మిస్ వరల్డ్ గా థాయ్ లాండ్ భామ
హైదరాబాద్ వేదికగా జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలలో థాయ్ లాండ్ భామ విజేతగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలకు చెందిన అందాల భామలు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీ పడగా వారందరినీ అధిగమించి థాయ్ లాండ్ కు చెందిన ఓపల్ సుదాత చువాంగ్ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఈ పోటీలలో ఫస్ట్ రన్నర్ అప్ గా ఇథియోపియా, సెకండ్ రన్నర్ అప్ గా పోలెండ్ కు చెందిన అందాల భామలు నిలిచారు. భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటానికి పోటీపడిన నందిని గుప్తాకు నిరాశే మిగిలింది. అందం, అభినయం, ప్రతిభల మేలు కలయికతో ఓపల్ సుదాత చువాంగ్ శ్ఱీ మిస్వరల్డ్ కిరీటం అందుకున్నారు.
థాయ్, ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ, మోడలింగ్ పట్ల ఇష్టం, ఆసక్తితో ఈ పోటీలలో పాల్గొన్నారు. 2022లో జరిగిన మిస్ యానివర్స్ థాయ్ ల్యాండ్ పోటీలలో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచిన ఆమే.. 2024లో కూడా ఈ పోటీలలో పాల్గొని మిస్ చార్మింగ్ టాలెంట్, మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్ టైటిళ్లు గెలిచారు. 16 ఏళ్ల వయసులో రొమ్ములో కణితితో బాధపడ్డారు సుచాత. క్యాన్సర్ తో బాధపడే వారి పరిస్థితిని అర్ధం చేసుకుని, ఓపల్ ఫర్ హెర్ ప్రాజెక్ట్ ద్వారా మహిళలలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు కృషి చేశారు. సుచాత ప్రస్తుతం ధమ్మసాట్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ అభ్యసిస్తున్నారు. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నఓపల్ సుదాత చువాంగ్ శ్రీకి రూ.8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం బహుమతిగా దక్కాయి. అలాగే ఏడాది పాటు ఉచిత ప్రపంచ యాత్ర చేసే అవకాశం లభించింది.
ఇక ఈ పోటీలలో భారత్ కు చెందిన నందినీ గుప్తాకు టాప్ 8లో స్థానం లభించలేదు. మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ దేశాల అందాల భామలు మిస్ వరల్డ్ టాప్ 8లో చోటు దక్కించుకున్నారు. శనివారం(మే 31) రాత్రి హైటెక్స్ లో జరిగిన
ఈ భారీ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సినీ నటి ఖుష్బూ, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీత, కూతురు నైమిషా రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆయన భార్య నందిని, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.