హైదరాబాద్ మెట్రోకు భారీ ఆర్థిక రుణం...రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్
Publish Date:May 25, 2026
Advertisement
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) ద్వారా రూ.13,600 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్ లభించింది.ఢిల్లీలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్, హెచ్ఎంఆర్ఎల్ మధ్య ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలపై సంతకాలు జరిగాయి. కార్యక్రమంలో ఐఆర్ఎఫ్సీ సీఎండీ & సీఈఓ మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో సమర్థవంతమైన, సుస్థిరమైన, ప్రజానుకూల ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్తో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందని, దీని వల్ల ప్రాజెక్టు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత రుణభారం తగ్గడంతో పాటు భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలకు ఇది దోహదపడుతుందన్నారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ బృందం, హెచ్ఎంఆర్ఎల్ మరియు సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు మరియు ప్రాయోజిత పథకాల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) ప్రతినిధి కె.వి.బి. రెడ్డి, సీఎఫ్వో ఏ.వి.ఆర్. శ్రీనివాస శర్మతో పాటు ఐఆర్ఎఫ్సీ మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లార్సెన్ అండ్ టుబ్రో లిమిటెడ్ నుంచి ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్లోని 100 శాతం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అనంతరం ఈ రీఫైనాన్సింగ్ అమలులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ మెట్రో పూర్తిస్థాయి ప్రభుత్వ యాజమాన్యంలోని వ్యూహాత్మక ప్రజా రవాణా ఆస్తిగా మారింది. రూ.13,600 కోట్ల ఈ ఆర్థిక సౌకర్యాన్ని ప్రస్తుత రుణ బాధ్యతలైన నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్కు వినియోగించనున్నారు. దీని ద్వారా ప్రస్తుత రుణదాతలకు క్రమబద్ధమైన ఎగ్జిట్ లభించడంతో పాటు ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వం మరింత మెరుగుపడనుంది. ఈ రుణాన్ని 20 సంవత్సరాల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల విధానంలో రూపొందించారు. అధిక వడ్డీ రుణాలను తక్కువ వ్యయంతో కూడిన దీర్ఘకాలిక రూపాయి ఫైనాన్సింగ్తో భర్తీ చేస్తున్నారు. ఈ లావాదేవీకి తెలంగాణ ప్రభుత్వ నిర్బంధ, కచ్చితమైన చెల్లింపు హామీ, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ, ఆర్బీఐ మద్దతుతో డైరెక్ట్ డెబిట్ మాండేట్ వంటి బలమైన క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ వ్యవస్థ మద్దతుగా నిలిచాయి. 69.2 కిలోమీటర్ల పొడవుతో మూడు కారిడార్లు, 57 స్టేషన్లతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేసిన అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ నెట్వర్క్ ద్వారా రోజుకు 5 లక్షలకు పైగా ప్రయాణికులు సేవలు పొందుతున్నారు. ఈ రీఫైనాన్సింగ్తో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఆర్థిక సామర్థ్యం మరింత బలోపేతం కావడంతో పాటు కొత్త కారిడార్లు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ, చివరి మైలు కనెక్టివిటీ వంటి విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేసే అవకాశం ఏర్పడింది. భవిష్యత్ మెట్రో విస్తరణలకు బలమైన ఆర్థిక పునాది వేసే కీలక మైలురాయిగా ఈ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సుస్థిరమైన, సమర్థవంతమైన, పర్యావరణహిత ప్రజా రవాణా వ్యవస్థ నిర్మాణంలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది.
దేశ ఆర్థిక వృద్ధిలో హైదరాబాద్ కీలక కేంద్రంగా ఎదుగుతోందని, నగర వేగవంతమైన విస్తరణకు అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యవసరమని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
http://www.teluguone.com/news/content/hyderabad-metro-36-220832.html





