తమిళనాడులో బాలిక హత్య...పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
Publish Date:May 25, 2026
Advertisement
ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసినట్లు ప్రచారం.. తమిళనాడులోని కోయంబత్తూర్ చిన్నారి హత్య కేసు తమిళనాడును కుదిపేస్తుండగా… అదే కేసుపై మీడియా సమావేశానికి ముందు నవ్వులు చిందించిన ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారుల వ్యవహారం ఇప్పుడు భారీ వివాదానికి దారితీసింది. తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో 10 ఏళ్ల బాలికను అపహరించి అమానుషంగా హత్య చేసిన ఘటనపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వెంటనే అధికారులను అప్రమత్తం చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించారు. పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ఆవేశంలో జరిగిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది. ఒకవైపు 10 ఏళ్ల బాలిక దారుణ హత్యతో ప్రజలు ఆవేదనలో మునిగిపోయి ఉండగా, మరోవైపు బాధ్యతాయుత పదవుల్లో ఉన్న అధికారులు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. “చిన్నారి ప్రాణం పోయింది… వీళ్లకు నవ్వులాట?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా వీడియోలో కనిపించిన మహిళా ఐజీతో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కొన్ని సెకన్ల వీడియోనే అయినా… అది పోలీసు వ్యవస్థ సున్నిత త్వంపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం సీఎం విజయ్ దృష్టికి చేరిన వెంటనే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్న సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. “ప్రజల బాధను గౌరవించని వారికి ప్రజాసేవలో స్థానం లేదు” అంటూ అధికారులకు క్లాస్ తీసుకున్నారని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనితో ముగ్గురు అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారనే వార్తలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముగ్గురు అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నట్లుగా అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు…కానీ సోషల్ మీడియాలో మాత్రం “ఇదే అసలు లీడర్షిప్” అంటూ సీఎం విజయ్కు మద్దతుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇక చిన్నారి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోయంబత్తూర్ ఘటన ఇప్పుడు కేవలం క్రైమ్ కేసుగా కాకుండా… అధికారుల బాధ్యత, మానవత్వం, ప్రజాసేవ విలువలపై పెద్ద చర్చగా మారింది.
http://www.teluguone.com/news/content/cm-vijay-36-220839.html





