ఆర్జీవీ ‘మెగా’ భజన.. మేటర్ ఏంటి?
posted on Sep 23, 2025 3:04PM
.webp)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో పవన్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా స్టార్ చిరంజీవిలపై పొగడ్తల వర్షం కురిపించేవారు. రాజును సైతం మించిన రాజభక్తిని ప్రదర్శించినట్లుగా ఆ మెగా బ్రదర్స్ సైతం టూమచ్ అనుకునే లెవెల్లో అప్పట్లో రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు ఉండేవి. అయితే ఎప్పుడైతే ఆయన వైసీపీ ఫోల్డ్ లోకి వెళ్లారో.. అప్పటి నుంచీ ఆయన అదే మెగా బ్రదర్స్ పై అనుచిత రీతిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా ఆయన ట్వీట్ లు, సోషల్ మీడియా పోస్టులు ఉండేవి. జగన్ కోసం ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాలో పవన్ కల్యాణ్ ను కించపరిచే విధంగా పాత్రను సృష్టించారు. అయితే ఆ విమర్శలట్వీట్లు అటు వైసీపీ ఏ మాత్రం ఉపయోగం లేకపోగా.. స్వయంగా ఆర్జీవీ కూడా భ్రష్టుపట్టిపోయారు. ఆయన క్రెడిబులిటీ పూర్తిగా పోయింది.
సరే గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని దయనీయ స్థితికి దిగజారిపోయింది. ఇక వైసీపీ అధికారంలో ఉండగా హద్దుల్లేకుండా అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన ఆర్జీవీని కేసులు చుట్టుముట్టాయి. దీంతో ఆయనకు తత్వం బోధపడి రాజకీయాల జోలికి పోను అంటూ చెంపలేసుకున్నారు. చెంపలైతే వేసుకున్నారు కానీ, అటు సినీ పరిశ్రమలో, ఇటు ప్రజలలో కోల్పోయిన క్రెడిబులిటీని మాత్రం తిరిగి సంపాదించుకోలేకపోయారు.
ఇప్పుడు ఇక ఆ క్రెడిబులిటీ కోసం గతంలో విమర్శలు గుప్పించిన వారినే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడానికి యూటర్న్ తీసుకున్నారు. తాజాగా వర్మ మెగా బ్రదర్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ చేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది.
అదే సమయంలో నెటిజన్లు ఆర్జీవీని ఓ రేంజ్ లో ట్రోల్ చేయడానికి తావిచ్చింది. ఇంతకీ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఏమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా వస్తే.. అది ఈ శతాబ్దానికే మెగా పవర్ ఫిల్మ్ అవుతుంది అన్నది. కొన్నేళ్ల కిందట పవన్ కు వ్యతిరేకంగా అనుచిత ట్వీట్లు చేసిన ఆర్జీవీ ఇప్పుడు పవర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నారంటే కామెంట్లు చేస్తున్నారు. ఎన్ని రంగులు మార్చినా.. ఆర్జీవీని నమ్మేవారెవరూ ఉండరంటూ పోస్టులు పెడుతున్నారు.