పవన్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన దిల్ రాజు!
on Apr 5, 2021
"కళ్యాణ్ గారితో సినిమా చేయాలని ఉందని హరీశ్ శంకర్ తో తరుచూ చెప్పేవాడిని. సంకల్పం గొప్పది వేచి చూడు అనేవాడు. ఎప్పుడు అవకాశం వచ్చినా సినిమా చేయాలని గట్టిగా అనుకున్నాను. పవన్ గారు పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు అనేసరికి నా డ్రీమ్ నెరవేరదా అని భయపడ్డాను." అంటూ ఎమోషనల్ అయ్యారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. పవన్ కల్యాణ్ టైటిల్ పాత్రధారిగా ఆయన నిర్మించిన 'వకీల్ సాబ్' మూవీ ఏప్రిల్ 9న విడుదలవుతోంది. ఆదివారం రాత్రి జరిగిన ఆ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎప్పుడూ లేనంత ఉద్వేగభరితంగా మాట్లాడారు దిల్ రాజు. పవన్ కల్యాణ్తో జరిగిన పరిచయం నాటి నుంచి ఆయనతో సినిమా తియ్యాలనే తన కల నెరవేరేదాకా జరిగిన కొన్ని ఘటనలను ఆయన చెప్పుకొచ్చారు.
"పవన్ కళ్యాణ్ గారితో ఉన్న ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ గురించి చెప్పాలంటే 1998, జులై 24 తేదీకి వెళ్లాలి. ఆ రోజు 'తొలి ప్రేమ' రిలీజైంది. అప్పుడు మేం చాలా చిన్న డిస్ట్రిబ్యూటర్లమి. 'తొలి ప్రేమ' షూటింగ్ టైమ్ లో వెళ్లి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని, దర్శకుడు కరుణాకరణ్ ను చూసి వచ్చేవాళ్లం. పవన్ గారిని కలిసేంత పరిచయం లేదు. దూరం నుంచి చూసేవాళ్లం. సినిమా విడుదల అయ్యాక వారానికి ఒకసారైనా జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పవన్ గారి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసి ఐదు నిమిషాలు మాట్లాడి వచ్చేవాడిని. నేను మాట్లాడుతుంటే పవన్ గారు అలా వినేవారు." అని చెప్పారు దిల్ రాజు.
'తొలి ప్రేమ' హండ్రెడ్ డేస్ రోజు సంధ్య 70ఎంఎం ఫుల్ అయితే, 35ఎంఎంలో కూడా షో వేశామనీ, అప్పుడు నిర్మాత అయితే పవన్ గారితో సినిమా నిర్మించాలి అని అనిపించిందనీ ఆయన గుర్తుచేసుకున్నారు. "అయితే అప్పటికి డిస్ట్రిబ్యూషన్ లోనే ఉన్నాం, ఇంకా ప్రొడక్షన్ లోకి రాలేదు. రత్నంగారు 'ఖుషి' సినిమా డిస్ట్రిబ్యూషన్ మాకు ఇచ్చారు. 'ఖుషి' 50 రోజుల ఫంక్షన్ కు పవన్ గారిని సంధ్య 70 ఎంఎం థియేటర్ కు తీసుకెళ్లాం. అప్పుడు మరోసారి అనిపించింది పవన్ గారితో సినిమా చేయాలని. 'ఆర్య' సినిమా ఓపెనింగ్ కు పవన్ గారు, చిరంజీవి గారు అతిథులుగా వచ్చారు. అప్పుడు మరోసారి అనుకున్నా ఆయనతో సినిమా చేయాలని. చాలా సార్లు ఇలా అనుకున్నాం కానీ కుదరలేదు. పవన్ గారికి మా మనసులో ఉన్నది ఎప్పుడూ చెప్పలేదు. 'గబ్బర్ సింగ్' నైజాం చేశాం. కళ్యాణ్ గారితో సినిమా చేయాలని ఉందని హరీశ్ శంకర్ తో తరుచూ చెప్పేవాడిని. సంకల్పం గొప్పది వేచి చూడు అనేవాడు. ఎప్పుడు అవకాశం వచ్చినా సినిమా చేయాలని గట్టిగా అనుకున్నాను. పవన్ గారు పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు అనే సరికి నా డ్రీమ్ నెరవేరదా అని భయపడ్డాను." అని ఉద్వేగానికి గురయ్యారు రాజు.
కళ్యాణ్ డేట్స్ ఇస్తే చాలు సినిమా చేసేందుకు లైన్ లో చాలా మంది ఉంటారనీ, ఆయనతో సినిమా నిర్మించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ ఆయన అనుభవాన్ని చూస్తారనీ ఆయన అభిప్రాయపడ్డారు. 'వకీల్ సాబ్'ను పవన్ కల్యాణ్తో చేసే అవకాశం ఎలా వచ్చిందో ఈ సందర్భంగా ఆయన వివరించారు. "టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేశాం. కళ్యాణ్ గారితో చేయాల్సిన సినిమానే పెండింగ్ లో ఉండేది. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూశాను. ఆ అవకాశం 'పింక్' రూపంలో వచ్చింది. 'పింక్' రైటర్స్, దర్శకుడు చేసిన ప్రయత్నమే ఈ స్టేజీ దాకా 'వకీల్ సాబ్' సినిమాను తీసుకొచ్చింది. బోనీ కపూర్ గారు తమిళ 'పింక్' సినిమా ట్రైలర్ పంపారు. అది చూస్తున్నంత సేపూ నాకు పవన్ కళ్యాణ్ గారే కనిపించారు. ఇది కళ్యాణ్ గారు చేస్తే భలే ఉంటది అనుకున్నాను. కానీ ఆయన అప్పటికి పాలిటిక్స్ లోనే ఉన్నారు. సినిమాలు చేస్తరో లేదో అనే ఆలోచనలోనే ఉన్నాను. బోనీ గారు తమిళ్ లో 'పింక్' చేశారు కాబట్టే తెలుగులో మేము చేయాలనే ఆలోచన వచ్చింది. హరీష్ కు తమిళ్ 'పింక్' ట్రైలర్ పంపితే ఆయన కూడా పవన్ చేస్తే బాగుంటది అని చెప్పారు. అయినా పన్ గారి దగ్గరకు వెళ్లే వీలు దొరకలేదు. ఒకరోజు 'అల వైకుంఠపురములో' సినిమా సెట్స్ కు వెళ్లి త్రివిక్రమ్ గారితో ఐడియా చెప్పాను. ఆయన పవన్ గారి టైమ్ తీసుకుని మేము కలిసేలా చేశారు. త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ ప్రాసెస్ లో ఏది మిస్ అయినా ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చేది కాదు. మా కల నెరవేరేలా చేసిన హిందీ 'పింక్' మేకర్స్, బోనీ కపూర్, హరీష్ శంకర్, త్రివిక్రమ్ గారు ఈ నలుగురికీ థాంక్స్." అని చెప్పారు దిల్ రాజు.
శ్రీరామ్ వేణును దర్శకునిగా ఎలా ఎంచుకున్నదీ ఆయన తెలిపారు. "దర్శకులు ఎవరనేది ఇద్దరు ముగ్గర్ని అనుకున్నాం. కానీ 'పింక్' రీమేక్ అంటే ఇది సరిపోదు ఇంకా ఏదో కావాలని అనిపించింది. త్రివిక్రమ్ గారితో కొంతసేపు డిస్కషన్ తర్వాత నాకు శ్రీరామ్ వేణు పేరు స్ట్రైక్ అయ్యింది. 'ఎంసీఏ' తర్వాత ఇంకో సినిమా అనుకున్నాం. అది డిలే అవుతూ వచ్చింది. వేణును ఆఫీస్ కు పిలిచి నీకో సర్ ప్రైజ్ చెప్తాను అన్నాను. 'పింక్'ను తెలుగులో పవన్ గారితో చేస్తున్నాం. నువ్వు డైరెక్ట్ చేస్తావా.. అన్నాను. వెంటనే వేణు జోకులు చేయకండి సార్ అన్నాడు. నేను పవన్ గారికి ఎంత పెద్ద అభిమానినో మీకు తెలుసు. మీరు అవకాశం ఇస్తే ఈ నిమిషం నుంచే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తా అన్నాడు. ఇంకా ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవకముందే రోజూ వచ్చి సీన్స్ చెప్పేవాడు. ఈ సీన్ ఇలా ఉంటది సార్, పవన్ గారి క్యారెక్టర్ ఇలా చేద్దాం అని చెప్పేవాడు. చివరకు తన ఉత్సాహంతో ఈ సినిమాకు దర్శకుడు అయ్యారు." అని ఆయన తెలిపారు.
ఈ సినిమా ప్రకటించగానే నెగిటివ్ పాజిటివ్ రెండూ వచ్చాయనీ, మా హీరోతో ఇలాంటి సినిమానా అన్న అభిమానులూ ఉన్నారనీ దిల్ రాజు చెప్పారు. "కానీ సినిమా ఒప్పుకున్నాక పవన్ గారు మాతో ఒకటే ఒక మాటన్నారు. ఇది గొప్ప కథ. ఈ కథలో నా ఇమేజ్ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తే ఒక మ్యాజిక్ అవ్వుద్ది అన్నారు. మీకు ట్రైలర్ లాంచ్ రోజు చెప్పాను. ఇది బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అని, లంచ్ డిన్నర్ రిలీజ్ రోజు ఉంటది. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హైలైట్ ఉంటది. మీరు పేపర్స్ పట్టుకుని రెడీగా ఉండండి. పింక్ లోని కథను, పవన్ గారి ఇమేజ్ ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ వేేణు సూపర్బ్ గా తెరకెక్కించారు. కళ్యాణ్ గారు ఓ చిన్న బ్రేక్ తీసుకుని తెరపైకి వస్తున్నారు. ఏప్రిల్ 9న మనమంతా పండగ చేసుకునేరోజు. కాలర్స్ ఎగరేసే రోజు అది. కళ్యాణ్ గారితో ఒక గొప్ప సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది." అని ఆయనన్నారు.
చిన్న డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 50 సినిమాలు చేసే నిర్మాణ సంస్థగా ఎదిగామనీ, ప్రేక్షకుల ప్రోత్సాహానికి థాంక్స్ అనీ ఆయన చెప్పారు. "తమన్ ఒక పిచ్చోడిలా ఈ సినిమాకు పనిచేశాడు. నో కాంప్రమైజ్ అంటూ పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ఇవాళ ఉదయం వరకు పనిచేస్తూనే ఉన్నాడు. పవన్ గారి ఇమేజ్ ను గుర్తుపెట్టుకుని మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు దేవుడు. పవన్ గారితో నాకు పెద్దగా సాన్నిహిత్యం లేదు. ఈ మధ్య పవన్ గారు పిలిచి మాట్లాడారు. ఆయన చెప్పిన రెండు మాటలు లైఫ్ లో ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మనసుతో ఆలోచించినప్పుడే అది అర్థమవుతుంది." అంటూ భావోద్వేగానికి గురయ్యారు దిల్ రాజు.