ఎమ్మెల్యేల వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలి : సీఎం రేవంత్
posted on Oct 19, 2025 5:03PM

రాష్ట్రాల శాసనసభలకు పోటీ చేసే వయో పరిమితిని 25 నుంచి 21 ఏళ్ల తగ్గించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తామని ప్రకటించారు.
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని సంస్మరణ కమిటీ చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కి ఈ సందర్భంగా సద్భావనా అవార్డును బహూకరించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశ పరిపాలనా యంత్రాంగంలో 21 ఏళ్లకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 21 ఏళ్లకు ఎందుకు తగ్గించరాదని ప్రశ్నించారు.
ప్రభుత్వాలను నిర్ణయించే అధికారం యువతకు ఉండాలన్న సంకల్పంతో రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయ పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని గుర్తు చేశారు. అదే క్రమంలో ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
దేశ సమగ్రతను, సమైక్యతను కాపాడటానికి రాజీవ్ గాంధీ త్యాగాలను గుర్తు చేస్తూ, గడిచిన 35 ఏళ్లుగా క్రమం తప్పకుండా సద్భావనా యాత్ర సంస్మరణ కార్యక్రమాన్ని జరుపుతున్న నిర్వాహకులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.