వాస్తవ వేదిక.. వైసీపీకి ఢిల్లీ లాబీయింగ్ అంతా విజయసాయే
Publish Date:Feb 6, 2026
Advertisement
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక పదకొండో సంచిక గురువారం (ఫిబ్రవరి 6) విడుదలైంది. ఈ సారి కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల మార్పులపై విశ్లేషణాత్మక చర్చ జరిపారు. జగన్ మోహన్ రెడ్డి కేవలం ఎన్నికల ఓటమి తర్వాతే కాదు, ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రజలకు మాత్రమే కాదు పార్టీ కార్యకర్తలకు కూడా దురమై హైబర్నేషన్'(స్తబ్దత)లోకి వెళ్ళిపోయారనీ, అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఒక ప్రత్యేక బృందం ఉండేదనీ వారు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ బృందం అంత గట్టిగా ఆయన పక్కన లేదనీ విశ్లేషించారు. అందుకే జగన్ ఇప్పుడు తానే స్వయంగా బయటకు రాక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ కారణంగానే వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకూ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నుంచి కార్యకర్తలకు ఫోన్లు చేసి మరీ సమావేశాలకు పిలుస్తున్నారని డోలేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. వైసీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితిలో కార్యకర్తల విశ్వాసం పొందడానికి జగన్ చేస్తున్న ప్రయత్నంగా దీనికి అభివర్ణించారు. రాష్ట్రంలో వైసిపి కార్యకర్తలు కేసుల భయంలో ఉన్నారనీ, ఈ పరిస్థితుల్లో వారిలో ధైర్యం నింపి మళ్లీ అధికారంలోకి వస్తామన్న విశ్వాసం కల్పించడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, తన ఉనికిని చాటుకోవడానికి సుమారు ఒకటిన్నర సంవత్సరం తర్వాత పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నారని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. జగన్ డెమొక్రాట్ కాదు కానీ.. చంద్రబాబు నాయుడు డెమోక్రాట్ అన్న డోలేంద్ర ప్రసాద్.. చంద్రబాబు జగన్ లా ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూడరనీ, అయితే చంద్రబాబు ప్రస్తుతం జగన్ పట్ల ప్రజల్లో ఉన్న భయం చాలు తనకు ఓట్లు పడతాయని ఆయన భ్రమిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల కంటే ఐఏఎస్ ఆఫీసర్లు, కార్పొరేట్ శక్తులకే ప్రాధాన్యత ఇస్తారని, ఇది కార్యకర్తలలో అసంతృప్తికి దారితీస్తుందనీ, ఇప్పుడూ అదే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోందని డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు. మూలాలు హెచ్చరిస్తున్నాయి. ఇక విజయసాయి రెడ్డి బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది కదా అన్న కంఠంనేని రవిశంకర్ ప్రశ్నకు డోలేంద్ర ప్రసాద్ విజయసాయి కేవలం రాజకీయ మానిపులేటర్ అన్నారు. ఆయన స్వయంగా ఏ ఎన్నికలోనైనా సరే గెలిచే ప్రశక్తే లేదనీ చెప్పారు. విజయసాయికి జగన్ పార్టీలో ఆదరణ తగ్గడం, వైసీపీ నుంచి బయటకు వచ్చిన తరువాత కేసుల భయం కారణంగా ఆయన బీజేపీ వైపు చూస్తుంటే చూస్తుండవచ్చునన్నారు. కానీ బిజెపి ఇప్పుడు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ విధానాన్ని అమలు చేస్తోందన్న డోలేంద్ర ప్రసాద్.. పదవుల విషయంలో సొంత క్యాడర్కే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందువల్ల విజయసాయికి బీజేపీలో ప్రాధాన్యత లభించే ప్రశక్తి లేదన్నదని తన అభిప్రాయమన్నారు. అయితే అదే సమయంలో తెలుగుదేశం వైసిపి వంటి పార్టీల సిద్ధాంతం అధికారమే కనుక ఆ పార్టీలలో ఎవరైనా ఎప్పుడైనా చేరే పరిస్థితి ఉంటుందన్నారు. జగన్ తన ప్రసంగాల్లో "రప్ప రప్ప" వంటి పదాలను వాడుతూ అరాచక రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. ప్రజలు రౌడీయిజం తమ ఇంటి గడప దాకా వస్తే సహించరనీ, గత ఎన్నికలలో జగన్ ఓటమే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఇప్పటికీ మారకుండా జగన్ అదే ధోరణితో ఉండటం ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఇసుమంతైనా మేలు చేయదని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికర అంశాలపై విశ్లేషణాత్మక చర్చ కోసం వాస్తవ వేదిక పదకొండో సంచికను తెలుగువన్ యూట్యూబ్ చానల్ లో వీక్షించండి
http://www.teluguone.com/news/content/vijayasai-lobby-for-ycp-in-delhi-25-213611.html





