కల్వకుంట్ల కవిత.. తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపేనా?

కల్వకుంట్ల కవిత జనం బాట పాదయాత్రను శనివారం (అక్టోబర్ 25) నిజమాబాద్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాలలో పర్యటించనున్నారు. సరిగ్గా ఐదేళ్ల కిందట తాను ఎక్కడ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారో సరిగ్గా అదే నియోజకవర్గం నుంచి ఆమె తన కొత్త రాజకీయ బాట పట్టారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగ భరితంగా చేసిన ప్రసంగంలో.. సొంత పార్టీయే తనను దగా చేసిందని చెప్పుకొచ్చారు.  బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా తనకు వ్యతిరేకంగా చేసిన కుట్రవల్లనే తాను నిజామాబాద్ లో పరాజయం పాలయ్యానన్నారు. జనం కాదు.. తనను సొంత పార్టీయే ఓడించిందని చెప్పుకున్నారు.   తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల తనకు అపార గౌరవం ఉందని చెప్పిన కవిత.. ఆ కారణంగానే పార్టీలో తనకు ఎన్ని అవమానాలు జరిగినా నిశ్శబ్దంగా ఉన్నాననీ, అయితే ఇప్పుడు.. తనను పార్టీ నుంచి బయటకు పంపేశారనీ, అందుకే తిరిగి తన ప్రజల వద్దకు వచ్చానన్నారు.   ఈ సందర్భంగా కవిత తన ప్రసంగంలో రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినప్పటికీ ప్రధానంగా ఆమె ప్రసంగం మొత్తం బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులే లక్ష్యంగా సాగింది. వారిరువురూ అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఆ సందర్భంగా వారి అవినీతిని ప్రశ్నించిన కారణంగానే తనకు పార్టీలో అవమానాలు ఎదురయ్యాయని చెప్పుకున్నారు. చర్విత చరణమే అయినా కవిత.. తాను తెలంగాణ రాజకీయాలలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్నట్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాను కోత్త రాజకీయపార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. తాను స్వతంత్రంగా, స్వంతంగా రాజకీయాలలో రాణించాలని భావిస్తున్నట్లు చెప్పిన కవిత, తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  అయితే ఒకే  సమయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పిస్తూ ఆమె ఎవరిని బెదరించాలని చూస్తున్నారో అవగతం కావడం లేదని పరిశీలకులు అంటున్నారు.కవిత తెలంగాణ రాజకీయాలలో బలీయమైన శక్తిగా ఎదుగుతారా? లేదా వేచి చూడాల్సిందేనంటున్నారు.  

దేవుడితోనూ రాజకీయాలు.. జోగి రమేష్ ఒట్లను ఎవరైనా నమ్ముతారా?

వైసీపీ నేతలు రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ దుర్గగుడికి వెళ్లి ప్రమాణం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడిగా, ఇంకా చెప్పాలంటే.. సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్.. నకిలీ మద్యం కేసులో తాను నిర్దోషిననీ, తనకేమీ తెలియదనీ బుకాయిస్గున్నారు. అసలు ఈ కేసులో  ఇప్పటికే అరెస్టైన అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియనే తెలియదనీ గట్టిగా చెబుతున్నారు. అయితే ఆయన చెబుతున్న మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే.. అద్దేపల్లిజనార్దన్ రావుతో జోగి రమేష్ సంబంధాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. అద్దేపల్లి జనార్దన్ రావుతో దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చిన తరువాత కూడా జోగి రమేష్ తన బుకాయింపులను కొనసాగిస్తున్నారు.  నకిలీ మద్యం కుంభకోణం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఎవరూ అడగకుండానే.. బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్లి మరీ ప్రమాణం చేశారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు సవాల్ చేసినప్పటికీ వాళ్లు స్పందించపోవడంతో తాను వచ్చి ప్రమాణం చేశానని చెబుతున్నారు. ఈ నకిలీ మద్యం కుంభకోణం విషయంలో తన తప్పు ఉందని నిరూపిస్తే దుర్గమ్మ కాళ్ల వద్దే ఉరేసుకుంటానని ఈ సందర్భంగా జోగి రమేష్ అన్నారు.  అయితే ఇక్కడ ఆయన ప్రమాణాలు, ప్రతిజ్ణలను జనం నమ్మే పరిస్థితి ఇసుమంతైనా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అద్దేపల్లి జనార్ధనరావు పోలీసు కస్టడీలో విషయం మొత్తం పూసగుచ్చినట్లు వివరించారు. ఇందులో సందేహాలకు అతీతంగా జోగి రమేష్ ప్రమేయాన్ని అద్దేపల్లి జనార్దన్ రావు వెల్లడించేశారు. ఈ నేపథ్యంలోనే జోగు రమేష్ దేవుడి మీద ప్రమాణాలంటూ హడావుడి చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైసీపీ అధికారంలో  ఉన్న సమయం నుంచీ జోగి రమేష్ నేతృత్వంలో నకిలీ మద్యం వ్యాపారం చేసినట్ల అద్దేపల్లి చెబుతున్నారు. అప్పటి లెక్కలు బయటపెట్టడమే కాకుండా.. తాజా నకిలీ మద్యం కుంభకోణం వ్యవహారంలో జోగురమేష్ తో తాను చేసిన చాట్ల స్క్రీన్ షాట్లను కూడా బయటపెట్టారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ బుకాయింపులను, ప్రమాణాలను, ప్రతిజ్ణలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.  

గుర్తులపై అభ్యంతరాలు..ఓటమి అంగీకారమేనా?

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చే 11 ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక బరిలో ఎంత మంది నుంచున్నా.. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉందన్నది నిర్వివాదాంశం. మూడు పార్టీలకూ కూడా ఈ ఉపఎన్నికలో విజయం చావో రేవో అన్నట్లుగానే పరిణమించింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఉపఎన్నికలో విజయం తమ పాలనకు లిట్మస్ టెస్టుగా భావిస్తుంటే.. ఉనికి, సత్తా చాటుకోవడానికి ఈ ఉప ఎన్నిలో గెలిచి తీరాల్సిన పరిస్థితిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని ఆశిస్తున్న బీజేపీకి.. జూబ్లీ ఉప ఎన్నికలో గెలుపు అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే జూబ్లీ ఉప ఎన్నికలో విజయం కోసం మూడు పార్టీలూ కూడా సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తమను గెలుపు బాటలో నడిపిస్తాయని కాంగ్రెస్ విశ్వసిస్తుంటే.. బీఆర్ఎస్ పూర్తిగా సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపై ఆధారపడి ముందుకు సాగుతోంది. ఇక బీజేపీ అయితే మోడీ కరిష్మాపై ఆధారపడి బరిలోకి దిగింది. ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే ఈ ప్రచారంలో బీఆర్ఎస్ అధికార పార్టీపై విమర్శల దూకుడు పెంచింది. అదే సమయంలో ఎన్నికల గుర్తుల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. అదే ఆ పార్టీని ఓటమి భయం వెంటాడుతోందా అన్న అనుమానాలు కలిగేలా చేస్తోందంటున్నారు పరిశీలకులు. ఇంతకీ బీఆర్ఎస్ ఎన్నికల గుర్తులపై చేస్తున్న అభ్యంతరాలేమిటయ్యా అంటే..  స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం కేటాయించిన చపాతీ రోలర్, సబ్బు డిష్, కెమెరా, రోడ్ రోలర్, షిప్ వంటి వి బీఆర్ఎస్ ఎన్నికల చిహ్నమైన కారును పోలి ఉన్నాయని చెబుతోంది. దీని వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాదిస్తోంది. ఆ అయోమయం కారణంగా ఓటర్లు కారు  గుర్తుకు వేయాల్సిన ఓటును పైన చెప్పిన వాటిలో దేనికో ఒక దానికి వేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇదే ఆ పార్టీలో ఓటమి భయాన్ని సూచిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఈవీఎంలో గుర్తుతో పాటు అభ్యర్థి పేరు, ఫొటో కూడా ఉంటాయి కనుక అయోమయానికి ఎక్కడ అవకాశం ఉందని కాంగ్రెస్, బీజేపీలు అంటున్నాయి. ఓటమి భయంతోనే గుర్తుల అయోమయం అంటూ బీఆర్ఎస్ అభ్యంతరాలు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నదని ఎద్దేవా చేస్తున్నాయి.  పోలింగ్ కు ముందే ఓటమికి సాకులు వెతుకుతున్న చందంగా బీఆర్ఎస్ తీరు ఉందని అంటున్నాయి. 

జలవివాదాలతో ప్రభుత్వాల రాజకీయం.. ఏబీవీ

నీటి వివాదాలను ప్రభుత్వాలే రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు.   రాయలసీమ ప్రాంతంలోని నీటి పారుదల ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనంలో భాగంగా ఆదివారం (అక్టోబర్ 26)    కడప ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.   కడప ,చిత్తూరు జిల్లాల జీవనాడి అయిన గాలేరు నగరి సుజల స్రవంతి నిధుల కొరత,  అటవీ అనుమతుల మంజూరులో జాప్యం వల్ల నాలుగు దశాబ్దాలుగా నత్తనడక నడుస్తోందని విమర్శించారు.  హంద్రీనీవా రెండో దశ అనుసంధానం పేరుతో కండలేరు -కరకంపాడి ఎత్తిపోతల పథకం పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గాలేరు నగరి సుజల స్రవంతి 100శాతం  గ్రావిటీ కలిగిన ప్రాజెక్టన్నారు.  గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, రాజోలి ప్రాజెక్టుల పూర్తికి, పంట కాలువల నిర్మాణానికి నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న  ప్రభుత్వం పోలవరం బనకచర్ల ఎత్తిపోతల పథకం పేరుతో 85 వేల కోట్ల రూపాయలు కేటాయించడాన్ని తప్పుపట్టారు. ఈ ప్రాజెక్టు  రాష్ట్ర ప్రజల పై అదనపు భారాన్ని మోపడానికి తప్ప మరెందుకూ పనికిరాదన్నారు.   గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పేరుతో రాయలసీమ ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాల వివాదాలకు ఆజ్యం పోయడమేనని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఎక్కడైనా ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో ఈపీసీ విధానం అమలు చేసేవారని కానీ ప్రస్తుతం పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు నిర్మాణం, అనుమతులు కూడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం అంటే ప్రాజెక్టు మొత్తం ప్రైవేటుపరం చేసి దోపిడీకి ద్వారాలు తరచడమేనని విమర్శించారు.  

క‌విత‌క్క లుక్కు మారింది కానీ!

  క‌విత‌క్క కారు క‌హానీలు.. ఇప్ప‌ట్లో ఆగేలా లేవు. మొత్తం త‌న లుక్కు మార్చిన క‌విత‌క్క‌.. ప్ర‌స్తుతం ప్ర‌తిఘ‌ట‌న‌లో విజ‌య‌శాంతిలా క‌నిపిస్తున్నార‌న్న‌ మాటేగానీ.. ఆమె త‌న పుట్టింటి మీద పుట్టింటిలాంటి బీఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు చెర‌గ‌టం మాత్రం త‌గ్గించ‌డం లేదు. సొంత పార్టీ వారే త‌న‌ను నిజామాబాద్ లో ఓడించార‌ని అంటున్నారు క‌విత‌. ప్ర‌స్తుతం జాగృతి జ‌నం బాట ప‌ట్టిన ఆమె 33 జిల్లాల తెలంగాణ వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌నున్నాన‌నీ.. ఆనాడు ప్రాణాలు బ‌లి ఇచ్చి తెలంగాణ రావ‌డానికి కార‌ణ‌మైన‌ అమ‌ర వీరుల కుటుంబాల‌కు కోటి రూపాయ‌లు ద‌క్కే వ‌ర‌కూ త‌న పోరాటం ఆప‌న‌ని అన్నారు. త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చే వారు ఈ యాత్ర‌లో వ‌చ్చి క‌ల‌వ‌వ‌చ్చ‌ని.. ఆహ్వానం ప‌లికారు క‌విత‌. త‌న‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ రావ‌ల్సిన గుర్తింపు అయితే రాలేద‌నీ.. పార్టీలో త‌న‌ను తొక్కేశార‌న్న‌ట్టుగా మాట్లాడిన క‌విత‌.. టార్గెట్ ఎవ‌రు??? అన్న‌దిప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బేసిగ్గా ఆమె బీఆర్ఎస్ బై ప్రాడ‌క్ట్. అలాంటి ఆమెకు కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు ప్ర‌త్య‌ర్ధులుగా ఉండాలి. కానీ చిత్ర‌మేంటంటే ఆమె నోరు తెరిస్తే యాంటీ బీఆర్ఎస్ వాయిస్ వినిపిస్తున్నారు. దానికి తోడు త‌న తండ్రిని ఇన్నాళ్ల పాటు వెన‌కేసుకొచ్చిన ఆమె తాజాగా త‌న తండ్రి ఫోటో లేకుండానే ఈ యాత్ర‌కు శ్రీకారం చుట్టారు. ఈ మొత్తం పోరాటం రాజ‌కీయ‌మైన‌దా? లేక వ్య‌క్తిగ‌త‌మైన‌దా? అన్న అనుమానాల‌కు తావిస్తున్నారు క‌విత‌. ఎందుకంటే ఒక స్ప‌ష్ట‌మైన రాజ‌కీయ విధానంతో జ‌నం కోసం- జ‌నం బాట ప‌ట్టాన‌ని క్లారిటీ ఇవ్వ‌కుండా పొద్ద‌స్త‌మానం పుట్టింటిని త‌న ఇంటి వారిని ప‌దే ప‌దే తిట్ట‌డం వ‌ల్ల అది ఆమె సొంత విష‌యం అవుతుంది కానీ ప్ర‌జాక్షేత్రంలో ప్ర‌జా పోరాటంగా క‌నిపించ‌దు క‌దా? అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది.  

బీహార్‌ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్డీయే తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే తరఫున తాను ప్రచారం చేయనున్నట్లు వెల్లడించిన ఆయన బీహార్ లో  ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  మోదీ పరిపాలనలో దేశం వేగంగా ముందుకెళ్తోందన్న చంద్రబాబు..  జీఎస్టీని సంస్కరణల  వల్ల ప్రజల వద్ద డబ్బులు మిగులుతున్నాయని .. ఇది వారి జీవన ప్రమాణాలను పెంచుతుంద అన్నారు. తన బీహార్ పర్యటన వివరాలను త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు. 

కుట్రలు చేసి నిజామాబాద్‌లో ఓడగొట్టారు : కవిత

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నా మెట్టినిల్లు... ఎంపీగా ఎమ్మెల్సీగా నాకు పట్టం కట్టి నా రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడానికి ఇక్కడి నుంచే "జాగృతి జనం బాట" ను ప్రారంభించడం సముచితంగా భావించాని ఆమె పేర్కొన్నారు.  అంతే ఉత్సాహంతో నన్ను స్వాగతించి అక్కున చేర్చుకున్న ఇందూర్ జిల్లా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఘన స్వాగతం పలికిన యువతకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాని కవిత అన్నారు. గత 20 ఏళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో, బీఆర్ఎస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేశాను. 27 ఏళ్ల వయసులోనే తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టాను. ఎన్నో అవమానాలు ఎదురైనా ఓపికతో భరించాను," అని గుర్తుచేసుకున్నారు.  ఇందూర్‌లో తన ఓటమి వెనుక పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించిన కవిత, "ఏం జరిగిందో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి. జరిగిన కుట్ర గురించి పిల్లల్ని అడిగినా చెబుతారు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తన ప్రయాణం ప్రజలతోనే అని స్పష్టం చేశారు. తన భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. "తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా అమరవీరుల కుటుంబాలకు సరైన గౌరవం, న్యాయం దక్కలేదు. వారి కోసం పోరాడాల్సిన అవసరం ఉంది.  వారి కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ 'జనం బాట'లో భాగంగా మేధావులు, విద్యార్థులు, రైతులు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడతాని ఆమె పేర్కొన్నారు. అందరి భాగస్వామ్యంతో ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి సాధించడమే నా లక్ష్యం" అని తెలిపారు. జాగృతి సంస్థ ద్వారా విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి రంగాల్లో సేవలు కొనసాగిస్తానని కవిత ప్రకటించారు  

రేవంత్ హస్తిన బాట.. డీసీసీ చీఫ్ ల ఎంపికతో పాటు.. కేబినెట్ రీషఫుల్ కూడా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకూ ఆయన కేబినెట్ పునర్వ్యవస్థీకరణకూ లింక్ ఉందా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. రేవంత్ రెడ్డి శనివారం (అక్టోబర్ 25) హస్తినకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన హస్తిన పర్యటనకు ప్రధాన కారణం పార్టీ జిల్లా అధ్యక్షుల ఖరారు కోసమే అయినప్పటికీ.. పనిలో పనిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా పార్టీ హైకమాండ్ తో చర్చించి ఓకే చేయించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ జిల్లాల అధ్యక్షులను నియమించే విషయంలో సీరియస్ గా ఉంది. అందుకోసమే శనివారం (అక్టోబర్ 25)  ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా వెళ్లారు.  అది పక్కన పెడితే.. తెలంగాణలో మంత్రుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరుపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆ అసంతృప్తిని పార్టీ అధిష్ఠానం ఏమీ గోప్యంగా ఉంచలేదు కూడా. పద్ధతి మార్చుకోవాలని   తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షీ నటరాజన్ పలు మార్లు మంత్రులను హెచ్చరించారు కూడా. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా కాలంగా మంత్రివర్గంలో మార్పులూ చేర్పుల కోసం హైకమాండ్ ను కోరుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి సీఎం రేవంత్ హస్తిన పర్యటన సందర్భంగా తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కీలక చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఇటీవల మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య మేడారం జాతర పనుల విషయంలో రేగిన రగడ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసిందని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.  అలాగే అంతకు ముందు మంత్రులు పొన్నం ప్రభాకర్,  అడ్లూరి లక్ష్మణ్‌ ల వివాదంపై కూడా హైకమాండ్ అసంతృప్తితో ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే డీసీసీ చీఫ్ ల ఎంపికతో పాటు.. మంత్రివర్గ పునర్వ్యవ స్థీకరణపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.  

కవిత క్షమాపణలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్!

అమరుల కుటుంబాలకు సరైన న్యాయం చేయలేకపోయానంటూ కవిత బహిరంగంగా చెప్పిన క్షమాపణలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. తెలంగాణ జాగృతి తరఫున జాగృతి జనంబాట కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత శనివారం ప్రారంభించారు. ప్రారంభించడానికి ముందు ఆమె తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించి మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు సరైన న్యాయం చేయడంలో విఫలమయ్యామంటూ బీఆర్ఎస్ తరఫున క్షమాపణలు చెప్పారు.  అధికారంలో ఉన్న పదేళ్లలో  అమరుల ఆశయాల సాధన దిశగా సాగడంలో బీఆర్ఎస్ విఫలమైందనీ, అలాగే అమరుల కుటుంబాలకు న్యాయం చేయడంలోనూ, సరైన గౌరవం ఇవ్వడంలోనూ విఫలమయ్యామనీ అంగీకరించడం ద్వారా.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై విమర్శలు గుప్పించారు.   కల్వకుంట్ల బహిరంగ క్షమాపణ బీఆర్ఎస్ కు బిగ్ షాకే..  ఎందుకంటే.. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన అమరవీరులందరినీ తాము సముచితంగా గౌరవించామనీ, వారి కుటుంబాలకు అండదండగా నిలిచామనీ ఇంత కాలం బీఆర్ఎస్ చెప్పుకుంటూ వస్తున్నది.  అయితే ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఇంత కాలం బీఆర్ఎస్ చెబుతూ వస్తున్నదంతా అవాస్తవమని తన బహిరంగ క్షమాపణలతో తేల్చేశారు. అమరుల కుటుంబాలకు రూ. కోటి సాయం కోసం పోరాడతానని ప్రకటించడం ద్వారా అధికారంలో ఉండగా బీఆర్ఎస్ అమరులకు ఇచ్చింది శూన్యహస్తమేనని తేల్చేశారు. కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ లో లేరు.. నిజమే.. కానీ తెలంగాణ ఉద్యమ సారథి, నేత బీఆర్ఎస్(టీఆర్ఎస్) అధినేత అయిన కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత స్వయానా కుమార్తె.. ఆమే అధికారంలో ఉన్న సమయంలో తన తండ్రి, ఆయన ప్రభుత్వం అమరుల కుటుంబాలను ఆదుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రకటించడం ద్వారా బీఆర్ఎస్ పరువును నిలువునా గంగలో కలిపేయడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కవిత కొత్తగా తెలంగాణ వాదాన్ని భుజాన వేసుకుని రాజకీయాలు చేయడం ద్వారా బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు గుప్పిస్తున్నా.. ఆమె టార్గెట్ మాత్రం బీఆర్ఎస్సేననీ, రాష్ట్రంలో ఆ పార్టీ బలాన్నీ, బలగాన్నీ తనవైపుకు తిప్పుకోవడమే లక్ష్యంగా ఆమె భవిష్యత్ కార్యాచారణ ఉండబోతున్నట్లు అవగతమౌతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అమరుల కుటుంబాలకు కల్వకుంట్ల కవిత బహిరంగ క్షమాపణ

తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన అమరులకు సరైన న్యాయం చేయలేకపోయానంటూ కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం నుంచి జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమో జనం బాట పట్టడానికి ముందు నాంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. ఆ సందర్భంగా మాట్లాడిన కవిత ఉద్యమకారులను న్యాయం చేయడంలో విఫలమయ్యానని అంగీకరించారు. అమరవీరుల కుటుంబాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు.  ఇక నుంచి తన పోరాట పంథా మారుతుందన్నారు. జాగృతి జనం బాట యాత్రలో అందరినీ కలుస్తానని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరుల అయ్యారని గుర్తు చేసుకున్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేర్చడంలో ఎంత వరకు ముందుకు వెళ్ళామో ఆలోచించుకోవాలన్నారు.  తెలంగాణ  కోసం 1200 అమరులు అయ్యారనీ, అయితే ఆ అమరవీరుల కుటుంబాలకు అనుకున్న మేర న్యాయం చేయలేకపోయామని కవిత చెప్పారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ.. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడంలో మాత్రం విఫలమైందన్నారు. కేవలం 500 మంది అమర వీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు   ఉద్యమ కారులకు న్యాయం జరిగే వరకు కోట్లాడలేకపోయినందుకు తాను   క్షమాపణ చెబుతున్నాననీ అన్నారు.  అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే వచ్చే ప్రభుత్వంతో ఇప్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. తాను 33 జిల్లాలు,119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనకు బయలుదేరు తున్నట్లు వెల్లడించారు. అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలన్నారు. సబ్బండ వర్గాలూ కలిసి ఉంటేనే తెలంగాణ బాగుంటుందన్న ఆమె తన జాగృతి జనం బాటలో జిల్లాల్లో జరగాల్సిన అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడకు వెళ్లి పోరాటం చేస్తానన్నారు.  గతంలో జాగృతిలో పనిచేసిన వారికి స్వాగతం పలుకుతున్నానన్న ఆమె..  మనస్పర్థలు ఉంటే పక్కన పెట్టాలని కోరారు. సామాజిక తెలంగాణ కోసం కలిసిరావాలని  పిలుపునిచ్చారు.  

ఒక్క చాన్స్ ప్లీజ్.. ఒకే ఒక్క చాన్స్!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. నిన్న మొన్నటి వరకూ సీట్ల సర్దుబాటు కొలిక్కి రాక ప్రచారంలో వెనుకబడిన మహాఘట్ బంధన్ ఇప్పుడు ఆ వ్యవహారం తేలడంతో ప్రచారాన్నిస్పీడప్ చేసింది. ఈ సారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మహాఘట్ బంధన్ కు చావో రేవోగా మారాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలంగా ఉందన్న అంచనాలతో ఎలాగైనా ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని మహాఘట్ బంధన్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కూటమిలోని ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ లు గెలుపు అంచనాలతో సీట్ల విషయంలో ఒకింత పట్టుదలకు పోయినా.. చివరాఖరకు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ వ్యవహారం వల్ల ప్రచారంలో కొంత విలువైన సమయాన్ని మహాఘట్ బంధన్ కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పుడు దానికి కవర్ చేసుకోవడానికి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యంగా మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్.. ప్రచారం చేస్తున్న తీరు ఆసక్తిగా ఉంది. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పడమే కాకుండా.. అదేదో సినిమాలో హీరో వేషం ఒక్క చాన్స్ ప్లీజ్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ తిరిగినట్లు.. తేజస్వీయాదవ్.. ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్ అంటూ ప్రజలను వేడుకుంటున్నారు. ఒక్క చాన్స్ ఇస్తే ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే సర్కార్ ను ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇస్తున్నారు.  ఇక ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కర్మాగారాలు ఏర్పాటు చేసి...  బీహార్‌లో విజయం సాధించాలని చూస్తోందని విమర్శిస్తున్నారు.  నితీష్ కుమార్ ప్రభుత్వం 55 కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించిన మోడీయే.. ఆయనపై చర్య తీసుకోకుండా ఆయన సర్కార్ కు మద్దతుగా నిలుస్తున్నారనీ, కుంభకోణాల సర్కార్ ను మళ్లీ గెలిపించమని కోరుతున్నారనీ ఆరోపిస్తున్నారు. గత ఆర్జేడీ హయాంలో నితీష్ సీఎం అన్న సంగతి తెలిసిందే. మోడీ అప్పుడు నితీష్ పై చేసిన విమర్శలను ప్రజలకు గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతున్నారు.  దేశంలో అత్యధిక నేర కార్యకలాపాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయని తేజస్వి ఆరోపిస్తున్నారు. తాను  అర్ధ సత్యాలు, అబద్ధాలు చెప్పననీ, చేసేదే చెబుతా, చెప్పిందే చేస్తా అని నొక్కి చెబుతున్నారు. ఇండియా కూటమి (మహాఘట్ బంధన్)ని గెలిపిస్తే.. తాను సీఎం అవుతాననీ, బీహార్ ను నేరరహిత రాష్ట్రం చేస్తాననీ చెబుతున్నారు. అలాగే రాష్ట్రానికి అవినీతి రహిత పాలన అందిస్తాననీ,   ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, కాంట్రాక్టు కార్మికులును రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇస్తున్నారు.  

అయ్యో అయ్యయ్యో.. ఏపీ మాజీ సీఎం టు పులివెందుల మాజీ ఎమ్మెల్యే..!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరుకు ముందు మరో మాజీ కూడా చేరనుందా? ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రే కాకుండా పులివెందుల మాజీ ఎమ్మెల్యేగా కూడా మారనున్నారా? అంటే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మాటలను బట్టి ఔననే అనాల్సి వస్తున్నది.  ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని  మరోమారు హెచ్చరించారు. విశాఖపట్నంలో ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన రఘురామకృష్ణం రాజు.. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే, రాజ్యాంగం ప్రకారం ఆటోమేటిగ్గా శాసనసభ సభ్యత్వం రద్దైపోతుందని చెప్పారు. ఆ ప్రకారంగా చూస్తే జగన్ మరో పాతిక రోజులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే ఆయన మాజీ ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ఆయన గైర్హాజరైతే.. ఇక అంతే సంగతులు అని పరోక్షంగా జగన్ ను హెచ్చరించారు కూడా. అదే సమయంలో గతంలో నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ హయాంలో అంటే జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో అసెంబ్లీ మొత్తం 67 రోజులు మాత్రమే సమావేశమైందన్న ఆయన.. చివరి రెండేళ్లలో అంటే చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన కాలంలో అసెంబ్లీ కేవలం 37 రోజులు మాత్రమే సమావేశమైందని చెప్పారు. అయితే జగన్ ఇప్పటికే  35 రోజులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారనీ, మరో పాతిక రోజులు ఆయన అసెంబ్లీ పనిదినాలలో సభకు హాజరు కాకపోతే ఆటోమేటిగ్గా మాజీ అవుతారని చెప్పారు. దీంతో  నెటిజనులు జగన్ కోరుతున్నట్లు ప్రతిపక్షహోదా సంగతి అటుంచి మొదటికే మోసం అంటే అసెంబ్లీ సభ్యత్వానికే ఎసరు వచ్చే పరిస్థితి తెచ్చుకున్నారని ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే జగన్ పరిస్థితి ఉన్నదీ పాయె.. ఉంచుకున్నదీ పాయె అన్నట్లుగా తయరయ్యేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి జగన్ ప్రస్థానం మాజీ సీఎం టు పులివెందుల మాజీ ఎమ్మెల్యే వరకూ సాగుతుందా? లేక మనసు మార్చుకుని ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు వీడి అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతారా?  

బీసీ రిజర్వేషన్లు.. కోల్డ్ స్టోరేజీలోకేనా?

తెలంగాణలో ఇటీవలి కాలంలో రాజకీయంగా ఎంత చర్చనీయాంశమైందో.. అంతకు మించి వివాదాస్పదమైన బీసీ రిజర్వేషన్ల అంశం ఇక కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయినట్లేనా?  తెలంగాణ స్థానిక ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్.. ఆ విషయంలో చేతులెత్తేసిందా?  ఈ విషయంలో కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చే అవకాశాలున్నాయని తెలిసినా తగ్గేదే లే అంటూ ముందుకు వెళ్లిన రేవంత్ సర్కార్ చివరికి ఇది జరిగేది లే.. అని ఉసూరు మందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురైన తరువాత కూడా రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశంలో ముందుకే సాగుతామని సంకేతాలిచ్చింది. ఈ విషయంపై గురువారం (అక్టోబర్ 23)న జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటామన్న సంకేతాలిచ్చింది. అయితే గురువారం (అక్టోబర్ 23) సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై కనీసం చర్చ కూడా లేకపోవడంతో రేవంత్ సర్కార్ రిజర్వేషన్ల అంశాన్ని కోల్ట్ స్టోరేజీలో పెట్టేసినట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అంటే కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశ కూడా వదిలేసుకుని.. రిజర్వేషన్ల ఊసెత్తకుండానే ‘స్థానిక’ ఎన్నికలకు సమాయత్తం అవుతోందని అవగతమౌతోంది. ఎందుకంటే రిజర్వేషన్ల అంశం చర్చించకుండా.. స్థానిక ఎన్నికలలో పోటీకి ఇంత కాలం ఉన్న ఇద్దరు పిల్లలు అన్న నిబంధనను రద్దుపై చర్చింది, ఆమోదం తెలిపింది.   ఇందు కోసం పంచాయతీరాజ్ చట్టంలో మార్పు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. దీంతో స్థానికి ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తుతానికి అటకెక్కించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబుకు మేలు.. జగన్ తీరు!

ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమికి ప్రత్యర్థి పార్టీ వైసీపీ మాత్రమే. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అంతే కాకుండా గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. మళ్లీ రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావాలని ప్రయత్నిస్తున్న పార్టీ. అటువంటి పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, లోపాలను ఎత్తిచూపడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ కువిమర్శలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడానికీ, తప్పదోవపట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలు వైసీపీకి మేలు చేయవు సరికదా, ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తాయి. ప్రత్యర్థి పార్టీగా వైసీపీ ప్రస్తుతం చేస్తున్న విమర్శలు, ఆరోపణల వల్ల రాజకీయంగా ఆ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలూ వ్యవహరిస్తున్న తీరు.. అధికార కూటమికి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎనలేని మేలు చేస్తున్నాయని వివరిస్తున్నారు.    తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ సీఎం చంద్ర‌బాబుపై చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. జగన్ విమర్శల వల్ల ఆయనకు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. చంద్రబాబు ఎవరికీ క్రెడిట్ ఇవ్వరనీ, ఎవరో చేసిన మంచి పనుల క్రెడిట్ ను కూడా తన ఖాతాలో వేసేసుకుని, అంతా తానే చేశాన్న బిల్డప్ ఇచ్చుకుంటారనీ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. ఆయన వ్యాఖ్యలకు నెటిజనులు క్షణం ఆలస్యం చేయకుండా గట్టి కౌంటర్ ఇస్తున్నారు.  కియా, విశాఖకు ఏఐ వంటి అంశాలలో తొలుత విమర్శలకు దిగిన జగన్ తీరా వాటికి ప్రజల నుంచి వచ్చిన అమోఘమైన సానుకూలతను గమనించి అవి తమ ఘనత వల్లే వచ్చాయని క్లెయిమ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని నెటిజనులు ప్రస్తావిస్తూ జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. అనంతపురానికి కియా రాక తన తండ్రి వైఎస్ దేననీ, అదానీతో తాను గతంలో జరిపిన చర్చల వల్లే విశాఖకు గూగుల్ డేటా సెంటర్, ఏఐ వచ్చాయనీ జగన్ చెప్పుకోవడాన్ని గుర్తు చేస్తూ.. చంద్రబాబు ఎన్నడూ వేరొకరి క్రిడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించలేదని గుర్తు చేస్తున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా ఆయన అప్పుడూ, ఇప్పుడూ కూడా దివంగత ప్రధాని పీవీ నరసింహరావు పేరునే ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తున్నారు.  ఇక వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి వాటిని చంద్రబాబు కొనసాగించారనీ, అయితే ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించలేదనీ గుర్తు చేస్తున్నారు నెటిజనులు. ఇక హైదరబాద్ కు అదనంగా సైబరాబాద్ ఆవిర్భావం చంద్రబాబు ఘనతే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. జగన్ స్నేహితుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా పలు సందర్భాలలో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమైందని చెప్పారు. నెటిజనులు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ అసత్యాలను ప్రచారం చేస్తూ చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల రాజకీయ మైలేజ్ రావడం సంగతి అటుంచి ఉన్న ప్రతిష్ఠ కూడా మసకబారుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

వీడిన ఉత్కంఠ.. మహాఘట్ బంధన్ సీట్ల సర్దుబాటు కొలిక్కి!

బీహార్ రాజకీయాలలో కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. మహాఘట్ బంధన్ లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్టకేలకు  ఒక కొలిక్కి వచ్చింది. దీంతో మహాఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ఆర్జేడీ అగ్రనేత తేజస్వియాదవ్ పేరును అధికారికంగా ప్రకటించింది.  ఈ మేరకు పట్నాలోని మౌర్య హోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాఘట్ బంధన్ కూటమి నేతలు తేజస్వియాదవ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ముఖేష్ సహానీ పేరు ప్రకటించారు. కాగా కాంగ్రెస్ నుంచి పరిశీలకుడిగా వచ్చిన గెహ్లాట్ తేజస్వి యాదవ్ పేరును కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా యువనేత తేజస్వియాదవ్ పై పొగడ్తల వర్షం కురింపిచారు. తేజస్వికి సుదీర్ఘ రాజకీయ భవిష్యత్ ఉందన్న గెహ్లాట్, ఆయన నాయకత్వంలోనే మహాకూటమి పోటీ చేస్తున్నదని స్పష్టం చేశారు.  ఇక పోతే సీట్ల పంపకాల విషయంలో కూడా మహాఘట్ బంధన్ లో తీవ్ర విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కూటమిలోని ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో పీటముడి పడింది. గత అసెంబ్లీ ఎన్నికలలో 19 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన కాంగ్రెస్ ఈ సారి 70 స్థానాల కోసం పట్టుబట్టింది. అయితే అన్ని సీట్లను ఇచ్చేందుకు ఆర్జేడీ ససేమిరా అనడంతో విభేదాలు మొదలయ్యాయి.  అయితే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి సమస్య పరిష్కరించి, ప్రతిష్ఠంభనకు తెరదించే బాధ్యతను సీనియర్ నాయకుడు గెహ్లాట్ కు అప్పగించింది.  దీంతో బుధవారం (అక్టోబర్ 22) పట్నా చేరుకున్న గెహ్లాట్.. ఆర్జీడీ ముఖ్య నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వియాదవ్ తో చర్చలు జరిపారు. ఆ చర్చలు ఫలించడంతో ప్రతిష్ఠంభనకు తెరపడింది.   దీంతో ఇక కూటమి ఐక్యంగా ప్రచార పర్వంలోకి దిగుతుందని అంటున్నారు. 

మరో సారి వివాదంలోకి కొలికపూడి.. ఈ సారి కేశినేని చిన్ని టార్గెట్ గా ఆరోపించారు

తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరో సారి సంచలన వ్యాఖ్యలతో వార్తలకెక్కారు. సొంత పార్టీ ఎంపీపైనే తీవ్ర ఆరోపణలు చేసి వివాదానికి తెరలేపారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆయన చేసిన ఆరోపణలతో ఇరువురి మధ్యా విభేదాలు మరోసారి రచ్చకెక్కియి. కాగా కొలికపూడి వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి.  ఆయన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంతకీ జరిగిందేంటంటే.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ కొలికపూడి  తీవ్ర ఆరోపణలు చేశారు . కేశినేని చిన్ని పార్టీ పదవులను అమ్ముకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.  విజయవాడ ఎంపీ కేశినేని కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న అవినీతి దందాను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెడతానని కొలికపూడి అంటున్నారు. ఇంతకీ ఆయన ఆరోపణ ఏమిటంటే.. 2024 ఎన్నికలలో తిరువురూ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం టికెట్ కోసం కేశినేని చిన్ని తనను ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారంటూ కొలికపూడి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే తాను మూడు దఫాలుగా 60లక్షల రూపాయల చొప్పున చిన్నికి సొమ్ములు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. అంతే కాకుండా కేశినేని చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి 50లక్షల రూపాయలు తీసుకువెళ్లినట్లు  పేర్కొంటూ నిజమే గెలవాలి అంటూ కొలికపూడి ఆ పోస్టులో  పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.  దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. తాను ఎప్పుడూ పార్టీ కోసం, ప్రజల కోసం తన జేబులో డబ్బులు ఖర్చు చేశానే తప్ప ఎన్నడూ ఎవరి వద్దనుంచీ పైసా తీసుకోలేదని పేర్కొన్నారు.  ఎంపీ కేశినేని చిన్ని లేకపోతే నేనులేను అని చెప్పిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇప్పుడు చేస్తున్న విమర్శలకు ఆయనే సమాధానం చెప్పాలని చిన్ని అన్నారు. తాను ఏమిటో విజయవాడ ప్రజలకు తెలుసునన్న చిన్నికొలికపూడి వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందన్నారు. ఇలా ఉండగా  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ కూడా కొలికపూడి వ్యవహారశైలి వివాదాస్పదంగానే ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు  హైకమాండ్ ఆయనను మందలించిందనీ, హెచ్చరించిందనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి. అయినా ఆయనలో మార్పు రావడం లేదని మండిపడుతున్నాయి.  

మాగంటి సునీత‌కు స‌వ‌తి పోరు!?

మొన్న‌టి వ‌ర‌కూ అందరూ సునీత మాత్ర‌మే మాగంటి గోపీనాథ భార్య‌. ఆమె పిల్ల‌లు మాత్రమే ఆయ‌న‌కు వార‌సులు. ఇదొక చిన్న కుటుంబం చింత‌లేని కుటుంబం.  అనుకుంటున్నారంతా. ఇంత‌లో స‌డెన్ ఎంట్రీ ఇచ్చాడు తార‌క్ ప్ర‌ద్యుమ్న‌. తానే అస‌లైన వార‌సుడిననీ, తనకు చ‌ట్ట‌రీత్యా రావ‌ల్సిన ఈ హ‌క్కు తన తండ్రితో  లివిన్ రిలేష‌న్లో ఉన్న సునీత‌కు ఎలా ఇచ్చారంటూ.. ఈసీకీ ఫిర్యాదు చేయ‌డంతో ఇంటి గుట్టు- రాజ‌కీయం ర‌ట్టుగా మారింది. సునీత‌కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందే సెంటిమెంటు ద్వారా నాలుగు ఓట్లు ప‌డ‌తాయ‌ని. ఇపుడీ మొద‌టి భార్య కొడుకు కార‌ణంగా బీఆర్ఎస్ ఆశ‌ల‌పై భారీగా నీళ్లు జ‌ల్లిన‌ట్ట‌య్యింది. అయితే మాగంటి గోపీనాథ్ చ‌నిపోయిన‌పుడు త‌ల‌కొరివి పెట్ట‌డానికి కానీ, ఆ త‌ర్వాత ఆయ‌న నివాళి స‌భ‌లకు కానీ రాని  తార‌క్ ప్ర‌ద్యుమ్న స‌డెన్ గా తాను గోపీనాథ్ మొద‌టి భార్య మాలినీదేవి కొడుకును,  ఆయ‌న అస‌లు సిసలు రాజ‌కీయ వార‌సుడ్నిఅంటూ రావడంతో అంతా ఉలిక్కి ప‌డ్డారు. సునీత త‌ప్పుడు ఫ్యామిలీ స‌ర్టిఫికేట్ చూపించి గోపీనాథ్ భార్య‌గా నిరూపించే య‌త్నం చేశారు. అక్టోబ‌ర్ 11న ఆ స‌ర్టిఫికేట్ ని ఆర్డీఓ ఆఫీసు వారు కూడా ర‌ద్దు చేశారంటూ నానా యాగీ చేస్తున్న ఇత‌డిచ్చిన కంప్ల‌యింట్ పై సునీత ఈసీకి వివ‌ర‌ణ ఇస్తారు. అంతా బావుంది. మ‌రి ఇప్పుడే ఇత‌డెందుకిలా బ‌య‌ట‌కొచ్చిన‌ట్టు? ఇత‌డి వెన‌క ఎవ‌రున్న‌ట్టు? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది. అయితే ఇత‌డు మాగంటి ఇంటి పేరును కూడా త‌న పేరు చివ‌ర వాడ‌టం లేద‌నీ.. కొస‌రాజు తార‌క్ ప్ర‌ద్యుమ్న అనే పేరుతో చెలామ‌ణీ అవుతున్నాడ‌నీ.. తండ్రి చివ‌రి సారి చూపుల‌కు కూడా రాని ఇత‌డు.. ఇప్పుడే స‌డెన్ గా ఊడి ప‌డ్డం వెన‌క కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయ కుట్ర కోణం ఉంద‌నీ.. అంటున్నారు బీఆర్ఎస్ లీడ‌ర్లు. అయితే ఇప్పుడు సునీత మాగంటి గోపీనాథ్  భార్య అవునా కాదా?  లివిన్ లో మాత్ర‌మే ఉన్న జీవిత భాగ‌స్వామా? వంటివి పెద్ద‌గా అడ్డంకులు కావు. ఎందుకంటే ఈ దిశ‌గా చ‌ట్టాలు మారి చాలా కాల‌మే అయ్యింది. ఎలిజిబిటిటీ రూల్స్ అండ్ రెగ్యులేష‌న్స్ ని బ‌ట్టిచూస్తే ఆడ, మ‌గ తేడా లేకుండా ఎవ‌రు ఎవ‌రితోనైనా ఉండొచ్చు. సంచరించొచ్చు. స‌హ‌జీవ‌న భాగ‌స్వామ్యం కొన‌సాగించ‌వ‌చ్చు. అయితే సునీత త‌ప్పుడు ధృవీక‌ర‌ణ ప‌త్రాలే అస‌లు స‌మ‌స్య‌. ఇప్ప‌టికే సునీత నామినేష‌న్ల సెట్ ఓకే చేసీన ఈసీ ఈ ఫిర్యాదు ద్వారా ఎలాంటి నిర్ణ‌యం తీస్కుంటారన్న స‌స్పెన్స్ న‌డుస్తోంది.

జూబ్లీ బైపోల్.. 130 మంది నామినేషన్లు రిజెక్ట్.. బరిలో మిగిలింది 81 మంది!

జూబ్లీ బైపోల్ బరిలో 81 మంది మిగిలారు. ఈ ఉప ఎన్నికలో పోటీకి భారీ సంఖ్యలో  నామినేషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. కాగా బుధవారం (అక్టోబర్ 22) నామినేషన్ల స్క్రూటినీ జరిగింది. 211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్ల   స్క్రూటినీ ప్రక్రియ దాదాపు 17 గంటల పాటు సాగింది.  వివిధ కారణాలతో 130 మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. సరైన ఫార్మాట్‌‌లో పత్రాలు సమర్పించకపోవడం, వివరాలు అసంపూర్తిగా ఉండటం వంటి కారణాలతో  130 మంది అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లు  తిరస్కరణకు గురయ్యాయి. దీంతో స్క్రూటినీ అనంతరం జూబ్లీ బరిలో 81 మంది మిగిలారు.  ఇక నామినేషన్ల ఉప సంహరణకు ఇంకా ఒక రోజు గడువు ఉండటంతో బరిలో మిగిలిన వారిలో ఎందరు తమ నామినేషన్లను ఉపసంహరిం చుకుం టారన్నది చూడాల్సి ఉంది.  ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు విడుదల కానున్నాయి.  

బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్ రద్దు చేయండి : ప్రద్యుమ్న

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై  మొదటి భార్య కొడుకు  తారక్ ప్రద్యుమ్న సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లి మాలనీదేవికి మాగంటి గోపినాథ్ విడాకులు ఇవ్వలేదని ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. గోపీనాథ్, సునీత కేవలం లివ్ ఇన్ రిలేషన్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఆమె సునీత నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. మాగంటి గోపీనాథ్‌కు చట్టబద్ధమైన ఏకైక వారసుడిని నేనే అని చెప్పారు.  పెళ్లి చేసుకోకుండా అఫిడవిట్‌లో తన భర్త అంటూ గోపీనాథ్ పేరును సునీత ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. నిజాలను దాచి సునీత ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను పొందారని ఆయన ఆరోపించారు. నిజాలను దాచి సునీత ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను పొందారని పేర్కొన్నారు. సునీతకు ఇచ్చిన ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను అక్టోబర్ 11న ఆర్డీవో రద్దు చేశారని తారక్ ప్రద్యుమ్న డిమాండ్ చేశారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నేత, రెండో సెట్ నామినేషన్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.