chandrababu

సింగపూర్ లో సీఎం బిజీబిజీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ తో విందు భేటీలో పాల్గొన్న బాబు బృందం...స్విస్ ఛాలెంజ్ విధానం, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై చర్చించారు. ఇవాళ సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కీలకోపన్యాసం చేయనున్న చంద్రబాబు...ఆ తర్వాత సింగపూర్ కన్సార్టియం ఇచ్చే విందులోనూ పాల్గొననున్నారు. అనంతరం అమరావతి నిర్మాణం, మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులుచేర్పులు, భవనాల ఆర్కిటెక్చర్‌ పై సింగపూర్ ప్రతినిధులతో చర్చించనున్నారు. చివరిగా సింగపూర్ ప్రధాని లూంగ్ తో భేటీకానున్న బాబు... నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రాన్ని అందించనున్నారు.

pawan kalyan

పవన్ కూడా జగన్ లా చేస్తున్నాడా?

  అధికారికంగా పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నిలబడటం కాని.. పదవి కోసం పాకులాడటం కాని చేయలేదు. కానీ బీజేపీ.. టీడీపీ లను మిత్రపక్షలుగా చేసుకొని ఆపార్టీస కోసం తనవంతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. తరువాత ఆపార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా ఎలాంటి పదవి ఆశించలేదు. అంతేకాదు టీడీపీ మిత్రపక్షమైనప్పటికీ కూడా ప్రత్యేక హోదాపైన.. భూసేకరణపైన టీడీపీ నేతలకు చురకలు అంటించారు. భూసేకరణ విషయంలో తానే స్వయంగా నిరసనకు దిగి రైతుల వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గి భూసేకరణను ఆపేసింది. అయితే ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తమిళనాడులో దీక్ష చేపడుతున్నారన్న సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం నిర్భంధ తమిళ బాషా చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో తమిళనాడులో తెలుగు బాషను తొక్కివేస్తున్న తరుణంలో ఆయన ఈ దీక్షను చేస్తున్నారు. ఈ నెలఖరున జరగబోయే ఈ దీక్షకు పవన్ ప్యాన్స్ అప్పుడే ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. అయితే అంతా బాగానే ఇప్పుడు ఈ పవన్ దీక్షపై పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కూడా జగన్ తరహాలో అన్నిటికీ దీక్షలు చేయడం ప్రారంభించారు అంటూ విమర్శిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా రాష్ట్రంలో ఏమైనా చిన్నసమస్యలు వచ్చినప్పుడే ఇరు పక్షాలు కలిసి కూర్చొని వారికి పరిష్కారాన్ని ఆలోచిస్తాయి. అంతకీ సమస్యలు తేలకపోతే అప్పుడు దీక్షల మార్గాన్నిఅనుసరిస్తారు. మరి అలాంటిది పక్క రాష్ట్రంతో సమస్య అంటే ఆలోచించాల్సిన విషయమే. ఈ నేపథ్యంలో దీక్షల కుంటే కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుంటేనే రెండు రాష్ట్రాలకు కూడా మంచిది. మరి అలాంటిది పపన్ కళ్యాణ్ ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా దీక్ష అంటూ రంగంలోకి దిగుతున్నారు. పోనీ తెలంగాణ ముఖ్యమంత్రి జయలలిత అపాయింట్ మెంట్ పవన్ కు దొరకదా అంటే.. దేశ ప్రధాని అయిన నరేంద్రమోదీనే ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తున్నారు పవన్. మరి అలాంటిది జయలలితి అపాయింట్ మెంట్ దొరకడం పెద్ద విషయమేమి కాదు. అలా చేయకుండా అమ్మకి వ్యతిరేకంగా పవన్ తమిళనాడులో చేయబోతున్న దీక్ష కేవలం ప్రచారం కోసమే అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. మరి ఎంతోమంది దీక్షలకే తలవంచని జయలలిత మరి పవన్ కళ్యాణ్ దీక్షను ఎంతవరకూ పట్టించుకుంటుంది.. అసలు అవేమీ లేకుండా ఒకసారి జయలలితతో మాట్లాడి.. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు దీక్ష చేసినా బావుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

cm KCR

వారికి కూడా తెలంగాణవారితో సమాన హక్కులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో కేరళ భవనాన్ని నిర్మిస్తానన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కేరళ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో కేరళ భవనాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని.. తెలంగాణకు.. కేరళకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని అన్నారు. ప్రతిఒక్కరితో కలిసిపోయే తత్వం మలయాళీల లక్షణంగా చెప్పిన కేసీఆర్.. కేరళవారిని తెగ పొగిడేశారు. అంతేకాదు తెలంగాణలో ఉన్న మలయాళీలంతా తెలంగాణ వారే అని.. తెలంగాణ వారితో సమానంగా మలయాళీలకు కూడా సమాన హక్కులు ఉంటాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో 350 పేద మలయాళీల కుటుంబాలు ఉన్నాయని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు.

ap capital amaravathi

పవన్ వస్తాడా? రాడా?

  ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తున్న సంగతి తెలిసిందే. నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎవ్వరూ మర్చిపోలేని విధంగా  సుమారు వందల కోట్ల రూపాయిల ఖర్చుతో నిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమానికి ప్రధానితో నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖ రాజకీయ వేత్తలను కూడా ఆహ్వానించనున్నారు. అయితే అంతా బానే ఉన్నా ఈశంకుస్థాపన కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారా? లేదా?అన్నది అందరి సందేహం. బీజేపీ.. టీడీపీ పార్టీలకు మిత్రపక్షంగా ఉండి ఎన్నికల సమయంలో వారి పార్టీల తరుపున ప్రచారం చేసి.. వాళ్లు గెలవడానికి ఒకింత కారణమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆపార్టీ అధికారంలోకి వచ్చి తలపెడుతున్న మహత్తరమైన కార్యక్రమానికి వస్తారా? లేదా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. ఎందుకంటే సహజంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడం చాలా తక్కువ ఈ నేపథ్యంలోనే పవన్ ఈకార్యక్రమానికి హాజరుకాకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తాను ప్రచారం చేసిన పార్టీ చేసే కార్యక్రమానికి పవన్ తప్పకుండా హాజరవుతారనే వాదన కూడా వినిపిస్తుంది. మొత్తానికి ఏపీ శంకుస్థాపన కార్యక్రమేమో కాని ఇప్పుడు పవన్ రాకపై అందరికి ఆసక్తి పెరిగింది. మరి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి వస్తారా లేదా అన్నది తను చెప్పేంతవరకూ ఈ విషయంలో క్లారిటీ రాదు.

ttdp president

ఎర్రబెల్లీ...సడన్ గా ఇదేం ట్విస్ట్ !

తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సడన్ ట్విస్ట్ ఇచ్చారు. టీటీడీపీ అధ్యక్ష పదవి కోసం రేవంత్, ఎర్రబెల్లి హోరాహోరీగా తలపడుతున్నారంటూ ఇప్పటివరకూ వార్తలొస్తే, తానసలు పోటీలోనే లేనంటూ సైడ్ పోయారు ఈ సీనియర్ లీడర్, పైగా చంద్రబాబు నిర్వహించిన ఐవీఆర్ఎస్ పోలింగ్ లో రేవంత్ తర్వాత కొద్దోగొప్పో ఎర్రబెల్లికే ఓట్లు వచ్చాయి, అయినా తాను పోటీలో లేనంటూ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తాను టీటీడీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్నందున మరో పదవిపై ఆసక్తి లేదని తేల్చిచెప్పిన ఎర్రబెల్లి.... అధ్యక్ష పదవిని ఎవరికి అప్పగించినా సహకరిస్తానంటూ తెలిపారు. అయితే పార్టీని సమర్ధంగా నడపగలిగే వ్యక్తికే పగ్గాలు ఇవ్వాలన్నారు.  

akkineni akhil

అంగరంగ వైభవంగా 'అఖిల్' ఆడియో

కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానుల మధ్య అక్కినేని అఖిల్ లాంఛింగ్ ఫిల్మ్ 'అఖిల్' ఆడియో విడుదలైంది. గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పాటల వేడుకలో అక్కినేని నాగార్జున దంపతులతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు, ఇక అఖిల్ ను ఆశీర్వదించడానికి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు... ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాగార్జునతో కలిసి ట్రైలర్ ను రిలీజ్ చేసిన మహేష్....అఖిల్ రూపంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద హీరోను అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక నాగార్జున మాట్లాడుతూ...కృష్ణ గారితో వారసుడు సినిమాలో నటిస్తే, ఆయన వారసుడు వచ్చి, నా వారసుడ్ని ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. అనూప్‌ రూబెన్స్, తమన్ సంయుక్తంగా సంగీతమందించిన ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ నిర్మిస్తుండగా, ప్రముఖ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

TELANGANA

హైదరాబాద్ లో మరో రైతు ఆత్మహత్య

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి, రోజుకు సగటున ఐదారుమంది రైతులు బలన్మరణాలకు పాల్పడుతున్నారు, సాగు కష్టాలు తట్టుకోలేక మొన్నామధ్య హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పై ఓ రైతు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంటే, మరో రైతు సీఎం క్యాంప్ కార్యాలయం సమీపంలోనే ఉరితాడు బిగించుకుని తనువు చాలించాడు.ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించిన ఈ దృశ్యం... బేగంపేటలో కనిపించింది. వ్యవసాయంతో అప్పులుపాలై మెదక్ జిల్లా రాంసాగర్ గ్రామం నుంచి ఉపాధి కోసం భాగ్యనగరానికి వచ్చిన జగ్గోళ్ల మల్లేశాన్ని(58)... వడ్డీ వ్యాపారులు ఫోన్లు చేసి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే తన తండ్రి ఆత్మహత్యకు వ్యవసాయానికి చేసిన అప్పులే కారణమని, ఐదేళ్లుగా పంటలు సరిగా పండటం లేదని, అదే సమయంలో చెల్లెళ్లకు పెళ్లి చేయటంతో అప్పుల భారం మరింత పెరిగిందని, వాటిని ఎలా తీర్చాలో తెలియక మనోవ్యథకు గురవుతున్నాడని, ఈ నేఫథ్యంలోనే బలన్మరణానికి పాల్పడి ఉంటాడని కొడుకు మల్లేశ్ తెలిపాడు

PAWAN KALYAN

పవన్ కల్యాణ్ దీక్షకు ఏర్పాట్లు

తెలుగు భాష పరిరక్షణ కోసం జనసేన అధినేత, పవర్ స్టార్  పవన్ కల్యాణ్ దీక్షకు సిద్ధమవుతున్నారు. తమిళనాడులో నిర్బంధ తమిళ భాషా చట్టాన్ని అమలు చేస్తూ, జయలలిత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్ దీక్షకు దిగుతున్నారు. ఈ నెలాఖరున పవన్ దీక్ష చేయనుండటంతో పవన్ అభిమానులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్బంధ తమిళం పేరుతో తెలుగు భాషను నిషేధించడానికి కుట్ర జరుగుతోందని, తమిళనాడులో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందని భాషాభిమానులు పిలుపునిస్తున్నారు. తమిళనాడులో 40శాతం మంది తెలుగువారుంటే, 4శాతమే ఉన్నారంటూ జీవో 136లో పేర్కొనడం అన్యాయమన్నారు.

Jagan Mohan Reddy

కొత్త ట్రెండ్! జగన్ దీక్ష స్థలంలో భూమి పూజ

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు చేసిన దీక్షలు, ధర్నాలకు ప్రజల నుండి మిశ్రమ స్పందన వచ్చేది. పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు, ప్రచారం, జనసమీకరణ చేయకపోయుంటే ఆ మాత్రం స్పందన కూడా వచ్చేది కాదేమో? రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈనెల 26నుండి గుంటూరు ఏసి కాలేజీ ఎదురుగా ఉన్న మైదానంలో జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. కనుక వైకాపా నేతలు ఆయన దీక్షను విజయవంత చెయ్యాలనే పట్టుదలతో ఉన్నారు. దాని కోసం వారు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే జగన్ దీక్షకు కూర్చోబోయే వేదిక వద్ద ఆ పార్టీ సీనియర్ నేతలు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు భూమి పూజ కూడా నిర్వహించడం. నిరాహార దీక్షలకి భూమి పూజలు చేయడమనే సరి కొత్త ట్రెండ్ ని వైకాపా ప్రవేశపెట్టింది.   జగన్ చేయబోయేది ఆమరణ నిరాహార దీక్ష అని వారు ప్రచారం చేసుకొంటున్నప్పటికీ గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే అది ఎన్ని రోజులో ఏవిధంగా ముగుస్తుందో తేలికగానే ఊహించవచ్చును. ఆ మాత్రం దానికి భూమి పూజ వగైరా హడావుడి ఎందుకంటే బహుశః తమ కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించడానికేనని భావించాల్సి ఉంటుంది. తీరా ఇంత హడావుడి చేసిన తరువాత దానికి ప్రజల నుండి సరయిన స్పందన రాకపోయినట్లయితే అభాసుపాలుకాక తప్పదు. ఆ మధ్య జగన్ డిల్లీలో నిర్వహించిన ఐదు గంటల దీక్షని స్పాన్సర్ చేసిన బొత్స సత్యనారాయణే ఈ కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేస్తున్నట్లు సమాచారం.

BCCI president Jagmohan Dalmiya passes away in Kolkata

బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా కన్నుమూత

బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) కన్నుమూశారు. కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ, ఈనెల 17న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజులుగా కోల్‌కతాలోని కేఎం బిర్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. భారత్‌లో క్రికెట్ అభివృద్ధికి విశేష కృషి చేయడమే కాకుండా, బీసీసీఐని ఆర్థికంగా బలోపేతం చేయడంలో దాల్మియా విశేష కృషిచేశారు. ఇండియన్ క్రికెట్ పండితుడిగా పేరుగాంచిన దాల్మియా, మొదట బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1979లో బీసీసీఐలో సభ్యునిగా చేరి, 1983లో బీసీసీఐ కోశాధికారిగా, 2001 నుంచి 2004 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 2013లోనూ కొంతకాలం బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన దాల్మియా.... 1997 నుంచి 2000 వరకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు

up police

ఖాకీ కండకావరం, ఎస్సై సస్పెన్షన్

సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే గూండాలు చెలరేగిపోతారని పేరు. అత్యాచారాలు, హత్యలు అధికంగా జరిగే యూపీలో పోలీసులు కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారనే పేరుంది. దాన్ని మరోసారి రుజువు చేస్తూ లక్నోలోని హజ్రత్ గంజ్ లో ఓ ఎస్సై రాక్షసత్వాన్ని చూపించాడు. ఫుట్ పాత్ పై టైప్ రైటర్ పనిచేసుకుని పొట్ట పోసుకునే అరవై ఏళ్ల వృద్ధుడిపై ఎస్సై ప్రదీప్ కుమార్ తన ప్రతాపాన్ని చూపించాడు. ఫుట్ పాత్ ను ఖాళీ చేయాలని చెప్పినా వినలేదని, టైప్ రైటర్ ను ఫుట్ బాల్ లా తన్ని పగలగొట్టి నానా బీభత్సం చేశాడు. తన జీవనాధారమైన టైప్ రైటర్ ను ధ్వంసం చేయొద్దని చేతులెత్తి దండం పెట్టి వేడుకున్నా, ఆ ఖాకీ మనసు కరగలేదు, 30ఏళ్లుగా తాను ఈ పనే చేసుకుంటున్నానని, రోజంతా కష్టపడితే 50 రూపాయలే వస్తాయని చెప్పినా వినిపించుకోని ఆ ఎస్సై దౌర్జన్యానికి దిగాడు, అయితే ఎస్సై దుర్మార్గాన్ని ఫొటోలు తీసి స్థానికులు సోషల్ మీడియాలో పెట్టడంతో, విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అఖిలేష్... ఎస్సై ప్రదీప్ కుమార్ ను సస్పెండ్ చేసి, బాధితుడు కిషన్ కుమార్ కు కొత్త టైప్ రైటర్ అందేలా చేశారు. సీఎం ఆదేశాలకు కిషన్ కుమార్ ఇంటికెళ్లిన జిల్లా కలెక్టర్, డీఎస్పీలు... ముసలాయనకు క్షమాపణ చెప్పి, కొత్త టైప్ రైటర్ ను అందించారు.

rahul gandi

రాహుల్... నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయించు!

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ సవాల్ విసిరింది. కాంగ్రెస్ పార్టీ తనకు లీగల్ నోటీసులు పంపడంపై ఆగ్రహించిన స్మృతీ... దమ్ముంటే తనను అరెస్ట్ చేయించాలంటూ రాహుల్ ను ఛాలెంజ్ చేశాను. ఫ్యాక్టరీ పెడతామంటూ తీసుకున్న భూమిలో పరిశ్రమ ఏర్పాటు చేయకపోగా, ఆ ల్యాండ్ ను ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలని ప్రజల తరపున మాట్లాడితే లీగల్ నోటీసులు పంపుతారా అంటూ ఆమె మండిపడ్డారు. లీగల్ నోటీసుల పేరుతో తన నోరు మూయించలేరన్న స్మృతీ... రాజీవ్ ట్రస్ట్ ఆధీనంలో ఉన్న భూమిని తిరిగిచ్చేయాలని సూచించారు, లేదంటే అక్కడ పరిశ్రమ అయినా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సైకిల్ ఫ్యాక్టరీ పెడతామంటూ తీసుకున్న భూమిని, ఓ కంపెనీ రాజీవ్ ట్రస్ట్ కి అమ్మడంతో వివాదం నెలకొంది, లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే ఆ కంపెనీకి భూమి కేటాయించి, దాన్ని రాజీవ్ ట్రస్ట్ కొనుగోలు చేసిందని స్మృతీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ.... కేంద్ర మంత్రికి లీగల్ నోటీసులు పంపింది

tamanna

10 కోట్లిచ్చినా అది మాత్రం చేయను

క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలనే సూత్రాన్ని హీరోయిన్లు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు, అందుకే తమ డిమాండ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలని అనుకోవడం సహజం. సేమ్ టు సేమ్...మార్కెట్ లో ఎవరికైతే క్రేజ్ ఉంటుందో, వాళ్ల వెనుకే పడుతుంటాయి కంపెనీలు, తమ ఉత్పత్తులకు సెలబ్రిటీలు ప్రచారం చేస్తే త్వరగా జనాల్లోకి వెళ్తాయని, తద్వారా విజయం సాధించొచ్చని భావిస్తుంటాయ్. అలా ఎంతోమంది హీరో హీరోయిన్లు... ఆయా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లగా మారిపోయారు, అయితే హీరోయిన్ తమన్నా మాత్రం తనకు ఎంత డబ్బిచ్చినా అలాంటి యాడ్స్ లో మాత్రం నటించనంటోంది. ఇంతకీ అదేనుకుంటున్నారా? ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ అంటా?, సమాజం పట్ల తనకు బాధ్యత ఉందంటున్న తమన్నా, శరీర రంగుకి సంబంధించిన ప్రకటనల్లో మాత్రం నటించనని తేల్చిచెప్పేసింది, రంగు అనేది మన చేతుల్లో ఉండదు, కానీ ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది, అందుకే తెల్లగా ఉండాలనుకోవడం కంటే, మనసు స్వచ్ఛమైన తెలుపులా ఉండాలంటోంది ఈ మిల్కీ బ్యూటీ

మళ్లీ సింగపూర్ వెళ్లిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సింగపూర్‌ వెళ్లారు. అక్టోబర్ 22న విజయదశమినాడు జరగనున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు సింగపూర్‌ ప్రధాని లీ శాన్‌ లూంగ్‌ను స్వయంగా ఆహ్వానించనున్న చంద్రబాబు, ఏపీ రాజధానికి సంబంధించి స్విస్‌ ఛాలెంజ్‌ విధానం, భవనాల ఆర్కిటెక్చర్‌ పైనా చర్చించనున్నారు. ఇవేకాకుండా రాజధాని నిర్మాణం, మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులుచేర్పులపైనా మాట్లాడనున్నారు. బాబుతోపాటు సింగపూర్ వెళ్లినవారిలో మంత్రులు యనమల, నారాయణ, మీడియా సలహాదారు పరకాల, పలువురు నియర్‌ ఐఏఎస్‌ లు ఉన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా రేపు సింగపూర్‌ వాణిజ్య మంత్రి ఈశ్వరన్‌తో సమావేశంకానున్న బాబు, ఆ తర్వాత సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కీలకోపన్యాసం చేయనున్నారు. మంగళవారం సింగపూర్‌ సిటీ గ్యాలరీని, మూడు టౌన్‌ షిప్‌లను బాబు బృందం సందర్శించనుంది.

కారెక్కడానికి 'దానం దారి' క్లియరైనట్లేనా!

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ...టీఆర్ఎస్ లో చేరతారంటూ మళ్లీ వార్తలు వస్తున్నాయి. ఈనెల 23న గులాబీ కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఖరారైందని, మంత్రి తలసాని మధ్యవర్తిత్వంలో కారు ఎక్కడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చినా దానం ఖండించడంతో ఊహాగానాలకు తెరపడింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ వార్తలు రావడంతో ఈసారి ఖాయంగా కారెక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దానంకు అధికార పార్టీ వలేసిందని, ఆయన దాదాపు టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైందని గులాబీ నేతలు చెబుతున్నారట, అయితే ఎప్పటిలాగే అలాంటిదేమీ లేదని దానం నాగేందర్ ఖండించినా, ఈరోజు తిట్టి, రేపు పార్టీ మారిపోతున్న ఈరోజుల్లో ఏదైనా సాధ్యమేనంటున్నారు జనాలు. టీఆర్ఎస్ తో ఇంకా చర్చలు జరుగుతూ ఉండొచ్చని, డీల్ ఓకే కాగానే జంపై పోతారని చెవులు కొరుక్కుంటున్నారు.

ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు మూడు కోట్లు

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియా ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. ఓ పత్రిక కథనం ప్రకారం ఏపీలో నలుగురు మంత్రులు, 38మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఇసుక మాఫియాలో భాగస్వామ్యులుగా ఉన్నారని, కిందిస్థాయి నేతలైతే వేలల్లో ఉంటారని తెలిపింది. ఉభయగోదావరి జిల్లాల్లో అయితే టీడీపీ, వైసీపీ నేతలు కలిసి ఇసుక వ్యాపారం చేస్తున్నారని రాసుకొచ్చింది. ఒక్కో ఎమ్మెల్యే నెలకు మూడు కోట్లు సంపాదిస్తున్నారని, ఏడాదికి సగటున 30కోట్లు వెనకేస్తున్నారని లెక్కగట్టారు. ఇప్పటివరకూ 2వేలకోట్ల రూపాయలకు పైగా దోచేశారని, ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంచనా వేసింది.  ఇసుక వ్యాపారంతో షార్ట్ టైమ్ లో కోట్లు సంపాదిస్తున్నారని, అందుకే అడ్డొచ్చిన అధికారులపైనా దాడులకు తెగబడుతున్నారని ఆ పత్రిక పేర్కొంది. ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దాడి కూడా అలాంటిదేనని రాసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇసుక మాఫియాను అరికట్టలేకపోతున్నామని వ్యాఖ్యానించారంటే సాండ్ బిజినెస్ ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు, 2019 ఎన్నికల్లో ఇసుక డబ్బే గెలుపోటములను నిర్దేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.,

శ్రీకాకుళం జిల్లాలో విషాదం

శ్రీకాకుళం జిల్లా భావనపాడు బీచ్ లో విషాదం చోటు చేసుకుంది, విహార యాత్రకు వెళ్లిన ముగ్గురు ఇంజనీరింగ్  విద్యార్ధులు... సముద్రంలో గల్లంతయ్యారు. భావనపాడు బీచ్ లో సముద్ర స్నానం చేస్తుండగా అలల తాకిడి అధికమై కొట్టుకుపోయారు. గల్లంతైన విద్యార్ధులను ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీకి చెందినవారిగా గుర్తించారు. అయితే విద్యార్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని, మూడు నిండు ప్రాణాలు సముద్రంలో కలిసిపోయాయని అక్కడున్నవారంటున్నారు. బీచ్ ల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టి, బారికేడ్లు ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలను అరికట్టవచ్చని ప్రజలు సూచిస్తున్నారు