపుకి గురవుతున్న కులాలవారికి.. అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నదే రిజర్వేషన్ల ఉద్దేశం. బలప్రయోగం ద్వారా బీసీల్లో కలపాలని చూస్తే మాత్రం ఉత్తరాదిన జూట్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

ISIS తీవ్రవాదుల జీతాల తగ్గింపు

ప్రపంచమంతా ఏకమై ఇప్పడు ISIS మీద విరుచుకుడటంతో, ఆ సంస్థ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. దాంతో తన సైనికులకు అందించే జీతాలను కూడా సగానికి సగం తగ్గించాల్సి వచ్చింది. సిరియా, ఇరాక్‌ దేశాలలో తను ఆక్రమించిన చాలా ప్రాంతాలను ISIS ఖాళీ చేయాల్సి రావడంతో… ఈ మద్య ISIS బాగా నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరాజయాల వల్ల నెలనెలా కోట్లాది రూపాయల ఆదాయం లభించే చమురు బావులు కాస్తా ఆ సంస్ఘ నుంచి చేజారిపోయాయి. ఒకప్పుడు నెలకి 20-60 వేల వరకూ జీతాలను అందించిన ISIS, ప్రస్తుతం వాటిలో సగానికి పైగా కోతని విధించాల్సి వచ్చింది. ఒకపక్క వరుస పరాజయాలు, మరో పక్క వైమానిక దాడులలో మరణిస్తున్న సైనికులు…. వీటన్నింటి మధ్యా జీతాలను కూడా తగ్గించేయడంతో ఇప్పడు ISISలో పనిచేస్తున్న సైనికులు కొందరు నిదానంగా జారుకుంటున్నట్లు సమాచారం! అందుకని ఆ సంస్థ ఇప్పడు తక్కువ జీతంతో ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల కోసం ఎదురుచూస్తోంది.

చంద్రబాబు చాలా మంచి నాయకుడే కానీ...

టీడీపీ కుత్బాల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ పార్టీకి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా టీడీపీ అఫీసుకి తన రాజీనామా లేఖ పంపారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో.. క్యాంపు ఆఫీసులోనే టీఆర్ఎస్ లోకి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏపీకే పరిమితమయ్యారు.. ఆయన లేని లోటు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోందని, చంద్రబాబు చాలా మంచి నాయకుడని, తమ పార్టీకి కూడా ప్రజల్లో మంచి పేరు ఉందని, కానీ ఇప్పుడు ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని అందుకే తాను తెరాసలో చేరానని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. అంతేకాదు సీఎం కేసీఆర్ పై కూడా ప్రశంసలు కురిపించారు. హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దడం ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే సాధ్యమని.. కెసిఆర్ సంక్షేమ పథకాలు ప్రజలు మెచ్చేవిగా ఉన్నాయన్నారు. ఆ సంక్షేమ పథకాలు తనకు నచ్చాయని చెప్పారు.

తెలంగాణలో టీడీపీ..ముగ్గురు గ్రేటర్ ఎమ్మెల్యేల జంప్

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉంది ప్రస్తుతం టీ టీడీపీ పరిస్థితి చూస్తుంటే. గ్రేటర్ ఎన్నికల అనంతరం టీ టీడీపీ పార్టీలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచి కష్టాల్లో ఉంటే ఇప్పుడు దానికి తోడు ఆ పార్టీలోకి నేతలు వేరే పార్టీల్లోకి జంప్ అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ టీడీపీని వీడి కారెక్కనున్నారు. ఎమ్మెల్యే వివేకానంద ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను కూడా పంపించేశారంట. ఇక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడమే తరువాయి. అంతేకాదు మరో నేత అరికెపూడి గాంధీ కూడా నేడో రేపో టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది.

జయరామ్ కోమటికి తెలుగు ప్రజల ఘనస్వాగతం..

జయరామ్‌ కోమటి ఉత్తర అమెరికాలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియమితులైన అనంతరం ఆయన అమెరికా వెళ్లగా అక్కడి తెలుగు ప్రజలు, ఎన్నారై టీడీపీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. బే ఏరియా తెలుగు అసోసియేషన(బాటా), ఎన్నారై టీడీపీ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు చెందిన సుమారు రెండు వందల మంది ఆయనకు ఘనస్వాగతం పలికి పూలమాలలు, పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. అంతేకాదు శానఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుండి 150 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా మాతృ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని.. ఏపీ ప్రభుత్వానికి, ఎన్నారై తెలుగు కమ్యూనిటీకి మధ్య వారధిగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు.

డాక్టర్ పై కాల్పులు ఆపై ఆత్మహత్య

హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో శశికుమార్ అనే డాక్టర్ ఉదయ్ అనే మరో డాక్ట్రర్ పై కాల్పులు జరపిన సంగతి తెలిసిందే. అయితే ఉదయ్ పై కాల్పులు జరిపిన అనంతరం శశికుమార్ మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం ఉదయ్, సాయి, శశికుమార్ అనే ముగ్గురు వైద్యులు మాదాపూర్‌లో స్థాపించిన లారల్ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. అయితే వీరి ముగ్గురికి ఆస్పత్రి ఆర్ధిక లావాదేవీల విషయంలో విబేధాలు రావడంతో శశికుమార్ ఉదయ్ పై కాల్పులు జరిపాడు. ఉదయ్ పై కాల్పులు జరిపిన అనంతరం మొయినాబాద్ నక్కలగుడ్డలో ఉన్న తన ఫాం హౌస్‌లో గన్‌తో రెండు రౌండ్లు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు శశికుమార్ ఆత్మహత్య చేసుకొన్న ఫాం హౌస్లో సూసైడ్ నోట్ దొరికినట్టు పోలీసులు తెలుపుతున్నారు. తన చావుకు సాయి కుమార్, ఉదయ్ లే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన వద్ద పని చేసిన వారే తనను మోసం చేశారని పేర్కొన్నారు. అంతేకాదు ఉదయ్ పైన తాను కాల్పులు జరపలేదని, మరో డాక్టర్ సాయి కాల్పులు జరిపాడని, నేను భయపడి పారిపోయానని తెలిపాడు.

విజయోత్సాహంలో… చంపేశారు!

ఎన్నికలలో గెలిస్తే ఎవరన్నా మిఠాయిలు పంచుకుంటారు, మరీ సరదాగా ఉంటే రంగులు చల్లుకుంటారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో తుపాకులను గాలిలోకి కాలుస్తుంటారు. అలాంటి ఒక సంఘటనలో గత ఆదివారం ఒక అభంశుభం ఎరుగని పిల్లవాడు బలైపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరానా పట్టణంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇందులో సమాజ్‌వాదీకి చెందిన నఫీసా అనే అభ్యర్థి గెలుపొందారు. ఆ గెలుపు సందర్భంగా నఫీసా అనుచరులు గాల్లోకి కాల్పులు జరపడంతో అదే దారిలో రిక్షాలో వెళ్తున్న సమి అనే ఎనిమిదేళ్ల పిల్లవాడు మృతిచెందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తుపాకుల రాజ్యం ఏలుతోందని ఇప్పటికే తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఘటన వల్ల తన ప్రభుత్వానికి మరింత మచ్చ ఏర్పడే అవకాశం ఉందని భావించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌. దాంతో స్థానిక పోలీస్‌ అధికారులను ఆగమేఘాల మీద సస్పెండ్‌ చేశారు. మరో పక్క పోలీసులు కూడా ఈ ఘటనకు కారణమైన ఒక ముగ్గురిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. పిల్లవాడి తరఫున బంధువులు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయారు.

15 పాఠశాలలకు బాంబు బెదిరింపు..

ఇటీవలే అస్ట్లేలియాలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చి అందరిని భయానికి గురిచేశారు దుండగలు. ఇప్పుడు అలాంటి పరిణామమే తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని కడలూరులో పాఠశాలలకు బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఫోన్లు రావడంతో భయపడి పాఠశాలలను మూసివేశారు. అధికారులు వెంటనే స్పందించి బాంబు స్క్వాడ్‌ సిబ్బందిని తెప్పించి పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో పాఠశాలల్లో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. కాగా తల్లిదండ్రులు ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దని పిల్లలందరూ క్షేమంగానే ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. విద్యార్థులందరిని వారి వారి ఇళ్లకు పంపించివేశారు.

అసదుద్దీన్‌ ఒవైసీ అరెస్టు… విడుదల!

గ్రేటర్‌ ఎన్నికలలో జరిగిన ఒక దాడి కేసులో మజ్లిస్‌ పార్టీ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ నేడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనకు ఆరోగ్య తనిఖీలను నిర్వహించిన పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం వేళకి అసదుద్దీన్‌ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఆయనను ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు మీద విడుదల చేశారు. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలోని పురానాపూల్ వద్ద అసదుద్దీన్ తన అనుచరులతో కలిసి కాంగ్రెన్ నేతల మీద దాడి చేశారన్నది ప్రధాన అభియోగం. ఈ దాడిలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వాహనం ధ్వంసం కాగా, షబ్బీర్ అలీకు స్వల్ప గాయాలు అయ్యాయి. కాంగ్రెస్ నేతల అభియోగం మేరకు పురానాపూల్‌లో మళ్లీ రీపోలింగ్‌ సైతం జరిగింది. దాడికి అసదుద్దీన్‌ నేతృత్వం వహించారనీ, భౌతిక దాడికి పాల్పడ్డారనీ… ఆయన మీద కేసు నమోదైంది.