తెలంగాణ ఓటర్ల మూడ్ క్లియర్..! ఎవరికి కలిసి వస్తుంది?
తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవటమే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. బీజీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ సరళిని గమనిస్తున్న ఈ మూడు పార్టీలు తమ విజయావకాశాల పైన అంచనాలు వేస్తున్నాయి. మూడు పార్టీల నేతలు పోలింగ్ సరళి పైన క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉందనే అంశం పైన ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు 17 నియోజకవర్గాల్లో పోలింగ్ తీరును పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎక్కువగా పోలింగ్ నమోదయ్యేలా పని చేయాలని పార్టీ కేడర్ కు సూచిస్తున్నాయి. చింతమడకలో మాజీ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ తక్కువగా నమోదు అవుతుండటంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఆందోళనపడటం కనిపించింది.
పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్, ఫిలం నగర్ పరిసరాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే తమ ఓటు వేసారు. ముఖ్యమంత్రి రేవంత్ సతీ సమేతంగా తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం లో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వికాస్ రాజ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొన సాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.
ఈ ఎన్నికలు కాంగ్రెస్ వందరోజుల పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33శాతం ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో అంతకు మించి ఓట్లు వస్తాయని చెప్పారు.
బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోంది. 17 సెప్టెంబర్ 2025తో మోదీకి 75ఏళ్లు నిండుతాయి. ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ తేల్చుకోవాలి. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని రేవంత్ అన్నారు. బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. 400 సీట్లు ఎట్లా సాధ్యం అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
13ఏళ్లు సీఎంగా, 10ఏళ్లు పీఎంగా పనిచేసిన మోదీ.. మన రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవు. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారని రేవంత్ విమర్శించారు.
ఇండియా కూటమి పేరుతో మేం ప్రజలను ఓట్లు అడుగుతుంటే.. మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోంది. ఎవరు నామ్ దార్.. ఎవరు కామ్ దార్.. దీన్ని బట్టి తెలుస్తోంది. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజలకోసం పనిచేస్తున్నారో చర్చకు సిద్ధం. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోందని రేవంత్ అన్నారు. కేసీఆర్ పై నాకు సానుభూతి ఉంది. మానసిక ఒత్తిడిలో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్ కూడా కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.
- ఎం.కె.ఫజల్