రెండు సార్లు మృత్యువును గెలిచి.. క్యాన్సర్తో పోరాడిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణమైన వాచకం, మేనరిజమ్స్తో నవ్వుల పంట పండించిన అరుదైన నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. కేవలం తెరపై నవ్వించడమే కాకుండా, తెర వెనుక ఒక రచయితగా, దర్శకుడిగా, ప్రభుత్వ అధికారిగా ఆయన చూపిన బహుముఖ ప్రజ్ఞ టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. క్రమశిక్షణకు, కుటుంబ విలువలకు పెద్దపీట వేసిన ఆయన జీవిత ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఆరంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ధర్మవరపు, ఒంగోలులో చదువుకునే రోజుల్లోనే తండ్రిని కోల్పోయారు. దీంతో తల్లి, నలుగురు అన్నదమ్ముల బాధ్యతను భుజాన వేసుకున్నారు. నాటకాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్ వెళ్లినా ఆశించిన అవకాశాలు రాకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి హైదరాబాద్లో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ (VDO)గా స్థిరపడ్డారు. ఉద్యోగం చేస్తూనే దూరదర్శన్లో ‘ఆనందో బ్రహ్మ’ లాంటి సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ఆయనలోని ప్రతిభను గుర్తించిన ప్రముఖ దర్శకుడు జంధ్యాల ‘జయంము నిశ్చయమురా’ సినిమాతో ధర్మవరపును వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘మన్మధుడు’, ‘అతడు’, ‘రెడీ’, ‘ఒక్కడు’ వంటి చిత్రాలతో ఆయన తిరుగులేని హాస్య నటుడిగా ఎదిగారు. ‘నువ్వు నేను’లో ఎంఎస్ నారాయణతో కాంబినేషన్, ‘అతడు’లో బ్రహ్మానందంతో వచ్చే పేస్ట్ సీన్ ఇప్పటికీ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూనే ఉంటాయి. ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం ఆరు దాటితే షూటింగులకు స్వస్తి చెప్పి, కుటుంబంతో సమయం గడపడం ఆయన అలవాటు. అయితే ఈ హాస్య చక్రవర్తి జీవితంలో భయంకరమైన ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు కింద కారు నలిగిపోయినా తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే ‘శ్వేతనాగు’ షూటింగ్ సమయంలో విషకీటకం కుట్టడంతో శ్వాస ఆడక ఇబ్బంది పడుతుంటే, భార్య సమయస్ఫూర్తితో ఆసుపత్రికి చేర్చడంతో ప్రాణాలు దక్కాయి. కానీ ఆ తర్వాత కాలంలో వచ్చిన కామెర్లు (జాండిస్) కాస్తా క్యాన్సర్గా మారడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. చివరి రోజుల్లో క్యాన్సర్ మహమ్మారి కారణంగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం చాలా నీరసించి, బక్కచిక్కిపోయారు. ఎప్పుడూ తనను నవ్వుతూ చూసిన అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఆ స్థితిలో చూడకూడదనే ఉద్దేశంతో ఆయన చివరి రోజుల్లో ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన పంచిన హాస్యం మరియు నైతిక విలువలు ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సజీవంగానే ఉంటాయి.
Jun 4, 2026 6:44PMబాలు, సుశీల కంటే నాకే ఎక్కువ క్రేజ్ ఉండేది: ఎల్.ఆర్.ఈశ్వరి కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ సంగీత ప్రపంచంలో ఒకప్పుడు తనదైన ప్రత్యేకమైన గొంతుతో, ఊపు ఊపేసే పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అలనాటి మేటి గాయని ఎల్.ఆర్. ఈశ్వరి (L.R. Eswari). ఆమె పాడితే థియేటర్లలో ఈలలు, గోలలు ఖాయం. క్లబ్ సాంగ్స్ అన్నా, మాస్ బీట్స్ అన్నా అప్పట్లో కేవలం ఈశ్వరి పేరు మాత్రమే వినిపించేది.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ సీనియర్ సింగర్ తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు తనకు ఎలాంటి క్రేజ్ ఉండేదో గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో లెజెండరీ సింగర్స్ అయిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి వంటి మహామహుల కంటే కూడా తనకే ఎక్కువ క్రేజ్ ఉండేదని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు.నేను ఒకసారి స్టేజ్ ఎక్కానంటే చాలు, అక్కడ వాతావరణమే మారిపోయేది అని ఎల్.ఆర్. ఈశ్వరి అన్నారు. బాలు, సుశీల, జానకి వంటి వారు ఎంతో అద్భుతమైన మెలోడీ పాటలు పాడేవారని, కానీ వారు స్టేజ్ పైన పాడుతున్నప్పుడు ప్రేక్షకులు ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కూర్చుని వినేవారని తెలిపారు. కానీ, తాను స్టేజ్ పైకి వచ్చి మైక్ పట్టుకుని ఒక్కసారి పాడటం మొదలుపెడితే, జనాలు కుర్చీల్లో కూర్చోలేకపోయేవారని, థియేటర్లలో మరియు ఆడిటోరియమ్స్లో క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరూ లేచి డాన్సులు చేసేవారని ఆమె ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.ఆ సమయంలో తనకు వచ్చిన పాపులారిటీ మరియు క్రేజ్ ఇండస్ట్రీలో ఎవరికీ రాలేదని ఆమె స్పష్టం చేశారు. అప్పట్లో వందలాది సూపర్ హిట్ సినిమాలలో వందకు పైగా మరుపురాని ఐటెం సాంగ్స్, హై-ఎనర్జీ నంబర్లను ఆమె పాడారు. తన పాట వినపడితే చాలు సినిమా 100 రోజులు ఆడటం గ్యారెంటీ అనే నమ్మకం అప్పటి దర్శకుల్లో, నిర్మాతల్లో ఉండేదని ఆమె పేర్కొన్నారు. ఆ క్రేజ్ వల్లే తనను స్టేజ్ షోల కోసం విదేశాల నుండి సైతం భారీ ఆఫర్లతో ఆహ్వానించేవారని తెలిపారు. ఇప్పటికీ తన పాటల సృష్టించిన వైబ్ టాలీవుడ్లో ప్రత్యేకమైనదని, ఆనాటి రోజులు మళ్లీ రావని ఎల్.ఆర్. ఈశ్వరి ఎమోషనల్ అయ్యారు.
Jun 4, 2026 6:16PM'జ్యోతి' చిత్రానికి 50 ఏళ్లు.. డైలాగ్స్ టేప్ రికార్డర్లో చేసి డబ్బింగ్కి వెళ్లారు!
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నో గొప్ప సినిమాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఆయా సినిమాలను పదే పదే చూసేలా రూపొందించడంలో అప్పటి దర్శకులు ఎంత శ్రద్ధ పెట్టారో ఆ సినిమాలను చూస్తే మనకు అర్థమవుతుంది. టాలీవుడ్లో గొప్ప దర్శకులుగా పేరు తెచ్చుకున్న చాలా మంది డైరెక్టర్ల కెరీర్లో కొన్ని అపురూప చిత్రాలు ఉంటాయి. అవి నిజంగానే అపురూప చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. అలాంటి దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు. ఆయన దర్శకత్వంలో రూపొందిన రెండో సినిమా జ్యోతి అలాంటి జాబితాలోకే వస్తుంది. 1976 జూన్ 4న విడుదలైన ఈ సినిమా నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కథానాయికగా నటించిన జయసుధ జ్యోతి చిత్రానికి సంబంధించిన కొన్ని మధుర స్మృతుల్ని నెమరు వేసుకున్నారు. 'మమతల కోవెల అనే నవల ఆధారంగా జ్యోతి చిత్రాన్ని రూపొందించడం జరిగింది. నిర్మాత క్రాంతికుమార్ గారు నవలలు విపరీతంగా చదివేవారు. ఈ విషయంలో ఆయనకు పరిజ్ఞానం ఎక్కువ. అందుకే ఈ నవలను సినిమాగా తియ్యాలని భావించారు. అప్పటికి నేను శోభన్బాబుతో బాబు సినిమా చేశాను. నా రెండో సినిమా జ్యోతి. ఒక అద్భుతమైన కథతో ఈ సినిమాను 28 రోజుల్లో పూర్తి చేశాం. జ్యోతి పాత్ర పోషించిన జయసుధ ఎంతో చలాకీగా, మరెంతో గంభీరంగా నటించారు. సినిమాలో ప్రధానంగా ఉండే రాజయ్య పాత్రలో గుమ్మడిగారు ఎంతో అద్భుతంగా నటించారు. ఆ పాత్రకు ఆయన జీవం పోశారని చెప్పాలి. అలాగే మురళీమోహన్గారు కూడా తన పాత్రకు న్యాయం చేశారు. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకోవడం, నా కెరీర్లోనే ఒక అద్భుతమైన సినిమాగా నిలిచిపోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా మా కుటుంబంలోని అందరికీ నచ్చింది. సాధారణంగా సినిమాల్లో పాటల చిత్రీకరణకు కొరియోగ్రాఫర్ల అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ, జ్యోతి సినిమాలో ఉన్న నాలుగు పాటలకు ఎలాంటి కొరియోగ్రాఫర్ లేకుండా ఆ బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. ఆ రోజుల్లో లొకేషన్ లో డైలాగ్స్ రికార్డ్ చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేనందున, కేవలం ఒక టేప్ రికార్డర్ సహాయంతో డైలాగ్స్ అన్నింటినీ రికార్డ్ చేసి, నేరుగా డబ్బింగ్ థియేటర్కు తీసుకువెళ్లి సినిమాను పూర్తి చేశాం. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఒక గొప్ప కళాఖండంగా కొనియాడారు. ముఖ్యంగా విన్సెంట్ గారి అద్భుతమైన కెమెరా పనితనం, చక్రవర్తి గారి సంగీతం, మరియు సత్యానంద్ గారి సంభాషణలు సినిమాకు ప్రాణం పోశాయి. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్గా నిలిచి, ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. జ్యోతి సినిమా సాధించిన ఘన విజయం నా సినీ జీవితంలోనే అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇప్పటికీ నేను నిర్వహించే డైరెక్షన్ క్లాసెస్లో ఒరిజినల్ లొకేషన్స్లో నాచురల్ లైటింగ్లో సీన్స్ ఎలా తీయాలనే విషయాలను వివరించడానికి జ్యోతి సినిమాలోని సన్నివేశాలనే ఉదాహరణగా చూపిస్తాను. యాభై ఏళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణంలో జ్యోతి సినిమా గురించి గుర్తుచేసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది అన్నారు. ఈ యాభై ఏళ్ల ప్రయాణంలో ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఆ సినిమా నిలిచి ఉండటం, ఈ రోజు దాని గురించి మాట్లాడగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చేసే సమయానికి నా వయసు కేవలం 17 ఏళ్లు. అంత చిన్న వయసులోనే 'జ్యోతి' లాంటి ఎంతో పరిణతి, గాంభీర్యం ఉన్న ఒక సంక్లిష్టమైన, కఠినమైన పాత్రను చేయడం నిజంగా ఒక పెద్ద సవాలు. అయితే, 17 ఏళ్ల అమ్మాయి నుండి అంతటి అద్భుతమైన నటనను రాబట్టుకున్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుగారికే ఆ క్రెడిట్ దక్కుతుంది. స్కూల్లో చిన్న పిల్లలకి పాఠాలు చెప్పినట్లు, ఎలాంటి భయమూ ఇబ్బందీ కలగకుండా ఎంతో సరదాగా నాతో ఈ సినిమా చేయించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత స్క్రీన్ మీద నా నటన చూసి నేనే కాదు, మా అమ్మానాన్న కూడా ఆశ్చర్యపోయారు' అని గుర్తు చేసుకున్నారు రాఘవేంద్రరావు. సహజ నటి జయసుధ ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు తెలియజేస్తూ ‘ఈ చిత్రంలోని "సిరిమల్లె పువ్వల్లే నవ్వు" పాట ఇప్పటికీ ఎవర్గ్రీన్ హిట్ అనే విషయం మీకు తెలుసు. ఈ పాట వెనుక ఒక ఫన్నీ విషయం ఉంది. ఈ పాటలో ఎస్. జానకిగారి నవ్వుకు మ్యాచ్ చేస్తూ నేను కెమెరా ముందు నవ్వాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో నాకు అస్సలు నవ్వు వచ్చేది కాదు. దాంతో కెమెరా వెనుక చిత్ర యూనిట్ సభ్యులు కోతుల్లాగా ప్రవర్తిస్తూ, వింత వింత ముఖాలు పెడుతూ జోకులు వేస్తే తప్ప నాకు నవ్వు రాలేదు. అంతలా కష్టపడి ఆ నవ్వును రప్పించారు. కేవలం జ్యోతి మాత్రమే కాదు, రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో ఆమె కథ, ప్రేమలేఖలు, అమరదీపం వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నేను నటించాను. ఈ క్లాసిక్ సినిమా నిర్మాణంలో మురళీమోహన్గారి అద్భుత నటన, గుమ్మడిగారు, సత్యనారాయణగారు, ఛాయాదేవిగారు వంటి దిగ్గజాల పాత్రలు మరువలేనివి. అలాగే టెక్నికల్గా విన్సెంట్గారి ఫోటోగ్రఫీ, అద్భుతమైన సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇలాంటి గొప్ప కథను నమ్మి, కమర్షియల్ లెక్కలు చూసుకోకుండా సినిమా తీసిన క్రాంతికుమార్గారు చాలా గొప్ప నిర్మాత. నాటి తరం అద్భుత సృష్టి అయిన ఈ బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని ప్రస్తుత తరం యువత కూడా తప్పకుండా చూడాలి. వీలైతే ఈ సినిమాను కలరైజ్ చేసి నేటి జనరేషన్ ముందుకు తీసుకువస్తే ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంటూ తన మనసులోని మాటను తెలిపారు సహజనటి జయసుధ.
Jun 4, 2026 2:08PMIlaiyaraaja: ఇళయరాజా సృష్టించిన రికార్డులు.. ఒక్క రోజులోనే రీ-రికార్డింగ్, 5 జాతీయ అవార్డులు!
(జూన్ 3 ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా..) భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్యానికి అప్రతిహత మహారాజు, ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా. భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రను 'ఇళయరాజాకు ముందు.. ఇళయరాజా తర్వాత' అని ఖచ్చితంగా విభజించవచ్చు. తన అద్భుతమైన స్వరాలతో, ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో దాదాపు 5 దశాబ్దాలుగా తన స్వరవాణి వినిపిస్తున్నారు ఇళయరాజా. తన కెరీర్లో ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 1540కి పైగా సినిమాలకు సంగీతం అందించారు అంటే ఆయన పాటలకు ఎన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులోని తేని జిల్లా పన్నైపురంలో 1943 జూన్ 3న ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు ఇళయరాజా. ఆయన అసలు పేరు జ్ఞానదేశికన్. చిన్నతనం నుంచే సంగీతంపై విపరీతమైన మక్కువ పెంచుకున్నారాయన. తన అన్నగారైన పావలర్ వరదరాజన్ నేతృత్వంలోని సంగీత బృందంలో చేరి, ఊరూరా తిరుగుతూ వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ఆ అనుభవమే ఆయన్ను మద్రాస్ వైపు నడిపించింది. మద్రాస్కు వచ్చిన తర్వాత ప్రముఖ వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ ప్రొఫెసర్ ధనరాజ్ మాస్టర్ వద్ద పియానో, వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నారు. ఆ తర్వాత లండన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి క్లాసికల్ గిటార్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాత ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ వద్ద అసిస్టెంట్గా చేరి దాదాపు 200 సినిమాలకు పనిచేశారు. ఇళయరాజా ప్రతిభను గుర్తించి, ఆయనకు సంగీత దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన దర్శకుడు పంజు అరుణాచలం. 1976లో వచ్చిన ‘అన్నకిలి’ అనే తమిళ చిత్రం ద్వారా ఇళయరాజా పరిచయమయ్యారు. ఈ సినిమాకు ఆయన అందించిన జానపద, శాస్త్రీయ సంగీత సమ్మేళనం ఒక సంచలనం సృష్టించింది. ఆ సినిమాలోని పాటలు ఊరు వాడ మారుమోగిపోయాయి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకున్నారాయన. ఐదు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఈ స్వర ప్రయాణంలో ఇళయరాజా సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. కేవలం పాటలే కాదు, సినిమాకు ప్రాణం పోసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆయనొక లెజెండ్. కేవలం ఒకే ఒక్క రోజులో ఒక సినిమాకు రీ-రికార్డింగ్ పూర్తి చేసిన రికార్డులు కూడా ఆయన సొంతం. 'సాగరసంగమం', 'స్వాతిముత్యం', 'రుద్రవీణ', 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'గీతాంజలి', 'అన్వేషణ' వంటి చిత్రాలకు ఆయన ఇచ్చిన సంగీతం తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్స్గా నిలిచిపోయాయి. ఆయన చేసిన సినిమాల్లో ఇవి మచ్చుకు మాత్రమే. ఆయన స్వరపరిచిన సినిమాల పూర్తి వివరాలను ఇవ్వడం అనేది సాహసంతో కూడిన ప్రయత్నమే అవుతుంది. ప్రతి భాషలోనూ ఆయన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ చేశారు. సంగీత ప్రపంచానికి ఇళయరాజా చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం.. దేశంలోని అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్లతో గౌరవించింది. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా 5 జాతీయ అవార్డులను అందుకున్నారు. రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన సేవలు అందించారు. ఇళయరాజా కేవలం ఒక సంగీత దర్శకుడు మాత్రమే కాదు, ఒక తరం భావోద్వేగం. సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా.. సగటు మనిషికి ఆయన పాట ఒక ఔషధంలా పనిచేస్తుంది. చిత్ర పరిశ్రమకు ఎంతో మంది సంగీత దర్శకులు వచ్చినప్పికీ ఇళయరాజా శైలి వారందరికీ విభిన్నం. ఆయన తరహాలో సంగీతం అందించిన సంగీత దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Jun 3, 2026 5:35PM
ఎన్టీఆర్ మరణించినప్పుడు ఏఎన్నార్ చేసిన కామెంట్స్ ఇవే.. 30 ఏళ్ల తర్వాత బయటపడ్డ సంచలన వీడియో!
తెలుగు సినీ పరిశ్రమను దశాబ్దాల పాటు తమ భుజస్కంధాలపై మోసిన ఇద్దరు మహానుభావులు నందమూరి తారకరామారావు (NTR), అక్కినేని నాగేశ్వరరావు (ANR). వెండితెరపై వీరిద్దరూ పోటీ పడి నటించినప్పటికీ, నిజజీవితంలో మాత్రం ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. అన్నదమ్ముల్లా ఉంటూ, తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు. అయితే, ఎన్టీఆర్ మరణించిన సమయంలో అక్కినేని నాగేశ్వరరావు స్పందన ఎలా ఉంది? ఆయన ఎలాంటి మానసిక వేదనను అనుభవించారు? అనే విషయాలకు సంబంధించిన ఓ అరుదైన వీడియో ఏకంగా 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తన ఆప్తమిత్రుడైన ఎన్టీఆర్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మహానటుడు ఎన్టీఆర్ ఇక లేరనే వార్తను తాను అస్సలు నమ్మలేకపోయానని ఆయన ఆవేదన చెందారు. ఆ విషాద సమయంలో తన మనసులో కలిగిన భావాలను, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అక్కినేని ఎమోషనల్ అయ్యారు. ఎన్టీఆర్ భౌతికకాయాన్ని చూసినప్పుడు తనకు కలిగిన శూన్యతను ఆయన మాటల్లో వర్ణించడం ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, ఏఎన్నార్ జోడీ ఒక సువర్ణ అధ్యాయం. పౌరాణిక, జానపద పాత్రలకు ఎన్టీఆర్ ప్రాణం పోస్తే, సాంఘిక, ప్రేమ కథా చిత్రాలతో అక్కినేని ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఒకరి విజయాలను చూసి మరొకరు స్ఫూర్తి పొందుతూ ఎదిగిన తీరును ఈ వీడియోలో అక్కినేని గుర్తుచేసుకున్నారు. సినిమా రంగంలో తామిద్దరం ఎన్నో రికార్డులను సృష్టించామని, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి క్లాసిక్ సినిమాలతో అలరించామని గుర్తుచేసుకున్నారు. ఒకే కాలంలో ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నా, ఎక్కడా ఇగోలకి పోకుండా ఆరోగ్యకరమైన పోటీని కొనసాగించడమే తమ విజయ రహస్యమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వంటి గొప్ప నటుడు, నాయకుడు మళ్లీ పుట్టరని, ఆయన మరణం తెలుగు జాతికే తీరని లోటని ఏఎన్నార్ ఎంతో భావోద్వేగంతో చెప్పారు. ఎన్టీఆర్ కేవలం ఒక నటుడు లేదా నాయకుడు మాత్రమే కాదని, ఆయన ఒక అజేయమైన శక్తి అని కొనియాడారు. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ అరుదైన వీడియో ఇప్పుడు ఇరు హీరోల అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాటి సినీ దిగ్గజాల మధ్య ఉన్న నిఖార్సయిన స్నేహ బంధాన్ని చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పటి తరం హీరోలు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
May 27, 2026 12:11PM‘భక్త కన్నప్ప’కు 50 ఏళ్లు: రెబల్స్టార్ కృష్ణంరాజు కెరీర్ను మలుపు తిప్పిన క్లాసిక్!
టాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో కొన్ని సినిమాలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి అపురూప దృశ్యకావ్యాల్లో రెబల్స్టార్ కృష్ణంరాజు కథానాయకుడిగా నటించిన ‘భక్త కన్నప్ప’ అగ్రస్థానంలో ఉంటుంది. భక్తిరస చిత్రాలను సరికొత్త పంథాలో ఆవిష్కరించిన ఈ అద్భుత కావ్యం 1976 మే 26న విడుదలైంది. 2026 మే 26కి విజయవంతంగా 50 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సినీ ప్రియులు, కృష్ణంరాజు అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. కెరీర్ ప్రారంభంలో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్న పాత్రలు పోషించిన కృష్ణంరాజుకు సరైన బ్రేక్ రావడం లేదని భావించిన తరుణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అప్పట్లో వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన మరియు ఆయన సోదరుడు సూర్యనారాయణరాజు గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే దర్శకరత్న బాపు, ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణల కాంబినేషన్లో గోపీకృష్ణా మూవీస్ బ్యానర్పై ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించారు. కన్నడలో ఘనవిజయం సాధించిన ‘బేడర కన్నప్ప’ కథకు మరింత నాటకీయతను జోడించి బాపు-రమణలు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అర్జునుడి మరుజన్మ వృత్తాంతంతో మొదలయ్యే తిన్నడి కథ, శివభక్తితో పరవశించిపోయి కళ్లనే దానం చేసే పరమార్థం వరకు ప్రతి ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తీరు అమోఘం. అమాయకమైన గిరిజన యువకుడిగా, ఆపై పరమ శివభక్తుడిగా కృష్ణంరాజు ఒదిగిపోయిన తీరు ఆయన నటనకు కొత్త మైలురాయిని అందించింది. ఈ చిత్రంలో కృష్ణంరాజు సరసన వాణిశ్రీ కథానాయికగా నటించగా, రావుగోపాలరావు, శ్రీధర్, ప్రభాకరరెడ్డి వంటి సీనియర్ తారాగణం కీలక పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు సత్యం అందించిన బాణీలు, వేటూరి, ఆరుద్ర, సినారె కలాల నుంచి జాలువారిన పాటలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా "శివ శివ శంకర... భక్త వశంకర..." అనే గీతం నేటికీ ప్రతి శివరాత్రి పర్వదినాన మారుమోగు తూనే ఉంటుంది. ఎక్కువ భాగం అవుట్డోర్ లోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. విభిన్నమైన లుక్లో కనిపించిన రెబల్స్టార్ కృష్ణంరాజుకు ఈ చిత్రం స్టార్డమ్ తెచ్చిపెట్టింది. అప్పట్లోనే ఈ పౌరాణిక చిత్రం భారీ వసూళ్లను సాధించడమే కాకుండా, అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అంతేకాదు, కృష్ణంరాజు సినీ ప్రస్థానంలో తొలిసారిగా 200 రోజులు ప్రదర్శించబడిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘భక్త కన్నప్ప’ సినిమాకు సంబంధించిన అరుదైన వర్కింగ్ స్టిల్స్, రికార్డుల వివరాలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నాలుగున్నర దశాబ్దాలు దాటినా ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ ఏమాత్రం తగ్గలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేటి తరం దర్శకులకు కూడా ఈ సినిమా ఒక మాస్టర్ క్లాస్ లాంటిదని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో టాలీవుడ్ నుంచి మరెన్నో భక్తిరస విజువల్ వండర్స్ రాబోతున్నప్పటికీ, ‘భక్త కన్నప్ప’ సాధించిన క్లాసిక్ స్టేటస్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. విలక్షణ నటనతో, విజువల్ గ్రాండ్నెస్తో మెప్పించిన ఈ అద్భుత చిత్రం తెలుగు సినీ చరిత్రలో సమున్నత స్థానంలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
May 25, 2026 7:46PMఒక భర్త ఆస్తితో పారిపోయాడు, మరో భర్త ప్రమాదవశాత్తు చనిపోయాడు.. ఇదొక విషాదగాథ!
వెండితెరపై వెలుగులీనే తారల జీవితాలు పైకి కనిపించినంత రంగులమయంగా ఉండవని నిరూపించే సంఘటనలు సినీ పరిశ్రమలో ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు అగ్ర కథానాయకులతో జోడీ కట్టి, అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించిన నటీమణులు వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. అలాంటి వారిలో అలనాటి ప్రముఖ కథానాయిక కమలా కొట్నీస్ ఒకరు. బ్రిటీష్ అధికారికి, తెలుగు మహిళకు జన్మించి, ఆ తర్వాత రాయల్ ఫ్యామిలీలో పెరిగిన ఆమె జీవితంలో ఊహించని విషాదాలు చోటుచేసుకున్నాయి. సినిమాల్లో స్టార్ హోదాను అనుభవిస్తున్న సమయంలోనే కమలా కొట్నీస్ బాంబేకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ డి.ఎస్. కొట్నీస్ సోదరుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, అందరూ ఆమె జీవితం సాఫీగా సాగిపోతుందని భావిస్తున్న తరుణంలో భర్త రూపంలో ఆమెకు పెద్ద షాక్ తగిలింది. 1949లో ఆమె కష్టపడి సంపాదించిన డబ్బు, విలువైన నగలను తీసుకుని ఆమె భర్త ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. ఈ నమ్మకద్రోహంతో తీవ్ర అవమానానికి గురైన ఆమె, ఆ తర్వాత తన పేరు పక్కన ఉన్న కొట్నీస్ అనే ఇంటిపేరును కూడా తొలగించుకున్నారు. ఆ తర్వాత కాలంలో చంద్రదేవ్ సింగ్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించినప్పటికీ, విధి ఆమెను కరుణించలేదు. 1967లో ఆమె రెండో భర్త ఒక ప్రమాదవశాత్తూ సరస్సులో పడి ప్రాణాలు కోల్పోవడంతో కమలా కొట్నీస్ జీవితం మళ్లీ చీకట్లోకి నెట్టబడింది. అంతకుముందు సొంతంగా 'సతీ అహల్య' అనే సినిమాను నిర్మించి భారీ నష్టాలను చవిచూడటంతో ఆమె ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా ప్రస్థానాన్ని పరిశీలిస్తే, కమలా కొట్నీస్ బాలీవుడ్ లెజెండ్ దేవానంద్ సరసన ఆయన తొలి చిత్రం ‘హమ్ ఏక్ హై’లో హీరోయిన్గా నటించి మెప్పించారు. ఆ తర్వాత సుహాగన్, ఆగే బడో వంటి పలు హిందీ చిత్రాల్లోనూ వీరిద్దరి జోడీ అలరించింది. ఇక తెలుగులో సీ.హెచ్. నారాయణరావు సరసన ‘జీవనజ్యోతి’ చిత్రంతో పాటు బాలనాగమ్మ, చెంచులక్ష్మి, భాగ్యలక్ష్మి వంటి క్లాసిక్ సినిమాలలో నటించి తనదైన ముద్ర వేశారు. నటనలోనే కాకుండా కమలా కొట్నీస్కు వ్యక్తిగతంగా ఎన్నో ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉండేవి. ఆ రోజుల్లోనే ఆమె సావిత్రి గారిలాగా ఎంతో వేగంగా కార్లు, మోటార్ బైకులు నడిపేవారు. స్పోర్ట్స్ కార్ రేసింగ్ పోటీల్లో సైతం పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, టెన్నిస్ ఆడటంలోనూ ఆమె సిద్ధహస్తురాలు. తెలుగు చిత్రసీమలో ప్లేబ్యాక్ సింగింగ్ ప్రారంభమైన కొత్తలో రావు బాలసరస్వతి దేవి పాడిన తొలి పాట కూడా ఈమె కోసమే కావడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పాతతరం నటీనటుల బయోపిక్లు, వారి జీవిత విశేషాలపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కమలా కొట్నీస్ జీవితంలో జరిగిన ఈ షాకింగ్ మోసం, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు నెట్టింట వైరల్గా మారి సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎంతో ధైర్యంగా, స్వయంకృషితో ఎదిగిన ఒక అరుదైన నటి కథ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
May 21, 2026 12:39PMఎస్వీ రంగారావు మరణం తర్వాత ఆ 24 గంటలు ఏం జరిగింది? భార్య లీలావతి ఎందుకలా చేశారు?
తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహానటుడు, విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు. వెండితెరపై ఆయన చూపించిన రాజసం, పలికించిన హావభావాలు ఇప్పటికీ అజరామరం. అయితే, అంతటి గొప్ప నటుడి జీవిత చరమాంకం, ముఖ్యంగా ఆయన కన్నుమూసిన తర్వాత చోటుచేసుకున్న కొన్ని సంఘటనలు వింటే ఇప్పటికీ సినీ అభిమానుల గుండెలు తరుక్కుపోతాయి. ఆయన మరణించి దశాబ్దాలు గడుస్తున్నా ఎస్వీఆర్ నట వారసత్వం నేటికీ సజీవంగానే ఉంది. ‘నర్తనశాల’ చిత్రంలో కీచకుడిగా ఆయన చేసిన నటనకు జకార్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. అంతటి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఏకైక భారతీయ నటుడు ఆయనే కావడం విశేషం. తెరపై ఎంత గంభీరంగా కనిపించినా, నిజ జీవితంలో ఎస్వీఆర్ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారని ఇండస్ట్రీ పెద్దలు చెబుతుంటారు. అయితే, చివరి రోజుల్లో ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఒకానొక దశలో షూటింగ్ సమయంలోనే గుండెపోటు రావడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్యులు విశ్రాంతి తీసుకోమని హెచ్చరించినా, ‘యశోద కృష్ణ’ సినిమాలో కంసుడి పాత్రను పూర్తి చేయాలనే పట్టుదలతో ఆయన వెనక్కి తగ్గలేదు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే అమెరికా వెళ్లి బైపాస్ సర్జరీ చేయించుకుంటానని పిల్లలకు మాట ఇచ్చారు. కానీ విధి విచిత్రమైనది, ఆ సమయం ఆయనకు దక్కలేదు. 1974 జూలై 18వ తేదీన ఎస్వీ రంగారావు ఇంట్లోనే మధ్యాహ్నం భోజనం ముగించి విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం వేళ నిద్రలేచిన తర్వాత ఇంట్లో కొంత గందరగోళం నెలకొంది. ఆ మానసిక ఒత్తిడిలో ఆయన బాత్రూమ్లోకి వెళ్లి మద్యం సేవించి, బయటకు వచ్చి బట్టలు మార్చుకునే క్రమంలో మంచంపై కుప్పకూలిపోయారు. అది ఆయన ఆఖరి శ్వాస అని తెలిసి ఇండస్ట్రీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. రామానాయుడు వంటి ప్రముఖులు వెంటనే ఆయన నివాసానికి చేరుకున్నారు. కానీ, అక్కడ అందరికీ ఒక పెద్ద ఆశ్చర్యం ఎదురైంది. ఎస్వీఆర్ సతీమణి లీలావతికి ఆధ్యాత్మిక చింతన, పూజలపై విపరీతమైన నమ్మకం ఉండేది. తన గురువుగారికి చనిపోయిన వారిని బతికించే శక్తులు ఉన్నాయని ఆమె బలంగా నమ్మారు. ఆ గురువు పాండిచ్చేరిలో ఉండటంతో, ఆయన వస్తే తన భర్త మళ్లీ లేచి కూర్చుంటారనే భ్రమలో ఆమె దాదాపు 24 గంటల పాటు ఎవ్వరినీ భౌతికకాయాన్ని చూడనివ్వలేదు. చివరకు గురువుగారితో ఫోన్ సంప్రదింపులు సాధ్యం కాకపోవడంతో, వాస్తవాన్ని గ్రహించి ఎస్వీఆర్ పార్థివ దేహాన్ని కిందికి తీసుకువచ్చేందుకు అంగీకరించారు. ఆ తర్వాత చెన్నైలోని కన్నిమ్మపేట శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో శివాజీ గణేషన్, వాణిశ్రీ వంటి దిగ్గజాలు ఆయనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగు సినిమా చరిత్రలో ఎస్వీ రంగారావు లాంటి నటుడు మళ్లీ పుట్టలేరనేది నగ్నసత్యం. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఘటోత్కచుడిగా, రావణాసురుడిగా, కంసుడిగా ఆయన పోషించిన అమర పాత్రలు నేటికీ, రేపటికీ రాబోయే తరాలకు నటనకు ఒక నిఘంటువులా నిలిచిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
May 20, 2026 5:48PM
Jr NTR: ఆ క్వాలిటీస్ ఉన్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్!
ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హీరోల్లో నవరసాలూ పలికించగల హీరో ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున చెప్పే పేరు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను తన నటనలో ఎంతో ఈజీగా చూపించగల నటుడు ఎన్టీఆర్. ఏ షాట్ అయినా డైరెక్టర్కి కావాల్సిన విధంగా సింగిల్ టేక్లో చేసి ఓకే చెప్పించుకునే హీరో ఎన్టీఆర్. ‘నిన్ను చూడాలని’ చిత్రం నుంచి ‘వార్ 2’ వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, మాస్ యాక్షన్తో కూడిన సినిమాలు చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (Dragon) చిత్రం చేస్తున్నారు. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నందమూరి తారక రామారావుగా పిలవబడుతున్న ఎన్టీఆర్ అసలు పేరు తారక్రామ్. నందమూరి హరికృష్ణ తన కుమారులకు జానకిరామ్, కళ్యాణ్రామ్, తారక్రామ్ అనే పేర్లు పెట్టారు. చిన్నతనంలో తన పోలికలతోనే ఉన్న తారక్ని చూసిన సీనియర్ ఎన్.టి.ఆర్. అతనికి తన పేరు పెట్టమని హరికృష్ణకు చెప్పారు. అలా తారక్రామ్ కాస్తా నందమూరి తారక రామారావు అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ను మొట్టమొదటిసారి డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఎన్.టి.రామారావు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంతో హిందీ చిత్ర సీమకు పరిచయం చేశారాయన. ఎన్టీఆర్ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు గుణశేఖర్. ‘బాల రామాయణం’ చిత్రంలో ఎన్టీఆర్ బాలరాముడిగా నటించారు. ఈ సినిమా అప్పట్లో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు, ఎన్టీఆర్కు స్పెషల్ జ్యూరీ నంది అవార్డు కూడా లభించింది. డైరెక్టర్గా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎస్.ఎస్.రాజమౌళి.. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమయ్యారు. కమర్షియల్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న వి.వి.వినాయక్ ‘ఆది’ చిత్రంతో డైరెక్టర్ అయ్యారు. మెహర్ రమేష్ను ‘కంత్రి’ చిత్రంతో తెలుగులో డైరెక్టర్గా పరిచయం చేశారు ఎన్టీఆర్. అలాగే వక్కంతం వంశీ, కొరటాల శివ కూడా ఎన్టీఆర్ సినిమాల ద్వారానే రచయితలుగా పరిచయమయ్యారు. ఎన్టీఆర్ ఇప్పటివరకు 29 సినిమాల్లో నటించారు. కానీ, ఏ ఒక్క సినిమాలోనూ ఎన్టీఆర్ లుక్గానీ, గెటప్గానీ ఒకేలా ఉండవు. ప్రతి సినిమాకీ గెటప్ డిఫరెంట్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. టాలీవుడ్లో ఇప్పుడు హీరోలందరూ గడ్డాలతో కనిపిస్తున్నారు. ఈ ట్రెండ్ని స్టార్ట్ చేసింది ఎన్టీఆరే. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో గడ్డంతో ఒక కొత్త గెటప్లో కొన్ని సంవత్సరాల క్రితమే కనిపించారు ఎన్టీఆర్. ఓవర్సీస్లో వరసగా నాలుగు సినిమాలతో 1.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసిన మొదటి సౌత్ ఇండియన్ హీరో ఎన్టీఆర్. అలాగే ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోల్లో వరసగా ఆరు సూపర్హిట్ సినిమాలు ఇచ్చిన హీరో కూడా ఎన్టీఆర్ ఒక్కరే. ఇప్పుడు ఉన్న హీరోల్లో పౌరాణిక పాత్ర పోషించే కెపాసిటీ ఉన్న హీరో కూడా ఎన్టీఆర్ ఒక్కరే. చిన్నతనంలో బాల రామాయణంలో శ్రీరాముడిగా, ఆ తర్వాత యమదొంగ చిత్రంలో యముడి పాత్రను అద్భుతంగా పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. మాస్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగులు చెప్పగలడు. కానీ, కామెడీ పండించలేడు అనే విమర్శలకు ‘అదుర్స్’తో చక్కని సమాధానం ఇచ్చారు. ఆ చిత్రంలోని చారి పాత్రను అత్యద్భుతంగా పోషించి ఎలాంటి క్యారెక్టర్లోనైనా ఇమిడిపోగలనని ప్రూవ్ చేసుకున్నారు ఎన్టీఆర్. పాజిటివ్ క్యారెక్టర్సే కాదు, నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లను కూడా అవలీలగా చెయ్యగలనని టెంపర్లోని దయా క్యారెక్టర్తో ప్రూవ్ చేశారు. అలాగే ‘జై లవకుశ’ చిత్రంలో పూర్తి స్థాయిలో నెగెటివ్ క్యారెక్టర్తో మెప్పించారు. బాలీవుడ్ మూవీ 'వార్ 2'లోనూ స్టైలిష్ విలన్ గా మెప్పించారు. నటుడిగానే కాదు, సింగర్గా కూడా తన ప్రతిభ చాటుకున్నారు ఎన్టీఆర్. ఓలమ్మీ తిక్కరేగిందా, 123 నేనొక కంత్రి, చారి, రాకాసి రాకాసి, ఫాలో ఫాలో వంటి సూపర్హిట్ సాంగ్స్ పాడి తనలోని గాయకుడ్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ తను హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’ చిత్రంలోని ‘గెలెయా గెలెయా..’ అనే పాటను ఎన్టీఆర్తో పాడించుకున్నారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం అరుదుగా జరుగుతోంది. అలాంటిది 'దేవర' సినిమా డివైడ్ టాక్ తోనూ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది. 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ఎన్టీఆర్ వచ్చే ఏడాది ‘డ్రాగన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. కెజిఎఫ్ సిరీస్, సలార్ వంటి హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్స్ను రూపొందించిన ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ నుంచి పూర్తిస్థాయి మాస్ సినిమా వస్తుండటంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటున్నాయి. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ మైథలాజికల్ ఫిల్మ్ చేయనున్నారు ఎన్టీఆర్. ఇలా సినిమా సినిమాకీ హీరోగా తన రేంజ్ని పెంచుకుంటూ వెళ్తున్న ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.
May 20, 2026 10:40AMఅభిమానుల అభిరుచికే ఆ గౌరవం.. తన పాటలపై దివంగత రచయిత సిరివెన్నెల ఇంటర్వ్యూ వైరల్!
(మే 20 సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా..) తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్షరానికి ఆయువు పోసి, సామాన్యుడి గుండె చప్పుడిని సైతం తన కలంతో పలికించిన మహోన్నత శిఖరం దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన రాసిన అద్భుతమైన గీతాలు నేటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, పాటల ప్రస్థానంపై ఆయన చేసిన కొన్ని స్వీయ విమర్శలు, ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలను అందించిన శాస్త్రి గారు, అనుభవం పెరిగే కొద్దీ తన పాత రచనలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునేవాడినని తెలిపారు. ఈ క్రమంలో "ఈ పాట నేను అసలు రాయకుండా ఉంటే బాగుండేది" అని అనుకున్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయని ఆయన నిర్మొహమాటంగా అంగీకరించారు. వయసుతో పాటు ఆలోచనలు పక్వానికి వచ్చినప్పుడు, గతంలో తాను తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్లను గుర్తించడం ఒక రచయితగా తన బాధ్యతని పేర్కొన్నారు. ముఖ్యంగా ఒకానొక పాటలో తాను రాసిన “సెల్ ఫోన్ లో సొల్లు కారుస్తూ” అనే లైన్ గురించి ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతటి గొప్ప భావాలు పలికించే తన కలం నుంచి అలాంటి పదజాలం రావడం తనను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని, కానీ ఆశ్చర్యకరంగా ఆ పాట పెద్ద హిట్ అయిందని గుర్తుచేసుకున్నారు. సమాజంలో అలాంటి పదాలపై కనీసం విమర్శ కూడా రాకపోవడం, శ్రోతలు తనను ఎందుకు ప్రశ్నించలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినిమాల్లో సందర్భాన్ని బట్టి పాటలు రాసే క్రమంలో ప్రారంభ రోజుల్లో ఒకటి రెండు చోట్ల తాను హద్దులు దాటినట్లు అనిపించిందని సిరివెన్నెల చెప్పుకొచ్చారు. అవి పెద్దగా ప్రజాదరణ పొందకపోవడం ఒక రకంగా మంచిదే అయిందని భావించినట్లు తెలిపారు. శత్రువు కంటే కూడా తనను తాను విమర్శించుకునే వాడే నిజమైన ఎదుగుదలను సాధిస్తాడని, నిరంతర ఆత్మవిమర్శే తనను మరింత మెరుగైన రచయితగా తీర్చిదిద్దిందని ఈ లెజెండరీ కవి స్పష్టం చేశారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'సిరివెన్నెల' చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన సీతారామశాస్త్రి.. మొదటి సినిమాతోనే తన పేరును ఇంటిపేరుగా మార్చుకున్నారు. శృతిలయలు, గాయం, క్షణక్షణం, నువ్వే కావాలి, త్రివిక్రమ్, రాజమౌళి చిత్రాల వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు వేలాది పాటలతో టాలీవుడ్ను ఏలారు. ఆయన పాటల్లోని తాత్వికత, సామాజిక స్పృహ నేటి తరానికి ఎప్పటికీ ఒక మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈ పాత ఇంటర్వ్యూ క్లిప్స్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుండటంతో నెటిజన్లు, సినీ అభిమానులు లక్ష్మీనారాయణ అవతారమైన ఆ వాగ్దేవి పుత్రుడి గొప్పతనాన్ని కొనియాడుతున్నారు. తప్పులను ఒప్పుకునే అంతటి సంస్కారం, స్వీయ విమర్శ చేసుకునే గొప్ప మనసు ఒక్క సిరివెన్నెల గారికే సాధ్యమని కామెంట్లు పెడుతున్నారు. అక్షర బ్రహ్మ సిరివెన్నెల భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన విడిచివెళ్లిన సాహిత్య సంపద, ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు టాలీవుడ్ వర్ధమాన రచయితలకు మరియు రాబోయే తరాల కవులకు ఎల్లప్పుడూ దిక్సూచిలా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
May 19, 2026 8:35PM
ఇండియన్ సినిమాను ఏలిన తొలి 'ఫీమేల్ సూపర్ స్టార్'.. మహిళ కాదు ఒక మగాడు!
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన రహస్యం చాలా మంది సినీ ప్రియులకు ఇప్పటికీ తెలియదు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన 'తొలి ఫీమేల్ స్క్రీన్ స్టార్' ఒక మహిళ కాదు.. ఒక పురుషుడు. అవును, మూకీ చిత్రాల (Silent Era) కాలంలో ఒక పురుష నటుడు వెండితెరపై స్త్రీ పాత్రలు పోషించి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు. ఆయనే అన్నా సాలుంకే (Anna Salunke). భారత సినీ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన చాప్టర్గా నిలిచిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ అద్భుతమైన కథ 1913 లో ప్రారంభమైంది. భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke) భారతదేశపు మొట్టమొదటి పూర్తి నిడివి ఫీచర్ ఫిల్మ్ 'రాజా హరిశ్చంద్ర' (Raja Harishchandra) రూపకల్పనకు సిద్ధమయ్యారు. కానీ, ఆ సమయంలో ఆయనకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఆ రోజుల్లో నాటకాల్లో లేదా సినిమాల్లో మహిళలు నటించడం సామాజికంగా అంగీకరించబడలేదు. దీనివల్ల ఏ మహిళా కూడా సినిమాలో నటించడానికి ముందుకు రాలేదు. రాణి తారామతి పాత్ర కోసం ఫాల్కే ఎంతో మందిని సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఆ క్లిష్ట సమయంలోనే అన్నా సాలుంకే రంగప్రవేశం చేశారు. సినిమా పరిశ్రమలోకి రాకముందు సాలుంకే ఒక రెస్టారెంట్లో పని చేసేవారని సమాచారం. ఆయనకున్న సన్నటి శారీరక ఆకృతి, ముఖంలో పలికే హావభావాలు దాదాసాహెబ్ ఫాల్కేను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో ఆయనను రాణి తారామతి పాత్రకు ఎంపిక చేశారు. వెండితెరపై ఆ అందమైన, హుందాతనమైన రాణి పాత్రను చూసిన ప్రేక్షకులు.. ఆమె నిజానికి ఒక మగ నటుడనే విషయాన్ని అస్సలు ఊహించలేకపోయారు. ఆ రోజుల్లో సినిమాలు మూకీ (మాటలు లేనివి) కావడం వల్ల, నటీనటులు కేవలం తమ ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్పైనే పూర్తిగా ఆధారపడాల్సి వచ్చేది. అన్నా సాలుంకే ఈ రెండింటిలోనూ అద్భుతమైన ప్రతిభను కనబరిచి, ఒక్క మాట మాట్లాడకుండానే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన పాపులారిటీ ఎంతలా పెరిగిందంటే, ఆ తరంలోనే మోస్ట్ టాక్డ్-అబౌట్ స్టార్గా నిలిచారు. ఆ తర్వాత 1917 లో వచ్చిన 'లంకా దహన్' (Lanka Dahan) సినిమాతో ఆయన మరో మైలురాయిని అందుకున్నారు. ఈ చిత్రంలో అన్నా సాలుంకే ఒకేసారి శ్రీరాముడు, సీత.. రెండు పాత్రలనూ పోషించి భారత చలనచిత్ర చరిత్రలోనే మొట్టమొదటి 'ద్విపాత్రాభినయం' (Dual Role) చేసిన నటుడిగా రికార్డు సృష్టించారు. అన్నా సాలుంకే తన కెరీర్లో 'రాజా హరిశ్చంద్ర' (1913), 'లంకా దహన్' (1917), 'కాళీయ మర్దన్' (1919), 'సత్యనారాయణ' (1922), 'బుద్ధదేవ్' (1923), 'భక్త ప్రహ్లాద్' (1926), 'నల దమయంతి' (1927) వంటి ఎన్నో మైలురాళ్లలాంటి మూకీ చిత్రాలలో నటించి భారత సినీ పునాదిని బలోపేతం చేశారు. నేడు వెండితెరపై జెండర్ ట్రాన్స్ఫార్మేషన్ (పురుషులు స్త్రీ పాత్రలు వేయడం) గురించి గొప్పగా మాట్లాడుకుంటారు, కానీ 110 సంవత్సరాల క్రితమే భారతీయ సినిమా ఈ సాహసోపేతమైన ప్రయోగాన్ని చేసి గెలిచింది. అన్నా సాలుంకే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు.. భారత సినీ రంగ ఆరంభ శకానికి భయం లేని ప్రతీకగా, దేశాన్ని తన నటనతో మెప్పించిన అద్భుతమైన తొలి 'స్క్రీన్ క్వీన్'గా చరిత్రలో నిలిచిపోయారు.
May 19, 2026 7:02PMఏడుగురు ముఖ్యమంత్రులతో నటించిన ఏకైక నటి.. ఆచి మనోరమ అరుదైన రికార్డు!
దక్షిణ భారత చలనచిత్ర రంగంలో 'ఆచి' మనోరమ పేరు తెలియని వారుండరు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న ఈ మహానటి కేవలం ఒక హాస్యనటిగానే కాకుండా, అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా తనదైన ముద్ర వేశారు. అయితే, ఆమె కెరీర్లో అన్నిటికంటే ఆసక్తికరమైన మరియు ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డు ఉంది. అదేమిటంటే, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన ఏడుగురు దిగ్గజాలతో ఆమె వెండితెరపై నటించడం. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇలాంటి ఘనత సాధించిన ఏకైక నటి బహుశా మనోరమే కావొచ్చు. మనోరమ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వారు ఎవరంటే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైతో తన కెరీర్ ప్రారంభంలో నటించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో కూడా ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తమిళనాట దేవుడిగా కొలవబడే ఎంజీఆర్ సరసన అనేక సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. జయలలితతో మనోరమకు మంచి అనుబంధం ఉండేది. వీరిద్దరూ ఎన్నో హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. తెలుగు తేజం, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్తో కలిసి వెండితెరపై ఆమె సందడి చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నటుడిగా ఉన్న సమయంలో మనోరమతో కలిసి నటించారు. కోలీవుడ్లో టాప్ హీరోగా ఉన్న విజయ్ రాజకీయ ప్రవేశం చేసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ సంఖ్యలో స్థానాలు పొంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్తో కూడా మనోరమ పలు చిత్రాల్లో నటించారు. మనోరమ కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక గొప్ప గాయని కూడా. తన పాత్రలకు తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా, ఎన్నో జానపద మరియు కామెడీ పాటలను పాడి అలరించారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రయాణంలో శివాజీ గణేషన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి మూడు తరాల స్టార్ హీరోలతో ఆమె పనిచేశారు. హాస్యాన్ని పండిస్తూనే, కన్నీళ్లు తెప్పించే భావోద్వేగపూరిత పాత్రల్లో ఆమె చూపిన ప్రతిభ అనన్యం. సినీ గ్లామర్ ప్రపంచంలో వచ్చిపోయే వారు ఎందరో ఉంటారు, కానీ చరిత్రలో నిలిచిపోయే వారు కొందరే. మనోరమ గారు కేవలం సంఖ్య పరంగానే కాకుండా, గౌరవం పరంగా కూడా శిఖరాగ్రాన నిలిచారు. ఏడుగురు ముఖ్యమంత్రులతో నటించడం అనేది కేవలం అదృష్టం మాత్రమే కాదు, ఆమె అంకితభావానికి మరియు చిత్ర పరిశ్రమలో ఆమెకు ఉన్న ఆదరణకు నిదర్శనం. ఈ అరుదైన రికార్డును ప్రస్తుత తరం నటీనటులు అందుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. 'ఆచి' మనోరమ భారతీయ సినిమా గర్వించదగ్గ నటిగా ఎప్పటికీ చిరస్మరణీయులు.
May 10, 2026 3:01PMఆ ఒక్క డైలాగ్తో ఆత్రేయలాంటి గొప్ప రచయితని ఇంప్రెస్ చేసిన దాసరి!
(మే 4 దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా..) దర్శకుడిగానే కాదు, మాటల రచయితగా దాసరి నారాయణరావుకు ఎంత పేరు ఉందో అందరికీ తెలిసిందే. ఆయన డైరెక్టర్ అవ్వకముందు చాలా సినిమాలకు మాటలు రాసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన మాటలు రాసే విధానం చూసి నిర్మాత కె.రాఘవకు దాసరిపై మంచి నమ్మకం ఏర్పడింది. తన బేనర్లోనే అతన్ని డైరెక్టర్గా పరిచయం చెయ్యాలనుకున్నారు. ఒక మంచి కథ రెడీ చేసుకొని వస్తే అవకాశం ఇస్తానని చెప్పారు. రాఘవ చెప్పినట్టుగానే కొన్ని రోజుల తర్వాత ఒక కథతో వచ్చారు దాసరి. ఆరోజుల్లో ఒక సినిమా ప్రారంభం కావాలంటే పంపిణీదారుల పాత్ర ఎక్కువగా ఉండేది. నిర్మాతలు తప్పనిసరిగా వారిని కలవాల్సి వచ్చేది. ఎందుకంటే నిర్మాణానికి కొంత పెట్టుబడి పంపిణీదారులు కూడా పెట్టేవారు. మొదట వారికి కథ నచ్చాలి. అలాగే అందులో నటించే నటీనటుల గురించి కూడా చెప్పాలి. అన్నీ ఓకే అనుకుంటే దఫ దఫాలుగా నిర్మాతకు డబ్బు పంపేవారు. తాము అనుకున్న కథతో ఒక పంపిణీదారుడు దగ్గరకు వెళ్లారు దాసరి, రాఘవ. కథ విన్న ఆ పంపిణీదారుడు.. బాగానే ఉంది కానీ ఎవరైనా పెద్ద డైరెక్టర్ చేస్తే బాగుంటుంది. కొత్త డైరెక్టర్తో ఎందుకు రిస్క్ అన్నారు. కానీ, రాఘవ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాసరిని డైరెక్టర్ని చెయ్యడం కోసం ఎంతమంది దగ్గరికి అయినా వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే అందరు డిస్ట్రిబ్యూటర్లు అదే మాట చెప్పారు. చివరికి ఒక డిస్ట్రిబ్యూటర్ పెట్టుబడి పెట్టేందుకు ఒప్ప్పుకున్నారు. అలా దాసరి నారాయణరావు మొదటి సినిమా ‘తాత మనవడు’ ప్రారంభమైంది. ఈ సినిమాలో రాజబాబు చేసిన క్యారెక్టర్ను శోభన్బాబుతో చేయించాలనుకున్నారు రాఘవ. కానీ, రాజబాబు అయితేనే బాగుంటుందని దాసరి చెప్పడంతో అతనితోనే చేశారు. తొలి సినిమాతోనే డైరెక్టర్గా తనేమిటో ప్రూవ్ చేసుకున్నారు దాసరి. సినిమాలో ఆయన రాసిన డైలాగులకు ఎంత పేరు వచ్చిందంటే.. ఆరోజుల్లో ప్రముఖ రచయితగా ఎన్నో అద్భుతమైన సినిమాలకు అర్థవంతమైన మాటలు, పాటలు రాసిన ఆత్రేయ వంటి వారు దాసరిని భుజం తట్టి అభినందించారు. సినిమాలో ఒక సందర్భంలో ఎస్.వి.రంగారావు చెప్పే డైలాగు ‘ప్రపంచంలో కావాల్సినవాళ్లు కోట్ల కొద్దీ ఉండొచ్చు. కానీ, ఆఖరికి మోసుకుపోవడానికి నలుగురు కావాలిగా. అందుకే అన్నారు పెద్దలు నలుగురితో మంచిగా ఉండరా అని. ఎందుకు. ఆఖరికి కాటికి మోసుకుపోవడానికి ఆ నలుగురైనా మిగులుతారని’ ఈ డైలాగుకు థియేటర్లో చప్పట్లు మారుమోగిపోయాయి. ‘తాత మనవడు’ రిలీజ్ అయిన తర్వాత సినిమాలోని ఈ డైలాగ్ విని ఆత్రేయ మురిసిపోయారట. దాసరి ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ఆయన్ని కలిసి అభినందించారు. ఇలాంటి డైలాగులు తను తప్ప మరొకరు రాయలేరు అనుకునేవారట ఆయన. తన తర్వాత అలాంటి డైలాగులు రాయగల రైటర్ దాసరి అంటూ బహిరంగంగానే మెచ్చుకున్నారు ఆత్రేయ. ఆ తర్వాతి కాలంలో తాత మనవడు తరహాలో ఎన్నో సినిమాలు చేశారు. ఎన్నో అద్భుతమైన డైలాగులు రాసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు దాసరి.
May 4, 2026 11:58AMకృష్ణ, శోభన్బాబుల స్నేహబంధం బంధుత్వంగా మారాల్సింది.. ఎందుకు కుదరలేదు!
ఈర్ష్యా, అసూయ, ద్వేషాలు ఏ రంగంలోనైనా ఉంటాయి. ఆయా రంగాల్లో ఎదుగుతున్న వారిని చూసి మిగతా వారు అసూయ పడడం సహజం. సినిమా రంగం విషయానికి వస్తే.. అక్కడ కూడా ఈ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. కానీ, వాటికి అతీతంగా స్నేహబంధాన్ని కొనసాగించిన వారు కూడా ఎంతో మంది ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారిలో మొదటగా చెప్పుకోవాల్సిన వారు ఎన్టీఆర్, ఎఎన్నార్. కెరీర్పరంగా ఎన్టీఆర్ కంటే ఎఎన్నార్ చాలా సీనియర్. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చే నాటికి కీలుగుర్రం, బాలరాజు వంటి జానపద చిత్రాలతో స్టార్ హీరో రేంజ్లో ఉన్నారు ఎఎన్నార్. ఎప్పుడైతే ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి విడుదలై ఘనవిజయం సాధించిందో.. అప్పుడే ఎఎన్నార్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ విషయంలోనైనా తను ఎన్టీఆర్ కంటే తక్కువే. కాబట్టి జానపద చిత్రాల జోలికి వెళ్ళకుండా సాంఘిక చిత్రాల్లోనే ప్రయోగాత్మక సినిమాలు చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అలా ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు, సక్సెస్ అయ్యారు. వృత్తిపరంగా పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఎంతో స్నేహంగా ఉండేవారు ఎన్టీఆర్, ఎఎన్నార్. ఎన్టీఆర్ను తన పెద్ద కొడుకుగా భావించేవారు ఎఎన్నార్ తల్లి. అలా వారి కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉండేది. ఇద్దరూ స్టార్ హీరోలు అయినప్పటికీ ఒకరి సినిమాలో మరొకరు నటించడానికి ఏమాత్రం ఇబ్బంది పడేవారు కాదు. ఉదాహరణకు ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన మిస్సమ్మ చిత్రంలో ఏమాత్రం ప్రాధాన్యం లేని ఒక కామెడీ క్యారెక్టర్ చేశారు ఎఎన్నార్. దానికి కారణం.. అప్పటివరకు జానపద సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న ఎఎన్నార్.. సాంఘిక చిత్రాల్లో నటించడానికి పనికిరాడు అనే అభిప్రాయం అందరిలోనూ ఉండేది. అది నిజం కాదు అని ప్రూవ్ చేసేందుకే మిస్సమ్మ సినిమాలో డిటెక్టివ్ రాజు క్యారెక్టర్ చేశారు. ఆ పాత్రను ఎంతో అద్భుతంగా పోషించి అందర్నీ మెప్పించారు. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్, ఎఎన్నార్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరి తర్వాత అంత మంచి స్నేహితులు అనిపించుకున్నవారు కృష్ణ, శోభన్బాబు. వీరిద్దరిలో కృష్ణ కంటే శోభన్బాబు సీనియర్. కృష్ణ హీరోగా నటించిన గూఢచారి 116 చిత్రంలో ఏమాత్రం ప్రాధాన్యం లేని ఒక క్యారెక్టర్ చేశారు శోభన్బాబు. అప్పటికే దాదాపు 30 సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత వీరి స్నేహబంధం బాగా బలపడింది. కృష్ణ ఎక్కువగా శోభన్బాబు ఇంట్లోనే ఉండేవారు. కృష్ణ తల్లిదండ్రులు శోభన్ను పెద్ద కొడుకుగా భావించి పెద్దబ్బాయ్ అని పిలిచేవారు. అప్పుడు మొదలైన వీరి స్నేహం చివరి వరకు కొనసాగింది. వీరికి సంబంధించిన మరో విశేషం ఉంది. వాస్తవానికి కృష్ణ, శోభన్బాబు మధ్య బంధుత్వం కలవాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు శోభన్బాబు ఇంట్లోనే ఇద్దరూ కలుసుకునేవారు. గంటల తరబడి తమ వ్యక్తిగత విషయాలు, సినిమాలకు సంబంధించిన విశేషాలు మాట్లాడుకునేవారు. అలా వాళ్లింటికి కృష్ణ తరచూ వెళ్లేవారు. ఆ సమయంలో శోభన్బాబు మరదలు అతని ఇంట్లోనే ఉండేవారు. తన మరదల్ని కృష్ణకి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నారు శోభన్బాబు. ఈ విషయంలో కృష్ణ తల్లి అభ్యంతరం చెప్పారు. ‘నాకు కాబోయే కోడలు మా అబ్బాయిలాగే తెల్లగా ఉండాలి. నీ మాట కాదన్నందుకు ఏమీ అనుకోవద్దు’ అని అన్నారామె. ఈ సంఘటన స్నేహితుల మధ్య దూరాన్ని ఏమాత్రం పెంచలేకపోయింది. అవన్నీ మనసులో పెట్టుకోకుండా చివరి వరకూ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉన్నారు.
May 1, 2026 6:53PMసూపర్స్టార్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్.. మన హీరో ఒకప్పుడు విలన్ అని మీకు తెలుసా?
సాహసాలకు కేరాఫ్ అడ్రస్ సూపర్స్టార్ కృష్ణ. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు చేసి రికార్డులను తిరగరాశారు. అయితే, ఎప్పుడూ హీరోగానే కనిపిస్తూ అభిమానుల మనసు గెలుచుకున్న కృష్ణ, తన కెరీర్ తొలినాళ్లలో విలన్గా కూడా నటించారనే విషయం చాలా మందికి తెలియదు. ఆ నెగటివ్ షేడ్ మూవీ ఆయన కెరీర్ను ఎలా మలుపు తిప్పిందనే ఆసక్తికరమైన కథనం ఇప్పుడు వైరల్గా మారింది. కృష్ణ హీరోగా పరిచయమైన ‘తేనె మనసులు’ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. ఆ సినిమాతో యూత్ ఐకాన్గా మారిన కృష్ణకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే, ఆ సమయంలోనే ఒక ప్రయోగాత్మక చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదే 1967లో విడుదలైన ‘ప్రైవేట్ మాస్టర్’. ఈ సినిమాకు మరో విశేషం ఏమిటంటే, దీనికి దర్శకత్వం వహించింది సామాన్య దర్శకుడు కాదు, మన ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్ గారు. సాధారణంగా ఒక హీరో విలన్గా కనిపిస్తే ప్రేక్షకులు అంగీకరించడం కష్టం. ముఖ్యంగా కెరీర్ ఎదుగుతున్న దశలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పెద్ద సాహసమే. ‘ప్రైవేట్ మాస్టర్’ సినిమాలో రామ్మోహన్ హీరోగా నటించగా, కృష్ణ నెగటివ్ రోల్లో మెప్పించారు. ఆ చిత్రంలో ఆయన పోషించిన పాత్రలో క్రూరత్వం కంటే మ్యానరిజమ్స్ ఎక్కువగా ఉండటం విశేషం. అయితే, అనూహ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. నిజానికి ‘ప్రైవేట్ మాస్టర్’ ఫ్లాప్ అవ్వడం కృష్ణ కెరీర్కు ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఒకవేళ ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి ఉంటే, అప్పట్లో ఉన్న ట్రెండ్ ప్రకారం కృష్ణకు విలన్ పాత్రలే ఎక్కువగా వచ్చేవి. దీంతో మనం ఒక గొప్ప హీరోను మిస్ అయ్యేవాళ్లం. ఆ సినిమా ఫలితం తర్వాత కృష్ణ తన రూట్ మార్చి, ‘గూఢచారి 116’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్ జేమ్స్ బాండ్గా ఎదిగారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాత ముచ్చట విన్న అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “మా సూపర్ స్టార్ ఏ రోల్ చేసినా అందులో తనదైన స్టైల్ చూపిస్తారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో కృష్ణ చేసిన ఆ ప్రయోగం ఆయనలోని నటుడికి నిదర్శనమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హీరోగా నిలదొక్కుకునే క్రమంలో ఆయన పడ్డ కష్టం, తీసుకున్న రిస్క్ నేటి తరం నటులకు ఒక పాఠం లాంటిది. సూపర్స్టార్ కృష్ణ మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన ఇలాంటి అరుదైన చిత్రాలు మరియు ఆయన సినీ ప్రస్థానం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన వారసుడిగా మహేష్ బాబు కూడా అదే తరహాలో ప్రయోగాత్మక చిత్రాలతో తండ్రి పేరును నిలబెడుతున్నారు.
Apr 25, 2026 12:54PM
ఆస్కార్ గడప తాకిన తెలుగు నిర్మాత.. క్లాసిక్ సినిమాల రారాజు.. ఏడిద నాగేశ్వరరావు!
తెలుగు సినిమాను కళాత్మక విలువలతో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నిర్మాతలలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు (Edida Nageswara Rao) అగ్రగణ్యులు. సినిమా రంగంలో ఏదో సాధించాలని మద్రాసు రైలెక్కిన ఆయన, క్లాసిక్ సినిమాల నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఈరోజు (ఏప్రిల్ 24) ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలోని అద్భుత ఘట్టాలను ఓసారి గుర్తుచేసుకుందాం. 1934 ఏప్రిల్ 24న తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జన్మించిన ఏడిద నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచే నాటకాలపై మక్కువ ఉండేది. ఆ ఆసక్తే ఆయన్ని మద్రాసు రైలెక్కించింది. మొదట నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత 'గీతాకృష్ణా కంబైన్స్' బ్యానర్పై 1976లో 'సిరిసిరి మువ్వ' నిర్మించి ఘనవిజయాన్ని అందుకున్నారు. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే 'పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్' సంస్థను స్థాపించి అద్భుత చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కళాతపస్వి కె. విశ్వనాథ్తో ఏడిద నాగేశ్వరరావుకు ఉన్న అనుబంధం తెలుగు సినిమా గమనాన్ని మార్చేసింది. వీరి కలయికలో వచ్చిన 'శంకరాభరణం' ఒక చరిత్ర. కేవలం సంగీతం, కళాత్మక విలువలతో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆ తర్వాత వచ్చిన 'సాగర సంగమం', 'స్వాతిముత్యం' చిత్రాలు భారతీయ సినిమా గర్వించదగ్గ క్లాసిక్స్గా నిలిచాయి. ముఖ్యంగా 'స్వాతిముత్యం' చిత్రం ఆస్కార్ అవార్డులకు భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా వెళ్లడం విశేషం. చిరంజీవి మాస్ హీరోగా ఎదుగుతున్న సమయంలో, ఆయనలోని అసలైన నటుడిని ప్రపంచానికి చూపిన ఘనత ఏడిద నాగేశ్వరరావుదే. 'స్వయంకృషి' సినిమాలో చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రలో చిరంజీవి నటన అద్భుతం. ఈ సినిమాకు గాను చిరంజీవి మొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. అనంతరం వీరి కలయికలో వచ్చిన 'ఆపద్బాంధవుడు' కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ప్రతి సినిమా ఒక పాఠం. కమర్షియల్ హంగులకు లోబడకుండా, కథాబలంతో ప్రేక్షకులను మెప్పించవచ్చని ఆయన నిరూపించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నిర్మించిన అజరామరమైన చిత్రాలు తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. - ఏప్రిల్ 24న ఏడిద నాగేశ్వరరావు జయంతి
Apr 24, 2026 10:38AM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



