ఫైనల్ లో పాక్ పై విజయం.. ఆసియాకప్ విజేత టీమ్ ఇండియా
posted on Sep 29, 2025 1:46AM
.webp)
ఆసియాఆసియా కప్ ఫైనల్ లో పాకిస్థాన్ ను చిత్తు చేసి టీమ్ ఇండియా విజేతగా నిలిచింది. దుబాయ్ లోని రింగ్ ఆప్ ఫైర్ స్టేడియంలో ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్ లో టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియాకప్ చాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ కు అద్భుత ఆరంభం లభించింది. అయితే ఆ తరువాత టీమ్ ఇండియా బౌలర్లు అద్భుతంగా పుంజుకుని పాకిస్థాన్ ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. పాకిస్థాన్ ఓపెనర్లు భారత బౌలింగ్ అటాక్ ను సమర్థంగా ఎదుర్కొన్నారు. పాకిస్థాన్ తొలి వికెట్ 84 పరుగుల వద్ద పడింది. 57 పరుగులు చేసిన ఫారన్ ను వరుణ్ వర్మ ఔట్ చేశారు. ఆ తరువాత పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కోల్పోయింది.
భారత బౌలర్లలో కులదీప్ యాదవ్: 4 వికెట్లు తీయగా, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండెసి వికెట్లు తీసుకున్నారు. ఇక స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమ్ ఇండియా త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయింది. 20 పరుగులకే కీలకమైన అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, స్కిప్పర్ సూర్యకుమార్ యాదవ్ వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. అయితే హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ తో టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. తిలక్ వర్మకు సంజు శాంసన్, శివమ్ దుబెలు చక్కటి సమకారం ఇచ్చారు. తిలక్ వర్మ 69 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో భారత్ తొమ్మిదోసారి ఆసియాకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. మూడుసార్లూ భారత్ విజయం సాధించింది. అయితే ఫైనల్ మ్యాచ్ లో మాత్రం పాకిస్థాన్ గట్టిగా పోరాడింది. మ్యాచ్ ను చివరి ఓవర్ వరకూ తీసుకు వెళ్లింది.