డీసీఎం బీభత్సం... భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు
Publish Date:Apr 5, 2026
Advertisement
మాదాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.కేరళకు చెందిన హానియా ఆయేషా (22), అబ్దుల్ బాసిత్ దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చి మహేశ్వరం సమీపంలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ మలబార్ గోల్డ్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సినిమా చూసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మాదాపూర్ మైండ్స్పేస్ సమీపంలోకి రాగానే, వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వారి స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదం తరువాత స్కూటీ డీసీఎం కింద ఇరుక్కుపోయింది. అయినప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా, మహిళను స్కూటీతో పాటు సుమారు ఐదు కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై డీసీఎంను అడ్డుకున్నారు. పారిపోవడానికి ప్రయత్నించిన డ్రైవర్ను పట్టుకుని కొట్టిన అనంతరం పోలీసులకు అప్పగించారు. ప్రమాదంలో గాయపడిన దంపతులను స్థానిక ఆస్పత్రికి తరలించగా, ఆయేషా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అబ్దుల్ బాసిత్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాదాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.
http://www.teluguone.com/news/content/serious-road-accident-in-madhapur-36-216724.html





