వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం
Publish Date:Mar 10, 2026
Advertisement
వంట గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తిని పెంచాలని ఆయిల్ కంపెనీలకు సూచనలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోలియం శాఖను ఆదేశించారు. గ్యాస్ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ ఉత్పత్తిని కనీసం 10 శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై పెట్రోలియం కంపెనీలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేశాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హాస్టళ్లకు మాత్రమే కమర్షియల్ సిలిండర్లు సరఫరా చేయాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో గృహ వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని గ్యాస్ కంపెనీలు సూచించాయి. ఈ-కేవైసీ చేయని వినియోగదారులకు గ్యాస్ బుకింగ్ను తాత్కాలికంగా నిలిపివేస్తామని హెచ్చరించాయి. గ్యాస్ కొరత ప్రభావం ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో కనిపిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కొన్ని హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. కమర్షియల్ సిలిండర్ల కొరతతో దాదాపు 20 శాతం హోటళ్లు కార్యకలాపాలు నిలిపివేసినట్లు సమాచారం. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోని హోటల్ పరిశ్రమపై కూడా ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని డీలర్లకు ఆదేశాలు ఇవ్వడంతో హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాలు తక్షణం ప్రత్యామ్నాయాలు చూపించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ల బంద్ నిర్వహించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ అంశంపై సికింద్రాబాద్లో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం కూడా నిర్వహించారు. విశాఖపట్నంలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందని విశాఖ హోటల్ మర్చంట్ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని, రాబోయే రోజుల్లో సరఫరా మరింత తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు అమ్ముతున్న ఘటనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్ల నిర్వహణ కష్టమవుతుందని తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల కొరతపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు.
http://www.teluguone.com/news/content/narendra-modi-36-215309.html





